Monday, March 9, 2026

Daksha cursed Narada to wander the universe forever without a fixed home - దక్షుండు నారదుని శపియించి ప్రజాసర్గం బొనరించుట

దక్షుండు నారదుని శపియించి ప్రజాసర్గం బొనరించుట

అది ఎలాగంటే - వీరు బాలురు. దేవఋషి పితృబుణాలు తీర్చుకోలేదు. ఏ కర్మలను చేయలేదు. కర్మల అనిత్యత్వాన్ని వీరెరుగరు. అటువంటి చిన్నపిల్లల బుద్దిని తప్పుత్రోవ పట్టించి వారిని ఈ లోకంలోను, పరలోకంలోను కూడా శ్రేయస్సు పొందకుండగా చేశావు. నీవు చేసిన ఈ పాపంవలన భగవద్భక్తులందరిలోను సిగ్గులేని వాడవై అపకీర్తి పాలవుతావు. నా పుత్రులు నిరపరాధులు. నీపైనవారికి శత్రుత్వం లేదు. అటువంటివారికి ద్రోహం చేశావు. నీవు తప్ప మిగిలిన భాగవతోత్తములందరూ ప్రాణులపట్ల అనుగ్రహం కలవారే. నీవు చాలా ఆసక్తిగా మిత్రులమధ్య ఉన్న స్నేహబంధాన్ని ఛేదిస్తావు. నీవలన మిత్రులమధ్య విరోధం ఏర్పడుతుంది. శత్రుత్వాలు నీవలన శాంతింపవు. ఇకపైన ఎవరికీకూడా విషయసుఖాలు అనుభవించకుండా అవి దుఃఖహేతువులనే విషయం తెలియదు. జ్ఞానం స్వయంగా కలుగుతుందేతప్ప నీబోటివాళ్ళు చెప్పినంతమాత్రాన కలుగదు. నీవు నిరంతరం లోకాలన్నీ తిరుగుతూనే ఉంటావు. నీకెక్కడా నివాసస్థానమంటూ ఉండదు అని దక్షుడు నిర్దయగా నారదుణ్ణి శపించాడు. అయినా నారదుడు కోపగించుకోలేదు. ఆ శాపాన్ని అంగీకరించాడు. అటువంటి శాంతస్వభావం ఉంటే ఏ వ్యక్తి అయినా అన్ని ద్వంద్వాలకూ అతీతుడయి సర్వేశ్వరుడనబడతాడు కదా!

దక్షుడు ప్రజలను సృష్టించాలనే తన కోరిక తీరకపోవడం చేత చాలా దుఃఖపడ్డాడు. అపుడు బ్రహ్మ వచ్చి సృష్టికి ఉపాయం చెప్పాడు. దక్షుడు తన భార్యయైన అసిక్నియందు అరవైమంది కూతుళ్ళను కన్నాడు. వారిలో పదిమందిని ధర్ముడికిచ్చాడు. పదుముగ్గురిని కశ్యపుడికిచ్చాడు. ఇరవైయేడుగురిని చంద్రుడి కిచ్చాడు. భూతుడి కిద్దరిని, ఆంగిరసుడి కిద్దరిని, కృశాశ్వుడి కిద్దరిని ఇచ్చాడు. చివరి నల్గురిని తార్క్ష్యుడనే పేరుకల కశ్యపుడి కిచ్చాడు. పైన చెప్పిన వరుసలోనే కూతుళ్ళనిచ్చాడు. ఆ కూతుళ్ళ పేర్లు విను.

(ప్రతి వ్యక్తి పుడుతూనే మూడు ఋణాలతో పుడతాడు. అవి దేవఋణం, ఋషిబుణం, పితృఋణం.

దేవఋణం : దేవతలు వర్షాలు కురిపించి తద్ద్వారా మనకాహారాన్ని సమకూరుస్తున్నారు. అందుకు మనం వారికి ఋణపడి ఉన్నాం. ఆ ఋణం తీర్చుకొనే ఉపాయం ఏమిటంటే యజ్ఞాలు చేసి మనం ఇచ్చే ఆహుతులద్వారా వారిని సంతోషపరచడమే.

ఋషిబుణం : ఋషులు మనకు వేద వాఙ్మయాన్నిచ్చారు. అందువలన మనం వారికి ఋణపడి ఉన్నాం. అది తీర్చుకొనే ఉపాయం బ్రహ్మచర్యం. అంటే వేదాధ్యయనం చెయ్యడమే.

పితృఋణం : పితృదేవతలు మనకు శరీరాన్నిచ్చారు. అందువలన మనం వారికి ఋణపడి ఉన్నాం. అది తీర్చుకొనే ఉపాయం వంశం కొనసాగేవిధంగా సత్సంతానాన్ని కనడమే.

ఈ మూడు ఋణాలూ తీర్చుకొనిన తరువాతనే మనస్సును మోక్షమార్గంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇవేవీ తీర్చుకొనని తన పుత్రులను మోక్షమార్గంలో ప్రవేశపెట్టి నారదుడు వారిని భ్రష్టుల్ని చేశాడు - అని దక్షుడి అభిప్రాయం)

దక్షుని కూతుళ్ళు ఎంత పుణ్యం చేశారో కదా! అందరూ సాటిలేని సవతులే అయినా ముల్లోకాలూ వారి సంతానమయ్యేంతగా సంతానవతులయ్యారు. ఏ తల్లి వారిని కన్నదో కదా!

దక్షప్రజాపతికి అరవైమంది పుత్రికలు. వారిలో పదిమంది ధర్ముని భార్యలు. వారి పేర్లు - భానువు, లంబ, కకుప్పు, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప. వారిలో భానువు కొడుకు వేదఋషభుడు. వేదఋషభుని కొడుకు ఇంద్రసేనుడు. లంబయొక్కపుత్రుడు విద్యోతుడు. విద్యోతుని పుత్రులు స్తనయిత్నువులు. కకుబ్దేవి యొక్క పుత్రుడు సంకుటుడు. సంకుటుని పుత్రుడు కీకటుడు. కీకటునికి దుర్గాభిమాని దేవతలు పుత్రులు. దుర్గభూములకధిష్ఠాన దేవతలు జామిదేవియొక్క పుత్రులు. ఆ దేవతల పుత్రులు స్వర్గుడు, నంది.

విశ్వయొక్క పుత్రులు విశ్వేదేవతలు. విశ్వేదేవతలకు సంతానం లేదు. సాధ్యయొక్క పుత్రులు సాధ్యగణాలు. సాధ్యగణాల పుత్రుడు అర్థసిద్ధి. మరుత్వతికి మరుత్వంతుడు, జయంతుడు అని ఇద్దరు పుత్రులు. అందులో జయంతుడు వాసుదేవుని అంశతోపుట్టి ఉపేంద్రుడనే ప్రసిద్ది పొందాడు. ముహూర్తకు మౌహూర్తికులనే పుత్రులు కలిగారు. వారు ప్రాణులకు కాలాన్ననుసరించి ఫలం ఇస్తారు. సంకల్ప కొడుకు సంకల్పుడు. సంకల్పుని కొడుకు కాముడు. వసువునకు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్ముడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు అనే ఎనమండుగురు వసువులు పుట్టారు. వారిలో ద్రోణుని భార్య అభిమతి. వారికి హర్షుడు, శోకుడు, భయుడు అనేవారు జన్మించారు.

ప్రాణుని భార్య ఊర్జస్వతి. వారికి సహుడు, ఆయువు, పురోజవుడు అనే ముగ్గురు పుత్రులు. ధ్రువుని భార్య ధరణి. పురములు వారి సంతానం. అర్కుని భార్య వాసన. వారి పుత్రులు తార్ష్యుడు మొదలయినవారు. అగ్నిభార్య వసోర్ధార. ద్రవిణకాదులు వారి పుత్రులు. అగ్నికి కృత్తికలు కూడా భార్యలు. వారికి స్కందుడు పుత్రుడు. స్కందునికి విశాఖుడు మొదలయినవారు పుత్రులు. దోషుని భార్య శర్వరి. ఆమె పుత్రుడు శింశుమారుడు. అతడు శ్రీహరి అంశతో జన్మించాడు. వస్తువు భార్య ఆంగిరస. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఆమె కొడుకు. విశ్వకర్మ భార్య ఆకృతి. ఆమె పుత్రుడు చాక్షుషమనువు. ఆ మనువునకు విశ్వులు, సాధ్యులు అనేవారు పుత్రులు. విభావసుని భార్య ఉష ఆమె పుత్రులు వ్యుష్టి, రోచిస్సు, ఆతపుడు. ఆతపుని పుత్రుడు పంచయాముడు. అతడు దివసాభిమానిదేవత. భూతుడు శంకరుని అంశతో జన్మించాడు. భూతుని భార్య సురూప. కోట్లాదిమంది రుద్రగణాలు ఆమె పుత్రులు. అంతేకాదు. సురూపకు రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాయుడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు అనేవారు, రుద్రుని అనుచరులయిన ప్రేతలు, వినాయకులు అనేవారు కూడా పుత్రులుగా ఉదయించారు.

అంగిరసుని భార్య స్వధ. పితృగణాలు ఆమె పుత్రులు. అంగిరసుని మరో భార్య సతి. ఆమెకు అథర్వాఖీమాన దేవతలు పుత్రులు. కృతాశ్వుని భార్య అర్చిస్సు. ఆమె పుత్రుడు ధూమ్రకేశుడు. వేదశిరస్సుని భార్య ధిషణ. ఆమెకు దేవలుడు, వయునుడు, మనువు అని ముగ్గురు పుత్రులు. తార్ష్యునకు వినత, కద్రువ, పతంగి, యామిని అని నలుగురు భార్యలు. వారిలో పతంగి సంతానం పక్షులు. యామిని సంతానం మిడుతలు. వినతకు ఇద్దరు కొడుకులు. గరుత్మంతుడు, అనూరుడు, గరుత్మంతుడు శ్రీహరి వాహనం. అనూరుడు సూర్యుని రథసారథి. కద్రువ సంతానం పాములు. కృత్తికాది నక్షత్రాలు చంద్రుని భార్యలు. చంద్రుడు రోహిణియందు అధికాసక్తుడయి తక్కిన భార్యలను పట్టించుకోని కారణంగా దక్షుడు చంద్రుణ్ణి క్షయ రోగగ్రస్తుడవగుము అని శపించాడు. ఆ కారణంగా సంతానం పొందే అర్హత చంద్రునికి లేకపోయింది. అటుపైన దక్షుడు అనుగ్రహించగా క్షీణించిన కళలు తిరిగి చంద్రుణ్ణి చేరాయి. ఇంతేకాక -

ఎవరు కశ్యప ప్రజాపతికి భార్యలో, ఎవరు అలౌకికమైన చరిత్ర కలిగి సమస్త జగత్తుల పూజలందుకుంటున్నారో, ఎవరి పుత్రులు, పొత్రులు బలవంతులయి ముల్లోకాలను పరిపాలించారో, ఎవరికి కొంగుబంగారమై ఎంత వ్యయం చేసినా తరుగని పుణ్యం ఉందో అటువంటి కశ్యపుని భార్యల యొక్క నానావిధాలయిన సంతతిని స్పష్టంగా నిరూపించడం అసాధ్యం. సంతానవతులయిన ఆ ప్రసిద్ధ సాధ్వీమణుల పేర్లు, వారి వంశాలు చెప్తాను. ఓ రాజా! విను.

(ముంగొంగు బంగారం అనేది తెలుగు జాతీయం. మూల్గుపుణ్యం అంటే ఎంత తీసినా తరగకుండా గుట్టలు గుట్టలుగా పడి ఉందనీ, ముంగొంగు బంగారం అంటే అవసరమయిన వెంటనే వాడుకునేందుకు వీలయినది, విలువైనది అని అర్ధం.)

మూడు లోకాల్లో ఉన్న ప్రాణులన్నీ అదితి, దితి, కాష్ఠ, దనువు, అరిష్ట తామ్ర, క్రోధవశ, సురస, సురభి, ముని, తిమి, ఇళ, సరమల సంతానమే.

తిమికి చేపలు మొదలగు జలచరాలు పుట్టాయి. సరమకు వ్యాఘ్రాది క్రూరజంతువులు పుట్టాయి. సురభికి దున్నపోతులు, ఆవులు మొదలయినవి జన్మించాయి. తామకు డేగలు, గద్దలు పుట్టాయి. మునికి అప్సరసలు, ఇళకు చెట్టు, చేమలు, క్రోధవశకు పాములు, సురసకు రాక్షసులు, అరిష్టకు గంధర్వులు, దనువునకు సుప్రసిద్ధ బలంకల పద్దెనిమిది మంది దేవతాశత్రువులయిన రాక్షసులు జన్మించారు. వారి పేర్లు, వంశాలు విను.

కశ్యపుని భార్యలలో దనువొకతె. ఆమె పుత్రులు పద్దెనిమిదిమంది. వారి పేర్లు - ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, ఆయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి దుర్జయుడు. వీరిలో స్వర్భానువు కూతురు సుప్రభ, ఆమె భర్త నముచి. వృషపర్వుని కూతురు శర్మిష్ట ఆమె భర్త యయాతి. అతడు నహుషుని కొడుకు. వైశ్వానరునకు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక అని నలుగురు పుత్రికలు. ఉపదానవి హిరణ్యాక్షుని భార్య. హయశిర భర్త క్రతువు. పులోమకాలకలను బ్రహ్మవాక్యముపై కశ్యపుడు వివాహమాడాడు. పులోమకు పౌలోములు, కాలకకు కాలకేయులు పుట్టారు. వారు సమరకోవిదులు. పొలోమకాలకేయులకు అరువదివేలమంది రాక్షసులు జన్మించారు. వారు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు. ఇంద్రుని ప్రీతి కొరకు నీ తాతగారైన అర్జునుడు వారిని వధించాడు. విప్రచిత్తికి సింహికయందు రాహువు, వందమంది కేతువులు మొత్తం నూట ఒక్కమంది జన్మించారు. వారు గ్రహాలు. ఆదిపురుషుడైన శ్రీహరి తన అంశతో అదితియందు జన్మించాడు. అంత అదృష్టవంతురాలయిన అదితి వంశం విను. వివస్వంతుడు, అర్యముడు, పూషుడు, త్వష్ట సవిత, భగుడు, ధాత, విధాత, అరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు అనే పేర్లుకల పన్నెండుగురు సూర్యులు అదితికి జన్మించారు. వివస్వంతునికి యముడు, యమి అనే కవలలు కలిగారు. సంజ్ఞ ఆడుగుర్రం రూపం ధరించి అశ్వినీ దేవతలను కన్నది. వివస్వంతుని మరో భార్య ఛాయ. ఆమెకు శని, సావర్ని అనే మనువు, తపతి అనే కూతురు పుట్టారు. తపతి భర్త సంవరణుడు. అర్యముని భార్య మాతృక. వారి సంతానం చర్షణులు. వారు వివేకంకల వారయిన కారణంగా వారిని ఆధారంగా చేసుకొని బ్రహ్మ మానవజాతిని రచించాడు. పూషుడు భర్గుని చూచి నవ్వగా అతడు కోపగించి పూషుని పళ్ళు రాలగొట్టాడు. అప్పటి నుంచి అతనికి పిండే తిండి. ఆ పూషునికి సంతానం లేదు. త్వష్టయొక్క భార్య రచన. ఆమె దితిపుత్రులకు చెల్లెలు. త్వష్ట రచనల కొడుకు విశ్వరూపుడు. దేవతలు బృహస్పతికి కోపం వచ్చేవిధంగా ప్రవర్తిస్తే బృహస్పతి దేవతలను విడిచి వెళ్ళిపోయాడు. అపుడు దేవతలు విశ్వరూపుణ్ణి తమ గురువుగా స్వీకరించారు. ఈ విధంగా శుకమహర్షి చెప్పగా పరీక్షిన్మహారాజు ఇలా అడిగాడు.

దేవాసుర యుద్ధ ప్రారంభము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

Pitru Shapam(Sapam) Stree Shapam Dosha(Dosham) - పితృశాపం - స్త్రీ శాపం

పితృశాపం - స్త్రీ శాపం

తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలి అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. అడిగి కనడం కాదు, వారిని తల్లిదండ్రులుగా నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకూ అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. 

సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించనందువలన పితృశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు, సంతానం కలగదు, వ్యాపారంలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం అనుభవిస్తుంది. 

అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు. పిల్లలను చూసి తల్లిదండ్రులు భాధ పడతారు. నిజానికి అనుభవించేవారికంటే వారిని చూసేవారి బాధే అధికంగా ఉంటుంది. 

'గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పీడోపశాంతయే' అని శాస్త్ర వాక్కు. గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే భాద తొలగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు, అతడు తన కర్మతో పటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై దాని ప్రభావం ఉంటుంది. ఈ లోకంలో ఉండే అన్ని జీవుల్లో దేవుడు ఉన్నాడు. తెలిసో తెలియకో ఇతరులను విమర్శించడం అంటే దేవుడిని అవమానించడం, విమర్శించడమే. అదికూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది. 

పచ్చని చెట్లపై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు/చెట్లను నరికితే, అది జాతకంలో గురుదోషంగా కనిపిస్తుంది. కళ్ళ ముందే పిల్లలు మరణించడం, స్త్రీ సంతానం ఉంటే వారు వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి. అంటే ఆ పిల్ల పుటింట్లో కూర్చుని ఏడుస్తుంది, ఆమెను చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలుంటాయి. దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, పిల్లలున్న వాడివి పచ్చని చెట్లు కొడుతున్నావ్, ఎంత తప్పు చేస్తున్నావో అని పెద్దలంటారు. 

కొందరు భూములు లాక్కుంటారు. ముఖ్యంగా రాజకీయనాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమసంపాదనను సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో, మరొక విధంగానో భూములులను ఆక్రమించుకుంటారు. వ్యవసామే మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమసంపాదనను చూపి సక్రమం చేసుకుంటారు. 

ఒక కుటుంబంలోని వారికీ ఒక భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు, దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే, పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మరి లాక్కున వారి కడుపు కొడుతుంది. వారి పిల్లలు అకాల మరణం చెందుతారు. లేదా జీవచ్ఛవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ  తల్లిదండ్రులు చేసిన పాపం. 

దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనేముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా, వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం, వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. అక్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణం పాపవుతారు. ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.

కర్మ - ఫలితం

Grihastha Pujalu Dharma Sandehalu - గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు,హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు.

సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి.

ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు.

చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు.

లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి.

విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి... పూజ లేకుండా ఉండకూడదు.

ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు.

నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండం మంచిది.

ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది.

అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి... నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి.

పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు.

ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది.


ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది?
గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది.

పుణ్య ప్రదేశాల్లో, దేవతా సన్నిధిలో చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిధిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది.

వెదురు తడక మీద కూర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఃఖం, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.

ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపం అందుకే దానికి మామిడి తోరణం కడతారు. కింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్త్రపరంగా చెప్పాలంటే గడపకు పసుపు రాయడం వల్ల క్రిమికీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.

పంచామృతం
ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారల మిశ్రమాన్ని పంచామృతం అంటారు. దీనిని పూజలో దేవునికి నివేదిస్తారు.

పంచగవ్యాలు
ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రంల మిశ్రమమే పంచగవ్యం. దీనిని పంటల రోగనివారణకు వాడతారు.

తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?
తొలితీర్థం శరీర శుద్ధికి, శుచికి. రెండవ తీర్థం ధర్మ, న్యాయ ప్రవర్తనకు, మూడవ తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం కొరకు.


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
సాధారణంగా చాలా మంది దేవాలయాలకు వెళ్తుంటారు. అక్కడ పూజారితో పూజలు, వ్రతాలు చేయించుకుంటాం. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తాం.

పూజలు, వ్రతాలు చేసినప్పుడో తీర్థం తీసుకుంటూ ఉంటాము. అయితే మనం గుడికి వెళ్లినప్పుడు అక్కడ మనకు తెలియ కుండానే చేతులు దేవుణ్ణి ప్రార్ధన చేస్తుంటాయి. రెండవది తీర్థం తీసుకుని తాగి మన చేతులను తలపై రాసుకుంటాము.

దేవాలయాల్లో తీర్థాన్ని తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై రాసుకోకూడదు అంటున్నారు పండితులు. చేతులు జోడించి దేవదేవునికి నమస్కరించి, ప్రార్ధన చేయవచ్చు కానీ తీర్థాన్ని తీసుకున్న తరువాత చేతులను తలపై రాయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయట.

సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనే వంటివి జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత చేతికి ఎంగిలి అంటుకుంటుంది.

ఆ చేయినే తలకు రాసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వదని వారు చెప్తున్నారు. అందుచేత తీర్థం తీసుకున్న చేతిని నీటితో కడుక్కోవాలని పండితులు సెలవిస్తున్నారు.

తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని నెత్తికి రాసుకోవడం చేయకూడదు. జేబు రుమాలుతో తుడుచుకోవాలి లేదా కండువాతో తుడుచుకోవాలని వారు సూచిస్తున్నారు. కానీ గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలపై రాసుకోవచ్చునని పండితులు అంటున్నారు.

Karma - Phalitham - కర్మ - ఫలితం

కర్మ - ఫలితం

కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకి లను చూడటానికి, చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు.

దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే 'నాయనా! నీవే పరమాత్మవి కదా!, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి, అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి' అని అడిగింది.

అప్పుడు కృష్ణుడు "అమ్మా! నన్ను క్షమించు, నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో?' అని చిరునవ్వు తో! 
అన్నాడు. దేవకి ఆశ్చర్య చకితురాలయింది,

దేవకీ "కృష్ణా ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు?" అని అడిగింది. అప్పుడు కృష్ణుడు "అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు!" దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా కృష్ణుణ్ణి "అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో?" అని 
అడిగింది.

అపుడు కృష్ణుడు "ఇంకెవరు? యశోద మాత! 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గత జన్మలో, అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది." అని
 అన్నాడు, 

ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు, భగవద్భక్తులైనా, అవతార పురుషులైనా వాటి నుండి తప్పించుకోలేరు, ఇంకా మానవ మాత్రలం మనమెంత!

అలాగే యశోద మాత కృష్ణుని వివాహం చూడలేదని తపించింది. కలియుగంలో  వకుళ మాతగా పుట్టి తన చేతులమీదుగా దగ్గరవుండి మరీ శ్రీనివాసుని కళ్యాణం జరిపించి తన కోరికను తీర్చుకుంది. 

ఇలాంటి కర్మలు పరమాత్ముని లీలల వల్ల మనకు తెలిశాయి. మనం మానవమాత్రులము కావున మనం చేసే ప్రతికర్మ లేదా మనకు జరిగే ప్రతి కర్మ భూత, భవిషత్తు మరియు వర్తమానాల మీద ఆధార పడుతాయి. మనం ముందు జన్మలో చేసిన కర్మల వల్ల ఈ జన్మలో ప్రతిఫలం పొందుతాము. అది మంచి అయినా చెడు అయినా. వర్తమానం లో చేసిన కర్మ ఫలితాలు భవిషత్తులో కానీ తదుపరి జన్మలో మంచి కానీ, చేడు కానీ అనుభవించ వలసిందే. 

కావున కర్మను ఎవ్వరూ తప్పించలేరు. భూత, భవిషత్ కాలాలలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి, వర్తమాన కాలంలో అనగా ప్రస్తుత జన్మలో ధర్మబద్ధంగా, ధర్మకార్యాలు చేస్తూ నిజాయితీగా వ్యవహరిస్తూ తమ ఇష్ట దైవాన్ని పూజిస్తూ, స్మరిస్తూ జీవనం గడిపే వానికి కర్మ నశిస్తోంది. కర్మ నశించినవానికి పునర్జన్మ ఉండదు. ముక్తి లభిస్తుంది.

కర్మకు రెండు లక్ష్యములు. ఒకటి దుఃఖమును తొలగించుకొనుట. రెండు సుఖములు పొందుట. కాని ఈ లక్ష్యములు సిద్ధించవు. కర్మవలన మరింత దుఃఖము కలుగుతుంది. 

ఈ శరీరమే నాదికాదు. ఈ శరీరము ఉండునది లేదు. ఈ రోజు ఈ దేహము ఉండవచ్చు. కానీ, రేపే నశించవచ్చు. కావున, శరీరమే నాది కానపుడు భార్యా పుత్రులు, ధనధాన్యములు, వస్తువాహనములు, కృత్యులు పరివారములు నా వారలు ఎట్లవుతారు? 

శరీరము పోయినపుడు ఇవేవియు వెంటరావు. ఇవి పురుషార్ధములవలె కనిపించును. అదొక భ్రమ. నిజమునకు అవి అనర్థములు, ఆత్మ ఒక్కటే అనంతమైనది. అవ్యయమైనది. ఆనందదాయకమైనది.

శరీరము ఆత్మ ఒక్కటికాదు. శరీరము వేరు ఆత్మ వేరు. ఆత్మ అనంతము శరీరము పంచభూతాత్మకము. 

శరీరమునే ఆత్మగా భావించువాడు. దానితో అనేక కర్మలు చేయించును. కర్మల వలన తిరిగి దేహము కలుగును. దానితో మరల కర్మలు చేయించును. ఇదొక విషవలయము. 

శుభం భూయాత్.

పితృశాపం - స్త్రీ శాపం

Narada Muni encouraged Prajapati Daksa's second group of sons (the Savalasvas/Shabalashva) by awakening their natural affinity for their brothers (the Haryasvas) - నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

ఈ విధంగా ఘోరతపస్సు చేస్తున్న శబలాశ్వులను మోక్షపథగాములుగా చేయడానికి నారదుడు ఇదివరకటిలాగే వచ్చి వారికి ధర్మబోధ చేశాడు. 'మీ అన్నలు ఏ మార్గాన్ని ఆశ్రయించి ముక్తిని పొందారో మీరు ఆ మార్గాన్నే ఆశ్రయించవలసి ఉంది. ఎవ్వడైనా సోదరులు చూపిన మార్గాన్ని అనుసరించి వెళ్లేవాడే విశేషజ్ఞుడు అని పెద్ద లంటారు. అందువల్ల ఆ మార్గంలోనే మీరు ప్రవర్తించి ఎల్లవేళలా దేవతలతో కలిసి స్వర్గంలో సుఖంగా ఉండండి' అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుని మాటలను నమ్మిన శబలాశ్వులు విరాగులై

ఓ రాజా! నేను చెప్పేది విను. మంచి గుణవంతులైన ఆ శబలాశ్వులు ఇంతవరకు ఆచరించిన ఐహిక కర్మలకు సిగ్గుపడి, తమ అన్నలు వెళ్ళిన మోక్షమార్గాన్ని అనుసరించి పున్నమినాటి రాత్రి గతించిన తరువాత చంద్రకళలు క్రమంగా క్షీణించిన విధంగా కర్మ క్షయాన్ని పొంది వారు మోక్షాన్ని చేరుకున్నారు.

అదే సమయంలో దక్షునికి అనేక విధాలైన దుశ్శకునాలు గోచరించాయి. ఆయన మనస్సు అధికమైన వ్యథతో క్షోభించింది. తన పుత్రులు గతించడానికి కారణం

నారదుని కారణంగానే ఇలా జరిగిందని గ్రహించిన దక్షుడు మిక్కిలి కోపంతో అతని వద్దకు వెళ్ళి ఆపలేని బాధకు గురైనవాడై మిక్కిలి ఆగ్రహంతో

దక్ష ప్రజాపతికి మిక్కిలి కోపంతో ముఖం ఎర్రబడింది, కనుబొమలు ముడివడినాయి. కన్నులలో నిప్పులు రేగాయి. పెదవులు అదిరాయి. పండ్లు పటపట కొరుకుతూ నారదునితో ఇలా అన్నాడు.

పరమసాధువులాగా ఉంటూ ధూర్తుడవై చిన్నపిల్లలైన నా పుత్రులకు సన్న్యాసమార్గాన్ని బోధించావు. నా కుమారులు ఈ దుస్థితి పొందగా నేను బాధపడకుండ ఉండగలనా? ఇందుకు కారణమైన దుష్టుడవగు నిన్ను నా శాపాగ్నిజ్వాలలో పడదోసి బాధిస్తాను.

Narada Muni encouraged Prajapati Daksa's sons the Haryasvas abandon their father's mandate of procreation and instead pursue spiritual liberation - నారదుండు హర్యశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నారదుండు హర్యశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

నాయనలారా! మీరు మిక్కిలి మూఢులుగా కన్పిస్తున్నారు. మీ భవిష్యత్తును విచారించుకొనలేకున్నారు. మీరు పసిబిడ్డలు. ఈ భూమి పరిమాణమెంతో తెలియనివారు. ఇక జీవులను ఏ విధంగా సృష్టించగలరు? సర్వాంతర్యామియైన ఆత్మస్వరూపుడు పురుషుడు ఒక డున్నాడు. స్త్రీరూపిణియై అనేక రూపాలు ధరించిన ప్రకృతి ఒకటున్నది. మాయలమారి అయిన ఆ ప్రకృతి పురుషుణ్ణి లోబరచుకుంటుంది. ప్రకృతీ పురుషుడూ కలిసి సంసార ప్రవాహాన్ని సాగిస్తారు. ఈ సంసారమనే నది రెండువైపులనుండీ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని అనుసరించి ఒక హంస విహరిస్తూ ఉంటుంది. ఆ హంసకు ఇరవై అయిదు మహిమ లుంటాయి. అయినప్పటికీ ఆ హంస సరియైన మార్గం కానరాక వజ్రంవలె దిట్టమై మెరుస్తున్న జలప్రవాహం పడే గోతిచుట్టూ తిరుగుతుంటుంది. ఆ గోతిలో పడితే మళ్లీ బయటపడటమంటూ లేదు.

(ఇక్కడ హంస అనేది జీవాత్మకు ప్రతీక. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, తన్మాత్రాదిగా గల కాళ్ళు, చేతులు, వాక్కు మల, మూత్ర అవయవాలు అయిదూ కర్మేంద్రియాలు. చెవి, కన్ను చర్మం, ముక్కు నాలుక అనే అయిదూ జ్ఞానేంద్రియాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అయిదూ తన్మాత్రలు. భూమి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే అయిదూ పంచభూతాలు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగింటినీ అంతఃకరణ చతుష్టయం అంటారు. వీటన్నింటికీ మూలమైన శక్తి ఆత్మ. ఈ ఇరవై అయిదు రూపాల సామర్థ్యం, ఐహిక సుఖలోలత్వం కలిగి ఉండి, బయటపడే మార్గం అనగా ముక్తిమార్గం తెలియక పోవడమే సుడిగుండంలో పడటం. దానిని దాటి ముక్తిని పొందే మార్గాన్ని తెలుసుకోవాలనేదే నారదుని ఉపదేశం.)

హరిదశ్వులారా! వినండి. ఈ సంగతులను గుర్తించండి. ఇందుకు తగ్గట్టుగా ప్రవర్తించండి. ఈ సృష్టి రహస్యాన్ని ఏ మాత్రమూ తెలుసుకోకుండా కేవలం మీ తండ్రిగారి ఆజ్ఞలను కొనసాగించటానికి పూనుకొన్నారు. అటువంటి మిమ్ములను ఇంత తెలివి తక్కువ వాళ్లను ఏమనాలి?

ఈ విధంగా నారదుడు చెప్పిన విషయాన్ని హర్యశ్వులు తమ విచక్షణ బుద్ధితో తమలో తాము ఇలా చర్చించుకున్నారు.

ముందుగా చక్కగా ఆలోచించి క్షేత్రజ్ఞుడు అనగా ఏమిటి? అజ్ఞాన సంబంధమైన లింగదేహం అనగా ఏది? అనే విషయాలు ముందుగా తెలుసుకోవాలి. అవేవీ తెలుసుకోకుండా కేవలం పనికిరాని పనులు చేసిన కారాణంగా ముక్తి లభించదు.

ఈ సమస్త లోకాలకూ మూలకారణమైన భగవంతు డొక డున్నాడు. ఆయన సర్వేశ్వరుడు. పుట్టుక లేనివాడు. ఆత్మాశ్రయుడు. పురుషోత్తముడు. అటువంటి అంతర్యామి అయిన స్వామిని దర్శింపకున్నచో బ్రహృదేవునికైనా మోక్షం లభించదు.

జీవుడు సంసారమనే కూపాన్ని స్వర్గంగా భావిస్తాడు. దాని నుండి బయటపడకుండా పరబ్రహ్మాన్ని గుర్తించటం సాధ్యం కాదు. కర్మలను చేయడంవలన స్వర్గసౌఖ్యాలు లభిస్తాయి. కానీ కైవల్యం లభించదు.

సామాన్య జీవునికి మోక్షంపై ఆసక్తి కలగడం, భగవంతునియందు ఆసక్తి ఏర్పడటం చాలా కష్టం. జీవుడు మెరమెచ్చులవంటి ఐహికసుఖాలకై పాటుపడుతూ బాధపడుతూ ఉంటాడు. అలాంటి చంచలమైన మనస్సు కల్గిన వారికి మోక్షపదవి దూరం.

అనుకూలత కల్పించుకొని జీవుడు ఐహికసుఖాలలో తేలుతూ ప్రజాసృష్టి మీదుమిక్కిలిగా చేస్తూ ఆ సంసార ప్రవాహంలో కొట్టుకుంటూ అవతలి గట్టును చూచికూడా చేరలేదు. నేను అనే అహంకారం అతణ్ణి జ్ఞానానికి దూరంచేసి, చెడ్డపనులు చేయిస్తుంది. జననమరణాలనే ఈ లంపటంలో చిక్కుకున్న జీవుడు శాశ్వతసౌఖ్యం అందించే మోక్షపదవిని ఎలా అందుకోగలడు?

తన సహజ లక్షణాలు విడిచి, వక్రమార్గంలో నడిచే స్త్రీని పెళ్ళాడిన తెలివిమాలిన భర్తవలె, ఐహికసుఖాలలో దుఃఖాలలో మునిగి తేలుతూ సంచరించే జీవుడు తన నిజ స్వరూపమైన పరమాత్మను తెలుసుకోలేక దుఃఖపడుతూ రక్షణ పొందలేడు.

25 తత్త్వాలకు స్పష్టమైన అద్దం వంటిది పరతత్త్వం. వీటిని వ్యతిరేకంగా ఉపయోగించి చెడుమార్గాలలో వెళ్లే పురుషుడు ఆ సూక్ష్మతత్త్వాన్ని తెలుసుకోలేక పోతే అలాంటి వానికి ఉత్తమగతి ఎందుకు లభిస్తుంది?

(పంచ వింశతి తత్త్వరాశి అనగా జీవుని శరీరంలో ఉండి అతనికి ప్రాణశక్తిని కలిగించి, అతడిని కార్యోన్ముఖుడిని చేసేవి. అవి 1)ఐదు జ్ఞానేంద్రియాలు 2) ఐదు కర్మేంద్రియాలు 3) ఐదు తన్మాత్రలు 4) పంచభూతములు 5) మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం, పురుషుడు. వీటికి లొంగినవాడు అధోగతిని, లేదా వీటికి తట్టుకొని దీటుగా నిలబడినవాడు సద్గతిని పొందుతారు.)

సంసార బంధానికి కారణం, దానినుండి విముక్తి పొందే మార్గం అనే ఈ రెండింటికి సంబంధించిన పరిపూర్ణ శాస్త్రజ్ఞానం లేక కర్మమార్గంలో పడి కొట్టుకునే వాడికి పరతత్త్వాన్ని దర్శించే ఉత్తమగతి ఎలా కలుగుతుంది?

ఈ కాలచక్రం చాలా శక్తిమంతమైనది. ఈ సమస్త జగత్తునూ చుట్టచుట్టి పట్టుకొని సున్న చుట్టి మటుమాయం చేసే కిటుకులు దానికి తెలుసు. అటువంటి కాలస్వరూపాన్ని తెలుసుకోకుండా ఊరకే కర్మలు చేస్తూ కూర్చుంటే వానికి అక్షయమైన మోక్షపదం ఎట్లా దక్కుతుంది?

ఈ సృష్టికార్యాన్ని మనతండ్రి అయిన దక్షప్రజాపతికి ఆయన తండ్రి బ్రహ్మదేవుడు అప్పగించాడు. అతి భయంకరమైన ప్రవృత్తి మార్గాన్ని అవలంబించటం ఇష్టం లేక మన తండ్రి ఆ పని చేయలేదు.

(పిత్రాజ్ఞ ఉల్లంఘించరానిదైనా అది శ్రేయాదాయకం కానప్పుడు ఉల్లంఘించడం దోషం కాదనేది ఇక్కడి ధర్మసూక్ష్మం.)

ఇలా వారిలో వారు ఆలోచించుకొని ఆ తరువాత

ఓ మహారాజా! ఇంకా చెబుతున్నా విను. నారద ప్రబోధం వల్ల నివృత్తిమార్గాన్ని అనుసరించిన దక్షుని కుమారులు తమకు ప్రబోధించిన నారదునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఉత్తమగతులవైపు వెళ్లారు. అంత నారదుడు కూడ విష్ణు పాదారవిందాలలోని తేనెను ఆస్వాదించే మనస్సుతో తన మహతి అనే వీణను మీటుతూ గానం చేసుకుంటూ తనకు నచ్చిన చోటికి వెళ్ళిపోయాడు.

నారదమహర్షి దక్షప్రజాపతి దగ్గరికి వెళ్లి, ఆయన కుమారులు తండ్రిమాట కాదని నివృత్తి మార్గాన్ని అనుసరించి వెళ్లారని చెప్పగా విని, దక్షుడు దుఃఖం పొంగిపొరలగా మనస్సులో చాల బాధపడ్డాడు.

ఆ విధంగా బాధపడుతున్న దక్షుని వద్దకు బ్రహ్మ వచ్చి ఓదార్చి, తిరిగి సంతాన వృద్ధి చేయమని ఆదేశించగా, దక్షుడు తన భార్య అసిక్ని ద్వారా సౌందర్యవంతులు, సకలగుణసంపన్నలూ అయిన అనేక వేలమంది శబళాశ్వులు అనే పేరు గలవారికి జన్మనిచ్చాడు.

తమకు జన్మనిచ్చిన తండ్రి కోరికను గ్రహించి ఆ కోరికను నెరవేర్చడానికి ఆ శబలాశ్వులు తపస్సు చేయడానికి వేంటనే వెళ్ళారు.

ఈ విధంగా ఆ శబలాశ్వులు తండ్రి ఆజ్ఞమేరకు ప్రజాసృష్టి చేయడానికి తపస్సు చేయాలని నిశ్చయించుకొన్నారు. ఏ పుణ్యతీర్థం అన్ని తీర్థాల పుణ్యఫలాన్ని ఇస్తుందో, ఏ పుణ్యతీర్థాన్ని చూసినంతనే పాపాలన్నీ పటాపంచలౌతాయో అటువంటి నారాయణ తీర్ధం అనే సరస్సు దగ్గరకు వెళ్ళి అక్కడ నీటిని స్పృశించినంత మాత్రంచేతనే తమ మాలిన్యాన్ని పోగొట్టుకొని

ఆ శబలాశ్వులు బ్రహ్మాది దేవతలకు సాధ్యం కాని పరబ్రహ్మాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ, పరమాత్మ సంబంధమైన మూలమంత్రాన్ని జపిస్తూ, ఆ మూలపురుషుణ్ణి చూడాలనే కుతూహలంతో సమస్తం పరబ్రహ్మ స్వరూపంగా భావించి తపస్సు చేశారు.

ఆ దక్షపుత్రులు స్థిరబుద్ధితో ఒంటికాలిబొటన వేలిపై నిలబడి చేతులు పైకెత్తి జోడించి చూపులతో తీక్ష్ణమైన సూర్యుడిని చూస్తూ, కొంతకాలం గాలిని ఆహరంగా తీసుకుంటూ, కొంతకాలం ఏ ఆహారమూ లేకుండా సమస్త లోకాలకూ, దేవతలకూ భయం కలిగే విధంగా ఘోరతపస్సు చేశారు.

నారదుండు శబళాశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

The Hamsa-guhya Stotra is a praise of Lord Vishnu by Prajapati Daksha - దక్షుడు కావించిన హంసగుహ్యం బను స్తవరాజము

దక్షుడు కావించిన హంసగుహ్యం బను స్తవరాజము

సర్వశ్రేష్ఠుడై అనుగ్రహం చూపడానికి చైతన్య శక్తితో సాక్షాత్కరించే ఆ దేవదేవునికి నమస్కారం చేస్తాను. నిత్యం ప్రకాశించే పరమాత్మునికి వందనం చేస్తాను. అద్భుతమైన దివ్యానుభూతే రూపంగా వెలుగొందేవానికి నమస్కరిస్తాను. నిమిత్తమాత్రంగా బంధువైనట్టి సగుణసాకారమూర్తి అయిన పరమాత్మకు స్తుతులు సమర్పిస్తాను.

గుణాలలో చిక్కుకున్నవారికీ, కేవలం తాత్త్విక బుద్ధితో అన్వేషించే వారికీ నీ ఉనికి తెలియరానిది. మొదటినుండి ఉన్నవాడవు నీవు! మోక్షానికి పరమావధివై ప్రకాశించే వాడవు నీవు! అలాంటి అంతర్యామివైన స్వామిని నిన్ను ఆశ్రయిస్తున్నాను.

నీవు సర్వప్రాణుల దేహాలయందు జీవాత్మ రూపంలో ఉంటున్నావు, కానీ త్రిగుణాలచే బద్దుడైన జీవుడు తనలోనే అంతర్యామిగా వున్న నిన్ను గుర్తించలేకున్నాడు. త్రిగుణాలకు లోబడి ఇతరులతో కలసి ఉంటున్నాడు. కాని, ఓ పరమాత్మా! గుణాతీతుడవైన నీతో కలసి ఉండడమే లేదు. అలాంటి ఓ పరమాత్మా నిన్ను సేవిస్తాను.

మనసు, శరీరం, ప్రాణాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు చక్కని వివేచనతో ప్రయత్నించకపోతే తప్ప జీవుడు తమలో ఉన్న పరమాత్మను చూడలేడు. అటువంటి సర్వగుణ సహితుడైన జీవునిలో అంతర్యామిగా ఉండేవాణ్ణి, సమస్తప్రాణులకూ మేలు కలిగించే వాడినీ, మూలపురుషుడిని ఆశ్రయిస్తాను.

మనస్సు సంకల్ప వికల్పాలకు స్థానం. మనసులో అనేక విరుద్ధ భావాలు సంఘర్షణకు గురై వస్తూ, పోతూ వుంటాయి. ఈ విధమైన మనస్సు ఇంద్రియాల విషయంలో నిగ్రహాన్ని నిలుకడను పొందగల్గితే దానిని నిర్వికల్పసమాధి అంటారు. ఈ విధమైన జ్ఞానానికి మూలమైన అంతరాత్మస్వరూపానికి నమస్కారం. కట్టెలో మిక్కిలి గూఢంగా ఉన్న అగ్నిని రాపిడిశక్తిచేత బయటకు రప్పించినట్టు, బుద్ధిమంతులు తమ మనసనే ఆకాశమందు విహరించే పరమాత్మను తమయొక్క ఇచ్చాజ్ఞానక్రియలనే ఆత్మశక్తులచేత సాక్షాత్కరింపజేస్తారు. అటువంటి ఏకాత్మరూపుడైన నిర్గుణ పరబ్రహ్మ 'ఏకోహం బహూస్యాం' అనే సంకల్పంతో అనేక నామరూపాలను ధరించి విశ్వరూపి అయ్యాడు. అటువంటి సర్వాత్మకుడు నన్ను అనుగ్రహించుగాక. అవాఙ్మానస గోచరుడు, నిర్గుణ పరబ్రహ్మ, సృష్టిస్థితి లయకారణుడు అయిన దేవదేవుణ్ణి ఆశ్రయిస్తాను. ఏ దేవుని మాయాప్రభావం కారణంగా పండితులు, పామరులు, భగవంతుని విషయంలో ఉన్నాడు, లేడు అని వాదించుకుంటారో, వారందరియందు కూడా ఒకే ఆత్మశక్తిగా ఉంటూ, యోగాది ఉపాసనా ధర్మాలు వేరైనా 'నదీనాం సాగరో గతిః' అన్నట్లు వాటన్నిటికి ఒకే గమ్యరూపమైన పరాత్పరుడు నాకు అనుకూలంగా మారునుగాక. నిర్గుణుడు, నిరాకారుడు ఐన పరమాత్మ జగత్తును రక్షించటంకోసం సద్గుణుడు, సాకారుడు అవుతున్నాడో; అటువంటి సర్వవ్యాపకుడు నాకు ప్రసన్నుడు అగుగాక. ఏ భగవానుడు జీవుల పూర్వజన్మ విశేషం కారణంగా ప్రస్తుతజన్మలలో జ్ఞానమనే జ్యోతిగా వెలుగొందుతూ, భూ పదార్థాల వాసనతో కూడుకున్న వాయువు (గాలి) మాదిరిగా అన్నింటిలో ఉంటూ, అన్నింటికి దూరంగా ఉండగలిగే నారాయణుడు నా కోరికను తీర్చుగాక. అని భక్తితో నిండినవాడై తన మాటలతో కీర్తిస్తున్న దక్షునికి, భక్తపాలకుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. అంత

శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని మీద ఆసీనుడై ఉన్నాడు. గరుడుని రెండు భుజాలమీద చాచిన ఆ స్వామి పాదాలు మేరుపర్వతం చరియకు రెండుప్రక్కలా ప్రకాశించే ఇంద్రనీలమణుల గనులవలె ఉన్నాయి. ఆయన అష్టబాహువులూ అందంగా పైకిచాచిన అష్టదిగ్గజాల తొండాలవలె ప్రకాశిస్తున్నాయి. ఎనిమిది చేతులలోనూ చక్రమూ, ధనుస్సూ, కత్తి, శంఖమూ, ఖడ్గమూ, పాశమూ, డాలూ, గదాదండమూ విరాజిల్లుతున్నాయి. నల్లని దేహంతో నగుమోముతో సాధుజనులను సంరక్షించే చల్లనిచూపులతో బంగారురంగు పట్టుపీతాంబరంతో మణిమయకిరీటంతో నలుమూలలా కాంతులు విరజిమ్మే భూషణాలతో, మకరకుండలాలతో పుండరీకాక్షుడు దక్షునిముందు ప్రత్యక్షమైనాడు.

మకర కుండలాల కాంతి చెక్కిళ్ళపై చంద్రకాంతిలా ప్రసరిస్తుండగా, కిరీటం యొక్క శ్రేష్టమైన ప్రకాశం ఆకాశలక్షికి కుంకుమరంగు వస్త్రంగా మారగా, వక్షఃస్థలం మీద వనమాలికల కాంతి శ్రీవత్సం, కాస్తుభమణుల కాంతిలో కలిసి అతిశయిస్తుంటే, నల్లని కొండను చుట్టిన మెఱుపు తీగల మాదిరి స్వామి భుజకీర్తులు శోభిస్తుండగా, సకల లోకాలనూ సమ్మోహింపజేస్తూ, నారదుడు మొదలైన దేవర్షులు, మహర్షులు స్వామిని సేవిస్తుండగా, గంధర్వాది దేవగణాల కీర్తనలు చెవులకు ఆనందం కలిగిస్తుండగా

సర్వశక్తిమంతుడు, సర్వాత్మకుడు, సర్వవ్యాపకుడు, శాశ్వతుడు, సర్వదుడు అయిన ఆ శ్రీహరి తనను సమస్త భక్తజనులు సేవిస్తుండగా దక్షునికి ప్రత్యక్షమయ్యాడు.

ఈ విధంగా సాక్షాత్కరించిన సర్వేశ్వరుని దివ్యరూపం సర్వదిక్కులనూ వెలిగిస్తూ మహాశ్చర్యాన్ని కలిగించింది. అలా ప్రకాశించే ఆ దేవదేవుని తేజోమయమూర్తిని వీక్షించి, దక్షుని హృదయంలో భయమూ, ఆనందమూ, ఆశ్చర్యమూ ముప్పిరి గొన్నాయి. ఎలాగో ఆ తన్మయత్వంనుండి తెప్పరిల్లి తొట్రుపాటుతో దక్షుడు స్వామికి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. జోడించి మోడ్చి నిలుచున్నాడు. సెలయేళ్లు కలయికతో దరులొరసి పొంగి మిన్నంటి సముద్రాన్ని దరిసిన మహానదీ ప్రవాహంవలె దక్షప్రజాపతి పులకించిన దేహంతో భగవంతుని ముందు నిలిచాడు. ఆయన పరవశించిన తన హృదయాన్ని ఎలాగో అదుపు చేసుకొని పొంగిపొరలే ఆనందంతో ఆ పరమేశ్వరునితో ఏమేమో పలుకాలి అనుకొన్నాడు. పరమ మంగళదాయకాలైన ఆయన పవిత్రనామాలను ఉచ్చరించాలనుకొన్నాడు. పరమపవిత్రాలైన ఆయన లీలలను అభివర్ణించాలనుకొన్నాడు. విబుధులకు సంతోషాన్ని కలిగించే ఆయనపరాక్రమాన్ని ప్రస్తుతించాలనుకొన్నాడు. తన మనస్సులోని కోరికను వెల్లడించాలనుకొన్నాడు. కానీ పాపం! ఏమీ చేయలేక పోయాడు. ఆ విధంగా మైమరచి నోట మాటరాక మౌనం వహించి ఉన్న ప్రజాకాముడైన ప్రజాపతిని చూచి, సర్వజ్ఞుడూ సర్వప్రాణి హృదయాంతర్యామీ అయిన ఆ స్వామి అతని అభిప్రాయాన్ని గ్రహించి, ఆర్తజనులను రక్షించే లక్షణంగల మాటలతో ఇలా అన్నాడు.

ఓ దక్షా! నీ తపస్సుకు మెచ్చాను. అందుకు ఈ క్షణంలోనే నీకు ఫలసిద్ధిని ప్రసాదిస్తున్నాను. నానుండి వరం పొందడానికి ఈలోకంలో నీకంటె అర్హుడు ఎవడున్నాడు?

ఈ నీ తపస్సు ఇక చాలు. సకల జీవరాశులకు సమస్త సంపదలు సిద్ధిస్తాయి. నీవు సృష్టి చేయాలనే కోరికతో నన్ను గూర్చి తపస్సు చేశావు. నా సంకల్పం కూడా ఇదే. నీ తపస్సు నెరవేరింది.

ఇంకా చెబుతాను విను. బ్రహ్మ, రుద్రుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రాదులు వీరందరూ నా అంశకు చెందినవారే. వేదచోదితమైన సంధ్యావందనాదులు నా మనస్సు. జపధ్యానాదులు నాశరీరం. ధ్యానధారణాది మానవకార్యాలు నా ఆకారం. యోగాదులు అవయవాలు. ధర్మం నా ఆత్మ. దేవతాగణాలు జీవములు. వేదం నా స్వరూపం. సృష్టిపూర్వం నేను మాత్రమే ఉన్నాను. శాశ్వతుడైన నా నుండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండం, బ్రహ్మ తమకు తాముగా పుట్టారు. నా తేజస్సును కలిగి ఉన్న బ్రహ్మ క్రియారహితుడై ఉన్నప్పుడు నాచే ప్రేరితుడై ఘోరతపస్సు చేశాడు. తదనంతరం నా సంకల్పంతో ప్రజాసృష్టి చేయగల మిమ్మల్ని సృష్టించాడు.

ప్రజాపతులలో ఒకడైన పంచజనుని కుమార్తె ఐన అసిక్నిని నీకు భార్యగా అనుగ్రహించాను. గృహస్థ ధర్మాన్ని పాటించి మీరు అత్యధిక ప్రజలను సృష్టించండి. నీ సంతానం కూడా నాచే ప్రభావితులై సృష్టిని పెంపొందిస్తారు అని ఆదేశించి మాయమయ్యాడు. అప్పుడు దక్షుడు స్వామి ఆజ్ఞమేరకు అసిక్నితో కూడి పదివేలమంది హర్యశ్వులకు జన్మనిచ్చాడు. వారు తండ్రి ఆజ్ఞమేరకు ప్రజాసృష్టికోసం తపస్సు చేయడానికి సింధునది సముద్రసంగమ ప్రాంతమైన విశిష్ట పుణ్యతీర్థమైన నారాయణసరస్సునుచేరి అందు స్నానం చేసి పవిత్ర మనస్కులై తపస్సు ప్రారంభించారు. ఆ సమయంలో వారి వద్దకు నారదుడు వచ్చి ఇలా అన్నాడు.

నారదుండు హర్యశ్వులకు నివృత్తి మార్గంబు నుపదేశించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

Saturday, March 7, 2026

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి

దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివరి నాడు జరిపే పండగే రంగ పంచమి.

హోలీ మాదిరిగానే ఈ పండగకు కూడా రంగులు చల్లుకుని సంతోషంగా గడుపుతారు. అయితే ఈ పండగకు మరో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రంగ పంచమి నాడు స్వయంగా దేవతలు భూమి మీదకు దిగి వచ్చి, హోలీ ఆడతారని నమ్ముతారు. అందుకే ఈ పండగను దేవ పంచమి అని కూడా అంటారు. ఈ రోజున రంగులతో ఆడుకోవడం వల్ల, ప్రపంచవ్యాప్తంగా దేవతల సాత్విక శక్తి వ్యాప్తి చెందుతుందని, దీని ద్వారా జనాలు, దేవతల స్పర్శను అనుభూతి చెందుతారని పండితులు చెబుతున్నారు.

ఈ రోజున గ్రహ స్థానాలు సరైన క్రమంలో ఉండి ప్రాణ శక్తిని మేల్కొలిపి సమతుల్యత మరియు ఆధ్యాత్మిక వృద్ధిని ఇస్తాయని నమ్ముతారు. సాంప్రదాయ రంగ పంచమిలో మూలికలు, పువ్వులు మరియు సహజ వర్ణద్రవ్యాలతో కలిపిన రంగులను నిర్దిష్ట క్రమంలో పూయడం జరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక శక్తి మార్గాలైన నాడులను శుభ్రపరుస్తుంది, వాటిలో నిద్రాణమైన ప్రాణ శక్తిని మేల్కొలిపి జాగృతం చేస్తుంది. అంతేకాక మనలో దాగి ఉన్న సహజ శక్తులను కూడా మేల్కొల్పుతుంది.

పూర్వం రంగులు మూలికలు మరియు ప్రత్యేకమైన వృక్షాల బెరడులతో తయారు చేసేవారు.
పాల్గుణ పౌర్ణమి నుండి క్రమంగా వేసవి కాలం ప్రారంభం కావున మూలికలతో తయారు చేసిన రంగులను మరియు రంగు నీళ్లను చల్లుకోవడం వల్ల వేసవి ఉష్ణోగ్రతల వల్ల చర్మ సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు రాకుండా మనకు సహాయకారిగా ఉంటుంది.

కానీ ప్రస్తుత కల్తీ ప్రపంచంలో రసాయనాలతో తయారయిన రంగుల వల్ల మేలు కన్నా కీడు జరుగుతుంది కావున రంగుల విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతో వుంది.

అయితే ఈ రంగ పంచమి దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరుపుకోరు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మధుర, బృందావనం ప్రాంతాల్లో ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

ముఖ్యంగా గుజరాత్ లో ఈ పండుగను గర్బా మరియు దాండియా నృత్యాలతో జరుపుకుంటారు, ఇక్కడ బహిరంగ ప్రదేశాలలో వేదికలు ఏర్పాటు చేసి సాంప్రదాయ ఆచారాలను ప్రదర్శిస్తూ ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటారు.

రాజస్థాన్ లో జానపద నృత్యాలు, సామూహిక విందులు మరియు రంగుల తో జరుపుకుంటారు. ఉదయపూర్ మరియు జైపూర్‌లలో, యువకులు భక్తిగా హోలీ పాటలు పాడుతూ వీధుల్లో తిరుగుతూ, స్థానిక దేవతలకు రంగులను సమర్పిస్తారు.

మధ్యప్రదేశ్ లో ఐక్యత మరియు సామూహిక కలయికను సూచిస్తూ పెద్ద రంగుల ఊరేగింపులు నిర్వహిస్తారు.

మహారాష్ట్ర (షిమ్గా/షిమ్గో) - సాంప్రదాయ పాల్ఖీ నృత్యాలు మరియు జానపద ప్రదర్శనలు నిర్వహిస్తారు. వ్యవసాయ ప్రారంభాన్ని చిహ్నంగా జరుపుకుంటారు. అంతేకాక సామూహికంగా జరుపుకోవడం వల్ల కాలానుగుణ మార్పులతో ముడిపడి ఉన్న ధైర్యం మరియు బలాన్ని పొందుతామని భావిస్తారు.

గోవా (షిగ్మో పండుగ) లో ఆలయ ఆచారాలను సాంస్కృతిక పద్దతులతో కలిపే పెద్ద షిగ్మో ఉత్సవాల్లో భాగంగా రంగ పంచమిని జరుపుకుంటారు.

బృందావనం మరియు మధుర ఆలయలో  హోలీ వేడుకలు రంగ పంచమితో ముగుస్తాయి, కృష్ణభక్తులు రాధా కృష్ణులకు రంగులు సమర్పించి ఆశీర్వాదాలు పొంది ఈ పండుగను ముగిస్తారు.
రేపల్లెలో స్వయంగా పూజారులే కృష్ణ ప్రసాదంగా రంగులను భక్తులపై కురిపిస్తారు. అది చూడడానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. అది చూసి పాల్గొని అనుభవించవలసిందే.

గ్రామీణ ఉత్తర భారతదేశం - హోలీ వేడుకల కొనసాగింపుగా, గ్రామాలు ఉత్సవాలు, ఊరేగింపులు మరియు సామూహిక ప్రదర్శనలు నిర్వహిస్తారు, అయితే నృత్యం, సంగీతం మరియు స్థానిక ఆచారాలు సామాజిక బంధాలను బలోపేతం చేస్తాయి.

రంగ పంచమి రోజున దేవతలు హోలీ ఆడటం కోసం భూమి మీదకు వస్తారని ప్రతీక. అలా వచ్చిన దేవతలు భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తారని నమ్ముతారు. ఈ రంగ పంచమి రోజున దేవుళ్లతో హోలీ ఆడటం వల్ల మన జీవితంలోని కష్టాలు, బాధలు తొలగిపోతాయని, జీవితంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తారు. రంగ పంచమి నాడు రంగులు పైకి ఎగరవేయడం ద్వారా భక్తులు, దేవతలతో కలిసి హోలీ ఆడతారని, ఫలితంగా, భక్తుల జీవితంలోని కోరికలన్నీ తీరి కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.


నిత్య స్తోత్రావళి

పంచాంగం

The Story of Prachetas Daksha refers to the Prajapati Daksha - ప్రజాపతి దక్షుడి పునర్జన్మ

ప్రజాపతి దక్షుడి పునర్జన్మ

ప్రాచేతసుని కుమారులైన ప్రాచీన బర్హిషులు పదిమంది ఒకనాడు సముద్ర గర్భంనుండి బుద్ధిపూర్వకంగా బయటకు వచ్చి భూమిపై సర్వత్రా వ్యాపించిన చెట్లను చూచి కోపగించి వారి నోటినుండి గాలితో కూడిన అగ్నిని పుట్టించి ఆ చెట్లను సమూలంగా దహించబోయారు. అది చూచిన చంద్రుడు భయపడి వారి కోపాన్ని పోగొట్టడానికి వారితో మృదువుగా మాట్లాడుతూ ఓ మహాత్ములారా! ఏ దిక్కూలేని ఈ చెట్లను నాశనం చేయడం ఉచితమేనా? అని ప్రశ్నించాడు.

(ఓషధులు మొదలైన వృక్షసంతతికి చంద్రుడు అధిపతి. అందుకే అతణ్ణి ఓషధీపతి అంటారు. కనుకనే పై సంఘటనలో చంద్రుడు స్పందించవలసి వచ్చింది.)

పూర్వం అభ్యుదయంపొందుతూ ఉన్న మిమ్మల్ని భగవంతుడు దయామూర్తులైన సృష్టికర్తలుగా పేర్కొన్నాడు. సృష్టికి మూలమైన అటువంటి మీరు ఈ విధంగా చెట్లను నశింపచేయడం తగునా? (తగదు).

ఓ ప్రచేతసులారా! సృష్టికి ప్రారంభంలో ప్రజాపతులకు అధిపతి అయిన శ్రీమన్నారాయణుడు వనస్పతులనూ ఓషధులనూ సృష్టించాడు. అఖిలలోకాధినాథుడూ అచ్యుతుడూ అయిన ఆ పద్మలోచనుడు జీవులకు పోషకంగా ఇష్టమైన ఆహారం కోసమూ, శరీరానికి శక్తి ఇవ్వటం కోసమూ ఈ వృక్షాలను ఏర్పాటు చేశాడు. చరాలూ పాదచారులూ అయిన జీవులకు అచరాలూ, పాదరహితాలూ అయిన వాటిని ఆహారంగా కల్పించాడు. రెండుచేతులు, రెండుకాళ్లు గల ప్రాణులకు నాలుగు కాళ్ల జంతువులనూ, వృక్షాలనూ ఆహారంగా ఏర్పాటు చేశాడు. అందువలన మీరు ఈ విధంగా చెట్లను కాల్చివేయటం న్యాయం కాదు. అదీగాక మీరు తపస్సుచేసి పుణ్యవంతులై ఉండటానికి ఆ దయామయుడైన నారాయణుని అనుగ్రహమే గదా కారణం. ఆ మహానుభావుడైన అచ్యుతుడేగదా మీకు లోకమంతటా “అనఘులు” అనే ప్రఖ్యాతిని కల్పించింది.

నిజానికి బ్రహ్మదేవుడు మిమ్మల్ని సృష్టి చేయడానికి నియమించాడు. అలాంటి మీకు సృష్టి నాశనంచేయాలని, ఈ వృక్ష దహనం మీద కోరిక ఎలా కలిగింది?

ఎల్లప్పుడూ గొప్ప సత్త్వగుణాలను కలిగివుంటూ సత్పురుషులుగా పేరు పొందండి. మీ తండ్రులు, తాతలు, పెద్దలు ఏనాడూ పొందని కోపతాపాలకు మీరు లోనుకాకండి. కోపంతో కూడిన పాపపు ఆలోచనలను విడిచి అదిగో జాలి చూపులతో భీతిల్లుతున్న వృక్షసమూహాలపై కరుణ చూపించండి.

బిడ్డలకు తల్లిదండ్రులు, కళ్ళకు కనురెప్పలు, భార్యకు భర్త, ప్రజలకు పాలకుడు, యాచకునికి ఇంటి యజమాని, మూర్ఖులకు జ్ఞాని మొదలగువారు నిజమైన క్షేమాన్ని కోరే ఆప్తబాంధవులు. అంతే తప్ప ఆపద సమయంలో ఆదుకోలేని కఠినచిత్తులు నిజమైన బంధువులు కానేకారు.

ఇంకా చంద్రుడు ప్రాచేతసులను ఇట్లా వేడుకొన్నాడు - సమస్త జీవరాసుల దేహాలలోపల సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఆత్మస్వరూపంలో ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. అట్లా తెలుసుకొని సర్వత్ర నిండి ఉన్న ఆ ఇందిరారమణుడైన గోవిందుని లోచూపులతో తనివితీరా చూడాలి. అట్లా చూచినట్లయితే పరిశుద్దాత్ములూ జ్ఞానస్వరూపులూ అయిన మిమ్మల్ని ఆ భగవంతుడు ఎంతో మెచ్చుకుంటాడు. అట్లా మెచ్చుకొన్న పరాత్పరుడు మీరు చూచే ప్రదేశమంతటా అన్నిట్లోనూ ఉన్నాడని తెలుసుకొని మీరు మీ కోపాన్ని శాంతింపజేసుకోవాలి. ఆగ్రహాన్ని త్యజించినవారై మీరు దహింపగా మిగిలిన వృక్షాలను ఇకనైనా సంతోషంగా బ్రతుకనీయాలి. ఓ పుణ్యాత్ములారా! మీరు నా ప్రార్థనను అంగీకరించాలి.

ఈ చెట్లకు కలిగిన ఆపదను పోగొట్టినందుకుగాను అప్పరస కుమార్తెయైన, వృక్షప్రుత్రిక అయిన మారిష అనే కన్యను మీకు భార్యగా ఇస్తున్నాను. కాదనక స్వీకరించి ఆనందించండి.

చంద్రుడు వారికి వీడ్కోలు పలికి మారిష అనే అప్పరసను ఆ ప్రాచీన బర్హిషులకు అప్పగించి వెళ్ళాడు. ఆ తరువాత

ఆ ప్రాచేతసులు ఆ మారిషను వివాహం చేసుకొన్నారు. వారికి ధైర్యవంతుడు, బ్రహ్మతో సమానుడు అయిన దక్షప్రజాపతి పుట్టాడు.

ఎవరి సంతానం ఈ లోకమంతా ఆవరించిందో ఆ దక్షుడు, కుండలో నీటిని సంపూర్ణంగా నింపినట్లుగా ఈ భూమండలమంతటా తన సంతానాన్ని పుట్టించాడు.

కూతురంటే ఇష్టపడే దక్షప్రజాపతి తన ఆత్మశక్తితో కొన్ని జీవరాశుల్ని పుట్టించాడు. మరికొన్ని జీవరాసుల్ని సయంగా కన్నాడు. వీటితోపాటు కొన్ని ఆకాశగమనం కలవి, మరికొన్ని భూమిపై తిరుగాడేవి, అడవుల్లో సంచరించేవి, నీళ్లలో జీవించేవి, రాత్రిళ్లు తిరిగేవి, పగటిపూట సంచరించేవి అయిన జీవులను, జంతువులను దక్షుడు పుట్టించాడు.

దక్షుడు నిశ్చలమైన బుద్ధితో దేవ, రాక్షస, మానవ, యక్ష, కిన్నర, నాగ, గరుడ, పక్షులను, వృక్షాలను, పర్వతాలను ఇలా వరుసగా అనేక జీవ, అజీవ జాతులను క్రమంగా సృష్టించి విశాలమైన యశస్సును సంపాదించాడు.

దక్షుడు ఈ విధంగా పలురకాలుగా, అనేక విధాలైన, జీవజాలాన్ని సకల లోకాలలోను ఆవిర్భవింపజేసినప్పటికీ ఏ కారణంచేతనో తృప్తినిమాత్రం పొందలేకపోయాడు.

ఈ విధంగా ప్రాణుల సృష్టితో నిండిపోయిన లోకాన్ని చూచి దక్షుడు బాధపడి ఇంకా సృష్టి చేయాలన్న కోరికను వదిలిపెట్టి పరమ పురుషుని ఆశ్రయించాలని తలచాడు.

ఈ విధంగా తాను చేసిన సృష్టి తనకే సంతృప్తి కలిగించనందువల్ల దక్షప్రజాపతి బాధపడుతూ శ్రీహరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నవాడై

ఆనందకరమైన, దుఃఖహరమైన, శబరస్త్రీల శృంగారచేష్టలతో కూడిన వీక్షణాలతో వివిధసుఖాలకు ఆస్పదమై ఒప్పుతున్న వింధ్య పర్వత ప్రాంతం వద్దకు వెళ్ళాడు.

దక్షుడు వింధ్య పర్వతం లోయలో సకల పాపహరమైన “అఘమర్షణం” అనే తీర్ధం చేరి అందు నిత్యం యజ్ఞకర్మలు

చేస్తూ నిష్టగా అతి తీవ్రమైన తపస్సు చేశాడు. దానికి సంతోషించి సాక్షాత్కరించిన శ్రీహరిని 'హంసగుహ్యం' అనే శ్రేష్ఠమైన స్తోత్రంతో ఆ ప్రజాపతి ఇలా స్తుతించాడు.

('అఘమర్షణం'= పాపపరిహారకమైంది.)


దక్షుడు కావించిన హంసగుహ్యం బను స్తవరాజము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

Yamadharmaraju’s explanation to his messengers (Yamadutas) about Lord Vishnu - యమధర్మరాజు తన దూతలకు విష్ణువును గూర్చి దెలుపుట

యమధర్మరాజు తన దూతలకు విష్ణువును గూర్చి దెలుపుట

అజామిళుని కథను పూర్తిగా విన్న పరీక్షిత్తు శుక మహర్షితో ఓ మహర్షీ! యమకింకరుల ద్వారా జరిగిన కథను మొత్తం విన్న యముడు ఏమన్నాడు? ఈ విధంగా యముని ఆజ్ఞ తిరస్కరింపబడిన సందర్భం ఇంతకు ముందు ఏదైనా ఉందా? ఎక్కడైనా జరిగిందా? తెలియజేయగలరు. ఇలాంటివాటికి మీరు తప్ప ఇంకెవరు సమాధానం చెప్పగలరు? అందువల్ల మీ సుధామయవాక్కులతో నన్ను అనుగ్రహించగలరు అని కోరగా శుకుడు ఇలా అన్నాడు.

శ్రీమహావిష్ణువుదూతలచే నిశ్చేష్టితులైన యమభటులు, తమచేత బంధింపబడిన అజామిళుడు దేవదూతలచే విడిపింపబడిన వృత్తాంతాన్ని యమునికి పూర్వం తెలియజేసి ఉన్నారు. ఆ సంగతిని నీకు చక్కగా వివరిస్తాను వినుము.

యముని సన్నిధిని చేరిన యమకింకరులు ఓ స్వామీ! జీవులు సత్త్వ, రజస్తమో గుణాలచే, మనోవాక్కాయ కర్మలచే చేసిన పలురకాల కర్మలకు ఫలితాన్ని నిర్ణయించేవారు మీరు కాక ఇంకా ఎవరైనా ఉన్నారా? తెలియజేయుమని కోరారు.

ఓ యమధర్మరాజా! లోకంలో నీవు కాక శిక్షలు వేసేవారు ఇంకా చాలామంది ఉంటే, ఈ జనన మరణ సంబంధాలైన క్రియా కలాపాలు ఈ లోకంలో సక్రమంగా ఎలా జరుగుతాయి?

లోకంలో చిన్న చిన్న అధిపతులను కూడా శాసకులని ఎలా అంటామో అలాగే లోకంలోని కర్మఫలాలకు శిక్షను విధించేవారు ఎక్కువగా ఉన్నట్లైతే 'శాసకుడు' అనే మాట కేవలం మర్యాదకోసమే అవుతుంది తప్ప నిజం కాదు కదా?

ఓ ధర్మపాలకా! ఈ ముల్లోకాలలో జీవుల కర్మలకు అనుగుణంగా ఫలితాన్ని నిర్ణయించగలిగే సమర్దుడైన అధికారివి నీవు మాత్రమే కదా? మరి అలాంటి తిరుగులేని నీ శాసనాన్ని మార్చగలిగే శక్తిమంతులు ఎవరైనా ఉన్నారా?

ఓ సూర్యపుత్రా! ఈ జీవుల కర్మలకు నిష్పక్షపాతంగా శిక్షలు నిర్ణయించ గలిగేది నీవు ఒక్కడివే కదా! అందుకే నిన్ను పాశహస్తుడని అంటారు. అలాంటి నువ్వు కాక ఇంకెవరైనా శాసకులు ఉన్నారా?

ఈ ముల్లోకాలలో నిరాటంకంగా మీ ఆజ్ఞయే ప్రవర్తిస్తూ ఉండగా, ఈనాడు మీ ఆజ్ఞతో భూలోకంనుండి మేము తీసుకురాబోయిన దుర్మార్గుని జీవాత్మను మానుండి నలుగురు దివ్యపురుషులు లాగుకొని, విడిపించి మమ్మల్ని భయపెట్టి, అడ్డగించి తరిమి వారు ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. వారు ఎక్కడి నుండి వచ్చారో ఎవ్వరో దయచేసి మాకు తెలియజేయండి.

అని అడిగారని చెబుతూ శుకమహర్షి తిరిగి ఇలా అన్నాడు. తన కింకరుల ద్వారా జరిగినదంతా తెలుసుకున్న యమధర్మరాజు సర్వం గ్రహించినవాడై నారాయణుని పాదపద్మాలను మనసులో నిలుపుకొని పరమభక్తితో నమస్కరిస్తూ తన భటులకు ఇలా సమాధాన మిచ్చాడు.

ఉన్నాడు. నాకంటే ఘనుడైనవాడు ఒకడున్నాడు. అతడు బయటికి కానరాకుండా ప్రపంచమంతటా నిండి ఉన్నాడు. అత్యద్భుతంగా సమగ్రంగా చీరలో దారాల రీతిగా వ్యాపించి ఉన్నాడు. అతని ఆజ్ఞానుసారం జీవులందరూ త్రాళ్లతో కట్టబడిన పశువుల మాదిరిగా ఆ యా నామాలతో సంకేతాలతో గిరగిర తిరుగుతున్నారు. నేను చేసే పూజలన్నీ ఆయన పాదాలకే అంకితం. ప్రాణులు పుట్టటం బ్రతకటం మరణించటం అన్నీ ఆయన లీలావిలాసాలే. ఈ సమస్త జగత్తూ ఆయనలోనే లీనమై ఉంటుంది. ఆయన నామాలు ఉచ్చరిస్తే చాలు సమస్త కర్మబంధాలూ నిర్మూలమైపోతాయి.

ఇంకా చెబుతాను వినండి. నేనేకాదు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని నిరృతి, వాయుదేవుడు; సూర్యచంద్రులు; బ్రహ్మ, ఈశ్వరుడు, రుద్రుడు, ప్రమథగణాలు, బ్రహ్మర్షులు మొదలైన వారు ఎవరు కూడా ఆ పరమ పురుషుణ్ణి దర్శించలేరు.

సత్త్వగుణప్రధానులై ఉండికూడా పొరపాటున రజస్తమో గుణాలకు వశులైనవారు, శ్రీహరియొక్క సదా ఏకత్త్వంతో ఉండే తత్త్వాన్ని దర్శింపలేరు. ఇక నిరంతరం త్రిగుణాలతో కూడినవారికి ఆ దివ్యతత్త్వాన్ని దర్శించడం సాధ్యమా? (సాధ్యంకాదు).

జన్మలేనివాడూ, ప్రమాణాలకు దొరకనివాడూ, నాశం లేనివాడూ, అంతంలేనివాడూ, నిత్యసత్యమైనవాడూ, సకలజీవుల్లో జీవాత్మ, పరమాత్మ అనే రెండు రూపాల్లో తానే ప్రకాశిస్తుండేవాడూ, అయిన పురుషోత్తముణ్ణి త్రికరణవైభవంతో గరిష్ఠులై బాహ్యంగా ఎంత శోధించికూడా ఆ వెర్రిజీవులు అన్ని వస్తువులను స్పష్టంగా చూడగల్గిందైనా - కన్ను తనను తాను చూడలేనట్లుగా - ఆ భగవంతుణ్ణి చూడలేరు.

ఆయన పరమాత్ముడు. భక్తులను పరిపాలించేవాడు. దుష్టులను సంహరించేవాడు. గరుత్మంతునిపై అధిష్టించి సమస్త లోకాలలో విహరిస్తూ ఉంటాడు. ఆ మహానుభావుని ప్రియమైన దూతలుకూడా ఆకారంలో, గుణాలలో స్వభావంలో ఆ శ్రీహరినే పోలి ఉంటారు. ఆ దేవుని దూతలకు దేవేంద్రుడు సైతం చేతులు మోడ్చి నమస్కరిస్తాడు. అటువంటి విష్ణుదూతలు తమ దేహకాంతులు దిక్కులనిండా వ్యాపింపగా లోకమంతటా సంచరిస్తుంటారు.

మహోన్నతమైన తేజస్సుతో, అత్యంత బలవంతులై, శాంతమూర్తులై, వీరులై, దేవతలచేత సేవింపబడుతున్న వారైన విష్ణుదూతలు శ్రీహరిభక్తుల రక్షణార్థమై సర్వత్రా వ్యాపించి ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు.

నాచేతా, మీచేతా, దేవతలచేతా, రాక్షసులచేతా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఈ ముల్లోకాలలోని విష్ణుభక్తులను విష్ణుదూతలు రక్షిస్తూ ఉంటారు.

భగవంతుడు ప్రతిష్టించిన ధర్మాన్నికాని, భగవత్తత్త్వాన్నికాని, దేవతలు, గరుడులు, ఉరగులు, సిద్దులు, సాధ్యులు, మానవులు, పక్షులు, మునులు, యక్షులు, విద్యాధరులు, ఖేచరులు మొదలైనవారు ఎవరూ కూడా సంపూర్ణంగా గ్రహించలేరు. వారి బుద్ధికి అందదు కూడా!

ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు వీరందరూ ఎంతటివారైనా ఏనాటికీ కూడా శ్రీహరి తత్త్వాన్ని, గొప్పతనాన్ని తెలుసుకోలేరు.

ఈ లోకంలో విష్ణుపరమైన విశేషజ్ఞానసంపదను, సత్‌, చిత్‌, ఆనంద స్వరూపాన్ని శుద్ధ, సత్త్వ, పరబ్రహ్మాన్ని పరమశివుడు, బ్రహ్మదేవుడు, కుమారస్వామి, కపిలుడు, నారదుడు, భీష్ముడు, మనుచక్రవర్తి బలిచక్రవర్తి జనకమహారాజు, ప్రహ్లాదుడు, శుకమహర్షి జ్ఞానమూర్తి వేదవ్యాసమహర్షి మొదలయినవారు కొంతవరకు మాత్రమే తెలుసుకోగలరు. వీరు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. సాధ్యం కూడా కాదు.

ఉపనిషద్‌గోచరమైన శ్రీహరియొక్క మహాద్భుతమైన తత్త్వాన్ని పై పన్నెండుగురు మహాత్ములు మాత్రమే గ్రహించగలరు. ఇతరులు ఈ జ్ఞాన, భక్త రక్షణ రహస్యాలను ఏమాత్రం గ్రహించలేరు.

(ఇక్కడ పేర్కొన్న పన్నిద్దరు భాగవతులు 1. పరమశివుడు 2. బ్రహ్మ 3. కుమారస్వామి 4. కపిలుడు 
5. నారదుడు 6. భీష్ముడు 7. మనుచక్రవర్తి 8. బలిచక్రవర్తి 9. జనకమహారాజు 10. ప్రహ్లాదుడు 
11.శుకమహర్షి 12. వేదవ్యాసుడు అనేవారు.)

ఏ నామస్మరణ అమృతత్వాన్ని ప్రసాదిస్తుందో, ఏ నామ జపం ఉత్తమ ధర్మమార్గాన్ని చూపిస్తుందో, ఏ మంత్రమైతే భక్తితత్త్వాన్ని ఒంటబట్టిస్తుందో అదే మూర్తీభవించిన మహిమాన్వితమైన శ్రీహరినామసంకీర్తనం.

ఓ నాయనలారా! ఘోరమైన మృత్యుపాశానికి గురి అయి నరకానికి పోవలసిన అజామిళుడు తన చివరి గడియలలో కలిగిన బుద్ధి విశేషంతో నామస్మరణ చేసి యమపాశం కట్లనుండి విముక్తుడైన సంఘటనను మీరు కళ్ళారా చూశారు కదా?

ఆకతాయి, దుష్టుడు, మహాపాపి ఐన అజామిళుడు చివరిక్షణంలో హరి నామస్మరణ చేసి వైకుంఠాన్ని పొందాడు కదా! మానవులు ఇలా విచారపడడం ఎందుకు? భగవన్నామకీర్తనం భయంకరమైన పాపపు అడవుల్నే కాల్చేస్తుంది. ఇందులో సందేహం లేదు.

(అంత్యకాలంలో భగవంతుని నామాన్ని తలచినవారికి వారు ఎంత పాపకర్ములైనా, సరే భగవత్కృపా పాత్రులవుతారు.)

బుద్ధీహీనులైన మానవులు దాటశక్యం కాని మహామాయలో చిక్కుకొని తమ తెలివిని కోల్పోతున్నారు. ఈ యథార్థమైన విషయాన్ని తమ మనస్సులో కొంచెమైనా ఆలోచించి తెలుసుకోలేరు.

విజ్ఞులైనవారు ఈ రీతిగా ఒకే లక్ష్యమునందు నిల్పిన చిత్తంతో, ఏకారణంలేకనే ఈశ్వరుడైన విష్ణువును హృదయంలో నిల్పుతారు. భగవద్భక్తులయొక్క కలయికచే కల్గిన పరిపాకంవల్ల భగవంతుని చేరుకొంటారు. వారిని దండించాలని మావద్దకు తీసుకురావలదు. పాపాలు తొలగిన తర్వాత దండనార్హులుగా వాళ్లను గుర్తించలేము. పైగా విష్ణుచక్రం వీళ్లను రక్షిస్తూంటుంది. దేవతలు వాళ్లను సేవిస్తుంటారు. ముక్తికారణంగా మిక్కిలి శ్రేష్ఠులు.

విష్ణుభక్తులైన మహానుభావుల కీర్తిని సిద్దులు, సాధ్యులు, ఖేచరులు లలితగీతాలతో గానం చేస్తుంటారు. అటువంటి భాగవతులు ముక్తి సౌధంలో అందమైన చంద్రశాలలలో నివసిస్తుంటారు. సాటిలేనివారూ, సౌందర్యవంతులూ అయిన వైష్ణవోత్తముల చేతులలో శంఖచక్రాలూ గదాఖడ్గాలూ విరాజిల్లుతుంటాయి.

వేదాంతసారమైన భగవంతునియందుమాత్రమే మనస్సును లగ్నం చేయగలవారు, సనకాది మునులు పొందగలిగిన శాశ్వత ఆనందాన్ని అనుభవించేవారు, విష్ణుపాదారవింద అమృతాన్ని ఆస్వాదించి తన్మయులు ఐనవారు, ఐహిక సుఖలంపట పాపాలను పోగొట్టుకో గలిగినవారు, నిత్య సత్య భగవత్స్వరూపాన్ని చూడగలవారు, భక్తి సామ్రాజ్యానికి అభిషిక్తులై ఏనాడు కష్టం పొందని వారు శ్రీమన్నారాయణుని పరమభక్తులు.

కాబట్టి దూతలారా! పరమభాగవతోత్తముల జోలికి మీరు వెళ్ళవద్దు. విష్ణవుయొక్క పాదపద్మాలను ఆశ్రయించని దుర్మార్గులను వారి మరణకాలంలో పట్టీ బంధించి తీసుకురండి.

పరిహాసానికైనా భగవన్నామం పలుకలేని చెడు మాటకారుల్ని, కలలోనైనా భగవంతుని పాదపద్మాలను దర్శించని వారినీ, వేడుకగానైనా హరికథలను వినక చెడువిషయాలు వినేవారిని, దైవసంబంధమైన ఉత్సవాల సమయంలోనైనా దేవాలయం వైపు వెళ్ళని చెడుపాదాలు కలవారిని, హరి భక్తుల పాదధూళిని పరమపవిత్రమైందిగా భావించని వారిని, అలాంటి వారికి సంబంధించినవారిని, వారితో కలిసిన వారిని కూడా ముందుగా బంధించి తీసుకురండి.

ఓ భటులారా! సకల పాపకార్యాలకూ నెలవైన సంసారమనే ఇంటిలో ఉంటూ, జ్ఞానం నశించి, మహాత్ములైన యోగుల సాంగత్యానికి దూరంగా ఉండే నీచ మానవులను పట్టుకురండి.

హరిభక్తులకందరికీ ముక్తి తంగేటిజున్నులాగా సులభ సాధమై ఉంది. హరినామం నుడువనివానికీ, హరిచరణధ్యానం చేయనివానికీ, ముక్తి హరిభక్తులకువలె సులభసాధ్యమవుతుందా? (సులభసాధ్యం కాదు).

శ్రీహరిమీది భక్తి మాత్రమే కైవల్యానికి సోపానమని పూర్తిగా విశ్వసించినవారినీ, వారి బంధువర్గాన్నీ వారితో కలిసి వున్నవారినీ పట్టుకోకండి. వారి మార్గాలవైపు ఏమాత్రం వెళ్ళకండి.

ఈ విధంగా చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. శ్రీకృష్ణనామ సంకీర్తనం లోకాలకు శుభాలను ప్రసాదిస్తుందనీ, లోకాలను సమ్మోహింపజేస్తుందనీ, లోకులందరిచేతా విశేషంగా గానం చేయబడుతుందనీ, పలువిధాలైన మాయాబంధాలనూ తెంపివేస్తుందనీ, అమోఘాలయిన హరిపరాక్రమ గాథలను ఆకర్షించేవారి అంతరంగాలు అత్యంత నిర్మలంగా ఉంటాయనీ, ఈ విధంగా వ్రతాల ఆచరణచే కానీ మనస్సులు పవిత్రంకావనీ, శ్రీకృష్ణదేవుని పాదపద్మాలను హృదయపద్మంలో నిలుపుకొని ఆరాధించేవారిని ఇతరపాపాలుగానీ, అజ్ఞానంగానీ, వ్యసనాలుగానీ అంటనేరవని యమధర్మరాజు తన కింకరులకు ఉపదేశించాడు. తమ ప్రభువుచేత కీర్తింపబడిన దేవదేవుని మహామహిమలను విని కాలకింకరులు ఆశ్చర్యచకితులైనారు. వారు ఆనాటి నుంచీ విష్ణుభక్తుల వైపు కన్నెత్తి చూడటానికి సైతం భయపడసాగారు. ఓ పరీక్షిన్మహారాజా! పరమరహస్యమైన ఈ ఇతిహాసాన్ని సర్వజ్ఞుడైన అగస్త్యమహర్షి సమస్త దుఃఖాలనూ విలయం చేసేదీ, సమస్త పుణ్యాలకూ నిలయమైందీ అయిన మలయపర్వతంమీద దేవాదిదేవుడైన వాసుదేవుణ్ణి ఆరాధిస్తూ నాకు ఈ వృత్తాంతాన్ని తెలియచేశాడు. అని చెప్పిన శుకయోగీంద్రుని మాటలు విని పరీక్షిన్నరేంద్రుడు ఆశ్చర్యం, ఆనందం నిండిన హృదయంతో ఇలా అన్నాడు.

అయ్యా! శుకమహర్షీ! ఇంతకుముందు స్వాయంభువ మనువు వృత్తాంతం చెప్పావు. ఆయన పరిపాలించే కాలంలో దేవతలు, రాక్షసులు, పక్షులు, పాములు, మానవులు మొదలైన ప్రాణుల సృష్టిక్రమాన్ని గూర్చి కొంతకొంత చెప్పావు. ఆ విషయాన్నే ఇంకా విస్తారంగా వివరించి చెప్పు.

ఈ విధంగా పరీక్షిత్తు ప్రశ్నించగా, హృదయ సంస్కారంతో ఆనందించినవాడై శుకమహర్షి సమాధానం చెప్పాడు. ఓ మునులారా! ఏమరుపాటులేకుండా శ్రద్ధగా వినండి.

ప్రజాపతి దక్షుడి పునర్జన్మ

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

The Realization of Ajamila - అజామిళుడి పశ్చాత్తాపం

అజామిళుడి పశ్చాత్తాపం

ఋక్‌, యజుస్‌, సామవేదాల సారభూతం, ఆనందకరం, సమస్తశుభప్రదగుణాలకు నిలయం, పరమాత్ముని దర్మప్రబోధం అయిన విష్ణు, యమదూతల సంవాదాన్ని అజామిళుడు శ్రద్దాళువై ఆలకిస్తూ శ్రీమన్నారాయణునిచరణకమలస్మరణమనే నిర్మలజలం అతని మహాపాతక సమూహాలన్నింటినీ కడిగివేసింది. అతని హృదయం నిశ్చలభక్తికి నిలయమై క్షణమాత్రంలో అతనికి జ్ఞానోదయమయింది.

ఇప్పటిజన్మలో తాను చేసినపాపాలన్నీ అజామిళుడికి మాటిమాటికి జ్ఞాపకానికి వచ్చి, బాధపెడుతుండగా, పశ్చాత్తాపహృదయంతో శ్రీహరిని శరణుకోరుకొంటూ, ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు.

నేను ఆ శూద్రకాంతమీద అనురాగం పెంచుకున్నాను. ఆ జారిణియందు సంతానాన్ని కన్నాను. కులగౌరవాన్ని గోదావరిలో కలిపి వేశాను. నా బ్రతుకు రచ్చల కెక్కించాను. సిగ్గుమాలిన పనులకు పాల్పడి సాటివారిలో తలవంపులు తెచ్చుకొన్నాను. వార్ధక్యం పైనబడినప్పటికీ సంసార బంధాలనుంచి బయటపడలేక - లోకనిందలను లెక్క చేయకుండా వారకాంతా పరాయణుండనై ఆ రోత సుఖాల రొచ్చులో మునిగి తేలుతూ నా బ్రతుకంతా పాడుచేసుకున్నాను. పవిత్రమైన జీవితం భస్మమైపోయింది. నా చదువు చట్టుబండలైంది. నా శాస్త్రజ్ఞానమంతా శూన్యమైపోయింది. నా బుద్ధి పురుగు మేసింది. పుణ్యం బుగ్గి అయింది. నీతి అడుగంటింది. నియమం మరుగుపడింది. నా తెలివి తెల్లవారింది.

నిండుయౌవనం కలిగి, నన్ను మక్కువతో మన్నించే భార్యను వదిలిపెట్టి, మోసగత్తె, తాగుబోతు అయిన ఈ నీచస్త్రీ సాంగత్యం పొంది వ్యభిచారినై భ్రష్టుడనయ్యాను.

నేను తప్ప ఏ ఆధారమూ లేని సౌమ్యులు, సాధుజీవనులు, పెద్దలూ అయిన నా తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా తీవ్రమైన కష్టాలకు గురిచేసి, ఇంటినుండి వెళ్ళగొట్టిన దుర్మార్గుడిని. అటువంటి ఆ ఘోర పాప ఫలితాలు నన్ను మహాఅగ్నిజ్వాలల్లాగా కాల్చకుండా ఎలా ఉండనిచ్చాయో గదా!

చిన్నప్పటి నుండి ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా పెంచి పోషించిన తల్లిదండ్రులను, నా శ్రేయస్సు కోరే చుట్టాలను, నాకు మేలు చేసినవారిని కృతఘ్నుడినై వదలిపెట్టాను.

ఇన్ని ఘోరపాపాలు చేసి భయంకర నరకకూపంలో పడి కొట్టుకొనిపోతున్న నన్ను దయతలచి ఆపదలనుండి రక్షించి, నా పాపాలను పోగొట్టిన ఈ పుణ్యపురుషులు ఎక్కడివారో కదా!

ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ముందు ఏదో కలవలె అనిపించింది. మరుక్షణంలో ప్రత్యక్షంగా కనిపించింది. నన్ను మృత్యుపాశాలతో బంధించి ఈడ్చుకొని వచ్చిన ఆ భయంకర స్వరూపాలు గల మహావీరులు ఆ వికృతాకారులు ఆ వక్రమార్గసంచారులు తమ ఉద్రేకాన్నీ ఉత్సాహాన్నీ వదలిపెట్టి ఎక్కడికి వెళ్లారో కదా!

మిక్కిలి క్రూరమైన యమపాశాలచే కట్టుబడి నరకమనే సముద్రంలో మునిగిపోతున్న నన్ను కాపాడిన సూర్యుతేజులు, పద్మనేత్రులు, సుందర రూపులు దయ కల్గినట్టి ఆ నలుగురు దివ్యులు ఎటువైపు వెళ్ళారో కదా!

నన్ను కాపాడిన పుణ్యాత్ములు, తామరులవంటి కన్నులతో, నల్లనిశరీరాలతో ప్రకాశించేవారు, పీతాంబరులు, శంఖచక్రాలను ధరించినవారు, ఆజానుబాహులు, నవ్వు ముఖం కలవారు, వేలాడుతున్న చెవి ఆభరణాలు, బంగారు వన్నెగల వస్త్రాలు ధరించిన ఆ దయాసముద్రులు ఎక్కడికి పోయారో కదా!

మిక్కిలి పాపాత్ముడినైన నాకు నేను పూర్వజన్మలోచేసిన పుణ్య విశేషంచేతనే అట్టి దేవతాశ్రేష్ఠుల దర్శనం కలిగింది. తద్ద్వారా మనస్సుకు ప్రశాంతత చేకూరింది. లేకుంటే నీచస్త్రీ సాంగత్యం వలన పాపాత్ముడినైన నాకు మరణ సమయంలో నారాయణ నామస్మరణం ఎలా సాధ్యపడుతుంది? అంతేకాక

పాపాత్ముడను, బ్రహ్మహత్య వంటి ఘోరపాపాలను చేసినవాణ్ణి, దురభిమానుణ్ణి, లోభిని, కామాతురుణ్ణి, మాత్సర్యం కలిగినవాణ్ణి, ఇలాంటి నా మనసుకు ఆ నారాయణుని పవిత్రమైననామగానం చేయాలనే ఆలోచన ఎలా వస్తుంది?

నీచమైన మోహమనే చీకటిలో మునిగి ఉన్నవాడను, పంచమహాపాపాలను చేసినవాడను, కుటిలుడను, జూద వ్యసనపరుడను, నిందాపరుడను, గుణహీనుణ్ణి, అయిన నాకు అద్భుతమైన, విష్ణునామాన్ని స్మరించే అర్హత ఉందా? కేవలం నేను పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యాల ఫలితంవలన మాత్రమే తప్ప, హరినామస్మరణ యోగం ఎలా కలుగుతుంది?

అని పరిపరివిధాల ఆలోచించుకొని, పుణ్యమైన వర్తనంకలదీ, చైతన్యానికి నెలవైన స్థానానికి ఉన్ముఖమైన ఆసక్తి కలదానికీ, మోక్షస్థానంలో అనురక్తితో కూడిందానికీ, సుఖప్రదమైన ప్రయత్న క్రియకు చెందిన సామర్ధ్యం కలదానికి, ధైర్యంతో పొందబడిన శ్రేష్ఠమైనముక్తి కలదానికీ, సమస్త భూమండలాన్నీ ధరించగల ఉత్తమభక్తితో కూడిందానికీ, ఇట్టె విష్ణువ్రతసంపదకై నేను మనస్సును, ఇంద్రియాలను, శ్వాసను నియమించినవాణ్ణై ప్రయత్నిస్తాను.

నారాయణ నామగానంవలన భవబంధాలనుండి విముక్తి పొందాను. మాయవల్ల కలిగిన అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాను. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలనే ఆరుగురు అంతశ్శత్రువులను తరిమికొట్టాను. జనన మరణ పరంపర అనే దుఃఖ సాగరాన్ని దాటాను.

దాసీ రూపంలో వచ్చిన స్త్రీ నాలో కోరికలను రగిల్చి నన్ను కోతివలె ఆడించింది. అధోగతికి ఈడ్చిన ఆ మాయ నన్ను తొలగిపోవడం నేను కనుగొన్నాను.

ఈ విధంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్న అజామిళునిలో విష్ణుభక్తి అనే జ్ఞానదీపం ఆత్మచైతన్యమనే తైలంతో ప్రకాశించింది.

పునర్జన్మను పొందిన అజామిళుడు ఉత్తముల సాంగత్యంలో ఉంటూ వారితో జరిపే సంభాషణలవలన పవిత్రుడై, ఇహలోక బంధాలమీద విరక్తిచెంది బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను వదిలి సర్వేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుని దయ అనే మహాభాగ్యంకోసం ప్రయత్నిస్తూ
భాగవతులతో జరిపే సత్సంగచర్చలు ఈ లోకంలో ఎప్పటికీ తరగని పుణ్యమనే సొమ్ముల మూటలు. మోక్షలక్షి యొక్క తరగని విలాసాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలనే శత్రువులు దగ్గరకు రాలేని రక్షణస్థావరాలు.

(కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు జీవుడి మనస్సులో దాగి ఉండి, కూడని పనులు చేయిస్తాయి. పతనంవైపు నడిపిస్తాయి. అందువల్ల వాటిని 'అరిషడ్వర్గాలు' అంటారు. జీవుడిలోన ఉండే శత్రువులు కనుక 'అంతశ్శత్రువులు' అంటారు.

ఈ విధంగా అజామిళుడు తననుగురించి తాను విమర్శించుకొని పరమాత్మతత్త్వాన్ని తెలుసుకున్నాడు. సంసార బంధాలను వదిలిపెట్టి హరిద్వారం చేరి ఒక దేవాలయంలో ధ్యానంలో ఉన్నాడు. తదనంతరం తన ఆత్మను యోగసమాధి ద్వారా పరమాత్మలో ఐక్యం చేయగా తనను పూర్వం యమభటుల నుండి రక్షించిన విష్ణుదూతలు సాక్షాత్కరించారు. వారిని చూచి అజామిళుడు వినయంగా నమస్కరించాడు.

ఈ ప్రకారంగా అజామిళుడు యోగమార్గం ద్వారా తన శరీరాన్ని పరిత్యజించి దివ్యదేహం ధరించినవాడై మున్ను తన్ను రక్షించిన విష్ణుకింకరులను తన కనులముందు సందర్శించాడు. వారిని తిలకించగానే అతని దేహం ఆనందంతో పులకించింది. పారవశ్యంతో ఒడలంతా చెమర్చింది. ఆనందం చిగిర్చింది. హృదయం హర్షంతో నిండింది. యోగప్రభావం ప్రకాశించింది. విస్మయంతో, ఉత్సాహంతో కూడిన మందహాసం అతని ముఖారవిందం మీద చిందులు త్రొక్కింది. సమస్త లోకాలనూ ప్రకాశింపజేసేదీ, మంగళప్రదమైందీ అయిన భగవంతుని శుభాకారాన్ని సందర్శించాలనే కుతూహలం మనస్సులో కలిగింది. అజామిళుడు విష్ణుదూతలకు నమస్కరిస్తూ గంగాతీరంలో శరీరం విడిచాడు. వెనువెంటనే అతనికి నారాయణ పార్శ్వచరులైన మహాభక్తుల స్వరూపం ప్రాప్తించింది. అనంతరం అతడు విష్ణుదూతలతో కలిసి రత్నాలు పొదిగిన బంగారు విమానాన్ని అధిష్టించి ఆనందమయం, భోగ భాగ్య నిలయం అయిన వైకుంఠనగరంలో ప్రవేశించి శ్రీమన్నారాయణుని చరణారవిందాలను సేవించే పరిణత దశకు చేరుకున్నాడు. ఈ విధంగా అజామిళుడు సర్వధర్మాలనూ ఉల్లంఘించినవాడు, దాసీపుత్రిని పెండ్లాడినవాడు, దుష్కర్మలచేత భ్రష్టుడైనవాడు అయి నరకంలో పడబోతూ కూడా నారాయణ నామస్మరణంవల్ల క్షణమాత్రంలో మోక్షాన్ని అందుకున్నాడు.

కర్మలన్నీ విడిపోవటానికి వేరే ఉపాయం ఏదీ లేదు. చెప్పిన మాట వినకుండా ఎదురుతిరిగి మనస్సు ఎన్నిమార్గాల్లో పోయినా సర్వదా నారాయణ నామాన్ని ఉచ్చరించటమే కర్మఫరిత్యాణానికి సరైన ఉపాయం.

పాండవ వంశాన్ని పావనంచేసే ఓ మహారాజా! ఈ అజామిళుని వృత్తాంతాన్ని ఎవడైనా సరే ఏకాగ్రచిత్తంతో విన్నా, చదివినా అలాంటి మానవుడు మోక్షలక్షికి నెలవై, యమకింకరులకు కనపడకుండా శాశ్వతవైకుంఠవాసి అవుతాడు.

అజామిళుడు కేవలం తన కొడుకు పేరుతో మాత్రమే చివరిదశలో భగవన్నామం ఔపచారికంగా స్మరించి మోక్షాన్ని పొందాడు. ఇంకా సంపూర్ణమైన భక్తితో పలికితే ఫలితం ఇంకెంత ఉంటుందో చెప్పలేము కదా!

విష్ణునామం తలచిన వారికి ముక్తి ఎంత దగ్గరవుతుందో, ఆ నామాన్ని స్మరించని వారికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ ముక్తిపదం దూరంగానే ఉంటుంది.

యమధర్మరాజు తన దూతలకు విష్ణువును గూర్చి దెలుపుట

Sree Maha Bhagavathamu Part 6 - శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీరస్తు శీమహాభాగవతము షష్టస్కంధము

శ్రీ వత్సాంకితకౌస్తుభస్ఫురితలక్ష్మీచారువక్షస్థ్సల
శ్రీవిభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షుఁ గంజాత భూ
దేవేంద్రాదిసమస్తదేవమకుటోద్దీప్తోరురత్నప్రభా
వ్యావిద్ధాంఘ్రిసరోజు నచ్యుతుం గృపావాసుం బ్రశంసించెదన్‌.


శ్రీవత్సమనే పేరుగల పుట్టుమచ్చ, కౌస్తుభమనే రత్నం, లక్ష్మీదేవికి నివాసస్థానం అయిన వక్షస్థలం, శోభాకరమైన దేహకాంతి, నల్లని శరీరచ్చాయ, శుభప్రదమైన తామరలవంటి కన్నులు, పద్మంనుండి పుట్టిన బ్రహ్మ మహేంద్రుడు మొదలైన సర్వదేవతల కిరీటాల్లోని రత్నకాంతులచే ప్రకాశించే పాదపద్మాలు కలవానిని, నిత్యుడు త్రికాలాలలో ఎల్లప్పుడూ ఉండువాడు, దయాసముద్రుడు అయిన విష్ణుమూర్తిని స్తుతిస్తాను.

విష్ణు పాదారవింద మననం వలన ఆనందం పొందిన శౌనకాది ముని బృందాలతో, పురాణ, ఇతిహాసాల సారాన్ని వివరించడంలో సమర్ధుడైన సూతమహర్షి ఇలా చెప్పసాగాడు.

విష్ణుకథలను వినడంలో ఆసక్తికలిగిన పరీక్షిన్మహారాజు పండితులకు ఆనందం కల్గించడంలో సమర్దుడైన శుకయోగీంద్రుని కథను వినాలనే ఆసక్తితో ఇలా ప్రార్థించాడు.

విశిష్టమైన ఆరుగుణాలు కలిగిన ఓ శుకమునీంద్రా! జీవుడు పరమపదాన్ని పొందే మార్గాన్ని నాకు వివరించి చెప్పావు. నివృత్తి మార్గాన్ని అనుసరించిన జీవుడు ఊర్ధ్వగతిని పొందే మార్గం తేటతెల్లంగా చెప్పావు. జీవుడు స్వతహాగా త్రిగుణాలచే బద్దుడై దుష్కర్మలు ఆచరిస్తూ దాని ఫలితంగా పలురకాలైన దేహాలను ధరిస్తూ జనన మరణ రూపమైన సంసారచక్రంలో బంధింపబడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఆ ప్రవృత్తి మార్గాన్ని నాకు చక్కగా వివరించావు.

(షడ్గుణైశ్వర్యాలు: ఐశ్వర్యం, ధైర్యం, కీర్తి, తేజస్సు, జ్ఞానం, వైరాగ్యం. ఇవి భగవదంశ కలిగిన వారికే శోభిస్తాయి. శుకయోగిని 'ష
డ్గుణైశ్వర్య శాశ్వతమూర్తి' అనే సార్ధక విశేషణంతో సూచించడంవల్ల శుకునిలో భగవతత్త్వం నిండి ఉందని తెలుస్తూంది.)

ఇవేకాక పలురకాలైన నరకాలగురించి; స్వాయంభువుడు, అతనికుమారులైన ప్రియవ్రత, ఉత్తానపాదుల వంశచరితలు; ఈ భూమండలంలో ఉన్న అనేకద్వీపాలు, భూభాగాలు, సముద్రాలు, నదులు, అడవులు మొదలైన సమస్తవిషయాలయొక్క ఆవిర్భావవైశాల్యాలు; జ్యోతిషపరమైన గతుల విశేషాలూ; వీటన్నింటిని పరమాత్మ ఏ విధంగా సృష్టించాడో నాకు తెలియజేశావు. ఇక ప్రస్తుతం

మహానుభావా! శుకదేవా! ఇప్పుడు నాకు ఈ విషయం వివరించి చెప్పు. ఈ ప్రపంచంలోని మానవుడు భరింపరాని బాధలతో నిండిన నానావిధ నరకకూపాలలో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉందా! ఉంటే దాన్ని నాకు విశదీకరించు.

ఈ విధంగా అడిగిన మహారాజుతో శుకుడు ఇలా చెప్పాడు.

అకటా! మనోవాక్కాయ కర్మల ఫలితంగా కలిగే పాపాలను, పరిహారం చేసుకొనక పోయినందువల్ల జీవుడు దేహం వదలిన తర్వాత భయంకరమైన నరకాలలో శిక్షలు అనుభవించాలి.

కాబట్టి జీవుడు యమభటుల దర్శనం కాకముందే, చావునుగురించి మనసు కలతపడక ముందే, శరీరంలో ప్రాణం చైతన్యవంతమై ఉండి, బలం తగ్గకముందే, చేసినపాపాలను నిష్కల్మషమైన మనసుతో పోగొట్టుకోవడానికి ప్రయత్నించడం మంచిది.

రోగకారణాన్ని తెలుసుకొని వైద్యుడు ఔషధమిచ్చి రోగాన్ని నివారించే విధంగా, మానవుడు తాను చేసే పాపాల మూలకారణాన్ని తెలుసుకొని కాలం మించిపోకుండా వాటికి నివారణోపాయాలు గుర్తించి పోగొట్టుకోవాలి.

అని పలికిన శుక మహర్షితో పరీక్షిత్తు, “ఓ స్వామీ! మానవుడు ఎటువంటి పాపాలను చూస్తాడో, వింటాడో వాటిని చేయకూడదని అనుకుంటూనే, పరితాపం పొందికూడా తిరిగి అవే పాపాలను చేస్తాడు. అటువంటి వాడికి పాప పరిహారం ఉంటుందా? జీవుడు సందర్భాన్ని అనుసరించి ఒకసారి పాపం చేయడం, మరొకసారి మానివేయడం చేస్తాడు. ఇటువంటి బురదతో నిండిన ఏనుగు నీళ్ళలో మునిగినా ఆ బురద ఏ విధంగా వదలదో అదే విధంగా చంచలమైన మనసు కలిగిన మానవుడు చేసిన పుణ్యాలు సత్ఫలితాన్ని ఇవ్వవని భావిస్తాను. ఈ విషయాలను గురించి సమగ్రంగా తెలియజేయవలసింది.

ఈ విధంగా పలికిన మహారాజుతో శుకమహర్షి ఇలా చెప్పాడు.

ఓ రాజా! ఒక పని వలన కలిగిన ఫలితం మరొక పని వలన తొలగదు. మానవుడు తెలిసిగాని, తెలియకగాని ఏ చెడు కార్యం చేసినా దానిని పరిహరించుకోవడంకోసం ఒక సత్కర్మ చేయాలి.

ఆరోగ్యకరమైన ఆహారం తిన్న కారణంగా మనిషి తన వ్యాధుల్ని ఎలా పోగొట్టుకుంటాడో, అదే విధంగా సత్కర్మలు ఆచరించేవాడు తన నిర్మలమైన మనసుతో తన పాపపురాశి నంతటినీ నశింప జేసుకుంటాడు.

తపస్సు, బ్రహ్మచర్యదీక్ష దానశీలత, ఇంద్రియనిగ్రహం, నామస్మరణం, సత్యవాక్యపాలన వంటి నియమాలతో పవిత్రజీవనం సాగిస్తున్న ధర్మవర్తనులైన దయాసముద్రులు మనోవాక్కాయకర్మల చేత ఏర్పడిన పాపాలగుదిని, అగ్ని వెదురు పొదలను భస్మం చేసినట్లుగా దహించివేస్తారు.

(సత్పురుషునికి ఉండవలసిన లక్షణాలన్నీ ఇక్కడ చెప్పబడ్డాయి. అవి - తపం = అనగా మనస్సును, ఇంద్రియాలను ఏకాగ్రతతో ఉంచడం.

బ్రహ్మచర్యం = స్త్రీలను గురించి ఆలోచించడం, వారిని పొగడడం, వారితో సల్లాపం, కామబుద్ధితో చూడటం, మర్మంగా మాట్లాడటం, స్త్రీలతో పొందుగురించి తపించడం, వారి మీద ధ్యాసతో పనులు చేయకపోవడం మొదలైన వీటన్నిటికీ దూరంగా ఉండటమే బ్రహ్మచర్యం.

దానం = తన సర్వస్వాన్ని ఇతరుల హితం కోసం నిస్వార్థంగా త్యాగం చేయడం.
శమం = మనసు, బుద్ది, చిత్తం, అహంకారం అనే అంతరీంద్రియాలను నియంత్రించడం.
దమం = కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే బాహ్యేంద్రియాలను నిగ్రహించడం.
జపం = పరమాత్మను గురించి నిరంతర ధ్యానం.
సత్యం = ధర్మాన్ని, ధర్మసూక్ష్మాన్ని అనుసరించి యథార్థంగా మాట్లాడటం.
శౌచం = బాహ్యేంద్రియాలను దోషరహితంగా ఉంచడం.
నియమం = జప తపాదులు పాటించడం.
యమం = అహింస, పరుషంగా మాట్లాడకపోవడం వంటివి.

అంతమాత్రమేగాక, మరికొంతమంది శ్రీకృష్ణుని పాదాలు అనే పద్మాలయందలి తేనెను తాగే తుమ్మెద వంటి మనసు నిర్మల వేషధారులై, గోవిందుని భక్తులై, కలిగినవారై, ఆ భక్తి కారణంగా, సూర్యుడు మంచును కరిగించిన విధంగా తమశక్తిచేత పాపాలను సంపూర్ణంగా అంతం చేసుకుంటారు.

సూర్యుడు తన తీక్ష్ణమైన కిరణాలచే దట్టమైన మంచును తొలగించినట్లుగా, ఇంకా కొందరు తమ భక్తి ప్రభావంచేత వారి పాపాలనుకూడ సంపూర్ణంగా నశింపజేసుకుంటారు.

హస్తినాపురాధినాథుడవైన పరీక్షిన్మహారాజా! ఒక రహస్యం చెబుతాను విను. శ్రీహరిభక్తి పాపాత్ముడి పాపాలను పటాపంచలు చేసి అతడికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శమదమాది సద్గుణాలు కూడ హరి భక్తివలె పాపాత్ముణ్ణి పుణ్యాత్మునిగా మార్చలేవు.

విష్ణుభక్తి పరిపూరితులైన వారికీ; ధన, మాన, ప్రాణాలను స్వామికి అర్చించినవారికీ; శ్రీహరి సేవాపరాయణులైన వారికీ; విష్ణుకథాశ్రవణమందు అత్యంతఆసక్తి కలగినవారికీ; లభించే శాశ్వతమైన ఆనందంతో కూడిన కైవల్యం; తపస్సులు, బ్రహ్మచర్యం, శమ దమాది నియమాలు, సత్యపాలనాదులవలన, శుచిత్వంవలన, దానధర్మాలవలన లభించదు.

(హరిభక్తి ఎంత గొప్పదో చెప్పటానికే ఇదంతా. తపస్సు, బ్రహ్మచర్యం, శమదమాదులు కొరగానివని భావించరాదు. అవన్నీ భక్తితో కూడి ఉన్నప్పుడే సత్ఫలితాన్నిస్తాయని శుకమహర్షి ప్రబోధంలోని సారాంశంగా గుర్తించాలి. ఈ భావానికి వివరణే తరువాత కనిపిస్తుంది.)

సాధు జీవనం కలిగి, పుణ్యస్వభావులై చరిస్తూ, సత్పరాయణులై, విష్ణుభక్తి తత్పరులైన వారికి తప్ప ఇతరులకు శాశ్వతమైన విష్ణులోకం ప్రాప్తించదు.

మానవులు సహజంగా పాపపుణ్యాలు చేస్తుంటారు. కల్లుకుండను ఎన్నినదులలో ముంచినా దాన్ని పవిత్రం చేయలేనట్లు హరిభక్తిని ఆచరించకుండా ఎన్ని పుణ్యసమూహాలైనా నరుణ్ణి పవిత్రుణ్ణి చేయలేవు.

ఓ మహారాజా! నిత్యం విష్ణుపాదపద్మాలను ధ్యానిస్తూ, విష్ణుగుణకీర్తనయందు ఆసక్తి కలిగి ఉండేవారు యముణ్ణిగాని, యమపాశాలు ధరించిన యమభటులనుగాని కలలో కూడా చూడరు. అట్టివారు తెలియక చేసిన పాపాలు ఏవైనా ఉన్నా అవి వారిని సమీపించలేవు.

ఈ భక్తివిశేషాన్ని వివరించే ఒక ప్రాచీనమైన కథ ప్రాచుర్యంలో ఉంది. దాన్ని విష్ణుసేవకుల యమకింకరుల సంవాదం అంటారు. ఆ కథ నీకు చెపుతాను శ్రద్ధగా విను.


అజామిళోపాఖ్యానము

విష్ణుదూత యమదూతల సంవాదము







The discussion between Vishnu’s messengers (Vishnudutas) and Yama’s messengers (Yamadutas)- విష్ణుదూత యమదూతల సంవాదము

విష్ణుదూత యమదూతల సంవాదము

విష్ణుసేవకులచే నిరోధింపబడిన యముని బంటులు వారితో ఇలా పలికారు.

ఎవరు మీరు? ఈ విధంగా కర్తవ్య నిర్వహణలో ఉన్న మమ్మల్ని అడ్డగించి మా వశమైన ఈ ప్రాణిని కాపాడుతున్నారు. ఇక ఈ లోకంలో యముని శాసనాలు నవ్వులపాలు కావలసిందేనా?

అది మాత్రమే కాకుండా...

అయ్యా! అద్భుతరూపులై, తమ్మిరేకులవంటి కన్నులతో, శ్రేష్ఠమైన పీతాంబరాలతో, చెక్కిళ్ళపై కదులుతున్న కుండలాలతో, ప్రకాశవంతమైన కిరీటాలతో, పద్మాలదండలతో కూడిన విశాలమైన వక్షఃస్థలంతో, నిత్యయౌవనంతో, రత్నాలుతాపిన భుజకీర్తులతో చతుర్భుజులు, నీల మేఘశ్యాములు అయిన మీరు ఎవరో తెలియజేయండి.

పద్మ, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, ధనుర్బాణాది ఆయుధాలను కలిగిన మీ శరీరాలు లోకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

శాంత స్వరూపంతో ఒప్పే మీ శరీరకాంతులు సర్వలోకాల్లో అన్ని దిక్కులయందు అలముకున్న దట్టమైన చీకట్లను పోగొడుతూ ప్రకాశవంతమైన వెలుగుతో మాకు ఆనందాన్ని కలిగించాయి.

లోకాలన్నింటికి ఆనందం కలిగించే సుందర విగ్రహాలు కలవారు, చూడడానికి సాధ్యంకాని తేజస్సుతో విరాజిల్లుతున్న వారు, సర్వధర్మాలను పాటించేవారు అయిన మీరు యమధర్మరాజు దూతలమైన మమ్ములను అడ్డగించడానికి కారణమేమిటని ప్రశ్నించిన యమదూతలను చూచి చిరునవ్వు చిందుతున్న ముఖారవిందాలు కలవారై గోవిందుని దూతలు మేఘగంభీర భాషణాలతో ఇలా అన్నారు.

మీరు ధర్మపరిపాలన బద్దుడైన యముని భటులు అయితే, ఈతని నివాసమెక్కడో, పుణ్య, పాప స్వభావాలు ఏమిటో మాకు తెలియజేయండి. లోకంలో సర్వప్రాణులు శిక్షార్హులేనా? లేక పాపజీవులు మాత్రమేనా అనేది వివరించండి.

అని పలికిన విష్ణుదూతలతో యమభటులు ఈ విధంగా పలికారు.

సృష్టి ప్రారంభంనుండి వేదం నారాయణ స్వరూపంగా విశ్వసింపబడింది. అట్టి వేద బోధితమైనది ధర్మమనీ, దానికి విరుద్ధమైనది అధర్మమని తెలియజేయబడింది.

శ్రీమన్నారాయణుని సంకల్పబలంచేత సృష్టి కార్యక్రమం ప్రారంభమై సత్త్వరజస్తమోగుణాలతో కూడిన జీవులు జన్మించాయి. ఇవి తమకు అనుకూలమైన నామ, గుణ రూప భేదాలచే వేరు చేయబడి కర్మలను ఆచరిస్తాయి. ఈ జీవుల కర్మలకు సాక్షులుగా పంచభూతాలు, సూర్యచంద్రులు, రాత్రింబవళ్ళు, కాలం మొదలైనవి ఉన్నాయి. వారి సాక్ష్యాలను అనుసరించి జీవులకు శిక్షలు అమలు జరుగుతాయి.

జీవుడు తనకు ఇష్టమైన విధంగా పుణ్యపాపకర్మలు చేస్తాడు. ఆ కర్మల ననుసరించి శుభాలుగాని, అశుభాలుగాని ప్రాప్తిస్తూ ఉంటాయి. ఆలోచించి చూస్తే దేహధారులకు సత్త్వరజస్తమోగుణాల సంపర్కం తప్పదు. అందువల్ల దేహి అయిన ప్రతి జీవీ కర్మాచరణ తప్పక చేయవలసిందే!

జీవుడు ఇప్పటి జన్మలలో చేసిన కర్మల పాప, పుణ్యాలను ఆధారంగా చేసుకొని, తరువాతి జన్మలలో అందుకు తగిన రూపాలు పొందుతాడు. ఈ జన్మ కర్మ ఫలితాలను మరుసటి జన్మలలో తప్పక అనుభవిస్తాడు.

ఇంకా వినండి. సత్త్వరజస్తమోగుణాలలో ఒక్కదానిప్రభావంవల్ల జన్మించినజీవులు సాత్త్వికులు, రాజసులు, తామసులు అని పిలువబడతారు. మొదటివారు ధర్మాచరణపరులై సుఖాలు అనుభవిన్తారు. రెండవ వారు అహంకారపూరితులై ధర్మాధర్మాలను ఆచరిస్తూ సుఖదుఃఖాలు రెంటిని అనుభవిస్తారు. మూడవవారు ఘోరబుద్ధి కలిగి అధర్మపరులై కష్టాలపాలౌతారు. వారి వారి ప్రవర్తనల కనుకూలమైన జన్మలే తదనంతరం వారికి ప్రాప్తిస్తాయి.

సమవర్తి అయిన యముడు సర్వప్రాణులలో అంతరాత్మరూపంలో ఉండి, వారివారిగుణాలకు, కార్యాలకు అంతస్సాక్షిగా ఉండి, వారి ప్రవృత్తులకు ప్రేరణ కల్పిస్తాడు. అజ్ఞానులు తమోగుణప్రధానులై దేహాత్మభావం పొంది ఉంటారు. పూర్వస్మృతిని కోల్పోయి కర్మేంద్రియాలతో పాపకర్మలు చేస్తూ, జ్ఞానేంద్రియాలవలన విషయలంపటులై వాగ్రూపమైన, మానసికమైన, శారీరకమైన పనులు చేస్తుంటారు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు తన్మాత్ర పంచకాలతో గూడి, మనసుతో కలిపి తాను పదిహేడవ వాడయి ఉపాధి సంబంధం కలిగి, సంసారబద్దుడై కొట్టుమిట్టాడుతుంటాడు. పైన చెప్పిన పదహారు అంశాలతో కూడిన జీవుడు సత్త్వగుణం కలవాడైతే హర్షాన్ని రజోగుణంగలవాడైతే శోకాన్ని తమోగుణంగలవాడైతే భయాదులను పొందుతాడు.

అరిషడ్వర్గాన్ని జయించలేక కర్మ సంసారబంధకారణమని తెలిసికూడా, పూర్వజన్మవాసనల కారణంగా ఆయా కర్మలను చేస్తుంటాడు. ఆ కారణంగా పట్టుపురుగు తాను అల్లుకున్న గూటిలో చిక్కుకొని, బయటకు రాలేని విధంగా సంసారజాలంలో చిక్కుకుంటాడు.

ప్రస్తుత వసంతకాలంలోని ఫల, పుష్ప భరితమైన వృక్ష లతాదులను చూచి, భూతకాలంలోను, భావికాలంలోను వాటి స్థితిగతులను ఊహించవచ్చు. అలాగే జీవి ఇప్పటిజన్మలోని నడవడికనుబట్టి భూతకాలంలోని గుణశీలాలు ఎలాంటివో, భావికాలంలో ఎలా ఉండబోతాయో ఊహించవచ్చు.

ఏ ప్రాణి అయినా సరే తనకు విధించిన పనులను చేయకుండా ఉండటం సాధ్యం కాదు. వాసనాబలాన్ని బట్టి ఆ యా గుణాలు ఏర్పడతాయి. ఆ గుణాలకు అనుగుణంగానే జీవుడు కర్మలు తప్పక చేయవలసి ఉంటుంది. అవ్యక్తమైన ఆ వాసనాహేతువుచే ఏర్పడినగుణాలవల్ల జీవి బద్దుడవుతాడు కాబట్టి బలవంతంగానైనా కర్మలు చేస్తూ ఉంటాడు. జన్మపరంపరా రూపమైన ఈ సంసారచక్రంనుండి విముక్తి పొందాలంటే ఆ పరమేశ్వరునియందు అనన్యభక్తి కలిగి ఉండాలి. అపుడే జీవన్ముక్తి లభిస్తుంది.

కనుక ఈ అజామిళుడు పూర్వజన్మ సంస్కారం వల్ల శ్రేష్టమైన బ్రాహ్మణవంశంలో జన్మించి, వేదశాస్త్రాలను గురుసేవతో, ఇంద్రియ నిగ్రహంతో అభ్యసించాడు. పెద్దలను, జ్ఞానులను సేవించాడు, సకల ప్రాణులయందునూ సమత్వదృష్టి కలిగి, మంత్రానుష్థానంతో సిద్ధులు పొందాడు. సత్యవ్రతం, నిత్య నైమిత్తికాదికార్యాలు నిర్వహించాడు. లోభాది దుష్ట వర్తనలను వదిలి, సద్దుణవంతుడైనాడు.

నిత్యం ఆచారనిష్ఠకలవాడై, జ్ఞానాన్ని సముపార్జించే సరైన సమయంలో, తాను ఉత్తముడుగా మారబోతున్న కాలంలోనే అతనికి మన్మథవికారం కలిగించే కోడెవయసు ప్రారంభమైంది.

('యౌవనం ధనసంపత్తిః ప్రభుత్వమవివేకితా, ఏకైక మప్యనర్థాయ కిము యత్ర చతుష్టయమ్‌' అనే సూక్తి వల్ల ఆధారంగా తరువాత వచ్చే అన్ని అనర్థాలకు మూలమై వివేకాన్ని పోగొట్టే దోషాలలో మొదటిదైన నవయౌవనం అని చెప్పవచ్చు.)

మిక్కిలి తేజోవంతుడైన అజామిళుడనే ఆ బ్రాహ్మణునికి యావనదశ ప్రాప్తించిన కాలంలో కన్నుల చివర యౌవన మదం, మనసులో తొందరపాటు, శరీరమంతా మన్మథచేష్టలు, మొగమున లేత నవ్వు, శరీరానికి గొప్పబలం, తలవెంట్రుకల నల్లని నిగారింపు, నడుము బరువుతో తొడలయందు కాంతి, చేతులు పొడవుగా సాగుట, విశాల వక్షఃస్థలం, శరీర లావణ్యం. మొదలైన కొత్తదనాలు రూపుదిద్దుకున్నాయి.

మదిలో పుడుతున్న యౌవనమదం, తన చిహ్నాలను ప్రదర్శిస్తున్నట్లుగా అతనిముఖంపై మొలకెత్తిన నూనూగు మీసాలు నల్లగా అందంగా కనిపించాయి.

అంతేకాక, అరవిరిసిన తామరపూవుమీద తుమ్మెదలగుంపు వాలినట్లుగా అజామిళుని అందమైనముఖం పై చక్కని చిక్కని మీసకట్టు అంకురించింది.

ఇంతలో వసంత ఋతువు వచ్చింది. మన్మథుడనే బ్రహ్మదేవుడు ప్రారంభించిన యజ్ఞానికి వసంతుడనే పురోహితుడు అంకురారోపణం చేసినట్లు ఉద్యానవనాలలోని చెట్లకొమ్మలు కొత్తచిగుళ్లు తొడిగాయి. వాయువేగానికి కదలుతున్న ఆ చిగురాకులు కంపిస్తున్న జారజారిణీ జనహృదయాలలో గుచ్చుకొనే బాకులు లాగా ఉన్నవి. చక్కగా వికసించిన పువ్వులలో నుండి చెలరేగిన పుప్పొడి దుమారాలు ఆకాశాన వేలాడగట్టిన చాందినీలవలె ప్రకాశిస్తున్నాయి. పూలలో చిందుతున్న మకరంద బిందువుల విందులతో మైమరచిన మధుకరాల మధుర ఝంకార నాదాలతో దిక్కులన్నీ పిక్కటిల్లుతున్నాయి. బాగా పండి పగిలినఫలాలను ఆరగిస్తూ ఆనందంతో చిలుకలు మొదలైనపక్షులు కలకల ధ్వనులు చేస్తున్నాయి. ఈ విధంగా అందరికీ ఆనంద దాయకమైన మధుమాసం చెట్లన్నింటికీ కొత్తసాగసులు చేకూర్చింది. ఆ సమయంలో అజామిళుడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలూ, సమిధలూ, పుష్పాలూ, పండ్లూ తీసుకొని రావటంకోసం తోటలోనికి వెళ్లి తిరిగివస్తూ ఒక దట్టమైన పొదరింట్లో తీవ్రమైన రతిసంబంధమైన కోరికతో మన్మథక్రీడ యందు నిష్ణాతురాలైన శూద్రస్త్రీతో కూడిన ఒక పురుషుణ్ణి చూశాడు.

ఆ పొదరింటిలో రతిక్రీడలో ఆరితేరినాడు. యౌవనమద వైభవాన్ని ప్రదర్శించడంలో గడిదేరినవాడూ, సురతేచ్చతో కూడినవాడు, దిసమొలతో ఉన్నవాడూ అగు ఒక విటుణ్ణి చూశాడు.

మధువు తాగిన మత్తులో రతి తరువాత తిరిగి రతికోసం తొందరపడుతూ, కనుబొమలను, కనుగ్రుడ్లను విలాసంగా ఆడిస్తూ, నుదుటక్రమ్ముకొన్న ముంగురులతో, కౌగిలింతకోసం, రతిక్రీడకోసం వెంపర్లాడుతున్న వేశ్యతో, స్వేచ్చారతిలో ఉన్న జారుణ్ణి చూశాడు.

సంభోగసమయంలో అనుకోకుండా నోటి నుండి వచ్చిన మణితం(అవ్యక్త మాటలధ్వని) ఒడ్డాణపు మువ్వల ధ్వనితో కలిసి మధుర ధ్వనులు వినిపిస్తుండగా, రతిలో సంపూర్ణ తమకంతో ఉన్న వనితను చూశాడు.

ఆ యువతి కాలి అందెలు పోటాపోటీగా మోగుతూ, అతనికి ఆనందం కలిగిస్తుంటే వారు పోటీగా ఒకరి మీద ఒకరు పడుతూ చేస్తున్న సంభోగంలోని వివిధ భంగిమలను అజామిళుడు చూశాడు.

ఆ వేశ్య ముఖంపై ముంగురులు కదలాడుతుంటే, కొప్పు వీడిపోయే విధంగా, మెడలోని ఆభరణాలు ఊగుతుండగా నడుము కదలికలకు అనుగుణంగా ఒడ్డాణం తాళం వేస్తుంటే నడుము ఒత్తిడికి గురయ్యే విధంగా తన ఆధిక్యాన్ని చూపిస్తూ పురుషాయిత సంభోగక్రీడ సాగిస్తోంది.

నిండు యౌవనంతో మృదువైన శరీరంతో, ప్రియుని కౌగిలింతలతో పురుషాయిత శృంగారక్రీడలలో ఆరితేరిన కామ విలాసిని అయిన స్త్రీని చూచిన ఆ అజామిళుడు కామోద్రేకం కలవాడై

తేప తేపకూ ఏపుమీరిన తన చూపులనే మోహపాశాలలో చిక్కుకొన్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్యకృత్యాలైన వైదిక కర్మలనూ, శాస్త్రపాఠాలనూ, జపతపాలనూ మరచిపోయాడు. అతడి మనస్సనేఅరణ్యంలో కామోద్రేకమనేకార్చిచ్చు చెలరేగ సాగింది. నియమబద్ధమైన అతడిచిత్తం పట్టు తప్పిపోయింది.

అజామిళుడు ఆ క్షణం మొదలు ఆ అందాల భామ చిక్కని చెక్కిళ్లనూ, చిరునవ్వునూ, కదలుతున్న ముంగురులనూ, నున్నని నుదురునూ, చెవులదాకా వ్యాపించిన వాలుకన్నులనూ, బిగువైన కుచాలనూ, విశాలమైన కటిప్రదేశాన్నీ, మాటి మాటికీ స్మరింపసాగాడు. అతడిమనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. దిగులుతో క్రుంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనైనాడు.

కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రిగారు సంపాదించిన ఆస్తి నంతటినీ ఆమెపాలు చేశాడు. సాధు లక్షణాలైన సద్గుణాలను విడనాడాడు. బాగా రుచి మరిగి ఆ వాలుగన్నుల ఇంతి అందచందాలకు లొంగిపోయాడు.

నిండు యౌవనం కలిగి సుగుణ సంపత్తి కలిగి, కామక్రీడ యందు అతనికి ఆనుకూల్యవతి అయిన భార్యను ఇంటిలోనే వదిలి, తన గౌరవాన్ని పోగొట్టుకొని, నీచుడై ఆ స్త్రీతోనే కాపురం మొదలుపెట్టాడు.

ఈ విధంగా అజామిళుడు చుట్టపక్కాలను దూషించాడు. సజ్జనులను ద్వేషించాడు. దిక్కులేని దీనులను చిక్కులపాలు చేశాడు. చిట్టచివరకు ధనం కోసం దారులు కాచి వచ్చేపొయ్యే జనాన్ని దోచుకున్నాడు. దొంగతనంలో ఆరితేరాడు. ఎవరు ఏ మనుకొన్నాా ఎన్ని తిట్టినా లెక్కచెయ్యకుండా సంపాదించిన ధనమంతా ఆ సుందరి చేతుల్లో పోసి, దానికి దాసుడై దాని దయా దాక్షిణ్యాలపై జీవింపసాగాడు.

వేదాంత చర్చను వదిలి ఆమె స్తన గంధ(లేపన) చర్చను చేసేవాడు. తర్కశాస్త్రంలోని కఠిన విషయాల చర్చను వదిలి ఆమెతో ప్రేమపూర్వక తర్కాన్ని జరిపేవాడు. స్మృతులలోని పద, వాక్య, విశేషాలను వివరించడం మాని, ఆమె మాటల తీరులోని విశేషాలను వర్ణించేవాడు. నాటక, అలంకార పాటవాన్ని కాదని, ఆమె కపట వర్తనలను, ఆభరణాల సౌందర్యాన్ని పొగిడేవాడు. ఈ విధంగా ఏ మార్పు లేక పాపాత్ముడైన అజామిళుడు ప్రీతితో ఆ ఇంతిని సొంత భార్యగా భావించి, ఆమె సంసార భారాన్ని తానే మోస్తూ, మలినదేహుడై చెడుమార్గంలో జీవించాడు.

అందుకని ఇటువంటి పాపాత్ముడిని, దుష్టుడిని, దుర్మార్గుడిని, హింసాపరుడిని మేము తీసుకుపోయి, తప్పక శిక్షిస్తాము. దానివలనమాత్రమే అతడు పాపరహితుడు అవుతాడు.

ఈ విధంగా మాట్లాడుతున్న యమకింకరుల్ని ఆపి, నీతినిపుణులైన విష్ణుదూతలు సమాధానంగా ఇలా అన్నారు.

ఓహో! మీరు ఎంత గొప్ప పండితులో మీ మాటలే చెబుతున్నాయి. మీకు అసలు శిక్షలు అమలుచేసే విధానమేమిటో తెలియకపోవడం వలన అయ్యో! పాపం దండనార్హులు కానట్టి పుణ్యపురుషులు శిక్షలకు గురి చేయబడినారు.

సమబుద్ధి గలవారు, సాధువర్తనులు, శాసనకర్తలు, మంచి దయాపరులు, గొప్ప సుగుణాలు కల్గిన తల్లి దండ్రులే తమ బిడ్డలకు కీడు చేయ తలపెట్టితే ఇక ఆ బిడ్డలు ఎవరితో మొర పెట్టుకోగలరు? మీ మనస్సులలో మీరే కొంచెం ఆలోచించి చూడండి.

వివేకవంతుడు ఏ పనినైతే సరైంది అని చేస్తాడో, ఇతరులు దానినే ఆచరిస్తారు. అతడు ఏది నిజమని చెబుతాడో ఆ విషయాన్నే లోకం కూడా నమ్మి అనుసరిస్తుంది.

ఓ యమకింకరులారా! ఒకడిని స్నేహితుడని నమ్మి అతని ఒడిలో నిద్రిస్తున్న మిత్రుడిని ఎవడైనా దయారహితుడై చంపాలని అనుకుంటాడా? (అనుకోడు).

స్నేహభావంతో వచ్చి, హృదయమిచ్చి, తనకు బాగా నచ్చి, తనను మెచ్చి నమ్ముకున్న వ్యక్తికి దయాదాక్షిణ్యాలు గల బుద్ధిమంతుడు ఏ మాత్రం ఆలోచన లేకుండా ఎలా అపకారం చేస్తాడు? (అపకారం చెయ్యడు.)

అది మాత్రమే గాక, ఈ అజామిళుడు తనకు కలిగిన శ్రీవిష్ణునామోచ్చారణం అనే అమృతప్రాయమైన ఐశ్వర్యం కారణంగా మంచిబుద్ధితో, కోటి జన్మలలో అతనికి సంక్రమించిన మహాపాపసముదాయాన్ని పూర్తిగా ఈ జన్మలో పోగొట్టుకోగలిగాడు.

నారాయణుని గుణ కీర్తనలు అనేవి బ్రహ్మహత్య వంటి మహా పాతకాటవులకు కార్చిచ్చులు. గురుభార్యా సంగమం వంటి పాపాలు అనే పాములకు నెమళ్ళు. బంగారం దొంగిలించడమనే చీకట్లకు సూర్యకిరణాలు. మద్యం తాగడం వంటి పాపాలనే మత్తెక్కిన ఏనుగులకు సింహాలు. ఎంతో గొప్పవైన యోగసమాధివంటి విధులను ఆచరించిన బ్రహ్మాది దేవతా సమూహానికి కూడా లభించని మోక్షసామ్రాజ్యానుభవానికి చెందిన క్రీడలు.

శ్రీమన్నారాయణుని నామగానాలు మోక్షమనే కన్యతో సలిపే సల్లాపాలు. సత్యలోక సౌఖ్యాలకు నెలవైనవి. మహిమాన్వితమైన ముక్తి అనే రాజ్యాధిపత్యానికి ఆలవాలమైనవి. ఎడతెగని దీర్ఘ తపస్సులకు ఫలితమైనవి. పుణ్యానికి ఆధారమైనవి. నిరపాయపోషకాలై కోరికలను తీర్చగలిగేవి, అజ్ఞానాన్ని పోగొట్టేవి, ఉపనిషత్తుల మూలసారాంశాలు.

ఆశించదగింది, శుభలోకాలకు నెలవైంది, ఋషుల మనసులే నివాసంగా కలిగింది, ముక్తికి మార్గమైంది అయినట్టి గోవిందనామస్మరణం నిత్యం చేసేవాడు సర్వసమర్థుడూ అవుతున్నాడు.

అజామిళుడు “నారాయణా” అని పిలిచినప్పుడు ఇతనిహృదయం కుమారునిమీద ఆసక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతునిపేరును ఏ విధంగా పలికినప్పటికీ వాసుదేవుడు రక్షకుడై అందులో ఉండనే ఉంటాడు.

శ్రీమహావిష్ణువును బిడ్దపేరుతోనైనా, విశ్రాంతి సమయంలో అయినా, ఆటల్లోనైనా, పరిహాసంగానైనా, పద్యంలోనైనా, గద్యంలోనైనా, గీతాల్లోనైనా వాటి భావార్థాల్లోనైనా స్మరిస్తే చాలు అది సకల పాపాలను పోగొడుతుంది.

ప్రమాదవశాత్తు జారిపడినపుడూ, గాయపడి ఈతిబాధలతో కుంగినపుడూ, విషజ్వరాలవంటి వ్యాధులు సంక్రమించినపుడు, సంధివాతం ఏర్పడి ప్రేలాపన కలిగినపుడు, పాములవంటి విషజంతువుల వలన బాధకు గురైనపుడు, ఇలాంటి ఏ సందర్భంలోనైనా విష్ణువుని స్మరించగలిగితే అలాంటి వారికి యముని వలన ఏ విధమైన భయం పొందరు. దుఃఖ దశల్ని పొందరు.

పెద్ద పాపాలకు పెద్దప్రాయశ్చిత్తాలనూ, చిన్నపాపాలకు చిన్నప్రాయశ్చిత్తాలనూ మహానుభావులైన మునులు నిర్ణయించే ఉన్నారు. కాని ఆ ప్రాయశ్చిత్తాలవల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప, పూర్తిగా పరిహారం కావు. సమస్తపాపాలనూ సంపూర్ణంగా హరించి, మనస్సును పరిశుద్ధం చెయ్యాలంటే భగవంతునిసేవ ఒక్కటే సరి అయిన త్రోవ. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ యోగిమానసవాసుణ్ణి, ఆ పీతాంబరధారుణ్ణి, ఆ వేదవేద్యుణ్ణి, ఆ పురుషోత్తముణ్ణి సంస్మరిస్తూ ఆయన పాదాలు సేవిస్తే మోక్షం సిద్ధిస్తుంది.

దైవం అంటే ఏమిటో అర్థం తెలియని చిన్నపిల్లవాడుకూడా మిగతా హరిభక్తులతో కలసి భగవన్నామస్మరణ చేస్తేచాలు గాలి సహాయంతో అగ్ని గడ్డిని బూడిదగా ఎలాచేస్తుందో అదేవిధంగా హరినామస్మరణం అతని పాపాలన్నిటిని పటాపంచలు చేస్తుంది.

(వేదాంతశాస్త్ర పరిభాషలో 'బాలుడు' అంటే 'అజ్ఞాని' అని అర్థం. పరమాత్మను తెలుసుకోవటమే జ్ఞానం. తెలుసుకోకపోవటం అజ్ఞానం.)

శక్తిమంతమైన ఔషధం కాకతాళీయంగా తీసుకున్నా అది తన ప్రభావంతో ఏ విధంగా వ్యాధిని తగ్గిస్తుందో, ఆ విధంగా, భగవంతుని నామాన్ని మూర్ఖుడు తెలియక పలికినా, అవహేళనగా పలికినా దాని ప్రభావం ఊరకనే పోదు. దాని మహత్తరగుణాన్ని తప్పకుండా చూపించి తీరుతుంది.

పూర్వజన్మ పుణ్యఫలంగా తప్ప, ధైర్యం కోల్పోయిన మనస్సు భగవన్నామ స్మరణ చేయలేదు. సకల లోకాలను తనలో ఇముడ్చుకోగలిగిన విష్ణువు కేవలం ఒక్కని మనసులో మాత్రమే ఉంటాడా? (ఉండదని భావం).

ఇక ఈ అజామిళుని విషయమంటారా! మరణకాలంలో ఈ మహనీయుడు శ్రీహరినామస్మరణం అనే అమృతాన్ని ప్రత్యక్షంగానే ఆస్వాదించాడు. శాశ్వతమైందీ, నిర్దోషమైందీ, సమస్తమైన చైతన్యానికి ఆలవాలమైందీ, నిత్యసత్యమైందీ, నిరహంకార సుగుణ సంపదలతో కూడిందీ, నియమబద్ధమైందీ, నిర్మలమైందీ అయిన నారాయణనామస్మరణం ఎలా వ్యర్థమవుతుంది?

ఈ విధంగా విష్ణుదూతలు భక్తితత్త్వాన్ని, నామవైశిష్ట్యాన్ని వివరించి, మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మీ ప్రభువైన యమధర్మరాజును అడిగి తెలుసుకొమ్మని చెప్పి పంపించారు. ఇటు అజామిళుడిని మృత్యుభయం నుండి, నరక భీతినుండి విముక్తుణ్జి చేశారు. యమకింకరులు అశక్తులై వెనుదిరిగి యమలోకానికి పోయి, జరిగిందంతా యమునికి తెలియజేశారు. ఆ తర్వాత

యమపాశం నుండి విముక్తుడై అజామిళుడు స్వస్థతపొంది, ఆనందపరవశుడై, విష్ణుదూతలకు మనసులోనే వందనాలు సమర్పించి, లేచి వారికి నమస్కరించి ఏదో చెప్పడానికి ఉత్సహిస్తుండగా అతని మనసును గుర్తించిన విష్ణుదూతలు అద్భశ్యులై వైకుంఠవాసుని వద్దకు వెళ్ళిపోయారు.

అజామిళుడి పశ్చాత్తాపం

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

Ajamilopakyanam - అజామిళోపాఖ్యానము

అజామిళోపాఖ్యానము

మహారాజా! పూర్వం కన్యాకుబ్జమనే పట్టణంలో అజామిళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహాపాపాత్ముడు, పరమదరిద్రుడు, నింద్యచరిత్రుడు, మంచిని తిరస్కరించేవాడు. దురాచారపరుడు, నికృష్ట జీవనుడు. జూదాలన్నాా వివాదాలన్నా ఆదరం మెండు. దొంగతనానికి పెట్టింది పేరు. అతడు యౌవనపు మత్తులో ఒక దాసిని భార్యగా చేసుకొన్నాడు. ఆమెయందు పదిమంది కొడుకులను కన్నాడు. ఆతడు ఆ వ్యామోహసముద్రంలో మునిగిపోయాడు.

ఆ పిల్లల ఆలన పాలనలో, ముద్దుముచ్చట్లలో చాలాకాలం గడిపాడు. సంసారలంపటుడై ఆనందంతో మైమరచాడు. ఆ మురిపాలన్నీ ముగిసి ముసలివాడైనాడు.

మలినమైన మనస్సు చివరకు స్వచ్చతను పొందుతున్నట్లుగా అతని తలవెంట్రుకలు తెల్లబడ్డాయి. భార్యాపిలలయందు మమకారం తగ్గినట్లుగా శరీరం బిగువు తగ్గింది. ఇంద్రియాలు తమకు మోహం వద్దన్నట్లుగా తల అడ్డంగా వణకసాగింది. తీవ్రమైన కోరికలు వయసుతోపాటు తగ్గినట్లు కంటిచూపు మందగించింది. నోటికి అరుచి కలిగింది. దంతాలు ఊడిపోయాయి. ఆయాసం, దగ్గు పెరిగాయి. తలనొప్పి హెచ్చింది. ఈ విధంగా అతనికి ముసలితనం నాటికి మనసు కూడా చెదిరిపోయింది.

ఈ విధంగా అతడు ఎనభైఎనిమిది సంవత్సరాలు నిండినవాడైనప్పటికీ మోహభ్రాంతుడై చివరి కొడుకైన నారాయణుడు అనే వాడియందు మిక్కిలి ప్రేమ కలిగి ఉండేవాడు.

ఓ మహారాజా! అజామిళుడు అతని భార్య కలసి చిన్న కొడుకైన నారాయణుణ్ణి మిక్కిలి ప్రేమతో ముద్దుచేసేవారు.

మనోహరమైన, తిన్నని నుదురు కల్గి, తన తండ్రికి ఆత్మబంధుత్వాన్ని పెంచే స్వభావం కలవాడు, అయిన కుమారుణ్ణి (నారాయణుణ్ణి), చూస్తూ ఆ దుశ్శీల బ్రాహ్మణుడైన అజామిళుడు చాలా సంతోషిస్తున్నాడు.

ఆ ఆఖరి కుమారుడిపై ప్రేమతో ఆహార, పానీయాదులయందు, ఆటపాటలయందు కూడా అతనితో కాలం వెళ్ళదీస్తూ జడుడైనందువల్ల తనకు ఆసన్నమైన మరణాన్ని గుర్తించలేక పోయాడు.

అజామిళుడు ఈ విధంగా అజ్ఞానంతో వ్యామోహంలో ఉంటూనే మృత్యువు ఆసన్నమైన సమయంలో తనకు ప్రియ పుత్రుడైన నారాయణుణ్ణి ఆ పేరుతోనే పిలుస్తూ తనలో తానే ఎక్కువగా తలచుకుంటూ కాలం గడుపుతున్నాడు.

ఆ సమయంలో ఆ అజామిళుడు పలురకాల పాపాలను చేసే సర్వలోక ప్రజలను క్రూరంగా శిక్షించే అతి భయంకరులైన యమభటులను శరీరం పట్టు తప్పుతుండగా భయభ్రాంతుడై చూశాడు.

పాపాత్ములను దండించడంలో కఠినంగా ప్రవర్తించేవారు, భయంకరరూపం గలవారు, నిర్థయాజాతకులు అయిన యమభటులను ఆ బ్రాహ్మణుడు దూరం నుండే చూశాడు.

కోపంతో భయంకరంగా వ్రేలాడుతున్న పెదవులు కలిగిన వికారముఖాలలో తీక్షమైన చూపులు కలిగినవారు, పాపులకు భయం కలిగించే యమపాశాలను, ఆయుధాలను కలిగినవారు, మరణవ్వాప్తితో విశేషంగా భయాన్ని కల్గించేవాళ్లు, తనను తీసుకువెళ్ళడానికి వచ్చిన ముగ్గురు యమదూతలను ఆ బ్రాహ్మణుడు చూచాడు.

జీవితం చివరిదశలో ఉన్న అజామిళునికి వికృతముఖాలతో, మిడిగుడ్లతో, వికారమైన చెక్కిళ్లతో, ఒంటినిండా నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో, సకల జీవులను పీడించి ప్రాణాలను హరించగల అనువైన యమపాశాలు ధరించిన యమకింకరుల దర్శనంతో అవయవపటుత్వం కోల్పోయి, చలిస్తున్న ప్రాణాలు కలవాడై కదలిక లేనివాడై

తన చివరి దశలో దూరంగా ఆడుకుంటున్న తనకు అత్యంత ఇష్ఠుడైన ఆఖరి కుమారుడిని చూడాలనిపించి నారాయణ అని మూడుసార్లు పిలిచాడు.

ఆ అజామిళుడు తన మరణకాలంలో శ్రీమహావిష్ణువును నారాయణా అని స్మరించాడు. ఆ స్మరణను విన్న విష్ణుదూతలు త్వరితగతితో వచ్చి, పరుషంగా మాట్లాడేవారు, భయంకరరూపాలు కలిగినవారు, అత్యధికకోపంకలవారు అయిన యమకింకరులను అడ్డగించారు.

('యం యం వా
పి స్మరన్‌ భావం త్యజత్యంతే కలేబరమ్‌ తం తమేవైతి కౌంతేయ! సదా తద్భావభావితః' (భగవద్గీత, అష్టమ, 6) అనే గీతావాక్యాన్ని అనుసరించి ప్రాణోత్క్రమణ సమయంలో నారాయణ స్మరణం చేసిన మాత్రంచే ఎవరికైనా పాపాలు నశించి విష్ణుదూతల దర్శనమౌతుంది.)

పతితుడైన అజామిళునిశరీరంనుండి అతనిజీవాన్ని యమకింకరులు తీసుకుపోతుంటే విష్ణుదూతలు వారిని బలంతో గెంటివేశారు.

విష్ణుదూత యమదూతల సంవాదము