Tuesday, January 7, 2025

తిరుప్పావై - ఇరవై నాలుగోవ పాశురము

తిరుప్పావై - ఇరవై నాలుగోవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈరోజు 24 వ. పాశురం గురించి తెలుసుకుందాం.

నిన్న ఇరవై మూడవ పాశురం లో మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారు కదా! స్వామి వస్తుంటే ఆయన పాదాలను చూసారు. అవి కంది పోయినట్లు అనిపించింది. పాదాలు స్వతహాగా గులాబి రంగులో ఉంటాయి. కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు కంది పోయాయి అనుకుంటున్నారు. మేం నీ పాదాలు కందిపోయేలా చేసామే అంటూ బాధపడ్డారు. వీళ్ళేమీ శ్రీకృష్ణుణ్ణి బాధ పెట్టడానికి రాలేదు కదా!. కేవలం ఆ స్వామిని చూసి అనందిద్దామని వచ్చారు.వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని మంగళం పాడుతున్నారు.

ఈ 24 వ పాశురాన్ని మాంగళాశాసన పాశురం లేక హారతి పాశురం అని కూడా అంటారు. భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి. మొదటిది జ్ఞాన దశ, రెండోది ప్రేమ దశ. జ్ఞాన దశలో భగవంతుడు ఎలాంటివాడో, తను ఎలాంటివాడో తెలుసుకోవడం. భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం. తను ఏ జ్ఞానం లేనివాడూ, భగవంతుడు రక్షిస్తే తప్ప తనకు రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది. ఈ దశలో భగవంతునికున్న శక్తిని మరచి.. ఆయనకున్న సౌకుమార్యం, సౌశీల్యం అనే గుణాలనే చూస్తాడు. ఇక తను అజ్ఞాని అని మరచిపోయి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు. జ్ఞానం కల్గినప్పుడు భగవంతుడు తనని రక్షించేవాడు అని ఒకప్పుడు భావించినవాడు, ఈనాడు భక్తితో తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు. ఏదైన ఒక విలువైన వస్తువు మన ఇంట్లో ఉంటే మనం ఎలాగైతే ఆ వస్తువుని రక్షించుకుంటామో అట్లానే. అందుకే మనం.. ఆలయాల్లో తలుపులనీ, తాళమనీ ఇలా అన్నీ రక్షించుకోవడం కోసం చేస్తుంటాం. లోకాలను రక్షణ చేసే వాడికి మనం రక్షణ కల్పించడం ఏంటి? కనుక అది ఎంతో ప్రేమతో చేస్తాం. దృష్టిదోషం తొలగుగాక అని, కర్పూరం ఎలాగైతే హరించుకు పోతుందో. అదేవిధంగా దోషాలన్నీ హరించుగాక! అని మంగళం పాడుదాం. 

ఈరోజు పాశురం…..

అన్రివ్వులగ మళందాయ్ ! అడిపోత్తి
చ్చెన్రంగుతైన్నిలంగై శెత్తాయ్ ! తిరల్ పోత్తి
పోన్రచ్చగడ ముదైత్తాయ్! పుగళ్ పోత్తి
కన్రు కుణిలా వెరిన్దాయ్! కళల్ పోత్తి
కున్రుకుడైయావెడుత్తాయ్ ! గుణం పోత్తి
వెన్రు పగైకెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్రెన్రున్ శేవగమే యేత్తిపఱై కొళ్వాన్
ఇన్రియామ్ వన్దోమ్ ఇరంగేలో రెంబావాయ్ || 24 ||

ఇప్పుడు ఈ పాశురము యొక్క భావాన్ని చూద్దాం.

శ్రీకృష్ణుడు శయనమందిరం బయటికి వచ్చి ఆస్థానంలో సింహాసనముపై ఆసీనుడివి కావాలని ఆమె మరియు ఆమె సఖులు ప్రార్థిస్తున్నారు. దేవేరి నప్పిన్నాయ్ తో సహా, కృష్ణుడు సింహాసనముపై ఆశీనుడయ్యాడు. ఆయన నడిచివచ్చిన తీరు సింహం నడకని మరిపించిందట. ఆయన నడకను చూసిన గోపికలు అద్భుతమైన ఆశ్చర్యానికి లోనయ్యారు. భగవంతుడు, పిరాట్టి ప్రసాదించిన దర్శన సౌభాగ్యాన్ని కన్నులపండుగగా తిలకించారు. వారి శ్రీచరణాలకు దృష్టిదోషం అంటకుండా మంగళాశాసనం పలికారు. ఆ తర్వాత వారు అక్కడికి వచ్చిన కార్యాన్ని విన్నవించుకున్నారు. శ్రీ వ్రతం ఆచరించడానికి కావలసిన ఉపకరణాలు అందజేయాలని వేడుకున్నారు. నిరంతర కైంకర్య భాగ్యం ప్రసాదించమని గోపికలు ప్రార్థించారు. గోపికలు ప్రార్థించగా కృష్ణుడు శయ్య మీద నుంచి లేచాడు. ఆయన తన వంక ఒక పెద్దపులి, ఒక సింహం వచ్చినట్లు నడిచి రావడాన్ని చూసి గోపికలు ఆయనకు అడుగడుగునా మంగళాశాసనం సమర్పించారు.

వామనావతార కాలంలో బలిచక్రవర్తి వలన బాధలు పడుతున్న దేవతలను రక్షించడానికి, బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచడానికి, ముల్లోకములను రెండడుగులతో కొలిచిన స్వామీ! అటువంటి మీ పాదారవిందములకు మంగళమగు గాక! శుభమగు గాక! రామావతార కాలమున సీతను అపహరించిన, దక్షిణ దిశగా వున్న లంకాధీశుడూ, దుష్టుడూ అయిన రావణుడున్న చోటికి వచ్చి సుందరమైన లంకను నశింపజేసిన స్వామీ! నీ పరాక్రమమునకు మంగళమగు గాక! జయ మంగళం. నిన్ను అంతం చేయడానికి బండి రూపంలో వచ్చిన శకటాసురుని తన్ని, ఏ ముక్క కి ఆ ముక్క వూడదీసిన నీ కీర్తికి మంగళమగు గాక ! దూడ రూపంలో వచ్చిన వత్సాసురిని కర్రపుల్ల వలె విరిచి, నిన్ను సంహరించడానికి వచ్చిన కపిత్థాసురుని గాలిలోకి ఎగరవేసిన స్వామీ!.....

మీ శ్రీ పాదములకు మంగళమగు గాక! దేవేంద్రుడు కురిపించిన కుంభవృష్టి నుండి గోవులను, గోపాలురను కాపాడడానికి గోవర్ధన పర్వతమును 7 రోజులు గొడుగుగా ఎత్తిన స్వామీ! నీ కృపాగుణమునకు మంగళమగుగాక! శుభమగు గాక! శత్రువులను జయించి, ద్వేషమును నశింపజేయు నీ చేతియందున్న బల్లెమునకు (వేలాయుధమునకు) మంగళమగు గాక! అని ఈ ప్రకారము మంగళాశాసనం చేసి నీ వీర చరిత్రనే పాడడానికి వచ్చాము. మేము నీకు దాసులము. నీ దగ్గరనుండి వాద్య విశేషమును (పఱను) పొందుటకు వచ్చినాము. దయ చూపించు అని వేడుకుంటున్నారు.
ఈ పాశురం తిరుప్పావై ప్రబంధంలో పొదిగిన ఒక ఆభరణం వంటిది. తండ్రి విష్ణుచిత్తుడు లాగే ఆండాళ్ కూడా భగవంతునికి 'పల్లాండు' అంటే మంగళాశాసనం గానం చేసింది.

ఆండాల్ తిరువడిగళే శరణం

No comments:

Post a Comment

Magha Nakshatra - మఖ నక్షత్రం

మఖ నక్షత్రం రాశి : సింహ రాశి గ్రహాధిపతి : సూర్యుడు నక్షత్ర దేవత : పితృదేవతలు (పితృగణాలు – అనునాయక పితృమూర్తులు) శక్తి : "పదవులు, సన్మాన...