బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు బిలువ వచ్చుట
దేవతలు, గరుడులు, ఖేచరులు, విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మ మొదలైన దేవతలు; మహర్షులు కమలాక్షుడైన శ్రీకృష్ణుని దర్శించడానికి ఎంతో సంతోషంతో ద్వారకానగరానికి వచ్చారు.
(సుధాశనులు = సుధను(అమృతాన్ని) అశనంగా(ఆహారంగా) గ్రహించేవాళ్లు దేవతలు. సుఖంగా పానం చేయబడేది సుధ. దేవతలు అమృతం ఆహారంగా గ్రహిస్తారు కాబట్టి వాళ్లకు జరామరణాలుండవు. రెక్కలతో ఎగిరేవాళ్లు గరుడులు. ఆకాశంలో సంచరించే వాళ్లు ఖేచరులు. గుటికాంజనాది విద్యలను ప్రదర్శించేవాళ్లు విద్యాధరులు. వీళ్లందరూ దేవతలలోని వారే.)
యాదవవంశమనే ఉద్యానవనంలో ప్రకాశించే కల్పవృక్షంవంటివాడు పరమేశ్వరుడు. జనులు కోరిన ఫలాలను ఇచ్చేవాడు అయిన పద్మాక్షుని దేవతలు దర్శించి వైదిక సూక్తాలతో స్తుతించారు.
(పారిజాతం దేవతరువు. పాలసముద్రంలో పుట్టిన వృక్షమిది. దేవతరువులు ఐదున్నాయి. అవి - మందారం, పారిజాతం, సంతానం, కల్పవృక్షం, హరిచందనం.)
సకలభువనాధిపతీ! సర్వేశ్వరా! పుట్టుక లేనివాడవై భూమి బరువును తగ్గించడంకోసం నీవు అవతరించావు. నీవు జన్మించి ఇప్పటికి నూటాఇరవైఅయిదు సంవత్సరాల కాలం గడచిపోయింది. ఇక వైకుంఠసౌధానికి వేంచేయి.
ఆ విధంగా అనిన బ్రహ్మ ఈశ్వరుడు మొదలైన సమస్త దేవతా సమూహాల మాటలను అంగీకరించి శ్రీకృష్ణుడు వాళ్లతో “యాదవులకు పరస్పరం శత్రుత్వాన్ని కల్పించి వాళ్లను చంపించి భూమి బరువును తగ్గించి త్వరగా వస్తాను మీరు వెళ్లండి” అని చెప్పి బ్రహ్మాదులను వీడ్కొలిపాడు. బ్రహ్మాదిదేవతలు తమతమ స్థానాలకు వెళ్లారు. తరువాత -
(యాదవులను చంపించడం భూభారం తగ్గించడంకోసమే. ఇది శ్రీమన్నారాయణుని దుష్టశిక్షణ, శిష్టరక్షణ కార్యక్రమంలో ఒక భాగం.
No comments:
Post a Comment