తిరుప్పావై - ముపైవ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
గోపికలు ఆనాడు ఆచరించి నటువంటి కాత్యాయనీ వ్రతాన్ని మన గోదాదేవి కూడా ఆచరించి శ్రీరంగనాధుని పొందింది. గోదాదేవి వ్రతం పూర్తి చేసే సమయానికి శ్రీరంగం నుండి ఆ శ్రీరంగనాథుడు తన అంతరంగ భక్తులను శ్రీవిల్లిపుత్తూరు నుండి ఆండాల్ తల్లిని తీసుకురమ్మని పంపించారు. ఆ కబురు విన్న వెంటనే విష్ణుచిత్తుడు తన శిష్యుడైన వల్లభరాయుడుతో ఆండాల్ తల్లిని తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. అప్పుడు ఆ స్వామి.. ఆ శ్రీరంగనాథుడు ఆండాల్ తల్లిని తనలో చేర్చుకున్నాడు. అందుచేత గోదా శ్రీ రంగనాథ కళ్యాణదివసం అని మన భోగి పండక్కి భోగి అని పేరు వచ్చింది. భోగం అంటే ఆ పరమాత్మని అనుభవించడమే. ఈ వ్రతం మనకి అన్ని విధాలా మంచి ఫలితాలనిస్తుంది. అందరూ ఈ వ్రతం ఆచరించదగినటువంటిది. మనం ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా కనీసం ఈ ముప్పై పాశురాలను రోజూ మనం అనుసంధానం చేస్తే వ్రతం చేస్తే వచ్చే ఫలితం వస్తుంది.
ఇప్పుడు 30వ పాశురాన్ని చదువుదాం.
వంగమ్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగల్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రిఱైంజి
అంగప్పఱై కొండవార్తై అణిపుదువై
పైంగమలత్తండెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శంగత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇంగి ప్పరి శురై ప్పారీరిరండు మాల్వరైత్తోళ్
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరు మాలాల్
ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇంబరువ రెంబావాయ్ ||30 ||
ఈ పాశురం యొక్క అర్థం చూద్దాం..
గోకులంలో చంద్రబింబం వంటి ముఖం కలిగిన గోప బాలికలు పాలసముద్రమును దేవతల కోసం చిలికిన మాధవుడు, కేశవుడు అయిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి తాము పొందిన పురుషార్థమును గురించి, పెరియాళ్వార్ ల కుమార్తె అయిన ఆండాళ్లు ద్రవిడ రూపముగా చెప్పిన తిరుప్పావై అను శ్రీ సూక్తి మాలిక అగు ఈ 30 పాశురములను తప్పకుండా ఈ లోకంలో అనుసంధించు వారు శ్రియఃపతి యొక్క పరిపూర్ణ కృపకు పాత్రులై ఇహ పర లోకములందు బ్రహ్మానందం పొందుదురు గాక!
వంగమ్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
ఓడలతో నిండిఉన్న సముద్రాన్ని మదింపు చేసి, మాధవుడిని కేశవుని కీర్తించారు. ఒకసారి దేవతల కోసమని చెప్పి పాలసముద్రాన్ని మధించి లక్ష్మీదేవిని పొందాడు శ్రీమహావిష్ణువు. పాలసముద్రంలో ఓడలేటండి. ఏమో ఓడలుండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఆయన పాల సముద్రం లో ఉన్నది మనల్ని సంసారసాగరం నుంచి దాటించడానికి.
తింగల్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రిఱైంజి
చంద్రబింబం వంటి ముఖం కలిగి, దివ్యమైన ఆభరణాలు ధరించిన వ్రేపల్లె లోని గోప బాలికలు శ్రీ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్లి మంగళం పాడి
అంగప్పఱై కొండవారచత్తై యణిపుదువై
అంగ అంటే అక్కడ అంటే ఆ వ్రేపల్లెలో పఱ అనే వాయిద్యాన్ని ప్రజల కోసం, తమ కోసం భగవత్ సాన్నిధ్యాన్ని పొందారు. సకల లోకాలకు మణిపూస అయిన, కిరీటం వంటి శ్రీవిల్లి పుత్తూరులో అవతరించి,
పైంగమలత్తండెరియల్ పట్టర్ పిరాన్ కోదై
నిత్యం తామర పువ్వులో గల పూసలను మాలగా ధరించిన గోదాదేవి, భట్టనాథుల వారి కుమార్తె అయిన గోదాదేవి...
శొన్న శంగత్తమిళ్ మాలై
(గోదాదేవి) చెప్పిన, గోపికలందరూ అనుభవించిన తమిళ భాషలోని ఒక పూమాలగా ఉన్న...
ముప్పదుమ్ తప్పామే
ఈ ముప్పై పాశురాలను క్రమం తప్పకుండా
ఇంగి ప్పరి శురై ప్పార్
ఇంగ అంటే ఇక్కడ అంటే ఈ సంసారంలో ఉండి ఈ ప్రకారం చదివినవారు
ఈరిరండు మాల్వరైత్తోళ్
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరు మాలాల్
స్వామివారి నాలుగు భుజములు కూడా పర్వత శిఖరాల్లా ఉన్నాయట. అలాంటి నాలుగు భుజములు, ప్రేమతో ఎర్రబడిన నేత్రములు, దివ్యమైన ముఖారవిందం కలిగిన, ఐశ్వర్యవంతుడు, పరిపూర్ణుడు అయిన నారాయణుడు..
ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇంబరువర్
అంతటా ఉన్న సాటిలేని ఆ పరమాత్మ యొక్క దివ్యమైన కరుణను పొంది ఆనందాన్ని అనుభవిస్తారు. పరమాత్మ గోపికల చేత వ్రతాన్ని చేయించి, ఆ గోపికలను తాను పొంది పరమానందంగా ఉన్న శ్రీమహావిష్ణువుని తలచుకొని స్మరిస్తూ, ఆనందిస్తున్నారు ఆండాళ్ తల్లి.
ఆండాల్ తిరువడిగళే శరణం
No comments:
Post a Comment