Friday, May 29, 2026

Sundarakanda Parayana Vidhanam - సుందరకాండ పారాయణ విధానం

సుందరకాండ పారాయణ విధానం

సుందరకాండ పారాయణ పద్ధతులు అనేకంగా ఉన్నాయి. వారి వారి అనుకూలతలను అనుసరించి పద్ధతిని ఎంచుకోవచ్చు. కొందరు నిత్య పారాయణగా సుందరాకాండను అనుష్ఠిస్తారు.

ప్రతి రోజు ఏడు సర్గల చొప్పున సంవత్సరం వరకు సుందరాకాండను పఠించడం ఒక పద్ధతి. రోజుకి ఇరవై అయిదు సర్గలుగా నిత్యానుష్ఠానం చేసే పద్ధతి శాస్త్రం చెబుతోంది.

అభీష్టసిద్ధికోసం, అనిష్ట పరిహారం కోసం పారాయణ చేసే విధానాలు చాలా ఉన్నాయి.

ముప్పయి రెండు పర్యాయములు పారాయణ ఒక పద్ధతి. మొదటి రోజున సీతాదేవి ఆంజనేయునకు చూడామణినివ్వడం వరకు చదవాలి.

రెండోరోజున మిగిలిన కాండ పారాయణ చేయాలి. అలా 64 రోజుల్లో 32 పర్యాయాలు పూర్తవుతుంది.

72 దినాలలో 24 పర్యాయాలు పారాయణ చేసే విధానముంది. హనుమంతుడు సీతమ్మను చూసేవరకు మొదటి రోజున పఠించాలి.

రెండవరోజున హనుమంతుడు అశోకవన ధ్వంసం చేసిన ఘట్టం వరకు చదవాలి. మూడవ రోజున మిగిలి కాండను పూర్తి చేయాలి. ఇలా 72దినాలు చేస్తే 24 పర్యాయాలు పూర్తి అవుతాయి.

48 దినాలలో 12 ఆవృత్తులు పఠించే విధానముంది. మొదటి రోజు హనుమంతుడు సీతాదేవిని దర్శించే ఘట్టం వరకు, రెండవరోజు విశ్వరూపం సందర్శనం వరకు, మూడవరోజు హనుమ రావణునకు హితోపదేశం చేసే సన్నివేశం వరకు, నాలుగవరోజు కాండాంతం చదవాలి. ఇలా 48 రోజులు చేస్తే 12 పర్యాయాలవుతుంది.

మొదటిరోజున సీతా సందర్శన ఘట్టం వరకు, రెండవరోజున త్రిజటా స్వప్న వృత్తాంతం వరకు, మూడవ రోజున చూడామణీ ప్రదానం వరకు, నాల్గవరోజున లంకాదహనం వరకు, ఐదవరోజున మిగిలిన భాగం-పాంచాహ్నిక పారాయణ విధి.

ఇలా వివిధ ఆవృతుల విధానాలు ఉన్నాయి. ఇంతే కాకుండా - ఒక్కరోజు మొత్తం సుందరకాండ పారాయణ చేయవచ్చు.

అలా చేసినట్లయితే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాదికాలు చేసి అపరాహ్ణాత్పూర్వమే (మధ్యాహ్నం లోపల) పూర్తి చేయాలి. దీనికి శక్తి లేకపోతే రెండు రోజులు పారాయణ చేయవచ్చు.

అలాగే మూడు రోజుల పాటు రోజుకు కొన్ని సర్గల చొప్పున విభజించుకొని పారాయణ చేయొచ్చు. అలాగే నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది దినములు పారాయణ చేయవచ్చు.

ఎప్పుడు పారాయణ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజచేసి, సంకల్పం చెప్పుకొని శ్రీసీతారామాంజనేయులను షోడోపచారాలతో అర్చించి, పుస్తకాన్ని పూజించి, పారాయణ ప్రారంభించాలి.

మధ్యలో ఇతరులతో సంభాషించడం కానీ, లేవడంగానీ చేయరాదు. పారాయణాంతంలో క్లుప్తంగా పునః పూజచేసి మంగళ హారతి ఇచ్చి, మంగళ శ్లోకాలు చదవాలి.

పారాయణకు ముందు గురూపదేశం ద్వారా లభించిన శ్రీ సీతారామమంత్రం, ఆంజనేయ మంత్రం జపించడం మంచిది.

ఉపదేశం లేనట్లయైతే 'శ్రీరామయనమః' లేదా 'శ్రీరామ జయరామ జయజయరామ' - అనే మంత్రాన్నీ,'శ్రీ హనుమతేనమః' లేదా 'శ్రీహనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్' అనే మంత్రాన్నీ జపించడం మంచిది.

పటిక బెల్లం కలిపిన పాలు, ఫలాలు, తాంబూలం, నేతి అప్పాలు నివేదించి పారాయణ చేయడం మంచిది.

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Puri Jagannath Rath Yatra - పూరీ జగన్నాథ్ రథయాత్ర

పూరీ జగన్నాథ్ రథయాత్ర ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ...