Sunday, July 12, 2026

Tambulam - Betel leaves - తాంబూలం - తమలపాకులు

తాంబూలం - తమలపాకులు

హిందూధర్మంలో తమలపాకులను అష్ట మంగళాలలో (1.పూలు, 2.అక్షింతలు, 3.ఫలాలు, 4. వక్క, 5.వస్త్రం, 6.తమలపాకు 7.దీపం, 8.కుంకుమ) ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో, సంప్రోక్షణ చేసేటపుడు తమలపాకులనే వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసినది గా భావిస్తారు. పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్ఠింప చేస్తారు.

భారతదేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటపుడూ, భోజనానంతరం తమలపాకులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.

తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యమైనదంటే-
క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణంలో చెప్పారు. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి. తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

తమలపాకులోని ఏయే భాగాలలో ఏయే దేవతలు ఉంటారో తెలుసుకుందాం.

తమలపాకు పై భాగంలో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.

సరస్వతీదేవి తమలపాకు మధ్య భాగంలో ఉంటుంది.

తమలపాకు చివరిలో మహాలక్ష్మీదేవి ఉంటుంది.

జ్యేష్టాదేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.

విష్ణుమూర్తి తమలపాకు అంతటా ఉంటాడని ప్రతీతి.

శివుడు తమలపాకు పై భాగంలో ఉంటారు.

తమలపాకులోని ఎడమ వైపున పార్వతీ దేవి, మాంగల్యదేవి ఉంటారు.

భూమాత తమలపాకుకు కుడి భాగంలో ఉంటుంది.

సుబ్రహ్మణ్యస్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు.

గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

Dakshinamurthy - దక్షిణామూర్తి

దక్షిణామూర్తి

సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగించినా, జీవులకు ఆత్మజ్ఞానం, పరమసత్యం తెలియక అజ్ఞానంలోనే జీవించేవారు.

ఆ సమయంలో సనక, సనందన, సనాతన, సనత్కుమారుల వంటి మహా ఋషులు "ఈ సృష్టి రహస్యం ఏమిటి? పరబ్రహ్మను ఎలా తెలుసుకోవాలి?" అనే సందేహాలతో దేవలోకాలన్నీ తిరిగిన వారి ప్రశ్నలకు సమాధానం లభించలేదు.

చివరకు వారు పరమశివుడి శరణు ఆశ్రయించారు. అప్పుడు పరమశివుడు ఒక మహా వటవృక్షం (మర్రిచెట్టు) క్రింద దక్షిణ దిశను చూసి యవ్వన గురువు రూపంలో ఆసీనుడయ్యాడు. ఆ రూపమే శ్రీ దక్షిణామూర్తి.

విశేషమేమిటంటే, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ, ఆయన దివ్య సన్నిధి, చిన్ముద్ర, మౌన ఉపదేశం ద్వారా ఆ మహర్షుల హృదయాల్లో జ్ఞానదీపం వెలిగింది. వారు ఆత్మజ్ఞానాన్ని పొందారు.

వారి సందేహాలన్నీ క్షణాల్లో తొలగిపోయాయి. అందుకే ఆయనను "మౌనవ్యాఖ్యా ప్రబోధకుడు",  అని దక్షిణామూర్తి మహిమను వేదాలు, ఆగమాలు కీర్తిస్తాయి. అంటే, మౌనంతోనే పరబ్రహ్మ తత్వాన్ని బోధించిన జగద్గురువు అనే అర్థం. "ఆది గురువు", "జగద్గురువు" అని స్తుతిస్తారు.

అప్పటి నుంచి జ్ఞానానికి, విద్యకు, గురుత్వానికి ఆదిదేవుడిగా దక్షిణామూర్తిని ఆరాధిస్తున్నారు. విద్యార్థులు, గురువులు, వేద పండితులు, ఆధ్యాత్మిక సాధకులు దక్షిణామూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే జ్ఞానం, వివేకం, ఏకాగ్రత, గురుకృప లభిస్తాయని విశ్వసిస్తారు.

Seed-syllable mantras of the twelve zodiac signs - ద్వాదశ రాశుల బీజాక్షర మంత్రాలు

ద్వాదశ రాశుల బీజాక్షర మంత్రాలు

ఈ బీజాక్షర మంత్రాలకు మన శరీరంలోని చక్రాలను ఉత్తేజపరిచి, అవి సజావుగా పనిచేసేలా చేసే శక్తినిస్తాయి. బీజం అంటే విత్తనం. అక్షరం అంటే అక్షరం, బీజ + అక్షరం అంటే బీజం లాంటి అక్షరం. అంటే బీజాక్షరం అనే పదాన్ని ఒకే ఒక్క అక్షరంతో కూడిన మంత్రాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు.

ఈ బీజాక్షర మంత్రాన్ని ఆచరించడం వల్ల శరీరంలో ఆత్మ-ప్రాణశక్తి పెరుగుతుంది. కాబట్టి బీజాక్షర మంత్రానికి ఇతర మంత్రాల కంటే ఎక్కువ శక్తి ఉంది. ఈ మంత్రాలను రోజూ పఠిస్తే ఆత్మశుద్ధి, ప్రాణశుద్ధి చేకూరుతుంది. ముఖ్యంగా 
ద్వాదశ రాశుల వారీగా బీజాక్షర మంత్రాలను తెలుసుకుందాం.

మేషం - ఓం ఐం క్లీం సౌం

వృషభం - ఓం ఐం క్లీం శ్రీం

మిథునం - ఓం క్లీం ఐం సౌం

కర్కాటకం - ఓం ఐం గ్లీం శ్రీం

సింహం - ఓం హ్రీం శ్రీం సౌం

కన్య - ఓం శ్రీం ఐం సౌం

తుల - ఓం హ్రీం క్లీం శ్రీం

వృశ్చికం - ఓం ఐం క్లీం సౌం

ధనుస్సు - ఓం హ్రీం క్లీం సౌం

మకరం - ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సౌం

కుంభం - ఓం హ్రీం ఐం క్లీం శ్రీం

మీనం - ఓం హ్రీం ఐం క్లీం శ్రీం..

ఈ బీజాక్షర మంత్రాన్ని రోజూ 12 రాశుల వారు పఠించడం ద్వారా జ్ఞాన శక్తి పెంపొందుతుంది. శరీరంలోని చక్రాలు ఉత్తేజమవుతాయని అంటున్నారు.

devatalu pushpaalu - Divine flowers - దేవతలు పుష్పాలు

దేవతలు పుష్పాలు

మనలో చాలా మంది పూజకు పూలను సమర్పిస్తుంటారు. భక్తులు భక్తితో ఏది సమర్సించినా తీసుకుంటాడు భగవంతుడు. అయితే.. మనం పూజించే ప్రతి దేవుడికి ఇష్టమైన రోజులు, పువ్వులు, రంగులు ప్రత్యేకించి ఉంటాయి. భక్తులకు ఇష్టమైన దైవాలున్నట్టే, ఆయా దేవతలకూ కూడా ఇష్టయిష్టాలున్నాయి. ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడతారు. ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి.

1. లక్ష్మీ దేవి:
కలువ పూలు: ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీ దేవి కలువ పూవులోనే కూర్చుని ఉంటుంది. ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే. లక్ష్మీ దేవిని కమలాలు, తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే లక్ష్మీ కరుణిస్తుంది.

2. గణేశుడు:
ఎర్రటి పుష్పాలు: అడ్డంకులను తొలగించే గణేశుడు, లక్ష్మీ దేవి వలె ఎర్రటి పుష్పాలను అందుకుంటాడు. ఎరుపు, నారింజ రంగుల్లో ఉండే బంతిపూలంటే ఉండ్రాళ్ల ప్రియుడు వినాయకుడికి చాలా ఇష్టం. బంతిపూలు పాజిటివిటీని పెంచుతాయి. వినాయకుడికి ఎర్ర బంతిపూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. ఎర్ర మందార, గన్నేరు పూలు కూడా గణేశుడికి అత్యంత ఇష్టమైన పువ్వు.

3. సరస్వతీ దేవి:

మోదుగు పూలు: ఎల్లప్పుడూ తెల్లని దుస్తులు ధరించి ఉంటుంది. ఆమె మనస్సు, ఆత్మ స్వచ్ఛతను సూచిస్తుంది. కానీ ఆమెకు ఇష్టమైన రంగు పసుపు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చదువుల దేవత సరస్వతికి పూజ చేసేటప్పుడు కచ్చితంగా మోదుగు పూలు ఉండేలా చూసుకోండి. ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీ దేవి ప్రసాదిస్తుంది. సరస్వతికి ప్రార్థనలు చేసేటప్పుడు పసుపు పువ్వులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

4. శివుడు:

ఉమ్మెత్త: నీలకంఠుడిని పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజచేస్తే ఫలితం ఉంటుంది. ఉమ్మెత్త చెట్లకు గుండ్రంగా ముళ్లతో కూడిన కాయల్లాంటివి కాస్తాయి. అవంటే శివుడికి మహా ఇష్టం. వాటితో పూజ చేస్తే అహం, శత్రుత్వం వంటి గుణాలు నశించి ప్రశాంతమైన జీవితం సొంతమవుతుంది.

5. కాళీ మాత:
ఎర్ర మందారం: కాళీ మాత నాలుక రంగులో పూచే పూలు ఎర్రమందారాలు. ఆ రంగు కాళీమాతలోని ధైర్యాన్ని, సాహసాన్ని సూచిస్తాయి. 108 ఎర్ర మందారాలతో మాల కట్టి కాళీ మాత మెడలో వేసి నమస్కరిస్తే కోరిక కోరికలు తీరుతాయంటారు. అంతేకాకుండా, కాళీ దేవికి ముదురు ఎరుపు గులాబీ పువ్వులు కూడా సమర్పిస్తారు.

6. మహా విష్ణువు:
పారిజాతాలు:
సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహా ప్రీతి. క్షీరసాగర మథనం జరిగేటప్పుడు పారిజాత వృక్షం పుట్టిందని, దాన్ని విష్ణువు తనతో పాటూ స్వర్గానికి తీసుకెళ్లారని చెబుతారు. ఆ పూలతో పూజిస్తే విష్ణువు మనసు మంచులా కరిగి సిరిసంపదలను ప్రసాదిస్తాడు.

7. హనుమంతుడు:
మల్లెపూలు:
మల్లెపూలంటే చాలా ఇష్టం, కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూలను సమర్పిస్తారు. ప్రతి శనివారం బజరంగబలికి తమలపాకులు, అద్భుతమైన పువ్వులు సమర్పిస్తారు.

8. శ్రీ కృష్ణుడు:
కదంబ పుష్పాలు:
కదంబ వనంలో చాలా కాలం గడిపేవాడు. కదంబ పుష్పాలు సువాసనతో బంతిలా గుండ్రంగా ఉంటాయి. పారిజాతాన్ని శ్రీకృష్ణుడు భూమిపైకి తెచ్చిన స్వర్గపు వృక్షంగా చెబుతారు. కాబట్టి, కృష్ణుని పూజించడానికి కూడా పారిజాత గొప్పది.

9. శనిదేవుడు:
నీలిరంగు పూలు:
నీలిరంగు పూలను శనికి సమర్పించాలి. నీలం శంఖం పువ్వుతో సహా ఇతర నీలం పుష్పాలను శని భగవానుడికి సమర్పించవచ్చు.

Ganapati - Ekadanta (The One-Tusked One) - గణపతి - ఏకదంతుడు

గణపతి - ఏకదంతుడు

మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత, ఆ మహత్తర చరిత్రను ప్రపంచానికి అందించాలని వేదవ్యాస మహర్షి సంకల్పించారు. కానీ వేలాది శ్లోకాలతో కూడిన ఈ మహాగ్రంథాన్ని తాను చెప్పే వేగానికి తగ్గట్టు ఎవరు రాయగలరా ఆలోచించారు.

అప్పుడు బ్రహ్మ దేవుని సలహాతో వ్యాస మహర్షి వెంటనే శ్రీ గణపతిని ధ్యానించి ప్రార్థించాడు. ఆయన భక్తికి ప్రసన్నమైన గణపతి ప్రత్యక్షమై, "నేను రాస్తాను. కానీ నీవు ఒక్క క్షణం కూడా ఆగకుండా చెప్పాలి" అని ఒక షరతు పెట్టాడు.

దానికి వ్యాస మహర్షి కూడా, "మీరు ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని పూర్తిగా గ్రహించిన తర్వాతే రాయాలి" అని మరో షరతు పెట్టారు. గణపతి అంగీకరించాడు.

అలా వ్యాస మహర్షి మహాభారతాన్ని చెప్పడం ప్రారంభించగా, గణపతి వేగంగా లిఖించడం మొదలుపెట్టాడు. మధ్యలో ఒకసారి రాస్తున్న కలం విరిగిపోయింది.

కానీ రచన ఆగకూడదనే సంకల్పంతో, శ్రీ గణపతి తన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించి మహాభారతాన్ని పూర్తి చేశాడు. అందుకే ఆయనను "ఏకదంతుడు" అని కూడా పిలుస్తారు.

ఏ శుభకార్యమైనా, ఏ గొప్ప పనైనా విఘ్నాలు లేకుండా పూర్తవ్వాలంటే ముందుగా గణపతిని ప్రార్థించాలనే విశ్వాసంతో ఆయన ఈ దివ్య కార్యాన్ని గణేశుడితోనే ప్రారంభించారు.

అలాగే గణపతి కూడా తన భక్తుడి సంకల్పం నెరవేరేందుకు తన దంతాన్నే త్యాగం చేసి, ధర్మగ్రంథమైన మహాభారతాన్ని ప్రపంచానికి అందించాడు.


ఇంకో పురాణం కథనం ప్రకారం
పరశురాముడు, వినాయకుడి మధ్య జరిగిన యుద్ధం. వారిద్దరి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది అంటే... ఒకసారి పరశురాముడు శివుడిని కలవడానికి కైలాస పర్వతానికి చేరుకున్నారట.

పరమశివుడిని దర్శించుకోవడానికి వచ్చిన పరశురాముడిని, శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారని గణేశుడు ద్వారం వద్ద అడ్డుకున్నాడు. పరశురాముడు ఎంత వేడుకున్నా వినాయకుడు వినలేదట.

దీంతో సహనం కోల్పోయిన పరశురాముడు తనను ఎవ్వరూ అడ్డుకోరనే భావించిన పరశురాముడు కోపంతో గణేశుడితో యుద్ధానికి దిగాడు. చివరకు శివుడు ప్రసాదించిన పరశు(గొడ్డలి)ని గణేశుడిపై విసిరాడు.

ఆ గొడ్డలి తన తండ్రి శివుడు ఇచ్చిన ఆయుధమని గుర్తించిన గణేశుడు, దానిని అవమానించకూడదనే భావంతో ఎదిరించలేదు. ఆ పరశు తాకడంతో ఆయన ఒక దంతం విరిగిపోయింది. అప్పటి నుంచే గణపతికి "ఏకదంతుడు" అనే పేరు వచ్చింది.

Coconut offering kobbarikaaya naivedhyam - కొబ్బరికాయ నైవేద్యం

కొబ్బరికాయ నైవేద్యం

హిందూ ధర్మంలో కొబ్బరికాయకు విశిష్టమైన స్థానం ఉంది. అసలు ప్రతి పనిలోనూ కొబ్బరికాయనే ఎందుకు వాడతాం? దీని వెనుక కేవలం విశ్వాసం మాత్రమే కాదు, లోతైన ఆధ్యాత్మిక అర్థం, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.

మనం దైవ సన్నిధిలో కొబ్బరికాయను కొట్టినప్పుడు, మనలోని అహంకారాన్ని పటాపంచలు చేసి, నిర్మలమైన మనసుతో దైవానికి శరణాగతి చెందుతున్నామని అర్థం.

ఒకప్పుడు విశ్వామిత్రుడు కోపంతో ఇంద్రుడును ఎదిరించి కొత్త స్వర్గాన్ని సృష్టించాలని తపనపడ్డారని చెబుతారు. ఆ ప్రయత్నంలో కొబ్బరికాయను ప్రత్యేకంగా ఉపయోగించినట్లు కథలు చెబుతాయి.

కొబ్బరికాయ కొట్టడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా లేకపోలేదు. కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చే శబ్దం చుట్టుపక్కల ఉన్న ప్రతికూల ప్రకంపనలను తొలగించి, సానుకూల శక్తిని నింపుతుందని విశ్వసిస్తారు.

పూర్వకాలంలో యజ్ఞాల సమయంలో జీవబలి ఆచారం ఉండేదని, కాలక్రమేణా దానికి బదులుగా కొబ్బరికాయను సమర్పించడం ప్రారంభించారని చెబుతారు. ఇది హింసారహిత మార్గంలో దైవానికి అర్పణ చేయడాన్ని సూచిస్తుంది.

కొబ్బరికాయను కొట్టడం అంటే కేవలం ఒక ఆచారం కాదు... మన అహంకారాన్ని భగవంతుని పాదాల వద్ద సమర్పించి, శుభారంభానికి శ్రీకారం చుట్టడం.


గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

Sri Vishnu Sahasranama Parayanam - శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం

శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం

రోజుకు కనీసం ఒక్క సారైనా విష్ణుసహస్ర నామ పారాయణం చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. పాపాలు తొలగి ఆయురారోగ్యము కలుగుతాయి.

శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం త్వరగా లభిస్తుంది అని నమ్ముతారు

ప్రతి రోజు విష్ణు నామ పారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు.

పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఈతి బాధలు కనుమరుగవుతాయి.

జ్ణానానికి, మోక్షానికి దగ్గర దారి శ్రీ మహా విష్ణు ఆరాధన. ఎవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయణం చేస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి ఆరోగ్యం వృద్ది కలుగుతుంది.

మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది.

ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం అయినా సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు.

శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల నవగ్రహ దోషాలు తొలగి, వాక్షుద్ది కలుగుతుంది. జ్ఞానం వృద్ది చెందుతుంది.

Parikshinmaharaju Shukayogindru Nadigedu Prashna - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -  పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న “అయ్యా! పుట్టుకకు కారణమైన కర్మ అనే రోగం తొలగిపోవడానికి కారణమైన ద...