తిరుప్పావై - ఇరవై ఆరవ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
ఈరోజు 26 వ. పాశురం గురించి తెలుసుకుందాం.
ఈరోజు పాశురములో….
రేపల్లె లో వర్షాలు కురవడం కోసమని.. ఆ వూరి పెద్దల అనుమతి తీసుకుని.. గోపికలు ఈ మార్గశీర్ష వ్రతాన్ని చేస్తున్నారు. ఊరికి వర్షాలు ముఖ్యం. గోపికలకు శ్రీకృష్ణుని సాన్నిధ్యం ముఖ్యం. అందుకోసమే వారు వ్రతానికి పనికివచ్చే పరికరాలను.. శ్రీకృష్ణుని నుంచి పొందడానికి వచ్చి శ్రీకృష్ణుడిని స్తోత్రం చేస్తున్నారు. అదే ఈ పాశురములో విశేషం.
మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్వనగళ్; వేణ్డువన కేట్టియాల్;
జ్ఞాలత్తై యెల్లామ్ నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాంచశన్నియమే
పోల్వన శంగంగళ్, ప్పాయ్ ప్పాడుడై యనవే,
శాలప్పెరుమ్ పఱైయే, పల్లాండిశైప్పారే
కోలవిళక్కే, కొడియే, వితానమే
అలినిలై యాయ్! అరుళేలో రెంబావాయ్|| 26 ||
ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చదువుదాం.
ఇంద్ర నీలమణిలా మెరుస్తున్న కాంతి కలిగినవాడా! ఆశ్రితులపై వ్యామోహము కలవాడా! ఓ వటపత్ర సాయీ! ఈ నోములో పెద్దలు ఆచరించిన వ్రత విధానం చెప్తున్నాం వినవలసింది. లోకమంతటికీ వినిపించేలా, అతి పెద్ద ధ్వని చేసేది, తెల్లని కాంతి కలిగినది, నీ చేతిలో ఉన్న పాంచజన్యం అనే శంఖమువలే.. ధ్వని చేయు... పెద్దవి కొన్ని శంఖములను, పెద్ద శబ్దం చేయు వాయిద్యంను (భేరీ), తిరుప్పల్లాండును అద్భుతంగా గానము చేసే గాయకులను, వెలుగులను ప్రసరింపజేసే దీప స్తంభాలను, మంగళ దీపమను ధ్వజమును, చాందినీని, వీటన్నింటిని మాకు కొరత లేకుండా ఇవ్వవలసింది. ఇదే మా ప్రార్థన. మమ్ములను అనుగ్రహించు. నీకు సాధ్యం కానిది ఏదీ లేదు. లోకాలు అన్నింటినీ నీ కడుపులో ఉంచుకున్నావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.ఓ వటపత్ర సాయీ! ఇదే మా విన్నపం అని ప్రార్థిస్తున్నారు.
గోపికలకు ఒక అనుమానం వచ్చింది.
శ్రీకృష్ణుడికి తామంటే ఇష్టమా? లేదా? అని.
అనుమానంగా శ్రీకృష్ణుడి వైపు చూశారు.
శ్రీకృష్ణుడు వారినే చూస్తున్నాడు. గోపికలు శ్రీకృష్ణుడిని ఎంతగా కావాలనుకుంటున్నారో; అంతకంటే ఎక్కువగా కూడా శ్రీకృష్ణుడే గోపికలను కావాలి అనుకుంటున్నాడు.
భక్తుడు మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటే, వద్దన్నా సరే భక్తుడి యొక్క యోగక్షేమాలు చూస్తాడు. పరమాత్మ అంతటి కరుణామయుడు.
గోపికలు పెద్దవారు సూచించిన విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. స్నాన వ్రతం పూర్తి కాబోతుంది. ఈనాటి నుండి నీరాట్టం అంటారు. ఇక్కడ స్నానం అంటే అర్థం నదికి వెళ్లి మునగడం కాదు. భగవంతుడి యొక్క గుణములలో మునగడమే స్నానం. భగవంతుని పొందామన్న ఆనందంలో ఉండడమే స్నానం. ఆ స్నానంతో అహంకార మమకారాలను తొలగిపోతాయి.
గోపికలు తెలివిగా శ్రీకృష్ణుడి యొక్క పాంచజన్యం అనే శంఖాన్ని అడిగారు. శ్రీకృష్ణుడు ఆ శంఖాన్ని వదిలి ఉండలేడని గోపికలకు తెలుసు. ఆ శంఖాన్ని కోరుకుంటే శంఖంతోపాటు శ్రీకృష్ణుడే తమ వద్దకు వస్తాడని వారి ఆశ. పెద్ద పెద్ద తప్పెట వాయిద్యాలు కావాలంట. మంగళం పాడినవారు కావాలట.పెద్ద శబ్దం చేసుకుంటూ ఊరేగింపుగా వెళుతుంటే దారి చూడడానికి మంగళ దీపాలు కావాలంట. దీపం అంటే వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించడం. శ్రీరంగ హర్మ్యతల మంగళదీపరేఖాంఅని అమ్మవారిని పరాశర భట్టారు వారు వర్ణించారు.దూరంగా ఉండే వారికి కూడా వారు కనిపించేలా ఒక జండా కావాలట. ఈ విధంగా గోపికలు శ్రీకృష్ణుడికి బాగా దగ్గరవ్వాలని చూస్తున్నారు.
ఆండాల్ తిరువడిగళే శరణం
No comments:
Post a Comment