మహర్షీ! గంగానదికి “త్రిపథగ” అనేపేరు ఉంది అన్నావు. అది ఎలా ఎర్చడింది ? ఎలా ఎక్కడెక్కడ ఆ నది మూడు మార్గాలలో ప్రవహించింది? అక్కడి ప్రజలు ఎవరు? ఈ విశేషాలు తెలుసుకోవాలని ఉంది - అన్నాడు నారదుడు. వెంటనే నారాయణమహర్షి ఆరంభించాడు-
గోలోకంలో ఒక కార్తికపూర్ణిమనాడు రాధామహోత్సవం జరిగింది. రాసమండలంలో రాధాదేవిని పూజించి శ్రీకృష్ణుడు ఆమె సన్నిధిలో మహోల్లాసంగా ఉన్నాడు. రాధాదేవికూడా పూజలు అందుకొన్న ఆనందంలో ఉత్సాహంగా ఉంది. బ్రహ్మాదిదేవతలూ సనకననందనాది మహర్షులూ రాధాకృష్ణులను పరివేష్టించి కొలువుతీరి కూర్చున్నారు. అంతలోకి సరస్వతీదేవి తన వీణను శ్రుతిచేసి కృష్ణస్తుతిరూపమైన సంగీతాన్ని అత్యద్భుతంగా వినిపించింది. అందరూ సంతోషించారు. కానుకలు కురిపించారు. బ్రహ్మ దేవుడు రత్నహారాన్నీ, శివుడు మణిహారాన్నీ కృష్ణుడు కౌస్తుభహారాన్నీ, రాధాదేవి మాణిక్యహారాన్నీ, నారాయణుడు మరో మనోహరమాలికనూ, లక్ష్మి కనకకుండలాలనూ, దుర్గాదేవి బ్రహ్మభక్తినీ, ధర్ముడు ధర్మబుద్దిని, అగ్నిదేవుడు పరిశుభ్రవస్త్రాన్నీ, వాయుదేవుడు మణినూపురాలనూ కానుకలుగా మెచ్చి సమర్పించారు.
బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రేరేపించి నువ్వుకూడా కృష్ణసంగీతం వినిపించు అని కోరాడు. శివుడు విజృంభించి గానం చేశాడు. శ్రోతలందరూ పరవశించి మైమరిచిపోయారు. శిలాప్రతిమలైపోయారు. ఆ పారవశ్యంనుంచి నెమ్మదిగా తేరుకుని కళ్ళు తెరిచి చూసేసరికి గోలోకమంతా జలమయమై కనిపించింది రాధాకృష్ణులు ఏమైపోయారో కనపడలేదు. అందరూ అంతటా వెదికి వేసారారు. దుఃఖం పట్టలేక గోపగోపీజనమూ దేవతలూ పెద్దపెట్టున విలపించారు. ఏమి జరిగిందో తెలుసుకుందామని బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చుని అంతర్దృష్టిని సారించాడు. శివుడి సంగీతానికి కరిగిపోయి రాధాకృష్ణులు ద్రవరూపం చెందారని గ్రహించాడు.
ఆ విషయాన్ని విష్ణు మహేశ్వరులకు తెలియజెప్పాడు. అందరూ కలిసి రాధాకృష్ణుల సందర్శనం కోసమని పరాత్పరుణ్ణి స్తుతించారు. అంతలోకీ అశరీరవాణి వినిపించింది. అది శ్రీకృష్ణుడి కంఠమే.
బ్రహ్మాది దేవతలారా! ఈ జలమంతా మా స్వరూపమే. దీన్ని మీరు ఉపాసించండి, ఆరాధించండి. పూర్ణరూపాలలో మమ్మల్ని చూడాలనుకుంటే శివుడు నా ఆజ్ఞను పాటించాలి. వేదశాస్త్రాలను అవలోడించి అపూర్వ మంత్రాలను సేకరించి స్తోత్రాలను నిర్మించి ధ్యానమంత్రస్తోత్ర కవచయుతంగా పూజావిధానం ఏర్పరిచి నన్ను పూజించాలి. అది నా మంత్రం కావాలి. ఆ మంత్రాన్నీ ఆ పూజావిధానాన్నీ గోప్యంగా ఉంచాలి, లక్షకు ఒకడుమాత్రమే మన్మంత్రోపాసకుడు కావాలి. అతడు గోలోకవాసి అవుతాడు. కొందరు భూలోకవాసులూ కొందరు స్వర్గలోకవాసులూగా ఏర్పాటు ఉండాలి. లేకపోతే సృష్టి అంతా నిష్ఫలమవుతుంది. ప్రతిజ్ఞాపూర్వకంగా శివుడు ఈ పూజను ఆచరిస్తే మేము మీకు దర్శనం ఇస్తాం. లేకపోతే లేదు.
అశరీరవాణిగా శ్రీకృష్ణుడు వినిపించిన ఆజ్ఞను శివుడు శిరసావహించాడు. అతడు జ్ఞానానికి అధిదేవత. వెంటనే అక్కడి జలాన్ని దోసిటిలోకి తీసుకుని విష్ణుమాయామహామంత్రాలను జపించి స్తోత్రాలను సమకూర్చి అర్చించాడు. ఈ నీటిని స్పృశించి అసత్యం పలికినవాళ్ళు శాశ్వతంగా కాలసూత్రమనే నరకానికి పోతారు అని ప్రతిజ్ఞ చేశాడు.
శంకరుడు ఇలా పలకగానే రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారు. గోపగోపీసురబృందాలు ఆనందంతో కేరింతలు కొట్టారు. మళ్ళీ మహోత్సవం జరిపారు. అటుపైని శివుడు ముక్తిదీపాన్ని వెలిగించాడు.
నారదా! ద్రవరూపం చెందిన రాధాదేవియే ఈ గంగానది. రాధాకృష్ణుల సంయుక్తరూవంగా గోలోకంలో ఆ నది అర్చింపబడుతోంది. భుక్తిముక్తి ప్రద. శ్రీకృష్ణుడు లోకానుగ్రహకాంక్షతో ఈ గంగానదిని ముల్లోకాలకూ ప్రవహింపజేసి అక్కడక్కడ నిలువరించాడు. కృష్ణస్వరూపగా సర్వబ్రహ్మాండపూజిత అయ్యింది ఈ పవిత్ర నదీమతల్లి.
నారాయణ మహర్షి! కలియుగంలో అయిదువేల సంవత్సరాలు గడిచాక మరి ఈ గంగానది ఎక్కడికి వెళ్ళింది ?
నారదా! సరస్వతి శాపంవల్లకదా గంగాదేవి భారతభూభాగానికి వచ్చింది. అయిదువేల సంవత్సరాల తరవాత శాపవిమోచనమై మళ్ళీ వైకుంఠానికే వెళ్ళిపోయింది. అలాగే సరస్వతీ పద్మావతీనదులూ లక్ష్మీదేవి తులసి వీరంతా హరిసన్నిధికే చేరుకున్నారు. గంగా లక్ష్మీసరస్వతులతోపాటు నాల్గవదిగా తులసి కూడా నారాయణప్రియ అయ్యింది.
మహర్షీ! నాది మరొక చిన్న సందేహం. గంగాదేవిని విష్ణుపాదోద్భవ అంటారుకదా! ఒకసారి ఎప్పుడో బ్రహ్మదేవుడి కమండలువులో బందీ అయ్యిందిట. ఎవరో చెప్పగా విన్నాను. ఆ వృత్తాంతం సమగ్రంగా తెలుసుకోవాలని ఉంది. తెలియజెప్పవూ!
నారదా! సరస్వతి శాపంవల్లకదా గంగాదేవి భారతభూభాగానికి వచ్చింది. అయిదువేల సంవత్సరాల తరవాత శాపవిమోచనమై మళ్ళీ వైకుంఠానికే వెళ్ళిపోయింది. అలాగే సరస్వతీ పద్మావతీనదులూ లక్ష్మీదేవి తులసి వీరంతా హరిసన్నిధికే చేరుకున్నారు. గంగా లక్ష్మీసరస్వతులతోపాటు నాల్గవదిగా తులసి కూడా నారాయణప్రియ అయ్యింది.
మహర్షీ! నాది మరొక చిన్న సందేహం. గంగాదేవిని విష్ణుపాదోద్భవ అంటారుకదా! ఒకసారి ఎప్పుడో బ్రహ్మదేవుడి కమండలువులో బందీ అయ్యిందిట. ఎవరో చెప్పగా విన్నాను. ఆ వృత్తాంతం సమగ్రంగా తెలుసుకోవాలని ఉంది. తెలియజెప్పవూ!
No comments:
Post a Comment