అని శుకమహర్షి పల్కగా, పరీక్షిత్తు ఇలాగ అంటున్నాడు : 'కమలదళాక్షుని అంతులేని పరాక్రమప్రశస్తిని గురించి, అంతులేని గుణగణాలనుగూర్చి వెయ్యిమార్లు విన్నా మనస్సుకు తృప్తి కలుగదు. ఆ విష్ణుదేవుని కథావైభవాన్ని ఒక్క పర్యాయం వింటే చాలు, కామునిబాణాలచే పీడింపబడినవాడుసైతం మళ్లీమళ్లీ వినకుండా ఉండలేడు.
పైన చెప్పినదానితోపాటుగా, ఈ క్రింది విషయంకూడా చిత్తగింపదగి ఉంది.
మునిచంద్రా! ఈ లోకంలో శ్రీహరిని పూజించే చేతులే సార్థకమైన చేతులు. ఆయనకు నమస్కరించే శిరస్సే శిరస్సు. ఆ చక్రధారియందు లగ్నమైన మనస్సే మనస్సు. ఆ లక్ష్మీనాథుణ్ణి చూచే కన్నులే కన్నులు. ఆ మురారిని స్తుతించే నోరే నోరు. శాశ్వతుడయిన ఆయనయొక్క దివ్యకథలను వినే చెవులే నిజమైన చెవులు సుమా!
మౌనీంద్రా! శ్రీహరిపాదతీర్థాన్ని సేవించటంలో ఆసక్తి కలిగి ప్రకాశించే పరమభాగవతుని అవయవాలే నిజమైన అవయవాలు. అలాంటి విశిష్టమైన పాదతీర్థ ప్రభావంగలిగిన ఆ పరమేశ్వరుణ్ణి గూర్చి విశదంగా తెలియజీయగోరుతున్నాను.
అలా అడిగిన పరీక్షిత్తును చూచి శుకుడు సంతోషంతో ఇలా పలికాడు. “రాజేంద్రా! శ్రీకృష్ణుని బాల్యమిత్రుడైన కుచేలుడు అభిమానధనుడు, గొప్పవిజ్ఞాని, రాగద్వేషాలు లేనివాడు, పరమశాంతమూర్తి", ధర్మమార్గతత్పరుడు, జితేంద్రియుడు, బ్రహ్మవేత్త, తననూ, తనకుటుంబాన్నీ దారిద్య్రం బాధిస్తూ ఉన్నా ఇతరుల నెవ్వరినీ దీనతతో చేయిసాచి యాచించి యొరుగడు. తనంత తానుగా న్యాయంగా తనకు లభించిన చిన్నకాసునుకూడ పదివేల బంగారు మొహరీలనుగా భావించి, ఏదో ఒక రీతిగా భార్యా పుత్రులను పోషిస్తూ ఉండినాడు. ఇలా ఉండగా ఒక రోజున
కుచేలుని పత్ని పతివ్రతాశిరోమణి ఉత్తమవంశంలో జన్మించినట్టిది. బిడ్డలు ఆకలితో నకనకలాడుతూ ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ, చేతుల్లో ఆకుదొన్నెలు పట్టుకొని ఒకనాడు తనవద్దకు వచ్చి 'అమ్మా! పట్టెడన్నం పెట్టిమని అడుగగా, ఆ మాటలకు ఆమె మిక్కిలి బాధపడి భర్తను సమీపించి దుఃఖపడుతూ ఇలా వేడుకొన్నది. 'జీవితేశ్వరా! ఇంటిలో పెల్లుగా పేదఱికం తాండవిస్తూవుంది. దీన్ని నివారించే సదుపాయాన్ని మీరాలోచించకున్నారుకదా!'
అని మనవిచేసి, మళ్లీ భర్తతో ఇలా పల్కింది.
'మీ బాల్యమిత్రుడైన ఆ శ్రీకృష్ణదేవుణ్ణి సందర్శించండి! ఆయన కరుణాకటాక్షమనే సూర్యకాంతిచే దారిద్య్రమనే చీకట్లో మ్రగ్గిపోతున్న మమ్మల్ని ఉద్ధరించండి.
భక్తవత్సలుడు, వరప్రసాది, ఆర్తరక్షకుడు, లక్ష్మీవల్లభుడు, దయాసముద్రుడు, భగవానుడు అయిన శ్రీకృష్ణుడు యాదవ బృందాలు తనను సేవిస్తూ ఉండగా ద్వారకాపురిలో విరాజిల్లుతూ ఉన్నాడు గదా! ఒక్కసారి వెళ్లి ఆ సర్వసమర్థుడైన ప్రభువును సందర్శించండి! ఆ దేవదేవుడు మిమ్మల్ని చూస్తేచాలు. ఆ క్షణమే మీకు అంతులేని సంపదలను తప్పక అనుగ్రహిస్తాడు.'
కలలోకూడా తనను ఎన్నడూ స్మరించని పాపాత్ముడే అయినా, ఆపద వచ్చిన వేళలో ఒక్కసారి ఆ ఆర్తశరణ్యుని పాదపద్మాలను మనసారా స్మరిస్తేచాలు, అట్టివాణ్ణి సైతం ఆ భగవానుడు కనికరిస్తాడు. అవసరమైతే తనను తాను సమర్పించుకోగలడు. అటువంటి దయామయుడు సుస్థిరమైన భక్తిభావంతో నిత్యమూ తనను ఆరాధించేవారికి గొప్ప గొప్ప ఐశ్వర్యాలను ఇయ్యకుండా ఉంటాడా? (తప్పక ప్రసాదిస్తాడు.)
తన యిల్లాలు చెప్పినట్లుగా శ్రీకృష్ణుణ్ణి సందర్శించటానికి వెళ్లటం ఇహపరసాధకం కాగలదని భావించి, కుచేలుడు సతితో (ఇలా పలికినాడు)
కుచేలుడు తన భార్యతో ఇలా అన్నాడు - నీవు చెప్పినట్లు 'శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆశ్రయించడం మనకు శుభప్రదమైనదే! కానీ, ఆ చక్రపాణికి సమర్పించటానికి మనవద్ద ఏమైనా కానుక ఉందా?' చూడు.
శ్రీకృష్ణుడు రాజు, దైవం, గురువు - ఈ మూడూ కాబట్టి, అతని వద్దకు రిక్తహస్తాలతో పోనేపోరాదు. ఈ ధర్మం తెలిసినవాడూ, సహజంగా భక్తుడూ కనుక, కుచేలుడు ఆ కృష్ణునికి అర్పించటానికి ఏదైనా ఉందేమో చూడుమని తన పత్నికి చెప్పాడు.
'అవును నిజమేకదా! - అని పలికి కుచేలునిభార్య కొన్ని అటుకుల్ని ఆతని చినిగిన ఉత్తరీయపు కొంగున ముడివేసి, ప్రియంగా పతిదేవుణ్ణి సాగనంపింది. ఆ విప్రోత్తముడు గోవిందుణ్ణి దర్శింపబోతున్నాననే ఉత్సాహంతో పయనం సాగించాడు.
ఆ విధంగా కృష్ణుడిని చూడాలనే కోరికతో వెళ్తూ, ఆ కుచేలుడు తన మనస్సులో (ఆలోచింపసాగాడు) ద్వారకా పురికి వెళ్లుతూ కుచేలుడు దారిలో ఇలా ఆలోచించాడు. 'అంత పెద్ద ద్వారకాపురిని నేను ఎలా ప్రవేశించగలను? ఒక వేళ ప్రవేశించినా, అంతఃపురంలో నివసిస్తూవున్న శ్రీకృష్ణుణ్ణి ఎలా చూడగలను? ఒకవేళ ఆయన నివసించే భవనాన్ని సమీపించినా, అచ్చటి కావలివారు నన్ను లోపలకు వెళ్లనివ్వకపోతే, వాళ్లకు బహుమానంగా ఏమియ్యగలను? అయినా ఆ శ్రీకృష్ణుని దయాద్భష్టిపై, నా అదృష్టం ఆధారపడి ఉంది. ఆ దయామయుడు తన భక్తుడైన నన్ను ఎందుకు ఉపేక్షిస్తాడు? ఆయన నన్ను తప్పక ఆదరిస్తాడు' - అని నిర్ణయించుకొని, ఆ విప్రవర్యుడు ద్వారకలో ప్రవేశించి
కుచేలుడు రాజమార్గంలో ముందుకు సాగిపోయాడు. అలా వెళ్లి, కొన్ని భవనద్వారాలను దాటి, శ్రీకృష్ణుడుండే మందిరాన్ని చేరుకొని ముందు భాగంలో
కుచేలుడు బంగారంతో నిర్మించిన, రత్నాలు తాపినగోపురాలతో గొప్పగా గోచరిస్తూవున్న పదారువేలమంది (శ్రీకృష్ణుని) పత్నుల నివాసభవనాలను చూచి, బ్రహ్మానందం పొందినాడు. ఆ ఆనందంతో ఒక వధూమణి (రుక్మిణీదేవి) మందిరాన్ని ప్రవేశించాడు. ఆ మందిరంలో యువతులు వింజామరలు వీస్తూవుండగా హంసతూలికాతల్పంమీద రుక్కిణీదేవితోగూడి అనేక వినోదాలతో ఆనందిస్తూవున్న శ్రీకృష్ణుని చూచాడు. ఆ మహనీయ దృశ్యాన్ని దర్శింపగాదే ఆతని కన్నులనుండి ఆనందబాష్పాలు పెల్లుబికి ప్రవహింపసాగాయి.
నల్లకలువల వంటి దేహచ్చాయగలవాడు, దేవేంద్రునిచే భక్తితో నమస్కారం చేయబడేవాడు, దయకు నిలయమైనవాడు, ప్రకాశించే చెక్కిళ్లుగలవాడు, కౌస్తుభమణిని ధరించినవాడు, భక్తులైనవారికి కల్పవృక్షమైనవాడు, మిగుల ఆకర్షణీయమైన సౌందర్యంతో విలసిల్లేవాణ్ణి, దేవతలందరికీ దిక్కైనవాణ్ణి, సింహమధ్యముణ్ణి, సకలలోకాలలోనూ పూజనీయుడు, మహాసుదర్శనాయుధుడు, విశ్వవిఖ్యాతుడు, గరుడవాహనుడు, పీతాంబరధారి, శేషశాయి, అరవిందనేత్రుడు, మకరకుండలాలంకారుడు, మధురభాషణుడు, సాటిలేని సుందరస్వరూపుడు, క్షీరసాగరంలో విహరించేవాడు, సమస్తసద్గుణసముపేతుడు, యాదవకులమనే సాగరానికి పున్నమి చంద్రుడైనవాడు, తేజశ్శాలి, జయశీలుడు, సహనస్వభావుడు, శ్రీమన్నారాయణుని అవతారమైనవాడు అయిన శ్రీకృష్ణుణ్ణి కుచేలుడు సంతోషంతో సందర్శించాడు.
నిరంతర దారిద్య్రపీడితుడూ, కృశించిన శరీరంకలవాడూ, చినిగిపోయిన వస్త్రం కట్టుకొన్నవాడూ, ఆశాపూరిత చిత్తుడూ, పరిహాసానికి స్థానంగా ఉన్నవాడూ, చినిగిన పైపంచెను కప్పుకొన్నవాడూ ఐన కుచేలుడు తనవద్దకు వస్తూవుండగా అల్లంత దూరంలోనే చూచి, శ్రీకృష్ణుడు గౌరవభావంతోకూడిన తొందరతో గబగబా పానుపునుండి దిగాడు.
శ్రీకృష్ణుడు అతిశయించిన ఆదరభావంతో కుచేలునికి ఎదురుగా వెళ్లి, అతణ్ణి ఆప్యాయతతో కౌగిలించుకొన్నాడు. బంధురీతితోగూడిన స్నేహం ఉట్టిపడేలాగున తోడ్కొని వచ్చి, తనపాన్పుపై కూర్చుండబెట్టాడు.
కుచేలుడు తల్పంమీద కూర్చుండిన పిదప శ్రీకృష్ణుడు బంగారుకలశంలోని నీళ్లతో ఆయన పాదాలను కడిగాడు. ఆ విధంగా కడిగినజలాన్ని భక్తితో తలమీద చల్లుకొన్నాడు.
శ్రీకృష్ణుడు కస్తూరీ, పచ్చకప్పురమూకలిపిన మంచిగంధాన్ని కుచేలుని శరీరానికి దట్టంగా పూసి, మార్గాయాసం తీరేలాగున స్వయంగా వీవన వీస్తూ, మణిమయాలైన దీపాలతో (మిత్రునికి మంగళదాయకంగా) హారతియిచ్చాడు.
శ్రీకృష్ణుడు కుచేలుని సిగలో పూలమాలలు ముడిచి, కర్పూరతాంబూలం ఇచ్చి, పాడియావును సమర్పించి, ప్రియమార కుశలమడిగాడు. గోవిందుడు చేసిన ఆ గౌరవానికి కుచేలునిశరీరం పులకించి, కనులనుండి ఆనందబాష్పాలు జలజల ప్రవించాయి. ఆ దేవదేవుని ప్రియపత్ని పట్టపురాణి అయిన రుక్మిణీదేవి కరకంకణాలు మనోజ్ఞంగా ధ్వనిస్తూ ఉండగా వింజామర వీచింది. ఆ చల్లని మెల్లని గాలికి కుచేలుని చెమట ఆరిపోయి, శ్రమ తొలగి, హాయి కలిగింది. ఆ దృశ్యాన్ని చూచి అంతఃపురంలోని కాంతలు ఆశ్చర్యంతో ఇలా అనుకొన్నారు.
ఈ బ్రాహ్మణోత్తముడు మునుపటి జన్మలో ఎటువంటి తపస్సు చేశాడో కదా! యోగిజన వందనీయుడైన లక్ష్మీనాథుని పానుపుపై కూర్చొని ఉన్నాడు. ఎంతగొప్ప మునీశ్వరులైన ఈ మహాత్మునికి సాటిరారు కదా!
యోగీశ్వరులు ఈ మహనీయునికి సమానులు కాజాలరనే విషయంతోపాటుగా
తన ప్రియపత్నియైన రుక్మిణీదేవి తనతోపాటుగా ఆసీనురాలైయున్నప్పటికీ, ఎటువంటి భేదభావన లేకుండా శ్రీకృష్ణుడు వెంటనే లేచి, ఈ భూసురునికి ఎదురేగివెళ్లి, ప్రేమతో కౌగిలించుకొన్నాడు. తగినట్లు సత్కారాలుచేసి ఎంతో వినయంతో సేవించాడు. నిజంగా ఈ విప్రుడు ఎంతటి అదృష్టశాలియో కదా!
అని అంతఃపుర కాంతలు పరస్పరం అనుకొంటూ ఉన్న సందర్భంలో
అంతపురకాంతలు అలా అనుకొంటూ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు ప్రేమతో కుచేలునిచేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. తాము గురుకులవాసం చేసిన రోజుల్లో జరిగిన విశేషాల్లో కొన్నిటిని ప్రస్తావించాడు. నిపుణతతో మళ్లీ
'భూసురశ్రేష్ఠా! వేదాధ్యయనంలోనూ, అధ్యాపనం(వేదాన్ని అభ్యసింపచేయటం) లోనూ నేర్పరులైన వారియింట జన్మించిన నీ పత్ని సద్గుణవతియై నీకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నదా? ఇంతకూ నీ మనస్సు ఇల్లూ, పొలాలూ, సంపదా, భార్యా, బీడ్డలూ - మొదలైన ఇహలోకవిషయాల యొడల లగ్నమై ఉన్నట్లుగా తోచటంలేదు. ఈ లోకక్షేమంకోసం నేను విధ్యుక్తకర్మల ఆచరిస్తూ ఉన్నరీతిగా, కొంతమంది సజ్జనులు మాయతో గూడిన ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ, శ్రేష్ఠమయిన కర్తవ్యాలను మాత్రం ఆసక్తితో ఆచరిస్తూ జీవిస్తారు.'
అని పై రీతిగా పలికి, శ్రీకృష్ణుడు మళ్లీ కుచేలునితో ఇలా అన్నాడు.
శ్రీకృష్ణుడు కుచేలునితో ఇంకా ఈ విధంగా పలికినాడు. 'మనం గురువుగారిఇంటిలో ఉండి విద్యాభ్యాసం చేసేకాలంలో ఆయనవల్ల సమస్త విషయాలను తెలుసుకొన్నాము; అంతేగాక, పరతత్త్వాన్ని గూర్చికూడా ఆ గురువర్యుడు మనకు బోధింపగా చక్కగా తెలుసుకోగలిగాము. ఈ విషయాలన్నీ నీకు జ్ఞాపకంలో ఉన్నాయా? మిత్రమా!'
గురుకులంలో తాము అభ్యసించిన జ్ఞాన, విజ్ఞానాల్ని గురించి, జ్ఞాపకం చేసి, అనంతరం గురువుగారిని ప్రస్తుతింపదలంచి శ్రీకృష్ణుడు కుచేలునితో ఇలా అన్నాడు.
మన గురువరేణ్యుడు అజ్ఞానమనే అంధకారానికి గొప్ప దీపంలాంటివాడు. బ్రహ్మానంద అనుభవంలో నిమగ్నమైన చిత్తం కలవాడు. సత్కర్మపరాయణుడు. పుణ్యాత్ముడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడు. సజ్జనుల ప్రశంసలందుకునే మహనీయుడు.
నేను సకలజనులకూ విజ్ఞానాన్నిచ్చే జగద్గురువునై ఉండీ కూడా, నాలుగుజాతులందలి, నాలుగుఆశ్రమాలలోని ప్రజలందరికీ గురుసేవనం ఆచరించవలసిన ఉత్తమధర్మమని ప్రబోధించేందుకే, మనగురువుగారిని సేవించాను.
లోకంలోగల బ్రాహ్మణులందరికీ అత్యంత ఆప్తుడనై సకలవర్ణాలకూ, సమస్తాశ్రమాలకూ ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించేవాడినై శ్రేష్ఠుడగు గురువర్యుడినై సర్వత్ర శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉంటాను.
సమస్తానికి గురువర్యుడనైన నాఉపదేశాన్ని అంగీకరించి, నా పాదపద్మాలను ధ్యానించుటయందే అమితమైన ఆసక్తిగలవారు ఈ సంసారసాగరాన్ని శీఘ్రంగా దాటి, మోక్షాన్ని పొందుతారు. అన్ని వర్ణాలలోనూ, ఆశ్రమాలలోనూ అలాంటివారలే పరమార్ధాన్ని తెలిసిన పండితులు.
సమస్త ప్రాణులలోను ఆత్మయైయున్న నేను తపస్సు, వ్రతాలు, యజ్ఞాలు, దానాలు, ఇంద్రియనిగ్రహం - మున్నగు ఆచరణలవల్ల అంతగా సంతోషించను; మరేమంటే భక్తితో గురువర్యుణ్ణి సేవించేవారిని చూచి ఎంతో సంతోషిస్తాను. ఈ విధంగా పలికి, శ్రీకృష్ణుడు కుచేలునితో ఇంకా ఇలా అన్నాడు. 'మనం గురువుగారిఇంటిలో ఉన్నకాలంలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం వంటకట్టెలు తీసుకొనిరావటానికి అడవికి వెళ్లాము. అది గుర్తుందికదూ! ఆ సందర్భంలో మనం అడవికి వెళ్లిన ఆ వేళలో గొప్పధ్వనులతో ఉరుముతూ ఆకాశమంతటా కారుమబ్బులు ఆవరించాయి. గాలివాన గొప్పవేగంతో వీచి, అడవిలోని వివిధజంతుసమూహాలను నిలువనీయకుండా చెల్లాచెదురు చేశాయి. వర్షధారలు దిగజాల తొండాలంత పరిమాణంతో పడుతూ భూమిని ముంచివేశాయి. సూర్యకిరణాలను మించిన కాంతితో ప్రకాశిస్తూ మెఱుపులు మిఱుమిట్లు గొలిపాయి. అంతలో సూర్యుడు అస్తమించగా చీకట్లు ఎంతో దట్టంగా అలముకొన్నాయి ఏ వస్తువుకూడా కంటికి కనబడటంలేదు. అటువంటి ఆ జడివానలో మనమిద్దరం తడిసి ముద్దయిపోయి
బయలు ప్రదేశంగాని, సందుగానున్నచోటుగాని, ఎత్తుగాని, పల్లంగాని, లోతులేని ప్రదేశంగాని, లోతుగల ప్రదేశంగాని గుర్తింపవీలుగాకుండిన ఆవాననీటిలో ఆ చీకటిరాత్రిలో మనం ఒకరిచేతిని మరొకరు గట్టిగా పట్టుకొని ఆ అడవిలో నడిచాము కదా!
నిరంతరం వీస్తూవున్న తీవ్రమైన ఆ చలిగాలులకు మనదేహాలు వణకి దొడగాయి. అందువల్ల మనం దారి తెలియక, దిక్కుతోచక ఆ అడవిలో అటునిటు సంచరింపసాగాము. అలా సంచరిస్తూ ఉండగా, ఎట్టకేలకు సూర్యోదయం అయింది.
తెల్లవారగానే పక్షుల కలకలధ్వనులు అంతటా వ్యాపించాయి. సూర్యుడు ఉదయింపగానే ధవళకాంతులు దిక్కులందంతటా నిండిపోయాయి.
అప్పుడు మన గురువర్యుడైన సాందీపుడు మనలను వెదకుకొంటూ అడవికి వచ్చాడు. వాననుండీ, చలినుండీ కొంచెం తేరుకొని ఉన్న మనల్ని చూచి చింతిస్తూ ఈ విధంగా అన్నాడు.
'అయ్యో! శిష్యులారా! మా కోసమై ఈ విధంగా అడవికి వచ్చి చాలా బాధపడినారు. దీనివల్ల మీరు గురు ఋణం తీర్చుకొన్నవారైనారు. కనుక ఇకపై మీ కిరువురకు అతిశయించిన ధన, బంధు, దార, బహుపుత్ర సంపదలూ, దీర్ఘాయు, రున్నతులూ, విజయశ్రీలూ సమకూరగలవు' (అని ఆశీర్వదించినాడు).
అలాగా దీవించి సాందీపని వాత్సల్యంతో మనలను తన మందిరానికి పిలుచుకొని వెళ్ళాడు. ఈ సంగతులన్నిటినీ నీవు ఎప్పుడైనా మనస్సులో అనుకుంటూ ఉంటావా? అని అంటూ, శ్రీకృష్ణుడు కుచేలునితో మళ్లీ ఈ విధంగా పలికాడు.
పుణ్యాత్మా! మనం గురుకులంలో వేదాధ్యయనం చేస్తూ ఉండిన దినాలలో పరస్పరం స్నేహంతో, వాత్సల్యంతో చేసిన పనులన్నిటిని నీవు మఱచిపోలేదు కదా! - అని మాధవుడు తను చిన్ననాటి ముచ్చట్లను ఉదాహరిస్తూ పల్కిన మధుర వాక్యాలను విని కుచేలుడు సంతోషించినవాడై, ఇలా అన్నాడు.
'నిర్మలచరిత్రుడవైన పద్మనాభా! విద్యాభ్యాసంనిమిత్తమై మనం గురువుగారిగ్భహంలో నివసించినకాలంలో సంతోషంతో ఆచరింపని కార్యాలంటూ ఉన్నాయా? అవి అలా ఉండనీ! ఇప్పుడు నేను మనవిచేసేది చిత్తగించు.
శ్రీకృష్ణదేవా! మూడులోకాలకూ గురువర్యుడవైన నీకుకూడా మరొక గురువు దగ్గర చేరి అధ్యయనం చెయ్యటం, నీవు ఆయనకు శిష్యుడివి కావటం - ఇదంతా చూస్తే లోకులకు ఆదర్శంగా ఉండేందుకై నీవు లోకాన్ని అనుకరించటమేగాని, వేఱొకటి కాదుకదా! (ఇవన్నీ నీ లీలలే కదా!).
కుచేలుడు సాభిప్రాయంగా పలికిన పలుకులు విని సమస్తభావవేత్త అయిన శ్రీకృష్ణుడు వాటిలోని ఆంతర్యాన్ని గ్రహించాడు. చిఱునగవుచే అందగించిన ముఖకమలంకలవాడై 'మిత్రమా! నీవిచ్చటికి వస్తూ భక్తిభావంతో నాకేమి కానుక తీసుకొని వచ్చావు? నీవు తెచ్చిన ఆ కానుక కొంచెమైనా సరే, దాన్ని పదివేలరేట్లుగా స్వీకరిస్తాను. నా యందు భక్తిలేని నీచుడు మేరుపర్వతమంతటి పదార్ధాన్ని తెచ్చియిచ్చినా అది నాకు ప్రియమైంది కాజాలదు'- అని
'మిత్రమా! నిశ్చలమైన భక్తిభావంతో నన్ను సేవించే జనులు పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా సరే! నాకు సమర్పిస్తే, దాన్ని రుచికరమైన ఆహారంగా స్వీకరించి, పరమప్రీతితో ఆరగిస్తాను' - అని శ్రీకృష్ణుడు కుచేలునితో అన్నాడు.
అని శ్రీకృష్ణుడు పల్కిన వినయంతో కూడిన పల్కులకు కుచేలుడు ఎంతో ఆనందించాడు. కాని, తాను తెచ్చిన అటుకులను శ్రీకృష్ణునికి అర్పించజాలక సంకోచిస్తూ తలవంచి మౌనంగా ఉండినాడు.
శ్రీకృష్ణుడు తన దివ్యచిత్తంతో కుచేలుని రాకకుగల కారణాన్ని తెలుసుకున్నాడు. “పూర్వజన్మలో ఈ భూసురుడు ఐశ్వర్యంకోసం నన్ను సేవించలేదు. ఇప్పుడు తన భార్యసంతోషంకోసం నా వద్దకు వచ్చాడు. కనుక ఈతనికి ఇంద్రాదులకుసైతం లభించని అనేకసంపదలను ఈ క్షణంలోనే ప్రసాదించాలి” - అని భగవానుడు నిశ్చయించుకొన్నాడు.
కుచేలుని చినిగిన ఉత్తరీయం అంచులో ముడివైచి ఉన్న చిన్న అటుకుల మూటను గమనించి 'ఇదేమిటి?' - అని అడిగి, ఆ మూటను విప్పి, ఒక పిడికెడు తీసుకొన్నాడు. 'నాకూ, ఈ సమస్త లోకాలకూ సంతృప్తి నీయటానికి ఇవి సరిపోతాయి' - అని తలంచి కృష్ణుడు వాటిల్ని ఆరగించాడు.
శ్రీకృష్ణుడు పిడికడు అటుకులను ఆరగించిన పిదప, కుతూహలంతో కుచేలుని ఉత్తరీయం కొంగులో ఉండే మూటలో ఇంకొక పిడికడు అటుకులు తీసుకొంటూ ఉండగా, అప్పుడు రుక్మిణీదేవి తన పతిదేవునిహస్తాన్ని గట్టిగా పట్టుకొనింది.
'ముల్లోకాలకు సమస్త సంపదలను అనుగ్రహించే దేవదేవుడవైన శ్రీకృష్ణదేవా! ఈతనికి సమస్త సంపదలను అందించటానికై ఇంతకు ముందు మీరు తినిన పిడికెడు అటుకులే చాలు! కాబట్టి, ఇకపై భుజించకండి!' - అని రుక్మిణీదేవి భర్తను వారించింది.
(రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి రెండవ పిడికెడు(అటుకలను) భక్షింపనీయకుండా నివారించటానికిగల కారణాన్ని సంస్కృత భాగవతంయొక్క వ్యాఖ్యాతలు సముచితమైన రీతిలో వివరించారు. మొదటి పిడికెడు అటుకులతోనే ఆతనికి ఇహలోక పరలోకాలకు రెండిటికి సంబంధించిన సకల సంపదలూ సిద్ధించాయి. అటుపై రెండవ పిడికెడు అటుకులను గనుక భుజించినట్లైతే, సాక్షాల్లక్ష్మీదేవియే ఆతని అధీన కావలసివస్తుందని, అందువల్ల అలా చేయవద్దనీ లక్ష్మీదేవియొక్క అవతారమైన రుక్మిణీదేవి అలా స్వామిచేతిని పట్టుకొన్నది.)
కుచేలుడు ఆ రాత్రి శ్రీకృష్ణునిమందిరంలో ఎంతో రుచికరాలైన అనేకఆహారపదార్థాలను ఆరగించాడు. మెత్తని పాన్పుపై నిద్రించాడు. తాను గొప్పస్వర్గభోగాన్ని పొందిన భాగ్యవంతుడిగా భావించాడు. తెల్లవారగానే ఆతడు కాలోచిత కృత్యాలను నిర్వర్తించుకొని, తన ఊరికి బయలుదేరాడు. శ్రీకృష్ణునిచే కొంత దూరం సాగనంపబడి, వెళుతూ, గోవిందుణ్ణి సందర్శించి నందువల్ల కలిగిన అతిశయించిన ఆనందంతో తన మనస్సులో ఇలా అనుకోసాగాడు.
నేను ఈ తరుణంలో పుణ్యాలరాశీ, ప్రశాంతస్వభావుడూ, అచ్యుతుడూ, సర్వవ్యాపకుడూ, బ్రాహ్మణహితం కోరేవాడూ, జ్ఞానస్వరూపుడూ, పరాత్పరుడూ - అయిన పురుషోత్తముణ్ణి కన్నులార కనుగొన గలిగాను. నిజంగా నేను చేసుకొన్న పుణ్యం ఎంత గొప్పదోకదా!
కుచేలుడు తన మనస్సున ఇంకా ఈ రీతిగా భావించాడు. “నిఱుపేదనైన నే నెక్కడ? జగదీశ్వరియైన శ్రీదేవికి నిత్య నివాసమైన వాసుదేవుడెక్కడ? ఆ నందనందనుడు నన్ను తన తోబుట్టువుతో సమానునిగా భావించి, అనురాగంతో కౌగిట చేర్చినాడు. దేవునిగా భావించి, తన పాన్పుపై కూర్చుండజేసి పరిచర్యలు కావించాడు. ఆయనపత్ని నాకు వింజామర వీచి నాబడలికను పోగొట్టింది. సాక్షాత్తు లక్ష్మీదేవియైన రుక్మిణిని సంభాళించిన అరచేతులతో ఆప్యాయంగా నా పాదాలు ఒత్తి ఆదరించాడు కదా!
నన్ను అలాగ ఆదరించాడు కనుకనే
ఈ రీతిగా నన్ను ఆదరించిన శ్రీకృష్ణుడు నాకు ధనం ఏమాత్రం ఇవ్వలేదు. దరిద్రుడు సంపన్నుడైతే ఆ సంపదవల్ల అహంకారంతో అంధుడై తనను సేవించడని తలచినాడు కాబోలు! లేకుంటే ఆశ్రితజనుల ఆర్తిని నివారించే ఆ అపార కృపాసముద్రుడు తన భక్తుడైన నన్ను సకలసంపదలతో పరిపూర్ణునిగా చేయకుండా ఉంటాడా? తప్పక చేసి ఉండేవాడే!
(శ్రీకృష్ణుడు తనకు సంపదలను ప్రసాదించకపోవటానికిగల కారణాన్ని ఊహించటంలో, భక్తి భరితమైన ఆయన శీలం వెల్లడవుతున్నది.)
కుచేలుడు పైరీతిగా తన మనస్సులో ఆలోచన చేస్తూ తన పురాన్ని చేరుకున్నాడు.
కుచేలుడు తనయెదుట సూర్యచంద్రుల ప్రభలతో ప్రకాశించే సువర్ణమయాలైన, చంద్రకాంతశిలానిర్మితాలైన భవనాలూ, చిలుకలు, కోయిలలు, నెమళ్లు మున్నగువాటికూజితాలలో విలసిల్లుతున్న ఉద్యానవనాలూ, వికసించిన పలురకాల పద్మాలతో, కలువపూలతో కన్నులపండువు కావిస్తూవున్న సరోవరాలూ, మణిమయ కనక కంకణాలు, రకరకాల భూషణాలు ధరించిన దాసదాసీ జనులూకలిగి వెలుగొందే మహోన్నతమందిరాన్ని చూచి ఆశ్చర్యపడినాడు. ఇది ఏ పుణ్యాత్ముని నివాసభవనమో? సిరిసంపదలకు నిలయమై అపూర్వంగా ప్రకాశిస్తూందని కుచేలుడు భావించాడు.
కుచేలుడు తనయెదుట నూతనంగా గోచరించిన అపూర్వసౌధాన్ని చూచి 'ఈ మహనీయసౌధం ఏ పుణ్యాత్ముని నివాస మందిరమో కదా!' అని ఆలోచిస్తూ ఉండినాడు. ఆ సందర్భంలో
“ఆ సమయంలో దేవతాస్త్రీలను పోలిన యువతులు కుచేలునివద్దకు వచ్చి ఈ మందిరంలోనికి వేంచేయండి” అని ఇంపుగా పలుకుతూ మనోజ్ఞాలైన సంగీతన్ఫత్యనాట్యవాద్యాలతో మంగళకరమైన శబ్దాలు ప్రసరిస్తుండగా వైభవోపేతంగా అలంకరించిన మందిరంలోనికి పిలుచుకొని వెళ్లారు.
కుచేలుడు ఆ విధంగా యువతీమణులవెంట అంతఃపురంలోనికి విచ్చేసిన పిదప, ఆయన భార్యయైన ఉత్తమ సతీమణి తన మనస్సునందు ఎంతో సంతోషించింది.
పతివ్రతాశిరోమణియైన కుచేలుని యిల్లాలు తన వల్లభుని రాకను తెలుసుకొని ఎంతో సంతోషంతో ఎదురు వచ్చింది. మానవరూపాన్ని ధరించిన మహాలక్ష్మిలాగా విలసిల్లుతూ ఉన్న ఆమెకడగన్నుల నుండి ఆనందబాష్పాలు రాలుతుండగా భర్త పాదాలకు మనస్సులో నమస్కరించి, భావంలో కౌగిలించుకొనింది. దివ్యాంబరాలు, దివ్యాభరణాలు ధరించి మన్మథుని బాణాలలాగా ఉన్న పరిచారికల సేవలందుకొంటూ ఐశ్వర్యశోభతో తులతూగుతూ ఉన్న తన ధర్మపత్నిని కుచేలుడు చూచి
ఉత్తమ దంపతులైన కుచేలుడూ, ఆయన ధర్మపత్నీ అన్యోన్యమైన అనురాగం విలసిల్లగా శ్రీకృష్ణునికృపతో లభించిన అంతులేని ఐశ్వర్యంతో నిత్యానందాన్ని పొందుతూ
ఎర్రని పద్మరాగమణులు తాపిన చిరుకంబాలు, తెల్లని సృటికశిలా నిర్మితాలైన గోడలు, గరుడపచ్చలు చెక్కిన నవరత్నాల వాకిళ్లు, ఇంద్రనీల మణులు తాపిన గవాక్షాలు, చంద్రకాంత శిలావినిర్మిత వేదికలు, హంసతూలికాతల్పాలు, సువర్ణ మయాలైన శయనశాలలు, సిరులొలికే ఉన్నత భద్రపీఠాలు, పల్లకీలు, ఆవశ్యకాలైన ఉత్తమవస్తువులతో, సమస్త సంభారాలతో పరిపూర్ణాలై విలసిల్లుతూవున్న వాడలు - వీటన్నింటితో విరాజిల్లుతూవున్న మందిరాన్ని కుచేలుడు (సతీసతుడై) ప్రవేశించి
కుచేలుడు నూతనమందిరంలో సతీసమేతంగా సుఖంగా నివసిస్తూ, మనస్సులో ఇంద్రియవికారాలు కలుగకుండా ప్రవర్తిస్తూ, తనలో తాను ఇలా అనుకొన్నాడు : 'ఇంతకాలం అంతులేని పేదరికం అనే దుఃఖసముద్రంలో మునిగి ఉండిన నాకు చివరిదశలో ఈ ఐశ్వర్యం లభించింది.
పరిశీలించినట్లైతే శ్రీకృష్ణుని దయావీక్షణంవల్లనే నాకు క్రొత్తగా ఈ ఐశ్వర్యాలన్నీ సంప్రాప్తించాయి. ఈ సంపదలను కోరటానికే కదా కుచేలుడనైన నేను ఆ శ్రీహరిసన్నిధికి వెళ్లటం!
సంపదలను అర్ధిస్తూ నేను ఆ శ్రీహరి వద్దకు వెళ్ళాను. ఆ దేవదేవుడు నా సంగతి తెలిసికూడా నన్నేమీ అడుగలేదు. నన్ను వీడ్కొలిపి సాగనంపి, తరువాత నాకు ఈ సంపదలు ప్రసాదించి, నన్ను వీటికి అధీశుణ్ణి చేశాడు. ఆయన ఎంతటి దయామయుడోకదా!
అటువంటి దయామయుడైన పురుషోత్తముడు భక్తిభావ తత్పరులైన సత్పురుషులు సమర్పించిన వస్తువు కొంచెమైనా, దాన్ని కోటిరెట్లుగా భావించి, స్వీకరించి, భక్తజనులను ఆదరిస్తా డనటానికి నావృత్తాంతమే నిదర్శనం. మలినమైన నా శరీరాన్నీ జీర్ణవస్త్రాల్నీ చూచి ఆ శ్రీకృష్ణుడు ఏ మాత్రం ఏవగించుకొనక, నావద్దనుండిన అటుకులను ప్రీతితో భుజించి, నన్ను ధన్యుణ్ణి చేశాడు. ఇలా చెయ్యటంలో అచ్యుతుని నిర్హేతుకవాత్సల్యం వెల్లడౌతున్నది. అంతటి దయాసముద్రుడైన గోవిందుని చరణకమలాలపై పరిపూర్ణమైన భక్తినాకు ప్రతిజన్మలోనూ కలుగుగాక!' - అని యీరీతిగా భావించి హరిస్మరణ తత్పరుడై కుచేలుడు తన ధర్మపత్నితో గలసి జీవించాడు. భోగాలయెడల ఆసక్తి లేనివాడై, రాగద్వేషాదిద్వంద్వాలకూ, అరిషడ్వర్గాలకూ అతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారసపానంతో తన్మయుడై, భవబంధాలను పాసి, మోక్షాన్ని పొందినాడు.
దేవదేవుడూ, అఖిలభావవేత్తా, ఆశ్రితవరదుడూ అయిన వాసుదేవునికి బ్రాహ్మణులు దైవస్వరూపులు. అందువల్లనే భూలోకంలో బ్రాహ్మణులకంటే వేఱొకదైవం లేడు.
(శ్రీకృష్ణుడు బ్రాహ్మణోత్తములను దైవస్వరూపులుగా ఆదరించే స్వభావంకలవాడు కావుననే, కుచేలునికి అఖండమైన ఐహికాముష్మిక సంపదలను ప్రసాదించినా డని సారాంశం.)
ఫలశ్రుతి:
పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణదేవుడు కుచేలుడనే విప్రపుంగవుణ్ణి చరితార్థుణ్ణి గావించిన పవిత్ర చరిత్రను విన్న సత్పురుషులకు ఇహ, పరసుఖాలూ, హరిభక్తీ, యశస్సూ సంప్రాప్తిస్తాయి.
(ఇది కుచేలోపాఖ్యానం చివర చెప్పబడిన ఫలశ్రుతి ఇలాగే, భాగవతంలోని చాలా ఉపాఖ్యానాలకు ఇటువంటి ఫలశ్రుతులు పేర్కొనబడి వుండటం ముఖ్యమైన విశేషం!)
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment