దేవతలు దానవులు రాక్షసులు గంధర్వులు కిన్నరులు మానవులు - వీరు మాత్రమే కర్మజనకులూ కర్మఫలభోక్తలూ. మిగతా ప్రాణికోటికి ఇదిలేదు. అయితే విశిష్టజీవులు కొందరు విభిన్న జీవరాశులలో (పశుపక్ష్యాదిజాతులలో)గర్భవాసాన జన్మించి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. ఫలానుభవం ద్వారానే కర్మలు అంతరిస్తాయి. మరొక మార్గం లేదు. కనక పూర్వార్జిత శుభాశుభకర్మలను అనుభవిస్తూ విభిన్నలోకాలలో విభిన్నరూపాలలో వరిభ్రమించడమే జీవుడు చేసేపని. శుభకర్మలు చేసినవారు స్వర్గాదిలోకాలలోనూ అశుభకర్మలు చేసినవారు నరకాదిలోకాలలోనూ పరిభ్రమిస్తారు.
(సాయుజ్య - సారూప్యప్రదంగా)ద్వివిధమైన భక్తి ఒక్కటే కర్మనిర్మూలకం. దుష్కర్మాచరణంవల్ల రోగిష్ఠులవుతారు. సత్కర్మాచరణంవల్ల ఆరోగ్యవంతులవుతారు. దీర్ఘాయుష్కుడు అల్పాయుష్కుడు సుఖి దుఃఖి అంగవిహీనుడు ఇత్యాదులందరూ సదసత్కర్మఫలస్వరూపులే. ఉత్కృష్టమైన కర్మలు చేస్తే ఉత్కృష్టమైన సిద్ధులు కలుగుతాయి. సాధ్వీ! సామాన్యసూత్రంగా ఈ మాటలు చెప్పాను. అత్యంత గోప్యమైన శ్రుతి స్మృతి పురాణ రహస్యం చెబుతున్నాను శ్రద్ధగా చెవి పెట్టు.
భారతదేశంలో ఏరూపంలోనైనా జన్మ పొందడమే దుర్లభం. అందునా మానవజన్మ మరీ దుర్లభం. మానవులలోకెల్ల బ్రాహ్మణుడు ఉత్తముడు. ఆతడు బ్రహ్మనిష్ఠుడైతే బ్రాహ్మణోత్తముడు మరీ గరిష్ఠుడు. నిష్కాముడు సకాముడు అని బ్రాహ్మణుడు రెండు విధాలు. సకాముడికన్నా నిష్కాముడు గొప్పవాడు. ఇతడు ముక్తుడు. అతడు భక్తుడు. సకాముడు కర్మభోగి. నిష్కాముడు నిరుపద్రవుడు. ఈ నిష్కాముడు తనువు చాలించాక పునరాగమనరహితమూ నిరామయమూ అయిన స్థానాన్ని పొందుతాడు. గోలోకంలో గోపరూపధారియై ద్విభుజ శ్రీకృష్ణపరమాత్మను సేవించుకుంటూ ఉంటాడు.
సకాములైన వైష్ణవభక్తులు చతుర్భుజనారాయణుడుండే వైకుంఠానికి వెళ్ళి సత్కర్మఫలానుభవం పూర్తికావడంతోనే మళ్ళీ భారతభూమిలో బ్రాహ్మణులుగా జన్మిస్తుంటారు. కాలక్రమంలో వీరూ నిష్కామభక్తులవుతారు. నిర్మలమూ నిశ్చలమూ అయిన భక్తి కుదురుకోకపోతే ఎన్ని జన్మలకైనా వీరు సకామవైష్ణవులుగానే ఉండిపోతారు.
తీర్థక్షేత్రాలలో తపోనిరతులైన ద్విజులు జన్మాంతంలో బ్రహ్మలోకానికి వెడతారు. ఇతర ప్రదేశాలలో నివసిస్తూ స్వధర్మనిరతులై జీవనం సాగించే భక్తులు సత్యలోకానికి వెడతారు. సూర్యభక్తులు సూర్యలోకానికి వెడతారు. వీరంతా భోగానుభవం ముగియగానే భారతభూమిలో విప్రులుగా పునర్జన్మ ఎత్తుతారు.
నిష్కాములై ధర్మచారులై మూల ప్రకృతిని (మహాశక్తి) ఉపాసించే భక్తులు పునరావృత్తి రహితమైన మణిద్వీపం చేరుకుంటారు. శైవ - శాక్త - గాణపులు (గణపతి ఆరాధకులు) శివలోకం చేరుకుని మళ్ళీ భారతభూమిలో బ్రాహ్మణులై జన్మిస్తుంటారు. స్వధర్మనిరతులై ఎదో ఒక దేవతను ఆరాధించే విప్రులు స్వర్గలోకానికి వెళ్ళి పుణ్యఫలానుభవం పూర్తికాగానే భారతభూమిలో విప్రులై జన్మిస్తారు. ఇలాగే హరిభక్తులు తమ భక్తిబలంతో హరిలోకం చేరుకుంటారు.
ఏ భక్తీలేక ఏ ధర్మమూ లేక భ్రష్టాచారులూ కాముకులూ అయిన విప్రులు నరకానికి పోతారు. ఏ వర్ణంలో పుట్టినా స్వధర్మనిరతుడూ భక్తుడూ అయితే చాలు శుభకర్మ ఫలభోగాలను ఆయా లోకాలలో అనుభవిస్తాడు. కేవల కర్మఫలభోగులు భారతదేశంలో జన్మించరు.
స్వధర్మనిరతుడైన విప్రుడు స్వధర్మనిరతుడైన విప్రునికి కన్యాదానం చేస్తే చంద్రలోకం చేరుకుంటాడు. పధ్నాల్గురు ఇంద్రులు గడిచేదాకా అక్కడ ఉంటాడు. సాలంకృతకన్యాదానం చేస్తే ఫలితం ద్విగుణంగా(రెట్టింపు) ఉంటుంది. సకాములే చంద్రలోకానికి వెళ్ళేది. నిష్కాములు వెళ్ళరు. వారు ఫలసంఘాతవర్జితులై విష్ణులోకానికి వెడతారు. పాలు పెరుగు వెన్న వెండి బంగారం నెయ్యి వస్త్రం పండు నీరు - విటిని విప్రులకు దానం చేసినవారు చంద్రలోకం చేరుకొంటారు. మన్వంతరకాలం అక్కడ నివసిస్తారు సద్బ్రాహ్మణుడికి గోవులనుగానీ రాగిపాత్రలనుగానీ బంగారు ఆభరణాలనుగానీ దానం చేసినవారు సూర్యలోకం చేరుకుని అయుతవత్సరాలు పుణ్యఫలాలు అనుభవిస్తారు. భూలోకంలో బతికున్నంతకాలం నూరేళ్ళూ ఆరోగ్యవంతులై సుఖిస్తారు. భూమినిగానీ ధనంగానీ దానంచేస్తే వైకుంఠంలో శాశ్వతంగా శ్వేతద్వీపనివాసం లభిస్తుంది. భూలోకంలో దీర్ఘాయుష్షూ భోగభాగ్యాలూ లభిస్తాయి. ఏ దేవతకైనా గృహం దానంచేస్తే అతడు ఆ దేవలోకంలో రేణువుకి ఒక్క సంవత్సరంగా నివసిస్తాడు. సౌధం కట్టించి ఇస్తే ఫలం నాలుగురెట్లు. దేశం దానం చేస్తే ఫలం పదిరెట్లు అధికంగా లభిస్తుంది. ఆ ఇచ్చినది ప్రకృష్టమైతే అంతకు రెండింతలు పుణ్యఫలం దక్కుతుంది. తటాకం తవ్వించినవాడు సర్వపాప విముక్తుడై వరుణలోకంలో రేణువుకి ఒక్కసంవత్సరంగా నివసిస్తాడు. వాపి అయితే పదిరెట్లు అధికఫలం. నాలుగువేల ధనుస్సుల పొడుగూ అంతకన్నా కొంచెం తక్కువ వెడల్పూ ఉంటే దాన్ని వాపి అంటారు. వాపి తవ్వించినవారికి తటాకదానఫలమూ లభిస్తుంది. పాత్రుడికి కన్యాదానం చేస్తే దశవాపీ సమానంగా పుణ్యం దక్కుతుంది. అదే సాలంకృతంగా అయితే రెట్టింపు ఫలం.
వాపీతటాకాలను తవ్విస్తే ఏ ఫలమో పూడుకుపోయిన వాటిని ఉద్దరించినా అదేఫలం. రావిచెట్టును నాటి ప్రతిష్ఠచేస్తే అయుతవర్షాలు తపోలోకనివాసం కలుగుతుంది. నానావిధప్రాణికోటికి జీవనాధారంగా పుష్పోద్యానవనం ఏర్పరిస్తే అతడు ధ్రువలోకంలో అయుతసంవత్సరాలు నివసిస్తాడు. విష్ణుమూర్తికి విమానదానం చేస్తే విష్ణులోకనివాసం మన్వంతరాల తరబడి దక్కుతుంది. అది చిత్రసహితమైతే ఫలం చతుర్గుణంగా లభిస్తుంది. పల్లకీ ఉయ్యాలమంచం సమర్పించినవారు విష్ణులోకంలో శతమన్వంతరాలు నివసిస్తారు. సౌధాలు తీర్చిదిద్దించి రాజమార్గం నిర్మించినవారికి అయుత సంవత్సరాలు ఇంద్రలోక నివాసం ఫలం. ఎదైనాకానీ బ్రాహ్మణులకిచ్చినా దేవతలకిచ్చినా పుణ్యఫలం సమానం.
సావిత్రీ! ఎవరికైనా దానం చేసిందే కడపటికి మానవులకు మిగిలేది. దానం చెయ్యనిది నశించిపోయినట్టే. దానఫలాలుగా స్వర్గాది సాఖ్యాలను అనుభవించి తిరిగి భారతభూమిలో క్రమక్రమంగా ఉత్తమవంశాలలో జన్మిస్తాడు. కాబట్టి దానధర్మాది శుభకర్మలను నిష్కామంగా ఆచరించి సద్గతులు పొందాలి.
శతకోటి కల్పాలు గడిచినా అనుభవించనిదే కర్మ క్షయించదు. చేసిన శుభాశుభకర్మలు ఫలరూపంలో అవశ్యభోక్తవ్యాలు. కాకపోతే దేవతాపూజలతో తీర్థక్షేత్ర సందర్శనలతో కాయవ్యూహంతో (యోగమార్గం) కర్మలను శుద్ధిచేసుకోవచ్చు.
సాధ్వీమణీ! నువ్వు అడిగినదంతా వివరించి చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు యమధర్మరాజు.
No comments:
Post a Comment