Wednesday, January 1, 2025

తిరుప్పావై - పద్దెనిమిదివ పాశురము

 తిరుప్పావై - పద్దెనిమిదివ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

నిన్నటి పాశురంలో నందగోపుడిని, యశోదని, కృష్ణ పరమాత్మని, బలరాముడిని కూడా స్తుతించి వారందరినీ కూడా మేల్కొలపడానికి ప్రయత్నించినటువంటి గోపికలు గురించి మనం తెలుసుకున్నాం. నిన్న కృష్ణపరమాత్మ లేవలేదు. ఎందుకు లేవలేదంటే అమ్మని పిలవకుండా, అమ్మని లేపకుండా స్వామి లేవడు అని తెలుసుకుని ముందుగా అమ్మని అంటే నీలాదేవిని లేపుతారు.

ఈ 18 వ. రోజు పాశురాన్ని చదువుదాం.

ఉన్దు మదగళిత్తనోడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమళుం కుళలీ కడై తిఱవాయ్
వందెగుం కోళి అళైత్తనగాణ్, మాదవి
ప్పందల్ మేల్ పల్కాల్ కుయిల్ ఇనంగళ్ కూవినగాణ్; 
పందార్ విరలి! ఉన్ మ్మైత్తునన్ పేర్ పాడ 
శెందామరైక్కైయాల్ శీరార్ వళై యొళిప్ప
వందు తిఱవాయ్; మగిళిందు ఏలోర్ ఎంబావాయ్ || 18 ||

ఇప్పుడు ఈ పాశురము యొక్క అర్థాన్ని చదువుదాం.

మదమును స్రవించే ఏనుగులు కలవాడు, ఏనుగులను తోయగల బలం కలవాడు, ఎదురులేని భుజబలం కలవాడూ అయిన నందగోపాలుని కోడలా! మంచి సువాసన కలిగిన కేశములు గల నప్పిన్నపిరాట్టీ! అంతటా కోళ్ళు కూస్తున్నాయి. జాజి పందిరి మీద కోకిల గుంపులు మేల్కొని కూస్తున్నాయి. బంతిని చేతిలో పట్టుకున్న ఓ అమ్మా! నీ భర్త అయిన శ్రీకృష్ణుని నామములను పాడుటకు వచ్చాము. సంపద కలిగిన ఎర్ర తామరలవంటి చేతులతో, నీ చేతి గాజులు ధ్వనించినట్లు వచ్చి తలుపు తియ్యమ్మా.

ఈ రోజు ధనుర్మాసం 18 వ రోజు. ఈరోజు 18 వ పాశురం లో గోపికలు శ్రీ కృష్ణుని అనుభవిద్దాం, పరమాత్మ కనబడగానే ఒక నిమిషం వృధా చేయకుండా ఆయన్ని పూర్తిగా అనుభవించాలి అన్న ఆశతో శ్రీకృష్ణుని మేల్కొలుపుతారు. కానీ ఆ పరమాత్మ లేవట్లేదు.

ఇక లాభం లేదని గోపికలు అట్నుంచి నరుక్కు వద్దాం అంటే నీలా దేవి నుంచి ప్రారంభిద్దాం అన్న ఆలోచనతో నీలా దేవిని మేల్కొలపడానికి ప్రయత్నిస్తున్నారు. చూడండి ఒక ఉదాహరణ….మనకి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడితో పని ఉందనుకోండి. ఆయన భార్య సహాయంతో ఆ పనిని మనం సాధించుకోవచ్చు. ఎందుచేతనంటే ఎవరూ భార్య మాటని కాదనలేరు. కాదంటే ఏం జరుగుతుందో మగవాళ్లకి బాగా తెలుసు. అందుచేత నీలాదేవి ద్వారా భగవంతున్ని దర్శించి ఆయనని అనుభవించాలి అనే ఆశతో ఉన్నారు. అందుకే మొదటి ప్రార్ధనా శ్లోకంలో నీలాదేవితో ఉన్నటువంటి స్వామిని మేల్కొలుపుతారు గోపికలు.

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం అని
నీలాదేవిని… నందగోపుని కోడలా! అని పిలుస్తున్నారు. మనం ప్రారంభంలోనే ఈ ప్రార్ధనా శ్లోకం గురించి తెలుసుకున్నాం. శ్రీ కృష్ణునికి మేనత్త కూతురు నీలాదేవి. చిన్నప్పటినుంచి కృష్ణుడు, నీలాదేవి కలిపి ఆడుకునేవారు. అందుకే నందగోపుని కోడలా! అని పిలుస్తున్నారు.

మదజలము శ్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు అయినా శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కోడలా! ఓ నప్పిన పిరాట్టి! పరిమళిస్తున్న కేశ సంపద కలదానా! తలుపు తెరువుమమ్మ! కోళ్లు వచ్చి కూయుచున్నవి జాజిపందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి.  సుమా! నీవు నీ భర్తయను సరసల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షమునే యుందుము.

దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడెదములే! కావున అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్టుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువమమ్మ! అని గోపాంగనలు  లీలాదేవి నీ పాశురంలో మేలుకొలుపుచున్నారు. 

ఆండాల్ తిరువడిగళే శరణం


No comments:

Post a Comment

Magha Nakshatra - మఖ నక్షత్రం

మఖ నక్షత్రం రాశి : సింహ రాశి గ్రహాధిపతి : సూర్యుడు నక్షత్ర దేవత : పితృదేవతలు (పితృగణాలు – అనునాయక పితృమూర్తులు) శక్తి : "పదవులు, సన్మాన...