Friday, May 8, 2026

Srihari's deception - శ్రీహరి చేసిన వంచన

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - శ్రీహరి చేసిన వంచన

ఒకనాడు ఒక వృద్ధబ్రాహ్మణుడు రణరంగానికి వచ్చాడు. దానవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. దానవరాజేంద్రా! నేను విప్రుణ్ణి. నువ్వు ప్రభువువు. సర్వసంపదలకూ దాతవు. నాకు పెద్దగా కోరికలు లేవు. నిరీహుడను. పైగా వృద్ధుడను. చాలా దప్పికగా ఉంది. ఆట్టే మాట్లాడలేను. నువ్వు ఊం అంటే  అడుగుతాను - చిన్నకోరిక తీర్చు - అన్నాడు. శంఖచూడుడు ప్రసన్నుడై ఊం, అడగండి తీరుస్తాను అన్నాడు. అయితే నీ మెడలో ఉన్న నారాయణ కవచం కావాలి, ఇయ్యి. అడగడమే తడవుగా దానవేంద్రుడు తీసి ఇచ్చేశాడు. అది పుచ్చుకుని ఆ వృద్ధబ్రాహ్మణుడు శ్రీహరి అంతలోనే అంతర్ధానం చెందాడు. నారాయణ కవచధారియై శంఖచూడుని రూపంలో తులసీదేవిముందు ప్రత్యక్షమయ్యాడు. మాయోపాయంతో ఆమె గర్భంలో వీర్యాధానం చేశాడు.

సరిగ్గా ఆదే సమయానికి రణరంగంలో శివుడు తనకు శ్రీహరి అందించిన శూలాన్ని తీశాడు. అది గ్రీష్మమధ్యాహ్న మార్తాండమండలంలాగా ప్రళయకాలాగ్నిశిఖలాగా దుర్నిరీక్ష్యంగా దుర్నివార్యంగా ప్రజ్వరిల్లుతోంది. సుదర్శన చక్రంలాగా సర్వశస్త్రాస్త్రసారంలాగా తేజరిల్లుతోంది. వేయి ధనుస్సుల పొడుగుంది. నూరుబారల వెడల్పుంది. సర్వబ్రహ్మాండమండలాన్నీ సంహరించడానికి సమర్ధమనిపిస్తోంది. ఆ శూలాన్ని ఒకసారి గిర్రున త్రిప్పి శంఖచూడుడి మీదికి విసిరాడు. దాన్ని చూస్తూనే దానవేంద్రుడు ధనుస్సు వదిలేశాడు. మనస్సులో శ్రీకృష్ణుడి పాదపద్మాలను ధ్యానించాడు. యోగాసనాసీనుడు అయ్యాడు, శూలం గిరికీలు కొట్టుకుంటూ వచ్చి అతడిమీద పడింది. పడటమేమిటి రథంతోసహా భస్మమైపోయాడు,

ఆ భస్మరాశినుంచి కిశోరగోపవేషంలో సుదాముడు ఆవిర్భవించాడు. ద్విభుజుడు. మురళీహస్తుడు రత్తభూషణభూషితుడు. గోపకోటీపరివేష్టితుడు. బాల సూర్యప్రభలతో వెలిగిపోతున్నాడు. అంతలోకీ గోలోకంనుంచి దివ్యవిమానం వచ్చింది. అతడూ గోపకులూ అందులోకి అధిరోహించారు. అది ఆకాశమార్గాన గోలోకానికి సాగిపోయింది. అక్కడ బృందావనంలో రాసమండలంలో రాధాకృష్ణులకు సవినయంగా సభక్తికంగా నమస్కరించాడు. సాష్టాంగ పడ్డాడు. రాధాకృష్ణులు ప్రసన్న వదనారవిందులై బాలసుదాముణ్ణి తిలకించి ప్రేమగా చేరదీసి ఒడిలో కూర్చోబెట్టుకున్నారు.

శివుడు ప్రయోగించిన శూలం శంఖచూడుడి అస్థికలతో కలిసి శంఖజాతిగా మారిపోయింది. అప్పటినుంచీ శంఖం దేవతార్చనలకు యోగ్యమయ్యింది. శంఖంలో పోసిన తీర్ధం చాలా ప్రశస్తం, దేవతలకు ప్రీతిపాత్రం. పవిత్ర తీర్థోదకాల్లాగా పరమపవిత్రం. శంఖశబ్దం వినిపించినచోట లక్ష్మీదేవి ఉంటుంది. శంఖజలంతో స్నానంచేస్తే సకల తీర్జాలలోనూ స్నానంచేసినటే. శంఖం శ్రీహరికి అధిష్టానం, అది ఉన్నచోట విష్ణుమూర్తి ఉన్నట్టే. అక్కడే లక్ష్మీదేవీ ఉంటుంది. అమంగళాలు అన్నీ పటాపంచలవుతాయి.

దానవసంహారంతో శివుడు సంతుష్టి చెందాడు. వృషభారూఢుడై తన లోకానికి వెళ్ళిపోయాడు, దేవతలు తమ రాజ్యాన్నీ తమ అధికారాలనూ తిరిగిపొంది విజయోత్సవం చేసుకున్నారు. దేవదుందుభులు మిన్నంటి మ్రోగాయి. గంధర్వ కిన్నరులు గొంతెత్తి పాడారు. పుష్పవృష్టి ధారాళంగా కురిసింది. మహర్షులూ మునీంద్రులూ శివుడినీ ప్రమథులనూ దేవవీరులనూ కాళికామాతనూ ప్రశంసించారు.

నారదా! తులసీగర్భంలో శ్రీహరి వీర్యాధానం ఎలా చేశాడు అనేదేకదా నీ శంక. చెబుతున్నాను విను. తులసీదేవి పాతివ్రత్యాన్ని భంగపరిస్తేనేకానీ శంఖచూడుడు మరణించడు. అందుకని శ్రీహరి దానవప్రభువు రూపంలో తులసీమందిరానికి వెళ్ళాడు. మందిరద్వారం దగ్గర దుందుభి ఉంది. దాన్ని మోగించాడు. అది జయశబ్దం చేసింది. ఆ ధ్వని విని పరమానందభరితురాలై ఆ సాధ్వీమణి మందిరకవాటం తెరిచి ఈవలికి వచ్చింది. ఎట్టయెదుట తన మనోహరుణ్ణి చూసింది. సంతోషం పట్టలేక ఉక్కిరిబిక్కిరి అయ్యింది. బ్రాహ్మణులకూ వందిమాగధులకూ స్వస్తివాచకులకూ ధన కనక మణి మాణిక్యాలను దోసిళ్ళకొద్దీ దానం చేసింది. అర్ఘ్యపాద్యాలను తెచ్చి మనోహరుడి పాదాలను కడిగింది. నమస్కరించి ముద్దాడింది. ఎందుకో ఏదో తెలియని దుఃఖం కట్టలు తెంచుకుంది. వలవలా విలపించింది. సాదరంగా తీసుకువచ్చి ఏకాంతమందిరంలో రత్ససింహాసనంమిద కూర్చోబెట్టింది. చందనచర్చలు చేసింది. కస్తూరికా తాంబూలమిచ్చింది.

నాథా! ఇప్పటికి నా ప్రాణాలు కుదుటబడ్డాయి. రణరంగానికి వెళ్ళి క్షేమంగా తిరిగివచావు. ఇంతేచాలు. నా తపస్సు ఫలించింది. నా జన్మ చరితార్థమయ్యింది నా జీవితం సఫలమయ్యింది. ఇలా పలవరిస్తూ కామభావపరిప్లుతయై సవిలాసంగా వాలుచూపులు విసిరింది. స్పర్శసుఖాన్ని అనుభవిస్తూ పులకించింది. గుండెలు నిమురుతూ - 

స్వామీ! అసంఖ్య విశ్వసంహర్తతో యుద్ధంకదా! ఎలా జరిగింది? విజయం ఎలా లభించింది? దయచేసి వివరించవూ! అని గోముగా అడిగింది.

శంఖచూడ రూపంలో ఉన్న శ్రీహరి మందహాసం చిందించి మృదువుగా అమృతప్రాయంగా పలికాడు. కాంతామణీ! మా ఇద్దరికీ యుద్ధం నిండా నూరేళ్ళు జరిగింది. మన దానవవీరులందరూ మరణించారు. నేనుమాత్రం పోరాడుతూనే ఉన్నాను. అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు. మా ఇద్దరికీ ప్రీతికరంగా సయోధ్య కుదిర్పాడు. దేవతలకు వారి రాజ్యం వారికి ఇచ్చేశాను. సంతృప్తులై వెళ్ళిపోయారు. మన రాజ్యం మనకు మిగిలింది. ఆ తృప్తితో ఇంటికి తిరిగివచ్చాను. శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. క్లుప్తంగా జరిగింది ఇది - అంటూనే తులసిని శయనంమీదకు వాల్చాడు.

ఆ ఆకర్షణకూ ఆ సంభోగసుఖాధిక్యానికీ అనుమానించిన తులసి రకరకాలుగా వితర్కించుకుంది. శంఖచూడుడు కాదని నిర్ధారించుకుంది. చివాలున లేచింది. మాయావీ! నువ్వు ఎవడివో చెప్పు. నా పాతివ్రత్యాన్ని నాశనం చేశావు. నన్ను అనుభవించావు. నిజం చెప్పకపోయావో శపిస్తాను - అంటూ గాండ్రించింది.

శపిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు. దేవదేవుడు. సనాతనుడు. నవీన నీరదశ్యాముడు. శరత్పంకజలోచనుడు. కోటికందర్పసుందరాకారుడు. నవ్వులు చిందిస్తున్నాడు. పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది. శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్చిల్లింది. వెంటనే తేరుకుంది.

జగన్నాథా! నీకు దయలేదు. పాషాణనదృశుడివి. మోసగించి ధర్మభంగం చేశావు. నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు. నాభర్తను సంహరించావు. ప్రభూ! ఇంతటి దయాదూరుడివి ఎలా అయ్యావు? ఈ ఘోరానికి నిన్ను శపించవలసిందే. ఇకనుంచీ నువ్వు పాషాణరూపుడివి అయిపోతావు. నువ్వు సత్పురుషుడివనీ కృపానిధివనీ పాగిడేవారు వట్టి ఆమాయకులు. భ్రాంతచిత్తులు. నీది గుండెకాదు. బండరాయి. ఏ అపరాధమూ చెయ్యని నీ భక్తుణ్ణి పరులకోసమని పొట్టబెట్టుకోడానికి నీకు మనసు ఎలా ఒప్పింది?

పూనకం వచ్చినట్టు మాట్లాడుతూ దారుణంగా రోదించింది. గుండెలు బాదుకుంటూ విలపించింది పడీపడీ దుఃఖించింది. చాలాసేపు అలా చూస్తూ మౌనంగా నిలుచుండిపోయాడు శ్రీహరి. మెల్లగా పెద్ది విప్పాడు.

తులసికి శ్రీహరి వరాలు


No comments:

Post a Comment

Jeeva Karma Vipakam - జీవ కర్మ విపాకం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - జీవ కర్మ విపాకం దేవతలు దానవులు రాక్షసులు గంధర్వులు కిన్నరులు మానవులు - వీరు మాత్రమే కర్మజనకులూ కర్మఫలభోక్తలూ....