Friday, April 24, 2026

Mantra Dharana - మంత్ర ధారణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మంత్ర ధారణ

ఓ వత్సా !నీ కిట్లు త్తమమైన యోగధారణ విధానము వివరించితిని. ఇపుటు చిత్తధారణ గూర్చి తెల్పుదును. సావధానముగ నవధరింపుము. 

శ్రీ దేవి దిక్కాలముల కతీతయైనది. ఆమెయందేచిత్తము నిలుకడ జెందవలయును. ఇట్లుచిత్తము నిల్పి దేవీ తన్మయుడైనవాడు జీవబ్రహ్మైక మొందును. ఒకవేళ మనస్సు రజోదోషమున మలినమైనచో యోగము వెంటనే సిద్ధింపదు. అపుడవయవయోగమున యోగి యోగమభ్యసింపవలయును. 

అనగ నామధుర మధురమైన పాదములు -చేతులుమున్నగువానియందు చిత్తము నిల్పవలయును. అటు లొక్కొక్కచోటు జయించుచు చిత్తశుద్దియైన వెంటనేచిత్తమును దేవీ రూపమందంతట నిలిపి ధ్యానింపవలయును. 

ఓయి పర్వతరాజా! జ్ఞానస్వరూపిణి నగు నా యందుచిత్తము లయమందువఱకు సాధకుడు తన కిష్టమైన మంత్రమో జపమో హోమమో చేయుచుండవలయును. ఇట్టి మంత్రాభ్యాసయోగమునను బ్రహ్మజ్ఞానముగల్గును. యోగము లేక మంత్రమును మంత్రము లేక యోగమును సిద్ధంపవు. ఈ రెంటి నభ్యసించిన మంత్రయోగి బ్రహ్మతాదాత్మ్య మందవచ్చును. 

ఇంటిలో పెంజీకటి తెరల మాటునగల కుండ దీపము వెల్గున కనబడును. అటులే మాయాంథతమములో జిక్కిన జీవాత్మ మంత్రయోగముల వెలుగు వెల్లువలలో కనిపించును. ఇటుల నీకు యోగవిధానమంతయును సాంగముగ వివపించితిని. ఇదంతయును సద్గురూపదేశమున తెలియవలసినదేకాని యెన్ని కోటుల శాస్త్రములను చూచిన నేమియు లాభములేదు.

శ్రీదేవి యిట్లనెను : ఓ గిరిరాజా! ఈ విధముగ బ్రహ్మస్వరూపిణి నగు నన్ను యోగయుక్తుడు సహజ భక్తితో నాసనమున గూర్చుండి సతతమను ధ్యానింపవలయును. బ్రహ్మము స్వయంప్రకాశము. సర్వవ్యాపకము. ఐనను హృదయ గుహ యందు వెలుగొందును. ఇది యోగ సాధ్యము. దీని యందాకాశాదులు ఎల్ల ప్రాణులు కాలములు నాధారపడియుండును. 

ఓ సురలారా ! బ్రహ్మమునిట్లెరుంగుడు. ఇది మాయా జగముల కంటె వరేణ్యమయినది. బుద్దులకందనిది. అణువు కంటె అణీయము. ఎల్ల లోకములు లోకులు దీనియందు ప్రతిష్టింపబడియున్నారు. ఓ సౌమ్యుడా! ఓంకారము అక్షరము- బ్రహ్మము. అది ప్రాణ-వాక్‌-మనో రూపములు దాల్చును. 

కనుక బ్రహ్మమందు మనస్సు లగ్న మొనర్చి యెఱుంగవలయును. ఉపనిషత్తను ధనువు నందు ధ్యాన మనెడు బాణమెక్కుపెట్టి నిశ్చల చిత్తముతో నక్షరమును లక్ష్యముచేసి ఏయవలయును. ప్రణవము - దనువు; హృదయము-బాణము; బ్రహ్మము లక్ష్యము; బాణము లక్ష్యమును భేదించునటుల నరుడు నప్రమత్తముగ భాగవత హృదయముతో బ్రహ్మమును గురిచూచి వేధించి బ్రహ్మ మయుడు గావలయును. బ్రహ్మమందు భూమి-అంతరిక్షము -ఆకాశము-ప్రాణములు - మనస్సు నిల్చియుండును. ఇదిసంసార సాగరమునకు సేతువు. 

కనుక వట్టి మాటలుకట్టిపెట్టి యాత్మనొక్క దని నెఱుంగుము. రథపు నాభి యందు చక్రమాకులు చేరియుండును. అటులే హృదయ మందు నాడులన్నియును చేరియుండును. పెక్కురూపులుగల బుద్ది వృత్తికి సాక్షియగు బ్రహ్మము హృదయమందే వెలుగొందుచుండును. 

అమరులారా ! మీకు మేలగుత ! సంసారపు గ్రుడ్డిపెంజీకటి తెరల కవ్వలి వెలుంగు వెల్లువ యగు నాత్మ నాత్మ విచారముతో ధ్యానింపుడు. ఆత్మ దివ్యమును -బ్రహ్మపురమునుగు హృదయాకాశమున వెల్గుచుండును. అత్మ మనోమయము: ప్రాణశరీరములకధినేత-అన్న మునప్రతిష్టితము- హృదయాంతరవర్తి-ఆనంద స్వరూపము- అమృత రసనిధి; ధీరులగు వారుఅనుభవ పూర్వక మగు ఆత్మ విచారముతో దీనిని దర్శింతురు.

ఇట్టి పరమాత్మ సాక్షాత్కారము గల్గిన వాని జన్మ జన్మముల హృదయ మందలి పెడముళ్లు తెగతెంపులగును. సంశయము లన్నియు పటాపంచలగును. కర్మబీజము లన్నియును నశించును. 

బ్రహ్మ విద్య

air retention - వాయు ధారణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - వాయు ధారణ

హిమగిరీంద్రా తొలుత పూరకముతో నాధరచక్రమున మనస్సు నిలుపవలయును. పిదప గుడి మేఢ్రముల నడుమగల కుండలినీ శక్తి నచటి వాయువుతో సంకోచించి మేలుకొలుపవలయును. అటుపిమ్మట క్రమముగమెల్లగ నెల్లచక్రములు భేదించి సహస్రారచక్రము జేరి యందు గల పరమశివునితోపరాశక్తి నేకమొనరించి వారిని ధ్యానింపవలయును. అచటనుండి లక్కరసమువలె నమృతము వెడలుచుండును. దానితోయోగసిద్ది గల్గించుమాయాశక్తిని తనుప వలయును.

స్థితప్రజ్ఞుడైనవా డమృతధారతో షట్చక్రములందున్న దేవతలను తనిపి పిదప నా యమృతధారను మూలాధారమునకు తేవలయును. ఈ విధముగ నిత్యము యోగాభ్యాసముచేయు యోగిదోషము లన్నియును తొలిగిపోవును. ఎల్లమంత్రము లతనికి కరతలామలకము లగును. వేరు విధముగ లభించవు. 

ఇట్టి యోగి జరామరణ దుఃఖముల కాటపట్టగు సంసారబంధములనుండి విడివడును. జగన్మాతనగు నాలోనెన్నియో సుగుణవిధులు గలవు. అట్టి సుగుణములన్నియును సాధకునిలో తప్పక వెలయుచుండును.

మంత్ర ధారణ

Mantra Yoga Teachings - మంత్రయోగ ప్రబోధం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మంత్రయోగ ప్రబోధం

ఓ గిరి నాయకా! ఈ పంచ భూతాత్మకమైన శరీరము విశ్వము. ఇది చంద్ర సూర్యాగ్నులతో గూడి జీవ బ్రహ్మల యైక్యమును దెలుపును. ఇట్టి శరీరమున మూడున్నర కోట్ల నాడులు గలవు. వీనిలో పదిముఖ్యమైనవి. ఆ పదింటిలోను మూడు ముఖ్యతరములు. ఈ మూటిలో ముఖ్యతమమైనది చంద్రసూర్యాగ్ని రూపమైన మేరు దండము. 

ఇడానాడి యెడమ వైపుండును. ఇది తెల్లని చంద్రరూపమున నుండును ఇది యమృత శక్తిరూపమైనది.కుడి వైపున పురుష రూపమున సూర్యరూపముగల పింగళా నాడి యుండును. ఇక సర్వ తేజో రాశియై వహ్ని రూపమున సుషుమ్నా నాడి వెలుగొందును. దాని మధ్యవిచిత్రమను నాడి గలదు. దాని యందిచ్చా జ్ఞాన క్రియాత్మకమైన లింగము గలదు. ఇదిస్వయంభూలింగము. కోటి సూర్య సమానమైన ప్రకాశముగలది. 

దానకిపైని హరాత్మకము బిందు నాదాత్మకము మాయా బీజమునైన హ్రీంకారము విలసిల్లుచుండును. దానకిపైకి దీపశిఖ వలె నెఱ్ఱగ దేవీ రూపిణి యగు కుండలినీ శక్తి విరాజిల్లుచుండును. 

గిరీశా ! ఆ శక్తియు నేను నొకటియే. దానికి బైట బంగారు వన్నెగలు నాల్గు దళముల పద్మము గలదు. దానిలోనున్న వ-శ-ష-స-యక్షరములను సాధకుడు ధ్యానించవలయును. దానకిపై నగ్ని వలె వెల్గుచు వజ్రకాంతలీను నారు దళముల పద్మమలరును. బ-భ-మ-య-ర ల అను అక్షరములం దొప్పును. 

అట్టి స్వాధిష్ఠానమును ధ్యానింపవలయును. ఈ షట్కోణమునకు మూలమైనది మూలాధారమనబడును. ఇక స్వయను శబ్దముతో నధిష్ఠానమైనది స్వాధిష్ఠాన మన బరగును. దానకిపైకి నాభీ స్థాన మందు మణిపూరము గలదు. అది మేఘ ముల మెఱగు తీగల కాంతుల పగిది తేజోమయమై ప్రభలు విరజిమ్ముచుండును.

మణుల కాంతులను బోలియుండుటచే దీనిని మణిపూరపద్మ మనియందురు. ఈ పద్మము నందు డ-ఢ-ణ-త-థ-ద-ధ-న-ప-ఫ యను పది యక్షరములుండును. ఇదు శ్రీ మహావిష్ణు వధిష్ఠించియుంట దీని ధ్యానమున శ్రీ విష్ణుసాక్షాత్కారము గల్గును. 

దీనికి పైకి బాలసూర్యప్రకాశమునకు సరివచ్చు ప్రభగల్గు '' ననాహత పద్మము'' తనర్చును. ఇది క-ఖ-గ-ఘ-జ-చ-ఛ-జ-ఝ-ఞ-ట-ఠ యను పండ్రెండు వర్ణములు గలది. సూర్యకోటుల ప్రభలతో తుల తూగునది. దీనిమధ్య బాణలింగము గలదు. ఇందుతాకిడి లేనప్పటికిని చప్పు డుప్పతిల్లును. 

కనుక దీనిని''అనాహత'' మనియు ''శబ్దబ్రహ్మమయ''మనియు శబ్దబ్రహ్మనిష్ణాతులు పేర్కొందురు. ఇది పరమానందనిలయము. ఇందు రుద్రుడు విరాజిల్లును. దీనిమీద పదారుదళముల విశుద్దకమల మొప్పారుచుండును. ఇందు అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ-ఋ-ఋ- - - ఏ-ఐ- ఓ-ఔ-అం- అః యను పదునారు వర్ణము లుండును. ఇందుగల ధూమ్రవర్ణము మహాప్రభలు వెలార్చును. ఇచట జీవుడాత్మదర్శనము చేయుటవలన శుధ్ది జెందును. కనుక దీనిని విశుద్దిపద్మమందురు. దీని నాకాశమనియు పల్కుదురు. 

దీనికి మీద నాజ్ఞాచక్ర మలరారును. ఇది ఆత్మ కధిష్ఠానమైనది. ఇచట పరమేశు నాజ్ఞ జీవునకు లభించును. కనుక దీని నాజ్ఞ చక్రమందురు. ఈ పద్మమందుహ-క్ష యను రెండక్షరములుగల దళములు శోభిల్లును. దానికిపైని కైలాసపద్మమును దానిపైని రోధినీపద్మమును చెన్నొందును. వీనిని చక్రములనియునందురు. 

సువ్రతా! ఇట్లు నీకాధారాది చక్రములు వివరించితిని. దీనికి పైగ సహస్రారమను చక్రరాజము దీపిల్లును. ఇదే బిందుస్థానము. శ్రీపరమాత్మ సన్నిధానము. ఇట్లు నీకు దివ్యయోగమార్గమంతయు వివరించితిని. 

Jaganmatha Yoga Teachings - జగన్మాత యోగబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాతయోగబోధ

ఈ విధముగ శ్రుతి మతి గలిగిన వాడాత్మ విచారముతో స్వాత్మను నిశ్చయించుకొని పరబ్రహ్మస్వరూపిణి నగు నన్ను ధ్యానమున భావింపవలయును. ధ్యానయోగము చక్కగ కుదురుటకు నా యక్షరత్రయమును మొదట చక్కగ భావించవలయును. 

అది దేవీ ప్రణవస్వరూపమైనది మాయామంత్రబీజము-మంత్రరాజము. అక్షరత్రయములో హాకారము స్థూలదేహము రేఫము సూక్ష్మదేహము; ఈ కారము కారణదేహము. హ్రీంకారము-తురీయాత్మ-నేనే. ఇదే విధముగ సమష్టి దేహమందు నీ బీజత్రయము క్రమముగ నున్నదని యెఱిగి పిదప సమష్టివ్యష్ట్యాత్మల యేకత్వమును సాధకుడు సాధింపవలయును. 

ఈ విధముగా సమాధికి ముందు చక్కగా నాత్మవిచార మొనరించి పిదప కన్నులు మూసికొని జగదీశ్వరి-ఆదిపరాశక్తి-నగు నన్నే ధ్యానింపవలయును. నాసికయందు తిరుగాడు ప్రాణపానములను సమముగ జేసి విషకామములు విడనాడి మచ్చ రము -దోషము-వదలవలయును. 

సాధకుడొంటిగ నైకాంతిక పరాభక్తితో హృదయకుహరమునందు చిత్తము నిల్పి స్థూలాత్మయగు హకారమును సూక్ష్మాత్మయగు రేఫమును లయమొనరింపవలయును. పిదప సూక్ష్మాత్మయగు రేఫమును కారణాత్మయగు ''ఈ'' కారమందున లయ మొనర్పవలయును. తర్వాత కారణాత్మయగు ''ఈ ''కారమును సర్వాత్మకమైన హ్రీంకారమున లయ మొనర్పవలయును. పిమ్మట చిదగ్నిశిఖలో వాచ్యవాచకత్వములును ద్వైతములును లేనట్టి పరబ్రహ్మ రసమయమగు నఖండ సచ్చిదానందమును ధ్యానింపవలయును. 

రాజా!ఇట్లు జీవుడు విమల ధ్యానమువలన నా సాక్షాత్కారమొంది నా సారూప్యము జెందవలయును. ఏలన నట్టి స్థితిలో నేను-జీవుడు నొకటియే. నరు డిట్టి ధ్యానయోగమువలన పరాత్పరతమగు నన్ను గాంచును. వెనువెంటనే వాని తొంటి యజ్ఞానకర్మములు రెండును నశించును.

హిమాలయు డిట్లనెను: ఓ మహేశానీ ! యోగముసును గుఱించి సాంగముగ నాకు వివరింపుము. ఏ యోగమున బ్రహ్మజ్ఞానము గల్గునో దాని నాచరించి తత్త్వదర్శనమునకు పాత్రుడ నగుదును. 

శ్రీదేవి యిట్లనెను : యోగ మనునది భూమ్యాకాశరసాతములం దెచటనైన నుండునది కాదు. జీవ-పరాత్మల యైక్యమే యోగమని యోగవిదులందులు. ఓ యనఘాత్మా! కామ-క్రోధ-లోభ-మోహ-మదమాత్సర్యములను నారును యోగమునకు విఘ్నముగల్గించుచుండును.యోగులు యోగాంగముల సాయమున కామాదిశత్రువులను గెలచియోగమాచరించవలయును.యమము-నియమము-ఆసనము-ప్రాణా యామము.ప్రత్యాహారము-ధ్యానము-సమాధియునునవి యష్టాంగములు. 

యోగసాధనముకు యోగులీ యెనిమిదిటి ననుష్ఠింపవలయును. అందుమొదటిదగు యమము సత్యము-అహింస-బ్రహ్మచర్యము-అస్తేయము-దానము-ఋజత-దయ-క్షమ-ధృతి-మితాహారము-శౌచమను పది తెఱంగుల నోప్పుచుండును. తపము-సంతోషము-దానము-ఆస్తికత-దేవపూజనము-వేదాంతశ్రవణము-లజ్జ-మతి-జపహోమములు అను పదియును గలసి నియమగునని నాచేత చెప్పబడెను.

ఓ గిరీంద్రా! రెండుతొడలపై నుంచుకొనవలయును. పిదప వీపు మీదుగ చేతులు త్రిప్పి పాదముల బొటనవ్రేళ్లు పట్టుకొనుటే పద్మాసనము. ఇది యోగుల కత్యంతము ప్రియమైనది. తొడల-పిక్కల-మధ్యపాదతలము లుంచి సరళముగ కూర్చుండుట స్వస్తి కాసనమనబడును. 

వృషణముల క్రింద రెండువైపుల రెండు కాలిమడమలనుచేతిలో గట్టిగ నదిమి పట్టియుంచవలయును. అదియే భద్రాసనమనబడును. దీనిని యోగులెక్కువగ నాదరింతురు. రెండు తొడలపై రెండు పాదములుంచి పిక్కల క్రింద చేతల వ్రేళు లుంచవలయును. ఇట్లు కూర్చోనుట వజ్రసన మగును. 

ఆయా తొడలక్రింద నాయాపాదములుంచవలయును. పిదప శరీరమును నిట్టనిలువుగనుంచి కూరుచుండుట వీరాసన మగును. ఇడా(ఎడమ ముక్కు) ద్వారమున బైటి వాయువును పదునారుసార్లు ప్రణవము జపించుచు పీల్చవలయును. 

దాని నురువదినాల్గు సారులు ప్రణవ ముచ్చరించు నంతవఱకు లోన పూరించి యుంచ వలయును.అపుడది సుషుమ్న మధ్యకు చేరును. దానిని ముప్పదిరెండు మార్లు ప్రణవ ముచ్చరింగదగినంత సమయమున పింగళ(కుడిముక్కు) నుండి రేచింపవలయును. 

ఇటు లొక్కసారి చేసిన దానిని ప్రాణాయమమని యోగవిదులందురు. ఈ ప్రకారముగ ప్రణవోచ్చారణము క్రమముగ పండ్రెండు లేకపదునారు సారులకు పెంచుచు బైటి వాయువును పెలుమార్లు - పూరక-కుంభక-రేచకము లోనరించుచుండవలయును. 

ఈప్రాణాయామము జప-ధ్యానములతో గూడిన సగర్బమనియు నవి లేనిచో విగర్బప్రాణాయామమనియుబుధు లెఱుంగుదురు. ఇట్లు క్రమముగ నభ్యసించువాని దేహమున చెమట పుట్టిన నధమ మనియు వణకు పుట్టిన మధ్యమ మనియు మేనుపైకి లేచిననుత్తమ మనియు ప్రాణాయామము మత్తెఱగుల నుండును. 

సాధకు డుత్తమ ప్రాణాయామము సిద్దించువఱకు దీని నభ్యసింపవలయును. ఇంద్రియములు విషయములందు నిరాటంకముగ స్వేచ్చగ తిరుగాడుచుండును. వానిని బల్మితో లాగి నిలుపుట ప్రత్యాహార మనబడును.

అంగుష్ఠము -గుల్పము-పిక్కలు-తొడలు మూలాధారములు -లింగము-నాభి హృదయము -మెడ- కంఠము -లంబిక- ముక్కు - భ్రూమధ్యము-తల మూర్థము ద్వాదశాంతమనునవి స్థానములు. వీనియందు ప్రాణవాయువును నిల్పుడే ధారణ మనబడును. నిశ్చల మనస్సును చైతన్యాత్మలో నిలువ వలయును. 
పిదప తనయిష్ఠదేవతను ధ్యానించుటే ధ్యానమనబడును. నిత్యము జీవ-పరమాత్మల సమైక్యము భావింపవలయును.

అదియే సమాధి యని మునులందరు. ఇట్లు నీ కష్టాంగ యోగమును గూర్చివివరించితిని. ఇపుడింక శ్రేష్ఠమైన మంత్ర యోగమును వక్కాణింతును. వినుము. 

మంత్రయోగ ప్రబోధం

Jaganmata - Philosophy - జగన్మాత - తత్వబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాత - తత్వబోధ

శ్రీదేవీ యిట్లనెను: మందభాగ్యులగు మీరెక్కడ! ఈ నో లోకాద్బుత దివ్యరూపమెక్కడ! ఐనను మీ మీది వాత్సల్యముతో మీకు నా దివ్యరూపము చూపితిని. ఈ నా దివ్యరూపమును కేవలము నాదయవలన గాక వేదాధ్యయనమున గాని యోగ దానముల వలన గాని యజ్ఞ తపముల వలన గాని చూడ సాధ్యము గాదు. 

ఓ రాజేంద్ర! ఇక ప్రస్తుతము వినుము. పరమాత్మ తాను పెక్కు విధముల యుపాధులతో గూడి జీవత్వమంది కర్తృత్వము వహించును. జీవుడు నానా యోనుల యందు బుట్టుచు ధర్మా ధర్మాత్మకములైన పెక్కు పనులు చేయుచు సుఖదుఃఖము లనుభవించుచు నుండును. 

అట్లు పూర్వ వాసనల వలన నానా కర్మరతుడై పెక్కు విధముల జన్మములు దాల్చచు సుఖదుఃఖము లనుభవించు చుండును. జీవుడు నీటి యంత్రము వలె (ఎద్దులు గాని ఒంటె గాని గుండ్రముగా తిరుగుటచే బావిలో చక్రాకారమున తిరుగు నీటి బొక్కెనల మాల నీటితో పైకి వచ్చును. ఇది ఘటీ యంత్రముగా పూరాణములలో చెప్పబడినది) విశ్రాంతి లేక తిరుగుచుండును. 

అతని కజ్ఞానము కోరికలు కొనలు సాగును. కోర్కులు దీర్చుకొనుట కతడెన్నో పనులు చేయును. ఈ జన్మపరంపరలు తుదముట్టుట కజ్ఞానము తప్పక నశింపవలయును. అజ్ఞానము జ్ఞానము (విద్య) వలన నశించును. పురుషార్థముల కోర్కెలు-తాపములు-తొలగిపోగా జీవన్ముక్తదశ గల్గును. 

అజ్ఞానమున పుట్టిన కర్మ మజ్ఞానమును నశింపజేయజాలదు. కనుక నజ్ఞాన నాశమునకు కర్మమును నమ్ముకొని యుండరాదు. ఈ కర్మములన్నియు ననర్థ దాయకములు. వీని వలన సంతలో రాగము నంతలో ద్వేషాగ్ని పుట్టును. ఇట్టి యనర్థ కర్మములు పల్మారు పుటుచుండెను. ''కుర్వన్నే వేహ కర్మాణి'' యను వేదాను వచనము ప్రకారముగ మంచి కర్మములు చేయుట మంచిధే. కాని మనుజుడెల్లభంగుల జ్ఞానమే పొందవలయును. దివ్యజ్ఞానము వలననే వైకల్యము ప్రాప్తించును. 

సత్కర్మము జ్ఞానమునకు తోడుపడును. మేలు చేకూర్చును. ఈ రెంటికిని విరోధము లేదని కొందఱందరు. అది సరికాదు. ఏలన జ్ఞాన ఖడ్గముననే కర్మములక తావగు హృదయ గ్రంథి ఛేదించబడును.

చీకటి వెలుగులోకచో గలియవు. వానికి విరోధము గలదు. అట్లే కర్మ జ్ఞానములకు విరోధ ముండుటనవి యొకచోగలియవు. కనుక నరుడు వైదికాది కర్మము లన్నియు సంస్కారము లన్నియును చిత్తశుద్ది కొఱకు ప్రయత్న పూర్వకముగ చేయుచుండవలయును. చిత్తశుద్ధి గల్గునంతవఱకే శమదమములు-తతిక్షవైరాగ్యము నత్యా వశ్యకములై యుండును. 

అటు పిమ్మట కర్మముతో నెట్టి యావశ్యకతయు గల్గదు. చివర కాత్మ వంతుడు సర్వ ధర్మములు పరిత్యజించి నిష్కపటమైన భక్తితో శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడునగు సద్గురువు నాశ్రయింపవలయును. అతడు నిశ్చల నిర్మల చిత్తముతో వేదాంత శ్రవణము నిరంతర మొనరింపవలయును. 

తత్త్వ మస్యది వాక్యముల సత్యార్థమును చింతింపవలయును. తత్త్వ మస్యాది వ్యాక్యార్థము జీవ బ్రహ్మల యేకత్వము దెల్పును. ఈ రెంటి యేకత్వము తెలిసిన నరుడు నిర్బయుడైనా సారూప్యమందగలడు. మొదట పదముల యర్థమెఱింగి పిదప వాక్యములలోని యర్ద మెఱుంగవలయును. 

''తత్‌'' అను పదమున కర్థము భగవతినగు నేనే యని చెప్పబడును. ''త్వం'' అను పదమునకు జీవుడని ముఖ్యార్థము. ఈ రెంటికి ''అసీ'' యను పదము జేర్చి యైక్యము గూర్తురు. వాచ్యార్థములకు విరోధమువలన నైక్యము గుదురనపుడు లక్ష్యార్థములతో వేద నిర్దిష్టములగు ''తత్‌-త్వం'' పదములకు కర్థము చెప్పవలయును. 

జీవ-ఈశ్వరుల ప్రత్యేక ధర్మములు తొలగిపోగరెంటి యైక్య మిట్లెఱుంగుట వలన సద్వయము సిద్దించును. ఆ దేవదత్తు డితడే యన్న వాక్యములో ''ఆ-ఈ'' యను రెంటి ధర్మములు తొలగగ మిగిలిన వాడొక్కడే కధా ! అదే లక్షణ యనబడను. అటులే ఈ స్థూల దేహాది భేదములు తొలగినపుడు నరుడు బ్రహ్మత్వమందును. ఈ స్థూలదేహము పంచీకృత మహాభూతముల నుండి యుత్పన్నయ్యెను. ఇదెల్ల భోగాల కాటపట్టు. జరా వ్యాధులకు కర్మములకు తావలము.

ఈ దేహము మిథ్య. ఐనను మాయాభ్రాంతిచే నున్నట్లు తోచును. గిరిరాజా! ఇట్టి శరీరమే యాత్మయొక్క స్థూలమైన యుపాధి. జ్ఞాన కర్మేంద్రియంబులు-ప్రాణపంచకము-మనోబుద్దులు గలిసిన దేహమును సూక్ష్మమైన యుపాధిగ బుధులందురు. ఈ రెండవ యుపాధి యాత్మయొక్క సూక్ష్మమైన యిపాధి. ఇది పంచీకృతము కాని పంచ భూతముల వలన గల్గును. ఇది అంతఃకరణము యొక్క సుఖదుఃఖాదులు తెలుపుచుండును. 

ఓ గిరీశ్వరా!నా యాత్మయొక్క మూడవ యుపాధి కారణాత్మ. అది అనిర్వాచ్యము. అనాది-అజ్ఞానము జరుగును. ఈ మూడుపాధులు తొలగిపోగా కేవలమగు ''ఆత్మ'' మిగిలివెలుగును. పంచకోశము లీ మూడు దేహము లందును సతతము విలసిల్లుచుండును. ఈ పంచకోశములు తొలగిపోగా తుదకు బ్రహ్మనిష్ఠ ప్రాపించును. ఇట్లు ''నేతి-నేతి'' యను వాక్యార్థము వలన నాత్మరూపము వెల్లడియగును. అట్టి ''ఆత్మ'' పుట్టునది -చచ్చునది-పూర్వముండి యిపుడు లేనిదిగాదు: అది నిత్యము-చచ్చునది కాదు. అజము-శాశ్వతము-పురాణము. 

ఈ శరీరాదులు చంపబడుచున్నను నది చంపబడదు. చంపువాడు తాను చంపెననియును చంపబడువాడు నేను చచ్చితి ననియు తలంతురు. కాని వారిర్వురును తెలియనివారే. ఏలన ''ఆత్మ'' చావదు. చంపబడదు. ఆత్మ అణువుకంటెనణువు; మహత్‌ కంటె మహీయము. అయ్యు నది యెల్ల ప్రాణుల హృదయగుహలందు వెలుగును. 

జీవుడు పరమాత్మదయ వలన నాత్మమహిమ మెఱిగివిగత శోకుడు గాగలడు. ఆత్మ-రథికుడు; శరీరము-రథము; బుద్ధి-సారథి; మనస్సు-ఇంద్రియములను మూడును గలిసి భోక్త యనబరగునని పెద్దలందురు. అవివేకి-అమనస్కుడు-అశుచియగు మూర్ఖుడు తత్పద మెఱుగలేక దురిత సంసార సాగరమున మునుకలు వేయుచుండును.

వివేకి-సమనస్కుడు -శ్రోత్రియుడు-నిష్కాముడునగు వాడు పునరావృత్తి లేని తత్పదమును కైసేయగలడు. బుద్ధియను సారథి మనస్సను కళ్లెమును గట్టిగ బట్టుకొన్నచో సంసార దుస్తర మార్గములు దాటి పరమపద మలంకరింపగలడు. 

Thursday, April 23, 2026

Jaganmata - Viradrupa performance - జగన్మాత - విరాద్రూప ప్రదర్శన

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాత - విరాద్రూప ప్రదర్శన

శ్రీదేవి యిట్లనెను: గిరీశ ! ఈ చరాచర జగమంతయును నా మాయాశక్తిచే నిండియున్నది. ఆది నాలోకల్పితమైనది. పరమార్దముననది నా కంటె భిన్నము గాదు. వ్యవహార దృష్ఠిలో చూడగమాయ విద్యయనంబరనగును. కాని తత్త్వదృష్టని చూడమాయలేదు. కేవలము తత్త్వ వస్తువే కలదు. 

గీరీశా! చిద్వస్తునగు నేనే పెక్కు మాయా కర్మలంగూడి ఈ జగములు సృజించి ప్రాణ పూర్వకముగ చిదా భాసుడనై యందు ప్రవేశింతును. నా వలననే లోకులకు లోకాంతర గమనములు జరుగును. పెక్కుమాయాభేదముల వలన జీవులుత్పన్నులగుదురు. 

ఒకే మహాకాశము వలన ఘటాకాశములు గల్గునటుల పెక్కుపాధి భేదముల వలన మాయవలన జీవులుత్పన్నులగుదురు. ఒకే రవి మంచి చెడు వస్తుల నెల్ల వెల్గింపజేయును. ఐనను రవికేట్టి దోషమును గలుగదు. అటులనే చిద్వస్తువనగు నాకెట్టి దోషము నంటదు: 

కొందఱు బుద్ద్యాదుల కర్తృత్వముక నా యందారోపింతురు. కొందఱు మూడు లాత్మయే కర్తయని పోరపడుదురు. కాని పండితులైనవారు పోరపడరు అజ్ఞానము వలన మాయ వలన జీవేశ్వరుల భేదము గల్పింపబడినది. ఎట్లనగ మహాకాశము వలన ఘాటాకాశాది భేదములు గల్పింబడును. 

ఇటులే జీవాత్మ- పరమాత్మలకును భేదము గల్పింపబడినది. జీవుల నానాత్వము సహజముగ లేదు. మాయ వలన నున్నట్లు గల్పింపబడెను. అటులే యీశ్వరుల నానాత్వమును మాయ వలన గల్పింబడెను. కాని యది యునుసహజము గాదు. దేహము -మనస్సు-ఇంద్రియాదులు వాసనలు మున్నగు పలు విధముల భేగములు మాయ వలన గల్గుచుండును. పెక్కు జీవేశ్వరుల భేదముల కన్నిటికిన విద్యయే మూల కారణము. మఱేదియును గాదు. 

ఈ త్రిగుణములలో వాసనలలో నెన్నో భేదములు గలవు. మఱి బ్రహ్మాదులలో నీశ్వరులలో నెన్నో భేధములు గలవు. వీనికన్నింటికి నామాయయే మూలకారణము. మఱేదియునుకాదు. వస్త్రమందు దారమువలె నాయందెల్ల జగములు వ్యాపించి యున్నవి. అందు వలననే కారణదేహాభిమాని అగు సూత్రాత్మ స్థూలదేహాభిమానియుగు విరాటు నేనే. మఱి బ్రహ్మ-విష్ణు-రుద్రుడు సూర్యచంద్రులు-తారలు-చండాలుడును-దొంగయు-నేనే. నేనే సకల పశు-పక్షి స్వరూపిణిని.

క్రూరాత్ముడగు వ్యాధుడు-మహితాత్ముడగుసజ్జనుడు నేనే. ఎల్ల స్రీ-పుం-నపుంసకరూపములు నేనే. సందేహము లేదు. ఏయేచోటుల నేయే వస్తువు కన-విన-బడునో ఆయాచోటుల నాయా వస్తువులలోనబైట నేనే నిత్యము నిండి యున్నాను. ఈ చరాచర వ
స్తువులన్నియును నేనే. అవి నేను లేక లేవు. 

ఒక వేళ నేను ఏలకున్నవని యెవడైన ననిచో నావస్తువులు గొడ్రాలిసంతువంటివే. ఒకే త్రాడు పాము-దండ-యను పెక్కు భేధములు నెట్లు దోచునో కేవలము నేనును ఈశ్వరాది బహురూపములనట్లే భాసింతును. అధిష్ఠాన వస్తవులేనిచో కల్పితజగము నిలువజాలదు. 
కావున నాయునికి వలననే యివన్ని యును శక్తిగల వగుచున్నవి కాని మఱి దేనివలనను గాదు. 

హిమాలయు డిట్లనెను: ఓ దేవేశ్వరీ! నీ సమష్టీ దివ్యస్వరూపమును చూడ కుతూహల మగుచున్నది. నీకు నాయెడ దయగలదవిని చూపింపుము తల్లీ! అను హిమగిరీశుని వాక్కులువిన విష్ణ్వాది దేవతలెల్లరు నతవి మాటను గౌరవించి ముదితులై హర్షించిరి. ఆపుడు దేవతల యభిమత మెఱింగి కామములు గురియునట్టి భక్తకామప్రపూరణి శివాదేవి వారికి తన దివ్య విరాట్స్వరూపము చూపెను. 

ఇట్లువారు శ్రీ మహాదేవియొక్క పరాత్పర విరాడ్రూపమును సందర్శించిరి. అపుడు శ్రీదేవియును తల సత్యలోకముగ కన్నులు సూర్యచంద్రులుగ భాసిల్లెను. చెవులు దిక్కులుగపలుకులు వేదములుగ ప్రాణములు వాయువులు హృదయము మహావిశ్వముగ పిఱుదులు భూమిగ తనరెను. 

నాబి సరస్సు నీలాలనింగిగ ఱొమ్ముజ్యోతిశ్చక్రముగ మెడమహర్లోకముగ ముఖము జనలోకముగ నలరెను. నెన్నుదురు సత్యలోకమునకు క్రింది దగు తపోలోకముగ బాహువు లింద్రాదులుగ శ్రవణేంద్రియము శబ్దముగ వెలసెను. నాసికలశ్వి దేవతలుగ ఘ్రాణణేంద్రియము గంధముగ ముఖ మగ్నిగ కనుఱప్పలు రాత్రింబవళ్ళుగనె సంగెను. కన్బోమలు బ్రహ్మస్థానముగ దవుడలు-జలములుగ నాలుక రసముగ కోరలు యముడు వెలసెను.

దంతములు-స్నేహ విలాసములు నవ్వలాట-మాయగకడగంటి చూడ్కులు-సృష్టిగ సిగ్గు-పై పెదనిగ నల రారెను. క్రిందగి పెదవి-లోభమగ వీపు-ధర్మమముగ మేఢ్రము-జగమందలి సృష్టికర్తయగు ప్రజాపతిగ పొట్ట-సాగరములుగ ఎముకలు-గిరులుగనాడులు-నదులుగకేశపాశములు వృక్షములుగనై విలసిల్లెను. 

ఉత్తమగతులు-కౌమార¸యవన జరలుగ కేశములు-మేఘములుగ కట్టుపుట్టములు-సంఘధ్యలుగ విరాజిల్లెను. మనస్సు-చంద్రుడు విజ్ఞానశక్తి-శ్రీహరిగ హృదయము-రుద్రుడుగనై శోభిల్లెను. రాజా! దేవి పిఱుదం దశ్వజాతులన్నియు నడుమునకు క్రింది భాగమున నతలాదిలోకములుండెను. 

ఇట్టి శ్రీదేవి ఇశ్వరూపమును దేవత లెల్లరును కన్నుల కరవుతీర సందర్మించిరి. దేవినుండి వేనవేలు జ్వాలామాలికలు వెలువడుచుండెను. దేవి తన పొడవైన నాలుకతో లోకము లెల్లనాకు నట్లుండెను. దేవి పటపట పండ్లు కొఱకుచు కన్నుల నిప్పుల కణికలు గ్రక్కుచు నానాయుధములు దాల్చి బ్రాహ్మణ క్షత్రియుల నాహారము చేసికొనుచుండెను. 

దేవి సహస్రశిరములు సహస్రనయనములు సహస్రచరణమలు గల్గి సూర్యకోటి ప్రభాభాసమానయై విద్యుత్కోటి సమానప్రభలు చిమ్ముచుండెను. పరాశక్తియొక్క మహాభీషణ ఘోరదారణరూపము చూపఱుల హృదయముయములకు భయంకరముగ నుండెను. అట్టి రూపముగాంచి సురలు మిన్ను ముట్టి హహాకారములు చేసిరి. వారి హృదయనలల్లాడగ తీరని మూర్చ మునిగిరి. 

వారు దేవి జగదంబయను మాటయే మఱచిరి. అటుల స్పృహ కోల్పోయి పడియున్న దేవతలను దేవికి నలు వైపుల నున్న వేగములు మేలు కోల్పి ప్రభోధ మొనరించెను. దేవతలు దివ్యశ్రుతులాలకించి ధైర్య మవలంబించి ప్రేమాశ్రు పూర్ణ నేత్రములతో గళము తొట్రుపాటు జెందుచుండ కన్నీట మాటలు తడబడ దేవి నీ విధముగ సన్నుతింపసాగిరి. ఓ అమ్మా! మాతపుపలు క్షమింపుము. మేము నీ కన్న బిడ్డలము. మమ్ముకాపాడుమమ్మా!

ఓ దేవేశీ ! నీ కోప ముపసంహరించుము. నీ భీకరరూపము గాంచిన మా గుండె లవిసిపోవుచున్నవి. మేము పామరులము దీనులము. త్రిదశులము. నిన్నెంతని సన్నుతింపగలము ! నీ విక్రమ మహాశక్తు లెంతటివో నీకే తెలియదే ! ఇక నీ తర్వాత పుట్టిన మా కెట్లు తెలియును? 

ఓ త్రిభువనేశ్వరీ! నీకు మా ప్రణామములు. ప్రణవాత్మికాః నీకు ప్రణామములు. సకల వేదాంత సంసిద్ధా!హ్రీంకారమూర్తీ! నీకు ప్రణామములు. ఏ జగదంబికనుండి సకల దేవతలు - సాధ్యులు క్ష మనుజులు-పశువులు -పక్షులు జన్మించెనో యట్టి సర్వాత్మికకు ప్రణామములు. 

ఏ జగదంబికనుండి ప్రాణాపానములు - వ్రీహియవలు-సత్యము -శ్రద్ధ-బ్రహ్మచర్యము మున్నగునవి కల్గెనో యట్టి సర్వాత్మికకు ప్రణామములు. ఏ జగదంబికనుండి సప్తప్రాణములు -సప్తదీవులు-సప్తసమధలు-సప్తహోమమలు- సప్తలోకవ్లుు గల్గెనో యట్టి సర్వాత్మికకు ప్రణాముములు. ఏ జగదంబికనుండి యెల్ల సాగరములు-నదులు-గిరులు-రసములు-ఓషదులు సంభవించెనో యట్టి సర్వాత్మికకు సర్వాత్మికకు ప్రణామములు. 

ఓ మాతా! నీ పూర్వభాగము-వెనుక భాగము- ఇరుపక్కలు-పైభాగము-నాల్గు దిక్కులు వీనికి మాటిమాటికి ప్రణామములు. ఓ దేవేశీ! నీయీ లోకాతీతమైన విశ్వరూప ముపసంహరింపుము. అందాల కందమైన నీమొదటి రూపమును ప్రదర్శింపుము. 

తల్లీ!ఇట్లు భయభ్రాంతులైన దేవతలను చూచి జగదంబిక దయాంతరంగయై తన ఘోరరూపమువదలి శాంతసుందరరూపము చూపెను. అపుడు దేవి పాశ-అంకుశ-వర-అభయ హస్త-సర్వాంగసుందరి-శిరీసఖోమలి-కరుణాపూర్ణనయన-మందస్మితముఖమల. అట్టి దేవిసుందర దివ్యరూపమును దర్శించి భయములు పాసి ప్రశాంతచిత్తలై సంతోషాతిశయమున మాటలాడరాక తుదకు పెక్కు గతుల దేవిని సన్నుతించిరి.

జగన్మాత - తత్వబోధ

The teachings of Goddess Jaganmata - జగన్మాత చేసిన జ్ఞానబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాత చేసిన జ్ఞానబోధ

శ్రీ దేవి యిట్లనెను: దేవతలారా! సావధానముగ నా పలుకులు వినుడు: వానిని విన్నంత మాత్రాన నా సారూప్యము సిద్దింపగలదు. ఓ పర్వతరాజా! ఈ సృష్టికి పూర్వము నే నొక్కతే నుంటిని. ఇతరము లేదు. అట్టి నన్నే అత్మరూపమని- చిత్తని- బ్రహ్మమని యుందరు. అత్మ యనుమానమునకు సర్వ లక్ష్యములకు ఉపమానములకు జన్మమరణాది వికాములకు నతీతము. 

నా యాత్మ యొక్క సహజ సిద్దశక్తిని మాయ యందురు. ఈ మాయ సత్తుగాదు (ఉన్నది అనుటకు తగదు.) అసత్తుగాదు(ఇది లేకవ్యవహరముసాగదు.) ఈ యుభయముగాదు. ఈ మాయకంటె విలక్షణమైన యొక వస్తువు నిత్యమై వెల్గును. అగ్ని నుండి వేడిమి రవి నుండి కిరణములు జాబిల్లి నుండి వెన్నెలలు వెల్వడు నటులహయ నా యాత్మ స్వరూపమునుండి సహజముగ తప్పక కల్గును: 

గఢసుషుప్తిలో వ్యవహరము లన్నియునడంగును. అటులే మాయలో నెల్లజీవులు- జీవకర్మలు-కాలము సర్వము నొక్కటియై విలయ మొందును. నేను నిర్గుణను. ఐనను మాయాశక్తి సంయోగమున నెల్ల జీవులు - జీవర్మలు - కాలము సర్వము నొక్కటియై విలయమొందును. నేను నిర్గుణను. ఐనను మాయాశక్తి సంయోగమున నెల్లలోకములకు కారణరూపిణినైతిని. 

ఇది నన్నే యావరించియుండుటవలన దానిలో నావరణదోషము గలదు. ఈ మాయ చైతన్యముతో గలిసినపు డది జగములకు నిమిత్తకారణ మగును. ఈ ప్రపంచ పరిణామములు మాయసమవాయి ను కారణమగుటచే జరుగును. ఇటి మాయనుతపమని - తమమని జడమని - జ్ఞానమనని-మాయయని- ప్రకృతియని -ప్రధానమని-శక్తియని- అజయని పల్వురు పలువిధమువ పలుకుదురు. 

శైవాగమ వీశారదులు దీనిని విమర్శ మందురు. వేదతత్త్వార్ద చింతకులు దీనిని ఆ విద్య యందురు. ఇట్లు మాయకు నిగమాగమములందు పెక్కు పేర్లు గలవు. మాయ దృశ్యమగుటవలన జడమని జ్ఞానమును నశింపచేయుటవలన అసత్తు. మిధ్య అని యందురు. ఈ కనిపించున దంతయును జడమే శుద్ధచైతన్యము దృశ్యముగదు కనుక జడముగాదు. చైతన్యము స్వయంప్రకాశము. ఇతరముచే ప్రకాశింపచేయబడదు.

చైతన్యమును ప్రకాశిత మనుకొన్న మఱి దానినెవరు ప్రకాశింపజేతురను అనవస్దదోష మేర్పడును. ఒకేకాలముననొకే వస్తువునకు కర్తృత్వము - కర్మత్వము నుండవు. కనుక చైతన్య వస్తువు దీపమువలె స్వయంప్రకాశ వస్తువని తెలియవయును. 

గిరిరాజా ! చైతన్యము స్వయంప్రకాశమై పరులను ప్రకాశింపజేయును. కనుక అజ్ఞాన స్వరూపము నిత్యము సత్యము. జాగ్రత్‌-స్వప్న-సుషువ్తులందు దృశ్యమునుకు వ్యభిచారము (అన్ని కాలములందును లేకపోవుట) గల్గును. కాని దివ్య జ్ఞానమున కెన్నడును వ్యభిచార మనునది (అనగా అన్ని కాలములందు నుండుకుండుట) లేదు. 

ఒకవేళ ఉన్నద్వనుకొన్నను దాని నెఱుగు సాక్షియునువా డొకడు గలడు. జ్ఞానము నిత్యమనియు సాక్షి యెఱుంగుననియు నెల్లరికి విదితమే కదా ! కనుక సచ్ఛాస్త్రవిదులగు కోవిదులు జ్ఞానము నిత్యము. పరమప్రేమ కాలవాల మగుట నది సచ్చిదానందరూపము. అనియు వక్కాణింతురు. 

ఈ యానందము ప్రేమలోనే యుండును. కనుక నేనున్నాననుట కంటె నేను బాగుగ నున్నానని ప్రతివాడుననును. ఇందువలనను మఱియు జగము మిధ్య యగుట వలనను నాకు సంగదోషము లేదు. లోకమందలి యే ధర్మమందై నను జడత్వము- పరిచ్చిన్నత్వము నుండును. జ్ఞాన మాత్మ ధర్మముగాదు. జ్ఞానమాత్మయే. అది యపరిచ్చిన్నము. జ్ఞానము చిత్స్వరూపము. 

అందుచే దానికి జడత్వముండుటగాని యున్నట్లు చూడబడుటగాని జరుగదు. చిత్పదార్దము-చిత్తు-నొకటే కనుక ఆత్మ-జ్ఞానము-ఆనందము-నిత్యము-సత్యము-పరిపూర్ణము-నిస్సంగము-ద్వైతజాలరహితము. అట్టియాత్మతన మాయ వలన తొల్లిటి సంస్కారములవలన కాల-కామ్యకర్మ పిరిపాకమువలన సృష్టికాముడగును. తత్త్వము నెఱుంగనం దున ఆత్మ సృష్టికి పూనుకొనును. 

ఓ నగరాజా! ఇట్టి సృష్టికార్యము కాలకర్మగుణ పరిపాకముననే సంభవించును గాని బుద్దిపూర్వకముగ జరుగు సృష్టిగాదు. నేను నీకు ప్రభోధించిన యీతత్త్వము నా సత్వరూపమే - ఇది లోకోత్తరము. లోకాతీతము. అవ్యాకృతము-అవ్యగ్రము- మాయాశబలము. సర్వకారణ కారణమని సకల శాస్త్రములందును చెప్పబడెను. నా యీ పరతత్త్వము తత్త్వములన్నిటికి మూలకారణము-సచ్చిదానంద విగ్రము.

సర్వ కర్మల ఘనీభావము. ఇచ్చాజ్ఞాన క్రియాశ్రమము. నాతత్త్వము హ్రీంకార మంత్ర వాచ్యము ఆదితత్త్వమని పేర్కొనంబడుము. అట్టి నా మహత్తత్త్వము నుండి శబ్గ తన్మాత్రా రూపమగు ఆకాశ ముత్పన్నమయ్యెను. దాని నుండి స్పర్శతన్మాత్రగల వాయువు దాని నుండి తేజో రూపము గల్గేను. తేజమునుండి రసాత్మకమైన జలమును దాని నుండి గంధ గుణము గల భూమియు గల్గెను. 

ఆకాశమున కోశబ్ద గుణమే కలదు. వాయువునకు శబ్ద స్పర్శములు గలవు. తేజముశబ్దస్పర్శ-రూపములను గుణత్రయము గలదని బుధులందురు. జలమునందు శబ్ద-స్పర్శ-రూప-రసమాత్రలు గలవనీ పండితులందురు. శబ్దము - స్పర్శము- రూపము-రసము- గంధమను గుణ పంచికము గలది భూమి. 

వీనిఅటన్నిటికలయిక వలన మహత్సూత్రము గల్గెను. ఆది సర్వవ్యాపకము. దానినే లింగ దేహమనియు నందురు. ఈ లింగదేహము సర్వప ప్రాణాత్మకము. దీనినాత్మయొక్క సూక్ష్కమదేహమనియు వచింతురు. అవ్యక్తము కారణదేహము దానిని ముందే వచించితిని పరమాత్మ యొక్క రెండవ కారణ దేహము నందు జగద్బీజములుండును. ఆది లింగ దేహములకు కారణభూతము. పిమ్మట పంచీకృతము గాని పంచ భూతముల వలన స్థూల పంచభూతములు గల్గెను. 

ఇట్లు పంచీకరణము వలన పంచభూత సృష్ఠి గల్గిన ప్రకారము చెప్పబడుచున్నది. వెనుక చెప్పిన ప్రతి భూతమును రెండుగ విభజింపవలయును. పిదప ప్రతిభూతము యోక్క రెండవ భాగముతో తక్కిన భూతముల నాల్గవ భాగములు గల్పిన ఒకస్థూల మహిభూతమగును. ఇట్లు పంచీకృతమైన పంచమహాభూతముల కార్యమే విరాడ్దేహము. 

ఇది పరమాత్మ యొక్క మూడవ స్థూల దేహము. ఈ పంచ మహాభూతముల సతాలీంశము వలన శ్రోత్రాది జ్ఞానేంద్రియముల లోని ప్రతి దాని సత్త్వాంశము వలన నాల్గు భేదములు గల యంతఃకరణ మేర్పడును. దానిలో సంకల్ప వికల్పాత్మక వృత్తి గలది మనస్సు ఏ సంశయము లేక నశ్చయ జ్ఞాన వత్తి గలది బుద్ది యనబడును.

చిత్తమను సంధాన పూపమైన వృత్తిగలది. నేనే చేయుచున్నానను నాత్మ వృత్తి - యహంకారమనబడును. తర్వాత పంచ మహ భూతముల రజోంశమున వాగాది కర్మేంద్రియంబు లుత్పన్నమగును. ప్రతికర్మేంద్రియము రజోంశమున ప్రాణాది పంచ వాయువులు గలుగును. ఆ వాయువులతో ప్రాణము హృదయమందును. ఈ పానము గుహ్య మందును వ్యానము నాభి యందును ఉదానము కంఠమందుము సమానము

శరీరమంతటను నుండును. పంచజ్ఞానేంద్రియములు-పంచ కర్మేంద్రియములు-పంచప్రాణములు-మనో బుద్దులు మొత్తము పదనేడగును. ఈ మొత్తమును నా సూక్ష్మ శరీర మనియు లింగ శరీరమనియు నందురు. అందలి ప్రకృతి రెండు విధములుగ నుండును. అందు సత్త్వాత్మకమైన ప్రకృతి మాయగ గుణమయమగు ప్రకృతియవిద్యగపేర్కొనబడును. 

తన్నాశ్రయించిన దానిని రక్షించునది మాయ యమబడును మాయమందలి పరమాత్మప్రతిబింబమనే యీశ్వరుడందురు. ఈ యీశ్వరుడు వ్యాపక బ్రహ్మము నెఱుగగలడు. ఈశ్వ రుడు సర్వజ్ఞుడు- సర్వకర్త- సర్వానుగ్రహకారకుడు. ఓ నగపతీ! ఇక ఆనిద్య యందును పరమాత్మ ప్రతిబింబించును. 

అట్టి ప్రతిబింబమును జీవుడని చైతన్యమని యందురు. ఈశ్వర జీవులను వీరిర్వురును విద్యవలన మూడేసి దేహములుండును. వీరిర్వురికిని తమతమ మూడు దేహము లందు నభీమానముండుట వలన వీరికి మూడేసి పేర్లు గలవు. జీవుడు కారణ దేహీభి మానియైనపుడు ప్రాజ్ఞుడనియు సూక్ష్మదేహాభిమానియైనపుడు తైజసుడనియు స్థూలదేహభిమానియైనపుడు విశ్వుడనియు నందురు. 

ఇదే విధముగ నీశ్వరుడను పై యాభిమానముల వరుసగ ఈశుడు-సూత్రాత్మ-విరాట్టు ననబరగును. నీరిర్వురిలో జీవుడు వ్యష్టి దేహాభిమాని. ఈశ్వరుడు సమష్ఠి దేహీభమీని. ఈ సర్వేశ్వరుడు కేవలము జీవులనను గ్రహించు కోర్కె గల్గి యుండును. అట్టి తన కోర్కె సాధించుట కీశ్వరుడు జీవుల కొఱకు పెక్కుభోగభాగ్యముల కాటపట్టగు విశ్వమును చిత్ర విచిత్రముగ తల ప్రభావముతో విరచించును. అతడీ సృష్టినంత యును నా శక్తి ప్రేరణచేత నాయుందన్న వాడై రచించుచుండును.

జగన్మాత - విరాద్రూప ప్రదర్శన

Incarnation as Parvati - పార్వతిగా అవతరణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - పార్వతిగా అవతరణ

అను వారి వేడుకోలు విని దేవి యిట్ల పలికెను. నా యొక శక్తి హిమాలయముపై గౌరి యన నవతరింపగలను. అమెకు శివునితో పెండ్లియగును. అమె మీ కార్యము సాధింపగలదు. మీకు సతతము నా పదములందు భక్తి నిల్చుగాక! హిమాలయ పతియుము నన్నే పరమ భక్తితో నుపాసించుచున్నాడు.

కనుక నతని యింట జన్మమెత్తుట నా కత్యంతము ప్రియముగనున్నది. దేవి ప్రసన్న వాక్కులు విని హిమాచలపతి డగ్గుత్తికచే తొట్రిలు మాటలతో కన్నీట

మహారాజ్ఞి కిట్లనెను: ఓ దేవి ! నీవెవనిని అను గ్రహింతువో వానిని మహాపురుషునిగ జేతువు. కానిచో కదలని జడమగు నేనెక్కడ ! సచ్చిదానంద రూపిణివి నీ వెక్కడ! ఓ పావనీ ! నాకు నూఱు జన్మములకైన నీకు తండ్రిగ బుట్టుట సంభవముగాను అశ్వమేధాదుల పుణ్యముననో నీ దివ్య సమాధి పుణ్యముననోకాని యిది సంభవించదు.

ఓహో! హిమాలయుడెంచటి ధన్యుడు ! ఎంత దృష్టవంతుడు ! జగన్మాతను తన కుతురుగ బడసెనను కీర్తి జగమందంట వ్యాపించును. ఏ జగజ్జనని గర్బమునందు బ్రహ్మండకోటులు నిండియుండెనో యా తల్లి యొకనికి తనయగ పుట్టుటచే నతనివంటివాడు నేలపై లేడు. నావంటి వాడు తమ వంశములో జన్మించె నని సంతసించి నా పితరు లెంతటి యుత్తమగుతులందుదురో!

ఓ మాతా ! నీవు ప్రేమనీరదయతో నా కీ వరమిచ్చిన విధముగ సర్వ వేదాంత ప్రతిపాద్యవగు నీ స్వరూపముము నాకు వివరింపుము. ఓ పరమేశానీ ! భక్తితోడి యోగమును వేద సమ్మతమగు జ్ఞానమును గుఱిచి నాకు తేట పఱచుము. దాని వలన నేను నిన్నే కొల్చుచుండగలను. అ హిమాలయుని మాటలు వినియంబ విప్పారిన ముఖ పద్మముతో వేదాంత రహస్యము గూర్చి వారికి తెల్పుటకిట్లు ప్రారింభించెను.

జగన్మాత చేసిన జ్ఞానబోధ

Devatakrta Devistuti - దేవతాకృత దేవీస్తుతి

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవతాకృత దేవీస్తుతి

ఆ దయామతల్లిని దర్శించి దేవత లెల్లరును నమస్కరించిరి. వారికనులనిండ నందబాష్ఫములు నిండగ నోట మాట రాకుండిరి. నారు తుదకెట్టులో గుండె చిక్కబట్టుకొని భక్తి వినమ్రతతో తలలు వంచి కన్నుల ప్రేమాశ్రులు నిండార జగదంబను సన్నుతింపసాగిరి. శ్రీదేవి - మహ దేవి - శివ- పరాప్రకృతి - భద్రయగుతల్లికి నిరంతరము తప్పక మేము నమస్సు లర్పింతుము. జ్ఞానులలో హృదయాగ్ని రూపిణి- చైతన్య రాశి-కర్మఫలము లందిపంనెల్లర సేవలందుకొను తల్లి-సంసారతారిణి-తపః సముజ్జ్వలయగు దుర్గకు మనస్సులర్పింతుము.

దేవతలు దైవీభషను సృజించిరి. ప్రాణులు దానిని పెక్కరూపముల పేర్కొందురు. అట్టి వాక్‌స్వరూపిణి-కామధేనువు-దేని - మాకన్నాదులుప్రసాదించుగాక.శ్రీకాళరాత్రి-బ్రహ్మస్తుత-వైష్ణవి-స్కందమాత-సరస్వతి-అదితి-దక్షకన్య-పావన-పావన-శివయగు తల్లికి నమస్సు లర్పింతుము. మేము శ్రీమహలక్ష్మిని తెలిసికొనుచున్నాము.

అమెను సర్వశక్తిస్వరూపిణిగ ధ్యానించుచున్నాము. అట్టి శ్రీ దేవి మాబుద్దులను ప్రేరించుగాక. శ్రీ విరాట్స్వరూపిణి-సూత్రాత్మమూర్తి- అవ్యాకృత రూపిణి- బ్రహ్మమూర్తియగు తల్లికి నమస్సులర్పింతుము. త్రాటిని చూడగపామను భ్రమ గలునటుల నిన్ను తెలియనందున జగద్ర్బాంతి గల్గును. ఏ దేవి జ్ఞానము జగద్ర్బ తొలగునో యట్టి త్రిభువనేశ్వరికి నమస్సు లర్పింతుము.

పంచకోశాతిరిక్త - అవస్దాత్రయ సాక్షిణి | త్వంపదలక్ష్యార్ద- ప్రత్యగాత్మ స్వరూపిణియగు దేవికి నమస్సులర్పింతుము. ప్రణవ రూప - హ్రుంకారమూర్తి - నానా మంత్రాత్మిక - దయామయియగు దేవికి నమస్సు లర్పింతుము. అని మణి ద్వీపాధినాసినిని దేవత లెల్ల రభినుతించిరి.

అంత దేవి మత్తకోకిల కంఠముతో తీయగ వారికిట్లు పలితెను. ఓ దేవతలారా! మీరే మి పని మీద ఇట గుమిదూడితిరి. నేను నిత్యమును వరము లోసంగుదానను. ఎప్పుడును భక్తుల కోర్కులు దీర్చు కల్పకమను నేను మీ యందుండగ మఱి భక్తి పరులగు మీ కిక చెంత యేల ? నేను నా సద్బక్తులను తప్పక దుఃఖసంసార సాగరమునుండి తరింపచేయగలను.

ఓ యమరులారా! ఇదే నా సత్యప్రతిజ్ఞ నా యెఱంగుడు. అను దేవి ప్రేమపూర్ణవచనము లాలించి వేల్పులు సంతోషించిరి. రాజా! అపుడు దేవతలు నిరభయముగ తమ దుశఖ మిట్లు తెల్పుకొనిరి.

ఓ దేవీ ! ఈ ముల్లోకము లందు నీ వెఱుంగనిది కొంచెమైనను లేదు. పరమేశ్వరీ ! నీవు సర్వజ్ఞవు. సర్వ సాక్షిస్వరూపిణివి. మేము రేయింబవళ్ళు తారకాసురుడు పెట్టు భాదాలు తాళలేకునానము. ఓ మహేశ్వరి! వాడు శివున కుద్బవించు కుమారుని వలనగాని చావడని బ్రహ్మ నిర్ధేశించును.

శివున కిపుడా భార్యలేదని నీకు తెలియును గదా. సర్వజ్ఞురాలవగు నీ యందు పామరుల మేము పలుక గలము. అంతయును సూక్ష్మముగ దెలిపితిమి. తల్లీ! సర్వము నీవే యెఱుంగుము. నీ దివ్యపదపద్మములం దేమఱక మా చిత్తము నిశ్చలముగ నుండుగాత. శివుని కుమారనికొఱకు నీవు తనువు దాల్చవలయునని మా ప్రార్థన.

పార్వతిగా అవతరణ

Jaganmata Avirbhavam - జగన్మాత ఆవిర్భావం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాత ఆవిర్భావం

వ్యాసు డిట్లనియెను: జనమేజయా! ఈ విధానమున పెక్కేండ్లకాలము గడిచెను. ఆ దయామతల్లిని దర్శించి దేవత లెల్లరును నమస్కరించి అంతట నొక యేటి చైత్ర శుద్ద నవమీ శుక్రవారమునాడు వేదసమ్మతమగు పరంజ్యోతి వారి యెట్టయెదుట ప్రత్యక్షమయ్యెను.

దేవి తేజము దెసల రూపుదాల్చిన నాల్గు వేదములచేత సన్నుతింపబడుచుండెను. కోటి సూర్యుల ప్రభలతో విరాజిల్లుచుండెను. నిండు పున్నమ జాబిలి కోటుల చల్లందనముతో నొప్పుచుండెను. ఆ తేజము కోటి మెఱపు తీగెలోక్కటై తళుక్కుమన్నట్లు మెఱసెను. అరుణారుణ కాంతులు వెలార్చుచుండెను. పైని-క్రింద-నడుమ-అడ్డము అను బేధములేకెల్లెడల వెల్గులు చిమ్ముచుండెను. ఆ మహా మహస్సునకు మొదలు- చివర- చేతులు మున్నగు నంగములు లేవు. స్త్రీ-పుం-నపుంసకతా బేదములులేవు. 

రాజా! అట్లు వెల్గుచున్న పరమ రమణీయ శోభను దర్శించగనే దేవతల కన్నులు చూడలేక మూతలు పడెను. మరలవారు ధైర్యమవలంబించి చూచిరి. అంతలోనా దివ్యతేజోరాశి మొత్తమొక దివ్వమనోహర స్త్రీ రూపమున చెన్ను దలిర్చెను. ఆమెరమణీయాంగి-కుమారి-నవ ¸యవన- యైయొప్పెను. 

ఈ మాతృదేవికి తమ్మిమొగ్గలను దెగడ గబ్బిబిగి గుబ్బల జంట గలదు. కిణకిణమను కింకిణుల మంజుల రావమున నినదించు మంజీర మేఖల గలదు. దేవి బంగారుటంగద - కేయూర గ్రైవేయ భూపలచేత నలకరింపబడెను. దేవి గళసీమలో విలువైన జాతి మణుల వివిధ హారకాంతులు దీపించుచుండెను. ఆమె ముంగురులలో తుఱిమిన కేతకీ సుమముల సువాసనలకు గండు తుమ్మెదలు ఝమ్మనుచుండెను. ఆమె సోబగైన పిఱు దులతో నందనమైనది. నూగారు వరుసతో శోభిల్లు చుండెను. 

ఆమె కప్పురము వేసిన తాంబులములతో నొప్పు ముఖము గలది. ప్రకాశించుచున్న బంగారు తాటంకములచే చెన్నొందు ముఖ కమలము గలది. ఆమె యష్టమినాటి చందురునిబోలు నొసలు గలది. పొడవు వెడల్పైన కన్బోమలు-ఎఱ్ఱని కమలనయనయములు-ఎత్తగు ముక్కు -మధురాధరము గలది. దేవి దంతముల చివరలు కుందముల మొగ్గలు- మంచి ముత్తెముల హారము నవరత్న వజ్రములు పొదిగిన కిరీటముగల్గి ఇంద్రరేఖ యాభరణ ములు గల్గి యుండెను. ఆమె కేశపాశములు మల్లికా- మాలతీ సుమముల హారాలతో గుబాళించెను.

ఆమె కస్తూరీ తిలకమున నలరారు నెన్నుదురుగల్గి మూడు కన్నులు గలది. ఆమె రక్త వస్త్రముదాల్చి దానిమ్మపూవువలె ప్రభలు జిమ్ముచుండెను. నాల్గు చేతులందు పాశ-అంకుశ-వర-అభయములు గలది. ముక్కంటి. ఈ విధముగ దేవి సకల శృంగార వేషములు దాల్చి సర్వ దేవతలచేత నమస్కరింపబడు విశ్వమాత- సర్వమోహిని-ఎల్ల దిక్కులనిండు కాంతిగలది. ఇట్టిదయామయి-సుముఖి-చిర్నగవులు చిందించు ముఖకమలము గలది- అవ్యాజ ప్రేమదయామూర్తి- యగు మాతృదేవిని సురలు తమ యెదుట సందర్శించిరి.

Tarakasura Vijrumbhana - తారకాసుర విజృంభణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - తారకాసుర విజృంభణ

జనమేజయ డిట్లనెను : ఓ మునివరా| పరమ మహస్సగు శ్రీదేవి హిమగిరి శిఖరముపై నవతరించెనని మున్ను నీవు తెలిపితివి. దానిని విశదముగ తెలియపలుకుము. అమృతము త్రాగువానికి చావు వచ్చును. కాని శ్రీదేవీ దివ్యశక్తి కథారసామృతముగ్రోలు ధీశాలికి చావులేదు. అతని కెంత గ్రోలినను తృప్తి గల్గదు. 

వ్యాసు డిట్లనియెను: రాజా! నీవు ధన్యతముడవు-పుణ్యశాలివి. పెద్దనివలన బుద్ధి నేర్చినవాడవు. కనుకనే నీకు శ్రీదేవీ పదపద్మములందు నిశ్చలభక్తి కుదిరినది. రాజా ! అవధరింపుము. మున్నటుల నగ్నిలో సతీదేవి దగ్ధకాగా శివుడు వ్యాకులచిత్తముతో తిరిగివిసిగితుద కొకచోనుండెను. 

ఆయన సంసార వివిధ విషయములు విడనాడి సమాధిలో శ్రీ దేవీ స్వరూపమును ధ్యానించుచు కాలము గడువుచుండెను. అపుడు చరాచర ప్రపంచమంతయు కళాసౌభాగ్యములు కోల్పోయెను. గిరులు-సంద్రములు-దీవులు శక్తిహీనము లయ్యెను. ఎల్లర హృదయములందలి యానందరేఖలును సమసిపోయెను. ఎల్లలోకములు చింతాగ్రస్తములై దిక్కుమాలి యుండెను. అవి దుఃఖ సాగరమున మునిగి రోగగ్రస్తములయ్యెను. ఎల్ల సురలును-గ్రహములను గతులు తప్పిరి. 

రాజా! ఇదంతయును శ్రీసతీదేవి లేని కారణముననే జరిగెను. అట్టి చెడుకాలమున తారకుడను మహాసురుడు పుట్టెను. అతడు బ్రహ్మవలన వరముల బడసి త్రిలోకములకు నాయకుడయ్యెను. శివుని కన్న కొడుకు నిన్ను చంపగలడని బ్రహ్మయతనితో ననెను. ఇట్లు తారకుని చావు నీర్ణీతమయ్యెను. 

అప్పటికి శివునకు కుమారుడు డలుగనందున తారకు డహంకారముతో విఱ్ఱవీగుచుండెను. అతని మహోప ద్రవముల కెల్ల దేవతలును స్థానభ్రష్ఠులైరి. శివునకు కన్నకొడుకు లేమింపజేసి వారు చింతాక్రాంతులైరి. శంకరునకు భార్యయే లేదుగదా! కొడుకెట్లు గల్గును.? మన మెంతటి దురదృష్ట వంతులము. ఇక మనపని యెట్లు నెఱవేరగలదు.?

అని తలపోయుచు వేల్పులు వైంకుఠ మేగి యేకాంతమున హరికి సర్వము నివేదించిరి. అంత హరి వారి కొకయుపాయము చెప్పెను. మీరెల చింతింతురు? శివా భవాని కామకల్పతరువు-మణిద్వీపనివాసిని-భువనేశ్వరి. ఆమె మనపాలగలదు. దేవి- జగదేకమాత. మనకు బుద్ది చెప్పుటకొఱకే మన బాధలు గనియు నామె పట్టించుకొనకున్నది. అంతేకాని వేరేమియు గాదు. తల్లి తన పిల్లవానిని కొట్టునప్పుడును లాలించునప్పడును దయమాలి యుండదు. 

అటులే యీ జగన్ని యంత్రి మనము చేయు తప్పోప్పులకు దయమాలి యుండదు. అడుగడుగునకు కొడుకు తప్పులు చేయుచునే యుండును. వాని నెల్ల తల్లిగా కితరు లెవ్వరీ లోకమున సైచి యుండగలరు.కనుక మీరెల్లరును జాగుసేయక పరాంబికను పొపపొచ్చెములేని చిత్తముతో శరణువేడుడు. ఆమె మీ పనులన్నిటిని చక్కపఱచగలదు. అని వాక్రుచ్చి సురాధిపతియగు మహా విష్ణువు తన భార్యను వెంటగొని దేవతలనుగూడి బయలుదేరెను. 

విష్ణువు పర్వతరాజు మహాశైలమునగు హిమగిరి కేగెను. అట దేవత లెల్లరును దేవీమంత్ర పురశ్చరణ చేయసాగిరి. అంబాయాగ విధాన మెఱింగిన వా రంబాయాగము సాగించిరి. కొందఱు తృతీయాది వ్రత మాచరించుచుండిరి. మఱికొంద ఱంబను గూర్చి సమాధి నిమగ్నులైరి. ఇంకను కొందఱు శ్రీదేవీ నామజప పరాయణత్వమున నుండిరి. కొందఱు దేవీసూక్తము పఠించిరి. కొందఱు నవార్ణమంత్రము జపింపసాగరి. కొందఱు క్బచ్ర్చ చాంద్రాయణ వ్రతము సాగించిరి. కొంద ఱంతర్యాగపరులు. కొందఱు న్యాసపరులైరి. కొందఱు నిశ్చల ముగ పరాశక్తి యంత్రము పూజింపసాగిరి. 

Dakshudu Chesina Aparadham - దక్షుడు చేసిన అపరాధం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దక్షుడు చేసిన అపరాధం

ఒకప్పుడు దుర్వాసమహర్షి జంబూనదీతీర మేగి యచట వెలసిన శ్రీదేవిని సందర్శించి శ్రీమాయాబీజము నచట జపించెను. అంతట శ్రీదేవేశ్వరి ప్రసన్నయై పూలజుంటి తేనియలకు తిరుగాడు గండుతుమ్మెదలుగల తన మెడలోని పూలదండ ముని కిచ్చెను. ముని దానిని దేవిప్రసాదముగ గ్రహించెను. తాపసు డాకాశమార్గమున బయలుదేరెను.

అతడు సతి తండ్రియగు దక్షుడున్నచోటి కరిగెను. అట జగదంబను దర్శించి యామె పాదపద్మములకు నమస్కరించెను. ఆ పూమాల జూచి 'యిదెవరది? మానవ దుర్లభమైన యిదినీ కెట్లు లభించెనని దక్షుడనెను. దక్షుని మాటలు విని కన్నుల ప్రేమాశ్రులు నిండ 'నిది శ్రీదేవి ప్రసాద' మని డగ్గుత్తికతో ముని పలికెను. దానిని తన కిమ్మని సతి తండ్రియగు దక్షడు ముని నడిగెను. 

శక్తి భక్తులకు ముల్లోకములం దీయరానిది లేదు. అని తలంచి ముని దేవి పుష్పమాలను దక్షున కొసంగెను. దక్షుడు దానిని తన తలపై దాల్చి యింటి కేగెను. ఆ రేతిరి దాని నతడు దంపతుల మెత్తని పానుపుపై నుంచెను. దాని పరిమళములు మూర్కొనుచు దక్షదంపతులు రతియందు సుఖించిరి. ఈ మహాపాపానికి ప్రతిఫలంగా అతడి మనస్సులో శంకరుడిపై ద్వేషం రగిలింది. ఆల్లుడిమోద కోపం ఆత్మజమోదకు కూడా ప్రసరించింది.

తండ్రి చేసిన అపరాధాన్ని భరించలేక అతడినుంచి సంక్రమించిన తన దేహాన్ని యోగాగ్నికి అహుతి ఇచ్చింది సతీదేవి. అటుపైని ఆ దివ్యతేజన్సు హిమవంతుని ఇంట ఆవిర్భవించింది. పార్వతీనామధేయంతో పరిఢవిల్లింది - అని చెప్పి ఒక్క క్షణం ఆగేడు వ్యానహర్షి వెంటనే జనమేజయుడు

108 శక్తిపీఠాలు

108 Shakti Peethas - 108 శక్తిపీఠాలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - 108 శక్తిపీఠాలు

జనమేజయు డిట్లనెను: సతీదేవి దగ్దగాగ శివుడేమి చేసెను? తనకు ప్రాణప్రియయగు సతీ విరహమును శివుడెట్లు సహించెనో తెల్పుము.

వ్యాసు డిట్లనెను : రాజా ! తర్వాత వృత్తాంతము తెల్పుటకు నాకే శక్తి చాలకున్నది.

శివుని కోపాగ్నికి ముల్లోకములందు ప్రళయమే సంభవించెను. అంత శ్రీభద్రకాళీ గణములు వెంటరాగా శ్రీవీరభద్రుడవతరించెను. వీరభద్రుడు ముల్లోకములను నాశనము చేయపూనుకొనగనే బ్రహ్మది దేవతలు శివుని శరణు వేడిరి. సతీ నాశమున సర్వనాశమైనప్పటికిని శంకరుడు దయతో వారి కభయ మొసంగెను.

మేక తలను దక్షుని మొండెమున కతికింప జేసెను. ఇట్లు దక్షుని బ్రదికించి దేవతల కభయమిచ్చి విచారగ్రస్తుడై శివుడు యజ్ఞశాలకేగి గోడున దురపిల్లెను.

పిమ్మట చిత్కళాస్వరూపిణియగు సతీదేవి యగ్నిలో దహింపబడుచుండుటగని హా సతీ! యని యామెను తన భుజముపై వేసికొనెను. ఆమెను మోసికొనుచు చలించిన మనస్సుతో శివుడు నానా దేశములు గ్రుమ్మరుచుండగ బ్రహ్మాది దేవతలు చింతాక్రాంతులైరి. వెనువెంటనే శ్రీహరి వచ్చి విల్లమ్ములుగొని సతి యవయవములు ముక్కముక్కలుగ ఛేదింపగ నవి పలుచోట్ల పడెను. ఆ బాగాలు పడినచోట్ల నెల్ల శివుడు పలురూపులుదాల్చి వెలసెను.

శివుడు దేవతల కిట్లనెను:ఈస్థానములందలి శివాదేవిని కొలవవలయును. ఆ విధముగ పరాభక్తితో దేవిని సేవించినవారికి దుర్లభమైనది లేదు. దేవినిజాంగములు పడిన తావులందెల్ల పరాంబ నెలకొనియున్నది. అట్టిస్థానములందు పురశ్చరణ చేసిన వారి మంత్రములు త్వరితగతిన సిద్ధించును.

అని ప్రకటించి శంకరుడు సతీవిరహాతురుడై ఆయా ప్రదేశాలలోనే సంచరిస్తూ జపధ్యాననమాథి నిష్టాపరుడై కాలం గడిపాడు. 

వ్యాసు డిట్లనెను: జనమేజయా ! అవి ఎయే క్షేత్రాలో తెలుసుకోవాలనే ఉత్సుకత నీ ముఖంలో కనిపిస్తోంది. చెబుతాను, తెలుసుకో. వాటిని దేవీపీఠాలు అంటారు. వెళ్ళి దర్శించగలిగితే ఉత్తమం, దర్శించలేనివారు శ్రద్ధగా వింటే చాలు పాపవిముక్తులవుతారు. అవి సిద్ధపీఠాలు.

ఓ రాజా ! ఇపుడు శ్రీదేవీ పీఠముల గూర్చి వివరింతును, సావధానముగ వినుము. వానిని విన్నంతనే నరుడు సర్వపాపముక్తుడు గాగలడు. పరమసిద్ధిని విభూతిని గోరువా రేయే పీఠములందే యే నామములతో దేవి నుపాసించి ధ్యానింతురో తెలుపగలను. 

శ్రీ గౌరీముఖము పడినచోటు కాశి. అచట దేవిని విశాలాక్షి యందురు. 
నైమిశారణ్యక్షేత్రమునందలి దేవి లింగధారిణి, 
ప్రయాగలో లలిత, 
గంధమాదనమున కాముకి, 
దక్షిణ మానసమున కుముద, 
ఉత్తర మానసమున విశ్వకామములు తీర్చు విశ్వాకామ, 
గోమంతమందు గోమతి, 
మందరమున కామ చారిణియై, 
చైత్రరథమున మదోత్కట 
హస్తినాపురమందు జయంతి, 
కన్యాకుబ్జమందు గౌరి, 
మలయాచలమున రంభ, 
ఏకామ్ర పీఠమున కీర్తిమతి, 
విశ్వమందు విశ్వేశ్వరి 
పుష్కరమున పురుహూత, 
కేదారమందు సన్మార్గదాయిని, 
హిమాలయము వెనుక భాగమున మంద గోకర్ణమున భద్రకర్ణిక, 
స్థానేశ్వరమున భవాని, 
బిల్వకమున బిల్వపత్రిక, 
శ్రీశైలమున మాధవి, 
భద్రేశ్వరమున భద్ర, 
వరాహశైలమున జయ 
కమలాలయమున కమల, 
రుద్రకోటియందు రుద్రాణి, 
కాలంజరమున కాళి, 
శాలగ్రామమున మహాదేవి, 
శివలింగమున జలప్రియ 
మహాలింగమున కపిల, 
మాకోటమున ముకుటేశ్వరి, 
మాయా పురియందు కుమారి, 
సంతానమందు లలితాంబిక, 
గయలో మంగళ, 
పురుషోత్తమమున విమల, 
సహస్రాక్షమున ఉత్పలాక్షి, 
హిరణ్యాక్షమున మహోత్పల, 
విపాశలో అమోఘాక్షి, 
పుండ్రవరమున పాటలయని దేవిని వ్యవహరింతురు.

సుపార్శ్వమున నారాయణి 
త్రికూటమందు రుద్రసుందరి 
విపులమున విపుల 
మలయాఛలమున కల్యాణి 
సహ్యగిరిపై ఏకవీర 
హరిశ్చంద్రమున చంద్రిక 
రామతీర్థమున రమణ 
యమునయందు మృగావతి 
కోట తీర్థమున కోటవి 
మాధవీ వనమున సుగంధ 
గోదావరియందు త్రిసంధ్య 
గంగాతీరమందు రతిప్రియ 
శివకుండమున శుభానంద 
దేవికాతటమున నందిని 
ద్వారకయందు రుక్మిణి 
బృందావనమున రాధ 
మధురలో దేవకి 
పాతాళమందు పరమేశ్వరి 
చిత్రకూటమున సీత 
వింధ్యాద్రిపై వింధ్యాదివాసిని 
కరవీరమున మహాలక్ష్మీ 
వినాయకమున ఉమాదేవి 
వైద్యనాధమున ఆరోగ్య 
మహాకాళమున మహేశ్వరి 
ఉష్ణతీర్థమున అభయ 
వింధ్యగిరిపై నితంబ 
మాండవ్యమున మాండవి 
మహేశ్వరీపురమున స్వాహా ఛ 
గండమున ప్రచండ 
అమర కంటకమన చండిక 
సోమేశ్వరమున వరారోహ 
ప్రభసమున పుష్కరావతి 
సరస్వతిలో దేవమాత 
సాగరతటమునందు పారా 
వార మహాలయమున మహాభాగ 
పయోష్ణిలో పింగలేశ్వరి 
కృతశౌచమున సింహిక 
కార్తికమున అతిశాంకరి 
ఉత్పలావర్తమున లోల 
శోణసంగమున సుభద్ర 
సిద్ధవనమందు లక్ష్మిమాత 
భరతాశ్రమున అనంగ 
జాలంధరమున విశ్వముఖి

కిష్కింధపర్వతమున తార 
దేవదారువనమందు పుష్టి 
కాశ్మీరమండలమందున మేధ 
హిమాద్రియందు భీమాదేవి 
విశ్వేశ్వరీ క్షేత్రమున తుష్టి 
కపాలమోచనమున శుద్ధి 
కాయావరోహణమున శ్రీమాత 
శంఖోద్ధారమున ధర 
పిండారకమున ధృతియని శ్రీదేవికి నామములు.

చంద్రభాగయందు కళ 
అచ్చోదమున శివధారిణి 
వేణయం దమృత 
బదరియం దుర్వశి 
ఉత్తరకురువులందు ఔషధి 
కుశద్వీపమున కుశోదక 
హేమకూటమున మన్మథ 
కుముదమున సత్యవాదిని 
అశ్వత్థమున వందనీయ 
వైశ్రవాణాలయమందు నిధి 
వేదదనమున గాయత్రి 
శివసన్నిధియందు పార్వతి 
దేవలోకమందింద్రాణి 
బ్రహ్మముఖమందు సరస్వతి 
సూర్యబింబమున ప్రభ 
మాతృగణములందు వైష్ణవియని శ్రీదేవికి క్షేత్రభేదమున వ్యవహారము. సతులందురుంధతీదేవి అందకత్తెలలో తిలోత్తమ- ఎల్లరి చిత్తములందు చిత్కలాశక్తి-గ దేవి విలసిల్లుచున్నది. 

ఓ జనమేజయా! ఇవి మొత్తము నూటయెనిమిది శ్రీదేవీ పీఠములు. శ్రీదేవి నామములను నూటయెనిమిదిగ ప్రసిద్ధిగాంచెను. ఈ ప్రకారముగ దేవి శరీరము నుండి యేర్పడిన దేవి పీఠములు తెల్పితిని. ఈ భూతలమందింకను ముఖ్యములైన దేవీ నిలయములు గలవు. 

ఎవడీ నూట యెనిమిది దేవీ పీఠనామములు వినునో చదువునో వాడు సకల పాపముక్తుడై తుదకు దేవీసాలోక్యమందగలడు. ఈ యెల్ల పుణ్యదేవీపీఠనామములు వినునో చదువునోవాడు సకల పాపముక్తుడై తుదకు దేవీసాలోక్యమందగలడు. ఈ యెల్ల పుణ్యదేవీ పీఠములకు యాత్రజేసి తెలిసినవాడు యథావిధిగ పితరులకు సంతర్పణము శ్రాద్ధాదులాచరింపవలయును. 

శ్రీభగవతికి విధివిధానముగ దేవీపూజలు జరిపి మాటిమాటికిని జగద్దాత్రియగు జగదంబను క్షమించ వేడుకొనవలయును. ఇట్లోనరించి తానొక ధన్యజీవుడనని భావింపవలయును. 

రాజా! ఎల్ల బ్రాహ్మణులను భక్ష్యభోజ్యాదులతో సంతోషపఱచవలయును. బ్రహ్మచారులను బాలలను భోజనాదులచే తనుపవలయును. ఆయా క్షేత్రములందలి తక్కినవారిని చండాలాదులను తనుపవలయును. పిమ్మట వీరి నెల్లరను దేవీ స్వరూపులుగ భావింపవలయును. పూజింపవలయును. ఆ పుణ్యతీర్థములందు దానములు గ్రహింపరాదు.

తన శక్తి కొలది మాయాబీజమంత్రమునకు పురశ్చరణ చేయవలయును. మాయా బీజముతో మాయా పీఠములందు వసించు దేవేశిని పూజించవలయును. దేవీ మంత్రమును రాత్రింబవళ్లు జపించి దేవిని పూజించిన పురశ్చరణ జరుగును. దేవీ భక్తి తత్పరు డెన్నడును దేవీపూజకై ధనమునకు వెనుకముందు లాడరాదు. 

ఎవడీ విధముగ ప్రీతచిత్తముతో శ్రీ దేవీ యాత్రలు జరుపునో యతని పితరులు వేయి కల్పములవఱకు మహత్తర బ్రహ్మలోకమునందు వసింతురు. అటుపిదప పరమజ్ఞానము బడసి సంసారసాగరము దాటి శ్రీమంతమగు దేవీపురమున విరాజిల్లుచుందురు. ఈ నూటయెనిమిది దేవీ నామ ములు చదివినవారు సిద్దులైరి. ప్రతియింట నివి పుస్తకరూపమున వ్రాయబడియుండ వలయును. 

అచ్చోట దుష్ట-గ్రహ-మారీ-భయాదులు గలుగవు. మఱియును నిండుపున్నమనాటి సంద్రమువలె నిత్యము శాంతి సౌభాగ్యములు వర్ధిల్లును. ఈ దేవీ నామాష్టశతకము జపించువానికి లోకమున దుర్లభ మనునది లేదు. అట్టి దేవీ భక్తి పరాయణుడు కృతకృత్యుడు. ధన్యజీవనుడు. అట్టివానిని దేవీ స్వరూపునిగ నెంచి యెల్లదేవతలు నమస్కరింతురు. అతడు దేవతలచేతనే పూజింపబడును. 

ఇక నరులవలన చెప్పెడి దేమున్నది! ఈ దేవీ నామాష్టశతకమును శ్రాద్ధకాలమందు పఠించినచో పితృదేవతలు తృప్తులై పరమ గతిని జెందుదురు. ఈ సిద్దపీఠము లన్నియును జ్ఞానతీర్థములు-ముక్తిక్షేత్రములు. మతిమంతుడీ దేవీసిద్దక్షేత్రములు తప్పక సేవింపవలయును. శ్రీ మహేశ్వరిని గూర్చి నీ వడిగిన గుహ్యములు గుహ్య తమముల నెల్ల నీకు వివరించితిని. ఇంకేమి విన వలతువో తెలుపుము.

తారకాసుర విజృంభణ

Wednesday, April 22, 2026

Harihara's pride is broken - హరిహరులకు గర్వభంగం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - హరిహరులకు గర్వభంగం

జనమేజయ డిట్లనెను: పూర్వము శ్రీపరాంబిక గౌరీ-లక్ష్మీ-సరస్వతులను వరుసగ శివ-విష్ణు- బ్రహ్మలను త్రిమూర్తుల కొసంగెను. మఱి దక్షునకు-హిమవంతునకు గల్గిన కన్య గౌరి యెవరు? మఱి పాలసంద్రము కూతురు మహాలక్ష్మి యందురు గదా! గౌరీలక్ష్మలకు మఱల కన్యాత్వ మెట్లు గల్గెను. 

ఓ మునీశా! ఇదంతయు నసంభవమని నాకు దోచుచున్నది. ఇందు సందియమును గల్గుచున్నది. నీ జ్ఞానఖడ్గముతో నా యీ సందేహము బాపుము. 

వ్యాసు డిట్లనెను : రాజా! శ్రీదేవీ భక్తుడవగు నీకు చెప్పరాని దొక్కటియు నుండదు. నీ వడిగిన పరమాద్బుత రహస్యము వెల్లడింతును. అవధరింపుము. శ్రీపరాంబిక పూర్వము దేవీత్రయమును త్రిమూర్తుల కొసంగెను. ఆనాటినుండి త్రిమూర్తులు తమతమ సృష్టి కార్యములు సాగించిరి. 

రాజా! మునుపు హాలాహలులను దైత్యులు మహావిక్రములు. వారొకప్పుడు క్షణములో ముల్లోకములు గెలిచిరి. వారు బ్రహ్మవరమున బలిసి కైలాస వైకుఠములపై దండెత్తిరి. వారితో హరిహరులును యుద్ధమునకు సిద్ధపడిరి. అట్లు వారికి ఘోరముగ నారు వేలేండ్లు సమరము జరిగెను. 

అపుడు దేవదానవ సేనలలో హాహాకారములు మిన్ను ముట్టెను. హరిహరులచేత నెందఱందఱో రక్కసు లుక్కడంగిరి. అంత హరిహరులు తమ తమ నెలవుల కరిగి తమ తమ భార్యల యెదుట తమ వలననే రక్కసులు మడిసిరని గొప్పలు చెప్పుకొనిరి. వారి స్వాహిమానమునకు లక్ష్మీగౌరులు కపటముగ నవ్విరి. హరిహరులు వారి నవ్వు చూచిరి.

వారాది మాయాశక్తికి మోహితులై వారిపై మిక్కిలిగ కోపము జెందిరి. వారు వారి కవమానము గల్గునట్లుగ నోటికి వచ్చునట్లు మాటలాడిరి. ఆ క్షణముననే లక్ష్మీగౌరు లందర్ధానము జెందిరి. అపుడు పెద్దగ కలకలము బయము దేరెను. లక్ష్మీగౌరుల నవమానించుటవలన హరిహరులు తేజము-శక్తి-చేతనము-గోల్పోయి చపలచిత్తులైరి. 

అంత బ్రహ్మ యిట్లు చింతించెను: ఏమి ఈ వింత! దేవతలలో ప్రముఖులు హరిహరులు గదా! నేడు వారు కార్యదక్షులు గాకుండి రేల? ఈ కాలముగాని కాలమునందేమి ఈ వైపరీత్యము. ఏ పాప మెఱుగని యీ జగమునకు ప్రళయము ముంచుకొని రాలేదు గదా! దీని కారణమో తెలియక ప్రతి క్రియ యెట్లు జరుపగలను? అని యీ రీతిగ చింతించి బ్రహ్మ కనులు మొగిడ్చెను. 

అపుడా పరాశక్తి కోపముననే యంతయును జరిగినదని యెఱిగి బ్రహ్మ సావధానుడయ్యెను. అపుడు తపోనిధియగు బ్రహ్మ తన సుతులగు మున్వాదులను సనకాదుల నాహ్వానించెను. వారు వచ్చి నమస్కరింపగ 

బ్రహ్మ వారి కిట్లనెను: నే నిపుడొక పనిలో మునిగియున్నాను. నేను తపము చేయజాలను. హరిహరులు శ్రీపరాశక్తి కోపమునకు గురియై శక్తిహీనులైరి. ఆమె సంతోషించుట కీ జగద్బారమంతయు నేనే వహింపగలను. కనుక మీరలైకాంతిక భక్తితో నత్యద్బుతమైన తప మాచరించి పరాంబికను సంతోషపెట్టుడు. 

ఓ నా పుత్రులారా! హరిహరులు తిరిగి శక్తియుక్తు లగునటుల చేయుడు. మీ కీరితి వర్ధిల్లు గాత. ఆ యిర్వురు మహాశక్తులెవని యింట నుద్బవింతురో యా వంశలో లోకముల నెల్ల పవిత్ర మెనర్చును. ఆ కన్న వారును ధన్యజీవు లగుదురు. అను బ్రహ్మ వాక్కులు విని దక్షాదు లెల్లరును నిర్మలమనస్కులై శ్రీజగదంబ నారాధింపగోరి వనముల కేగిరి.

అటుపిమ్మట వారలెల్లరును హిమాలయముల వనములకేగి శ్రీమాయాబీజజప పరాయణులై నిశ్చలముగ తపమారంభించిరి. రాజా! వారొక లక్షయేండ్లు పరాశక్తిని ధ్యానించిన పిమ్మట శ్రీదేవి ప్రసన్నయై వారికి దర్శనభాగ్యమొసంగెను. ఆ సచ్చిదానంద స్వరూపిణి యగు త్రిలోచన దయారసముపూర్తిగ వెల్లివిరియగ తన నాలుగు చేతులందు పాశము-అంకుశము-వరాభయముద్రలు దాల్చెను. ఆ యెల్లలోకాలు పరిపాలించు జననినిగని నిర్మలమనస్సులు గలమును లిటుల దేనిని సన్నుతించిరి! 

ఓ వైశ్వానర స్వరూపిణి! ఓ విశ్వరూపిణి! నీకు మా ప్రణామములు. ఏ చిద్రూపిణియం దెల్ల లింగదేహములు నిండియుండునో యా సూత్రాత్మ స్వరూపిణికి జలరూపిణికి మా ప్రణమములు. ఎల్ల దేహములందునిండియున్న యవ్యా కృతరూపిణి- ప్రాజ్ఞస్వరూపిణి- ప్రత్యక్స్వరూపిణి-యగు బ్రహ్మమూర్తికి మా ప్రణమములు. సర్వస్వరూపిణి-సర్వలక్ష్య స్వరూపిణ-యగు జగదంబికకు మాప్రణమములు. ఆ తల్లిని మధుర భక్తితో సన్ను తింతుము. 

అని దక్షాదులు ములు నిర్మలచిత్తులు దేవి చరణకమలములకు ప్రణమిల్లిరి. పిదక పికభాషణియగు శ్రీదేవి సుప్రసన్నయై వారి కిట్లనెను: ఓ మహాత్ములారా! నేను వరదాయినిని. ఏదేని వరము గోరుకొనుడు. అను దేవి మాటలు విని వారు హరిహరులకు మేలు గల్గవలయునని కోరిరి. హరిహరులు మరల తమ తమ శక్తులను గలియవలయునని వారు గోరిరి. 

అపుడు దక్షుడు ప్రత్యేకముగ నిట్లనెను: నా వంశమున నీవు జన్మింపుము తల్లీ. అంబ! నీవు నా యింట జన్మించుము. నేను కృతకృత్యుడను గాగలను. నిన్ను గూర్చి జపము-ధ్యానము పూజలు నీ వివిధ నివాసస్థానములు తెల్పుము. ఓ పమమేశానీ! వీని నన్నిటిని నీ ముఖము నుండి వెల్లడించుము. 

దేవి యిట్లనెను: నా శక్తుల నవమానించుటవలననే హరిహరుల కా దురవస్థ వాటిల్లెను. అట్టి యపరాథ మిక ముందెన్నడు నెవ్వరును చేయరాదు. ఇపుడు నా దయాలేశమున వారి శరీరము కారోగ్యము చేకూరగలదు.

ఆ యిర్వురు శక్తలలో నొకతె నీ యింట మఱియెకతె క్షీరసాగరమున జన్మింపగలరు. హరిహరులు నాప్రేరణ వలన తిరిగి వారిని బడయగలరు. నా ముఖ్యమంత్రము శ్రీమాయాబీజము. అది నాకత్యంతము ప్రియకరమైనది. 

కనుక నా విరాట్స్వరూపమునగాని యీ త్రిభువనేశ్వరీ స్వరూపముగాని ధ్యానించవలయును. లేక సకల జగముల నిండిన నా సచ్చిదానంద స్వరూపమునైన ధ్యానింపవలయును. మీరు సతతము నన్ను పూజించి ధ్యానింపుడు. ఈ ప్రకారముగ పలికి మణిద్వీపాధివాసినియగు దేవి యంతర్దాన మొందెను పిమ్మట దక్షాదిమునులు మరల బ్రహ్మను చేరిరి. వారు జరిగిన వృత్తాంతమంతయును బ్రహ్మకు నివేదించిరి. 

హరిహరు లంతట స్వస్థులై తమ తమ కార్యములు తామే నిర్వహింప గలిగిరి. ఆనాటినుండి హరిహరులు పరాంబ దయవలన గర్వము మాని శాంతితో నుండిరి. ఒకానొక సమయన పరాశక్తి యవతరించెను. మహారాజా! దేవి దక్షునింట నవతరించెను. అపుడు ముల్లోకము లుత్సవములు జరుపుకొనెను. 

అమరులు ప్రమోదభరితులై పూలసోనలు కురిసిరి. రాజా! స్వర్గధామమున సురలు తమ చేతులందలి కోణములను సాధనములచేత దేవదుందుభులు మ్రోగించిరి. సాధుసజ్జనులు మనస్సులు నిర్మల ప్రసన్నములయ్యెను. నదు లువ్వెత్తుగ ప్రవహించెను. సూర్యుడు మేలు వెల్గులు విరజిమ్మెను. సర్వమంగళ యవతరింపగ నెల్లెడల మంగళ సర్వస్వ మొప్పారెను. 

ఆ పుట్టినట్టి బాల సత్యస్వరూపిణియే యగుటవలన సత్యజ్ఞానులామెను సతి యనిరి.ఆదక్షుని కూతురు మరల శివునకే యీయబడెను. ఆ దాక్షాయణి దక్షునపరాధమునకు దైవయోగమున నగ్నిలో దుమికెను. 

జనమేజయు డిట్లనెను: ఓ మునివరా! ఎంతటి యనర్థ కరమైనమాట వినిపించితివే! ఏ త్రిభువనేశ్వరి నామము స్మరించినంత మాత్ర నెల్లవారి సంసారాగ్ని భయము తొలగిపోవునో యట్టి మహాదేవి యేల నగ్నిలో దగ్దమయ్యెను. దక్షు డేమి యపరాధము చేసెనని యామె యగ్ని కాహుతి యయ్యెను? 

వ్యాసు డిట్లనెను: రాజా! సతీదేవి దగ్దయగుటకుగల కారణము వెల్లడింతు నవధరింపుము.

దక్షుడు చేసిన అపరాధం

DurgaMasuranashini - దుర్గమాసురనాశిని

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దుర్గమాసురనాశిని

పిమ్మట దుర్గమాసురుడు గొప్ప యల్లకల్లోలము జరుగుచున్నదని తన దూతవలన విని ససైన్య ముగ సాయుధుడై బయలుదేరెను. అతడు వేయి యక్షౌహిణుల సేనలతో వచ్చి వేగమున శరములు వదలుచు దేవి చెంత నున్న దేవసైన్యము నెదుర్కొనెను. మఱియు నతడు బ్రాహ్మణుల గుంపుల నడ్డగించెను. 

అపుడు దేవగణములు గగ్గోలు పడెను. విప్రులుమను దేవతలను త్రాహి త్రాహీ యను కేకలు వేసిరి. శివాదేవి వారి మొఱ యాలించి దేవతల చుట్టు తేజోమయ చక్రము నిర్మించెను. అది వారికి శ్రీరామరక్షగ నుండెను. దేవి బయట నిర్బయముగ నిలుచుండెను. ఆపుడు దేవీ దైత్యుల మధ్య నిర్వురకు ఘోర సమరము సంఘటిల్లెను. 

వారి బాణవర్షమువలన సూర్యమండలము కనిపించకుండెను. బాణముల యొండొంటి తాకుడువలన నిప్పురవ్వలు దుముకుచుండెను. వారి గట్టి యల్లెత్రాటి టంకారముతో దిక్కులకు చెవుడు వచ్చెను. అట్టి యుద్ధ సమయమునందు దేవి శరీరమునుండి పలుతీవ్రశక్తు లుద్బవించిరి. వారు కాళిక-తారిణి-బాల-త్రిపుర-భైరవి-రమ-బగళ-మాతంగి-త్రిపురసుందరి-కామాక్షి-తులజాదేవి-జంభిని-మోహిని-ఛిన్నమస్త-గుహ్యాకాళి-దశసహస్ర బాహుక-యనబరగువారు.

వీరుకాక మఱి ముప్పదిరెండు మంది-తర్వాత నరువదినల్గురు-నటుతర్వాత లెక్క పెట్టరానంత మంది- దేవి దివ్యావ యవములనుండి సాయుధలై యుద్బవించిరి. ఆ శక్తులందరవలన దైత్యుని నూఱక్షౌహిణుల సేన తుదముట్టెను. రణరంగమున మృదంగ-శంఖ-వీణాధ్వనులు మిన్ను ముట్టెను. 

అపుడు సేనాపతియగు దుర్గమాసురుడు మొట్టమొదట ముందునకు దుమికి భిన్నశక్తులతో పోర తలపడెను. అట్లు పది దినములు జరిగిన భీకర యుద్ధములో కొన్ని యక్షౌహిణుల సైన్యము హత మయ్యెను. నెత్తురు టేర్లు ప్రవహించెను. అతడు పడునొకండవనాడు రక్తమాల్యంబరంబులు దాల్చి రక్తగంధము పూసికొనెను. అతడు పెద్ద పండుగ జరుపుకొని మహా సంరంభముతో రథమెక్కివచ్చి యెల్లశక్తుల నోడించెను. 

అతడు పిదప తన రథమును శ్రీపరాశక్తి రథము నెట్ట యెదుటికి పోనిచ్చెను. అపుడు దేవి దైత్యుల మధ్య ద్వంద్వయుద్ధము జరిగెను. వారి మధ్య చూపఱు గుండె లవియునట్టుల పోరు ఘోరముగ రెండుజాములు జరిగెను. పిమ్మట దేవి పదునైదు తీవ్రబాణములు వదలెను. వానిలో నాల్గింటివలన నాల్గు గుఱ్ఱములు-నొక్క బాణమున సారథిని-రెంట వాని కండ్లను-రెంట భుజములు-నొక్కట టెక్కమును-ఐదింట వాని యెడదను-వ్రయ్యవ్రయ్యలుచేసి వేసెను. 

వాడు నోట నెత్తురు గ్రక్కుచు శ్రీదేవి సన్నిధిలో నసు వాలు పాసెను. వానినుండి యొక దివ్యతేజము వెలువడి దేవిలో ప్రవేశించెను. బలశాలియగు దైత్యుడు చావగనే యెల్లలోక ములు సంతసిల్లెను. ఆ సమయంబున బ్రహ్మాదులు హరిహరాదులను ముందుంచుకొని పరాభక్తితో మధురవాక్కులతో జగ దంబిక నీ విధముగ నన్నుతించిరి. 

ఓ పరమేశ్వరీ! శాకంభరీ! శతాక్షీ! శివా ! బ్రహ్మాండగోళము లెల్ల భ్రమించి పరిభ్రమిం చుట నీవే మూలకారణము. సకలోపనిషత్తులచేత సుతింపబడు జ్ఞానస్రనూనాంబవు నీవే. ఓ దుర్గమాసుర విభంజనీ! జయ మంగళ స్వరూపిణీ! పంచకోశాంతర సంస్థితా! మాయేశ్వరీ ! నీ కివే మా వందనశతంబులు.

ఏ త్రిభువనేశ్వరి నెల్లమునులు నిర్మల-నిశ్చలచిత్తములతో నను ధ్యానింతురో యట్టి ప్రణవస్వరూపిణీ! జననీ! నీ కివే మా వందనశతంబులు. అనంతకోటి బ్రహ్మాండ జనయిత్రీ! బ్రహ్మవిష్ణ్వాదుల జననీ! దివ్యమంగళమూర్తియగు జగద్ధాత్రీ! నీ కివే మా వందనశతంబులు. నీవు దయామతల్లివి-పరమేశ్వరివి-విశ్వైకమాతవు-శతాక్షీ మాతవు. 

కాబట్టి పామరులమైన మమ్ముజూచి యేడ్చితివి. నీవు తక్క సర్వేశ్వరుడు నట్లు చేయడు. అని బ్రహ్మవిష్ణువు మొదలుగాగల దేవతలు దేవిని నుతించి వివిధ ద్రవ్యములతో సంపూజించిరి. దేవి యదే క్షణమున సంతుష్టురాయ్యెను. పికభాషిణియగు దేవి ప్రసన్నయై వేదములు దెచ్చి విప్రుల కొసంగి 

యిట్లు పలికెను: ఇవి నా యుత్తము శరీరమువంటివి. వీనిని చక్కగ భద్రముగ రక్షింపుకొనుడు. ఇవి లేనందున గల్గిన యనర్థము. మీ రిపుడే సనిదర్శనముగ జూచితిరి గదా. నన్ను నిరంతరముగ పూజింపుడు. సంసేవింపుడు. మీ మేలు వెల్గుగోరి నేనిదంతయును చెప్పుచున్నాను. నా యీ యుత్తమ దివ్యమహాత్మ్యమును మీరలు సతతము పఠించుడు. దానివలన నేను సంతుష్టిజెంది మీ కోరిక లెల్ల దీర్చగలను. 

దుర్గమాసురుని దెగటార్చుటవలన గల్గిన దుర్గానామమును శతాక్షీనామము నుచ్చరించినవాడు మాయను దాటి పరమపదము జేరగలడు. వేయేల? ఒక ముఖ్య విషయ మేమన సురాసురు లెల్లరును నన్నే సదాగతిగ సతము సేవింపవలయును. అని సచ్చిదానంద స్వరూపిణి యెల్లవారికి సంతోషము గల్గించుచు నచటనే యెల్ల దేవతలు చూచుచుండగ నదృశ్య యయ్యెను. 

ఈ విధముగ పరమకల్యాణకారకమగు శ్రీదేవి మహాత్మ్యము గూర్చిన రహస్యకథ నీకు వివరించితిని. దీనిని యత్నించి రహస్యముగ నుంచుము. ఎవ్వాడీ శ్రీదేవీ పరమాధ్యాయము విశ్వాత్మభావముతో భక్తిద్ధ్రలతో నాలించునో వాడిచట కోర్కె లెల్ల బడసి పిదప తప్పక శ్రీదేవీలోకము జేరలగలడు.

వ్యాసు డిట్లనియెను : ఈ ప్రకారముగ సూర్యచంద్రవంశము లందలి పేరుగాంచిన రాజులు యుత్తమ చరితములు నాచే కొంత వర్ణింపబడదగినవి గలవు. 

ఓ రాజా! వీరెల్లరును శ్రీపరాశక్తి ప్రసాదము వలననే యింతగ మహనీయత్వముబడసిరని తెలిసికొనుము. ఎచ్చటెచ్చట మహదైశ్వర్యములు-ఓజోగుణము-విభూతిమత్త్వవము నుండునో యచ్చటచ్చట నదంతయును శ్రీపరాశక్త్యంశమువలననే కల్గినదని నిక్క మెఱుంగుము. వీరును మఱి తక్కిన రాజులును శ్రీయాదిపరాశక్తి నుపాసించిన వారనియు సంసార వృక్షమూలమును ఛేదించు గొడ్డలివంటి వారనియు తెలియుము. 

కనుక ధాన్యార్థియైన ప్రతివాడు వడ్లపొట్టునువలె సంసార విషయములను వదలి శ్రీత్రిభువనేశ్వరి నెల్లవిధముల సంసేవింపవలయును. ఓ రాజా! ఈ సకల వేదములనెడు పాలసంద్రలను మథించి మథించి తుదకు శ్రీజగదంబికా పాదకమలములనెడు జాతిరత్నములు పడసి ధన్యభాగ్యుడ నైతిని. పంచబ్రహ్మాసనారూఢ-శ్రీపరాశక్తి యొక్కతెయే - మఱవ్వరునుగారు. 

కనుక నామెకు బ్రహ్మ-విష్ణు-రుద్ర-శివ-ఈశ్వర-సదాశివులు వరుసగ భూమి-జలము-అగ్ని-వాయువు-ఆకాశము అను భూతముల కధిపతులు. ఈ పంచ తత్త్వములకంటె ఇతరమగునది వేదములందవ్యక్తమని చెప్పబడును. ఆమె మణులందు దారమువలె నంతట వ్యాపించియుండుటచే త్రిభువనేశ్వరి యయ్యెను. 

రాజా! శ్రీమాతృదేవత నెఱుగక జీవుడు జన్మకోటులకైన మోక్షసుఖ మందజాలడు. నీలాల నింగిని తోలుతో గప్పలేము గదా! అటులే శ్రీమంగళ##దేవత నెఱుగక మానవులు సుఖములు పడయరు. కనుకనే శ్వేతాశ్వతర శాఖీయులు త్రిగుణములచేత నిగూఢయగు సర్వదేవతాత్మకశక్తిని నెఱుంగగలుగుదురని శ్రుతులయందు ప్రవచించున్నారు. 

కనుక మానవుడు తన జన్మము తరించుట కెల్ల ప్రయత్నములతో సిగ్గుచేగాని భీతిచేగాని భక్తిచేగాని ప్రేమచేగాని సర్వసంగములు వదలి మనస్సును హృదయమున నిలుపవలయును. శ్రీదేవీ నిష్ఠుడు శ్రీమాతృపూజా తత్పరుడై యుండవలయునని వేదాంతభేరి మ్రోగుచున్నది. ప్రతివాడు నెట్టి నెపముతోనైనను నిదురించుచు నడచుచు నిలుచుండుచు శ్రీదేవిని దలచవల యును. 

శ్రీదేవిని నిరంతరము కీర్తించవలయును. బంధములను బాయవలయును. కనుక రాజా! సర్వప్రయత్నముతో శ్రీమహేశ్వరినే భజింపవలయును. మొదట శ్రీదేవతయొక్క విరాడ్రూపమును తర్వాత సూక్ష్మరూపము నటుతర్వాత సర్వాంతర్యామి స్వరూపమును మెల్లమెల్లగ మెట్టు లెక్కునట్టుల గనవలయును. అపుడు చిత్తము నిశ్చలము నిర్మలము నగును.

అపుడీ ప్రపంచ విషయ వానస లుజ్జగించి శ్రీపరాశక్తి-పరబ్రహ్మ స్వరూపిణి-యగు సచ్చిదానంద స్వరూపిణి నారాధింపుము. రాజా! ఆ తల్లియందు చిత్తము లయ మొనర్చుటే భక్తి-యారాధన-యగును. అట్టివారే పరాశక్తి భక్తులు. వారే ధార్మికులు. సూర్యచంద్రవంశజులు-మహామనస్వులు రాజులునైన వారి మహత్త్వ పూర్ణచరిత్రము నిటుల వర్ణించితిని. ఇది పావనము-కీర్తిమంతయు-ధర్మబుద్ధిని-సద్గతిని-నొసంగునది. పుణ్యప్రదము. 
రాజా! దీనితర్వాత నీ కింకేమి విన కుతూహల మగుచున్నదో తెల్పుము. 

హరిహరులకు గర్వభంగం

Mahadevi - Shatakshi Shakambari - మహాదేవి - శతాక్షి శాకంభరి

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మహాదేవి - శతాక్షి శాకంభరి

జనమేజయు డిట్లనెను : రాజర్షి-ధార్మికుడు-శతాక్షి పాదభక్తుడునైన హరిశ్చంద్రుని చరిత్రము మహాద్బుతము-విచిత్రము. ఓ మునివరా! ఆ శివాభగవతీ పరాదేవీ యెట్లు శతాక్షి యయ్యెనో వెల్లడించుము. నా జన్మము పార్ధకమొనరిపించుము. శ్రీరాజరాజేశ్వరి యెక్క దివ్యగుణములు వినుట కాసపడిన నిర్మలచిత్తున కెట్లు తనివి తీరను? శ్రీదేవీనిగూర్చిన ప్రతి పదము నశ్వమేధముచే కలుగు శాశ్వతఫల మొసంగును. 

వ్యాసు డిట్లనెను: రాజా! ఆవధరింపుము. శ్రీశతాక్షీదేవి దివ్య సంభవము తేటపఱతును. నూవు శ్రీదేవి భక్తుడవు. నీకు చెప్పరానిది లేదు. మున్ను హిరణ్యాక్షుని వంశమున రురుకుమారుడు గలడు. ఆతడు దుష్టదైత్యుడు-పరమదారుణుడు-మూర్ఖుడు-అతని పేరు దుర్గముడు. దేవతలకు వేదములు జీవగఱ్ఱలు. వేదములు నష్టమైనచో వారును నశింతురు. 

కనుక వేదములను నశింపచేయవలయను. అనితలపోసి యతడు హిమాలయమున కేగి వాయుభక్షుడై బ్రహ్మను గూర్చి ధ్యానించుచు ఉగ్రతప మొనరించెను. అట్లతడు వేయేండ్లు తీవ్రతప మొనరింపగ నతని తపము వేడిమి కెల్ల లోకములును సురాసురులును కడు సంతాపము జెందిరి. 

అంచ నలుమోముల బ్రహ్మ నవ్వు లొలుకు మోముతమ్ములతో రాయంచ నెక్కి యతనికి వరము లీయవత్తెను. సమాధిలో మునిగి కనులు ముసికొనిన దుర్గమునితో బ్రహ్మ యిట్లనెను. నీ మదిలోని కోర్కి కోరుకొనుము. నీకు మేలగుత. నీ తపమునకు మెచ్చితిని. వరము లీయ వచ్చితిని. అని బ్రహ్మ పలుకగవిని దుర్గముడు సమాధి చాలించి లేచెను. 

అతడు బ్రహ్మాను పూజించి యిట్లనెను: ఓ సర్వేశ్వరా! నాకు వేదము లిమ్ము. ఈ ముల్లోకములందు విప్రులచెంత సురలదగ్గఱ నెన్నియో వేదమంత్రములు గలవు. అవన్నియును నా సన్నిధి నుండవలయును. మఱియు నెల్లదేవత లోడిపోవునట్టి బలము నాకిమ్ము. అను దైత్యుని మాటలువిని యట్లేయని మాట యిచ్చి నాలుగు వేదములు తెలిసిన బ్రహ్మ సత్యలోకమునకేగెను.

అనాటినుండి విప్రులు వేదములు మఱచిరి. అందుతే స్నానసంద్యాదులు నిత్సహోమములు శ్రాద్ధజపములు లోపించెను. భూమిపై పెద్ద యల్లకల్లోలము బయలుదేరును. ఏమి ఈ వింత! యని విప్రులు తమలోతా మనుకొనిరి. వేదములులేక మేమేమి చేయగలమని వారనిరి. 

అపుడు భూమిపై నున్న వారికి భరింపరాని యనర్థము చుట్టకొనెను. హవిర్బాగములు లభించనందువలన నిర్జరులు ముసలివారలైరి. అపుడు దుర్గము డమరావతిపై దండెత్తెను. వజ్రకాయుడగు దైత్యునితో బోరాడజాలక దేవతలు పలాయనము చిత్తగించిరి. 

దేవతలు గిరి దుర్గములందలి రత్న సానువులందును గుహలందును దాగి యుండి పరాంబికాశక్తిని మనసార ధ్యానించుచుండిరి. అగ్నిలో హోమములు లేనందున వానలు కురియుటలేదు. వర్షములు లేనందున నేల యెండి బీటలు పాఱను. ఎల్లబావులు-దిగుడు బావులు-చెఱవులు-నదులు-నింకిపోయెను. ఈ యనావృష్టి నూరేండ్లవఱ కుండెను. అపుడు లెక్కకు మిక్కిలిగ జనులు-ఆవులు-పశువులు-చనిపోయెను. 

ప్రతి యిల్లు పీనుగుల పెంటతో నిండెను. ఇన్ని యనర్థములు వాటిల్లగశాంతచిత్తులగు బ్రాహ్మణులు హిమగిరికేగి శ్రీశివాపరాంబిక నారాధింపదలంచిరి. వారాకలిదప్పులు మాని శ్రీమాతృదేవికి శరణాగతులై సమాధి-ధ్యాన-పూజలతో దేవిని సంతుష్టి పఱచిరి. 

ఓ మహేశ్వరీ! యంబికా! మేము పామరులము. సర్వాపరాధులము. మమ్ము కనికరించు మమ్మా. మమ్మింతగ కోపించుట తగదమ్మా. ఓ దేవేశ్వరీ! సర్వాంతర్యామినీ! తల్లీ! కోపించకుము. నీ వెట్లు ప్రేరించిన నట్లే జరుగును గదా. ఇపుడు మాకు నీవు తక్క వేరే దిక్కులేదు. మహేశ్వరీ! నీ వెట్లు తలంతువో యట్లు చేయుటకు శక్తురాలవు.

అమ్మా! మహేశానీ! ఈ ఘోర సంకటమునుండి మమ్ము కడతేర్చుమమ్మా! జీవనమైన నీరే లేనిచో మే మెట్లు జీవింపగలము. సర్వేశ్వరీ! ఓ జగదంబికా! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికా! నీకు నమస్కారమమ్మా! మాయోడల సుప్రసన్నురాలవు గమ్ము. 

నీవు కూటస్వరూపిణివి. వేదాంతవేద్యవు-చిద్రూపిణివి-త్రిభువనేశ్వరివి. నీకు వందనములు తల్లీ! ఎల్ల వేదములు సర్వమును త్రోసిపుచ్చి ఏ యేకైక పరాదేవతనే భావించునో యట్టి సర్వకారణకు నుతులు. 

అట్లు బ్రాహ్మణులు సన్నుతింపగ త్రిభువనేశ్వరి-మహేశ్వరి-యగు పార్వతి యనంతనేత్రములతో వారికి ప్రత్యక్షమయ్యెను. ఆమె నల్లని కాటుక కొండవలె నుండెను. ఆమె కన్నులు నల్లకమలమువలె నెసగెను. ఆమె స్తనము లెత్తుగ బిగి వట్రునలుగ నలరెను. అమె తన చేతులందు కమలము-బాణము-కారగాయలు-సరసములైన తీయనిపండ్లు-పూలు-చిగులుటాకులు- దాల్చెను. ఆమె చేత నున్న వన్నియు నాకలిదప్పులు పోగొట్టునవి. 

ఆమెచేత చాపమును గలదు. ఆమె యందాల కందాలరాశి. లావణ్యసీమ. ఆమె సూర్యకోటిసమాన-దయారస తరంగిణి-జగద్ధాత్రి-అనంత నయనములతో నుద్బవించినది. ఇట్లు దేవి ప్రత్యక్షమయ్యెను. ఆ తల్లి తన యన్ని వేల కన్నులనుండి లోకములందు వర్షధారలు కురుసెను. 

దేవి కంటి నీటిధారలు నవరాత్రములు కుంభవృష్టిగ గురిసెను. ఆ తల్లి దుఃఖార్తులను గాంచి కన్నీరు వదలి లోకముల నన్నిటిని సంతృప్తి పఱచెను. మఱల నేలపై నోషధు లుద్బవించెను. 

రాజా! ఆ జలములచే నదీనదములు దరులుతన్ని ప్రవహింపసాగెను. మున్ను దిగియున్న దేవతలు బయటి కేతెంతిరి. అపుడు బ్రహ్మణులు దేవత లెల్లరును గలిసి శ్రీదేవి నిటుల నభినుతించిరి. 

ఓ వేదాంతవేద్యా! బహ్మస్వరూపిణీ! నీకు నమస్కారము. తన మాయచే లోకములు సృజించు తల్లికి నమస్కారము. భక్తుల పాలిటి కల్పతరువా! దేవీ! నీవు భక్త సంరక్షణకు దేహము దాల్చితివి.

నిత్యతృపా: భువనేశ్వరి! సాటిలేనిదానా! నీకు నమస్కారము. నీవు మా యెల్లర సుఖశాంతులకొఱకు వేయి కన్నులతో వెల్గుచున్నావు. పెక్కు కన్నులుంట నీవు శతాక్షియను పేర ప్రసిద్ధి గాంచుము తల్లీ! అమ్మా! ఆకలిదప్పులచే పీడితులమైన మాకు నిన్ను నుతింప శక్తి చాలకున్నది. 
అంబికా! మహేశానీ! దయయుంచి వేదములు మాకిమ్ము. 

అను వారి మాటలు శివాభగవతి వినెను. ఆమె చేతులలోని కూరగాయులు తీయని ఫలమూలములు వారికి తినుట కొసంగెను. ఆ తల్లి వారికి వివిధ భక్ష్యభోజ్యములు నొసంగెను. పశువుల మేత మొసంగెను. 

రాజా! ఆమె నవసరము లొలుకుకోర్కులు తీర్చునట్టివి-మరల కొత్త పంటలు పండువరకు సరిపోవునవి- అగు శాకము లొసంగుటవలన నానాటినుండి శాకం భరినామ మున పెరెన్నిక గనెను. 

దుర్గమాసురనాశిని

Mantra Dharana - మంత్ర ధారణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మంత్ర ధారణ ఓ వత్సా !నీ కిట్లు త్తమమైన యోగధారణ విధానము వివరించితిని. ఇపుటు చిత్తధారణ గూర్చి తెల్పుదును. సావధ...