తిరుప్పావై - ఇరవై ఒకట వ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
ఈరోజు 21వ రోజు.
నిన్న విసనకర్ర, అద్దము అనునవి స్నాన వ్రతానికి కావలసిన పరికరములు. విసనకర్ర శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి తాపాన్ని పోగొడుతుంది. ఇక అద్దము స్వస్వరూపాన్ని తెలియజేసేది. మనల్ని మనకు చూపించేది. మమ్మల్ని అనుగ్రహించి సుఖ పెట్టమ్మా!
అని గోపికలు ఆ తల్లిని ప్రార్థించారు.
ఈరోజు శ్రీ కృష్ణుడిని స్తుతిస్తున్నారు.
ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కళ్
అత్తప్పడైత్తాన్ మగనే! యఱివుఱాయ్
ఊత్తముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిన్రశుడరే! తుయిలెళాయ్
మాత్తారునక్కు వలితులయిందు వున్ వాశఱ్కణ్
ఆత్తాదు వందు వున్నడి పణియు మాప్పోలే
పోత్తియామ్ వందోమ్ పుగళుందు ఏలోరెంబావాయ్ || 21 ||
ఈ పాశురం యొక్క అర్థం చూద్దాం….
ఓ నందగోపుని పుత్రుడా! పాలు పితకడానికి పెట్టిన కుండలన్నీ నిండిపోయి కిందకి పొర్లి పోతున్నాయి. గొప్ప ఔదార్యం కలిగిన పశువులు సమృద్ధిగా కలిగి ఉన్నాడు నీ తండ్రి. అటువంటి గొప్పవాని పుత్రుడా! మేలుకో! వేదములచేత చెప్పబడిన వాడా! మేలుకో! లోకంలో ఆశ్రితులను రక్షించడానికి అవతరించిన తేజోరూపుడా! నిద్రలోంచి లే! నీ శత్రువులు నీతో ఎదురుగా వచ్చి పోరాడి నిలువలేక, వేరే గతిలేక, దీనులై, నీ సన్నిధిలో, నీ పాదములను ఏ విధముగా ఆశ్రయిస్తారో.. అదేవిధంగా మేము కూడా నీ కళ్యాణ గుణములను కీర్తిస్తూ, నీకు మంగళాశాసనము చేయడానికి వచ్చితిమి.
అంతరార్ధం
గోపికల ప్రార్థనను మన్నించి, నీలాదేవి వారితో గొంతు కలిపి, శ్రీకృష్ణుని మేల్కొలుపుతుంది.నందగోపుడికి చాలా గోసంపద ఉంది. పెద్ద పెద్ద పొదుగులు కలిగి ఉండి, పొదుగు కింద కుండ పెట్టగానే పాలు ఆగకుండా పొంగిపొర్లుతుంటాయి.
నందుడు దగ్గర అటువంటి గోవులు ఎన్నో వేల కొద్దీ ఉన్నాయి. గోవులు అంటే వేదములు. నందగోపుడే ఆచార్యుడు. ఆయనే పాలిచ్చే గోవు కూడా. ఆచార్యుడి ఉపదేశమే పాలు. గోవుకి చిన్న కుండ, పెద్ద కుండ అని తేడా ఉండదు. పొదుగు కింద పెట్టడమే ఆలస్యం పాలతో కుండ నిండిపోతుంది.మనం కూడా గురువుని ఆశ్రయిస్తే జ్ఞానం కలుగుతుంది. గురువుని చేరడానికి మనదే ఆలస్యం.
గోవు మనకి పాలు ఇచ్చినప్పుడు తను ఏదో మనకి ఉపకారం చేసినట్టుగా భావించదు. గురువు కూడా అంతే. గురుభక్తి మనకు ఉండాలి.
భగవత్ కటాక్షం పొందిన గోపికలు పరతత్వాన్ని తెలిసినవారు. భగవత్ తత్వాన్ని తెలుసుకోలేని వారు మూఢులు అని చెప్తుంది వేదం. ఆలయంలో అర్చామూర్తులను కేవలం విగ్రహములుగా, ఉపకరణాలుగా చూస్తున్న వారు మూఢులు.
తనను ఆశ్రయించిన వారిని పరమాత్మ రక్షిస్తాడు అనడంలో ఎటువంటి అనుమానం అక్కరలేదు.గోపికలకు పరమాత్మపై విశ్వాసం చాలా ఉంది.
గోపికలు పరమాత్మ తమను అనుగ్రహించడం లేదని భావిస్తూ ఈ విధంగా అనుకుంటున్నారు."స్వామీ! మేము ఎన్నో తప్పులు చేసాము. మేము కూడా హిరణ్యకశిపుడు, రావణాసురుడు వంటి వారమే. నీవు మాకు దూరంగా ఉండటం వలన మేము కూడా భాగవతులను హింసించేమేమో అని బాధపడుతున్నాము. పూర్వం కాకాసురుడు బ్రహ్మాస్త్రాన్ని తట్టుకోలేక రాముని శరణు కోరాడు. ఈరోజు మేము కూడా నిన్ను శరణు వేడుకుంటున్నాము".
సీతాదేవి.. శ్రీరాముడే వచ్చి తనను రక్షిస్తాడని తనను తాను రక్షించుకొనే ప్రయత్నం మానుకుంది.భక్తుడు కోరినా, కోరక పోయినా భగవంతుడు రక్షిస్తాడు. కానీ మనం కోరి భగవంతుడిని పొందితే ఆ ఆనందం వేరుగా ఉంటుంది.
అంతా భగవంతుడే అనుకున్న వాడికి శాంతి. అంతా నేనే అనుకున్న వాడికి ఆశాంతి. ఈ విధంగా భావిస్తూ గోపికలు శ్రీకృష్ణుని శరణు వేడుకున్నారు.
No comments:
Post a Comment