Thursday, May 7, 2026

Shiva - Shankhachuda conversation - శివ - శంఖచూడ సంవాదం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - శివ - శంఖచూడ సంవాదం

బ్రాహ్మీముహూర్తంలో శంఖచూడుడు తల్పంమీద లేచి కూర్చున్నాడు. శ్రీ కృష్ణపరమాత్మను మనస్సులో ధ్యానించాడు. శయ్యదిగాడు. రాత్రి కట్టుకున్న వస్త్రాలను విడిచి పెట్టాడు. శుద్దోకాలతో స్నానం చేశాడు. దౌతవస్త్రాలు ధరించాడు. తిలకం దిద్దుకున్నాడు. ప్రాతఃకాలపూజలు అన్నీ నిర్వహించాడు. పెరుగు నెయ్యి తేనె పేలాలు వంటి మంగళవస్తువుల్ని దర్శించాడు. మణులూ రత్నాలూ వస్త్రాలూ బంగారమూ రోజూలాగానే భక్తిగా బ్రాహ్మణులకు దానం చేశాడు. రాజగురువును దర్శించి అమూల్యరత్నహారం సమర్పించి యుద్ధయాత్రకు మంగళాశీస్పులు పొందాడు. గజాశ్వధనరత్నరాశుల్ని బీదబ్రాహ్మణులకు కానుకలుగా పంచిపెట్టాడు. వెయ్యి భాండారాలూ లక్ష నగరాలూ శతకోటి గ్రామాలూ పండితులకు సర్వాధికారాలతో సమర్పించాడు. దానవరాజ్యానికి తన పుత్రుణ్ణి రాజును చేశాడు. తల్లినీ రాజ్యాన్నీ భాండాగారాలనూ వస్తువాహనాదులనూ తన అనుచరులనూ రక్షించే బాధ్యత అప్పగించాడు. తూణీరాలు కట్టుకుని కవచం ధరించి ధనుష్పాణియై యుద్దానికి సన్నద్ధుడయ్యాడు. లక్ష గజ సైన్యం, మూడు లక్షల అశ్వ సైన్యం, అయుతరథ సైన్యం సిద్ధమయ్యింది. మూడుకోట్ల ధానుష్కులు బారులుతీరి నిలబడ్డారు. వర్మధారులు మరో మూడుకోట్టూ శూలధారులు మరో మూడుకోట్లూ యుద్ధోత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఒక్కొక్క సైన్యానికీ ఒక్కొక్కడిని అధిపతినిచేసి సర్వసన్నద్ధంగా ఉంచాడు. మనస్సులో శ్రీహరిని స్మరించుకుంటూ రత్తమణిమయ విమానం అధిరోహించాడు. ప్రధాన గురు మంత్రులను తనతో తీసుకుని శంకరుడి సమీపానికి బయలుదేరాడు. చంద్రభాగా నదీతీరాన (పుష్పభద్రానది) శుభప్రదమైన అక్షయవటవృక్షం కనిపించింది. (చంద్రభాగ = పుష్పభద్ర = పుణ్యభద్ర). 

అది సిద్దాశ్రమం. సిద్ధులకు సిద్ధిక్షేత్రం. కపిలుడు తపస్సు చేసినచోటు. భారతదేశంలో పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం. మలయపర్వతానికి పశ్చిమంగా శ్రీశైలానికి ఉత్తరంగా గంధమాదనానికి దక్షిణంగా అయిదుయోజనాల వెడల్పూ అయిదువందల యోజనాల పొడవూ ఉన్న సువిశాల సమతల ప్రదేశమది. శుద్ధస్ఫాటికంలాగా మెరిసిపోతోంది. ప్రక్కనే జలపూర్ణంగా పుష్పభద్రానది ప్రవహిస్తోంది. శరావతితో కలసి హిమాలయాలనుంచి ప్రవహిస్తూ వస్తోంది. సముద్రుడికి ప్రియభార్య. సౌభాగ్యసంయుక్త. గోమతీనదిని ఎడమవైపున నిలుపుకుంటూ వెళ్ళి పశ్చిమసముద్రంలో కలుస్తోంది.

వటమూలంలో సమాసీనుడై ఉన్న చంద్రశేఖరుణ్ణి శంఖచూడుడు దర్శించాడు. యోగాసనంలో సూర్యకోటిసముడై విరాజిల్లుతున్నాడు. ముఖమంటపాన చిరునవ్వు తళుకులీనుతోంది. శుద్ధన్ఫటిక వర్ణంలో బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు. వ్యాఘచర్మాంబరధారి. త్రిశూల పట్టిశధారి. శాంతుడు. గౌరీకాంతుడు. మనోహరుడు. భక్తమృత్యుహరుడు. తపఃఫలదాత. సర్వసంపత్ప్రదాత. ఆశుతోషుడు (ఉబ్బులింగడు). ప్రసన్నవదనుడు. భక్తానుగ్రహకాతరుడు. విశ్వనాథుడు. విశ్వబీజుడు. విశ్వరూపుడు. విశ్వజుడు. విశ్వంభరుడు. విశ్వవరుడు. విశ్వసంహారకరుడు. కారణకారణుడు. నరకార్ణవతారణుడు. జ్ఞానప్రదుడు. జ్ఞానబీజుడు. జ్ఞానానందుడు. సనాతనుడు.

శంఖ చూడుడు విమానం దిగాడు. గురుబృందంతో కలిసి భక్తినమ్రుడై శిరసా నమస్కరించాడు. శివుడికి ఎడమవైపున భద్రకాళి. ముందుభాగాన స్కందుడు - వీరికీ నమస్కరించాడు. కాళిస్కందశంకరులు ముగ్గురూ అతడికి ఆశీన్సులు అందించారు. అతడి రాకను చూసి నందీశ్వరాదులందరూ లేచి నిలబడ్డారు.

పరస్పరం కుశలప్రశ్నలు వేసుకున్నారు. పరస్పరం సంభాషించుకున్నారు. శంఖచూడుడు శివుడి సన్నిధిలో కూర్చున్నాడు. మహాదేవుడు ప్రసన్నుడై -

శంఖచూడా! బ్రహ్మదేవుడికి ధర్ముడు, ధర్ముడికి మరీచి, మరీచికి కశ్యపుడు జన్మించారు. దక్షప్రజాపతి ఈ కశ్యపుడికి తన పదముగ్గురు కూతుళ్ళను ఇచ్చి వివాహం చేశాడు, వారిలో ఒక సాధ్విపేరు దనువు. ఈమెకు సౌభాగ్యాతిశయంవల్ల ఇరవైనలుగురు పుత్రులు కలిగారు. అందరూ తేజోబలశాలులే. ఆ దానవులలో ఒకడు విప్రచిత్తి అతడి పుత్రుడు దంభుడు. పరమధార్మికుడు. విష్ణుభక్తుడు. జితేంద్రియుడు. పుష్కరక్షేత్రంలో శ్రీకృష్ణమహామంత్రాన్ని జపిస్తూ లక్షసంవత్సరాలు తపస్సుచేశాడు. (శుక్రాచార్యుడు ఇతడి గురువు). ఆ తపఃఫలంగా నువ్వు జన్మించావు. పూర్వజన్మలో గోపకుడవు. గోలోకంలో శ్రీకృష్ణుడికి పార్షదుడివి. రాధికాశాపంవల్ల ఈ దానవవంశంలో ఆవిర్భవించావు. నువ్వు వైష్ణవోత్తముడవు. పరమ ధార్మికుడవు. నీవంటి విష్ణుభక్తులు హరిసేవను తప్ప తక్కినవాటిని నీచాలుగా తుచ్చాలుగా పరిగణిస్తారు. హరిసేవ తప్ప మరింకేదీ కోరుకోరు. బ్రహ్మత్వమూ అమరత్వమూకూడా వారికి తుచ్చాలే. ఎవరి దగ్గరా దానం పట్టరు. ఎవరినుంచీ ఎదీ ఆశించరు. తీసుకోరు. అటువంటిది కృష్ణభక్తుడవయ్యుండి నువ్వు దేవతలనుంచి రాజ్యం కొల్లగొడతావా! తప్పుకాదూ! వారి రాజ్యం వారికి ఇచ్చేసెయ్యి. నేను సంతోషిస్తాను. శ్రీహరి ఆనందిస్తాడు. నీ రాజ్యం నువ్వు ఏలుకో. ఎవరి పదవుల్లో వారు సుఖంగా ఉండండి. కశ్యపుడి వంశంలో పుట్టావు. భూతవిరోధం దేనికీ! ఇక చాలించు. మహాపాపాలు అన్నీ ఒక ఎత్తయితే జ్ఞాతిద్రోహం ఒక్కటీ ఒక ఎత్తు అన్నారు. ఇది బ్రహ్మహత్యా మహాపాతకంకన్నా పదహారు రెట్లు మహాపాపం. దీనివల్ల సర్వసంపదలూ నశిస్తాయి. అంచేత దాయాదులతో వైరం పెట్టుకోకు. దేవతలతో సఖ్యంగా ఉండు. నీజోలికి వారు రారు. వారి జోలికి నువ్వు పోవద్దు. మీరంతా కశ్యపవంశజులేకదా!

అదీగాక - అందరికీ అన్నిరోజులూ ఒక్కలాగా గడవవు. బ్రహ్మదేవుడంతటివాడికే ప్రళయంలో వినాశం తప్పడంలేదు. ఈశ్వరేచ్చతో మళ్ళీ ఆవిర్భవిస్తున్నాడు. తపస్సుతో జ్ఞానం సంపాదిస్తున్నాడు. దానితో పునస్సృష్టి చేస్తున్నాడు. అంతదాకా ఎందుకు, ధర్మంమాట చూడు. కృతయుగంలో పరిపూర్ణంగా ఉంటోంది. త్రేతాయుగంలో మూడువంతులు నిలుస్తోంది. ద్వాపరం వచ్చేసరికి రెండువంతులకు క్షీణీస్తోంది. కలియుగారంభంలో ఒక వంతుకి చిక్కిపోయి రానురాను కళామాత్రంగా దృశ్యాదృశ్యంగా మిగులుతోంది. ప్రత్యక్షంగా కనిపించే మరొక దృష్టాంతం చెబుతాను. విను. సూర్యుడున్నాడు. గ్రీష్మంలో ఉన్నట్టు శిశిరంలో ఉంటున్నాడా ? మధ్యాహ్నవేళలో ఉన్నట్టు ప్రాతస్సాయం సంధ్యల్లో ఉండగలుగుతున్నాడా ? ఉదయం బాలుడిగా ఉండి మధ్యాహ్నానికి క్రమంగా వృద్దిపాంది సాయంకాలానికి వృద్ధుడై అస్తమిస్తున్నాడు. ఒక్కొక్కసారి మబ్బులు కమ్మితే మధ్యాహ్నసమయాల్లోకూడా అదృశ్యమవుతున్నాడు. గ్రహణం రోజున ఎంతటి దీనావస్థకి గురిఅవుతున్నాడో చూస్తూనే ఉన్నాంకదా ! అలాగే చంద్రుడూను. పదిహేను రోజుల వృద్ది, పదిహేనురోజులు క్షయమూను. దుర్దినాలూ గ్రహణాలూ సరేసరి.

ఒకనాడు ముల్లోకాలూ నావేనని ఎగబడ్డ బలిచక్రవర్తి ఇవ్వేళ పాతాళానికి దిగబడ్డాడు. కాలప్రభావం అటువంటిది. కలిసివచ్చినవేళ భూగోళం సస్యసంపన్నం అవుతుంది. కానివేళ ప్రళయజలధిలో మునిగిపోతుంది. కాలప్రభావంతోనే విశ్వాలు పుడుతున్నాయి. కాలప్రభావంతోనే గిడుతున్నాయి, చరాచర జీవజాలమంతా ఇంతే. ఒక్క పరాత్పరుడైన పరమాత్మమాత్రమే ఈ కాలప్రభావానికి అతీతుడు. తక్కిన సమస్తమూ బ్రహ్మాదిస్తంభపర్యంతమూ వృద్ధిక్షయాలకు లోనయ్యేదే. కాలప్రభావానికి లాంగినడిచేదే.

పరమాత్మ ఒక్కడే మహాపురుషుడనీ ప్రకృతి స్వరూపుడని నానారూపధారిఅనీ త్రిమూర్తులను నియమించి సృష్టి స్థితి లయాలు లీలావినోదంగా జరిపిస్తున్నాడనీ గ్రహించి నామ గుణ సంకీర్తన చేసే జ్ఞాని సాధనతో క్రమక్రమంగా జన్మ రోగ జరా మృత్యు భయాలను జయిస్తాడు. నేను అలాగే జపిస్తూ ఉంటాను. ఆ జ్ఞానంతో నిర్భయత్వం వచ్చింది. మృత్యుంజయుణ్ణి అయ్యాను. మృత్యుభయం పోతే మృత్యువు పారిపోతుంది - గరుడుణ్ణి చూసిన పాములాగా.

శంకరుడు ఇంతగా ఉపదేశించి శంఖచూడిడి ముఖంలోకి చూశాడు. అతడు ప్రశంసాపూర్వకంగా శిరఃకంపం చేశాడు. సవినయంగా మధురంగా మనసులోనిమాట బయటపెట్టాడు.

పరమేశ్వరా! నువ్వు చెప్పింది చాలా సమంజసంగా ఉంది. కాదనడానికి ఏమీ కనిపించడం లేదు. అయినా నాదొక మనవి. వాస్తవం చెబుతున్నాను. చిత్తగించు. జ్ఞాతిద్రోహం మహాపాపమన్నావుకదా! మరి - సంపదలన్నీ ఊడగొట్టి బలిచక్రవర్తిని పాతాళానికి ఎందుకు తొక్కినట్టు? అతడి ఐశ్వర్యాలనన్నింటినీ నేను శత్రువులనుంచి ఉద్ధరించి తేగలిగాను గానీ అతడినిమాత్రం పాతాళంనుంచి ఉద్దరించలేకపోయాను. నాశక్తి సరిపోలేదు. ఇది ఒక్కటే కాదు - సోదరసహితంగా హిరణ్యాక్షుణ్ణీ హింసించారు దేవతలు, శుంభనిశుంభాది దానవులను నిర్ధాక్షిణ్యంగా మట్టుబెట్టారు. ఇంకా తరచుకుంటూ వెనక్కి వెడితే - సముద్రమథనానికి శ్రమపడింది మేమైతే అమృతం మింగింది దేవతలు. చాకిరీమాది, సౌఖ్యం వారిది. సరే - ఈ పాతపురాణాలకేమిగాని ఒకటిమాత్రం నిజం. ఈ విశ్వమంతా ప్రకృతిస్వరూపుడైన ఆ పరమాత్మకు ఒక క్రీడాభాండం, ఎవడికి ఎక్కడ ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు. వాడు ఆలా ఐశ్వర్యవంతుడవుతాడు.

దేవతలనీ దానవులనీ కయ్యాలనీ నెయ్యాలనీ - ఇదంతా వట్టి బూటకం. కేవలం నిమిత్తమాత్రం. పరమాత్ముని ఇచ్చయే అన్నింటికీ కారణకారణం. జయమో పరాజయమో కాలక్రమంలో మాకో వారికో లభిస్తూ ఉంటుంది. కాలమే కర్త. విరోధాలూ యుద్దయాత్రలూ అన్నీ నిష్ఫలాలూ నిష్ప్రయోజనాలూను. కానీ - సమసంబంధులమూ బంధువులమూ అయిన మాతో యద్ధం చెయ్యడానికి ఇవ్వేళ నువ్వే స్వయంగా వచ్చావు. సిగ్గనిపించడంలేదూ? జయం వరిస్తే మంచిదే. గొప్పకీర్తి లభిస్తుంది. పరాజయం వచ్చిపడితేనో! అపకీర్తి చుట్టుకోదూ? ఇది ఆలోచించావా?

శంఖచూడుడు సూటిగా ప్రశ్నించాడు. త్రిలోచనుడు పెద్దగా నవ్వి యథోచితంగా బదులు పలికాడు. దానవేంద్రా! బ్రహ్మవంశసంభూతులైన మీతో యుద్ధం చెయ్యడానికి నాకు సిగ్గెందుకు? పరాజయం వచ్చిపడితేమాత్రం నాకు చుట్టుకునే అపకీర్తి ఎమిటి? అసలు ఆదిలో మధుకైటభులతో కలహించి దేవదానవ సంగ్రామాలకు శ్రీకారంచుట్టింది శ్రీమన్నారాయణుడేకదా! బలి హిరణ్యాక్ష హిరణ్యకశిపులతోనూ జబ్బచరిపించింది అతడే. ఒక్క త్రిపురాసురులతోమాత్రం నేను తలపడ్డాను. అదెప్పుడో చాలా కాలంక్రితం. ఇక శుంభనిశుంభాదులతోనంటావా జగన్మాత పరమేశ్వరి కలహించింది. ఇలా అందరూ మీతో యుద్దాలు చెయ్యగాలేనిది నేను నీతో చెయ్యడానికి సిగ్గుపడాల్సింది ఎముంది ? అదీకాక - నువ్వు సాధారణ దానవుడవా! గోలోకవాసి గోపకుడివి. శ్రీహరికి పార్షదుడివి. ఇప్పటికి సంహరింపబడిన ఏ దానవుడూ నీకు సాటిరాడు. అందుచేత నేను సిగ్గుపడవలసింది ఎమీ లేదు. ఒకవేళ పరాజయమే సంభవించినా అపకీర్తి కానేకాదు. పైగా సకలదేవతాశరణ్యుడైన శ్రీహరి స్వయంగా శూలం అందించి నీమీదకి పంపించాడు. కాబట్టి ఇక మాటలు కట్టిపెట్టు. నేను చెప్పినట్టు దేవతలకు రాజ్యం ఇచ్చేసెయ్యి. లేదంటే నాతో యుద్దానికి దిగు - అని స్పష్టంగా తేల్చిచెప్పాడు.

శంఖచూడుడు మరింక మాట్టాడలేదు. లేచి నిలబడ్డాడు. మంత్రులూ గురువులూ లేచారు. శివుడికీ పరివారానికీ వినయంగా శిరసువంచి నమస్కరించాడు. త్వరత్వరగా వెళ్ళి విమానం అధిరోహించాడు. రాజధానికి చేరుకున్నాడు. వెంటనే యుద్దానికి సైన్యాన్ని కదిలించాడు.

చంద్రచూడ - శంఖచూడుల సంగ్రామం


No comments:

Post a Comment

Jeeva Karma Vipakam - జీవ కర్మ విపాకం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - జీవ కర్మ విపాకం దేవతలు దానవులు రాక్షసులు గంధర్వులు కిన్నరులు మానవులు - వీరు మాత్రమే కర్మజనకులూ కర్మఫలభోక్తలూ....