Wednesday, January 8, 2025

తిరుప్పావై - ఇరవై ఐదవ పాశురము

 తిరుప్పావై - ఇరవై ఐదవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈరోజు 25 వ. పాశురం గురించి తెలుసుకుందాం.

ఒరుత్తి మగనాయ్ పిఱందు, ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర
తరిక్కిలానాగి త్తాన్ తీంగు నినైంద
కరుత్తై పిళ్లైప్పిత్తు కంగన్ వయిత్తిల్
నెరుప్పెన్న నిన్ర నెడు మాలే !యున్నై
అరుత్తిత్తు వన్దోమ్; పరై రుతియాకిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యామ్పాడి
వరుత్తముమ్ తీరుందు మగిళెందేలో రెంబావాయ్ || 25 ||

ఇప్పుడు ఈ పాశురం యొక్క భావాన్ని చదువుదాం..

ఓ శ్రీకృష్ణా ! పరమ భాగ్యశాలి అయిన దేవకీదేవికి ముద్దుల బిడ్డగా అవతరించి, అదే రాత్రి గోకులంలో నందగోపుని భవనానికి చేరి.. యశోదాదేవికి కూడా అల్లారు ముద్దుబిడ్డవై రహస్యముగా పెరుగుతుండగా.. చారుల వలన ఈ విషయం తెలుసుకున్న కంసుడు నిన్ను మట్టుబెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు.ఆ ప్రయత్నాలన్నింటినీ వ్యర్థం చేసి.. వాని గర్భంలో చిచ్చు పెట్టావు. 

ఓ! స్వామీ! పురుషార్థములను (పఱను) కోరుటకు మేము నిన్ను ఆశ్రయించేము. మా కోరికలను తీర్చి పురుషార్ధములను మాకు ఇస్తే, నీలాదేవి వద్దకు వెళ్లి.. ఆశపడదగిన నీ సంపదను, నీ వీరచరిత్రను, నీ శౌర్యాన్ని చాలాసార్లు కీర్తిస్తాం. మా దుఃఖమంతా తీరి మేము సంతోషిస్తాం. నీ అనుగ్రహం వల్ల మా యొక్క దివ్యమైన వ్రతం సంసంపూర్ణమవుతుంది.

ఉత్తర భారతదేశంలో గల మధురలో దేవకీ గర్భాన జన్మించి, తండ్రి వసుదేవుని తలపై గోకులం చేరి, యశోద ఇంట్లో ఆమె కుమారుడిగా పెరిగావు కదా! సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడినే పుత్రుడిగా పొందాలని.. దేవకీదేవి ఎన్నో తపస్సులు చేసి నిన్ను కన్నది. నీ బాల్యము, ఆటపాటలు, అద్భుత లీలలు చూసే అదృష్టం ఆమెకు దక్కలేదని దేవకీదేవి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. నాకు పుత్ర సౌభాగ్యం లేదు. ఆ శుభలక్షణం, అదృష్టం అంతా యశోదాదేవిదే. "ఎన్ని పూజలు చేసిందో. తన జీవితం ధన్యమైంది." అని అంటుంది ఆండాళ్ తల్లి.

ఆది, అనాది లేనివాడు, జన్మ పరంపరల నుంచి ముముక్షువులకు ముక్తిని ఇచ్చేవాడు- స్వయంగా భూమ్మీద జన్మించడం అతడి లీలావిలాసం కాక మరేమిటి! వేదాలు శ్రీకృష్ణుడు తల్లిగా దేవకీదేవిని స్తుతిస్తాయి. జన్మనిచ్చింది ఒకరైతే, పెంచింది మరొకరు. కృష్ణావతారంలో యశోదాదేవి పాత్ర ఆరాధనీయం. దారితప్పుతున్న జీవులను ఉద్ధరించటానికి మానవరూపంలో సాక్షాత్కరించిన పరమాత్ముడే శ్రీకృష్ణుడు.

పంచేంద్రియాల వలలో చిక్కి, సంసారసాగరంలో కొట్టుమిట్టాడుతున్న జీవిని ఆచార్యుడూ మరియు మంత్రమూ మాత్రమే ఒడ్డుకు చేరుస్తాయి. 

గోపికలు భగవానుడి విషయంలో శరణాగతులై, బ్రహ్మానందానుభవాన్ని ప్రసాదించమని కోరుతున్నారు. "స్వామీ! నీ వద్దకు పరిశుద్ధులమై, నిర్మలమైన అంతఃకరణతో వచ్చాం. చతుర్విధపురుషార్థాలలో అత్యున్నతమైన దానిని అర్ధిస్తున్నాం. నిన్నూ, నీ దేవేరినీ స్తోత్రం చేసి మీకు సేవకులమై మా జన్మాంతర దుఃఖాలన్నీ రూపుమాపుకొని బ్రహ్మానందాన్ని కైవసం చేసుకుంటాం. నీ చరణ కమల సేవే పరమభాగ్యం అని చెప్తున్నారు. 'పర' లాంటి వ్రతానికి పనికొచ్చే సాధనాల కోసం ఇక్కడకు రాలేదయ్యా! నిన్నే పొందాలని వచ్చాం. మాకు కావాల్సిన 'పర' ఏమిటో తెలుసా? భగవత్ - భాగవత - ఆచార్య కైంకర్యమే. అదే మేము కోరుకునే 'పర'. మమ్మల్ని అనుగ్రహించు దేవా! అని ప్రార్థిస్తున్నారు గోపికలు.

ఆండాల్ తిరువడిగళే శరణం

No comments:

Post a Comment

Magha Nakshatra - మఖ నక్షత్రం

మఖ నక్షత్రం రాశి : సింహ రాశి గ్రహాధిపతి : సూర్యుడు నక్షత్ర దేవత : పితృదేవతలు (పితృగణాలు – అనునాయక పితృమూర్తులు) శక్తి : "పదవులు, సన్మాన...