తిరుప్పావై - ఇరవై మూడవ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
ఈరోజు 23 వ. పాశురం గురించి తెలుసుకుందాం.
ఈ రోజు ఆండాళ్ చేసిన.. ఒక సింహం తన గుహలోంచి ఎలా బయలుదేరి వస్తుంది అనే అద్భుత వర్ణన ఈ నాటి పాశురంలో చేస్తుంది, అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి. సాహిత్యం తెలియాలంటే తిరుప్పావై చదవాలి. ఉపమానోపమేయాల గురించి తెలియాలంటే తిరుప్పావై చదవాలి. ఇక ఇదీ అదీ అని నియమం లేదు అన్నట్లుగా సవాలు విసురుతుంది తిరుప్పావై. అన్నింటికి ఇదే మూలం అని చెప్పవచ్చు.
మారి మలై ముళంగిల్ మన్నిక్కిడందు రంగుమ్
శీరియ సింగ మరివిత్తు తీవిళిత్తు
వేరి మయిర్ పొంగ వెప్పాడుమ్ పేరుందు దఱి
మూరి నిమిరుందు ముళంగిప్పుఱప్పట్టు
పోదరు మాపోలే; నీ పూవైప్పూ వణ్ణా! ఉన్
కోయిల్ నిన్రింగనే పోందరుళి, కోప్పడైయ
శీరియ సింగాశనత్తిరుందు, యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళేలో రెంబావాయ్ || 23 ||
ఈ పాశురం యొక్క అర్థం చూద్దాం..
ఈ పాశురంలో కృష్ణుడు యొక్క గంభీరమైనటువంటి స్వభావాన్ని.. మృగరాజు అయిన సింహం నడకలాగ ఆండాళ్ వర్ణిస్తుంది. దీనికి ముందు పాశురంలో గోపికలు కృష్ణుని పడక గదిలో ప్రవేశించి ఆయన పాదాల వద్దకు చేరుకోవడం, కనులు విప్పి చూడమని అర్థించడం గురించి వివరించింది. ఆయన అంగీకరించాడు. 'యశోద ఒడిలోని కొదమ సింహం' (యశోద ఇళై సింగం) నిద్ర మేల్కొన్నాడు. ఆయన మేల్కొన్న తీరు ఎలా ఉందంటే వర్ష ఋతువులో మేఘ గర్జన విని నిద్రాభంగం అయిన సింహం మేల్కొన్నట్లు ఉందిట.
గోపికల మేలుకొలుపు విన్న కృష్ణుడు మృగరాజు అయిన సింహం.. కొండగుహలో నిద్రిస్తుండగా వర్ష ఋతువులో మేఘం గర్జిస్తే ఎలా ఉంటుందో..గుహ దద్ధరిల్లినట్లు ఉలిక్కిపడి, కోపంగా లేచి, నిప్పులు కక్కుతున్న ఎర్రని నేత్రాలతో సింహనాదం చేస్తూ, తీక్షణమైన తన చూపులతో నలుదెసలా పరికించినట్లు, నిక్కబొడుచుకున్న జూలు విదిల్చికొని గుహ బయటకు రాజఠీవితో వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడట ఆ పరమాత్మ. నీ దర్శన భాగ్యాన్ని మాకు కలిగిస్తూ సింహం వలే నీ మందిరం నుంచి బయటకు రావయ్యా! నీలమేఘశ్యామా! వచ్చి నీ ఉత్తమ సింహాసనం మీద ఆసీనుడవై మమ్మల్ని అనుగ్రహించు. మా అభీష్టాన్ని తీర్చు అని ఆండాళ్ కోరుతుంది.
కృష్ణుడికి కోపం వచ్చినట్లుంది. 'వేళాపాళా లేకుండా నిద్ర లేపడానికి వచ్చేయడమేనా?' అని ఆయన అంటే, "స్వామీ! బిడ్డలు తల్లిదండ్రుల వద్దకు చేరుకోవడానికి సమయా సమయాలతో పనేముంది? నీ దర్శనం కోరుకునే భక్తులను రక్షిస్తానని నువ్వే హామీ ఇచ్చావు కదా! సర్వసంగ పరిత్యాగులకే నీ దర్శన భాగ్యం కలుగుతుందా? నిన్నే నమ్ముకున్న మాలాంటి గొల్ల పిల్లల సంగతి ఏమిటి? సంసారం విషయంలో విరక్తి పెంచుకొని.. నీ కోసం బయల్దేరి శరణాగతులమై వచ్చాం. ఓ పురుష సింహమా! గంభీరంగా నడుచుకుంటూ వచ్చి సింహాసనంపై కూర్చుని మా పూజలందుకొని మామొర ఆలకించు స్వామీ! మమ్మల్ని అనుగ్రహించు" అని గోపికలందరూ మొరపెట్టుకున్నారు.
No comments:
Post a Comment