Saturday, August 29, 2026

kuchelopakyanamu - కుచేలోపాఖ్యానము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - కుచేలోపాఖ్యానము

అని శుకమహర్షి పల్కగా, పరీక్షిత్తు ఇలాగ అంటున్నాడు : 'కమలదళాక్షుని అంతులేని పరాక్రమప్రశస్తిని గురించి, అంతులేని గుణగణాలనుగూర్చి వెయ్యిమార్లు విన్నా మనస్సుకు తృప్తి కలుగదు. ఆ విష్ణుదేవుని కథావైభవాన్ని ఒక్క పర్యాయం వింటే చాలు, కామునిబాణాలచే పీడింపబడినవాడుసైతం మళ్లీమళ్లీ వినకుండా ఉండలేడు.

పైన చెప్పినదానితోపాటుగా, ఈ క్రింది విషయంకూడా చిత్తగింపదగి ఉంది.

మునిచంద్రా! ఈ లోకంలో శ్రీహరిని పూజించే చేతులే సార్థకమైన చేతులు. ఆయనకు నమస్కరించే శిరస్సే శిరస్సు. ఆ చక్రధారియందు లగ్నమైన మనస్సే మనస్సు. ఆ లక్ష్మీనాథుణ్ణి చూచే కన్నులే కన్నులు. ఆ మురారిని స్తుతించే నోరే నోరు. శాశ్వతుడయిన ఆయనయొక్క దివ్యకథలను వినే చెవులే నిజమైన చెవులు సుమా!

మౌనీంద్రా! శ్రీహరిపాదతీర్థాన్ని సేవించటంలో ఆసక్తి కలిగి ప్రకాశించే పరమభాగవతుని అవయవాలే నిజమైన అవయవాలు. అలాంటి విశిష్టమైన పాదతీర్థ ప్రభావంగలిగిన ఆ పరమేశ్వరుణ్ణి గూర్చి విశదంగా తెలియజీయగోరుతున్నాను.

అలా అడిగిన పరీక్షిత్తును చూచి శుకుడు సంతోషంతో ఇలా పలికాడు. “రాజేంద్రా! శ్రీకృష్ణుని బాల్యమిత్రుడైన కుచేలుడు అభిమానధనుడు, గొప్పవిజ్ఞాని, రాగద్వేషాలు లేనివాడు, పరమశాంతమూర్తి", ధర్మమార్గతత్పరుడు, జితేంద్రియుడు, బ్రహ్మవేత్త, తననూ, తనకుటుంబాన్నీ దారిద్య్రం బాధిస్తూ ఉన్నా ఇతరుల నెవ్వరినీ దీనతతో చేయిసాచి యాచించి యొరుగడు. తనంత తానుగా న్యాయంగా తనకు లభించిన చిన్నకాసునుకూడ పదివేల బంగారు మొహరీలనుగా భావించి, ఏదో ఒక రీతిగా భార్యా పుత్రులను పోషిస్తూ ఉండినాడు. ఇలా ఉండగా ఒక రోజున

కుచేలుని పత్ని పతివ్రతాశిరోమణి ఉత్తమవంశంలో జన్మించినట్టిది. బిడ్డలు ఆకలితో నకనకలాడుతూ ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ, చేతుల్లో ఆకుదొన్నెలు పట్టుకొని ఒకనాడు తనవద్దకు వచ్చి 'అమ్మా! పట్టెడన్నం పెట్టిమని అడుగగా, ఆ మాటలకు ఆమె మిక్కిలి బాధపడి భర్తను సమీపించి దుఃఖపడుతూ ఇలా వేడుకొన్నది. 'జీవితేశ్వరా! ఇంటిలో పెల్లుగా పేదఱికం తాండవిస్తూవుంది. దీన్ని నివారించే సదుపాయాన్ని మీరాలోచించకున్నారుకదా!'
అని మనవిచేసి, మళ్లీ భర్తతో ఇలా పల్కింది.

'మీ బాల్యమిత్రుడైన ఆ శ్రీకృష్ణదేవుణ్ణి సందర్శించండి! ఆయన కరుణాకటాక్షమనే సూర్యకాంతిచే దారిద్య్రమనే చీకట్లో మ్రగ్గిపోతున్న మమ్మల్ని ఉద్ధరించండి.

భక్తవత్సలుడు, వరప్రసాది, ఆర్తరక్షకుడు, లక్ష్మీవల్లభుడు, దయాసముద్రుడు, భగవానుడు అయిన శ్రీకృష్ణుడు యాదవ బృందాలు తనను సేవిస్తూ ఉండగా ద్వారకాపురిలో విరాజిల్లుతూ ఉన్నాడు గదా! ఒక్కసారి వెళ్లి ఆ సర్వసమర్థుడైన ప్రభువును సందర్శించండి! ఆ దేవదేవుడు మిమ్మల్ని చూస్తేచాలు. ఆ క్షణమే మీకు అంతులేని సంపదలను తప్పక అనుగ్రహిస్తాడు.'

కలలోకూడా తనను ఎన్నడూ స్మరించని పాపాత్ముడే అయినా, ఆపద వచ్చిన వేళలో ఒక్కసారి ఆ ఆర్తశరణ్యుని పాదపద్మాలను మనసారా స్మరిస్తేచాలు, అట్టివాణ్ణి సైతం ఆ భగవానుడు కనికరిస్తాడు. అవసరమైతే తనను తాను సమర్పించుకోగలడు. అటువంటి దయామయుడు సుస్థిరమైన భక్తిభావంతో నిత్యమూ తనను ఆరాధించేవారికి గొప్ప గొప్ప ఐశ్వర్యాలను ఇయ్యకుండా ఉంటాడా? (తప్పక ప్రసాదిస్తాడు.)

తన యిల్లాలు చెప్పినట్లుగా శ్రీకృష్ణుణ్ణి సందర్శించటానికి వెళ్లటం ఇహపరసాధకం కాగలదని భావించి, కుచేలుడు సతితో (ఇలా పలికినాడు)

కుచేలుడు తన భార్యతో ఇలా అన్నాడు - నీవు చెప్పినట్లు 'శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆశ్రయించడం మనకు శుభప్రదమైనదే! కానీ, ఆ చక్రపాణికి సమర్పించటానికి మనవద్ద ఏమైనా కానుక ఉందా?' చూడు.

శ్రీకృష్ణుడు రాజు, దైవం, గురువు - ఈ మూడూ కాబట్టి, అతని వద్దకు రిక్తహస్తాలతో పోనేపోరాదు. ఈ ధర్మం తెలిసినవాడూ, సహజంగా భక్తుడూ కనుక, కుచేలుడు ఆ కృష్ణునికి అర్పించటానికి ఏదైనా ఉందేమో చూడుమని తన పత్నికి చెప్పాడు.

'అవును నిజమేకదా! - అని పలికి కుచేలునిభార్య కొన్ని అటుకుల్ని ఆతని చినిగిన ఉత్తరీయపు కొంగున ముడివేసి, ప్రియంగా పతిదేవుణ్ణి సాగనంపింది. ఆ విప్రోత్తముడు గోవిందుణ్ణి దర్శింపబోతున్నాననే ఉత్సాహంతో పయనం సాగించాడు.

ఆ విధంగా కృష్ణుడిని చూడాలనే కోరికతో వెళ్తూ, ఆ కుచేలుడు తన మనస్సులో (ఆలోచింపసాగాడు) ద్వారకా పురికి వెళ్లుతూ కుచేలుడు దారిలో ఇలా ఆలోచించాడు. 'అంత పెద్ద ద్వారకాపురిని నేను ఎలా ప్రవేశించగలను? ఒక వేళ ప్రవేశించినా, అంతఃపురంలో నివసిస్తూవున్న శ్రీకృష్ణుణ్ణి ఎలా చూడగలను? ఒకవేళ ఆయన నివసించే భవనాన్ని సమీపించినా, అచ్చటి కావలివారు నన్ను లోపలకు వెళ్లనివ్వకపోతే, వాళ్లకు బహుమానంగా ఏమియ్యగలను? అయినా ఆ శ్రీకృష్ణుని దయాద్భష్టిపై, నా అదృష్టం ఆధారపడి ఉంది. ఆ దయామయుడు తన భక్తుడైన నన్ను ఎందుకు ఉపేక్షిస్తాడు? ఆయన నన్ను తప్పక ఆదరిస్తాడు' - అని నిర్ణయించుకొని, ఆ విప్రవర్యుడు ద్వారకలో ప్రవేశించి

కుచేలుడు రాజమార్గంలో ముందుకు సాగిపోయాడు. అలా వెళ్లి, కొన్ని భవనద్వారాలను దాటి, శ్రీకృష్ణుడుండే మందిరాన్ని చేరుకొని ముందు భాగంలో

కుచేలుడు బంగారంతో నిర్మించిన, రత్నాలు తాపినగోపురాలతో గొప్పగా గోచరిస్తూవున్న పదారువేలమంది (శ్రీకృష్ణుని) పత్నుల నివాసభవనాలను చూచి, బ్రహ్మానందం పొందినాడు. ఆ ఆనందంతో ఒక వధూమణి (రుక్మిణీదేవి) మందిరాన్ని ప్రవేశించాడు. ఆ మందిరంలో యువతులు వింజామరలు వీస్తూవుండగా హంసతూలికాతల్పంమీద రుక్కిణీదేవితోగూడి అనేక వినోదాలతో ఆనందిస్తూవున్న శ్రీకృష్ణుని చూచాడు. ఆ మహనీయ దృశ్యాన్ని దర్శింపగాదే ఆతని కన్నులనుండి ఆనందబాష్పాలు పెల్లుబికి ప్రవహింపసాగాయి.

నల్లకలువల వంటి దేహచ్చాయగలవాడు, దేవేంద్రునిచే భక్తితో నమస్కారం చేయబడేవాడు, దయకు నిలయమైనవాడు, ప్రకాశించే చెక్కిళ్లుగలవాడు, కౌస్తుభమణిని ధరించినవాడు, భక్తులైనవారికి కల్పవృక్షమైనవాడు, మిగుల ఆకర్షణీయమైన సౌందర్యంతో విలసిల్లేవాణ్ణి, దేవతలందరికీ దిక్కైనవాణ్ణి, సింహమధ్యముణ్ణి, సకలలోకాలలోనూ పూజనీయుడు, మహాసుదర్శనాయుధుడు, విశ్వవిఖ్యాతుడు, గరుడవాహనుడు, పీతాంబరధారి, శేషశాయి, అరవిందనేత్రుడు, మకరకుండలాలంకారుడు, మధురభాషణుడు, సాటిలేని సుందరస్వరూపుడు, క్షీరసాగరంలో విహరించేవాడు, సమస్తసద్గుణసముపేతుడు, యాదవకులమనే సాగరానికి పున్నమి చంద్రుడైనవాడు, తేజశ్శాలి, జయశీలుడు, సహనస్వభావుడు, శ్రీమన్నారాయణుని అవతారమైనవాడు అయిన శ్రీకృష్ణుణ్ణి కుచేలుడు సంతోషంతో సందర్శించాడు.

నిరంతర దారిద్య్రపీడితుడూ, కృశించిన శరీరంకలవాడూ, చినిగిపోయిన వస్త్రం కట్టుకొన్నవాడూ, ఆశాపూరిత చిత్తుడూ, పరిహాసానికి స్థానంగా ఉన్నవాడూ, చినిగిన పైపంచెను కప్పుకొన్నవాడూ ఐన కుచేలుడు తనవద్దకు వస్తూవుండగా అల్లంత దూరంలోనే చూచి, శ్రీకృష్ణుడు గౌరవభావంతోకూడిన తొందరతో గబగబా పానుపునుండి దిగాడు.

శ్రీకృష్ణుడు అతిశయించిన ఆదరభావంతో కుచేలునికి ఎదురుగా వెళ్లి, అతణ్ణి ఆప్యాయతతో కౌగిలించుకొన్నాడు. బంధురీతితోగూడిన స్నేహం ఉట్టిపడేలాగున తోడ్కొని వచ్చి, తనపాన్పుపై కూర్చుండబెట్టాడు.

కుచేలుడు తల్పంమీద కూర్చుండిన పిదప శ్రీకృష్ణుడు బంగారుకలశంలోని నీళ్లతో ఆయన పాదాలను కడిగాడు. ఆ విధంగా కడిగినజలాన్ని భక్తితో తలమీద చల్లుకొన్నాడు.

శ్రీకృష్ణుడు కస్తూరీ, పచ్చకప్పురమూకలిపిన మంచిగంధాన్ని కుచేలుని శరీరానికి దట్టంగా పూసి, మార్గాయాసం తీరేలాగున స్వయంగా వీవన వీస్తూ, మణిమయాలైన దీపాలతో (మిత్రునికి మంగళదాయకంగా) హారతియిచ్చాడు.

శ్రీకృష్ణుడు కుచేలుని సిగలో పూలమాలలు ముడిచి, కర్పూరతాంబూలం ఇచ్చి, పాడియావును సమర్పించి, ప్రియమార కుశలమడిగాడు. గోవిందుడు చేసిన ఆ గౌరవానికి కుచేలునిశరీరం పులకించి, కనులనుండి ఆనందబాష్పాలు జలజల ప్రవించాయి. ఆ దేవదేవుని ప్రియపత్ని పట్టపురాణి అయిన రుక్మిణీదేవి కరకంకణాలు మనోజ్ఞంగా ధ్వనిస్తూ ఉండగా వింజామర వీచింది. ఆ చల్లని మెల్లని గాలికి కుచేలుని చెమట ఆరిపోయి, శ్రమ తొలగి, హాయి కలిగింది. ఆ దృశ్యాన్ని చూచి అంతఃపురంలోని కాంతలు ఆశ్చర్యంతో ఇలా అనుకొన్నారు.

ఈ బ్రాహ్మణోత్తముడు మునుపటి జన్మలో ఎటువంటి తపస్సు చేశాడో కదా! యోగిజన వందనీయుడైన లక్ష్మీనాథుని పానుపుపై కూర్చొని ఉన్నాడు. ఎంతగొప్ప మునీశ్వరులైన ఈ మహాత్మునికి సాటిరారు కదా!

యోగీశ్వరులు ఈ మహనీయునికి సమానులు కాజాలరనే విషయంతోపాటుగా

తన ప్రియపత్నియైన రుక్మిణీదేవి తనతోపాటుగా ఆసీనురాలైయున్నప్పటికీ, ఎటువంటి భేదభావన లేకుండా శ్రీకృష్ణుడు వెంటనే లేచి, ఈ భూసురునికి ఎదురేగివెళ్లి, ప్రేమతో కౌగిలించుకొన్నాడు. తగినట్లు సత్కారాలుచేసి ఎంతో వినయంతో సేవించాడు. నిజంగా ఈ విప్రుడు ఎంతటి అదృష్టశాలియో కదా!

అని అంతఃపుర కాంతలు పరస్పరం అనుకొంటూ ఉన్న సందర్భంలో

అంతపురకాంతలు అలా అనుకొంటూ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు ప్రేమతో కుచేలునిచేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. తాము గురుకులవాసం చేసిన రోజుల్లో జరిగిన విశేషాల్లో కొన్నిటిని ప్రస్తావించాడు. నిపుణతతో మళ్లీ

'భూసురశ్రేష్ఠా! వేదాధ్యయనంలోనూ, అధ్యాపనం(వేదాన్ని అభ్యసింపచేయటం) లోనూ నేర్పరులైన వారియింట జన్మించిన నీ పత్ని సద్గుణవతియై నీకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నదా? ఇంతకూ నీ మనస్సు ఇల్లూ, పొలాలూ, సంపదా, భార్యా, బీడ్డలూ - మొదలైన ఇహలోకవిషయాల యొడల లగ్నమై ఉన్నట్లుగా తోచటంలేదు. ఈ లోకక్షేమంకోసం నేను విధ్యుక్తకర్మల ఆచరిస్తూ ఉన్నరీతిగా, కొంతమంది సజ్జనులు మాయతో గూడిన ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ, శ్రేష్ఠమయిన కర్తవ్యాలను మాత్రం ఆసక్తితో ఆచరిస్తూ జీవిస్తారు.'

అని పై రీతిగా పలికి, శ్రీకృష్ణుడు మళ్లీ కుచేలునితో ఇలా అన్నాడు.

శ్రీకృష్ణుడు కుచేలునితో ఇంకా ఈ విధంగా పలికినాడు. 'మనం గురువుగారిఇంటిలో ఉండి విద్యాభ్యాసం చేసేకాలంలో ఆయనవల్ల సమస్త విషయాలను తెలుసుకొన్నాము; అంతేగాక, పరతత్త్వాన్ని గూర్చికూడా ఆ గురువర్యుడు మనకు బోధింపగా చక్కగా తెలుసుకోగలిగాము. ఈ విషయాలన్నీ నీకు జ్ఞాపకంలో ఉన్నాయా? మిత్రమా!'

గురుకులంలో తాము అభ్యసించిన జ్ఞాన, విజ్ఞానాల్ని గురించి, జ్ఞాపకం చేసి, అనంతరం గురువుగారిని ప్రస్తుతింపదలంచి శ్రీకృష్ణుడు కుచేలునితో ఇలా అన్నాడు.

మన గురువరేణ్యుడు అజ్ఞానమనే అంధకారానికి గొప్ప దీపంలాంటివాడు. బ్రహ్మానంద అనుభవంలో నిమగ్నమైన చిత్తం కలవాడు. సత్కర్మపరాయణుడు. పుణ్యాత్ముడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడు. సజ్జనుల ప్రశంసలందుకునే మహనీయుడు.

నేను సకలజనులకూ విజ్ఞానాన్నిచ్చే జగద్గురువునై ఉండీ కూడా, నాలుగుజాతులందలి, నాలుగుఆశ్రమాలలోని ప్రజలందరికీ గురుసేవనం ఆచరించవలసిన ఉత్తమధర్మమని ప్రబోధించేందుకే, మనగురువుగారిని సేవించాను.

లోకంలోగల బ్రాహ్మణులందరికీ అత్యంత ఆప్తుడనై సకలవర్ణాలకూ, సమస్తాశ్రమాలకూ ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించేవాడినై శ్రేష్ఠుడగు గురువర్యుడినై సర్వత్ర శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉంటాను.

సమస్తానికి గురువర్యుడనైన నాఉపదేశాన్ని అంగీకరించి, నా పాదపద్మాలను ధ్యానించుటయందే అమితమైన ఆసక్తిగలవారు ఈ సంసారసాగరాన్ని శీఘ్రంగా దాటి, మోక్షాన్ని పొందుతారు. అన్ని వర్ణాలలోనూ, ఆశ్రమాలలోనూ అలాంటివారలే పరమార్ధాన్ని తెలిసిన పండితులు.

సమస్త ప్రాణులలోను ఆత్మయైయున్న నేను తపస్సు, వ్రతాలు, యజ్ఞాలు, దానాలు, ఇంద్రియనిగ్రహం - మున్నగు ఆచరణలవల్ల అంతగా సంతోషించను; మరేమంటే భక్తితో గురువర్యుణ్ణి సేవించేవారిని చూచి ఎంతో సంతోషిస్తాను. ఈ విధంగా పలికి, శ్రీకృష్ణుడు కుచేలునితో ఇంకా ఇలా అన్నాడు. 'మనం గురువుగారిఇంటిలో ఉన్నకాలంలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం వంటకట్టెలు తీసుకొనిరావటానికి అడవికి వెళ్లాము. అది గుర్తుందికదూ! ఆ సందర్భంలో మనం అడవికి వెళ్లిన ఆ వేళలో గొప్పధ్వనులతో ఉరుముతూ ఆకాశమంతటా కారుమబ్బులు ఆవరించాయి. గాలివాన గొప్పవేగంతో వీచి, అడవిలోని వివిధజంతుసమూహాలను నిలువనీయకుండా చెల్లాచెదురు చేశాయి. వర్షధారలు దిగజాల తొండాలంత పరిమాణంతో పడుతూ భూమిని ముంచివేశాయి. సూర్యకిరణాలను మించిన కాంతితో ప్రకాశిస్తూ మెఱుపులు మిఱుమిట్లు గొలిపాయి. అంతలో సూర్యుడు అస్తమించగా చీకట్లు ఎంతో దట్టంగా అలముకొన్నాయి ఏ వస్తువుకూడా కంటికి కనబడటంలేదు. అటువంటి ఆ జడివానలో మనమిద్దరం తడిసి ముద్దయిపోయి

బయలు ప్రదేశంగాని, సందుగానున్నచోటుగాని, ఎత్తుగాని, పల్లంగాని, లోతులేని ప్రదేశంగాని, లోతుగల ప్రదేశంగాని గుర్తింపవీలుగాకుండిన ఆవాననీటిలో ఆ చీకటిరాత్రిలో మనం ఒకరిచేతిని మరొకరు గట్టిగా పట్టుకొని ఆ అడవిలో నడిచాము కదా!

నిరంతరం వీస్తూవున్న తీవ్రమైన ఆ చలిగాలులకు మనదేహాలు వణకి దొడగాయి. అందువల్ల మనం దారి తెలియక, దిక్కుతోచక ఆ అడవిలో అటునిటు సంచరింపసాగాము. అలా సంచరిస్తూ ఉండగా, ఎట్టకేలకు సూర్యోదయం అయింది.

తెల్లవారగానే పక్షుల కలకలధ్వనులు అంతటా వ్యాపించాయి. సూర్యుడు ఉదయింపగానే ధవళకాంతులు దిక్కులందంతటా నిండిపోయాయి.

అప్పుడు మన గురువర్యుడైన సాందీపుడు మనలను వెదకుకొంటూ అడవికి వచ్చాడు. వాననుండీ, చలినుండీ కొంచెం తేరుకొని ఉన్న మనల్ని చూచి చింతిస్తూ ఈ విధంగా అన్నాడు.

'అయ్యో! శిష్యులారా! మా కోసమై ఈ విధంగా అడవికి వచ్చి చాలా బాధపడినారు. దీనివల్ల మీరు గురు ఋణం తీర్చుకొన్నవారైనారు. కనుక ఇకపై మీ కిరువురకు అతిశయించిన ధన, బంధు, దార, బహుపుత్ర సంపదలూ, దీర్ఘాయు, రున్నతులూ, విజయశ్రీలూ సమకూరగలవు' (అని ఆశీర్వదించినాడు).

అలాగా దీవించి సాందీపని వాత్సల్యంతో మనలను తన మందిరానికి పిలుచుకొని వెళ్ళాడు. ఈ సంగతులన్నిటినీ నీవు ఎప్పుడైనా మనస్సులో అనుకుంటూ ఉంటావా? అని అంటూ, శ్రీకృష్ణుడు కుచేలునితో మళ్లీ ఈ విధంగా పలికాడు.

పుణ్యాత్మా! మనం గురుకులంలో వేదాధ్యయనం చేస్తూ ఉండిన దినాలలో పరస్పరం స్నేహంతో, వాత్సల్యంతో చేసిన పనులన్నిటిని నీవు మఱచిపోలేదు కదా! - అని మాధవుడు తను చిన్ననాటి ముచ్చట్లను ఉదాహరిస్తూ పల్కిన మధుర వాక్యాలను విని కుచేలుడు సంతోషించినవాడై, ఇలా అన్నాడు.

'నిర్మలచరిత్రుడవైన పద్మనాభా! విద్యాభ్యాసంనిమిత్తమై మనం గురువుగారిగ్భహంలో నివసించినకాలంలో సంతోషంతో ఆచరింపని కార్యాలంటూ ఉన్నాయా? అవి అలా ఉండనీ! ఇప్పుడు నేను మనవిచేసేది చిత్తగించు.

శ్రీకృష్ణదేవా! మూడులోకాలకూ గురువర్యుడవైన నీకుకూడా మరొక గురువు దగ్గర చేరి అధ్యయనం చెయ్యటం, నీవు ఆయనకు శిష్యుడివి కావటం - ఇదంతా చూస్తే లోకులకు ఆదర్శంగా ఉండేందుకై నీవు లోకాన్ని అనుకరించటమేగాని, వేఱొకటి కాదుకదా! (ఇవన్నీ నీ లీలలే కదా!).

కుచేలుడు సాభిప్రాయంగా పలికిన పలుకులు విని సమస్తభావవేత్త అయిన శ్రీకృష్ణుడు వాటిలోని ఆంతర్యాన్ని గ్రహించాడు. చిఱునగవుచే అందగించిన ముఖకమలంకలవాడై 'మిత్రమా! నీవిచ్చటికి వస్తూ భక్తిభావంతో నాకేమి కానుక తీసుకొని వచ్చావు? నీవు తెచ్చిన ఆ కానుక కొంచెమైనా సరే, దాన్ని పదివేలరేట్లుగా స్వీకరిస్తాను. నా యందు భక్తిలేని నీచుడు మేరుపర్వతమంతటి పదార్ధాన్ని తెచ్చియిచ్చినా అది నాకు ప్రియమైంది కాజాలదు'- అని

'మిత్రమా! నిశ్చలమైన భక్తిభావంతో నన్ను సేవించే జనులు పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా సరే! నాకు సమర్పిస్తే, దాన్ని రుచికరమైన ఆహారంగా స్వీకరించి, పరమప్రీతితో ఆరగిస్తాను' - అని శ్రీకృష్ణుడు కుచేలునితో అన్నాడు.

అని శ్రీకృష్ణుడు పల్కిన వినయంతో కూడిన పల్కులకు కుచేలుడు ఎంతో ఆనందించాడు. కాని, తాను తెచ్చిన అటుకులను శ్రీకృష్ణునికి అర్పించజాలక సంకోచిస్తూ తలవంచి మౌనంగా ఉండినాడు.

శ్రీకృష్ణుడు తన దివ్యచిత్తంతో కుచేలుని రాకకుగల కారణాన్ని తెలుసుకున్నాడు. “పూర్వజన్మలో ఈ భూసురుడు ఐశ్వర్యంకోసం నన్ను సేవించలేదు. ఇప్పుడు తన భార్యసంతోషంకోసం నా వద్దకు వచ్చాడు. కనుక ఈతనికి ఇంద్రాదులకుసైతం లభించని అనేకసంపదలను ఈ క్షణంలోనే ప్రసాదించాలి” - అని భగవానుడు నిశ్చయించుకొన్నాడు.


కుచేలుని చినిగిన ఉత్తరీయం అంచులో ముడివైచి ఉన్న చిన్న అటుకుల మూటను గమనించి 'ఇదేమిటి?' - అని అడిగి, ఆ మూటను విప్పి, ఒక పిడికెడు తీసుకొన్నాడు. 'నాకూ, ఈ సమస్త లోకాలకూ సంతృప్తి నీయటానికి ఇవి సరిపోతాయి' - అని తలంచి కృష్ణుడు వాటిల్ని ఆరగించాడు.

శ్రీకృష్ణుడు పిడికడు అటుకులను ఆరగించిన పిదప, కుతూహలంతో కుచేలుని ఉత్తరీయం కొంగులో ఉండే మూటలో ఇంకొక పిడికడు అటుకులు తీసుకొంటూ ఉండగా, అప్పుడు రుక్మిణీదేవి తన పతిదేవునిహస్తాన్ని గట్టిగా పట్టుకొనింది.

'ముల్లోకాలకు సమస్త సంపదలను అనుగ్రహించే దేవదేవుడవైన శ్రీకృష్ణదేవా! ఈతనికి సమస్త సంపదలను అందించటానికై ఇంతకు ముందు మీరు తినిన పిడికెడు అటుకులే చాలు! కాబట్టి, ఇకపై భుజించకండి!' - అని రుక్మిణీదేవి భర్తను వారించింది.

(రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి రెండవ పిడికెడు(అటుకలను) భక్షింపనీయకుండా నివారించటానికిగల కారణాన్ని సంస్కృత భాగవతంయొక్క వ్యాఖ్యాతలు సముచితమైన రీతిలో వివరించారు. మొదటి పిడికెడు అటుకులతోనే ఆతనికి ఇహలోక పరలోకాలకు రెండిటికి సంబంధించిన సకల సంపదలూ సిద్ధించాయి. అటుపై రెండవ పిడికెడు అటుకులను గనుక భుజించినట్లైతే, సాక్షాల్లక్ష్మీదేవియే ఆతని అధీన కావలసివస్తుందని, అందువల్ల అలా చేయవద్దనీ లక్ష్మీదేవియొక్క అవతారమైన రుక్మిణీదేవి అలా స్వామిచేతిని పట్టుకొన్నది.)

కుచేలుడు ఆ రాత్రి శ్రీకృష్ణునిమందిరంలో ఎంతో రుచికరాలైన అనేకఆహారపదార్థాలను ఆరగించాడు. మెత్తని పాన్పుపై నిద్రించాడు. తాను గొప్పస్వర్గభోగాన్ని పొందిన భాగ్యవంతుడిగా భావించాడు. తెల్లవారగానే ఆతడు కాలోచిత కృత్యాలను నిర్వర్తించుకొని, తన ఊరికి బయలుదేరాడు. శ్రీకృష్ణునిచే కొంత దూరం సాగనంపబడి, వెళుతూ, గోవిందుణ్ణి సందర్శించి నందువల్ల కలిగిన అతిశయించిన ఆనందంతో తన మనస్సులో ఇలా అనుకోసాగాడు.

నేను ఈ తరుణంలో పుణ్యాలరాశీ, ప్రశాంతస్వభావుడూ, అచ్యుతుడూ, సర్వవ్యాపకుడూ, బ్రాహ్మణహితం కోరేవాడూ, జ్ఞానస్వరూపుడూ, పరాత్పరుడూ - అయిన పురుషోత్తముణ్ణి కన్నులార కనుగొన గలిగాను. నిజంగా నేను చేసుకొన్న పుణ్యం ఎంత గొప్పదోకదా!

కుచేలుడు తన మనస్సున ఇంకా ఈ రీతిగా భావించాడు. “నిఱుపేదనైన నే నెక్కడ? జగదీశ్వరియైన శ్రీదేవికి నిత్య నివాసమైన వాసుదేవుడెక్కడ? ఆ నందనందనుడు నన్ను తన తోబుట్టువుతో సమానునిగా భావించి, అనురాగంతో కౌగిట చేర్చినాడు. దేవునిగా భావించి, తన పాన్పుపై కూర్చుండజేసి పరిచర్యలు కావించాడు. ఆయనపత్ని నాకు వింజామర వీచి నాబడలికను పోగొట్టింది. సాక్షాత్తు లక్ష్మీదేవియైన రుక్మిణిని సంభాళించిన అరచేతులతో ఆప్యాయంగా నా పాదాలు ఒత్తి ఆదరించాడు కదా!

నన్ను అలాగ ఆదరించాడు కనుకనే

ఈ రీతిగా నన్ను ఆదరించిన శ్రీకృష్ణుడు నాకు ధనం ఏమాత్రం ఇవ్వలేదు. దరిద్రుడు సంపన్నుడైతే ఆ సంపదవల్ల అహంకారంతో అంధుడై తనను సేవించడని తలచినాడు కాబోలు! లేకుంటే ఆశ్రితజనుల ఆర్తిని నివారించే ఆ అపార కృపాసముద్రుడు తన భక్తుడైన నన్ను సకలసంపదలతో పరిపూర్ణునిగా చేయకుండా ఉంటాడా? తప్పక చేసి ఉండేవాడే!

(శ్రీకృష్ణుడు తనకు సంపదలను ప్రసాదించకపోవటానికిగల కారణాన్ని ఊహించటంలో, భక్తి భరితమైన ఆయన శీలం వెల్లడవుతున్నది.)

కుచేలుడు పైరీతిగా తన మనస్సులో ఆలోచన చేస్తూ తన పురాన్ని చేరుకున్నాడు.

కుచేలుడు తనయెదుట సూర్యచంద్రుల ప్రభలతో ప్రకాశించే సువర్ణమయాలైన, చంద్రకాంతశిలానిర్మితాలైన భవనాలూ, చిలుకలు, కోయిలలు, నెమళ్లు మున్నగువాటికూజితాలలో విలసిల్లుతున్న ఉద్యానవనాలూ, వికసించిన పలురకాల పద్మాలతో, కలువపూలతో కన్నులపండువు కావిస్తూవున్న సరోవరాలూ, మణిమయ కనక కంకణాలు, రకరకాల భూషణాలు ధరించిన దాసదాసీ జనులూకలిగి వెలుగొందే మహోన్నతమందిరాన్ని చూచి ఆశ్చర్యపడినాడు. ఇది ఏ పుణ్యాత్ముని నివాసభవనమో? సిరిసంపదలకు నిలయమై అపూర్వంగా ప్రకాశిస్తూందని కుచేలుడు భావించాడు.

కుచేలుడు తనయెదుట నూతనంగా గోచరించిన అపూర్వసౌధాన్ని చూచి 'ఈ మహనీయసౌధం ఏ పుణ్యాత్ముని నివాస మందిరమో కదా!' అని ఆలోచిస్తూ ఉండినాడు. ఆ సందర్భంలో

“ఆ సమయంలో దేవతాస్త్రీలను పోలిన యువతులు కుచేలునివద్దకు వచ్చి ఈ మందిరంలోనికి వేంచేయండి” అని ఇంపుగా పలుకుతూ మనోజ్ఞాలైన సంగీతన్ఫత్యనాట్యవాద్యాలతో మంగళకరమైన శబ్దాలు ప్రసరిస్తుండగా వైభవోపేతంగా అలంకరించిన మందిరంలోనికి పిలుచుకొని వెళ్లారు.

కుచేలుడు ఆ విధంగా యువతీమణులవెంట అంతఃపురంలోనికి విచ్చేసిన పిదప, ఆయన భార్యయైన ఉత్తమ సతీమణి తన మనస్సునందు ఎంతో సంతోషించింది.

పతివ్రతాశిరోమణియైన కుచేలుని యిల్లాలు తన వల్లభుని రాకను తెలుసుకొని ఎంతో సంతోషంతో ఎదురు వచ్చింది. మానవరూపాన్ని ధరించిన మహాలక్ష్మిలాగా విలసిల్లుతూ ఉన్న ఆమెకడగన్నుల నుండి ఆనందబాష్పాలు రాలుతుండగా భర్త పాదాలకు మనస్సులో నమస్కరించి, భావంలో కౌగిలించుకొనింది. దివ్యాంబరాలు, దివ్యాభరణాలు ధరించి మన్మథుని బాణాలలాగా ఉన్న పరిచారికల సేవలందుకొంటూ ఐశ్వర్యశోభతో తులతూగుతూ ఉన్న తన ధర్మపత్నిని కుచేలుడు చూచి

ఉత్తమ దంపతులైన కుచేలుడూ, ఆయన ధర్మపత్నీ అన్యోన్యమైన అనురాగం విలసిల్లగా శ్రీకృష్ణునికృపతో లభించిన అంతులేని ఐశ్వర్యంతో నిత్యానందాన్ని పొందుతూ

ఎర్రని పద్మరాగమణులు తాపిన చిరుకంబాలు, తెల్లని సృటికశిలా నిర్మితాలైన గోడలు, గరుడపచ్చలు చెక్కిన నవరత్నాల వాకిళ్లు, ఇంద్రనీల మణులు తాపిన గవాక్షాలు, చంద్రకాంత శిలావినిర్మిత వేదికలు, హంసతూలికాతల్పాలు, సువర్ణ మయాలైన శయనశాలలు, సిరులొలికే ఉన్నత భద్రపీఠాలు, పల్లకీలు, ఆవశ్యకాలైన ఉత్తమవస్తువులతో, సమస్త సంభారాలతో పరిపూర్ణాలై విలసిల్లుతూవున్న వాడలు - వీటన్నింటితో విరాజిల్లుతూవున్న మందిరాన్ని కుచేలుడు (సతీసతుడై) ప్రవేశించి

కుచేలుడు నూతనమందిరంలో సతీసమేతంగా సుఖంగా నివసిస్తూ, మనస్సులో ఇంద్రియవికారాలు కలుగకుండా ప్రవర్తిస్తూ, తనలో తాను ఇలా అనుకొన్నాడు : 'ఇంతకాలం అంతులేని పేదరికం అనే దుఃఖసముద్రంలో మునిగి ఉండిన నాకు చివరిదశలో ఈ ఐశ్వర్యం లభించింది.

పరిశీలించినట్లైతే శ్రీకృష్ణుని దయావీక్షణంవల్లనే నాకు క్రొత్తగా ఈ ఐశ్వర్యాలన్నీ సంప్రాప్తించాయి. ఈ సంపదలను కోరటానికే కదా కుచేలుడనైన నేను ఆ శ్రీహరిసన్నిధికి వెళ్లటం!

సంపదలను అర్ధిస్తూ నేను ఆ శ్రీహరి వద్దకు వెళ్ళాను. ఆ దేవదేవుడు నా సంగతి తెలిసికూడా నన్నేమీ అడుగలేదు. నన్ను వీడ్కొలిపి సాగనంపి, తరువాత నాకు ఈ సంపదలు ప్రసాదించి, నన్ను వీటికి అధీశుణ్ణి చేశాడు. ఆయన ఎంతటి దయామయుడోకదా!

అటువంటి దయామయుడైన పురుషోత్తముడు భక్తిభావ తత్పరులైన సత్పురుషులు సమర్పించిన వస్తువు కొంచెమైనా, దాన్ని కోటిరెట్లుగా భావించి, స్వీకరించి, భక్తజనులను ఆదరిస్తా డనటానికి నావృత్తాంతమే నిదర్శనం. మలినమైన నా శరీరాన్నీ జీర్ణవస్త్రాల్నీ చూచి ఆ శ్రీకృష్ణుడు ఏ మాత్రం ఏవగించుకొనక, నావద్దనుండిన అటుకులను ప్రీతితో భుజించి, నన్ను ధన్యుణ్ణి చేశాడు. ఇలా చెయ్యటంలో అచ్యుతుని నిర్హేతుకవాత్సల్యం వెల్లడౌతున్నది. అంతటి దయాసముద్రుడైన గోవిందుని చరణకమలాలపై పరిపూర్ణమైన భక్తినాకు ప్రతిజన్మలోనూ కలుగుగాక!' - అని యీరీతిగా భావించి హరిస్మరణ తత్పరుడై కుచేలుడు తన ధర్మపత్నితో గలసి జీవించాడు. భోగాలయెడల ఆసక్తి లేనివాడై, రాగద్వేషాదిద్వంద్వాలకూ, అరిషడ్వర్గాలకూ అతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారసపానంతో తన్మయుడై, భవబంధాలను పాసి, మోక్షాన్ని పొందినాడు.

దేవదేవుడూ, అఖిలభావవేత్తా, ఆశ్రితవరదుడూ అయిన వాసుదేవునికి బ్రాహ్మణులు దైవస్వరూపులు. అందువల్లనే భూలోకంలో బ్రాహ్మణులకంటే వేఱొకదైవం లేడు.

(శ్రీకృష్ణుడు బ్రాహ్మణోత్తములను దైవస్వరూపులుగా ఆదరించే స్వభావంకలవాడు కావుననే, కుచేలునికి అఖండమైన ఐహికాముష్మిక సంపదలను ప్రసాదించినా డని సారాంశం.)

ఫలశ్రుతి:
పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణదేవుడు కుచేలుడనే విప్రపుంగవుణ్ణి చరితార్థుణ్ణి గావించిన పవిత్ర చరిత్రను విన్న సత్పురుషులకు ఇహ, పరసుఖాలూ, హరిభక్తీ, యశస్సూ సంప్రాప్తిస్తాయి.

(ఇది కుచేలోపాఖ్యానం చివర చెప్పబడిన ఫలశ్రుతి ఇలాగే, భాగవతంలోని చాలా ఉపాఖ్యానాలకు ఇటువంటి ఫలశ్రుతులు పేర్కొనబడి వుండటం ముఖ్యమైన విశేషం!)


శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Balaramudu Teerdhayatraku Januta - బలరాముడు తీర్థయాత్రకు జనుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - బలరాముడు తీర్థయాత్రకు జనుట

ఆ విధంగా బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరి మొదట ప్రభాసతీర్దానికి వెళ్లి, పుణ్యస్నానం ఆచరించి, ప్రీతితో దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. 

బ్రాహ్మణోత్తములు వెంటరాగా, సరస్వతీనది, బిందు సరోవరం, వజ్రతీర్ధం, విశాలానది, సరయూనది, యమున, గంగ మున్నగుపుణ్యనదుల్లో స్నానాలు చేసి, దేవ, ఋషి పితృగణాలకు తర్పణాలు నిర్వహించాడు. బ్రాహ్మణ శ్రేష్ఠులకు సంతర్పణలు చేశాడు. 

అనంతరం సమస్తలోకాలకు స్తుతి పాత్రమైందీ, సకల మునిసమాజానికి నివాసమూ - అయిన నైమిశారణ్యంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఆ మునీశ్వరులు సుదీర్ఘకాలికమైన సత్రయాగాన్ని నిర్వహిస్తున్నారు.

వారందరూ బలరామునికి భక్తితో ఎదురేగి, వినయంతో స్వాగతం పలికి, అతిథి సత్కారాలు ఆచరించారు. అందుకు ఆనందించి, బలరాముడు సపరివారంగా ఆసీనుడైనాడు.

(“ప్రభాసము” ; సౌరాష్ట్రదేశంలో సరస్వతీనది పడమటిసముద్రంలో కలిసేచోట వెలసియున్న పుణ్యతీర్థం. చంద్రుడు ఈ నదిలో స్నానంచేసి, తనకృశత్వాన్ని వదిలించుకొని ప్రభాసుడైనాడు. ఇందువలన ఆ తీర్థానికి 'ప్రభాస తీర్ధ'మనే నామధేయం సార్ధకంగా ఏర్పడింది.

ఆ సమయంలో తక్కిన మునులలాగా తన కెదురేగి వచ్చి నమస్కారాది సముచిత కార్యాలను చెయ్యకుండా ఉన్నతా సనంమీద అలాగే కూర్చుండిన ప్రజ్ఞాసముపేతుడైన సూత పౌరాణికుణ్ణి

(“జ్ఞానవయోవృద్దుడు వచ్చినప్పుడు యువకుడుగా ఉన్నవాడి ప్రాణాలు నిలువున పైకి పోవడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి, చిన్నవయస్సులో ఉన్నవాడు కూర్చున్నస్థానం నుండి లేచి, ఎదురేగి నమస్కరించి, మర్యాద చేయడంవలన ఆ ప్రాణాలు పోకుండా నిలుస్తాయి.” అని మనుధర్మశాస్త్రం సూచించింది.)

సూతుడు తనను జూచి లేవనందుకు బలరాముడు కోపించాడు. వెంటనే అచ్చటి ఋషులను చూచి ఇలా పల్కాడు 'వీడు మహర్షులసభలో తానే పెద్దగా భావించి, దురభిమాని ఐనాడు. వ్యాసునివద్ద కొన్ని కథలూ, గాథలూ నేర్చుకొని విద్వాంసుడినని విర్రవీగుతున్నాడు. విద్య ఇలాంటి అల్పులలో గర్వాన్నే పెంచుతుందిగాని సత్త్వగుణాన్ని పెంపొందించదు కదా! ధర్మాన్ని సంరక్షించేందుకై అవతరించిన మాకు ఇలాంటి దుష్టుల్ని శిక్షించడం అవశ్యకర్తవ్యం' - అని పలుకుతూ తన చేతిలోగల దర్భపోచయొక్క కొనతో సూతుణ్ణి సంహరించాడు. అది చూచి అక్కడి మునీంద్రులందరూ హాహాకారాలు చేశారు. అనంతరం బలరామునితో ఇలా పల్కినారు.

(సూతుడు : క్షత్రియునికి బ్రాహ్మణస్త్రీయందు జన్మించినవాడు; లేదా వైశ్యునికి క్షత్రియస్త్రీయందు జన్మించినవాడు సూతుడు. అందువల్లనే బలరాముడు సూతుజ్జి 'ప్రతిలోమజాతుడు' - అని పేర్కొనినాడు. ద్వాపరయుగంలోని భారతీయసమాజంలో సూతకులస్థులు విద్యావేత్తలైన పారాణికులుగా, యుద్ధనీతినిపుణులుగా, రథసారథులుగా ప్రముఖస్థానాన్ని వహించియుండినారు)

మహానుభావా! బలరామా! మా కందరికీ పురాణాలు వివరిస్తూ ఉన్న ఈ సూతునికి (ఈ యజ్ఞంపూర్తి అయ్యేదాకా) శ్రేష్ఠమైన బ్రహ్మాసనాన్ని మేమే ఏర్పరచాము. అందువల్లనే నీవు వచ్చినప్పుడు ఈతడు బ్రహ్మాసనంనుండి దిగలేదు. (అవతార పురుషుడవయిన) నీ మనస్సుకు ముందుగా ఈ విషయం తెలియకుండా ఉంటుందా? (ఉండదు కదా!)

దుష్టులను సంహరించే స్వభావంగల బలరామదేవా! తెలిసితెలిసీ నీవు బ్రహ్మహత్యాపాతకానికి పాల్పడినావు. ఈ పాప నివారణకు తగిన ప్రాయశ్చిత్తకార్యాన్ని వెంటనే ప్రారంభించవలసింది.

(సూతుడు పుట్టుకచేత బ్రాహ్మణేతరుడైనను నైమిశారణ్యఋషులు తమ తపశ్శక్తివల్ల ఉన్నతమగు బ్రహ్మాసనంపై ఆయన్ను కూర్చుండజేసినారు. ఆ విధంగా అతనికి బ్రాహ్మణత్వం ప్రాప్తించింది. ఆతణ్ణి సంహరించినందున బలరామునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొనింది.)

అంతేగాక, పరమపవిత్రుడవైన నీవే ధర్మాన్ని తప్పితే, ఇక మాన్పగలవారెవరు? కాబట్టి, నీవు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ధర్మానికి మనుగడ ఉండదు గనుక, నీవు ఇందుకు అనుగుణమైన ప్రాయశ్చిత్తాన్ని ఆలోచించు. అప్పుడు బలరాముడు వాళ్లతో ఇలా అన్నాడు. 'తొందరపడి ఈ పాపం చేశాను. దీనికి ప్రతిక్రియను మీరే తెల్పగలరు. నా యోగమాయా ప్రభావంచేత సూతుణ్ణి బ్రతికించి, దీర్ఘమైన ఆయుర్దాయంగల గొప్ప బలవంతుణ్ణిగా చేస్తాను. అది మీకు సమ్మతమేనా?' (అన్నాడు)

అప్పుడు ఋషులు ఇలా అన్నారు :

'దేవా! నీ అస్త్రప్రభావానికీ, మృత్యుదేవతకూ, మాకూ (మా సత్యవాక్కులకూ,) ఎటువంటిలోటు వాటిల్లకుండే విధంగా చేయవలసింది. అప్పుడు బలరాముడు మరల ఋషులతో ఇలా పల్కినాడు.

పరీక్షిన్మహారాజా! ఉదాత్తచరితుడైన బలరామదేవుడు నిశ్చయభావంతో ఋషుల నుద్దేశించి ఇలా పలికినాడు. “ఆత్మా వై పుత్ర నామాసి” - అనే పవిత్రమైన వేదవాక్యం ప్రసిద్ధమై ఉన్నది కదా! అందువలన

విద్వత్‌ శ్రేష్ఠులైన మునీంద్రులారా! నేను బతికిస్తున్న ఈతని పుత్రుడు నేటినుండి అధికమైన బలం, పరిపూర్ణమైన ఆయుస్సు, మంచి ఆరోగ్యం, చక్కని విద్యాప్రావీణ్యం గలిగినవాడై ఈ లోకంలో ప్రకాశిస్తాడు.

(1. బలరామదేవుడు తాను సంహరించిన సూతునినుండి తన యోగమాయాప్రభావంతో ఆతని పుత్రుని(మరియొక సూతుని) సృష్టించాడు. ఆతనికి అమితబలాన్ని ఆయుస్సును, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. 

చనిపోయిన తండ్రియగు సూతుని పేరు రోమహర్షణుడు; ఆతనినుండి సృష్టింపబడిన సూతుని పేరు రౌమహర్షణి (ఉగ్రశ్రవసుడు).

2. రోమహర్షణుడు సాక్షాత్తుగ జీవితుడు కాకపోవటంచేత బలరాముని అస్త్రానికి, మృత్యువునకు సత్యత్వం చేకూరింది. అలాగే సూతుడు పుత్రుని రూపంలో జీవించడంచేత, అతనికి బలం, ఆయుస్సు, ఆరోగ్యం చేకూరటంచేత ఋషీశ్వరుల వాక్కులకు సత్యత్వం సిద్ధించింది.)

బలరామదేవుడు సూతుణ్ణి ఆతని పుత్రుని రూపంతో బ్రతికించి మళ్లీ ఇలా అన్నాడు.

'నేను మీయెడల తెలియక చేసిన ఈ అపరాధం శాంతించే విధంగా, అందుకు ప్రాయశ్చిత్తంగా మీకు మిగుల ఇష్టమైన ఏదైన ఒక కార్యాన్ని చేస్తాను; సెలవీయండి!' అని పల్కగా ఆ మహర్షులు బలరాముణ్ణి చూచి

'బలరామదేవా! ఇల్వలుడనే రాక్షసుని కుమారుడు పల్వలుడు. వాడు బలగర్వితుడై పట్టుబట్టి ద్వేషంతో ప్రతియొక్క పర్వంనాడూ వచ్చి, మా యజ్ఞశాలలమీద మలమూత్రాలను, చీమునెత్తురులను, మద్యమాంసాలను కురిపించి, ఆ శాలల్ని పాడుచేస్తూన్నాడు.

కాబట్టి, ఆ దుష్టరాక్షసుణ్ణి సంహరించి మాకు సంతోషాన్ని కలిగించు అటు పిమ్మట నిర్మలచిత్తంతో సంచరిస్తూ పన్నెండుమాసాలు భారతవర్షంలోని వివిధపుణ్యతీర్థాల్లో పవిత్రస్తానాలు ఆచరించు! అందువల్ల సమస్తపాపాలు తొలగిపోతాయి అని వాళ్లు అంటూ ఉండగానే పర్వదినం వచ్చేసింది.

(మామూలు దినాల్లోకన్నా పర్వదినాల్లో యజ్ఞయాగాదులు ఆచరించటం అధికఫలదాయకమని త్రికాలజ్ఞులైన మహర్షిపుంగవుల నిశ్చయం.

పూర్ణిమ, అమావాస్య, రవిసంక్రాంతి, బహుళ అష్టమి, బహుళ చతుర్దశి - ఈ ఐదిటికి 'పంచపర్వము'లని వ్యవహారం. ఈ పంచపర్వాలలోను పూర్ణిమకు ప్రాధాన్యం చెప్పబడింది.)

పర్వదినం కావటంచేత నైమిశారణ్యంలోని మహర్షులు యజ్ఞకార్యానికి పూనుకొనటం పల్వలుడు పసికట్టాడు. వెంటనే వచ్చి ఆకాశంనుండి రక్తాన్ని మలమూత్రాలను, మద్యమాంసాలను కురిపించి, మున్యాశ్రమాలను నానాబీభత్సం కావించాడు. ధూళితో, రాళ్లతో, మట్టిగడ్డలతో నిండిన సుడిగాలులు వీచేలాగున చేశాడు. కాటుక కొండను పోలిన నల్లని భారీ శరీరం, క్రొత్తగా ఒలిచిన మానవచర్మాన్ని వస్త్రంగా చుట్టుకొని, ఎర్రనిగడ్డం, మీసాలు గలిగి, పెద్దముక్కూ మిడిగ్రుడ్లూ, నిప్పులు విరజిమ్మేచూపులు, వ్రేలాడుతున్నపెదవులూ, మిగుల పొడుగైన, భీకరమైన నాలుకా కలిగి, ముడివడినకనుబొమలతో అమితభయం గొల్పుతూ ఆకసంలో సంచరిస్తూ ఉండిన ఆ పల్వలుణ్ణి బలరాముడు చూచాడు.

పల్వలుడనే ఆ రాక్షసుడిచేతిలో యమదండంలాంటి శూలాయుధం తీవ్రంగా చూస్తూవుంది. ఆతనిదౌడలు మానవరక్తుచేత బాగా తడిసి ఉన్నాయి. వాడు అత్యధికమైన యుద్దోత్సాహంకలవాడుగా గోచరిస్తున్నాడు. వజ్రాయుధంలాంటి వాడికోరలనుండి నిప్పురవ్వలు వెలువడుతూ దిగంతరాళాన్ని ఆవరిస్తున్నాయి. వాడిమెడలోని తలల, ఎముకల హారాన్నిబట్టి ప్రాణుల్ని చంపడమే వాని స్వభావంగా వెల్లడవుతున్నది. అటువంటి భయంకరాకారుడైన రక్కసు
ణ్ణి బలరామదేవుడు చూచాడు.

ఆకాశంలో క్రొత్తకాంతులను విరజిమ్మే విధంగా గదను వేగంగా త్రిప్పుతూ, పల్వలుడు తనమీదికి రావటాన్ని బలభద్రుడు గమనించాడు. వెంటనే రాక్షస సంహారకార్యంలో సమర్థాలైన రోకలి, నాగలి - అనే తన రెండు ఆయుధాలను స్మరించాడు అవి తత్‌క్షణమే సూర్య సమాన తేజంతో బలరాముని యెదుట ప్రత్యక్షమయ్యాయి.

ఆ రీతిగా తాను సంకల్పించినవెంటనే తన వద్దకు చేరిన తన కార్యాన్ని సాధించే శక్తిమంతాలైన ఆయుధాలను రెండిటిని ధరించిన పిమ్మట

ఆ రీతిగా సాక్షాత్కరించిన తన ఆయుధాలను రెండిటిని అందుకొని బలరామదేవుడు ఆకాశంలో సంచరిస్తూవున్న పల్వలుని కంఠానికి తన ఎడమచేతియందలి నాగలిని తగిలించి, క్రిందికి లాగినాడు. వెనువెంటనే కుడిచేతిలోని రోకలితో వాని నడినెత్తిపై బలంగా మోదినాడు. ఆ దెబ్బకు దేవేంద్రుని వజ్రాయుధంవేటుకు ఱెక్కలు విరిగి పడ్డ కొండలాగా భుగభుగమను ధ్వనితో శరీరంనుండి నెత్తురు స్రవిస్తూవుండగా భూమిపై బోరగిలపడిపోయాడు.

ఆ విధంగా బలరాముని చేతిలో పల్వలుడు మృతి నొందిన పిమ్మట

పైవిధంగా పల్వలుడు కూలిపడటం చూచి, వృత్రాసురు
ణ్ణి సంహరించిన దేవేంద్రుణ్ణి దేవతలు వినుతించిన విధంగా నైమిశారణ్యమునీశ్వరులు బలరామదేవుణ్ణి అనేకరీతుల ప్రస్తుతించారు.

నైమిశారణ్యలోని మహర్షులు బలరామదేవుణ్ణి పుణ్యజలాలతో అభిషిక్తు
ణ్ణి కావించారు. సౌరభాలు వెదజల్లే సుందర పద్మమాలికతో అలంకరించినారు. అందమైన ఆభరణాలను, దివ్యవస్త్రాలను ప్రీతితో సమర్పించారు. మునీంద్రులకు ఆనందం కలిగేటట్లు బలరాముడు వాటిల్ని సముచితంగా ధరించాడు.

నైమిశారణ్య మునీశ్వరులచే సమ్మానితుడైన బలరాముడు దేవేంద్రునివలె భాసించాడు. బుద్దిశాలియైన ఆయన ఆ మునిసమూహాన్ని వీడ్కొని, విప్రోత్తములు కొందరు తనను సేవిస్తూ వెంటరాగా 'కౌశికి' అనే నదీతీరానికి

బలరాముడు కౌశికీనదిలో స్నానంచేశాడు. అక్కడ నుండి వెళ్లి సరయూనదిలో మునిగాడు. అటుపై ప్రయాగకేగి త్రివేణీ సంగమంలో దేవర్షి పితృతర్పణాలు నిర్వహించాడు. పులస్త్యాశ్రమంమీదుగా వెళ్లి గోమతీనదిని దర్శించి, గండకీ నదిని దాటి, సంసారబంధమోచనియైన విపాశలో పవిత్ర స్నానంచేసి, శోణనదంలోనూ, గయలోనూ మునుకలువెేసి, అటుపై గంగా సాగరసంగమ సందర్శనానంతరం మహేంద్ర పర్వతం చేరుకొన్నాడు.

బలరాముడు(నిరంకుశులైయున్న) క్షత్రియకులాన్ని తునుమాడినవాడూ, దయాది సమస్తసద్గుణాలకు నెలవైనవాడూ, సజ్జనులకు అలంకారమైనవాడూ, భృగువంశ జాతుడూ అయిన పరశురామస్వామిని మహేంద్రాచలంమీద సందర్శించినాడు.

బలరాముడు కుతూహలం విలసిల్లగా పరశురామదేవుణ్ణి సందర్శించి వందనం కావించాడు. అచ్చటినుండి మిగుల మనోహరమైయున్న సప్తగోదావరిని సందర్శించి, అందులో పుణ్యస్నానం కావించాడు.

(సప్తగోదావరి ; గౌతమి, వశిష్ట ఆత్రేయ, వైనతేయ, తుల్యభాగ, భరద్వాజ(విశ్వామిత్ర), జమదగ్ని - అనే పేర్లుగల ఏడు పాయలుగా చీలినందువల్ల గోదావరికి సప్తగోదావరం' అనే పేరు ప్రసిద్ధం.)

సప్తగోదావరిని సందర్శించిన అనంతరం బలభద్రస్వామి కృష్ణవేణీనదిని, పంపాసరోవరాన్ని తిలకించాడు. అటు పిమ్మట భీమరథీనది వద్ద కరిగి, అచ్చట నెలకొని ఉన్న సుబ్రహ్మణ్యస్వామిని సందర్శించాడు. ఆ తరువాత శ్రీశైలం, వేంకటాచలం, కాంచీపురి మొదలయిన పుణ్య క్షేత్రాలను చూచి, కావేరిని చేరి, ఆ మహానదిలో పుణ్యస్నానం కావించాడు.

(భరతఖండంలోని 18 శక్తిపీఠాల్లో కాంచీపురం ఒకటి.)

తనను శరణుపొందిన ఆశ్రితులనే క్షీరసాగరానికి పున్నమచంద్రుడైనవాడూ, పాపాలనే కాలకూటాన్ని కబళించే పరమేశ్వరుడూ, రాక్షసుల సంపదలను ఉపసంహరించేవాడూ, దేవతలచే వినుతింపబడిన అనంత నామధేయాలు గలవాడూ, అద్వితీయమయిన బుద్ది విశేషంచేత మనోజ్ఞంగా భాసించేవాడూ, సమస్తదేవతలకు సార్వభౌముడూ, కావేరీ మధ్యదేశంలో వేంచేసివున్నవాడూ అయిన శ్రీరంగనాథు
ణ్ణి బలరాముడు భక్తిప్రపత్తులతో సేవించాడు.

(కావేరీకొల్లడం నదుల మధ్య గల భూభాగానికి (ద్వీపానికి) 'రంగ'మని పురాణ ప్రసిద్ధి. ఆ 'రంగము' ను నివాసంగా గలిగి ఉన్నందున అచ్చట వెలసివున్న అర్చామూర్తికి 'రంగధాము'డని వ్యవహారం. 'ఇవతల కావేరి, అవతల కొల్లడము, నడుమనే శ్రీరంగనాథపురము' అని స్త్రీల పాటల్లో ప్రసిద్ధి.)

కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరమ్‌ |
సవాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదమ్‌ ॥
- గరుడపురాణమ్‌.

'రంగమునకు 'శ్రీరంగము' - అనేది పవిత్రమైన నామాంతరం.

ఇక్కడ సంస్కృతమూలంలో "శ్రీరంగాఖ్యం మహాపుణ్యం యత్రసన్నిహితో హరిః” - అని అర్ధశ్లోకంలో చెప్పబడిన విషయాన్ని భక్తకవీశ్వరుడైన బమ్మెరపోతన తెలుగున స్రగ్ధరావృత్తంలో పెంపొందించివుండటం విశేషం!

“స్రక్‌” - అనగా పూలదండ. “స్రగ్ధరా - అనగా పూలమాలను ధరించినట్లుగా ఉండే పద్యమని భావం.
అర్చామూర్తులలో అగ్రగణ్యుడైన శ్రీరంగనాథు
ణ్ణి వర్ణించటంలో మహాకవి ఈ పద్యాన్ని రచించడం సాభిప్రాయమైన విశేషం! శ్రీరంగనాథునికి ఆళ్వారులలో ప్రసిద్ధుడైన పెరియాళ్వార్‌ యావజ్జీవం చేసింది పుష్ప మాలాకైంకర్యమే! అంతేకాదు, పెరియాళ్వార్‌ పెంపుడు కూతురు గోదాదేవి చేసింది కూడా పుష్పమాలా కైంకర్యమే! కాబట్టి 'స్రగ్ధరా' వృత్తం సార్ధకం!)

బలరాముడు శ్రీరంగనాథు
ణ్ణి సందర్శించిన పిదప వృషభాద్రి, మధుర, సేతుబంధం దర్శించి, అచ్చటి బ్రాహ్మణులకు పదివేల పాడియావులను దానం చేశాడు. రామేశ్వరం మొదలైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చూచి, మలయాచలంఎక్కి అగస్య మునీంద్రునికి అభివందనం కావించి, కన్యాకుమారిని గాంచి, గోకర్ణక్షేత్రంలో పరమేశ్వరుణ్ణి సందర్శించాడు. తాపి, పయోష్ణి, నిర్వింధ్యానదులను దాటి, దండకారణ్యంలో ప్రవేశించి, క్రమంగా మళ్లీ ప్రభాసతీర్థం చేరినాడు. కౌరవపాండవయుద్ధంలో సమస్తరాజులూ హతులయ్యారనీ, భీమదుర్యోధనులు గదాయుద్దానికి సన్నద్దులౌతున్నారనీ ప్రభాసతీర్థమందలి బ్రాహ్మణులవల్ల తెలుసుకొన్నాడు. అందువల్ల వారిరువురినీ ఆ గదాయుద్దాన్నుండి నివారించేందుకు ఆ ప్రదేశానికి వెళ్లాడు.

బలరాముడు భక్తితో తనకు నమస్కరించిన శ్రీ కృష్ణుణ్ణి, పాండవులను చూచికూడా పలుకరింపలేదు. గదాయుద్దానికి సంసిద్దులౌతూవున్న భీమదుర్యోధనుల దగ్గరికే సరాసరి వెళ్లాడు.

బలరాముడు భీమ సుయోధనులను చూచి, దగ్గరకు వెళ్లి, వాళ్లతో ఇలా అన్నాడు.

అలా భీమదుర్యోధనులను సమీపించిన బలరాముడు వారితో ఇలా పల్కాడు. 'వీరశ్రేష్ఠులారా! మీలో ఒకడు(భీముడు) భుజబలంలో అధికుడు; మరొకడు(సుయోధనుడు) అభ్యాససంపదలో శ్రేష్ఠుడు. అందువల్ల మీరిద్దరూ గదాయుద్ధంలో సమానబలశాలురు. కనుక మీలో ఎవరూ ఎవరినీ గెలువలేరు. అలాంటప్పుడు ఊరక యుద్ధం చెయ్యడమెందుకు?' - అని. ఆ హితవచనాలు వాళ్లకు రుచించలేదు. అందుకు కారణం వాళ్ల మనస్సుల్లో మెదలుతూవున్న పాత పగలు, ప్రతిజ్ఞలూను. అందువల్ల వాళ్లిరువురూ పట్టుదలతో, పౌరుషంతో పోరాడటానికే నిశ్చయించుకొన్నారు. వీళ్లకు మేలు కీడులు ఎలా జరుగవలసివుంటే అలా జరుగుతాయి' - అని నిర్ణయించుకొని, బలరాముడు ద్వారకకు మరలినాడు.

ఉగ్రసేనాది బంధువుల బృందాలు ద్వారకలోనుండి ఎదురేగి, వచ్చి బలరామదేవునికీ స్వాగతం పలికారు. ఆయన అచ్చట కొంతకాలంనుండి మళ్లీ సపరివారంగా నైమిశాటవికి వెళ్లినాడు. అక్కడ ఋషీశ్వరుల అంగీకారంతో ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు. భూరిదక్షిణలతో ఋత్విక్కుల్ని తదితర బ్రాహ్మణుల్ని సంతోషింపజేశాడు; యజ్ఞం చివర ధర్మపత్ని రేవతీదేవితోనూ, బంధుజనులతోనూ కూడి అవభృథస్నానాన్ని చక్కగా ఆచరించాడు.

(అవభృథము : యజ్ఞం ముగించిన తర్వాత వివిధ దోషపరిహారంకోసం చేసే మంత్రపూర్వకమైన పవిత్రస్నానం.)

బలరామదేవుడు పుష్పమాలికలను ధరించి, చందనపు మైపూతతో; వినూత్న భూషణాలతో రత్నాంబరాలతో పున్నమ చంద్రునివలె ప్రకాశిస్తూ, బంధువుల నేత్రాలనే తెలకలువల సమూహానికి పరిపూర్ణమైన వికాసాన్ని ప్రసాదించాడు. మిక్కిలి తెల్లని కీర్తి గలిగి భాసిస్తూ, అమిత వైభవంతో విరాజిల్లసాగాడు.

ఆదిశేషుని అవతారమైనవాడూ, మహామహిమోపేతుడూ, మాయామానుషవేషధారీ, అమితబలశాలీ - అయిన బలరామదేవుడు ఈ విధంగా మహావైభవంతో ద్వారకను ప్రవేశించి, అచ్చట సుఖంగా ఉన్నాడు - అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో మళ్లీ చెప్పటానికి ఉపక్రమించాడు.

మాయా మానుషస్వరూపుడు, గొప్ప భుజబలంకలవాడు, హలాయుధుడు అయిన బలరామస్వామి నిర్వహించే ఆశ్చర్యకరాలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. చతుర్ముఖబ్రహ్మకుకూడా వాటిని ఇన్నని లెక్కపెట్టడం సాధ్యంకాదు - అని శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుతో చెప్పాడు.

కుచేలోపాఖ్యానము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sri Krishnudu Danthavaktruni Vadhinchuta - శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట

ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు కపటియైన సాల్వుణ్ణీ, ఆతనిసౌభకవిమానాన్నీ ధ్వంసంచేయటం తెలుసుకొన్నవాడై, దంతవక్త్రుడు ఆ వాసుదేవునిచే సంహరింపబడిన తన మిత్రుడగు పౌండ్రకవాసుదేవునికీ, తన అన్నయగు శిశుపాలునికీ, స్నేహితుడైన సాల్వునికీ వరుసగా పరలోకక్రియలు చక్కగా నిర్వర్తించాడు. అనంతరం అతిభీషణమైన ఆకారంతో శ్రీకృష్ణుని మీదికి యుద్ధసన్నద్దుడై వెళ్లాడు.

దంతవక్త్రుడు పండ్లు పటపట కొరుకుతూ, బిగ్గరగా అరుస్తూ కన్నులనుండి మిణుగురులు రాలుస్తూ, కాలితాపులచే నేల వణకేలాగున నడుస్తూ, గదను గిరగిర త్రిప్పుతూ, వేసవియందలి సూర్యబింబంలాగా తీవ్రంగా మండిపడుతూ శ్రీకృష్ణుని మీదికి విజ్బంభించాడు.

ఆ రీతిగా తనపైకి వస్తూ ఉన్న దంతదవ
క్త్రుణ్ణి చూచి, ఉల్లాసంతోగూడిన మనస్సుతో శ్రీకృష్ణుడుకూడా గదాహస్తుడై రథం దిగినాడు. విరోధికి ఎదురుగా నడిచాడు. మిగుల నీచస్వభావంగల ఆతడు కుడిచేత గదను త్రిప్పుతూ, అట్టహాసం ఉట్టిపడుతుండగా శ్రీహరితో ఇలా చెప్పాడు.

“కృష్ణా! నా భాగ్యవశాన నేడు నీవు నాకంటబడినావు. బంధురూపంలో ఉన్న శత్రుడివి నీవు. శరీరంలో ప్రవేశించిన భయంకరమైనవ్వాధిని శక్తిమంతమైన ఔషధంతో నివారింపజేసేవైద్యునివలె నా మిత్రద్రోహివైన నిన్ను - మేనమామ కుమారుడనే ఆదరభావం చూపక ఇంద్రుని వజ్రాయుధంలాంటి నా గదాదండపు పెట్టుచేత యముని లోకానికి పంపిస్తాను. ఆ విధంగా నీవు చంపిన నా మిత్రుల ఋణాన్ని తీర్చుకోగలను” - అంటూ దంతవక్త్రుడు పరిహాస పూర్వకమైన దుర్భాషలాడుతూ శ్రీకృష్ణుణ్ణి సమీపించాడు.

అలాగ దుర్భాషలాడుతూ దంతవక్త్రుడు తన గదాదండంతో శ్రీకృష్ణునితలపై మోదినాడు. అంకుశంపోటుచే ఆగ్రహించిన మదపుటేనుగులాగా కోపగించిన శ్రీకృష్ణుడు వజ్రాయుధంవంటి తనగదాయుధాన్ని వేగంగా గిరగిర త్రిప్పివేసి, దంతవక్త్రుని వక్షఃస్థలాన్ని పగులగొట్టాడు. ఆ దెబ్బకు వాడు కుప్పగూలి, రక్తం క్రక్కుతూ పడిపోయాడు.

ఆ క్షణంలోనే దంతవక్త్రుడు పర్వతంలాంటి శరీరంతో నేలపై బడి తన్నుకొంటూ ప్రాణాలు విడిచినాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న సమస్తప్రాణి సమూహం ఆశ్చర్యపడుతూవుండగా, ఒకానొక సూక్ష్మతేజస్సు ఆతని శరీరంలోనుండి బయలువెడలి శ్రీకృష్ణునిలో ప్రవేశించింది. ఆ సమయంలో దంతవక్త్రుని తమ్ముడైన విదూరథుడు మిగులకోపంతో ప్రళయాగ్ని జ్వాలలాగా అత్యంత భీకరమైయున్న ఖడ్గాన్నీ డాలునూ ధరించి, శ్రీకృష్ణునిమీదికి దూకినాడు.

శ్రీకృష్ణుడు తన సుదర్శనాయుధాన్ని నిపుణతతో ప్రయోగించి విదూరథుని శిరస్సును త్రుంచివేశాడు. బలవంతుడైన ఆ కమలలోచనుడు ఈ రీతిగా సౌభకాన్ని సాల్వుణ్ణి, శిశుపాలుని సోదరుడైన దంతవక్త్రుణ్ణి, వాని తమ్ముడైన విదూరథుణ్ణి, తనను ఎదిరించడానీకి వచ్చిన అతని సోదరులను, అలాగే ఆ వంశీయులు చాలమందినీ సంహరించాడు.

ఆ రీతిగా శ్రీకృష్ణుడు విదూరథుణ్ణి, వాని వంశంవారిని సంహరించిన సమయంలో

ఆ సమయంలో నరులూ, మునులూ, యోగులూ, దేవతలూ, రాక్షసులూ, గరుడులూ, నాగులూ, సిద్దులూ, సాధ్యులూ, గంధర్వులూ, తరచుగా ఆకాశంలో సంచరిస్తూ ఉండే కిన్నరులూ, కింపురుషులూ మొదలైనవారందరూ ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ శ్రీకృష్ణుని మహిమను ప్రస్తుతించారు.

అప్సరసలు నృత్యాలు చేస్తూ ఉండగా, దేవతలు పుష్పవర్షాలు కురిపిస్తూ ఉండగా, దేవదుందుభులు బ్రహ్మాండంగా మ్రోగుతూ ఉండగా, యదువృష్టి వీరవరులు అనుసరించి నడువగా, వందిమాగధులు తన విజయగాథల గీతాలను ఆలాపిస్తూ ఉండగా వాసుదేవుడు మహావైభవంతో శుభముహూర్తంలో చక్కగా అలంకరింపబడిన ద్వారకా నగరం ప్రవేశించాడు.

ఆ వేళలో ద్వారకపురమందలి పుణ్యస్త్రీలు ఎత్తెన మేడలమీది నుంచి తనపై మంగళాక్షతలను కురిపిస్తూవుండగా, శ్రీకృష్ణుడు శుభముహూర్తంలో ఆనందంతో అంతఃపురాన్ని ప్రవేశించాడు.

(అధిపతి శత్రువులను జయించి రాజధానిని ప్రవేశించినప్పుడు పుణ్యస్త్రీలు మేడలమీదనుండి ఆయనపై మంగళ కరంగా పూవులతో కూడిన అక్షతలను చల్లటం భారతదేశంలో ప్రాచీనకాలంనుండీ ఆచరింపబడుతూవున్న ఉత్తమమైన ఆచారం.)

ఆ రీతిగా యోగీశ్వరేశ్వరుడూ, షడ్గుణైశ్వర్యసంపన్నుడూ, సమస్తజగత్తుకు అధిపతీ అయిన శ్రీకృష్ణుడు ద్వారకానగరిలో సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత

పరీక్షిన్మహారాజా! బలరామదేవుడు కౌరవపాండవయుద్ధం త్వరలో ప్రారంభం కానున్నదని తెలుసుకొన్నవాడై ఇరు పక్షాలకూ సమానంగా కావలసినవాడు కాబట్టి, తీర్థయాత్రలు చెయ్యాలనే నెపంతో ద్వారకనుండి తరలివెళ్లాడు.


బలరాముడు తీర్థయాత్రకు జనుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Saalvundu Sivaprasadambuna Soubhakavimanambu Vadasi Dwarakapuripai Dandetthuta - సాల్వుండు శివప్రసాదంబున సౌభకవిమానంబు వడసి ద్వారకాపురిపై దండెత్తుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
సాల్వుండు శివప్రసాదంబున సౌభకవిమానంబు వడసి ద్వారకాపురిపై దండెత్తుట

పరీక్షిన్మహీపతీ! వినండి. ఇంతకు ముందు రుక్మిణీవివాహసమయంలో శిశుపాలునికి సహాయంగా సేనలతో వచ్చి, శ్రీకృష్ణునిచే ఓడింపబడ్డ రాజులలో సాళ్వుడనేవాడు ఒకడు కలడు. వాడు శ్రీకృష్ణనియందు ఈర్ష్యను పెంచుకొని, ఈ
ర్ష్యాగ్ని జ్వాలలతో 'యాదవుల నందరిని నాశనం చెస్తా'నని జరాసంధాది రాజుల సమక్షంలో మొండిగా ప్రతిజ్ఞ చేశాడు. వెనువెంటనే అత్యంతనిష్ఠతో ఒకానొక ప్రశాంత ప్రదేశాన్ని చేరుకొని పరమేశ్వరుణ్ణిగూర్చి తపస్సు చేయటానికి పూనుకున్నాడు.

సాల్వుడు ధైర్యంవిడువక, తీవ్రమైన పట్టుదలతో, ప్రతిరోజూ పిడికడు దుమ్మును మాత్రమే ఆహారంగా తీసుకొంటూ కఠినమైన నియమాన్ని అవలంబించి ఫాలలోచనుడు, పశుపతి, ఉమానాథుడు స్వరసంహారకుడూ అయిన పరమశివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేయడం ప్రారంభించాడు.

ఆ సాల్వుడు దృఢమైన నిశ్చలభక్తిభావంతో పరమశివుని పదపద్మాలపై మనస్సు నిలిపి, సంవత్సరంపాటు నిర్విరామంగా తపస్సు చేశాడు. అందువల్ల వానిభక్తిమహిమకు పరమేశ్వరుడు వశుడై

పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'నీవు ఏ వరం కోరినా ఇస్తాను వేడుకో' - అనగా అప్పుడు ఆ సాల్వుడైన రాచతపసి శంకరునికి ప్రీతితో

తాను కావించిన తపస్సుకు వశుడై, ప్రత్యక్షమయిన పరమేశ్వరునికి సాల్వుడు భక్తిభావంతో నమస్కరించాడు; నొసటిమీద అంజలిని చేర్చి, ఆనందంతో విప్పారినముఖంతో ఇలా విన్నవించాడు. 'శరణాగతులపై దయావర్షాన్ని కురిపించే శంకరా! నీ భక్తుడనగు నన్ను రక్షింపదలంచినట్లైతే, నా కోరికను నీకు వినిపిస్తున్నాను, వినుము!' - అన్నాడు.

భక్తులకు వరాలు ప్రసాదించే పరమేశ్వరా! గరుడులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, దేవతలు - ఈ దేవజాతుల నాయకుల కెవ్వరికీ సాధ్యంకానిదై, నా ఇష్టమైన చోట్లకు ఆకాశమార్గంలో స్వేచ్చగా సంచరించగల వాహనాన్ని నాకు ప్రసాదించు.

సాల్వుని కోరికమేరకు శంకరుడు అనువైన ఒక పట్టణాన్ని నిర్మించి ఇమ్మని మయుణ్ణి ఆజ్ఞాపించాడు. తదనుగుణంగా మయశిల్పి ఇనుముతో ఒక పట్టణాన్ని తయారుచేసి, 'సౌాభక' మనే పేరుపెట్టి సాల్వునికిచ్చాడు. అతడు ఆనందంతో దాన్ని అధిరోహించి, యాదవులమీద తనకున్న శత్రుత్వాన్ని తలచి, గర్వంతో కన్ను మిన్ను గానక వెళ్లి, సేనలతో ద్వారకను ముట్టడించాడు.

ఆ ముట్టడిలో నదులను, ఉద్యానవనాలను ధ్వంసం కావించాడు. సరస్సులను, బావులను, కందకాలను గజిబిజిచేసి పూడ్పించాడు. కోటగోడలను, బురుజులను కూలద్రోయించినాడు. రక్షణయంత్రాలను, పతకాలను తునుకలుగా నరికించాడు. గోపురాలను, మిద్దెలను, మేడలను, చంద్రశాలలను కాల్చివేయించాడు. సువర్ణరత్నాది అమూల్య వస్తుసముదాయాన్ని పూర్తిగా కొల్లగొట్టినాడు. ప్రజలను చెరపట్టి అధికారులైన వారిని అవమానించాడు. ఈ రీతిగా ద్వారకలోని ప్రజానీకాన్ని పెక్కు బాధలకు గురిచేశాడు.

అంతటితో ఆగక, సాల్వుడు విమానంతో ఆకాశంలోకి ఎగిరిపోయి, అక్కడనుండి శక్త్యాయుధాలను, బండలను, వృక్షాలను, బాణాలను వరుసగా ద్వారకపై కురిపించాడు; దుమ్మును, ఇసుకను దట్టంగా వర్షింపజేస్తూ, సుడిగాలుల ద్వారా ద్వారకను అమితంగా కల్లోల పరుపసాగాడు.

ఆ ప్రకారంగా సాల్వుడు అకస్మాత్తుగా ద్వారకాపురిని ముట్టడించి యుద్ధం సాగిస్తూ ఉండగా

ఆ సమయంలో త్రిపురాసురులనే భయంకరులైన రక్కసులవల్ల మిగుల బాధింపబడిన భూలోకంవలె ఆ ద్వారకానగరం సాల్వునిచేత అమితమైన ఇక్కట్టులకు పాల్పరుపబడి తల్లడిల్లుతూ ఉండగా

ద్వారకలోని జనుల కలతపాటును గమనించి, భగంతుడూ, రథికశ్రేష్ఠుడూ అయిన ప్రద్యుమ్నుడు 'భయపడకండి!' - అని ప్రజలను ధైర్యపరుస్తూ మహోత్సాహంతో దివ్యములైన అనేకాయుధాలను దాల్చి, సైన్యాలు సేవిస్తుండగా, మత్స్యధ్వజం ప్రకాశిస్తూ ఉన్న గొప్పతేరు నెక్కి యుద్ధభూమికి బయలుదేరాడు.

శ్రీకృష్ణునికుమారుడైన ప్రద్యుమ్నుడు ప్రజానీకానికి ధైర్యం చెపుతూ, రణోత్సాహంతో సమరభూమికి వెళ్లుతున్న సమయంలో

అతిశయించిన తమ బాహువుల బలపరాక్రమాలచేత శత్రువులను సంహరించే సామర్థ్యంగలవారైన కృతవర్మ, గదుడు, భానువిందుడు, శుకుడు, సాత్యకి, సారణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, అనిరుద్దుడు, అక్రూరుడు మొదలయిన యాదవవీరులందరూ యుద్ధరంగానికి పయనమయినారు.

(గదుడు = బలరాముని తమ్ముడు(రోహిణి ఆరుగురుకుమారులలో ఒకడు).
భానువిందుడు = ఒకానొక యాదవవీరుడు.
శుకుడు = ద్వారకాపురిలోని యదువీరులలో ఒకడు.
సాత్యకి = సత్యకుడను యాదవరాజుయొక్క కుమారుడు. 'యుయుధానుడు” అనేది ఇతని నామాంతరం.
సారణుడు = బలరాముని సోదరులలో ఒకడు (గదుని తమ్ముడు).
చారుదేష్ణుడు = శ్రీకృష్ణునికి రుక్మిణియందు కలిగిన కుమారుడు.
సాంబుడు = శ్రీకృష్ణునికి జాంబవతియందు కలిగిన కుమారుడు.
మకరకేతనాత్మజుడు = అనిరుద్దుడు (ప్రద్యుమ్నునికొడుకు).
శ్వఫల్క తనూభవుడు = శ్వఫల్కుని పుత్రుడు (అక్రూరుడు).
కృతవర్మ = వృష్టివంశంలో జన్మించిన ఒక రాజు. ద్వారకాపురివాస్తవ్యుడు. మహారథియైన వీరుడు. శ్రీకృష్ణభక్తుడు.)

భూమి కంపిస్తూ ఉండగా, అనేకాయుధాల మితిమీరిన కాంతులు సూర్యబింబాన్ని కప్పివేయగా, చతురంగబలాలతో కూడినవారై, యాదవవీరులందరు శత్రువులకు భయం కలిగించే స్వరూపాలతో యుద్దరంగాని కేగినారు.

ఆ విధంగా అరివీరభయంకరంగా బయలువెడలిన యదువీరుల చతురంగబలాలు, తొలుత వెళ్లిన ప్రద్యుమ్నుని రథాన్నిసైతం దాటిపోయి, సమరోత్సాహంతో సాల్వుని సేనలను కమ్ముకొన్నట్లుగా ఎదిరించాయి. అప్పుడు ఆ యిరు పక్షాలనడుమ సాగినసమరం (పూర్వపు) దేవదానవుల యుద్ధంవలె ఎడతెరపిలేనిదిగా గోచరించింది.

రాజేంద్రా! ఆ సైన్యాల్లోని విలుకాండ్రయొక్క అల్లెత్రాళ్లటంకారాలు, మదపుటేనుగుల ఘీంకారాలు, వీరభటుల హుంకారాలు, యుద్ధభేరుల భాంకారాలు, తప్పెటలవంటి చర్మవాద్యాల భయంకరధణధణధ్వనులు, వీరవరుల పౌరుషవాక్యాలు - ఈ శబ్దాలు విరోధులను కలవరపరుస్తూ భూమ్యాకాశాలు నిండిపోయాయి.

గుర్రాల గిట్టలవల్ల, రథచక్రాలవల్ల, సైనికుల పాదాలవల్ల భూతలంనుండి లేచిన ధూళీ సమూహం ఆకాశాన్ని చీకట్లతో నింపింది. ఆ చీకట్లను పొగొడుతూ సైనికుల చేతులలోని కత్తులు మున్నగు ఆయుధాల కాంతులు ఆకాశసంచారులైన దేవజాతులకు కన్నులు మిఱుమిట్లు గొల్పుతూ ఆకాశమంతటా విస్తరించాయి.

యాదవ, సాల్వసేనలు పరస్పరం భీకరంగా ఎదిరించి, బాణాలచే విరోధుల ఎముకలను పగులగొట్టుతూ, గొప్ప గదలతో నడితలలపైన, నొసళ్లమీద గట్టిగా బాదుతూ, కోపంవల్ల కన్నులనుండి నిప్పురవ్వలు రాలుతూ ఉండగా, రణోత్సాహం రంజిల్లగా పోరాడాయి.

ఆ తీరున యాదవ, సాల్వసేనలు హోరాహోరిగా యుద్ధంచేస్తుండగా ప్రద్యుమ్నుడు చూచి

ఆ సమయంలో ఆ సంకులసమరాన్ని తిలకించిన ప్రద్యుమ్నుడు వీరావేశంతో విజృంభించి, సూర్యభగవానుడు తన కిరణాలతో కారుచీకట్లను పటాపంచలు కావించినట్లు, మహిమగల తన దివ్యాస్త్రజాలంతో సాల్వుడు పన్నిన మాయాజాలాన్ని విలాసంగా భేదించి నశింపజేశాడు.

అంతేగాక

అతిరథుల్లో శ్రేష్ఠుడయిన ప్రద్యుమ్నుడు బంగారుఱెక్కలు గలిగిన ఇఱువదియైదు బాణాలు ప్రయోగించి, సాల్వుని సేనాపతిని బాగా నొప్పించాడు. ఇంకా, కోట్లకొలదీ ఇంద్రునివజ్రాయుధంల్లాంటి బాణాలను అనేకంగా ప్రయోగించి, సాల్వుని మూపును గొప్పగా గాయపఱచాడు. అంతటితో విరమింపక, ప్రళయకాలంలోని భైరవునివలె విజృంభించి యుద్ధం చేయసాగినాడు.

ప్రద్యుమ్నుడు పదిపదిబాణాలతో సాల్వునిమిత్రులైన మహారాజులను నొప్పించాడు. మూడు మూడు బాణాలు ప్రయోగించి రథ, గజ తురగాలను నేలగూల్చినాడు. ఒక్కొక్క బాణంచేత సైనికుల బలగర్వాన్ని అణచివేశాడు. ఈ రీతిగా ఎదురులేని విధంగా పరాక్రమించినాడు.

మెరునగధీరుడు, నిర్భయుడు, శత్రువుల్ని సంహరించేవాడు నయిన ప్రద్యుమ్నుణ్ణి, ఆశ్చర్యకరమయిన ఆతని పరాక్రమ నైపుణ్యానికి మెచ్చి, స్వపక్షమందలి సైనికులతోపాటు, శత్రుపక్షంలోని సైనికులుసైతం పక్షపాతంలేని నిర్మల బుద్ధితో ప్రశంసించారు.

ఆ రీతిగా ఇరువైపుల సైనికులు ప్రద్యుమ్నుని పరాక్రమాన్ని ప్రశంసిస్తూవున్న సందర్భంనందు

ప్రద్యుమ్నుని పరాక్రమాన్ని ఉభయ సైన్యాలు కొనియాడుతూ ఉన్న ఆ సమయంలో సాల్వుడు శ్రీకృష్ణుడి మఱియొక కుమారుడైన సాంబునిపై ఎన్నో బాణాలను ప్రయోగించి మిక్కిలి నొప్పించాడు. వెంటనే సాంబుడు విల్లెక్కిడి సాల్వుని ఱొమ్ముపై పదునైదు బాణాలను వేసి, ఇఱువదివాడిగల బాణాలు వేసి వాడి సౌభకవిమానం అల్లాడేటట్లు చేసినాడు.

పరీక్షిద్రాజేంద్రా! రథికులలో ఉత్తముడైన గదుడు రాహుముఖాన్నిపోలిన భీకరబాణసమూహాలను ప్రసరింపజేసి, శత్రువుల శిరస్సులను ఆ బాణాలకు గుత్తులుగా గూర్చి పైకెత్తి చూపుతూ, పరాక్రమప్రదర్శనమనే ఆటలో ఆసక్తుడై ఉండినాడు. ఆ సమయంలో ఆకాశంలో దేవతాబ్బందాలు అతనిపరాక్రమకేళిని తిలకిస్తూ ప్రశంసించసాగారు.

భూనాథా! శ్రీకృష్ణునిసోదరుడైన సాత్యకి తీవ్రమైనకోపంతో చతురంగబలసహితమై యున్న సాల్వుని సౌభక విమానమనే చీకట్లను మిఱుమిట్లుగొల్పుచున్న సూర్యకిరణాలను పోలిన వాడిబాణాలచే పటాపంచలు కావించాడు. ఆతని పరాక్రమాన్ని ఇరువైపులనున్న సైనికులు మిగుల ప్రశంసించినారు.

భానువిందుడు అహంకరించియున్న శత్రుపక్షసైన్యమనే అరణ్యాన్ని తీక్ష్ణమైన దావానలంవంటి తన బాణసముదాయంతో దహించి, చూర్ణంచేసి వైచాడు. అలాంటి ఆతని ధనుర్విద్యాకౌశలాన్ని తిలకించిన ఆకాశంలోని దేవతలసమూహం తమ తమ మనస్సులలో ఎంతగానో మెచ్చుకొన్నారు.

రుక్మిణీతనయుడైన చారుదేష్ణుడు కోపంతో విజృంభించి, వాడియైన బాణ పరంపరను ప్రయోగించి సాల్వుని సేనానుల్ని అందరినీ మారిరేగిన రీతిగా సంహరించి, ఉత్సాహంతో గట్టిగా సింహగర్జన చేశాడు.

శుకుడు సమరవిజయకాంక్షగలవాడై, తన భుజబలాన్ని చూపరులు పొగిడే విధంగా శౌర్యాతిశయంతో బాణాలు ప్రయోగిస్తూ, శత్రువులబలాలను (సేనలను) నశింపజేశాడు.

బలభద్రుని తమ్ముడైన సారణుడు శత్రుసైన్యాలు భీతిల్లేటట్లుగా ఉగ్రరూపుడై ఉత్సాహంతో సమీపించి, బల్లెములు, బాణాలు, ఈటెలు, గదలు, కత్తులు మొదలైన ఆయుధాలను నిరంతరం ప్రయోగిస్తూ సాల్వుని సేనలోని గుఱ్ఱాలను, ఏనుగులను, రథాలను ఖండించి వేశాడు; సైనికులను సంహరించి యమపురికి పంపివేశాడు.

మహావీరుడైన అక్రూరుడూ ఆయన సోదరులూ గొప్ప భుజబల పరాక్రమంతో మెరసి, చక్రప్రాసాది అనేక ఆయుధాలను ప్రయోగించి విరోధులను వధించారు.

పరీక్షిన్మహారాజా! రథికోత్తముడైన కృతవర్మభూపతి బాణాలచే శత్రువీరుల కవచాలను భేదించి వాళ్లశరీరాలను పెక్కుగాయాలు గావించి, ముక్కలు ముక్కలుగా నరికివేయసాగాడు. అది అద్భుతకృత్యమని శత్రుసైనికులు సైతం పొగడసాగారు. వారిలో కొందరు విరోధులు భయంచేత పారిపోతూవుండగా, యుద్ధధర్మాన్ని అవలంబించి కృతవర్మ వారిని చంపక విడిచిపెట్టాడు.

కృతవర్మ చేసిన తీవ్రమైన యుద్ధంవల్ల సాల్వునికి ఆగ్రహం కలిగింది. తదనుసారం ఆతడి సాభకవిమానం మాయా ప్రభావంతో విజృంభించింది.

పరీక్షిన్మహారాజా! ఆ సౌభకవిమానం తన మాయాబలంచేత ఒక పర్యాయం ఆకాశంలో కనపడుతుంది. ఒకమారు భూమిమీద నిలుస్తుంది. ఒకమారు కొండశిఖరంమీద వర్తిస్తుంది. ఒకసారి సముద్రమధ్యంలో విహరిస్తుంది. ఒకవేళలో ఒక్కటిగానూ, మరుక్షణంలో అనేక రూపాలుగానూ కనబడుతుంది. ఒకమారు చుట్టూ ప్రాకారంతో చూపట్టుతుంది. మరియొకమారు ఏమీ లేకుండగా కనిపిస్తుంది. ఒక మాటు గొప్పకొఱవిని గిరగిర త్రిప్పినట్లు భయంకరంగా దర్శనమిస్తుంది. ఈ విధంగా మాయావిమానం యాదవులు కలవరపడేలాగున అనేకవిధాలుగా తిరిగింది.

ఈ రీతిగా సౌాభకవిమానం విజ్బంభించేసరికి, అంతవరకు యాదవుల సేనలవల్ల జాలినొందియున్న తన సైన్యాన్ని సాల్వభూపతి మళ్లీ యుద్దానికి ప్రేరేపించి

అప్పుడు సాల్వుడు ఎడతెగకుండా అగ్నిశిఖలలాంటి బాణాలను యాదవ సైన్యంపై ప్రయోగించాడు. అయినప్పటికీ యాదవుల బలాలు వెనుకంజ వేయకుండా ధైర్యంతో యుద్ధం సాగించాయి.

ఆ సమయాన ఇరు పక్షాల యోధులూ అలసిపోకుండా పౌరుషంతో పోరాడసాగారు. అప్పుడు వాళ్లలో పేరుమోసిన యోధులమధ్య ద్వంద్వయుద్ధం ఆరంభమయింది.

యుద్ధ ఆరంభమైన సమయంలో ప్రద్యుమ్నుడి బాణజాలంచేత బాధింపబడిన ద్యుముడనే పేరుగల సాల్వుని మంత్రి గొప్పగదను ధరించి అధికమైన బలంతో (ప్రద్యుమ్ను కుమారుణ్ణి ఎదుర్కొన్నాడు)

నైపుణ్యం, పరాక్రమం, గర్వం వెల్లడి అవుతుండగా ద్యుముడు ప్రద్యుమ్నుణ్ణి సమీపించి వక్షఃస్థలం పగిలేటట్లు గదతో కొట్టినాడు. ఆ దెబ్బతో అతడు విలవిలలాడిపోయి, మేనెల్ల గగుర్పాటు నొందగా, చేతిలోని ఆయుధాల్ని జారవిడిచి, కనులు మూడలుపడగా, రథంమీద మూర్చపోయాడు.

యుద్ధధర్మం చక్కగా తెలిసినవాడు, నీతి కోవిదుడు, ధైర్యశాలి అయిన దారుకతనయుడు ప్రద్యుమ్నుని రథాన్ని యుద్ధరంగంనుండి వేగంగా ప్రక్కకు తోలుకొని వెళ్లాడు. అంతలో ప్రద్యుమ్నుడు మూర్చనుండి తేఱుకొనినాడు.

(సనత్కుమారుని అంశతో రుక్మిణీ కృష్ణులకు జన్మించిన తనయుడు ప్రద్యుమ్నుడు. ఇతడు పూర్వజన్మంలో మన్మథుడు. ప్రద్యుమ్నుడు శంబరుడనే రాక్షసుణ్ణి సంహరించడంచేత ఈతనికి 'శంబరారి' అను పేరు ఏర్పడింది.)

మూర్చనుండి తేరుకొనిన ప్రద్యుమ్నుడు సారథిని మందలించినాడు. 'శత్రువీరులు నవ్వుకొనేటట్లుగా, శ్రీకృష్ణుడు, బలరాముడు ఎగతాళిచేసేటట్లుగా యుద్ధభూమినుండి నా రథాన్ని ప్రక్కకు తప్పించి అపకీర్తి తెచ్చావు. యదువంశంలో జన్మించిన వీరవరులు శౌర్యాన్ని విడనాడి, ఈ విధంగా యుద్ధరంగంనుండి ఎన్నటికీ తొలగిపోరు.'

ప్రద్యుమ్నుడు పై విధంగా సారథిని మందలించగా, సారథి రథియైన ప్రద్యుమ్నకుమారునితో ఇలా పల్కినాడు.

శత్రువులచేత రధికుడు బాధింపబడినపుడు సారథీ, సారథి దెబ్బతిన్నప్పుడు రథికుడూ సమయానుకూలంగా పరస్పరం సంరక్షించుకోవటం గొప్పదైనయుద్ధధర్మం. కాబట్టి, నేను రథాన్ని ప్రక్కకు మరలించినాను అందుకు నీవు చింతింపక, శత్రువుల్ని జయించడానికి ప్రయత్నించు.

సమరధర్మాన్నిగూర్చి సారథి ఆవిధంగా వివరించగా వినిన రథి(ప్రద్యుమ్నకుమారుడు) సంతోషించాడు.

గొప్పగా భుజబలం సమకూడిన వీరుడైన ప్రద్యుమ్నుడు సారథిపలికిన సమరనీతి వాక్యాలకు సంతోషించాడు. వెంటనే విల్లెక్కుపెట్టి, ధనుష్టంకారంతో శత్రుసమూహాలను భయభ్రాంతుల్ని చేస్తూ, ద్యుమునిపైకి తన రథాన్ని నేర్పుతో వేగంగా తోలించాడు.

ఆ రీతిగా నిపుణతతో రథముమీద వేగంగా ద్యుముణ్ణి సమీపించినవాడై

ప్రద్యుమ్నుడు రథంమీద ద్యుముణ్ణి సమీపించినాడు. రోషంతోగూడిన శౌర్యంతో వానిశరీరాన్ని గాయాలపాలు గావించాడు. నాలుగు బాణాలతో (నాలుగు) గుఱ్ఱాలను, ఒకబాణంచేత సారథిని సంహరించాడు. రెండమ్ములచే పతాకాన్ని ధనుస్సును పొడిపొడి కావించాడు. చివరగా ఒకేయొక పదునైనబాణంతో ద్యుముని కంఠాన్ని ఖండించాడు.

ప్రద్యుమ్నుని వీరవిజ్బంభణం చూచి, సాంబుడు మొదలయిన యోధవర్యులు ప్రద్యుమ్నుణ్ణి ఎంతో కొనియాడి, పదునైన బాణజాలంతో తాటిపండ్లను నెలమీద ఒక్కుమ్మడిగా రాల్చిన విధంగా సాల్వుని సైనికుల శిరస్సులను వేగంగా ఖండించి వేశాడు.

ఆ విధంగా సాంబుడు మొదలైన యోధవరులు సాల్వునిసేనలను సంహరించిన వేళయందు

సాల్వుని సేనలకు, యాదవ సైన్యాలకూ జరిగిన ఆ భీకరసంగ్రామంలో గుర్రాలు కూలిపడినాయి. ఏనుగులు కుప్పలుగా భూమిపై పడిపోయాయి. రథాలు పొడిపొడి అయిపోయాయి. భటులు నేలపై పడిపోయారు. ఆ సమయంలో భూతాలు, రక్కసులు, పిశాచాలు గుంపులై ఆనందంతో రక్తపానం చేస్తూ, మాంసాలను నంజుకొంటూ, ఎముకలు కొరుకుతూ, జతలుగా కూడి చప్పట్లు తట్టుతూ మైమరచి నాట్యం చెయ్యసాగాయి.

ఆ యుద్ధరంగంలో మఱోవైపున

ఆ యుద్దరంగంలోని గజసైన్యాలుండే ప్రదేశం ఒక సముద్రంలాగా గోచరిస్తూ ఉన్నది. ఖండించబడ్డ ఏనుగుల గండభాగాలే మొసళ్లు, పొడవైన తొండాలే సర్పాల సమూహాలు, ఏనుగుల అరికాళ్లే తాబేళ్లు, ఏనుగుల దంతాలే ముత్యపు చిప్పలు. కుంభస్థలాలనుండి జారిపడిన ముత్యాలే సముద్రమందలి రత్నాలు. ఏనుగుల తెగిపడ్డతోకలే జలగలు; విడివడిన ఏనుగులమెడలభాగాలే కప్పలు ఏనుగులమెదడుసమూహం సముద్రంలోని బురద. ఏనుగుల శరీరాలనుండి బయల్పడిన (రక్తంతో తడిసి యొఱబడిన) ప్రేవులే సముద్రమందలి పవడపు తీగలు. ఏనుగుల శరీరాలనుండి వెలువడిన నరాలే సముద్రపు పాచి తీగలు. ఎముకల నడుమ నుండు మూలుగే నురుగుల గుంపులు. పొడిపొడియైన ఎముకలే ఇసుక దిబ్బలు; ఏనుగుల శరీరాలనుండి పారిన రక్తసమూహములే సముద్రజలములు. ఏనుగులు ఒరిగి పడుచూ కావించిన ఆర్తనాదాలే సముద్రతరంగాలు గొప్ప ధ్వనులు. ఈ రీతిగా ఆ యుద్ధభూమి ప్రాంతం సముద్రంతో సరిపోలినదై గోచరించింది.

ఈ విధంగా యాదవులసేనలు, సాల్వుని సేనలు ఒకరినిమఱొకరు జయించాలనే పట్టుదలతో గూడిన కోరికతో తూర్పుపడమరసముద్రాలు పోరాడినట్లు ఇరువదేడు దినాలు అతిభీకరరీతిని యుద్ధంచేశాయి. ఆ సమయంలో ఇంద్రప్రస్థ పురినుండి ద్వారకకు వస్తూ మధ్యమార్గంలో కానవచ్చిన అపశకునాలను పరికించి, శ్రీ కృష్ణుడు సారథియైన దారుకునితో ఇలా అన్నాడు.

'చూచావా! దారుకా! ఆకాశంలోనూ, భూమిమీదా మహాభయంకరంగా అపశకునాలు గోచరిస్తున్నాయి. నేను ఇంద్రప్రస్థపురిలో కుదురుగా ఉంటూ ఉండగా గమనించి, శిశుపాలుని స్నేహితులైన రాజులు కొందరు నా పట్టణాన్ని నశింపజేసే కపటోపాయంతో దండెత్తి వచ్చిన్నట్లు తోస్తున్నది. రథాన్ని వేగంగా పోనీ!

అలాగ శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించగానే దారుకుడు అతిత్వరగా తేరును పోనిచ్చాడు. ద్వారకను సమీపించిన వాసుదేవుడు శత్రుసేనలతో తలపడి యుద్ధంచేస్తున్న యాదవ సైన్యాలను, ఆకాశమార్గంలో మాయాప్రభావంతో మోసగిస్తూ యదువీరులకు సాధ్యంకాకుండా ఉన్న సౌభకవిమానాన్నీ అందులోవున్న సాల్వుణ్ణి చూచాడు. వాని సమీపానికి రథాన్ని తోలించాడు. శ్రీకృష్ణుణ్ణి వీక్షింపగానే యాదవసేనలు పరమానందం పొందాయి. చైతన్యం కోల్పోయి, దైన్యంతో ఉన్న తన సైన్యాన్ని పరికించి, సాల్వుడు పూనికతో విజ్బంభించాడు.

నిప్పురవ్వలు అన్నివైపులా చెదరిపడుతుండగా, ఆకసంలో మంటలు ప్రసరిస్తూ ఉండగా; చిరుగంటల ధ్వనులచే దిక్కుల నడిమి ప్రదేశమంతా వణకుతుంటే మహాభయంకరమయిన 'శక్తి' అనే దివ్యమైన ఆయుధాన్ని సాల్వుడు శ్రీకృష్ణుని సారథియైన దారుకునిపైకి విసరివేసినాడు. అది చుక్క తెగిపడుతున్నట్లుగా రాసాగింది.

వెలుగులీనే ఒకానొక నక్షత్రం ఆకాశంలోనుండి తెగిపడిన రీతిగా వేగంగా దారుకునిమీదికి దూసుకొని ఆ దివ్యశక్తి వస్తూవుండగా, దాన్ని శ్రీకృష్ణుడు ఒక్కబాణంతో మధ్యమార్గంలోనే పొడిపొడిగా చేసి నేలపై రాలేట్లు చేశాడు.

గొప్ప బాహుబలసంపన్నుడైన శ్రీకృష్ణు డంతటితో శాంతించక, మొక్కవోని పరాక్రమంతో, కొఱవి త్రిప్పినట్లుగా ఆకాశంలో భీకరంగా తిరుగుతూ చూడ శక్యం గాకుండా ఉన్నసౌభకవిమానాన్నీ అందులో ఉన్న సాల్వుణ్ణీ మిక్కిలి వాడియైన సూర్యకిరణాలవంటి పదునైన పదహారు బాణాలను బాగా నాటుకొనేటట్లుగా ప్రయోగించాడు.

సాల్వుడు మిగుల కోపించి, తనధనుస్సును మేఘం ఉఱిమినట్లుగా ధ్వనింపజేస్తూ శ్రీకృష్ణుని ఎడమభుజంలో నాటుకొనే టుగా వెడల్పు మొనలుగల బాణాలను వేగంగా ప్రయోగించాడు. ఆ దెబ్బకు తెగువను కోల్పోయిన కృష్ణుడు శార్‌ఙ్గమనే తన వింటిని రథంపై జారవిడిచినాడు. అందుకు ఆకసంలో ఉన్నదేవతలు భీతిల్లి చూడసాగారు.

శ్రీకృష్ణుడు వింటిని తేరుపై జారవిడిచినందుకు ప్రకృతియందలి భూతాలు హాహాకారాలు చేశాయి. అంతలో ఆయన సాల్వుని బాణాలవలన కలిగిన బాధనుండి తేరుకొన్నాడు. అది గమనించిన సాల్వుడు భుజశౌర్యం ప్రైరేపిస్తూండగా శ్రీకృష్ణుణ్జి చూచి యుద్ధఉత్సాహంతో ఇలా పల్కాడు.

'కృష్ణా! నా మిత్రుడు (శిశుపాలుడు) కోరిన కన్యకను (రుక్మిణిని) నీవు నీతి మాలినవాడివై అన్యాయంగా స్వీకరించావు. అది చాలక ధర్మజుని సభాస్థలిలో ఏ మరుపాటున ఉన్న ఆతణ్జి పగబూని ఆగ్రహంతో సంహరించావు. అటువంటి కలుషాత్ముడివైన నీవు నేడు రణరంగంలో (నిలిచినాతో పోరాడాలి)

కలుషాత్ముడవైన నీవు యుద్ధరంగంలో అధైర్యంతో పారిపోక, భుజబలంతో నా ఎదుట ధైర్యంగా నిలువబడ గలిగినట్లయితే, నా మిత్రుణ్ణి సంహరించిన పాపానికి పరిహారంగా నిన్ను నా యొక్క కర్కశబాణాగ్నిజ్వాలలలో ముంచివేసి పగ తీర్చుకుంటాను.

ఆ విధంగా బీరాలు పలికిన సాల్వుని మాటలకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. 'ఓరీ మూఢుడా! బలపరాక్రమాలుగల శూరునివలె ప్రేలుతున్నావు. నీకు చావు మూడిన సంగతిని గుర్తించలేకుండా ఉన్నావు - అని పల్కి తన గదను గిరగిర త్రిప్పి, ఒడుపుగా వానిపై విసరాడు.

ఆ విధంగా శ్రీకృష్ణుడు గదాయుధాన్ని సాల్వునిపై విసిరవేసిన తర్వాత

అప్పుడు శ్రీకృష్ణుని గదాఘాతంచేత తన నోటినుండీ, ముక్కునుండీ రక్తం స్రవిస్తూ ఉండగా సాల్వుడు తీవ్రంగా మూర్చపోయాడు. కొంతసేపటికి మెల్లగా తేరుకొన్నవాడై, అక్కడ నిలువకుండా వెంటనే సౌభకంతోపాటు మాయమైపోయాడు.

ఆ విధంగా సాల్వుడు విమానంతోకూడా అదృశ్యమైపోయిన సందర్భంలో

ఆ సమయంలో ఆకసంనుండి ఒకానొక మనుష్యుడు (బిగ్గరగా) దుఃఖిస్తూ శ్రీకృష్ణునివద్దకు వచ్చాడు. ఆయన పాదకమలాలకు వందనం చేసి, ఇలా విన్నవించాడు. 'దేవా! (మీ తండ్రియైన) వసుదేవుణ్ణి క్రూరుడైన సాల్వుడు బంధించి తెచ్చాడు.'

('ఆనకము' అంటే తప్పెటవంటి వాద్యం; 'దుందుభి' అనగాభేరి. వసుదేవుడు జన్మించిన సమయంలో దేవతలు ఆకాశం నుండి శుభసంతోషసూచకంగా ఈ రెండువిధాలైన వాద్యాలను మ్రోయించారు. అందుచేత, వసుదేవునికి “ఆనక దుందుభి" - అనే నామధేయం సార్ధకంగా ఏర్పడింది.)

దేవదేవా! ఈ విషయాన్ని మీకు తెల్పేనిమిత్తం తల్లి దేవకీదేవి నన్నిక్కడికి పంపింది - అని చెప్పగా, శ్రీకృష్ణుడు తండ్రియెడగల ప్రేమాధిక్యంచేత తీవ్రమైనవిషాదానికి లోనయ్యాడు.

'దేవ దానవ గంధర్వ మానశ్రేష్ఠులైన వారికి కూడా జయింపరాని బలరామదేవుడు జాగరూకతతో కాపాడుతూ ఉండగా, హీనబలుడైన సాల్వునిచే తండ్రియగు వసుదేవుడేలాగున పట్టువడినాడోకదా!' - అని వాసుదేవుడు ఆశ్చర్యంతో ఆలోచింపసాగాడు.

అలా అనుకొంటూ, మనస్సు వికలత పొందగా దైవనిర్ణయాన్ని తప్పించడానికి ఎవరికైనా, ఏవిధంగానైనా సాధ్యంకాదు గదా! - అని దుఃఖిస్తూ విచారంతో పలుకుతూవుండగా, అంతలో ఆ సాల్వుడు(తన మాయాబలాన్ని ప్రదర్శింపసాగాడు)

అంతలో సాల్వుడు మరల కనిపించాడు. మాయావసుదేవుణ్ణి కల్పించి బంధించుకొని వచ్చాడు. “కృష్ణా! వీడే మీ తండ్రి. నీ యెదుటే వీని శిరస్సును ఖండించివేస్తాను. బలంకలవాడవైతే రక్షించుకో!” - అని పరుషంగా దుర్భాషలు పల్కుతూ, ఖడ్గాన్ని జలిపిస్తూ కల్పితవసుదేవుని శిరస్సును క్రుంచి, ఆ తలతోపాటు సౌభకవిమానంలోకి వెళ్లిపోయాడు. ఆ దృశ్యాన్ని చూచిన శ్రీకృష్ణుడు సాధారణమనుష్యునివలె కొంతసేపు అత్యంతదుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు తనసైన్యంలోని ప్రముఖులు కొందఱు సందర్భోచితాలైన పల్కులతో ధైర్యపరుస్తూ, కర్తవ్యాన్నిగూర్చి ప్రబోధించారు. అదంతా మయుడనే రక్కసునిద్వారా సాల్వుడు నేర్చుకొన్న మాయా విద్యాప్రభావమేనని శ్రీకృష్ణుడు ఆలోచించి తెలిసికో గలిగాడు. అంతలో 'వసుదేవుడు పట్టుబడినాడ'ని చెప్పిన దూతా, ఆ మాయాకళేబరమూ మాయమైపోయాయి.

ఆ సమయంలో మునీంద్రులు కొందరు మాయావిముక్తుడు, జయశీలుడు, విష్ణుస్వరూపుడు, కమలదళనేత్రుడు - అయిన శ్రీ కృష్ణునివద్దకు వచ్చి, భక్తియుక్తులై, వినయంతో ఇలా విన్నవించారు.

'పాపరహితుడవైన పుండరీకాక్షా! సమస్తమానవులూ సంసారమనే పలురకాలై ఉండే దుఃఖసముద్రంలో మునిగి గట్టుచేరజాలక కొట్టుమిట్టాడుతున్న వేళలో నిన్ను ధ్యానించి ఆ దుఃఖాలను నివారింపజేసికొంటూ ఉంటారు. అటువంటి సద్గుణాలకు నిలయుడవై, దేవతలందరకు ముఖ్యాధారుడవై పరటబ్రహ్మస్వరూపుడవై, పరమయోగీంద్రులకు సైతం అందరానటువంటి ఉత్కృష్టమైన చిదానందస్వరూపంతో ప్రకాశిస్తూవుండే నీ వెక్కడ? అల్పులైనవారి మనస్సుల్లో ఆవిర్భవించే భయం, మోహం, శోకం మొదలగునవి ఎక్కడ? నిజంగా నీవు వాటికి అతీతుడవు కదా!' - అని ఈ విధంగా సన్నుతించి ఆమునీశ్వరులు తమదారిన తాము వెళ్ళిపోయారు.

శ్రీకృష్ణుడు తనమీద వాడిబాణాలు ప్రయోగిస్తూవున్న సాల్వుణ్ణి సంహరింప నిశ్చయించాడు. అందువల్ల, వర్షధారలవంటి తీవ్రమైన బాణజాలంతో ఆకాశాన్నంతటినీ కప్పివేసి శీఘ్రంగా ఆతని కిరీటంలోని రత్నాన్సీ, వాని ధనుస్సునూ, కవచాన్నీ భేదించి వేశాడు.

శ్రీకృష్ణుడు జగద్విఖ్యాతమైన వీరవిజ్బంభణగల అమితమైన శక్తితో ఆకాశంనిండా మెఱుగులు ప్రసరించేటట్లుగా తన గొప్పగదను అమితవేగంగా త్రిప్పి, విసరి వేసినాడు. అలా శీఘ్రంగా విసరివేసి, త్రిపురాలలాంటిదీ, గొప్ప మాయాప్రభావంకలదీ అయిన సౌభకవిమానాన్ని పొడిపొడి గావించి కూల్చి వేశాడు.

ఆ విధంగా శ్రీకృష్ణుడు తన గదాయుధపు దెబ్బచేత మయుడు నిర్మించిన మాయావిమానాన్ని (సౌభకాన్ని) పొడిపొడి గావించి, సముద్రంపై రాలిపడేట్టు చేశాడు. అప్పుడు సాల్వుడు కోరలు పెరికివేసిన (క్రూరసర్పంలాగా పారుషం నశించి, మాయాశక్తిని కోల్పోయి చిన్నబోయియున్న వాడైనప్పటికిని తగ్గని పరాక్రమంతో ఆకాసంనుండి క్రిందికి దిగినాడు, కోపం వహించి (గదనుచేత పూనినాడు)

ఓ రాజా! సాల్వుడు ఆగ్రహంతో వజ్రాయుధంవంటి భీకరమైన గదను ధరియించి శ్రీకృష్ణు
ణ్ణి  ఎదుర్కోవడానికి వచ్చాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన ఖడ్గంతో గదను పూనియున్న వానిచేతిని కఠోరమైనరీతిలో ఖండించివేశాడు.

శ్రీకృష్ణుడు అంతటితో ఆగక, ప్రళయకాల సూర్యమండలప్రభలను వెదజల్లుతూ ఉండే అజేయమైన సుదర్శనచక్రాయుధాన్ని చక్కగా చేతిలో ధరించి సాల్వరాజుపై ప్రయోగించాడు.

దేవేంద్రుడు వజ్రాయుధంచేత వృత్రాసురుణ్ణి సంహరించిన విధంగా శ్రీకృష్ణుడు సుదర్శనచక్రంచేత మకుటమణి కాంతులచేత ప్రకాశిస్తూవున్న సాల్వుని శిరస్సును శౌర్యంతో శీఘ్రంగా ఖండించివేశాడు.

శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట







Friday, August 28, 2026

Dharmaraju Chesedi Rajasuyamunandu Srikrishnundu Sisupaluni Vadhinchuta - ధర్మరాజు చేసెడి రాజసూయమునందు శ్రీకృష్ణుండు శిశుపాలుని వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
ధర్మరాజు చేసెడి రాజసూయమునందు శ్రీకృష్ణుండు శిశుపాలుని వధించుట


ధర్మరాజు జరాసంధుణ్ణి జయించి భీమార్జునులతో ఇంద్రప్రస్థపురానికి వచ్చిన శ్రీకృష్ణుని గొప్పతనాన్ని పలుతెరగుల ప్రస్తుతించాడు. అటుపిమ్మట ఆ దేవదేవునిఅంగీకారంతో, వేదవిదులూ, బ్రహ్మవేత్తలూ అయిన బ్రాహ్మణులను రాజసూయయాగానికి ఋత్విక్కులుగా (నిర్వాహకులుగా) స్వీకరించాడు.

ధర్మరాజు - వేదవ్యాసుడు, కశ్యపుడు, భరద్వాజుడు, వసిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, చ్యవనుడు, జైమిని, ధౌమ్యుడు, పరాశరుడు, వైశంపాయనుడు, పరశురాముడు మొదలుగాగల మహర్షి పుంగవులను, గురువులయిన కృపాచార్య, ద్రోణాచార్యులను, కురువృద్దులయిన భీష్మవిదురులను, పెదతండ్రి ధృతరాష్ట్రుని, ఆయన పుత్రులను, కులపెద్దలు మొదలైన సమస్తబంధువులను, బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య జనులలో ప్రముఖులైనవారలను రాజసూయయాగానికి సాదరంగా ఆహ్వానించాడు.

ధర్మరాజుచే ఆహ్వానితులైన ఆ ఋషులు, గురువర్యులు, బంధుజనులు, పురప్రముఖులు మొదలైనవాళ్లంతా ఆనందాతిశయంతో రాజసూయయాగం జరిగే ప్రదేశానికి తరలివచ్చి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కుతూహలంతో తిలకిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఋత్విజులైన విప్రులు(యుధిష్ఠిరునికి యజ్ఞదీక్షను ఇచ్చేకార్యాన్ని చేపట్టారు)

రాజసూయ యాగం నిమిత్తమై ఉద్దేశించిన ప్రదేశంలో ఋత్విక్కులైన బ్రాహ్మణులు బంగారునాగళ్లతో బాగా దున్ని శుద్ది కావించారు. అనంతరం బంగారు పరికరాలతో విధి విహితంగా ధర్మరాజును యజ్ఞకార్య దీక్షితుణ్ణి కావించారు.

(యజ్ఞదీక్షితునికి నిత్యం నిర్వహింపవలసిన సంధ్యావందనాది కార్యాలతోపాటుగా బ్రహ్మచర్య నియమం, ఆహార నియమం, భూమిపై పరుండటం లాంటి నియమాలు నిర్ధేశింపబడి ఉంటాయి. 'యజమాని' అయిన వ్యక్తి యజ్ఞకార్యనిర్వహణకు సంకేతంగా దీక్షాకంకణాన్ని దీక్షావస్త్రాలను ధరించి ఉండాలి, ఆ యజ్ఞం పరిసమాప్తి అయ్యేంతవరకు అతడు యజ్ఞవాటికను విడిచి వెళ్లకూడదు. 'యజ్ఞం' పవిత్రమయిన కార్యం కాబట్టి, యజ్ఞం చేసేవారూ, చేయించేవారూ నియమనిష్ఠలతో ఉండాలి - అనేది సారాంశం.)

ఈ విధంగా బ్రాహ్మణులు నియమానుసారంగా ఆయా సముచిత కార్యాలను నిర్వహిస్తూ ఉండినారు. ఆ సమయంలో ధర్మరాజు

ధర్మరాజు రాజసూయయాగంలో రాజులందరూ తనకు కానుకలుగా సమర్పించే ధన కనక వస్త్ర వాహనాది వస్తు సమూహాల నన్నింటినీ స్వీకరించే నిమిత్తంగా పెదతండ్రి కొడుకుల్లో పెద్దవాడైన సుయోధనుణ్ణి నియమించాడు

ధర్మరాజు యాగానికి విచ్చేసిన అందరినీ తగినట్లు ఆదరించేందుకు అనువుగా, తనకు ఆప్తులైనవారిని ఈ కింది విధంగా ఆయా ముఖ్య బాధ్యతల్లో నియమించాడు.

యాచకబృందాల కోరికలను తీర్చటానికి కర్ణుణ్ణి, చతుర్విధాలైన ఆహారపదార్థాలను కమ్మగా వండించటానికి భీముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి సేవించటానికి అర్జునుణ్ణి, దకిణలు మున్నగువాటికోసం ధనాన్ని తెప్పించటానికి నకులుణ్ణి, దేవ బ్రాహ్మణులను, గురువులను, పెద్దలను అనుగుణంగా అర్చించి గౌరవించటానికి సహదేవుణ్ణి, సమస్త ప్రజానీకాన్ని రుచికరమైన ఆహారపదార్థాలతో సంతోషింపచేయడానికి ద్రౌపదీదేవిని నియమించాడు.

అలా ధర్మపుత్రునియాగం కొనసాగుతూ ఉండగా

అప్పుడు దేవేంద్రుడు మొదలైన దిక్పాలకులూ, బ్రహ్మాది దేవతలూ, కిన్నర సిద్ధ సాధ్య గరుడ చారణాది దేవబ్బందాలూ ధర్మజుడు నిర్వహిస్తూ ఉండిన యజ్ఞాన్ని చూచి, 'పూర్వం ఏ రాజన్యుడు కూడా ఇంత గొప్పగా రాజసూయాన్ని చెయ్యలేదు' - అని ఎంతగానో మెచ్చుకొన్నారు.

అంతేగాక, లక్ష్మీనాథుడైన శ్రీకృష్ణుని పాదపద్మాలను భక్తితో సేవించే అదృష్టంకలవాళ్లకు (ధర్మరాజాదులకు) పొందలేని సంపదలేవీ ఉండవు కదా! - అని బ్రహ్మాదిదేవతలు, దిక్పాలకులు, తదితరదివ్యగణాలూ పెక్కురీతుల ప్రశంసించారు. 

(ధర్మరాజు నిర్వహిస్తున్న రాజసూయయాగంయొక్క అపూర్వవైభవానికి కారణం - ఇందులో చక్కగా ఊహింపబడింది. శ్రీకృష్ణుని యెడల ధర్మరాజుకుగల అచంచలభక్తి అందరికీ తెలిసిందేనని ఇందువల్ల వెల్లడౌతూంది.)

దేవతలతో సమానమైన తేజస్సుగల ఋత్విజులు అగ్నిప్రతిష్ఠ చేసి, రాజసూయయాగం ద్వారా ఆయా హోమద్రవ్యాలను ధర్మతనయునిచేత క్రమంగా వేలిపించి, యజ్ఞాన్ని పరిసమాప్తి కావించారు. ఆ ముగింపురోజున ధర్మరాజు ఆయా ఋత్విజులనూ, పెద్దలయిన సభాసదులనూ సముచితమైన రీతిని పూజించాలని నిశ్చయించాడు.

(దేవతలకు అగ్నిముఖము - అని శాస్త్రప్రమాణం. 'అగ్నిముఖా వై దేవాః[ - అని ఆర్షోక్తి. ఇందువల్లనే యజ్ఞాలలో ఆ యా దేవతలను ఉద్దేశించి మంత్రపూర్వకంగా సమర్పించే హవిస్సులు అగ్నిలోనే హోమంచేయబడుతాయి. ఇక్కడ “అగ్నిముఖంబుగంజేసి” - అనటంలో “అగ్నిదేవుణ్ణి దేవతలకు ముఖంగా ప్రవర్తించేట్టుగా ప్రార్థించి, హోమకుండంలో అగ్నిని వెలిగించి - అనే విశేషమైన భావం ఇమిడివుంది.)

ఈ విధంగా పూజకు ఉపక్రమించే సందర్భంలో ధర్మసూనుడు 'ఇందులో అగ్రపూజకు అర్హులయిన వారెవరో?' - అని సవినయంగా సభను ప్రశ్నించాడు. సభాసదులు తమకు తోచినట్లు తలకొక రీతిగా కొందరను సూచించారు. అప్పుడు బుద్ధిశాలీ, మాటల్లో నేర్పరీ ఐన సహదేవుడు వారీ మాటల్ని వారించి, భగవానుడైన శ్రీకృష్ణుణ్ణి చూపిస్తూ 'ఈ మహానుభావుణ్ణి అగ్రపూజచే ఆనందింపచేస్తే సకలలోకాలూ సంతోషిస్తాయి' - అని చెప్పి అన్నయైన ధర్మరాజుతో ఇలా పల్కినాడు.

యజ్ఞం చేసే కాలం, ఆ యజ్ఞం, అందలి క్రియాకలాపాలు, యజ్ఞంలో ఉచ్చరించేమంత్రాలూ, హోమకుండంలోని అగ్నీ అందులో వేల్వబడే ఆహుతులూ, యజ్ఞాన్ని చేయించే బ్రాహ్మణులూ, యజ్ఞకర్తా, యజ్ఞఫలభోక్తా, ఈ సమస్త జగత్తులూ, వాటిల్ని నడపే దైవమూ, సకల జీవుల సృష్టి స్థితి, లయాలూ, వాటి హేతువులూ, వేళలూ - వీటన్నింటిలోనూ అఖండంగానూ, అద్వితీయంగానూ ప్రకాశిస్తూవున్న తేజస్స్వరూపుడు ఈ శ్రీకృష్ణుడే! (అని తెలియదగింది)

విష్ణు స్వరూపుడూ, ప్రభావశాలీ అయిన ఈ శ్రీకృష్ణుడు కన్నులు మూసుకొంటే చరాచరాలైన ఈ లోకాలన్నీ నశిస్తాయి; కన్నులు విప్పి చూస్తే ఈ లోకాలన్నీ మళ్లీ జన్మించి విస్తరిస్తాయి. ఇంతేగాక, సమస్తయజ్ఞాలకు ఫలాన్ని ప్రసాదించే ఈ మహాత్ముడే ఇందులో అగ్రపూజకు అర్హుడు. మరొకడెవ్వడూ ఇందుకు యోగ్యుడు కాడు.

ఓ మహారాజా! సమస్త లోకాలకు అధీశుడూ, అనంతుడూ, సకల శక్తిమంతుడూ, జ్ఞాన స్వరూపుడూ, లక్ష్మీనాథుడూ అయిన ఈ పురుషోత్తముణ్ణి ఇందు అగ్రపూజద్వారా సంతోషింపజేస్తే అఖిలజగాలూ పరిపూర్ణంగా ఆనందిస్తాయి. కాబట్టి, ఆలస్యం లేకుండా ఆ పూజాకార్యాన్ని పూర్తి గావింపగోరుతున్నాను.

'కావున ఆలసింపక నీవు శ్రీకృష్ణుణ్ణి పూజించు - అని సహదేవుడు ధర్శజునితో చెప్పిన మాటలు వినిన ఆ సభలోని ప్రజలు, రాజులు, ఋషులు మున్నగు వారందరూ మిగుల సంతోషించారు; 'సహదేవునిఅభిప్రాయం సముచితంగా ఉంది' - అన్నారు.

అనంతరం ధర్మరాజు మునీశ్వరుల మనస్సులనే తుమ్మెదలకు పద్మాలవంటివయిన శ్రీకృష్ణునిచరణాలను శ్రద్ధతో కడిగాడు. అట్లు కడిగిన ఆ జలాన్ని భక్తితో

ధర్మనందనుడు తానూ, తనతల్లి కుంతీదేవీ, నలుగురు సోదరులూ, పత్నిఅయిన ద్రౌపదిదేవీ అత్యంతఆసక్తితో, వైభవం విలసిల్లగా శ్రీకృష్ణునిపాదజలాన్ని తమ తమ శిరస్సులమీద చక్కగా చల్లుకొని, ఎంతో గొప్పగా ఆనందించారు.

బంగారు జలతారు కాంతులతో ఒప్పుతూ ఉన్న పట్టువస్త్రాలతోను, ఉదయిస్తున్న సూర్యునికాంతులను మించిన ప్రకాశమానమైన రత్నాలతోను ధర్మరాజు జయశీలుడయిన శ్రీకృష్ణదేవుణ్ణి (ప్రీతిగౌరవాలతో) పూజించాడు.

ఈ విధంగా పురుషోత్తముడైన శ్రీ కృష్ణుణ్ణి భక్తితో పూజించిన ధర్మజుని కండ్లనిండా సంతోషబాష్పాలు పొంగిపొరలినాయి. అందువల్ల ఆయన గోవిందునిమంగళకరమైన సుందరస్వరూపాన్ని స్పష్టంగా చూడలేకపోయాడు. ఇలా పూజించబడి ప్రకాశిస్తున్న పుండరీకాక్షుణ్ణి దర్శించి, అక్కడి సభలోని జనులందరూ శిరస్సులపై దోసిళ్లు చేర్చి స్తుతిస్తూ జయజయ ధ్వానాలు చేశారు. పైనుండి దేవతలు వివిధమంగళవాద్యాలను మోగిస్తూ పూలవానలు కురిపించారు.

అప్పుడు దమఘోషుని కుమారుడైన శిశుపాలుడు శ్రీకృష్ణునికి జరిగిన ఆ పూజావైభవాన్ని చూచి, సహించలేకపోయాడు. అసూయవల్ల కోపంతో ఆసనంనుండి దిగి, నిర్భయంగా రెండుచేతులను పైకి చాపినాడు.

శ్రీకృష్ణుడు వింటూ ఉండగా శిశుపాలుడు సభలోని వారిని తేరిపారజూచి ఇలా అన్నాడు.

కాలంయొక్క ప్రభావం అతిక్రమింప వీలు కానిది! ఇందుచేతనే ఈనాడు ఈ సభయందుగల మహర్షులు, మహారాజులు మొదలుగాగల బుద్దిమంతులైన పెద్దల బుద్ధులు ఒక బాలకుని (సహదేవుని) మాటలు విని నీతిమార్గంనుండి ఎందువల్ల తొలగిపోయాయో కదా!

ఇక్కడి ప్రాజ్ఞులు న్యాయమార్గాన్ని తప్పిన విధం ఏలాగంటే, యోగ్యులను అయోగ్యులను నిర్ణయించగల నేర్పరులు, గొప్ప సత్త్వగుణసంపన్నులు, తపోనియమశీలురు, తేజస్వులు, ఐశ్వర్యయుక్తులు, పరబ్రహ్మ స్వరూపం తెలిసిన జ్ఞానులు, సమస్తలోకపాలకులచే పూజింపబడినవారు, పాపరహితులైన పరమయోగీశ్వరులు- అనేకులు ఈ సభలో ఉన్నారు. వీళ్లలో ఏ ఒక్కరినీ లక్ష్య పెట్టకుండా, ఒక గొల్ల పిల్లవాణ్ణి ఉత్తముణ్ణిగా పూజచేయటానికి వీళ్లంతా ఎలా అంగీకరించినారో? ఇలా చేయటం పవిత్రమైన యజ్ఞపురోడాశాన్ని నక్కకు వేయడం వంటిది!

గురువులూ, దేవుడూ లేనివాడు, అలాగే కులగోత్రాలూ లేనివాడు, తల్లిదండ్రులు ఎవరో తెలియనివాడు, నిత్యం నీళ్లలో పొరలాడేవాడు, మొదలు, నడుమ,చివరలు లేని మానహీనుడు, అనేక రూపాలు ధరించి, పెక్కు విధాల ప్రవర్తిల్లేవాడు, వావివరుసలు, సంబంధబాంధవ్యాలు లేనివాడు అయిన ఈతడు మావల్ల ఒక మనిషిగా తయారయ్యాడు. వీళ్ల పూర్వుడైన యదువుకు యయాతిమహారాజు ఇచ్చిన శాపం కారణంగా యదువంశం రాజ్యార్హతను కోల్పోయి ప్రశస్తిలేని దయింది. అందుచేతనే వీళ్లకు బ్రహ్మవర్చస్సు నశించింది. ఇలాంటి ఈ గోపాలకుడు ఈ సభలోని బ్రహ్మర్షులందరికి పూజింప దగినవాడెలా అయినాడు? (కాలేడు)

ఈ కృష్ణుడు పుట్టిననాటినుండీ చోరుడు. అటుపై జారుడు. ఒక మార్గంలోగాక, మూడుదారుల్లో నడిచేవాడు. అటువంటి ఈతడు మిగుల ఉత్తమమైన అగ్రపూజాకార్యానికి అవశ్యంగా ఎలా యోగ్యుడయ్యాడు? - అని ఆ శిశుపాలుడు తీవ్రంగా అమంగళకరమైన మాటలతో (నిందించాడు)

శిశుపాలు డట్లు దూషించినప్పటికిని, నక్క కూతలను వినికూడా లెక్కపెట్టని సింహంవలె శ్రీకృష్ణుడు వాని మాటలను లక్ష్యపెట్టక, ధీరతతో ఉండినాడు. సభలో ఉండిన ఋషులు, రాజులుమాత్రం వాని పరుషవాక్కులకు చాలా బాధ పడినారు.

శిశుపాలుని పరుషవాక్కులను వినలేక సభలోని రాజులు, మునులు చెవులు మూసుకొంటూ, 'శ్రీ కృష్ణా! వీనిని ఏ గతికి చేరుస్తావో' - అని అంటూ ఆ శిశుపాలుణ్ణి నిందిస్తూ - ఆ సభనుండి వెళ్ళిపోయారు. అప్పుడు పాండవులు అంతులేని ఆగ్రహానికి లోనయ్యారు.

(భగవంతుణ్ణి నిందించిన వాడేగాక, ఆ నిందను విన్నవాళ్లుకూడ నరకంలో పడతారు- అనే విశ్వాసాన్ని అనుసరించి సభయందలి మహారాజులు, మహర్షులు చెవులు మూసుకొని సభనుండి వెలుపలికి వెళ్లారు.)

ఆ సమయంలో పాండవులు కేకయ, సృంజయ దేశాల రాజులతోపాటు ఆయుధాలు ధరించి వచ్చి శిశుపాలుణ్ణి హెచ్చరించారు. శిశుపాలుడు ఎవరినీ లెక్కపెట్టక, కత్తి, డాలు ధరించి శ్రీకృష్ణుని ఎదుటికి వచ్చి, వాళ్లనందరినీ నిందింపసాగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆగ్రహంతో లేచి, శిశుపాలుణ్ణి తీవ్రంగా చూస్తూ ఎంతో వాడి గల భయంకరమైన సుదర్శనచక్రంతో శిశుపాలుని శిరస్సును ఖండించాడు. ఆ కోలాహలాన్ని విని శిశుపాలుని సైన్యాలు, అతని పక్షంలోని రాజులు తత్తరపాటుతో పారిపోయారు.

మహారాజా! అప్పుడు అక్కడుండిన మునీంద్రులు, రాజులు చూచి ఆశ్చర్యపడుతుండగా శిశుపాలుని శరీరంనుండి ప్రకాశమానమైన ఒక జ్యోతిపైకి వచ్చి శ్రీకృష్ణుని దేహంలో ప్రవేశించింది.

అని పల్కిన శుకయోగీంద్రునితో పరీక్షిన్మహీపతి ఇలా అన్నాడు.

ఓ మునిశ్రేష్ఠ! శ్రీకృష్ణుణ్ణి నిందించిన శిశుపాలుడు మలంతో నిండిన నరకకూపంలో పడిపోవక ఆ భగవానుని దివ్యదేహంలోని ఉదాత్తమనస్కుడై ఏ విధంగా ప్రవేశింపగలిగినాడో సెలవియ్యండి!

అప్పుడు పరీక్షిత్తుయొక్క ప్రశ్నకు సమాధానంగా శుకుడు ఈ కిందివిషయం వెల్లడించాడు.

శిశుపాలుడు గతమూడు జన్మలనుండి వైరబుద్ధితో ఆ శ్రీమహావిష్ణుని రూపాన్నీ గుణాలను (నిందావ్యాజంతో) నిరంతరం ధ్యానించడంలో ఆరితేరి ఉండడంచేత సమస్తపాపాలనుండి విముక్తుడై బ్రహ్మరుద్రాదులకుకూడా అందరాని మోక్షపదవిని పొందాడు.

పిమ్మట ధర్మరాజు ఋత్విక్కులను, సదస్యులను గొప్పగా దక్షిణల నిచ్చి సంతోషింపచేసి, అనేక విధాల పూజించి, అవభృథస్నానం చేయాలనే ఆనందంతో బయలుదేరాడు.

మృదంగం, శంఖం, గోముఖం, డిండిమం, పణము మంగళవాద్యాల ధ్వనులు మిన్నంటుతుండగా, కవులు సూతులు, మాగధులు, గాయకులు, వందులు, వైతాళికుల - పొగడ్తలు అడుగడుగన వినిపిస్తూ ఉండగా, వేణువీణా మురజాది వాద్యాల శబ్దాల కనుగుణంగా నట్టువకత్తెలు నాట్యాలు చేస్తుండగా, అందమైన పతాకలుగల రథాలను, ఏనుగులను, గుర్రాలను ఎక్కి ధర్మజుని తమ్ములు, మిత్రులు, పురోహితులు హారకేయూర కిరీటాది ఆభరణాలను చక్కగా అలంకరించుకొని వైభవంతో ధర్మజుని వెంట కదలినారు.

అంతేగాక, యదు, కాంభోజ, కురు, కేకయ, కోసల దేశాధిపతులైన రాజులు చతురంగబలాలతో వెంట నడువగా, ఋత్విక్కులు, సదస్యులు వేద పారాయణం కావిస్తూ ముందు వెళ్లుతుండగా, సువర్ణ మాలికలు, దివ్య మణిహారాలు దేదీప్య మానంగా కంఠంలో ప్రకాశిస్తూవుండగా, వేగంగల గుర్రాలను పూన్చిన రథాన్ని పత్నీసహితుడై అధిరోహించి, అమిత వైభవంతో ధర్మరాజు ప్రయాణం సాగించినాడు.

ఆవేళ వారవనితల బృందాలు బంగారుకొండ సానువుల్లోని నెమళ్లవలె వాళ్లజుట్టుముడులు వీపులపై నాట్యంచేస్తుండగా, కదలుతున్న చెవికమ్మలందలి మంచిముత్యాలకాంతులు అద్దాలవంటిచెక్కిళ్లపై ప్రతిబింబిస్తుండగా స్థిరమైన మెరుపు తీగలవంటి వాళ్ల కడగంటి చూపులు వెలుగులను వెదజల్లుతుండగా, మంచుపొరచాటునుండి పైకెగయడానికి యత్నించే గుండ్రని జక్కవపిట్టలవలె వాళ్ల చన్నులు తెల్లని రవికలనుండి పైకి ఉబుకుతూవుండగా, స్తనభారంచేత చలిస్తున్న నడుములు గలవారై, ఒడ్డాణాలు నడుమున మెరుస్తుండగా, పైటలు జీరాడుతుండగా, హస్తకంకణాల, కాలి అందెల ధ్వనులు ఇంపుగా నినదిస్తుండగా తమతమ పరివారాలతో కలిసి ముందుకు సాగారు.

ధర్మనందనుని పరివారంలోని మందగమనలైన ఆ వారవనితలు చిరునగవులు తొణికిసలాడే తమ ముఖపద్మాలపై తుమ్మెదలవంటి ముంగురులు చలిస్తుండగా ఆనందంతో ప్రక్కనున్న తమవారిపై చిమ్మనగ్రోవులతో పన్నీరు చిమ్ముతూ కస్తూరి, కుంకుమ లేపనాలను వారిముఖాలమీద పూస్తూ, పూల చెండ్లను విసరుతూ, వరసైనవారితో పరిహాసాలాడుతూ వసంతకేళి జరుపసాగారు.

దేవకాంతలవంటి రాజపత్నులు చెలికత్తెలు వెనువెంట సేవిస్తూ నడువగా, బంగారుపల్లకీల నెక్కివస్తూ తమ సరసాలకు యోగ్యురాండ్రైన రాజకాంతల చెలికత్తెల పైకి తమ చెలికత్తెలను పురికొల్పి వసంతాలు చల్లిస్తూ, చమత్కార సంభాషణలతో చిరునవ్వులు చిందిస్తూ పయనం సాగించారు. ఈ రీతిగా గొప్ప సామ్రాజ్యవైభవంతో ధర్మరాజు గంగానదికి వెళ్లి, ధర్మపత్నీసమేతంగా పవిత్ర అవభృథస్నానం చేశాడు.

నిర్మలచరిత్రుడవైన పరీక్షిద్రాజేంద్రా! ధర్మరాజు సతీసమేతుడై అవభృథస్నానంచేసిన ఆ సమయంలో దేవతలు భేరులు మొదలైన మంగళవాద్యాలను మోగించి, పూలవాన కురిపించారు. మహర్షులు, దేవతలు, పితృదేవతలు ధర్మరాజుయొక్క ఆ యజ్ఞ అవభృథకార్యాన్ని ప్రశంసించారు.

మానవులు ఎంతటిపాపాత్ములయినా ఏ స్నానం చేసి, సకలపాపాలనుండి విముక్తులౌతుంటారో, అట్టి ప్రభావంగల ఆ అవభృథస్నానాన్ని అక్కడ చేరిన జనులందరూ ఆసక్తితో ఆచరించారు.

ధర్మరాజు కొత్తవైన పట్టువస్త్రాలను, పరిమళభరితమైన పూలమాలలను ధరించి, అనేక రత్నమయఆభరణాలను అలంకరించుకొని మహావైభవంతో ప్రకాశించాడు.

గంగానదీలో అవభృథస్నానం కావించిన తరువాత ధర్మరాజు మరల ఇంద్రప్రస్థనగరానికి వచ్చి

ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి బోలిన పరాక్రమశాలి, నిర్మలకీర్తికి నిలయుడు, సజ్జనులచే నిత్యం కొనియాడబడుతూ ఉండేవాడు అయిన పాండవజ్యేష్ఠుడు (ధర్మరాజు) రాజసూయ యాగాన్ని నిర్వహింపజేసిన ఋత్విజులను, సదస్యులను, బ్రాహ్మణోత్తములను, బంధువులను, మిత్రులను రాజులను అందరినీ సముచితంగా పూజించి, వారలకు ఒక్కొక్కరికి వరుసగా పట్టువస్త్రాలు, మణిమయాలయిన బంగారుఆభరణాలు మొదలైన అమూల్యవస్తువులను బహుమానంగా ఇచ్చాడు.

ఆ ప్రకారంగా ఇంద్రప్రస్థరాజధానియందలి స్త్రీపురుషులు అందరూ శ్రీకృష్ణదేవునియందు భక్తి తాత్పర్యాలు గలవారై, దైవీ తేజస్సుతో ప్రకాశిస్తూ, రత్నాభరణాలను, గంధమాల్యాదులను ధరించి పరమానందభరితులై ఉన్నారు.

మహారాజైన ధర్మజుడు నిర్వహిస్తూ ఉన్న రాజసూయయజ్ఞాన్ని చూడాలని భక్తితత్పరులై ఏతెంచిన దేవతలు, మునులు, బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, శూద్రులు ధర్మరాజుచే సముచితంగా సన్మానింపబడినవారైనారు. అలా సమ్మానింపబడినవారందరూ పరమసంతోషిత హృదయులై వినయంతో మహారాజువద్ద సైలవుగైకొని వెళ్లిపోయారు.

(మహారాజు ఎడల ఆనాటి ప్రజలకుగల భక్తి ప్రపత్తులు ఇక్కడ చక్కగా వెల్లడవుతున్నాయి.)

శ్రీకృష్ణదేవుని పాదపద్మాల్ని ఆరాధించే ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగవైభవాన్ని ప్రశంసిస్తూ, యజ్ఞానికి విచ్చేసినవాళ్లందరూ తమతమ నివాసభూములకు వెళ్లారు. ఆ సమయంలో ధర్మజుడు శ్రీకృష్ణుణ్ణి సాగనంపేందుకు ఇష్టపడక, ఇంకా కొన్నాళ్లు ఉండమని ప్రార్థించాడు.

ధర్మనందనుని ప్రార్ధనను మన్నించి శ్రీకృష్ణుడు తనవెంట వచ్చిన యాదవుల నందరినీ కుశస్థలీనగరానికి (ద్వారకకు) పంపించాడు. తానుమాత్రం కొంతమంది పరిజనులతో పాండవాగ్రజునికి ప్రియంగా ఇంద్రప్రస్థంలో ఉండినాడు - అని చెప్పి, శుకయోగీంద్రుడు పరీక్షిత్తుతో మళ్లీ ఇలా అన్నాడు.

శ్రీకృష్ణదేవుని భక్తాగ్రగణ్యుడైన ధర్మజుడు రాజసూయాన్ని నిర్వహించాలనే కాంక్ష అనే సముద్రాన్ని ఆ దేవదేవుడనే ఓడద్వారా దాటి, మానసిక చింతను అధిగమించి, ఘనమైన సంతోషంతో ప్రకాశించాడు. పద్మనాభుని దాసులకు సాధింపజాలని మహాకార్యాలు ఉండవుకదా!

రాజసూయం నిర్వహించిన ధర్మరాజు నెమ్మదిగా, సంతోషంగా ఉండిన ఆ సందర్భంలో

పరీక్షిద్రాజేంద్రా! కల్మషమైన మనస్సుగలవాడు, కులదూషకుడు - అయిన దుర్యోధనుడు తప్ప, తక్కిన సమస్త ప్రజలు శ్రేష్ఠమైన ఆ రాజసూయయజ్ఞంయొక్క వైభవానికి ఎంతో ఆనందించారు.

అని చెప్పగా, వినిన పరీక్షిత్తు శుకమహర్షితో మళ్లీ ఇలా అన్నాడు.

ప్రశస్తమైన చరిత్రగల మునీంద్రా! సమస్త జనులకు సంతోషాన్ని కలిగించిన ధర్మజుని రాజసూయయాగం దుర్యోధనునికి మాత్రం ఏ కారణంచేత సహింపరానిదైంది? ఈ విషయం నాకు వివరించండి!

అని ప్రశ్నించిన పరీక్షిన్మహారాజుతో శుకమహర్షి ఇలా అన్నాడు. 'దుర్యోధనుడు ఎల్లవేళల పాండవులకు అనేక అపకారాలు చేస్తూ ఉండినప్పటికీ శ్రీకృష్ణదేవుని దయావిశేషంచేత లభించిన రాజ్యలక్ష్మీమాహాత్యంచేత ధర్మరాజు నిత్యమూ విరాజిల్లుతున్నాడు. ఆయనకు లభించిన రాజ్యలక్ష్మీవైభవం ఎటువంటిదంటే - అది దేవ, దానవ, మానవ పరిపాలకుల రాజ్యలక్ష్మీ విభవాలను మించిన శోభావిశేషం గలిగి ప్రకాశిస్తూ ఉండేది.

తనకు చేకూరిన ప్రసిద్ధమైన, అనంతమైన సంపదలతోను గొప్పకీర్తితోను ధర్మరాజు అంతఃపురంలో తన రత్నాలంకారాల కాంతులు అంతటా ప్రకాశిస్తూ ఉండగా, మనోజ్ఞమైన ఆకారంగలవాడై, శ్రీకృష్ణదేవుణ్ణి మిగుల కుతూహలంతో, ఆసక్తితో సేవిస్తూ అధికమైన ఆనందంతో ఉన్నాడు.

దుర్యోధనుడొకనాడు మయసభా భవనంలో శ్రీకృష్ణునిపదునారువేలమంది పత్నులతో కలసిమెలసియున్న ద్రౌపదిని చూచాడు. ఆ పదహారువేలమంది పత్నులు ప్రాణంగల మాణిక్యపు బొమ్మలవలె, దివినుండి భువికి దిగివచ్చిన చంద్రోఖలవలె, శృంగారరసస్వరూపిణులైన మోహినీదేవతలవలె భాసిస్తూ ఉన్నారు. ద్రౌపది వారినడుమ మెరుపుతీగవలె ప్రకాశిస్తూ ఉంది. అలా వెలుగొందుతూ ఉన్న ద్రుపదనందన యొక్క వైభవాన్సీ, రాజసూయయజ్ఞంయొక్క మహోత్సవాన్ని కన్నారా కాంచిన సుయోధనుడు మనస్సులో ఎంతో కలతపడి, పరితాపమనే అగ్నిలో తపించిపోసాగినాడు.

ద్రౌాపదీదేవి అంతఃపురంలో విలసిల్లుతూవున్న పదహారువేలమంది శ్రీకృష్ణుని పత్నులు అష్టమినాటిచంద్రునిపోలిన అందమైన ఫాలభాగాలుగలవారై, ఇంద్రనీలమణుల కాంతులను పరిహసించే ముంగురులతో ప్రకాశిస్తూ ఉన్నారు. వారి కనుబొమలు మన్మథునిధనుస్సును తిరస్కరించేవిగా ఉండగా, కన్నులు కర్ణాంతవిశాలాలై కాటుకతో తళతళమెఱుస్తూ ఉన్నాయి. విరజాజిమొగ్గలవంటి పలువరుసలు గల వారిచిరునగవు వెన్నెలలు, కర్ణాభరణాల్లోని మణులకాంతులు విశాలమైనవాళ్ల చెక్కిళ్లలో కమనీయంగా కలిసిమెలసి ప్రతిఫలిస్తూ ఉన్నాయి.

ముత్యాలహారాలకు సైతం సందీయకుండా మిసమిసలాడుతున్న ఉన్నత వక్షోజాలతో, అరచేతిలో ఇమిడిపోతాయేమో అనిపించే సన్నని నెన్నడుములతో; చిఱుగంటల ఇంపైన సవ్వడులుగల బంగారు ఒడ్డాణాలు, మొలనూళ్లు గల కటిప్రదేశాలతో, చెంగలువపూరేకులవంటి లేలేత పాణిపాదతలాలతో, ఘల్లుఘల్లున మధురంగా ప్రతిధ్వనిస్తూవున్న కాలి అందెలతో, అంతటా కాంతులీనుతున్న భుజకీర్తులు, కంకణాలు, ఉంగరములు అలంకరించుకొన్న కరకమలాలతో, నలుదెసల అపూర్వ పరిమళాలను వెదజల్లుతూవున్న కస్తూరి, శ్రీగంధం, పచ్చకప్పురం మొదలైన ద్రవ్యాలతో తయారుచేసిన మైపూతలతో అపూర్వంగా ప్రకాశిస్తూ ఉన్నారు. వారు ప్రాణంతో ఉండే మాణిక్యాలబొమ్మల్లాగా, దివినుండి భువికి దిగివచ్చిన చంద్రరేఖవలె, శృంగారసం మూర్తీభవించిన మోహినీదేవతల్లాగా విరాజిల్లుతూండే మహాసౌందర్యవతులైన శ్రీకృష్ణుని పదునారువేల భార్యలమధ్య మెరపుతీగలాగా ప్రకాశిస్తూన్న ద్రౌపదీదేవి సౌభాగ్యాన్నీ రాజసూయయాగ మహావైభవాన్నీ చూచి, దుర్యోధనుడు అసూయతో లోలోపల బాధపడసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ధర్మరాజు నిర్మలమైన ఆ సభాభవనానికి వచ్చి

ఒకనాడు ధర్మరాజు మయుడు నిర్మించియిచ్చిన సభాభవనంలోని సింహాసనంమీద ఆసీనుడై కొలువు దీరాడు. కాడుకులు, తమ్ముళ్లు, పురోహితులు, బంధువులు, మంత్రులు, సేవకులు ఆయన్ను సేవిస్తున్నారు. వందిమాగధుల స్తోత్రపాఠాలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. చేతి కడియాలు కమనీయంగా ధ్వనిస్తూ ఉండగా యువతీలలామలు వింజామరలను వీస్తున్నారు. వివిధ దేవతాబ్బందాలచేత సేవింపబడుతున్న దేవేంద్రునివలె విరాజిల్లుతూ ఉన్న ధర్మనందనుణ్ణి తిలకించి సంతోషిస్తూ శ్రీకృష్ణుడు ఆ సభలో అలరారుతున్నాడు. ఆ సమయంలో కోపం, అసూయ, దురభిమానం - ఈ దుర్గుణాలే ధనంగా గలవాడైన దుర్యోధనుడు ఆ సభకు వచ్చాడు.

(తాను ఎదుటివారితో సుఖంగా యుద్ధంచేయగలవాడు గనుక 'సుయోధనుడు' అలాగే అతికష్టంతోనే ఎదుటివాళ్లు తనతో యుద్ధంచేయడానికి శక్యమైనవాడు గనుక 'దుర్యోధనుడు'. ఈ రీతిగా కురురాజుకు ఈ రెండుపేర్లు సాభిప్రాయంగా ఏర్పడ్డాయి.)

స్వర్ణమయాలైన మణిభూషణాలు ధరించి, రాజసం ఉట్టిపడే తేజస్సుతో దుర్యోధనుడు తమ్ములు, రాజులు ఇరువైపుల తనను సేవిస్తూ రాగా, ముందుభాగంలో

దుర్యోధనుడు ఆ విధంగా మహావైభవంతో ధర్మరాజు కొలువు దీరియున్న మయసభా భవనంలోనికి విచ్చేశాడు. ఆ సభాభవనం అంతటా దానవశిల్పాచార్యుడైన మయుని మాయాశక్తిచేత భ్రమింపజేస్తూంది.

ఆ విధంగా సభకేతెంచిన సుయోధనుడు నీళ్లు లేని స్థలంలో నీళ్లున్నవని భ్రమపడి, కట్టుకొన్న వస్త్రాలు పైకి లాగుకొన్నాడు. అలాగే, నీళ్లున్నచోట నీళ్లు లేవనుకొని మామూలుగా వెళ్ళినందువల్ల వస్త్రాలు తడిసిపోయి, తడబడి ఆ నీటిపట్టులో చతికిలపడ్డాడు.

ఆ విధంగా భ్రాంతికి గుఱియైన దుర్యోధనుణ్ణి చూచి భీముడు నవ్వాడు. ధర్మరాజు సైగచేసి వారిస్తున్నా లెక్క చేయక అక్కడున్న రాజులు, స్త్రీలూ

దుర్యోధనుడు మయసభాభవనంలో తనకు జరిగిన అవమానానికి సిగ్గుతో తలవంచుకొని, కోపంతోతన నగరానికి వెళ్లాడు. అప్పుడు బుద్ధిమంతులైన సభ్యుల వేళాకోళంతో కూడిన సందడిధ్వని వినిపించింది. అందుచేత ధర్మరాజు చింతతో చిన్నబోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు భూభారాన్ని నివారించటానికి అవతరించినవాడు కావడంచేత ఆ పరిహాసకులను నివారించక మౌనం వహించాడు.

పరీక్షిన్మహారాజా! ఆ తరువాత శ్రీకృష్ణదేవుడు ధర్మనందనుణ్ణి వీడ్కొని, సతీసుతహితబంధుసమూహసమేతంగా సంతోషంతో ద్వారకాపురికి వెళ్లాడు.

జరాసంధునిచెరలో ఉన్న ఇరవైవేల ఎనిమిదివందలమంది రాజులను బంధవిముక్తులను కావించడం; శిశుపాలుణ్ణి సంహరించడం, ధర్మనందనుని రాజసూయ యజ్ఞాన్ని సంరక్షించటం - ఈ ఘనకార్యాలను ఉదారబుద్ధితో చేసిన శ్రీకృష్ణదేవుని పవిత్ర చరిత్రలోని విజయ గాథలను అభినివేశంతో చదివేవాళ్లు సకలసౌభాగ్యాల్నీ, బహుపుత్రసంతతిని, మంచి తెలివితేటల్ని స్వచ్చమైన కీర్తిని, తుదకు విష్ణుసాయుజ్యాన్ని(మోక్షాన్ని) పొందుతారు.

శ్రీకృష్ణుని కథలను పఠిస్తే కలిగే సత్‌ఫలితాలను గూర్చి చెప్పిన అనంతరం, శుకయోగీశ్వరుడు పరీక్షిత్తును చూచి, 'ఆ అవతారపురుషుడు కావించిన అద్భుతకార్యాలను వినిపిస్తాను; ఆసక్తితో ఆలకించమని - అన్నాడు.

సాల్వుండు శివప్రసాదంబున సౌభకవిమానంబు వడసి ద్వారకాపురిపై దండెత్తుట







Karaagrhavimuktulagu Rajulu Srikrishnuni Stuthinchuta - కారాగృహవిముక్తులగు రాజులు శ్రీకృష్ణుని స్తుతించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
కారాగృహవిముక్తులగు రాజులు శ్రీకృష్ణుని స్తుతించుట

అర్జునుడు, శ్రీకృష్ణుడు భీమ సేనుణ్ణి గౌరవంతో కౌగలించుకొని అతని పరాక్రమానికి ఆశ్చర్యపడి ఆనందంతో పొగడారు.

శ్రీకృష్ణుడు దయాసముద్రుడు, భక్తజనులపట్ల వాత్సల్యం కలవాడు కాబట్టి, జరాసంధునికొడుకైన సహదేవుణ్ణి ఆదరించి ఆ రాజ్యానికి అధిపతిగా నూత్నపదవి నిచ్చి స్వయంగా పట్టాభిషేకమహోత్సవం జరిపించాడు.

జరాసంధునిచేత చిక్కి చెఱసాలలలో అధికమైన దుఃఖంతో బాధపడుతూ, శ్రీకృష్ణుని పాదపద్మాలనే స్మరిస్తున్న రాజులను

శ్రీకృష్ణుడు చెఱలోనిరాజులు పంపిన బ్రాహ్మణునిమాటలు తన మనస్సున గుర్తుపెట్టుకొని ఉండడంచేత - ఆ రాజులను వెంటనే విడుదల చేయించాడు. ఆ రాజులంతా చిరకాలంగా చెరసాలలో ఉండటంచే చిక్కిపోయి రక్తమాంసాలు లేక ఎండిపోయారూ, దుమ్ము కొట్టుకుపోయిన దేహం గలవారూ, జుట్టు చిక్కులు పడి జడలు కట్టి ఉండగా, బట్టలు మాసిపోయి సంస్కారహీనమైన స్థితిలో శ్రీకృష్ణునివద్దకు వచ్చారు.

అప్పుడే వికసించిన తామరలవంటి కన్నులుగలవాడూ, సంసారబంధాలను విడిపించేవాడూ, శుభమైన ఆకారంగలవాడును, పుణ్యాత్ముడూ, కంకణాలు, భుజకీర్తులు, బంగారుఅందెలు కలవాడూ, ప్రకాశిస్తున్న వివిధ ఆభరణాలు కలవాడూ, దోషరహితుడూ, గరుడవాహనుడూ, భక్తులకు మేలైన ఉత్సాహాన్ని కలుగజేసేవాడూ, శివునిచే నమస్కరింపబడే వాడు, మేలయిన కిరీటం గలవాడు, ఇంద్రనీలంవంటి దేహంగలవాడు, మేలైన పసుపు పచ్చని పట్టుబట్ట కలవాడు, మొలనూలు దాల్చినవాడు, జగత్తునందంతట విహరించేవాడు, హారాలు వనమాల మున్నగువాటిచే ప్రకాశించేవక్షస్థ్సలం గలవాడూ, శంఖచక్రాదిఆయుధాలుగల హస్తాలుగలవాడు, వక్ష
స్థ్సలంపై శ్రీవత్సమనే గుర్తు గలవాడూ, మంచి నడవడిక గలవాడూ, దేవకీదేవి కుమారుడూ అయిన శ్రీకృష్ణుణ్ణి రాజులు చూచి

ఆ రాజులందరు మిక్కిలి సంతోషించిన మనస్సులు కలవారై అన్ని బంధాలను తొలగించుకొని, తమ తలలు శ్రీకృష్ణుని పాదకమలాలకు తాకేటట్లు సాగిలబడి మ్రొక్కి వినయంతో వంగి, చేతులు జోడించుకొని మంచికరుణగలవాడూ, సజ్జనుల దుఃఖాన్ని పోగొట్టేవాడూ, వివేకవంతుడైనవాడూ, ఆశ్రయించినవారిని పోషించడంలో గొప్పవాడూ, పాపాలను పోగొట్టేవాడూ అయిన ఓ స్వామీ! - అని

కోరిన కోరికలన్నీ తీర్చేవాడూ, పద్మం బొడ్డున కలవాడూ, పాపాలను హరించేవాడూ, సర్వాన్ని సృష్టించేవాడూ,

వేదవేద్యుడు, సేవకుల దుఃఖాలను నశింపజేసేవాడూ, సర్వప్రాణులలో వసించేవాడూ, నశించనివాడూ, మేర లేనివాడూ, శ్రీలక్ష్మీనాథుడూ అయిన నీకు మేము సర్వదా నమస్కరిస్తున్నాము.

యాదవవంశశ్రేష్ఠుడవు అయిన - ఓ కృష్ణా! క్రూరుడైన జరాసంధుని నిర్బంధంలో మేము పొందుతున్న దుఃఖతాపాన్ని నీ కరుణావలోకమనే జడివానతో పోగొట్టి నీ పాదాలను ఆశ్రయించిన మమ్మల్ని ఆదరించావు. విచారింపగా మంచివారిని రక్షించుట, చెడ్డవారిని శిక్షించుట నీ పనులుకదా! అన్నారు.

శ్రీకృష్ణా! మా విన్నపం చిత్తగింపవయ్యా! జరాసంధుడు మాకు దగ్గర చుట్టమేగాని పగవాడు కాడు. మేమును రాజ్యలక్ష్మిచేత కన్నుగానక ఉన్నవారం. ఇట్టి మా విషయాలు చెప్పే పని ఏముంది? లోకంలో దుష్టులగువారు నీటి అలలవలెను, దీపజ్వాలవలెను క్షణకాలంలో నశించే సంపదలనే గొప్పగా తలచి, ఆ సంపదలనే నమ్ముకొని పరలోకసాధనకై చేసే కార్యక్రమా లేవీ చేయడానికి ప్రయత్నించక, పరలోకసాధనకు అడ్డుపడే ఆ పరస్పరవిరోధ భావంతో ప్రజలను బాధించే ఆలోచనలతో తిరుగుతూ ఉంటారు.

లక్ష్మీనాథా! త్రైలోక్యశరణ్యా! ఓ శ్రీకృష్ణా! ఈ లోకంలోని జనులు వ్యర్థమైనకోరికలు గలవారై దప్పిగొన్నవాడు ఎండమావుల్లో నీళ్లున్నాయని భ్రమపడి త్రాగవచ్చును అనే ఆశతో ముందుముందుకు పోతున్నట్లు మెలగుతూ ఈ జన్మమనెడి సముద్రం ఆవలి గట్టును చేరలేక నశిస్తుంటారు. కాబట్టి, మరణించి ఈ లోకంలోని సుఖాలను పొందనేరని ఈ కష్టాలను మేము పడలేము. మమ్మల్ని రక్షించు.

భక్తజనులను సంసార సాగరంనుండి దాటించేవాడా! ఉదరంపై తులసి మాలలు వ్రేలాడుతూ ఉండేవాడా! ప్రపంచసృష్టికి హేతువైనవాడా! వేదాంతమార్గాన్ని చక్కగా అలంకరించే నీ అడుగుతామరలు మా మనస్సులలో శుభస్థితిని నిలచి ఉండేటట్లు చేసి, నిత్యము భక్తితో నీ పాదాలను సేవించే ఉపాయం మాకు తెలియజేయవయ్యా!

అంటూ ఈ విధంగా రక్షింపుమని తనను ప్రార్ధించినరాజులను చూచి, భక్తరక్షణశీలుడైన శ్రీకృష్ణుడు దయాంతరంగుడై ఆ రాజులతో ఇలా బదులు పలికాడు.

ఓ రాజులారా! మీరు చెప్పిన మాట నిజము. రాజ్యమదంచేత మంచిచెడ్డలు విచారించక మూఢబుద్దులై, బ్రాహ్మణులను, రాజ్యంలోని ప్రజలను మిక్కిలి బాధించడం చేతనే కదా! వేనుడు, నహషుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు అనేవారు మునుపు నశించారు. కాబట్టి, ధర్మం తప్పక పరిపాలించటంచేత వంశమూ, బలమూ, దీర్ఘాయుస్సూ, గౌరవమూ చెడకుండా ఉంటాయి. ధర్మపాలనమే సర్వాన్నీ రక్షిస్తుందని శ్రీకృష్ణుడు రాజులతో చెప్పాడు.

కావున ఈ శరీరం శాశ్వతము కాదని మీరుమీ మనస్సులలో తెలుసుకొని

ఓ రాజులారా! మీరు ధర్మం, నీత్తి, మర్యాద తప్పకుండా భూప్రజలకు సుఖాలు, సంపదలు, సమకూడేటట్లు కాపాడుతూ, విశేషాలైన యజ్ఞాలు గౌరవంతో నాకు సమర్పణగా చేస్తూ నా పాదపద్మాలను సేవిస్తూ పుణ్యాత్ములై లెస్సగా నడచుకోండి అని శ్రీకృష్ణపురమాత్మ చెప్పాడు.

అట్లు నడచుకొనిన మీరు మోక్షాన్ని పొందడమేగాక నా పాదాలయందు భక్తిగల్గినవారౌతారు అని చెప్పి శ్రీకృష్ణుడు ఆ రాజులందరికీ శుభప్రదమైన మంగళస్నానాలు చేయించి వారికి వివిధాలైన రత్నాభరణాలు, మెత్తని వస్త్రాలు, పూలదండలు, చందనాది మైపూతలు ఇప్పించి అలంకరింపచేసి మంచి భోజనతాంబూలాదులను ఇచ్చి మిక్కిలి తృప్తి పరచి వారివారికి తగినట్లు రథాలు, గుర్రాలు, ఏనుగులు వాహనాలుగా ఏర్పాటుచేసి, గౌరవించి వారివారిరాజ్యాలకు పాలకులుగా పంపాడు.

ఈ విధంగా రాజులు శ్రీకృష్ణునిచే చెరసాలలనుండి విడువబడి మిక్కిలి ఆనందంతో, మంచి సంపదలు కలుగగా వారివారి నగరాలకు వెళ్లారు.

శ్రీకృష్ణుని కల్యాణ గుణాలు సదా కీర్తిస్తూ ఎంతో స్వచ్చమైన మనస్సుగలవారై తల్లిదండ్రులు, బంధువులు, తనయులు, భార్యలు, సేవకులు ఆనందింప పద్మదళాక్షుడగు శ్రీకృష్ణుణ్ణి 

శ్రీకృష్ణుని బహువిధాలుగా స్తుతిస్తూ తమ తమ దేశాలకు వెళ్లి

ఆ రాజులు పద్మదళనేత్రుడైన శ్రీకృష్ణుడు తమకు బోధించిన ధర్మమార్గాల్లో క్రమంతప్పక నడచుకొంటూ తమ మేలైన పరిపాలనవిధానాలు ప్రకాశించగా భూమిని ఏలుతూ సుఖాలు అనుభవించసాగారు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి చంపి, ఆయనచే చెరలో పెట్టబడిన రాజులను చెరనుండి విడిపించి, భీమార్జునులు తాను జరాసంధునికొడుకైన సహదేవుడు చేసిన మర్యాదలు స్వీకరించి, అతణ్ణి రాజ్యంలో నిలిపి, అందుండి బయలుదేరి కొన్నిప్రయాణాలు చేసి, ఇంద్రప్రస్థపురానికి వచ్చి, ఆ పురద్వారంలో నిలిచి, తమ విజయగాథను తెలియపరిచేతీరులో శంఖనాదం చేయగా ఆ పట్టణంలోని జనులు జరాసంధుడు మరణించాడని సంతోషించారు. ఆ మహాధ్వని శత్రువులకు భయం కలిగేటట్టు, బంధుజనులకు ఆనందాన్ని కలిగించేటట్లు ఉంది. శ్రీకృష్ణుడు భీమార్జునులతో నగరంలోకి వచ్చి, ధర్మరాజుకు నమస్కరించి - తాము వెళ్లిన విధానం, జరాసంధుణ్ణి చంపిన పద్ధతీ, చెరసాలలోని రాజులందరను విడిపించిన విశేషాల్ని సవివరంగా తెలియజేశాడు. ఆ విషయాలు విని ధర్మరాజు శ్రీకృష్ణుని మహిమకు, తమ విషయంలో అతనికి గల భక్తి, స్నేహం, దయ మొదలైన గుణాలకు ఎంతో ఆనందిస్తూ శ్రీకృష్ణుణ్ణి చూచి ఇలా చెప్పాడు.

'ఓ శ్రీకృష్ణా! నీ అంశతో బుట్టిన వారైన రాజులు నీ ఆజ్ఞను శిరసావహించి ఎల్ల లోకాలు ఏలుటకు సమర్దులై ఉన్నారు. అట్టి నీవు ఒక రాజు చెప్పిన పని చేయటం నీ మాయ కాక నిజమా? ఏక స్వరూపుడవు, అద్వితీయుడవు, నాశం లేనివాడవు అయిన నీ ప్రకాశానికి ఎప్పటికైన హాని ఉందా? లేదు. జ్ఞాన స్వరూపుడవు, పుండరీకాక్షుడవు, వేదాలచే తెలియబడేవాడవు, లోక రక్షకుడవు అయిన నీ అడుగులను నమ్మి కొలిచే వారికి తాను, ఇతరుడు అనే భేదబుద్ధి ఉంటుందా! (ఉండదు?)

ధర్మరాజు చేసెడి రాజసూయమునందు శ్రీకృష్ణుండు శిశుపాలుని వధించుట







Srikrishna Sahayum Dagu Bheemudu Jarasandhunitho Yuddhamu Seyuta - శ్రీకృష్ణ సహాయుం డగు భీముడు జరాసంధునితో యుద్ధము సేయుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
శ్రీకృష్ణ సహాయుం డగు భీముడు జరాసంధునితో యుద్ధము సేయుట

రెండుపర్వతాలు, రెండుసముద్రాలు, రెండుసింహాలు, రెండుఆబోతులు, రెండుఅగ్నులు, రెండుఏనుగులు - ఒకదానితో ఒకటి తలపడి పోరాడుతున్నట్లుగా మిక్కిలి భయంకరంగా, ఒకరి గద మరొకరి గదకు తగులుటచే నిప్పు కణికలు రాలుతుండగా, పెచ్చురేగి కుడినుండి ఎడమకు, ఎడమనుండి కుడికి తిరుగుతూ, సింహంవలె ఎగిరి దూకుతూ, దగ్గరకు పోయి, వెనక్కు వస్తూ, దూరంగా పోయి దగ్గరగా వస్తూ, ఎంతో పైకి, భూమికి మ్రొగ్గుతూ, నేలమీదకు వంగి పైకి ఎగురుతూ భూమి అదరునట్లు కేకలు వేస్తూ, భయంకరాలైన గదల తాకిడిచే పుట్టిన ధ్వని ఆకాశాన్ని బ్రద్ధలు చేస్తుండగా జరాసంధుడు, భీముడు పోరాడారు.

జరాసంధుడు గదసారించి భీముని తలమీద భూమి అల్లలాడునంతటి తీవ్రంగా కొట్టగా, ఆ దెబ్బను తప్పించుకొని ఉగ్రమైన కోపంతో, ఎఱ్ఱబడిన ముఖంతో శత్రువుయొక్క తలపై భీముడు కొట్టగా, జరాసంధుడుకూడ ఆ దెబ్బను తప్పించుకొన్నాడు.

భీమసేనుడు, జరాసంధుడు ఒకరికొకరు తీసిపోక, పూనికతో పెద్దపులులు విజృంభించి, పోరాడేటట్లు ఒకరికొకరి - వీపులు, మూపులు, తొడలు, మొలలు, మోకాళ్లు, ముంజేతులు మాడుపట్టులు - మొదలగు అవయవాలు విరుగునట్లుగా కొట్టుకొంటూ, పిడుగులలాంటి ఆ గదల దెబ్బలు ఒకరు కొట్టినవి మరొకరికి తగులకుండ తప్పించుకొంటూ పోరాడారు.

భీమజరాసంధులు నేర్పుతో పెద్దగదలు పొడిపొడి అగునట్లుగా తాడిస్తూ, ఆకాశంనుండి పిడుగులు పడుతున్నట్లుగాను, నక్షత్రాలు రాలిపడేటట్టు, గదలు కొట్టుకొనే వేగానికి పుట్టిన నిప్పురవ్వలు ఆకాశాన్ని కప్పివేసేటట్టు, దిక్కులు చలించగా, సముద్రాలు పొంగేటట్లు, భూమి బ్రద్దలయ్యేటట్లు - ఒకరొకరి సత్తువలు తగ్గేటట్లు కొట్టుతూ, తడబడే విధంగా నొక్కి పట్టి, దూరానికి వెళ్లి దగ్గరకు వచ్చి, వెనుకముందులకు తిరుగుడు పడునట్లు కొట్టుతూ, వడవడ వణికేటట్లు చేసి ఇద్దరిలోను గల పట్టుదల తగ్గక, వేగం తగ్గక ఉత్సాహంతో పోరాడుతుండగా

ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉండగా ఇద్దరిగదలు ఒకదాని తాకిడికి ఒకటి విఱిగి పొడిపొడియై పోగా, నిరుత్సాహపడక మదించిన దిగజముల తొండాలను పోలే నిడుపాటి భుజాలను చఱుచుకొంటూ పిడికిటి పోట్లతో పోరాడటానికై కలియబడ్డారు.

కాళ్లతో తన్నుతూ, కీళ్లు సడలునట్లు పడద్రోసి, ఓపికలు నశింప చేస్తూ, పెడకేల వేస్తూ, నుదురులు, చంకలు, దవడలు, గుండెలు దెబ్బలు తగిలి ఎముకలు వ్రేలాడగా, మెదడునందలి మాంసము పిండియై నేలపై రాలగా, ఆయా అవయవాలకు తగిలిన పెద్దపెద్ద దెబ్బలనుండి రక్తము ఏరులై పారగా, బేతాళాది పిశాచాలు తాళాలు తట్టుతూ నృత్యం చేయగా భీమజరాసంధులు పోరాడారు.

ప్రక్కలు, చెక్కిళ్లు, మెడలు అరచేతితో విరగగొట్టుతూ, ముక్కులు, రొమ్ములు, చెవులు, పిడికిళ్లతో గ్రుద్దుకుంటూ, డొక్కలు, పిక్కలు కఠినమైన కాలిదెబ్బలతో నొప్పిస్తూ, యుద్ధక్రమాలు మానక, ఒకరికొకరు తగ్గక ఎదుర్కొని, పేర్లు చెప్పుకొని కొట్టుకుంటూ భయంకరంగా భీమ జరాసంధులు పోరాడారు.

హుంకారధ్వనులు చేస్తూ, దూరంగా పోతూ, మరల దగ్గరికి వస్తూ, ఇదిగో ఈ దెబ్బ కాచుకోమంటూ, దేహాలు నలిగి పోయేటట్లు మోకాళ్లతో క్రుమ్ముతూ, పిడికిళ్లతో శరీరంలోని ఎముకలన్నీ విరిగేటట్లుగా పొడుస్తూ - శరీరం ఆ ముక్కలతో గుల్లలతో నిండిన సంచివలె ఉండగా, నిట్టూర్పులు విడుస్తూ, మూర్చపోతూ, అంతలోనే తెప్పరిల్లుతూ, తమ శౌర్యం బలపరాక్రమాలు ప్రదర్శిస్తూ పోరాడినారు.

(గుల్లల తిత్తులు - పూర్వం సున్నం తయారు చేయడానికి నత్తగుల్లలను వాడేవారు. ఆ గుల్లలు తేలికగా డొంకల వలె ఉంటాయి. ఈ వీరులు ఎముకలు గుల్లలయ్యేటట్లుగా కొట్టుకోవడంలో వారిశరీరాలు గుల్లలతో నింపిన సంచులవలె గలగలలాడుతున్నాయని వర్ణనం.)

ఈ విధంగా భీమజరాసంధు లిద్దరూ వజ్రాయుధం దెబ్బలవంటి పిడికిటిపోట్లచేతను, ఒకరినొకరు గట్టిగా కొట్టుకోవడంవల్ల నెత్తురులు కారుతూ వారిశరీరం నెత్తురుతో తడిసి, పూచిన అశోకపు చెట్లవలెను, ఎఱ్ఱనికొండలవలెను ఒప్పుతుండగా తీవ్రంగా పోరాడుతుండగా, శ్రీకృష్ణుడు జరాసంధుని జన్మరహస్యం, మరణవిధానం తెలిసినవాడు కనుక, భీముడు అలసిపోకుండా శౌర్యం చెడి నీరసపడకుండ తనదివ్యతేజాన్ని అతనిదేహంలో చొప్పించి, దేహబలాన్ని చేకూర్చాడు. ఒక రెమ్మను తీసుకొని నిలువుగా చీల్చి, రెండుభాగాలుగా చేసి చూపి ఈ విధంగా చంపమని సైగ చేశాడు. భీముడు శ్రీకృష్ణుని సైగలోని రహస్యాన్ని గ్రహించి, జరాసంధుణ్ణి నేలమీద పడవేసి తనకాళ్లతో వాని ఒకకాలిని గట్టిగా కదలకుండ తొక్కిపెట్టి, రెండుచేతులతోను రెండవకాలిని కదలకుండ పట్టుకొని - ఒక పక్కకాలు, చేయి, కన్ను, ముక్కు తొడలు, మీగాళ్లు, కడుపు మొదలైన అవయవాలన్నీ రెండుచీలికలుగా చీల్చి పడవైచి సింహనాదం చేయగా పౌరులు ఆ దృశ్యాన్ని చూచి భయపడి హాహాకారాలు చేశారు అప్పుడు

కారాగృహవిముక్తులగు రాజులు శ్రీకృష్ణుని స్తుతించుట







Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...