Monday, May 4, 2026

Ganga Devi Vishnu Padodbhava - గంగాదేవి విష్ణుపాదోద్భవ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - గంగాదేవి విష్ణుపాదోద్భవ

నారదా! నువ్వు అడగడమూ నేను చెప్పకపోవడమూనా? తప్పకుండా చెబుతాను, విను. గోలోకంలో రాధాకృష్ణుల శరీరాలనుంచి గంగాదేవి ద్రవరూపిణిగా ఆవిర్భవించింది అని చెప్పానుకదా! అప్పటి నుంచీ ఆవిడ జలాధిష్ఠానదేవత అయ్యింది. అద్వితీయ సౌందర్యంతో సర్వాభరణభూషితయై నిత్య యౌవనవిలాసంతో చిరునవ్వులు చిందిస్తూ ఆ పద్మముఖి విరాజిల్లింది. బంగారురంగు మేనిఛాయ. శరచ్చంద్రబింబంలాంటి ముఖం. నిగనిగలాడే శరీరకాంతి. విశాలమైన కటిప్రదేశం. పీనోన్నత వక్షఃస్థలం, విశాలమైన కన్నులు, చంచలమైన వాలుచూపులు, మాలతీపుష్పమాలలతో ఘుమఘుమలాడే కబరీభరం, చెక్కిళ్ళమీద మకరికాపత్రాలు. మంకెన పువ్వుల్లాంటి పెదవులు. దానిమ్మగింజల్లాంటి దంతపంక్తి. తళతళలాడే పరిశుభ్రవస్త్రాలు. ఈ సుందరాంగి ఒకనాడు శ్రీకృష్ణుడి సరసన సిగ్గులు మూటగడుతూ విలాసంగా నిలబడింది. మేలిముసుగులో ముఖం దాచుకుని ఒయ్యారంగా శ్రీ కృష్ణుడిమీదకి వాలుచూపులు నిగుడించింది. రెప్పవెయ్యకుండా కృష్ణుడి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. కామోద్రేకంతో ముఖం వికసించింది. తనువంతా పులకించింది. సంభోగవాంఛ బలంగా పొటమరించింది. పరవశించిపోతోంది.

ఈ దశలో రాధాదేవి హఠాత్తుగా వచ్చింది. చూసింది. పట్టరానంత కోపం వచ్చింది. ఒక్కసారిగా ముఖమూ కన్నులూ ఎర్రకలువలైపోయాయి. విమానంనుంచి దిగింది. శ్రీకృష్ణుడిచ్చిన ఆర్ఘ్యపాద్యాలతో తడితడిగా ఉన్నాయి ఆవిడ పాదపద్మాలు. విస విసా నడుచుకుంటూ వెళ్ళి రత్నసింహాసనం అధిష్టించి కూర్చుంది. ఆమె వెంట గోపగోపీజన సహస్రమూ మహర్షిబృందమూ వెల్లగొడుగులు పడుతూ వింజామరలు వీన్తూ వచ్చారు. వారంతా రత్న సింహాసవానికి ఇరువైపులా బారులుతిరి నిలబడ్డారు.

సింహాసనంమీద కూర్చున్న రాధాదేవికి కోపంతో చెమటలు పోశాయి. సిందూరం చెమ్మగిల్లింది, నుదుటిబొట్టు జారింది. పెదవులు అదురుతున్నాయి. నిట్టూర్పులతో తారహారాలు ఎగురుతున్నాయి, కొప్పులో తురుముకున్న పారిజాత పుష్పమాలికలు కదులుతున్నాయి.

శ్రీకృష్ణుడు సాదరంగా ఎదురువెళ్ళాడు. బెదురుతున్న గుండెలను చిక్కబట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ మధురంగా పలకరించాడు. కుశలప్రశ్నలు వేశాడు. గోపగోపీజనం కృష్ణుడికి నమస్కరించింది. స్తుతించింది. వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవిని స్తుతించాడు. గంగాదేవికూడా భయపడుతూనే చేరవచ్చి కుశలప్రశ్నలు వేసి అద్భుతంగా స్తుతించింది. ఎండిపోతున్న గొంతునీ పెదవులనూ తడుపుకుంటూ భయం భయంగా తలవంచుకుని నిలుచుంది. శ్రీకృష్ణుడి పాదపద్మాలనే ధ్యానించుకుంటూ ధైర్యం చెప్పుకుంటోంది. శ్రీకృష్ణుడు అది గమనించి రహస్యంగా గంగాదేవికి అభయమిచ్చాడు. దానితో ధైర్యం తెచ్చుకున్న గంగమ్మ తల ఎత్తి సింహాసనంమీద ఉన్న రాధాదేవిని తేరిపార చూసింది.

తళతళలాడుతున్న కాంతిపుంజంలాగా ఉంది రాధాదేవి. చూపులకు హాయిగా ఉంది. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తోంది. అసంఖ్యాక బ్రహ్మలకు ఆవిడ సృష్టికారిణి. సృష్టికే ఆది సృష్టి. సనాతని. ఎప్పుడూ పన్నెండేళ్ళ ప్రాయంలోనే ఉండే ప్రారంభయౌవన. నిత్యకన్య, రూపగుణాలలో ఈ విశ్వంలో సాటిలేనిది. శాంతస్వరూప. సౌందర్యరాశి. ఆద్యంతరహిత. స్వామి సౌభాగ్యసంయుత. శుభప్రద. సుభద్ర. కృష్ణుడి అర్థాంగి. వయస్సులో తేజస్సులో కాంతిలో అన్నింటా కృష్ణుడికి సమానురాలు. లక్ష్మీ శ్రీహరులతో అర్చింపబడే మహాలక్ష్మి తన కాంతితో గోలోక సభామంటపాన్ని ప్రకాశవంతం చేస్తోంది. చెలికత్తె అందించిన తాంబూలాన్ని విలాసంగా ఆస్వాదిస్తోంది. పుట్టుక లేనిది. కానీ సర్వస్నష్టికీ తానే జనని. కృష్ణప్రాణాధిదేవత. ప్రాణప్రియ. రాసేశ్వరి సురేశ్వరి అయిన ఆ రాధాదేవిని గంగాదేవి రెప్పవెయ్యకుండా తదేకదీక్షతో చూస్తోంది. కన్నులే దోసిళ్ళుగా ఆ సౌందర్యరాశిని గ్రోలుతోంది. ఎంతకీ తనివితీరడం లేదు.

రాధాదేవి ముఖంలో కోపం శాంతించింది. చిరునవ్వు వెల్లివిరిసింది. మధురంగా శ్రీకృష్ణుడిని అడిగింది - ప్రాణేశ్వరా! ఈ కల్యాణి ఎవరు? ఇందాక నీ పక్కనే నిలబడి కాముకదృష్టితో నీ ముఖపద్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. వాలుచూపులు నిగుడిస్తూ పులకించి పరవశించిపోతోంది. మేలిముసుగులో ముఖం కప్పుకుని రెప్పవాల్చకుండా చూస్తోంది. నువ్వుకూడా అలాగే కామివై చూస్తూ పరవశించిపోతున్నావు. చిరునవ్వులు చిందిస్తున్నావు, ఎమిటి ఇదంతా? నేను బతికి ఉండగానే ఈ గోలోకంలో ఇలాంటి దుర్మార్గం జరగడమా? నువ్వే మాటిమాటికీ ఇలాంటి చెడ్డపనులు చేన్తున్నావు. నేనేమో ఆడదాన్ని కనక మనస్సు మెత్తన కనక నీ మీద ప్రేమతో ఓరిమి వహిస్తున్నాను. ఇక భరించలేను. పద, నువ్వూ నేనూ ఈ గోలోకంనుంచి వెళ్ళిపోదాం. లేకపోతే నువ్వు నాకు దక్కేట్టులేవు. నీకు ఇక్కడ భద్రతలేదు. పద, నన్ను తీసుకుపో. నువ్వు లంపటుడివి.

ఒకప్పుడు చందనారణ్యంలో విరజతో కనిపించావు. చెలికత్తెలు చెప్పారని ఊరుకున్నాను. నా అలికిడి విని నువ్వు అప్పుడు అదృశ్యమయ్యావు. పాపం ఆ విరజాదేవి శరీరం విడిచిపెట్టి నదిగా మారిపోయింది. ఇప్పటికీ నీ సత్కీర్తికి చిహ్నమై ప్రవహిస్తూనే ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఆ చందనారణ్యానికి వెళ్ళి విరజా! విరజా! అంటూ పరితపించావు. నీ వేదన చూడలేక యోగశక్తితో ప్రవాహం నుంచి బయటికి వచ్చి విరజాదేవి సాలంకృతమూర్తియై నీకు దర్శనమిచ్చింది. ఆమెను కౌగిలించుకుని సుఖించావు. నీ కలయికతో ఆవిడ గర్భం ధరించింది. సప్త సముద్రాలను ప్రసవించింది.

మరొకసారి చంపకారణ్యంలో శోభ అనే గోపికతో కనిపించావు. అప్పుడూ అంతే నా అలికిడి విని కంటికి కనిపించకుండా పారిపోయావు. ఆ గోపిక శరీరం విడిచిపెట్టి చంద్రమండలంలోకి శోభగా వెళ్ళిపోయింది. నువ్వు గుండెను రాయిచేసుకుని ఆవిడ తేజస్సుని విభజించి కొంత రత్నానికీ, కొంత బంగారానికీ, కొంత స్త్రీల ముఖాలకీ, కొంత రాజులకీ, కొంత చిగురాకులకీ, కొంత పువ్వులకీ, కొంత పక్వఫలాలకీ, కొంత పంటలకీ, కొంత రాజదేవమందిరాలకీ, కొంత శిశువులకీ, కొంత క్షీరానికీ పంచిపెట్టావు.

ఇంకొకసారి నువ్వు ప్రభ అనే గోపికతో బృందావనంలో పొదపొదలోనూ కనిపించావు. అప్పుడూ అలాగే నా అలికిడికి మాయమయ్యావు. పాపం ఆ ప్రభ శరీరం విడిచిపెట్టింది. సూర్యమండలానికి వెళ్ళిపోయింది. నువ్వేమో విలపించి విలపించి సిగ్గుతోనూ నా భయంతోనూ ఆ ప్రభను కొంత నీ కన్నుల్లో దాచుకున్నావు. కొంత అగ్నికీ, కొంత యక్షులకీ, కొంత పురుషసింహాలకీ, కొంత దేవతలకీ, కొంత విష్ణుజనులకూ, కొంత నాగజాతికీ, కొంత బ్రాహ్మణులకూ, కొంత మునులకీ, కొంత తపస్వులకూ కొంత సౌభాగ్యవతులకూ, కొంత యశస్వంతులకూ విభజించి ఇచ్చావు.

ఒక వసంత ఋతువులో రాసమండలాన నువ్వు శాంతి అనే గోపికతో పుష్పశయ్యమీద కనిపించావు. రత్నదీపాలంకృతమైన మందిరాలలో కనిపించావు. ఆవిడ ఇచ్చిన తాంబూలాన్ని ఆస్వాదిస్తూ పుష్పమాలికలతో చందనచర్చలతో ఆనందించావు. నా అలికిడి విని కనుమరుగయ్యావు. శాంతి శరీరం విడిచిపెట్టి నిలో లీనమయ్యింది. నువ్వు ఎంతగానో రోదించావు. అప్పుడూ అలాగే ఆ శాంతిని విభజించి కొంత బ్రహ్మకూ, కొంత నాకూ, కొంత లక్ష్మీదేవికీ, కొంత నీ మంత్రోపాసకులకూ, కొంత శాక్తేయులకూ, కొంత తపస్వులకూ, కొంత ధర్ముడికీ పంచిపెట్టావు.

మరొకసారి క్షమ అనే మరో గోపికతో ఆనందించి ఆవిడ కౌగిటిలో పరవశించి అలాగే  పుష్పశయ్య మీద నిద్రించావు. ఆమెకూడా అలాగే మైమరిచి నిద్రించింది. నేను వచ్చి మీ ఇద్దరినీ నిద్ర లేపాను. గుర్తు తెచ్చుకో. నీ పట్టువస్త్రాన్ని మురళినీ వనమాలనూ కౌస్తుభహారాన్నీ రత్నకుండలాలనూ ఊడలాక్కున్నాను. తరవాత నా సఖీజనం గోలపెడితే పోనీలే అని నీమీద ప్రేమతో తిరిగి ఇచ్చేశాను. గుర్తుందా? నువ్వు ఆ సిగ్గుతోనో ఆ పాపంతోనో మరీ కృష్ణవర్ణుడివైపోయావు ఆ క్షణంలో.

క్షమాదేవి సిగ్గుతో ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయింది. మునుపటి సంఘటనల్లోలాగానే  ఆవిడ శరీరం గుణశ్రేష్ఠమయ్యింది. నువ్వు ఆవిడమీద ప్రేమతో విలపించి విలపించి ఆ క్షమను కొంత విష్ణువుకీ, కొంత వైష్ణవులకూ, కొంత ధార్మికులకూ, కొంత ధర్ముడికీ, కొంత దుర్బలులకీ, కొంత తపస్వులకూ, కొంత వేదపండితులకూ పంచి ఇచ్చావు.

మహాప్రభూ! ఇవ్వి నీ కథలు. ఇంకా ఉన్నాయి, వినాలనుకుంటే చెప్పు ఒక్కొటొక్కటీ గుర్తు చేస్తాను. నీ కథలు అన్నీ తెలిశాయి కానీ నీ గుణంమాత్రం అంతుబట్టడం లేదు,

ఇలా రాధాదేవి సున్నితంగా శ్రీ కృష్ణుణ్ణి దెప్పిపాడుస్తూంటే గంగాదేవి సిగ్గుతో ముడుచుకుపోయి తలవంచుకుని నేలగీరుతూ నిల్చుంది. రాధమ్మ గంగవైపు తిరిగింది. ఎదో మాట్లాడబోయింది. ఆది గమనించిన గంగమ్మ తన యోగశక్తితో మాయమై జలప్రవేశం చేసింది. సిద్ధయోగినియైన రాధాదేవి అది గుర్తించి సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న జలాన్నీ త్రాగివెయ్యడానికి ఉపక్రమించింది. ఈ రహస్యాన్ని గుర్తించిన గంగమ్మ అదృశ్యరూపంతో వచ్చి శ్రీ కృష్ణుడి పాదపద్మంలో ప్రవేశించి శరణువేడింది.

రాధాదేవి విజృంభించి గోలోక వైకుంఠలోక బ్రహ్మలోకాల్లో ఉన్న గంగాజలాన్ని అంతటినీ త్రాగేసింది. గంగాదేవి కనిపించలేదు. లోకాలన్నీ జలశూన్యమైపోయాయి. భూగోళం ఎండిపోయిన తామర పువ్వు అయ్యింది. ఎక్కడ చూసినా జలజంతు మృతదేహాలే. బ్రహ్మవిష్ణుమహేశ్వరాది దేవతలూ మునులూ మనువులూ ఎండిపోతున్న గొంతుకలతో దాహార్తులై గోలోకానికి వచ్చి పడ్డారు. కనిపించని గోలోక గోవిందుడికి సాష్టాంగ పడ్డారు. గోవిందా! సర్వేశా! పరప్రకృతీ! వరేణ్య! వరదా! వరిష్ఠా! వరకారణా! గోపికావల్లభా! గోపనాయకా! ప్రభూ! నిరీహా! నిరాకారా! నిర్లిప్తా! నిరాశ్రయా! నిర్గుణా! నిరుత్పాహా! నిర్వికారా! నిరంజనా! స్వేచ్చామయా! సాకారా! సత్త్వస్వరూపా! సత్యంశా! సాక్షీరూపా! సనాతనా! పరమాత్మా! పరమా! పాహి, పాహి అంటూ వేడుకున్నారు. దర్శనం ఇమ్మని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన శ్రీకృష్ణుడు - గోపగోపీజన సంసేవ్యమానుడై రాధికా వక్షఃస్థలంమీద పరుండి ఆమె అందిస్తున్న తాంబూలాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యక్షమయ్యాడు.

బ్రహ్మాదిదేవతలంతా సంతోషించారు. ఎవరు చెప్పాలి, ఎమి చెప్పాలి అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అందరూ కలిసి బ్రహ్మను ముందుకు నెట్టారు. విష్ణుమూర్తినీ వామదేవుణ్ణి కుడి ఎడమల తోడుగా నిలుపుకుని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి సన్నిధికి వెళ్ళాడు. ఆ రాసమండలంలో బ్రహ్మదేవుడికి అంతా కృష్ణమయంగా కనిపించింది, అందరిదీ ఒకే వేషం, ఒకే రూపం, ఒకే అలంకరణ, ఒకే వయస్సు, ఒకే ఆసనం. అందరూ ద్విభుజులే. మురళీహస్తూలే. వనమాలాధారులే. మయూరపింఛాలంకృతులే. కౌస్తుభభూషితులే. అందరూ శ్రీకృష్టపరమాత్మలే. ఎవరు సేవ్యులో ఎవరు సేవకులో తెలియలేదు. ఎవరికి చెప్పాలో ఏమి చెప్పాలో తోచలేదు. క్షణకాలం తేజస్ప్వరూపం కనపడుతోంది. మరుక్షణంలో రూపం కనపడుతోంది. ఇంకో క్షణంలో నిరాకారం, మరో క్షణంలో సాకారం. ఇంకొక క్షణంలో నిరాకార సాకార సంయుతం. ఒక క్షణంలో శ్రీకృష్ణుడు ఒంటరిగా కనపడుతున్నాడు. మరుక్షణంలో రాధాసమేతుడై కనపడుతున్నాడు. రాధారూపంలో కృష్ణుడూ, కృష్ణరూపంలో రాధ కనపడుతున్నారు. ఎది స్త్రీ రూపం? ఏది పురుషరూపం? బ్రహ్మదేవుడే పోల్చుకోలేకపోయాడు. ఇక ఇదికాదు పద్ధతి అనుకొని కళ్ళుమూసుకుని హృదయపద్మంలో ఉన్న శ్రీ కృష్ణపరమాత్మను ధ్యానించాడు. భక్తితో స్తుతించాడు. అతడి ఆజ్ఞతో కన్నులు తెరిచి ఎట్టయెదుట రాధావక్షఃస్థలస్థితుడైన శ్రీ కృష్ణుణ్ణి దర్శించాడు. మళ్ళీ నమస్కరించి స్తుతించాడు.

బ్రహ్మాదిదేవతలు ఎందుకు వచ్చారో వారు చెప్పకుండానే గ్రహించిన శ్రీకృష్ణుడు చిద్విలాసంగా ఆప్యాయంగా పలకరించాడు. విరించీ! కుశలమా? దా. కమలాపతీ? క్షేమమా? పైకిరా. మహాదేవా! బాగున్నావా? ఇటు రా. మహాభాగులు మీరంతా వచ్చారు గంగకోనమని. కదూ! రాధాదేవికి భయపడి గంగమ్మ నన్ను శరణువేడింది. నా పాదపద్మంలో దాక్కొంది. మీకు ఇస్తాను. కానీ ఆవిడ భయాన్ని తొలగించండి - అన్నాడు.

ఈ మాటలకు బ్రహ్మదేవుడి ముఖంలో అప్రయత్నంగా చిరునవ్వు విరిసింది. వెంటనే చతుర్వదనాలతో చతుర్వేదాలతో రాధాదేవిని స్తుతించాడు. అమ్మా! రాధికా! ఈ గంగ రాసమండలంలో నీ శరీరంనుంచి జన్మించింది. శంకరుడి సంగీతానికి కరిగిపోయిన మీ దంపతులే ఈ రూపం. కృష్ణాంశతోనూ నీ అంశతోనూ అవతరించింది. మీకు అత్యంత ప్రీతిపాత్రయైన కన్యక. నీ మంత్రాన్ని స్వీకరించి భక్తితో నిన్ను పూజిస్తుంది. వైకుంఠేశ్వరుడైన చతుర్భుజుడు ఈమెకు భర్త అవుతాడు. భూలోకంలో ప్రవహించే ఈవిడ కళకు సముద్రుడు వల్లభుడవుతాడు. గోలోకంలో ఊన్న గంగమ్మయే సర్వలోకాలలోనూ ఉంటుంది. అవన్నీ కళాంశరూపాలు. నువ్వు సాక్షాత్తూ కన్నతల్లివి. దేవేశివి. ఈ గంగ నీకు కూతురులాంటిది.

బ్రహ్మదేవుడి ప్రసంగానికి రాధాదేవి సంతోషించింది. కోపం విడిచిపెట్టి చిరునవ్వులతో ప్రసన్నురాలయ్యింది. అప్పుడు గంగాదేవి శ్రీకృష్ణుడి పాదాంగుష్టం నుంచి బయలువెడలింది. అందరూ అమెను సత్కరించి గౌరవించారు. ఆ జలాధిష్టానదేవత ఆ సభాస్థలంలో మౌనంగా నిలచింది, మెల్లగా జలరూపాన నదిగా మారింది. ఆ నీటిని కొంచెం తన కమండలువులోకి తీసుకున్నాడు బ్రహ్మ. చంద్ర శేఖరుడు కొంచెం శిరస్సుమీద నిల్పుకున్నాడు.

అటుపైని చతుర్ముఖుడు గంగాదేవికి రాధామంత్రాన్ని స్తోత్ర కవచ ధ్యాన పూజావిధానాలళో సహా ఉపదేశించాడు. అది అంతా సామవేదోక్తం. మంత్రోపదేశం పొంది గంగాదేవి రాధికను పూజిం వైకుంఠానికి వెళ్ళిపోయింది. లక్ష్మి - తులసి - గంగ - సరస్వతి - వీరు నలుగురూ నారాయణుడికి  ప్రియాంగనలు.

అప్పుడు శ్రీ కృష్ణపరమాత్మ మేఘగంభీరస్వరంతో ప్రసంగించాడు. బ్రహ్మ విష్ణుమహేశ్వరులారా! దేవతలారా! మునులారా! మనువులారా! అందరూ వినండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరంతా అదృష్టవంతులు. భాగ్యశాలులు. మీరంతా కాలచక్రంతో నిమిత్తంలేకుండా ఈ గోలోకంలో శాశ్వతంగా నివసిస్తారు. ఇప్పుడు కల్పాంతమయ్యింది. సృష్టి అంతా జలమయమయ్యింది. ఇతర విశ్వాలూ ఆ విశ్వాలలో ఉన్న బ్రహ్మాదులూ అందరూ జలమగ్నులయ్యారు. వైకుంఠం తప్ప అన్నీ జలమయమైపోయాయి, చతుర్వదనా! నువ్వు వెంటనే వెళ్ళి పునస్సృష్టి చెయ్యి. బ్రహ్మలోకంతో మొదలుపెట్టి సర్వలోకాలమా సృష్టించు. అటుపైని గంగాదేవి వస్తుంది. ఇలాగే ఇతర విశ్వాలనూ అక్కడ బ్రహ్మాదులనూ నేను సృష్టిచేస్తాను. నువ్వు ఈ దేవతలతో కలిసి వెంటనే వెళ్ళు. ఇప్పటికి చాలాకాలం గడిచింది. చాలామండి చతుర్ముఖులు ఆంతరించారు. మళ్ళీ ఆవిర్భవించారు. ఇది కాలరహస్యం. నాకుమాత్రమే తెలుసు - అని చెప్పి రాధాసహితుడై అంతఃపురంలోకి  నిష్క్రమించాడు.

బ్రహ్మాది దేవతలు పునస్సృష్టికి ఉద్యుక్తులై బయలుదేరారు. గోలోకంలో ఉన్న గంగ బహ్మదేవుడు సృష్టించిన ప్రతిలోకానికీ క్రమక్రమంగా వెళ్ళింది. ముందుగా వైకుంఠానికి అటుసైని శివలోకానికీ ఆపైని బ్రహ్మలోకానికీ అటుతరువాత భూమ్యాదిలోకాలకూ ప్రవహించింది.

నారదా! విష్ణుపాదంలోనుంచి ఆవిర్భవించి విష్ణుపదిగా కీర్తింపషబడిన గంగాదేవి పుణ్యగాథ ఇది. మరింక ఏ మంగళప్రదమైన వృత్తాంతాన్ని. వినాలనుకుంటున్నావో చెప్పు తెలియజేస్తాను. అని  ముగించాడు నారాయణ మహర్షి.

గంగా-వైకుంఠుల పరిణయం


No comments:

Post a Comment

Mahabaleshwar Temple - Mahabaleshwar- Maharashtra - మహాబలేశ్వర్ దేవాలయం - మహాబలేశ్వర్ - మహారాష్ట్ర

మహాబలేశ్వర్ దేవాలయం,  మహాబలేశ్వర్, మహారాష్ట్ర మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న మహాబలేశ్వర్ ఆలయం (పాత మహాబలేశ్వర్) 16వ శతాబ్దానికి చెందిన ప...