Wednesday, December 31, 2025

Undralla Tadde Katha - ఉండ్రాళ్ళ తద్దె కథ

ఉండ్రాళ్ళ తద్దె కథ

పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను చిత్రాంగి అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు.

ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు ఉండ్రాళ్లతద్ది అనే నోమును నిర్వహించుకుంటున్నారని చెలికెత్తెల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి, రాజుతో.. నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాళ్ల తద్దీ నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్య అవడంవల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యలమీద వున్న ప్రేమ నా మీద కూడా వుంటే.. ఉండ్రాళ్ల తద్దీ నోమును అవసరమైన సరుకులను నాకోసం ఏర్పాటు చేయ మని అడిగింది.

ఆమె కోరికను రాజు అంగీకరించి.. నోముకు కావలసిన పదార్థాలను, సరుకులను ఆమెకోసం ఏర్పాటు చేస్తాడు. అవి అందగానే వేశ్య అయిన చిత్రాంగి.. భాద్రపత తృతీయనాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తుంది. సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుడా ఉపవాసం వుంటుంది. చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో తయారుచేసుకున్న
ఉండ్రాళ్లు వండుకొని ముత్తయిదువును తీసుకొనివచ్చి అయిదు ఉండ్రాళ్లు నైవేద్యము పెట్టి అయిదు ఉండ్రాళ్లు వాయనము, దక్షిణతాంబూలము ముత్తయిదువ కిచ్చి యావేశ్యకాంత యధావిధిగ నోము నోచుకొనెను. ఈ ప్రకారము అయిదేండ్లు నోము నోచుకొని అయిదుగురు ముత్తయిదువులకు తలయంటి నీళ్ళుపోసి గోరింటాకిచ్చి అయిదు రవికెల గుడ్డలను, అయిదు డబ్బులును, తాంబూలములనిచ్చి యా నోము నుద్యాపనము చేసుకొనియెను. కథలోపమైనా వ్రతలోపము కాకూడదు. భక్తితప్పినా ఫలము తప్పదు. దాని ఫలితంగా ఆమె పవిత్రంగా, సద్గతిని పొందుతుంది. 

వ్రత విధానం:
భాద్రపద తృతీయనాడు స్త్రీలు ఉదయాన్నే లేచి ముందుగా అభ్యంగన స్నానం ఆచరించాలి. సాయంత్రవరకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోకుండా ఉపవాసం వుండాలి. బియ్యపు పిండితో తయారుచేసిన ఉండ్రాళ్లను చేసి, వాటిని వండుకోవాలి. గౌరిదేవిని పూజామందిరంలో ప్రతిష్టించుకున్న తరువాత పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.

తరువాత ఐదు ఉండ్రాళ్లను గౌరిదేవికీ, మరో ఐదు ఉండ్రాళ్లను ఐదుగురు ముత్తైదువులకు వాయనమివ్వాలి. ఇలా ఐదు సంవత్సాలవరకు ఈ నోమును ఆచరించిన తరువాత వచ్చిన వారందరి పాదాలకు పసుపు-పారాణి రాసి, వారి ఆశీస్సులను పొందాలి. పెళ్లికాని అమ్మాయిలు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడు.

ఇతర విశేషాలు:
భాద్రపద బహుళ తదియరోజు స్త్రీలు సద్గతులు పొందడానికి ఉండ్రాళ్ల తద్ది నోమును ప్రత్యేకంగా ఆచరించి, నిర్వహించుకుంటారు. ఈ నోమును మోదక తృతీయ అనే మరో పేరు కూడా వుంది. ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడంతో.. తద్ది అనేమాట మూడవరోజు తదియ అనే అర్థంతో ఉపయోగించబడింది. దీంతో ఇది ఉండ్రాళ్ల తద్దిగా పిలువబడుతుంది. భాద్రపదంలో పూర్ణిమ వెళ్లిన మూడోరోజున బహుళ తదియనాడు ఈ నోమును నోచుకోవాలని పూర్వీకులు నిర్ణయించారు. అంతేకాదు.. సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి ఈ నోము గురించి వివరించాడని ఐతహ్యం.


No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...