తిరుప్పావై - ఇరవై రెండువ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
ఈరోజు 22 వ. పాశురం గురించి తెలుసుకుందాం.
అంగణ్ మా జాలత్తరశర్, అభిమాన
బంగమాయ్ వందు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శంగమిరుప్పార్ పోల్ వందు తలైప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయ్ దామరై ప్పూప్పోలే
శెంగణ్ శిరిచ్చిరిదే యెమ్మేల్ విళియావో
తింగళు మాదిత్తియను మెళుందార్ పోల్
అంగణిరండుంగొండు ఎంగల్ మేల్ నోక్కుదియేల్
ఎంగల్ మేల్ చాబ మిళందేలో రెంబావాయ్ || 22 ||
ఇప్పుడు ఈ పాశురం యొక్క భావాన్ని చూద్దాం
"ఓ స్వామీ! ఈ సువిశాల, సమస్త భూమండలాన్ని పరిపాలించిన రాజులు తమకి ఎదురులేదన్న అహంకారాన్ని, మమకారాన్ని, అభిమానాన్ని అణచుకొని తమ చక్రవర్తుల దగ్గర పాదాక్రాంతులై దేవరవారి సింహాసనము కింద గుమిగూడి ఉన్నారు. అదేవిధంగా మేము కూడా అరిషడ్వర్గాలను వదులుకొని నీ సన్నిధికి వచ్చాము. మాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు ప్రభూ!. కావున లేత ఎరుపు గల మందారు పువ్వుల్లా, సిరిమువ్వల్లా ఉన్న నీ కనులు తెరచి ఒక్కసారి మా వైపు చూడు. తామర పువ్వులు వికసించడానికి సూర్యరశ్మి ఏవిధంగా తోడ్పడుతుందో, అదేవిధంగా మేము ఆర్తితో ప్రార్థించిన ప్రార్థనల వల్ల నీ అందమైన నేత్రాలు తెరుచుకోవాలి. చంద్రుడు, సూర్యుడు ఇద్దరూ ఉదయించినట్లున్న అందమైన నీ కన్నులతో ఒక్కసారి చూసావంటే మా పాపాలన్నీ నశించిపోతాయి".
సూర్యుని వెలుగు.. చీకట్లను పోగొట్టినట్లు, చంద్రుని వెలుగు.. మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది. సూర్య చంద్రులు పరమాత్మ యొక్క రెండు నేత్రాలు. ఆయన గాని కళ్ళతో ఒక్క చూపు మన వైపు చూస్తే చాలు.. మనలో గల అజ్ఞానం నశిస్తుంది.
అతసీ పువ్వు లాగా నల్లని శరీర కాంతి కలిగిన ఓ స్వామీ! వర్షాకాలంలో కొండగుహలలో పడుకొని ఉన్న సింహం మేల్కొని అగ్ని జ్వాలల లాంటి చూపులతో నాలుగు దిక్కులు చూస్తూ అవయవములు కదిలించి, శబ్దం చేసి, బాగా నిట్టనిలువుగా సాగి గర్జించి బయటికి వచ్చినట్లే.. నువ్వు కూడా నీ శయన మందిరం నుంచి ఈ మణి మంటపానికి ఒక సింహంలా విచ్చేసి, జయప్రదమైన సింహాసనం మీద కూర్చుని, మేము వచ్చిన పనిని గమనించు తండ్రీ. నీ చూపులు మాపై ప్రసరించిన వెంటనే మా కర్మ బంధములన్నీ తొలగిపోవును. కనుక మా కర్మబంధములు తొలగ గానే మేము నిన్ను చేరుకుంటాం కదా ! మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ యిదియేగదా ! అని ఆండాళ్ తల్లి కర్మ బంధం తొలగితే ముక్తి లభిస్తుందని' తెలియజేస్తోంది.
పరమాత్మను పొందాలని కోరుకొనేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులవ్వాలి. సంపూర్ణ ప్రపత్తిని చేయాలి. స్వామి పాదాలచెంత వ్రాలి నీవు తప్ప మాకు వేరే దిక్కులేదు. మేము పూర్తిగా నీవారమే అనే శరణాగతి చేసి పాదాలను ఆశ్రయించాలని ఆండాళ్ తల్లి బోధిస్తోంది. ఈ మాలికలో - మేము నిన్ను స్తుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని - అనగా మెల్లమెల్లగా సూర్యచంద్రులవంటి నీ కన్నులను వికసింపచేస్తుండగా.. నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్య రస పూర్ణధారలను తనివితీరా పొంది ఆనందించాలని వచ్చాము అని గోపికలు తెలిపారు. కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకొనేటట్లు చేసేదే యీ ధనుర్మాస వ్రతమంటుంది మన ఆండాళ్ తల్లి.
గోపికలు శ్రీకృష్ణపరమాత్మ వద్దకు చేరి మేల్కొనుము అని వెనుకటి పాశురములో ప్రార్థించినారు. వేరొక గతిలేక నీకే చెందినవారము అని చెప్పినారు. వెనుకటి పాశురమున సూచింపబడిన అనన్య గతి తత్వమునే ఈ పాశురములో వివరిస్తున్నారు. అభిమానము రెండు రకాలుగా ఉంటుంది. సర్వము నాది అను అభిమానము మమతాభిమానము. దేహమే నేను , నేను స్వతంత్రుడను అనునది అహంకారంతో కూడిన అభిమానము. భగవంతుడిని ఆశ్రయించినపుడు ఇతర సంబంధమును పూర్తిగా వదలి, భగవంతుడికే చెందినవారము అను భావము పరిపూర్ణముగా ఉండవలెను. గోపికలు కూడా అదేవిధంగా ఈ పాశురములో విజ్ఞాపన చేస్తున్నారు.
No comments:
Post a Comment