Wednesday, December 31, 2025

Padaharu Kudumula Katha - పదారు కుడుముల తద్దెకథ

పదారు కుడుముల తద్దెకథ

ఒక రాజుకూతురు పూర్వజన్మమున పదారుకుడుముల తద్దినోము పట్టి యది యుల్లంఘనము చేసినందున ఆమెకు దారిద్య్రమును, వైధవ్యమును సంభవించెను. ఆ దారిద్య్రబాధకామె యనుభవింపజాలక ప్రాణములు విడువనెంచి యొకనాడొక యడవిత్రోవను బట్టి పోవుచుండెను. అప్పుడు భూపరిపాలనకై పార్వతీ పరమేశ్వరులా దారిని వచ్చుచు నాయింతిని జూచి "నీవెవరవు? ఇట్లేల నొంటరిగా నీకారడవిలో భయములేక పోవుచున్నావ"ని యడుగగా "కుడువకూడు, కట్టబట్ట, దారిద్య్రముచేత బాధపడలేక యీ యడవులబట్ట పోవుచున్నా" ని ఆమె చెప్పెను. అప్పుడు పార్వతీదేవి - "నీవు పదియారు కుడుములబెట్టి నోముపట్టి యుల్లంఘనము చేసినావు కనుక, యిట్టి బీదతనము నిన్ను బాధించుచున్నద" ని చెప్పెను. అది విని ఆ రాజకుమార్తె "అమ్మా! యాలోటు నేనెట్లు పూర్తిచేసుకొనగలుగుదును? దయచేసి చెప్పవలయున" ని ప్రార్థించెను. అందుకు పార్వతీదేవి యామెతో "నీవిప్పుడు తిరుగనింటికిపోయి భాద్రపదశుద్ద తదియనాడు నోముపట్టికథ చెప్పుకొని యక్షింతలువేసుకొని యానోము నుద్యాపనచేయు" మన, పార్వతీ పరమేశ్వరులకు భక్తితో నమస్మారముచేసి వారివద్ద సెలవుతీసుకొని, యింటికిపోయి తలంటి నీళ్ళుపోసుకొని బిళ్లకుడుములు వండుకొని, చల్ల తెచ్చుకొనుటకై పొరుగింటి కేగెను. ఆ సమయముననొక కుక్కవచ్చి యోరగిల వేసిన తలుపుతోచుకుని యా కుడుములను తినిపోయెను. అప్పుడా రాజకుమార్తెవచ్చి కుడుములు తినిపోవుచున్న యాకుక్కను చూచి, యది కుడుములతినుట గ్రహించి నిండుమనస్సుతో నాకుక్కకే తాను తెచ్చిన చల్ల మూడుముంతలు పోసెను. ఆ కుక్క గౌరిగా మారి యామెకు ప్రత్యక్షమై ఆమెకు అఖండ అయిశ్వర్యములను ఇచ్చెను.

నాటి నుండి యారాచకూతురు సిరిసంపదలు గలదై యెటేటపదియారుబిళ్ల కుడుములు నైవేద్యముచేసి పదియారు బిళ్లకుడుముల వాయనమును, దక్షిణ తాంబూలములతో నొక ముత్తయిదువకు వాయనమిచ్చి యుద్యాపచేయుచు, భూలోకలమున నధికైశ్వర్యములననుభవించెను.

పూజ విధానము: భాద్రపదశుద్దతదియ ( తెల్లవారితే వినాయకచవితి ) నాడు ఉదయమే తలంటుకొని పసుపు తో గౌరమ్మని చేసిఓ తమలపాకులో పెట్టిపూజ ప్రారంభించాలి. ముందుగా సంకల్పము చెప్పుకొనిగౌరీ దేవిని శోడషోపచారముల తో పూజించాలి. పూజ తరువాత చేతిలో అక్షింతలు పట్టుకొనినోము కథ చదువుకోవాలి. ఆ తరువాత ఆ అక్షింతలు , కొద్దిగా అమ్మవారిపై వేసికొన్ని మన నెత్తిన చల్లుకోవాలి. ఆ పై నోములో చెప్పిన విధముగా పదహారు బిళ్ళ కుడుములు (బియ్యం పిండిలో తగినంత బెల్లము పొడిచేసి వేసికొద్ది గా నెయ్యికొద్ది గా ఇలాచీపొడి వేసిబాగా కలపాలి. ఆ పిండిని పదహారు ఉండలుగా చేసిఒక్కో ఉండను కొద్దిగా వత్తిబిళ్ళలాగా చేయాలి.) చేయాలి. రెండు కొత్త చేటలు తీసుకొనివాటికి పసుపు రాసికుంకుమ బొట్టు పెట్టిఒక చాటలో పదహారు కుడుములుపసుపుకుంకుమపెట్టి రెండో చాట తో ఆ చాటను కప్పిఒక ముతైదువుకు వాయనమిచ్చిపాదనమస్కారము చేసిఆశీర్వాదము పొందాలి. ఇది ఏనోముకైనను తప్పనిసరి.

దీనికి ఉద్యాపనము- పదియారు చేటలను, చేటయొక్కంటికి పదియారెేసి బీళ్లకుడుములు, పదియారు డబ్బులును, దక్షిణ, నల్లపూసలు, లక్కబోడు పెట్టి ఉద్యాపనము చేసుకొనవలయును. కధలోపమైన వ్రతలోపము కాకూడదు. భక్తితప్పినా ఫలము తప్పదు.

పదహారు కుడుముల నోము బాద్రపదమాసములో , వినాయక చవితి రోజున కాని , బాద్రపదశుద్ధ తదియ నాడు కాని పట్టాలి . వీలైతే అదేరోజున కూడా ఉద్యాపన చేయవచ్చు. ఉద్యాపన తప్పకుండా పుట్టింటిలోనే చేయాలి . లేదా ఆఖర్చులు పుట్టింటి వారు పెట్టాలి. సామాన్యముగా అన్ని నోములు పుట్టినింటిలో అత్తింటివారి ఆద్వర్యము లోనే పడుతారు . ఉద్యాపన పుట్టింటిలోనే చేస్తారుకాని వేరేవాటికి కన్న ఈ నోముకు మాత్రము పుట్టింటివారి భాద్యత తప్పనిసరి .

ఏనోము కైనా ఆ నోముకు ప్రత్యేకముగా చెప్పిన అమ్మవారినైతే తప్పమిగితావాటికి జగన్మాత ఐన గౌరిదేవిని పూజిస్తారు.

మంగళం
సతతమూ ఆరోగ్య భాగ్యంబు నొసగెడి
శ్రీ గౌరిదేవికి జయ మంగళం నిత్య శుభ మంగళం 
సర్వవిధ సౌభాగ్యములనిచ్చి బ్రోచెడి
శ్రీ గౌరిదేవికి జయ మంగళం
 నిత్య శుభ మంగళం 
ఇంటా బయట హెచ్చు పసుపు కుంకుమ పండ
స్త్రీల చల్లగ జూచు మా గౌరిదేవికి జయ మంగళం
 నిత్య శుభ మంగళం 
శక్తి కొలదైన భక్తి మెండుగ నున్న
అభయహస్తము జూపు అమ్మ శ్రీ గౌరికి
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం.

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...