Friday, July 31, 2026

Rudrakshalu - Adhidevathalu - రుద్రాక్షలు - అధిదేవతలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షలు - అధిదేవతలు

నారదా! ఈ రుద్రాక్షల్లోకూడా చాలా భేదాలున్నాయి. ధాత్రీఫలమంత(ఉసిరిక) ఉండేవి ఉత్తమోత్తమాలు. వీటిని భద్రాక్షలు అంటారు. రేగుపండంత ఉండేవి మధ్యమాలు. సెనగగింజల్లాగా ఉండేవి అధమాలు. రుద్రాక్షల్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతులున్నాయి. శ్వేతవర్ణంలో ఉండేవి బ్రాహ్మణజాతివి. రక్తవర్ణంలో ఉండేవి క్షత్రియజాతివి. పీతవర్ణంలోఉండేవి వైశ్యజాతివి. కృష్ణవర్ణంలో ఉండేవి శూద్రజాతివి. ఏజాతివాటిని ఆ జాతివారే ధరించాలి. ఆకారంలో సమానంగా ఉండి కంటకాలతో దృఢంగా నిగనిగలాడేవి శుభప్రదాలు. పురుగులు కొరికినవీ పగిలినవీ(ముళ్ళులేనివీ) కంటకాలు లేనివీ కుదపలు కట్టినవీ బాగా తెరుచుకున్నవీ పనికిరావు. స్వయంగా రంధ్రసహితమైన రుద్రాక్ష ఉత్తమం. మానవులు రంధ్రం చేసినది మధ్యమం. నికషంమిద రాస్తే బంగారుగీటు పడేది ఉత్తమోత్తమం. దీన్ని శివపూజా దురంధరులు ధరించాలి.

రుద్రాక్షలను రెండు పేటలుగాగానీ మూడు పేటలుగాగానీ ధరించవచ్చు. కుండలాలలో కిరీటాలలో కర్ణాభరణాలలో హారాలలో కేయూరాలలో కటకాలలో - ఇలా ఏ ఆభరణంలోనైనా పాదిగి ధరించవచ్చు. నిద్రపోతున్నా తింటున్నా తాగుతున్నా రుద్రాక్షమాలను తీసివెయ్యవలసిన అవసరంలేదు. శుచిగా ఉన్న అన్నివేళలా ధరించవచ్చు. మూడు వందలైతే అథమమనీ అయిదు వందలైతే మథ్యమమని వెయ్యి రుద్రాక్షలు ధరిస్తే ఉత్తమమనీ కొందరు చెప్పారు. ఎన్ని ఎక్కువ ధరించగలిగితే అంత మంచిది. కనీసం ఒక్కటైనా ధరించడం అవసరం.

శిరస్సున ధరించేటప్పుడు ఈశానమంత్రం, చెవులకు తత్పురుషమంత్రం, నొసటా గుండెలమీదా ధరించేటప్పుడు అఘోరమంత్రం, చేతులకు అఘోరబీజమంత్రం పఠించాలి. ఉదరాన ధరించేటప్పుడు వామదేవ మంత్రం జపించాలి. మూలమంత్రంతో సంప్రోక్షించిన రుద్రాక్షలనే ధరించాలి.

ఏకముఖీ రుద్రాక్షలు పరతత్త్వప్రకాశకాలు. ద్విముఖిని అర్ధనారీశ్వరమంటారు. త్రిముఖం అగ్నిదేవుడు. సర్వపాపవిదాహకం. ఇదే అగ్నిత్రయస్వరూపం. చతుర్ముఖరుద్రాక్షమంటే బ్రహ్మదేవుడే. దీన్ని ధరించిన వారికి ఆయురారోగ్యభోగభాగ్యాలూ జ్ఞానసంపత్తీ కలుగుతాయి. పంచముఖి రుద్రాక్ష సాక్షాత్తుగా పంచబ్రహ్మాత్మకం. దీన్ని ధరిస్తే శివప్రీతికరం. షడ్వక్త్ర రుద్రాక్షలో కార్తికేయుడే ఉంటాడు. వినాయకుడుంటాడని మరి కొందరన్నారు. సప్తముఖీరుద్రాక్షకు సప్తమాతృకలు అధిదేవతలు. ఇది సప్తాశ్వ - సప్తముని రూపకం. ఆరోగ్య - ఐశ్వర్యవర్థకం. జ్ఞానప్రదం. అష్టముఖీరుద్రాక్షకు అష్టమాతృకలు అధిదేవతలు. దీన్ని ధరించినవారిని ఆష్టవసువులూ గంగాదేవి ఆశీర్వదిస్తారు. నవముఖీరుద్రాక్షమంటే యమధర్మరాజు. దీన్ని ధరిస్తే యమభయం ఉండదు. దశముఖరుద్రాక్షకు దశదిశలూ అధిదేవతలు. దశదిశా ప్రీతికరం. ఏకాదశముఖీ రుద్రాక్షకు ఏకాదశరుద్రులూ అధిదేవతలు. దీనినే ఇంద్రదైవతమని కూడా అంటారు. అత్యంత సౌఖ్యప్రదం. ద్వాదశముఖ రుద్రాక్ష సాక్షాత్తూ మహావిష్ణుస్వరూపం. దీనికి ద్వాదశాదిత్యులు అధిదేవతలు. సర్వరోగనివారిణి. ఆరోగ్యప్రదాయిని. త్రయోదశముఖీ రుద్రాక్షకు మన్మథుడు అధిదేవత. దీన్ని ధరిస్తే తీరని కోరికలే ఉండవు. కామదేవుడు సర్వాత్మనా అనుగ్రహిస్తాడు. చతుర్దశముఖీ రుద్రాక్ష సాక్షాత్తూ రుద్రనేత్రంనుంచి ఆవిర్భవిస్తుంది. దీన్ని ధరిస్తే ఆధివ్యాధులు దరిచేరవు.

నారదా! రుద్రాక్షలు ధరించినవారు మద్య మాంస లశున(వెల్లుల్లి) పలాండు(నీరుల్లి) శిగ్ను(మునగ) శ్లేష్మాతక(విరిగి) విడ్వరాహ భక్షణం చెయ్యకూడదు. గ్రహణకాలంలో, విషువత్తున(రేయింబవళ్ళు సమంగా ఉండేరోజు) సంక్రమణ సమయంలో అయనకాలంలో అమావాన్య(దర్శ) పౌర్ణిమలలో ఇంకా ఇలాంటి పుణ్యదినాలలో పర్వాలలో రుద్రాక్షలను ధరిస్తేవిశేషవలితం ఉంటుంది. వెంటనే పాపవిమోచనం కలుగుతుంది.

భూతశుద్ది




The Story of Gunanidhi - గుణనిధికథ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - గుణనిధికథ

రుద్రాక్షమాలతో మంత్రజపం చేస్తే కోటిరెట్లు అధికంగా వేగంగా ఫలం సిద్ధిస్తుంది. శరీరంమీద ఒక్కరుద్రాక్ష అయినా లేని నరుడి జన్మ వ్యర్థమంటే వ్యర్థం. రుద్రాక్షను శిరస్సున పెట్టుకుని స్నానం చేస్తే గంగాస్నానఫలం దక్కితీరుతుంది. ఎకముఖ - పంచముఖ - ఏకాదశముఖ - చతుర్దశముఖ రుద్రాక్షలు లోకపూజితాలు. రుద్రాక్షను నిత్యమూ భక్తితో పూజిస్తే శంకరుణ్ణి పూజించినబ్దే. రుద్రుడికీ రుద్రాక్షకూ రుద్రాక్షధారికీ భేదంలేదు. దరిద్రుణ్ణి ధనవంతుణ్ణి చేసే శక్తి ఒక్క రుద్రాక్షకే ఉంది. దీనికి నిదర్శనంగా ఒక పురాణకథ చెబుతాను - విను,

కోసలదేశంలో గిరినాథుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. వేదవేదాంగపారంగతుడు. మహాధనవంతుడు. ధర్మాత్ముడు. యజ్ఞయాగాలు అన్నీ చేసినవాడు. అతనికి గుణనిధి అని ఒక పుత్రుడున్నాడు. మన్మథుడిలా బహుసుందరుడు. సుధిషణుడు అనే గురువు దగ్గర చదువుకుంటున్నాడు. కోడెవయసు కూతలు పెట్టింది. గురుపత్ని ముక్తావళికి వలవిసిరాడు. రూపయౌవనాలకు సమ్మోహితురాలయ్యింది. కొంతకాలం కథ రహస్యంగా సాగింది. ఎప్పటికయినా గురువుగారికి తెలియకమానదు. శపిస్తాడు అని భయపడ్డాడు గుణనిధి. దానితో గురువుకి విషంపెట్టి అడ్డు తొలగించుకొన్నాడు. ఇక స్వేచ్చగా నిర్భయంగా ముక్తావళితో కాపురం సాగించాడు. ఆనోటా ఆనోటా వ్యాపించి గిరినాథునికి తెలిసింది. ఎంతగానో నొచ్చుకున్నాడు. గుణనిధిని పిలిపించి తల్లిడండ్రులిద్దరూ గట్టిగా మందలించారు. దానితో ఆ దుష్టుడు అలిగి వారికే విషంపెట్టాడు. తండ్రికూడబెట్టిన ధనసంపదలతో ముక్తావళిని భోగభాగ్యాలలో ముంచితేల్చాడు. సురాపాన మాంసభక్షణలకు అలవాటు పడ్డాడు. కాలం గడిచింది. సంపదలు తరిగిపోయాయి. ఆస్తులు కరిగిపోయాయి. ధనంకోసం దొంగతనాలకు దిగాడు. గ్రామస్థులంతా మేల్కొన్నారు. సంఘ బహిష్కారం విధించారు. ఇక చేసేది లేక ముక్తావళీ గుణనిధులు అడవులకు పోయారు. దారిదోపిడీలు చేశాడు. అడవిగుండా వెళ్ళే ప్రతిమనిషినీ చంపి సామ్ములు దోచుకున్నాడు. ముక్తావళితో మురిపాలు తీర్చుకున్నాడు. చాలాకాలం సాగింది.

ఒకనాడు హఠాత్తుగా గుణనిధి మరణించాడు. యమదూతలు వేలసంఖ్యలో వచ్చిపడ్డారు. శివలోకంనుంచి శివగణాలూ వచ్చాయి. రెండు వర్గాలకూ వాదం జరిగింది. ఇతడు చేసిన పుణ్యకార్యం ఒక్కటయినా ఉందా? అని యమదూతలు ప్రశ్నించారు. ఇతడిని తీసుకువెళ్ళటానికి శివదూతలుగదా మీరు రావడమేమిటని పరిహసించారు. దానికి శివదూతలు చెప్పిన సమాధానం ఎమిటంటే -

యమదూతలారా! ఈ గుణనిధి మరణించినచోట నేలలో పదిమూరల లోతున రుద్రాక్ష ఉంది. దాని ప్రభావంవల్ల ఇతడి పాపాలన్నీ అంతరించాయి. శివసన్నిధికి యోగ్యుడయ్యాడు. అందుకని తీసుకువెళ్ళడానికి వచ్చాం - అన్నారు. యమదూతలు కిమ్మనకుండా తిరుగుముఖం పట్టారు.

గుణనిధి దివ్యవిమానం అధిరోహించాడు. దివ్యరూపధరుడు అయ్యాడు. శివదూతలతో కలిసి శంకరుడి సన్నిధికి చేరుకున్నాడు.

రుద్రాక్ష మహిమ ఇంతటిది. వర్ణనాతీతం - అని శివుడు షణ్ముఖుడికి వివరించాడు. షణ్ముఖుడు కృతార్థుడనయ్యానని సంబరపడ్డాడు. నారదా! సదాచార ప్రసంగంలో రుద్రాక్షను గురించి నేనింత గొప్పగా చెప్పడానికి ఇదే కారణం. అది సర్వపావక్షయకరం, సర్వపుణ్యప్రదం.

రుద్రాక్షలు - అధిదేవతలు




Rudrakshamahimalu - Gaardhabhagaadha - రుద్రాక్షమహిమలు - గార్ధభగాథ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షమహిమలు - గార్ధభగాథ

నారదా! శివుడు కుమారస్వామికి చెప్పిన రుద్రాక్షమహిమలు ఇంకా ఏమిటంటే - అంటూ నారాయణమహర్షి కొనసాగించాడు.

దేవతలుసైతం రుద్రాక్షమహిమలో పదహారవకళకయినా సాటిరారు. పురుషులలో విష్ణుమూర్తి, గ్రహాలలో సూర్యుడు, నదులలో గంగ, మునులలో కశ్యపుడు, గుర్రాలలో ఉచ్చైః శ్రవమూ, దేవుళ్ళలో ఈశ్వరుడు, దేవీమూర్తులలో గౌరి ఎలాంటివారో సమస్తవస్తువుల్లోనూ రుద్రాక్ష అటువంటిది. రుద్రాక్షధారణను మించిన తపస్సు లేదు. స్తోత్రం లేదు. వ్రతం లేదు. అక్షయ్యదానాలలో రుద్రాక్షదానం బహువిధాల విశిష్టం. శాంతచిత్తుడైన శివభక్తుడికి రుద్రాక్షను దానం చేస్తే లభించే పుణ్యఫలం ఎంతటిదో ఈశ్వరుడు కూడా చెప్పలేకపోయాడు. రుద్రాక్షధారికి అన్నదానం చేసినవారు ఇటూ అటూ ఏడేసి తరాలు తరించి శివలోకం చేరుకుంటారు. నొసట విభూతి, తనువున రుద్రాక్ష, శివాలయంలో పూజ - విటికి నోచుకోని విప్రుడు శ్వపచుడితో సమానం. మద్యపాన - మాంసభక్షణ - వేశ్యాసంగమాది మహాపాతకాలు రుద్రాక్ష శిరోధారణతో పటాపంచలవుతాయి. యజ్ఞయాగాలు చెయ్యకపోయినా వేదాలు చదవకపోయినా ఏ దానాలూ చెయ్యకపోయినా అన్నీ చేసిన ఫలం లభిస్తుంది. పురాణపఠన తీర్ధసేవన శాస్త్రాభ్యసన పుణ్యఫలాలు దీనికి సాటిరావు. రుద్రాక్షను ధరించి ప్రయాణమధ్యంలో దిక్కులేని చావు చచ్చినా అతడు శివత్వం పొందుతాడు. అతడి వంశంలో ఇరవైయొక్క తరాలు తరిస్తాయి. రుద్రలోకంలో నివసిస్తాయి. ఏ కులంలో పుట్టినా ఎలాంటి దురభ్యాసాలకు లోనైనా నిర్గుణుడైనా సగుణుడైనా రుద్రాక్షధారి రుద్రుడితో సమానుడే. శిరస్సున ధరిస్తే కోటిరెట్లు, చెవులకు ధరిస్తే దశకోట్లు, మెడలో ధరిస్తే శతకోట్లు, మూర్ధమున ధరిస్తే సహస్రకోట్లు, జంధ్యానికి ధరిస్తే అయుతకోట్లు, బుజాలకో మణికట్టుకో దాలిస్తే లక్షకోట్లు అధికంగా ఫలాన్ని ఇస్తుంది. రుద్రాక్షను మించిన మోక్షసాధనం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. రుద్రాక్షను ధరిస్తే చాలు భక్తి ఉన్నా లేకపోయినా వైదికకర్మలను చేసినా చెయ్యకపోయినా ముక్తి లభించడం తథ్యం. రుద్రాక్షను ధరించాలి అనే కోరిక గాఢంగా ఉంటే చాలు, ఒకవేళ ధరించలేకపోయినా శివలింగంలాగా వందనీయుడే, అవిద్యుడా సవిద్యుడా అనే విచారణతో పనిలేదు. రుద్రాక్షధారి రుద్రత్వం పాంది తీరుతాడు. రుద్రలోకం చేరి తీరుతాడు. వెనకటికి ఒక గాడిద ఇలాగే రుద్రత్వం పొందింది.

నారదా! షణ్ముఖుడు వెంటనే ఆ గాడిద కథ చెప్పమన్నాడు. శివుడు చెప్పాడు. అదేమిటంటే - వింధ్యారణ్యంలో ఒక గాడిద ఉండేది. ఒకనాడు ఒక పథికుడు దానిమీద ఆది మొయ్యలేనన్ని రుద్రాక్షలు బస్తాలు కట్టి వేశాడు. ఓపిక తెచ్చుకుని చాలాదూరం మోసింది. ఇక మొయ్యలేక నేలకు ఒరిగిపోయింది. ప్రాణాలు విడిచింది. శివుడి అనుగ్రహానికి పాత్రమై శివలోకం చేరుకుంది. మోసిన రుద్రాక్షలు ఎన్నో ఒక్కొక్క దానికీ ఎన్ని ముఖాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు శివలోకంలో
నివసించింది.

బ్రహ్మనందనా! ఈ రుద్రాక్ష మహిమను ఎవరికిబడితే వారికి చెప్పకూడదు. అశిష్యులకూ అభక్తులకూ మూర్ఖులకూ అస్సలు చెప్పకూడదు. అయితే - రుద్రాక్షను ధరించాలి అనుకునేవాడికి ఎవడికైనాసరే చెప్పవచ్చు.

రుద్రాక్ష మహిమలను వర్ణించిచెప్పడం, రుద్రాక్షలను ధరింపజెయ్యడం - ఇదొక వ్రతంగా ఆచరించినవారు సమకూర్చుకునే పుణ్యరాశికి కొలతలేదు. వెయ్యి రుద్రాక్షలను ధరింపజేస్తే అతడికి దేవతలు కూడా నమస్కరిస్తారు. వెయ్యి సాధ్యం కాకపోతే బుజానికి పదహారు, శిఖకు ఒకటి, చేతికి పన్నెండు, మెడలో ముప్ఫయిరెండు, శిరస్సున ఇరవైనాలుగు, చెవికి ఒకటి, మరోపన్నెండు వక్షఃస్థలాన - ఇలాగ నూటయెనిమిది ధరింపజేసినా అతడు రుద్రుడిలా దేవమానవ పూజ్యుడవుతాడు. ముత్యాలతో పగడాలతో స్పటికాలతో వైడూర్యాలతో కలిపి రుద్రాక్షలను వెండితీగకుగానీ బంగారుతీగకుగానీ చుట్టి ధరిస్తే అతడు సాక్షాత్కరించిన శివుడే. రుద్రాక్షలకు వెండి లేదా బంగారు తొడుగులను చేయించి ధరించినా అధికపుణ్యప్రదమే. ఏ కోరికా లేకపోయినా, ఏ భక్తీ లేకపోయినా యథాలాపంగా ధరించినా అతడిని ఏ పాపాలు సోకవు. సూర్యుడికి చీకట్లు సోకుతాయా!

గుణనిధికథ




Rudrakshajapamaala - రుద్రాక్షజపమాల

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షజపమాల

నారదా! జపమాలికాలక్షణం చెబుతాను. గ్రహించు. ప్రతిరుద్రాక్షలోనూ ముఖభాగం బ్రహ్మదేవుడు. బిందుభాగం (ముళ్ళు) రుద్రుడు. పుచ్చభాగం శ్రీమహావిష్ణువు. పంచముఖీ రుద్రాక్షలు పాతికతో జపమాల చేసుకోవడం మంచిది. అవ్వి కంటకాలతో గరుకుగా ఉండాలి. ఎరుపు - తెలుపు - లేదా మిశ్రవర్ణంలో ఉండాలి. రంధ్రాలు చెయ్యాలి. ముఖభాగం ముఖభాగంతో పుచ్చభాగం పుచ్చభాగంతో కలిసేట్టు రుద్రాక్షలు గ్రుచ్చాలి. ఆవుతోకను చుట్టినట్టుండాలి. మేరువును అన్నింటికీ పైని గ్రుచ్చాలి. ఇలాంటి అక్షమాలను నాగపాశమంటారు. ఇది మంత్రసిద్ధిప్రదాయిని. దీన్ని ముందుగా సుగంధజలాలలో శుభ్రంగా కడగాలి. అటుపైని పంచగవ్యాలు జల్లాలి. మళ్ళీ పవిత్రోదకస్నానం చేయించాలి. అప్పుడు మంత్రాలను న్యాసం చెయ్యాలి. శివాస్త్రమంత్రం జపిస్తూ ప్రతిరుద్రాక్షనూ స్పృశించాలి. కవచంతో అవకుంఠన చెయ్యాలి. మూలమంత్రాన్ని న్యసించి మళ్ళీ శుద్దోదకసాన్ననాదులు చేయించాలి. సద్యోజాతాది సంప్రోక్షణలతో నూటయెనిమిది పర్యాయాలు మూలమంత్రాన్ని పఠించి రుద్రాక్షమాలను పరిశుభ్ర పీఠంమీద ఉంచాలి. అప్పుడు పార్వతీపరమేశ్వరులను ఆవాహన చెయ్యాలి. అప్పటికి అది ప్రతిష్ఠితమాల అవుతుంది. సర్వవాంఛా ప్రదమవుతుంది. ఈ జపమాలతో ఏ దేవతామంత్రాన్నయినా జపించుకోవచ్చు.

శిరస్సునగాని మెడలోగానీ కర్ణాభరణంగా గానీ ధరించవచ్చు. జపం ఏదైనా ఎప్పుడూ రుద్రాక్ష్రమాలతోనే చెయ్యాలి. జపం కాగానే కన్నులకద్దుకుని యథావిధిగా ధరించాలి. స్నాన - దాన - జప - హోమ - వైశ్వదేవ - సురార్చనా - ప్రాయశ్చిత్త - శ్రాద్ధ - దీక్షాకాలాలలో రుద్రాక్షధారణ విశేషఫలితాలను ఇస్తుంది. ఇది లేకుండా వైదికకర్మలు చేసిన విప్రుడు నరకానికి పోతాడు. మరొకరు ధరించిన రుద్రాక్షమాలను తానెప్పుడూ ధరించకూడదు. అశౌచసమయాలలో ధరించకూడదు.

రుద్రాక్షతరువునుంచి వచ్చిన గాలిసోకితే చాలు గడ్డి పరకలు సైతం పుణ్యలోకాలకు చేరుకుంటాయి. మానవులకు ఇది సర్వపాపవిమోచకమనడంలో సందేహం లేదు. రుద్రాక్షను ధరిస్తే పశువులుకూడా రుద్రత్వం పొందుతాయి. ఇక మానవుల మాట చెప్పాలా - అంటోంది జాబాలశ్రుతి. అందుచేత కనీసం ఒక్క రుద్రాక్షనైనా ధరించడం అవసరం. దీన్ని ధరించి శివనామాలను జపించేవారే నిజమైన భాగవతోత్తములు. శ్రేయస్కాములు తప్పక ధరిస్తారు. జపిస్తారు. తరిస్తారు. బ్రహ్మవిష్ణు మహేశ్వరులూ వారి అంశావతారాలూ సకలదేవతలూ రుద్రాక్షధారులే. ఋషులూ మునులూ యోగులూ సరేసరి. మహాతపస్వులకు ఎన్నో జన్మలకుగానీ లభించని ముక్తి, రుద్రాక్షధారులకు చటుక్కున లభిస్తుంది. రుద్రాక్షలు ధరిస్తే శ్రద్ధపెరుగుతుంది. మోక్షమునందిచ్చ పొడముతుంది. శివుడి అనుగ్రహం ఉంటేనే రుద్రాక్షధారణం మీద కోరిక కలుగుతుంది. ధరించాడూ అంటే శివానుగ్రహానికి పాత్రుడు అయ్యాడన్నమాటే. అందుకే దీని మాహాత్మ్యాన్ని జాబాలేయులూ మునులూ నిరంతరం పఠిస్తూ ఉంటారు. రుద్రాక్షలను కంటితో చూస్తే చాలు పుణ్యం వస్తుంది. స్పృశిస్తే కోటిరెట్టూ ధరిస్తే నూరుకోట్ల రెట్లూ పుణ్యం దక్కుతుంది.

రుద్రాక్షమాలతో జపం చేస్తే లక్షకోటిశతాలూ లక్షకోటిసహస్రాలుగా పుణ్యం లభిస్తుంది అనడంలో ఏ సందేహమూ లేదు. చేతులకూ గుండెలకూ మెడకూ చెవులకూ శిరస్సుకూ రుద్రాక్షలను ధరించినవాడు సాక్షాత్తూ రుద్రుడవుతాడనడమూ నిశ్చయమే. రుద్రుడిలా అవధ్యుడై శివుడిలా సురాసురులకు సైతం వందనీయుడవుతాడు. రుద్రాక్షధారికి నమస్కరిస్తే శివుడికి నమస్కరించినట్టే. సర్వపాపవిముక్తి ఉభయులకూ దక్కేఫలం. రుద్రాక్షను ధరించి మరణిస్తే కుక్కసైతం ముక్తిపొందుతుందంటే ఇక నరులమాట చెప్పాలా! జపధ్యాన విహీమడైనానరే రుద్రాక్షను ధరిస్తేచాలు. సర్వపాపాలనుంచీ విముక్తి పొందుతాడు. సద్గతులకు అర్హుడవుతాడు. అందుచేత విశ్వప్రయత్నం చేసయినాసరే కనీసం ఒక్కరుద్రాక్షను సంపాదించి ధరించాలి. ఇరవైయొక్కటి సంపాదించి ధరించగలిగితే చాలు శివలోకం ఖాయం.

రుద్రాక్షమహిమలు - గార్ధభగాథ




Rudrakshas - Varieties - రుద్రాక్షలు - భేదాలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షలు - భేదాలు

నారాయణమహర్షీ! రుద్రాక్ష మహిమ గురించి చాలా గొప్పగా చెబుతున్నావు. కారణం తెలుసుకోవచ్చా?

నారదా! ఒకప్పుడు కుమారస్వామి ఇలాగేఅడిగితే శంకరుడు చెప్పింది నీకు తెలియపరుస్తున్నాను. విను. వెనకటికి త్రిపురుడు అని ఒక దైత్యుడున్నాడు. సర్వదుర్జయుడు. బ్రహ్మాదిదేవతల నందరినీ పీడించుకుతినేవాడు. అందరూ వెళ్ళి శంకరుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శంకరుడు అఘోరము అనే మహాశస్త్రాన్ని ధ్యానించాడు. అది సర్వదేవమయమూ ఘోరాతిఘోరమూను. ఒక వెయ్యి దివ్య సంవత్సరాలు దాన్ని ధ్యానించి కన్నులు మూడూ తెరిచాడు. బాష్పజలబిందువులు రాలిపడ్డాయి. ఆ నీటి బిందువులనుంచి మహారుద్రాక్షలు అనే వృక్షాలు ఆవిర్భవించాయి. సూర్యనేత్రంనుంచి రాలిపడిన జలబిందువులతో కపిలవర్ణంలో పన్నెండూ, సోమనేత్రం నుంచి శ్వేతవర్ణంలో పదహారూ, వహ్నినేత్రంనుంచి కృష్ణవర్ణంలో పదిరకాలూ రుద్రాక్షలు మొలిచాయి. శ్వేత - రక్త - మిశ్ర - కృష్ణ రుద్రాక్షలు నాలుగు వర్గాలకూ ప్రతీకలు.

ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తూ శంకరుడే. బ్రహ్మహత్యాది మహాపాతకాలను సైతం తొలగిస్తుంది. ద్విముఖరుద్రాక్ష పార్వతీపరమేశ్వరులు. సకలపాప విమోచకం. త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిదేవుడు. స్త్రీహత్యాది పాపాలను సైతం దహించివేస్తుంది. చతుర్ముఖరుద్రాక్ష అంటే బ్రహ్మదేవుడే. నరహత్యాది ఘోరపాపాలనుకూడా తొలగిస్తుంది. పంచముఖీ రుద్రాక్షనే కాలాగ్ని అంటారు. అదే రుద్రుడు. అభక్ష్యభక్షణ అగమ్యాగమనాది దోషాలను అంతరింపజేస్తుంది. షణ్ముఖరుద్రాక్షమంటే కుమారస్వామియే. దీన్ని కుడిచేతికి ధరించాలి. బ్రహ్మహత్యాదిక పాపాలుకూడా పోతాయి. సప్తముఖ రుద్రాక్షను మన్మథుడంటారు. స్వర్ణస్తేయాదిపాతకాలు నశిస్తాయి. ఆష్టవక్ర రుద్రాక్షమంటే వినాయకుడు. దీన్ని ధరిస్తే అన్ని పనులూ నిర్విఘ్నంగా సాగుతాయి. గురుపత్నీగమనాది దోషాలు నశిస్తాయి. నవముఖి రుద్రాక్షమంటే కాలభైరవుడు. దీన్ని ఎడమచేతికే ధరించాలి. భుక్తిముక్తిప్రదం. మహాబలవర్ధకం. భ్రూణహత్యాదిదోష నాశకం. సద్యఃఫలదాయకం. దశముఖీరుద్రాక్ష సాక్షాత్తూ జనార్ధనుడు. దీన్ని ధరిస్తే దుష్టగ్రహ భూతప్రేతపిశాచోరగభయాలు అంతరిస్తాయి. ఏకాదశముఖీ రుద్రాక్షమంటే ఏకాదశరుద్రులతో సమానం. దీన్ని శిఖలో ధరించినవాడు వెయ్యి అశ్వమేధాలూ నూరువాజపేయాలూ పదివేల గోదానాలూ చేసిన పుణ్యఫలం పొందుతాడు. ద్వాదశాస్య రుద్రాక్ష దొరికితే ద్వాదశాదిత్యులూ చేతికి అందినట్టే. దీన్ని చెవికి ధరించాలి. ఆశ్వమేధ గోమేధ యజ్ఞఫలం లభిస్తుంది. క్రూరజంతు క్రూరపురుష భయాలు తొలగిపోతాయి. ఆధివ్యాధులు దరికి చేరవు. పదమూడు ముఖాలున్న రుద్రాక్షను ధరించినవాడు సాక్షాత్తూ కార్తికేయుడే అవుతాడు. ఇది సర్వవాంఛాప్రదం. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మాతృహత్యాది పాపాలు సైతం తొలగిపోతాయి. పధ్నాలుగు ముఖాలున్న రుద్రాక్ష లభించిందంటే పుణ్యం ఫలించిందన్నమాటే. దాన్ని శిరస్సున ధరించాలి. శివుడితో సమానుడవుతాడు. నారదా! వెయ్యేల! రుద్రాక్షకు సాటివచ్చే పవిత్రవస్తువు ఈ సృష్టిలో లేదు. దేవతలుకూడా పూజిస్తారు. ధరిస్తారు. ఏదో ఒక రుద్రాక్షను నిత్యమూ ధరిస్తే చాలు ఇహపరాలు శుభాస్పదాలవుతాయి. 

ఇరవైయారు రుద్రాక్షలతో శిరోమాలనూ యాభైతో కంఠమాలనూ పదహారుతో బాహుమాలికనూ పన్నెండుతో మణిబంధమాలికనూ తయారుచేనుకుని ధరించాలి. ఇరవైయేడుగానీ యాభైగానీ నూటెనిమిదిగానీ రుద్రాక్షలతో జపమాలను చేసుకోవాలి. వీటిలో అష్టోత్తర శతరుద్రాక్ష జపమాల ఉత్తమోత్తమం. ఈ జపమాలలను ధరించవచ్చు కూడా. క్షణక్షణమూ అశ్వమేధం చేసినంతటి పుణ్యఫలం చేకూరుతుంది - అని సాక్షాత్తూ శివుడు షణ్ముఖుడికి తెలియజేశాడు.

రుద్రాక్షజపమాల




Wearing Rudraksha - రుద్రాక్షధారణ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - రుద్రాక్షధారణ

మెడలో ముప్ఫయిరెండు రుద్రాక్షలూ, శిరస్సున నలభై, చెవులకి ఆరు ఆరూ, చేతులకు పదిపదీ, భుజాలకి పదహారు పదహారూ, కన్నులకి ఒక్కొక్కటీ, శిఖమీద ఒకటి, వక్షఃస్థలాన ఎనిమిదీ - ధరించాలి. అలా నూటికి పైగా రుద్రాక్షలు ధరించిన మానవుడు సాక్షాత్తూ రుద్రుడే. బంగారం లేదా వెండి తీగచుట్టించి రుద్రాక్షను శిరస్సునగాని మెడలోగానీ చెవినిగానీ ధరించితే చాలామంచిది. యజ్ఞోపవీతానికి ధరించవచ్చు. చేతులకి కట్టుకోవచ్చు. ఎక్కడ ధరించినా నిర్వ్యాజమైన భక్తితో మాత్రమే ధరించాలి. ఆనందంగా ధరించాలి. రుద్రాక్షధారణం శివజ్ఞానసాధనం. శిఖమీద ధరించేటప్పుడు తారతత్త్వాన్ని స్మరించాలి. చెవులకు తగిలించుకునేటప్పుడు శివపార్వతులను భావించాలి. యజ్ఞోపవీతానికయితే వేదాలను ధ్యానించాలి. చేతులకు కట్టుకునేటప్పుడు దశదిశలనూ భావించాలి. మెడలో వేనుకునేవేళ సరస్వతిని అగ్నినీ స్మరించాలి. అన్ని ఆశ్రమాల వారూ అన్ని వర్ణాలవారూ ఈ రుద్రాక్షల్ని ధరించవచ్చు. విప్రుడుమాత్రం మంత్రపూర్వకంగానే ధరించాలి.

రుద్రాక్షలు ధరించినవాడు సాక్షాత్తూ రుద్రుడే అనడంలో సందేహం లేదు. చూడకూడనివి చూసినా వినకూడనివి విన్నా అనకూడనివి అన్నా చెయ్యకూడనివి చేసినా - అన్నిపాపాలూ రుద్రాక్షధారణతో తొలగిపోతాయి. ఇతడు ఏది తింటే అది దేవుడు తిన్నట్టే. ఏది తాగితే అది శివుడు తాగినట్టే. ఏది వాసనచూస్తే అది శివుడు వాసన చూసినట్టే. ఇంత పవిత్రమైన రుద్రాక్షలు ధరించడానికి సిగ్గుపడితే కోటిజన్మలకైనా మోక్షం కలగదు.

రుద్రాక్షలు ధరించినవారిని చూసి పరిహసించేవాడిది సంకరజన్మ అనడంలో సందేహం లేదు. రుద్రాక్షలు ధరించడంవల్లనే రుద్రుడికి రుద్రత్వం బ్రహ్మకు బ్రహ్మత్వం మునులకు సత్యసంకల్పత్వం సిద్ధిస్తున్నాయి. రుద్రాక్షధారణకన్నా పవిత్రకార్యం మరొకటిలేదు. కనక ఇవి ధరించినవారికి భక్తితో ఏది దానం చేసినా దాత సర్వపాపవిముక్తుడై శివసాయుజ్యం పొందుతాడు. శ్రాద్ధకాలంలో రుద్రాక్షధారిని భోక్తగా పెట్టుకుంటే పితృదేవతలు సంతోషిస్తారు. రుద్రాక్షధారుల కాళ్ళు కడిగి శిరసున జల్లుకున్నా లోపలికి పుచ్చుకున్నా పాపవిముక్తి శివలోకసంప్రాప్తీ ఖాయం. రుద్రాక్షను పొదిగిన ఏ ఆభరణాన్ని ధరించినా చాలు. సిగ్గుపడుతూ పైకి కనిపించనియకుండా ధరించినా ఫరవాలేదు. సమంత్రకంగానో అమంత్రకంగానో ఎలాగో ఒకలాగా ధరిస్తే చాలు. పాపవిముక్తీ జ్ఞానప్రాప్తి నిశ్చయంగా కలుగుతాయి. రుద్రాక్షల మహిమను వర్ణించి చెప్పడం ఎవరివల్లా కాదు. ధరించవలసిందే, అనుభవంతో తెలుసుకోవలసిందే.

రుద్రాక్షలు - భేదాలు




Aachamanaadhikam - ఆచమనాదికం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - ఆచమనాదికం

నారదా! శుద్ధమూ స్మార్తమూ పౌరాణమూ వైదికమూ తాంత్రికమూ శ్రౌతమూ ఆని ఆచమనం ఆరువిధాలు. మలమూత్రశౌచం తరవాత చెయ్యవలసినది శుద్ధాచమనం. ఆచాంతంలో (వైదికవిధుల్లో) స్మార్త పౌరాణికాచమనాలూ బ్రహ్మయజ్ఞాదుల్లో శ్రౌతవైద్దికాచమనాలూ ఆస్త్రవిద్యాదిసమయాల్లో తాంత్రికాచమనమూ చెయ్యాలి.

ఆచమించిన తరవాత ఓంకార గాయత్రిని జపిస్తూ శిఖను ముడివేసుకోవాలి. పునరాచమనం చేసి గుండెలనూ చేతులనూ బుజాలనూ మార్జించుకోవాలి. తుమ్మడం ఉమ్మడం పళ్ళుకుట్టుకోవడం అసత్యమాడటం పతితులతో సంభాషించడం - ఇలాంటివి చేసినప్పుడు కుడిచెవ్విని స్పృశించుకోవాలి, అగ్ని జల వాయుదేవతలూ సూర్యచంద్రులూ చతుర్వేదాలూ బ్రాహ్మణుడి కుడిచెవిలో ఉంటాయి.

అటుపైని నదికో నూతికో చెరువుకో వెళ్ళి ప్రాతఃస్నానం చెయ్యాలి. శరీరాన్ని పరిశుభ్రపరచుకోవాలి. నవద్యారాల్లోనూ మలినం ఉంటుంది. తోముకుని కడిగి శుభ్రపరచాలి. అగమ్యాగమన - ప్రతిగ్రహ - రహస్యాచరిత పాపాలన్నీ స్నానంతో ప్రక్షాళితమవుతాయి. స్నానం చెయ్యకుండా ఆచరించే సత్కర్మలన్నీ నిష్ఫలమవుతాయి. కనక నిత్యమూ ప్రాతఃస్నానం చెయ్యాలి. అదీ దర్భలు చేతబట్టుకునే చెయ్యాలి. హోమకాలం దాటిపోకుండా ప్రాతఃస్నానం ముగించుకోవాలి. స్నానంకాగానే సంధ్యావందనమాచరించాలి. ఏడురోజులపాటు ప్రాతఃస్నానం చెయ్యకపోయినా, మూడురోజులు సంధ్యవార్చకపోయినా, పన్నెండు రోజులు అగ్నికార్యం ఎగ్గొట్టినా ద్విజుడు కులభ్రష్టుడవుతాడు.

నారదా! గాయత్రికన్నా గొప్పమంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదు. గానం చేసేవాడిని (జపించేవాడిని) కాపాడుతుంది. కనక గాయత్రి - అన్నారు.

ముమ్మారు ప్రాణాయామం చేసి ప్రణవాక్షర సహితంగా వ్యాహృతిత్రయ సమన్వితంగా (భూర్భువస్స్వః) గాయత్రీమంత్రాన్ని జపించాలి. స్వధర్మనిరతుడూ శ్రుతిసంపన్నుడూ అయిన బ్రాహ్మణుడు వైదికగాయత్రినే జపించాలి తప్ప లౌకికమంత్రాన్ని (వ్యాహృతిరహితం) జపించకూడదు. మంత్రజపంతో కలిపి ప్రాణాయామంచేస్తే అది సగర్భమవుతుంది. ఆమంత్రకంగా ధ్యానమాత్రంగా చేస్తే అగర్భమంటారు. స్నానాంగంగానే దేవ ఋషి పితృతర్పణాలు పూర్తిచేసి గట్టుకి వచ్చి శుభ్రవస్త్రాలు ధరించాలి. అప్పుడూ - విభూతి ధారణ, రుద్రాక్షధారణ. ఇదే వరసలో చెయ్యాలి.

రుద్రాక్షధారణ




Tripundra Vibhuti Mahima - Durvasudi Katha - The Glory of Tripundra Vibhuti – The Story of Durvasa - త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ

త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ నారదా! ఇక్కడొక ఇతిహాసం నీకు చెప్పాలి. ఒకప్పుడు దూర్వాసుడు శరీరంనిండా విభూతి ఆలంకరించుకుని రుద్రాక్షమా...