Monday, September 7, 2026

Shukayogi Parikshittunaku Bhavikalagathulu Jepputa - శుకయోగి పరీక్షిత్తునకు భావికాలగతులు జెప్పుట

శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము - శుకయోగి పరీక్షిత్తునకు భావికాలగతులు జెప్పుట

రాజోత్తమా! ఈ ప్రశ్నలకు సమాధానం సరిగా చెప్పడానికి సాధ్యం కాదు. అయినా, నేనునా సమర్థతతో దర్శించి తగినట్లుగా రాగల కాల గమనాలను నీకు వరుసగా చెపుతాను.

(రాజు 'భావికార్యంబులన్నియు' ఎరిగించుమని అడగడంలో అనేక ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఒకటి రెండు మాటలలో చెప్పడం సాధ్యం కాదు. విడమరచి చర్చాపూర్వకంగా చెప్పవలసిన సమాధానాలవి. అందువల్ల ప్రశ్నలకు అనకుండా ప్రశ్నములకు అని ఉంది. ప్రశ్నము అంటే చర్చించడం అని కూడా అర్ధం.)

రాగల కాలంలో రాజుల గురించి చెపుతాను. బృహద్రథుడు అనే రాజుకు పురంజయుడు పుడతాడు. అతనికి శునకుడనే అమాత్యుడుంటాడు. శునకుడు పురంజయుని సంహరించి తానే రాజ్యం పరిపాలిస్తూ ఉంటాడు. అతనికి కొంతకాలానికి ఒక కొడుకు పుడతాడు. వాడికి ప్రద్యోతనుడని పేరు పెట్టి రాజ్యం కట్టబెడతాడు.

ప్రద్యోతనునికి విశాఖరూపుడు, అతనికి నందివర్ధనుడు పుడతారు. ఈ రాజులైదుగురు నూట ముప్పె ఎనిమిది సంవత్సరాలు భూమిని పాలించి వృద్ధి చెందుతారు. ఆ తరువాత శిశునాగుడు అనే రాజు జన్మిస్తాడు. అతనికి కాకవర్ణుడనే కొడుకు కలుగుతాడు. ఆ కాకవర్ణుని కొడుకు క్షేమవర్ముడు. 

క్షేమవర్మ మహారాజుకు క్షేత్రజ్ఞుడు పుడతాడు. అతనికి విధిసారుడు, విధిసారునికి అజాతశత్రువు, అజాతశత్రువుకు దర్భకుడు, దర్భకునికి అజయుడు, అజయునికి నందివర్ధనుడు, నందివర్ధనునికి మహానంది ఉదయిస్తారు. 

శైశునాగులు అనే పేరుతో ప్రసిద్ధులైన యీ పదిమంది రాజులు కలికాలంలో మూడువందల అరవై సంవత్సరాలు అవిచ్చిన్నంగా రాజ్యపాలన చేస్తారు.

తరువాత మహానందికి శూద్రవనిత కడుపున మహాపద్ముడు పుడతాడు. అతడు మహాబలవంతు డవుతాడు. అయినా అతనితో క్షత్రియవంశం అంతరించి పోతుంది. ఆ సమయంలో రాజులు శూద్రప్రాయులై, ధర్మహీనులై చరిస్తారు. 

మహాపద్మునికి సుమాల్యుడు మొదలైన ఎనిమిదిమంది కొడుకులు కలుగుతారు. వందసంవత్సరాలపాటు వారి పరిపాలన సాగుతుంది. ఆ పిమ్మట కార్ముకుడు మొదలైన తొమ్మిదిమంది రాజులు పుడతారు. వారికి నవనందులని పేరు. ఆ నవనందులను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు సమూలంగా మట్టుబెడతాడు. నందులు లేకపోవడం చేత కొంతకాలం పాటు మౌర్యులు పరిపాలనచేస్తారు.

ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు చంద్రగుప్తనికి రాజ్యం అప్పగిస్తాడు. ఆ చంద్రగుప్తునికి వారిసారుడు ఆవిర్భవిస్తాడు. క్రమంగా వారిసారుని కొడుకు అశోకవర్ధనుడు, అతని తనయుడు సుయశస్సు, వాని కొడుకు సంయుతుడు, అతని కొడుకు శాలిశూకుడు, వాని పుత్రుడు సోమశర్ముడు, వాని కొడుకు శతధన్వుడు, వాని కుమారుడు బృహద్రథుడు రాజులవుతారు. 

మౌర్యునితో కలసి ఆ పదిమంది రాజులు నూటముప్పయ్యేడు సంవత్సరాలు నిరాఘాటంగా రాజ్యపాలన చేస్తారు. ఆ సమయంలో బృహద్రథుని సైన్యాధిపతి శుంగవంశజుడైన పుష్యమిత్రుడు అతనిని చంపి రాజ్యాన్ని ఆక్రమిస్తాడు.

పుష్యమిత్రునికి అగ్నిమిత్రుడు పుట్టి రాజవుతాడు. అతని తరువాత సుజ్యేష్ఠుడు, అతనికి వసుమిత్రుడు, అతనికి భద్రకుడు, అతనికి పుళిందుడు, అతనికి ఘోషుడు, అతనికి వజ్రమిత్రుడు, అతనికి భాగవతుడు, వానికి దేవభూతి ఉద్భవిస్తారు.

ఈ శుంగులు వరుసగా తమ తండ్రుల నుండి సంక్రమించిన రాజ్యాన్ని తాము గ్రహించి పరిపాలిస్తారు. ఈ పదిమంది శుంగులు నూటపన్నెండుసంవత్సరాలు రాజ్యపాలన చేస్తారు. 

తరువాత శుంగవంశీయులలో చివరివాడైన దేవభూతిని కణ్వమంత్రి అయిన వసుదేవుడు వధించి తానే రాజ్యాధిపతి అవుతాడు. అతనికి భూమిపుత్రుడనే పుత్రుడు కలుగుతాడు. ఆ మహానుభావునికి నారాయణుడనే కొడుకు పుడతాడు. కణ్వవంశస్థులు మూడువందలనలబైఅయిదుసంవత్సరాలు భూపరిపాలన చేస్తారు.

(నవనందులను నిర్మూలించిన బ్రాహ్మణశ్రేష్ఠుని పేరు చాణక్యుడు. ఇతనికి కౌటిల్యుడు అని కూడా మరొక పేరుంది. చాణక్యుడు చంద్రగుప్తుని రాజుగాచేసి తాను మంత్రిగా మంత్రాంగం నెరుపుతాడు. ఇతనిపేరుమీద 'అర్ధశాస్త్రం' ఒక ప్రఖ్యాత రాజనీతిశాస్త్ర గ్రంథంగా ప్రచారంలో ఉంది. 

నవనందులను నిర్మూలించి చాణక్యుడు వాళ్లదగ్గర మంత్రిగా ఉండిన రాక్షసమంత్రిని చంద్రగుప్తనికి మంత్రిగా చేస్తాడు. ఈ కథ విశాఖదత్తుడు సంస్కృతంలో రచించిన 'ముద్రారాక్షసం' అనే నాటకంలో విపులంగా ఉంది.)

పరీక్షిన్మహారాజా! రాజులు ఎంతో నేర్పుతో ఈ భూమిని పాలించినా తమ మనస్సులోని అజ్ఞానాన్ని తొలగించుకోలేరు. కాలం మిక్కిలి అస్థిరమైనదనే సత్యాన్ని తెలుసుకోలేక పోతున్నారు గదా!

రాజుల గొప్పతనాన్ని సంపూర్ణంగా ఆదిశేషుడుకూడా వర్ణించలేడు. ఆ రాజులు ఎంతోకాలం భూపాలన చేసి భ్రాంతిమగ్నులై క్రమంగా చివరకు ఈ భూమిలోనే నశించిపోతారు.

ఏనుగులు, గుర్రాలు మొదలైన సంపదలు స్థిరమని నమ్మరాదు. ప్రశాంత హృదయంలో నిరంతరం శ్రీహరిని స్మరించే సజ్జనులు అతనిలోకి చేరుకుంటారు.

కణ్వవంశంలో సుశర్ముడనే రాజు పుడతాడు. అతని భృత్యుడైన వృషలుడు అనే ఆంధ్రజాతీయుడు సుధర్ముడిని వధించి అధర్మమార్గంలో నడుస్తూ ఆ రాజ్యాన్ని నిరాటంకంగా పరిపాలిస్తాడు. 

అతని తరువాత అతని తమ్ముడు రాజవుతాడు. ఆ తరువాత శాంతకర్ణుడు, పౌర్ణమాసుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, హాలేయుడైన అరిష్టకర్మ, తిలకుడు, పురీషసేతుడు, సునందనుడు, వృకుడు, జటాపుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కందుడు, యజ్ఞశీలుడు, శ్రుతస్కందుడు, యజ్ఞశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధి అనే పేర్లుగల రాజులు పితృక్రమంగా వచ్చిన రాజ్యాన్ని నాలుగు వందల ఏభై సంవత్సరాలు పరిపాలిస్తారు.

ఆ తరువాత ఆభీరవంశజులు ఏడుమంది, గర్దభవంశజులు పదిమంది, కంకవంశజులు పదహారుమంది, భూభారాన్ని ధరించి పాలిస్తారు. తరువాత ఎనిమిదిమంది యవనులు, పదునాలుగుమంది బర్బరులు ప్రభువులవుతారు. వాళ్ల తరువాత పదమూడుమంది గురుండులు, పదకొండుమంది మౌనులు గర్వంతో ఒక వెయ్యితొమ్మది వందల తొమ్మిది సంవత్సరాలు పాలన సాగిస్తారు. 

తరువాత మౌనవంశంలో పుట్టిన పదకొండుమంది రాజులు మత్సరంతో మూడువందల సంవత్సరాలు పాలిస్తారు. అదే సమయంలో కైకిలులు అనే యవనులు భూపాలకులవుతారు.

ఆ తరువాత భూతనందుడు, నవభంగిరుడు, శివనందుడు, అతని తమ్ముడైన యశోనందుడు, ప్రవీరకుడు అనేవాళ్లు వీరులై నూటారు సంవత్సరాలు పాలకులవుతారు. ఆ రాజులకు పదమూడు మంది కొడుకులు పుడతారు. వాళ్లలో ఆరుమంది బాహ్లికదేశానికి అధిపతులవుతారు. మిగిలిన ఏడుమంది కోసల దేశానికి అధిపతు లవుతారు.

అప్పుడు వైడూర్యపతులు నిషధదేశానికి అధీశ్వరులవుతారు. పురంజయుడు మగధ దేశాధీశుడుగా పుట్టి పుళిందులూ, యదువంశస్థులూ, మద్రదేశీయులూ అయిన హీనజాతి జనం బ్రహ్మజ్ఞాన, హరిభక్తి విహీనులు కాగా వారికి ధర్మోపదేశం చేసి శ్రీమన్నారాయణుని మీద భక్తి కలిగేటట్లు చేస్తాడు. బలపరాక్రమాలుగల క్షత్రియవంశాలను అణగదొక్కి పద్మావతీ నగరం రాజధానిగా చేసుకొని గంగనుండి ప్రయాగ వరకు గల భూమిని పరిపాలిస్తాడు.

శూద్రప్రాయులైన రాజులు, సంస్కారహీనులు, వేదధర్మాలను విడచిన వారు అయిన బ్రాహ్మణులు సౌరాష్ట్రం, అవంతి, ఆభీరం, అర్బుదం, మాళవం అనే దేశాలకు అధిపతులవుతారు. 

సింధుతీరంలోనూ, చంద్రభాగానదీప్రదేశాలలోనూ, కాశ్మీరదేశంలోనూ తెలివిలేని వారైన మ్లేచ్చజాతి రాజులు భూపరిపాలన చేస్తారు. వాళ్లకు ధర్మం, సత్యం, దయ ఉండవు. 

క్రోధమాత్సర్యాలతో అతిశయించి స్త్రీలనూ, బాలకులనూ, గోవులనూ, బ్రాహ్మణులనూ వధించడానికి వెనుదీయరు. పరధనాసక్తి పరవనితాసక్తి కలిగి రజోగుణంలోనూ, తమోగుణంలోనూ మునిగి అల్పాయువులూ, అల్పబలులూ అవుతారు. 

శ్రీహరి పాదపద్మాల మకరందంలోని రుచి వాళ్లకు తెలియదు. ఒకరిపట్ల ఒకరు వైరం పెంచుకొని యుద్దాలకు సిద్ధపడి ప్రాణాలు పోగొట్టుకొంటారు. ఆ సమయంలో ప్రజలు కూడా వాళ్ల వేషభాషలను, శీలవృత్తులను అనుసరిస్తారు. కాబట్టి.

(పురాణానికున్న పంచలక్షణాల్లో వంశానుచరితం ఒక లక్షణం. వంశానుచరితమంటే కలియుగ రాజవంశాల చరిత్ర. శ్రీకృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రారంభమైనట్లు పురాణాలు చెపుతున్నాయి.

'యస్మిన్‌ కృష్ణో దివం యాతా స్త స్మిన్‌ ఏవ తదాహని
ప్రతిపన్నం కలియుగం ఇతి ప్రాహుః పురావిదః'

అనే భాగవతంలోని శ్లోకం పై విషయానికి ఆధారం. యాదవ వంశానికి అలంకారమైన శ్రీకృష్ణుడు తన ధామానికి వెళ్లిన పిదప భూలోకంలో ఏ వంశం ఉండిందో తనకు తెలుపుమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగినట్లు ద్వాదశ స్కంధంలోని మొదటి శ్లోకం -

'స్వధామానుగతే కృష్ణే యదువంశ విభూషణే
కస్య వంశో
భవ త్పృథ్వ్యామేత దా చక్ష్వ మే మునే'

అని చెపుతున్నది. ఆ ప్రశ్నకు శుకుడు బార్హద్రథ వంశానికి చెందిన పురంజయుడితో మొదలుపెట్టి కలియుగ రాజవంశాలను వివరించాడు.

భాగవత పురాణంతో పాటు మత్స్య, వాయు, బ్రహ్మాండ, విష్ణు, గరుడ, భవిష్య పురాణాలలో కూడా కలియుగ రాజవంశాలను గురించిన వివరణలున్నాయి. 

ఏయే వంశపు రాజులు ఎన్నెన్ని సంవత్సరాలు పాలన చేశారనే విషయం కూడా ఉంది. పురాణాల ప్రకారం బార్హదథవంశం తరువాత మగధసామ్రాజ్యం ఏర్పడింది. ఈ రెండు రాజ్యాల మధ్యకాలంలో కూడా ప్రద్యోతనులు, శిశునాగులు పాలించినట్లు తెలుస్తున్నది. 

కలియుగరాజుల పట్టికలు పురాణాలలో క్రీ.శ. నాలుగైదు శతాబ్దాల వరకు పాలించిన రాజులను గురించి చెపుతున్నాయి. ప్రాచీనభారతదేశచరిత్రను నిర్మించిన చరిత్రకారులకు ఇలాంటి పౌరాణిక విషయాలు ఎంతగానో సహాయపడినాయి. 

వివిధ పురాణాలలో కనిపించే కలియుగ రాజవంశాలను గురించి ఎఫ్‌.ఇ.పర్‌గిటర్‌ అనే ఆంగ్ల, చారిత్రక పండితుడు 'పురానిక్‌ టెక్‌స్టు ఆఫ్‌ ది డైనాస్టీస్‌ ఆఫ్‌ ది కలి ఏజ్‌' అనే గ్రంథం రచించాడు. దీన్ని చౌకాంబా సంస్కృత సీరస్‌, వారణాసి వాళ్లు 1962లో ద్వితీయముద్రణగా ముద్రించారు. 

'హిస్టరీ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ పీపుల్‌' అనే పేరుతో భారతీయ విద్యాభవన్‌, బొంబాయి వాళ్లు 1951లో అనేక సంపుటాలలో భారతదేశచరిత్రను ముద్రించారు. ఆ సంపుటాలలో రెండవ సంపుటం పేరు 'ది ఏజ్‌ ఆఫ్‌ ఇంపీరియల్‌ యూనిటీ'. ఈ సంపుటంలో కలియుగ రాజవంశాలకు చెందిన బోలెడు విషయాలున్నాయి.)

రోజురోజుకూ లోకంలో ఆశ్చర్యకరంగా ధర్మాలు నశిస్తాయి. నాలుగు కులాలలో ధనవంతుడైన వాడే భూమికి పరిపాలకుడవుతాడు.

బలమున్నవాడే కులం లేనివాడయినా గొప్ప సద్గుణవంతుడవుతాడు. కలిమీ, బలిమీ అనే రెండూ ఉంటే లోకంలో అతడే రాజు. ఇక చెప్పడానికేముంది?

(ప్రస్తుత దేశకాల పరిస్థితులను బట్టి చూస్తే పైన  చెప్పిన విషయం అక్షరసత్యం.)

అందుచేత ప్రజలు పిసినారులై వ్యభిచారం, దొంగతనం మొదలైన వాటికి పాల్పడి ధనహీనులవుతారు. అడవులలో దొరికే కూరలు, దుంపలూ, పండ్లూ తింటూ అడవులలో, కొండలలో, దుర్గమ ప్రదేశాలలో తిరుగుతూ బక్కచిక్కి కరవుకు, చలికి, గాలికి, ఎండకు, ఆకలిబాధకు భీతి చెందుతారు. వాళ్ల ఆయుర్ధాయం తరిగిపోతుంది. స్వల్ప శరీరాలు గల వాళ్లవుతారు. ఇక రాజులు తామే దొంగలై తిరుగుతూ ఉంటారు. అధర్మంగా సంచరిస్తూ వర్ణాశ్రమధర్మాలను విడిచిపెట్టి శూద్రులతో సమానులై ఉంటారు.

ఆ సమయంలో ఔషధపుమొక్కలు అంత ఫలవంతాలు కావు. మబ్బులు నీళ్లు లేనివై వర్షాలు కురవవు. పండే పంటలు సారహీనమవుతాయి. ఈ విధంగా లోకం ధర్మం తప్పి ఉన్నపుడు విష్ణుమూర్తి దుష్టశిక్షణ కొరకు, శిష్టరక్షణ కొరకు శంబల అనే పల్లెలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణునికి కల్కిగా అవతరిస్తాడు. ఆ కల్క్యవతార పురుషుడు దేవతాసమూహాలు చూస్తుండగానే దేవదత్తమనే అశ్వాన్ని అధిరోహించి దుష్టులైన మ్లేచ్చులను తన కత్తితో ఖండఖండాలు చేస్తాడు (నరకుతాడు).

అప్పుడు భూమండలం దుర్జనుల గుంపు లేనిదై ప్రకాశిస్తుంది. మానవులు విష్ణువును ధ్యానించడం, నమస్కరించడం, పూజించడం మొదలైన పనులలో శ్రద్ధకలిగి నారాయణ భక్తి పరాయణులై ప్రవర్తిస్తారు. 

ఈవిధంగా కల్క్యవతార సమయంలో జనులందరూ కృతార్థులవుతారు. అన్నిచోట్లా కృతయుగ ధర్మమే ఆచరణలో ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బృహస్పతులు ఒకే రాశిలో ప్రవేశించగా అది కృతయుగంగా కనిపిస్తుంది. 

రాజోత్తమా! నీ పుట్టుక మొదలుకొని నందుడి పట్టాభిషేకం దాకా నడచిన, నడుస్తున్న రాగల కాలం ఒక వెయ్యి నూటపదిహేను సంవత్సరాలు అయి ఉంటుంది. తరువాత శ్రీమన్నారాయణుడు దుష్టులైన రాజులందరిని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించి వైకుంఠానికి వెళతాడు. అని శుకమహర్షి చెప్పగా

(శ్రీకృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రారంభమైంది. పాండవులు రాజ్యపాలనను వదులుకొన్నారు. అభిమన్యుడి పుత్రుడైన పరీక్షిత్తుకు పట్టంకట్టారు. పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. మహాభారత కథంతా జనమేజయరాజుకు వైశంపాయనుడు(వ్యాసుని శిష్యుడు) చెప్పినట్లు నడుస్తుంది. 

పరీక్షిత్తు జననం నుండి నందునికి రాజ్యాభిషేకం జరిగినప్పటికి 1115 సంవత్సరాలు జరిగినట్లు భాగవతం చెపుతున్నది. ఈ నందుడు నందవంశానికి చెందిన మహాపద్మనందుడై ఉండాలి. 

మహాపద్మనందుని వంశంవాళ్లే నవనందులు. నవనందుల తరువాత మౌర్యవంశం ప్రారంభమై మౌర్య చంద్రగుప్తుడు మగధసామ్రాజ్యాధిపతి అయినట్లు చరిత్ర. ఈ భవిష్యవాణికి అనుగుణంగానే భారతదేశ చరిత్రను చూడవచ్చు.)

మునీశ్వరా! చంద్ర గ్రహం, సూర్యగ్రహం ఏ విధంగా సంచరిస్తాయో, కాలం ఎలా జరుగుతూ పోతుందో సంతోషంతో నాకు స్పష్టంగా తెలియజెయ్యవయ్యా!

అని పరీక్షిత్తు అడుగగా శుకుడు చెప్పడం మొదలుపెట్టాడు. సప్తర్షి మండలంలో ఉన్న మొదటి నక్షత్రద్వయానికి సమంగా మధ్యగా రాత్రి సమయంలో ఒక నక్షత్రం కనిపిస్తుంది. అది కనిపించి మనుష్యగణన ప్రకారం నూరు సంవత్సరాల పరిమితి గలదైనపుడు జనార్దనుడైన శ్రీకృష్ణుడు తన స్థానానికి వెళ్లిపోయాడో ఆ రోజుననే భూలోకం కలిచేత ఆక్రమించ బడింది. 

శ్రీకృష్ణుడు భూమిమీద ఉన్నంత కాలం కలి భూమిమీద అడుగు మోపలేదు. సప్తర్షులు మఘా నక్షత్రంలో ఏ రోజున ప్రవేశిస్తారో ఆ నాటికి కలి ప్రవేశించి పండ్రెండు వందల సంవత్సరాలు అవుతుంది. 

ఆ ఋషులు ఏడుగురూ పూర్వాషాఢలో ప్రవేశించినప్పుడు కలి వృద్ధి పొందుతాడు. శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచి పరమపదమైన తన లోకాన్ని చేరుకొన్న రోజుననే కలి ప్రవేశించాడు. అప్పటినుండి వెయ్యి దేవ సంవత్సరాలు గడిచిన తరువాత నాలుగో పాదంలో కృతయుగ ధర్మం నడుస్తుంది.

(మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు - ఈ ఏడుగురు సప్తర్షులు. మరొక క్రమం ప్రకారం - కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని వసిష్ఠుడు - సప్తర్షులు. సప్తర్షి మండలంలోని పూర్వనక్షత్ర ద్వయం - పులహుడు, క్రతువు అనే ఋషుల పేర్లతో ఉన్న నక్షత్రాలు. ఈ రెండు నక్షత్రాల మధ్యలో అశ్విని, భరణి, కృత్తిక మొదలైన నక్షత్రాలలో ఒక నక్షత్రం నూరుసంవత్సరాలు ఉన్ననాడు కలియుగం ప్రారంభమైంది. 

అంటే పరీక్షిత్తు పాలనకాలంలో సప్తఋషులలో తూర్పువైపున రెండు నక్షత్రాల మధ్య మఘానక్షత్రం సమంగా నిలిచి ఉండడానికి ఆరంభమైన కాలం కలియుగ ప్రారంభకాలం.)

రాజోత్తమా! పరీక్షిన్మహారాజా! పూర్వరాజుల పేర్లూ, గుణాలూ, వాళ్ల ప్రవర్తనల గుర్తులూ, సిరులూ, సంపదలూ, వాళ్ల అందచందాలూ, రాజ్యాలూ, ఐశ్వర్యాలూ అన్నీ వరుసగా నశించాయి. కాని, వాళ్ల యశస్సులు ఈనాటికీ స్వచ్చంగా, శాశ్వతంగా నిలిచి ఉన్నాయి.

శంతనుని తమ్ముడు దేవాపీ, ఇక్ష్వాకువంశంవాడైన మరుత్తూ యోగవిద్యను అవలంబిస్తూ కలాప గ్రామంలో ఉండి కలియుగాంతంలో వాసుదేవునివల్ల ప్రేరితులై, ప్రజలందరూ చక్కగా ఆశ్రమధర్మాలను పాటించేటట్లు నడిపిస్తూ, నిత్యం విష్ణుస్మరణ చేస్తూ కైవల్యం పొందుతారు. 

ఈ విధంగా నాలుగు యుగాల రాజులూ, నేను చెప్పిన వెనకటి రాజులూ అందరూ లోకంలోని సమస్త వస్తు సముదాయం మీద మమకారం కలిగి, ఉత్సాహంతో జీవితాన్ని గడిపి తరువాత ఈ నేలను వీడి మరణించారు. 

కాబట్టి కాలగతి ఎవరికీ తెలియదు. మా పూర్వులు(మా పెద్దలు) విష్ణుధ్యానపరాయణులై దయా సత్య శౌచ శమ దమాది గొప్ప గుణాలు పాటించి కీర్తిపొంది జీవించారు. అందుచేత,

(దేవాపి - చంద్రవంశపు రాజు. సునందా ప్రతీపుల కొడుకు. శంతనుడు, బాహ్లికుడు ఇతడి సోదరులు. దేవాపికి చర్మవ్యాధి ఉందని రాజ్యానికి అనర్హుడుగా ప్రకటించి శంతనుని రాజును చేస్తారు. దేవాపి అడవికి వెళ్లి తపస్సు చేసి ముక్తి పొందుతాడు.

నాలుగు యుగాలు - కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 'కాలంబుజాడ యెవ్వరికిం గానరాదు' అనే ఈ వాక్యం భారతం మౌసల పర్వంలోని 'కాలమూలంబు సర్వంబు' (పద్యం 222) అని వ్యాసుడు అర్జునుడికి చెప్పిన విషయాన్ని స్ఫురింపజేస్తున్నది. సృష్టిలో అంతా కాలాధీనంగా ఉంటుంది. అందుకే అందరూ 'కాలాయ తస్మైనమః' అని కాలశక్తికి నమస్కరిస్తారు.)

ఓ రాజా! ధర్మం, సత్యం, కీర్తి, అచ్చమైన దయ, విష్ణుభక్తి, సాటిలేని గొప్ప సత్కర్మ, అహింస అనే గుణాలమీద ప్రేమగల వారే పుణ్యాత్ములు.

ఈ లోకాన్ని పాలించే పూర్వ రాజోత్తములు కాలగతిననుసరించి ప్రాణాలు పోగొట్టుకొని, పేరు మాత్రమే మిగిలిన వారయ్యారు. కాబట్టి ఏ విషయంలోనూ మమకారం పెట్టుకోవద్దు.

'గర్వంచేత కన్నులు మూసుకొనిపోయిన రాజులను చూసి భూమాత పరిహసిస్తుంది. శత్రువులను చంపి ఎవరికీ ఇవ్వకుండా తామే పాలిస్తామన్న అజ్ఞానంతో తండ్రులకూ, కొడుకులకూ, సోదరులకూ భ్రమ పుట్టించి, పరస్పర శత్రుత్వాలతో యుద్ధంచేసి, యుద్ధరంగాలలో శరీరాదులను గడ్డిపోచలతో సమానంగా విడిచి దేవలోకం పొందిన(మరణించిన) పృథుచక్రవర్తి యయాతి, గాధి, నహషుడు, భరతుడు, అర్జునుడు, మాంధాత, సగరుడు, రాముడు, ఖట్వాంగుడు, దుంధుమారుడు, రఘుమహారాజు, తృణబిందువు, పురూరవుడు, శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలయాశ్వుడు, కకుత్థ్సుడు, నిషధుడు, హిరణ్యకశిపుడు, వృత్రాసురుడు, రావణుడు, నముచి, శంబరుడు, భౌముడు(నరకుడు), హిరణ్యాక్షుడు, తారకాసురుడు - మొదలైన రాజులలో రాక్షసులు కూడా 'భూమినాది' అనుకోవడం చేతనే కదా కాలానికి లొంగి నాశనమై పోయారు! 

ఇదంతా పైకి కనిపించేదేకాని సత్యం కాదు. కాబట్టి అంతటినీ విడిచిపెట్టి 'జనార్దనా! వైకుంఠా! వాసుదేవా! నృసింహా! అని ఎల్లప్పుడూ శ్రీహరి కథలు అనే అమృతపానం చేసి ముసలితనం, రోగం అనే వికారాలను దూరం చేసుకొని విష్ణుస్థానం పొందు' అని చెప్పి

(భూమి శాశ్వతంగా ఉంటుంది. ఆ భూమిని పాలించే రాజులు పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు. అందువల్ల ఏ రాజుకూ భూమి శాశ్వతం కాదు. ఈ భూమి నాది అని ఒకరినొకరు జయించుకొని తమదిగా చేసుకోవాలనే ప్రయత్నాన్ని చూచి భూదేవి నవ్వుకొంటుంది. 'ఈ రాజులెంత మూర్ఖులు, తాము మృత్యుముఖంలో ఉన్నామని తెలుసుకోలేక మరొకరిని జయించి వాళ్ల భూమిని గ్రహించాలను కొంటున్నారు' అని గేలిచేస్తుంది.

పృథువు ; వేనుడి భుజాలు మర్దించగా పుట్టినవాడు. ఇతడొక చక్రవర్తి. ఇతని భార్యపేరు అర్చి. వేనుడు ఎంత అధర్మంగా పాలించాడో పృథుచక్రవర్తి అంత ధర్మబద్ధంగా పాలించాడు. ప్రజా సంరక్షణకోసం గోరూపంలో ఉన్న భూమినుండి రత్నాలను, ఓషధులను పితికాడు.

యయాతి : నహషుని కుమారుడు. శుక్రాచార్యుడి కూతురు దేవయానిని, వృషపర్వుడనే రాజు కూతురు శర్మిష్ఠను పెండ్లాడాడు. దేవయానికి యదువు, తుర్వసుడు, శర్మిష్ఠకు ద్రుహ్యువు, అనువు, పూరుడు అనే కొడుకులు పుడతారు.

శుక్రాచార్యుడి శాపం వల్ల యయాతి ముసలివాడవుతాడు. తనకింకా భోగేచ్చ ఉన్నదని, తన ముసలితనం తీసుకొని తమ యౌవనం ఇవ్వమని కొడుకులను అడుగుతాడు. కొడుకులందరూ నిరాకరించగా పూరుడు మాత్రం అంగీకరించి తన యౌవనాన్ని ఇస్తాడు. యయాతి చాలకాలం భోగాలనుభవించి మళ్లీ పూరుడినుండి ముసలితనం తీసుకొని అడవికి వెళ్లి తపస్సు చేస్తాడు.

గాధి : కుశికుడి కొడుకు. ఇతని పుత్రుడు విశ్వామిత్రుడు.

నహషుడు : ఇతడొక రాజు. అనేక క్రతువులు చేశాడు. దేవతలు నహషుని ఇంద్రుడుగా ఎన్నుకొన్నారు. ఇతడు గర్వించి దేవతలను, మునులను అవమానించాడు. ఇంద్రుని భార్యయైన శచీదేవిని తనకడకు పంపవలసిందిగా ఆజ్ఞాపించాడు. బృహస్పతి సలహాపై శచీదేవి మునివాహనంపై తనకడకు వస్తే అతడి కోరికను తీరుస్తానంటుంది. నహషుడు అగస్త్యాది మహర్షులను తన పల్లకిని మోయమంటాడు. వారు మోస్తూ ఉండగా త్వరగా నడవండి అనే అర్ధంలో 'సర్ప, సర్ప' అని అదలించాడు. అగస్త్యుడు ఆగ్రహించి సర్పం కమ్మని నహషుని శపించాడు. వెంటనే అతడు సర్పమయ్యాడు. అతడు వేసిన ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్పగలిగితే సర్పరూపం పోతుందని చెపుతాడు అగస్త్యుడు. సర్పరూపంలోని నహషుడు తనకు దొరికిన వాళ్లందరినీ ప్రశ్నలు వేస్తుంటాడు. పాండవులు అరణ్యవాసం చేసే సందర్భంలో ధర్మరాజు అక్కడికి వచ్చి నహషుని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పగా నహషుడు శాపవిముక్తుడై పుణ్యలోకాలకు వెళతాదు.

భరతుడు : భరతుడనే పేరుగల వాళ్లు ఇద్దరున్నారు. కైకేయీ దశరథుల కొడుకైన భరతుడు ఒకరు. మరొకరు శకుంతలా దుష్యంతుల కొడుకు. ఈ భరతుడు మనదేశాన్ని పాలించడం వల్లనే భారతదేశమని పేరు వచ్చింది.

అర్జునుడు : నరనారాయణ మునులలోని నరుడే అర్జునుడు. ఇతడు కుంతికి ఇంద్రుడి వరం వల్ల జన్మించాడు.

మాంధాత : కృతయుగ మహీపతులకు తలమానికంగా ప్రసిద్ధిపొందిన సూర్యవంశ ప్రభు వితడు. ఈ వంశంలో దశరథుని పూర్వులలో మాంధాత ఇరవై అయిదవ తరంవాడు. ఇతడు యువనాశ్వుని కొడుకు. గయుడు, అంబరీషుడు మొదలైన షోడశ మహారాజులలో మాంధాత ఒకడు. ఇతడు కారణాంతరాల వల్ల తల్లిగర్భం నుండికాక తండ్రి కడుపు చీల్చుకొని పుట్టాడు.

సగరుడు : అయోధ్యను పాలించిన సూర్యవంశపురాజు. ఇతడు పుట్టకముందే తండ్రి మరణించాడు. తల్లి గర్భవతి. సహగమనం చేయబోగా చ్యవనమహర్షి ఆమెను తన ఆశ్రమానికి తీసుకొని వెళతాడు. అంతకుముందే ఆమె గర్భవతి కావడం సహించలేక సవతులు ఆమెకు గరళం (విషం) పెట్టారు. గర్భంలో గరళమున్నా ఎటువంటి బాధ లేకుండా ఆమె కొడుకును కన్నది. గరసహితుడై (విషంతో) పుట్టడం వల్ల ఆ బిడ్డకు సగరుడని పేరు పెట్టారు. సగరుని భార్య వైదర్భి. వీళ్లకు 60 వేలమంది కొడుకులు కలిగారు. సగరుడు అశ్వమేధయాగంచేసి అశ్వం వెంట తన 60 వేలమంది కొడుకులను పంపాడు. అశ్వం సముద్రతీరంలో సంచరిస్తూ అదృశ్యమైంది. వాళ్లు గుర్రంకోసం సముద్రాన్ని తవ్వి లోపలికి వెళ్లి అక్కడుండిన కపిలమహర్షి కోపానికి బలియై మరణించారు. తరువాత సగరుడు సముద్రాన్ని పుత్రుడుగా భావించి అశ్వాన్ని తెప్పించుకొన్నాడు. అది మొదలు సముద్రం సాగరమైంది. సగరుడు షట్చక్రవర్తులలో ఒకడుగా ప్రసిద్ధికెక్కాడు. హరిశ్చంద్ర, నల, పురుకుత్స, పురూరవ, సగర, కార్తవీర్యార్జునులు షట్చక్రవర్తులు.

దుంధుమారుడు : ఇక్ష్వాకు వంశస్థుడు. అసలుపేరు కువలయాశ్వుడు. దుంధుడు అనే రాక్షసుని చంపడంచేత ఇతనికి ఈ పేరు వచ్చింది.

రఘువు : ఇతడు దిలీపుని కుమారుడు. తల్లి సుదక్షిణాదేవి. సూర్యవంశానికి చెందినవాడు. రఘువు యజ్ఞం నిర్వహించి తన దగ్గర ఉన్న ధనమంతా ఖర్చుపెట్టాడు. ధనం లేని సమయంలో వరతంతుముని శిష్యుడైన కౌత్సుడు రఘువు ఆస్దానానికి వచ్చాడు. తన దగ్గర ఏమీ లేకపోవడం వల్ల అతనికి మట్టి పాత్రతోనే పాద్యం ఇచ్చాడు. కౌత్సుడు గురువుకు ఇవ్వవలసిన దక్షిణను రఘువు వద్ద పొందాలని వచ్చాడు. రఘువు పరిస్థితి చూచి వెళ్లబోగా రఘువు వారించి కుబేరుని నుండి ధనం పొంది కౌత్సునికి ఇచ్చిపంపాడు. రఘువు కుమారుడు అజుడు. ఈ విషయాలు కాళిదాసు రచించిన రఘువంశం కావ్యం లోనివి.

తృణబిందుడు : వేదవంతుని కుమారుడైన బంధుని పుత్రుడు. అలంబుస అనే దేవకామిని ఇతనిని మోహిస్తుంది. వీల్లిద్దరికి ఇలబిల అనే కూతురు పుట్టింది. ఈ ఇలబిలకు విశ్రవసుడికి కుబేరుడు పుట్టాడు.

పురూరవుడు : చంద్రవంశపు రాజు. ఇలా బుధుల కుమారుడు. ఇతని భార్య కౌసల్య. పురూరవుడు ఊర్వశిని చూచి మోహించి ఆమెయందు శ్రుతాయువు, సత్యాయువు అనే కొడుకులను పొందాడు.

శంతనుడు : ఇతడు ప్రతీపుని కొడుకు. గంగాతీరంలో సంచరిస్తుండగా గంగ స్త్రీ రూపంలో కనిపించింది. శంతనుడు ఆమెను కోరుకొన్నాడు. తాను చేసిన పనులను అంగీకరిస్తూ అడ్డు చెప్పకుండా ఉంటే శంతనుడికి భార్యనవుతా నన్నది. అందుకు శంతనుడు అంగీకరించాడు. వారు భార్యాభర్తలైనారు. గంగ గర్భవతి అయింది. బిడ్డ పుట్టగానే నదిలో పడవేసేది. ఆ విధంగా ఏడుగురు బీడ్డలను నదిలో వదిలేసింది. ఎనిమిదవ బిడ్డ జన్మించగా శంతనుడు నదిలో వేయనీయలేదు. తనమాటకు అడ్డు చెప్పినందుకు గంగ శంతనుని విడిచి వెళ్లిపోయింది. వెళ్లిపోయే ముందు తన ఎనిమిదవ బిడ్డ భీష్ముని శంతనునికి అప్పగించి పోయింది.

గయుడు : ఒక గంధర్వుడు. ఆకాశంలో సంచరిస్తూ తన తాంబూలాన్ని ఉమియగా, అది సూర్యుడికి అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుడి దోసిలిలో పడింది. దానికి కారణమైన వాడిని చంపుతానని ప్రతిన చేశాడు కృష్ణుడు. గయుడు అది తెలిసి అర్జునుని శరణువేడాడు. అర్జునుడు గయుడికి అభయమిచ్చాడు. గయుని విషయంగా కృష్ణార్దునులకు యుద్ధం జరిగింది. ఈశ్వరుడు ప్రత్యక్షమై వాళ్లిద్దరిని శాంతపరచాడు. గయుడు రక్షింపబడినాడు.

కువలయాశ్వుడు : శత్రుజిత్తు కొడుకైన ఇతడి అసలుపేరు ఋతధ్వజుడు. గాలవ మునికి కువలయాశ్వాన్ని ఇచ్చినందువల్ల ఇతనికి ఆ పేరు వచ్చింది. ఇతని భార్య మదాలస. విక్రాంతుడు, సుబాహువు, శత్రుమర్దనుడు, అలర్కుడు ఇతని కొడుకులు.

కకుత్థ్సుడు : కకుత్‌ అంటే ఎద్దు మూపురం. ఇంద్రుడు వృషభం కాగా ఇనవంశుజుడైన ఈ రాజు ఆ ఎద్దు మూపురం మీద కూర్చొని రాక్షసులను ఓడించాడు. అందువల్ల ఇతనికి ఆ పేరు వచ్చింది. ఇతని పేరు మీద కకు
త్థ్స వంశం ప్రసిద్ధమైంది. 

నిషధుడు : మాహిష్మతీ పురాధీశుడు. ఇతడు అగ్నిని ప్రార్థించి తన నగరానికి శత్రువులు వస్తే వాళ్లపై నిప్పుల వర్షం కురిసేటట్లు వరం పొందాడు.

వృత్రుడు : త్వష్ట సృజించిన విశ్వరూపుని ఇంద్రుడు చంపడం చేత ఇంద్రుని చంపడానికి త్వష్ట వృత్రుని సృజించాడు. వృత్రుడు బ్రహ్మను ప్రార్థించి రాత్రిగాని, పగలుగాని, సజీవ నిర్జీవాల చేతగాని, స్థలంలోగాని, జలంలోగాని తనకు మరణం లేకుండా వరం పొందాడు. శివజ్వరం సోకిన వృత్రుని ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించి చంపాడు.

శంబరుడు : కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నునిచే తనకు చావు వస్తుందని ఆకాశవాణి మాట విని శంబరుడు ప్రద్యుమ్నుని పురిటి ఎనిమిదవ నాడే ఎత్తుకొని పోయి సముద్రంలో పడవేశాడు. ఆ శిశువును ఒక చేప మింగింది. ఆ చేపను ఒక జాలరివాడు పట్టుకొని తన కూతురికిచ్చాడు. ఆమె దానిని తరిగినపుడు ప్రద్యుమ్నుడు బయటపడినాడు. శంబరుడు ప్రద్యుమ్నునితో యుద్ధం చేసి మరణించాడు.

భౌముడు : భూమి కొడుకు. నరకాసురుడు. శ్రీకృష్ణునిచే సంహరింపబడినాడు.

హిరణ్యాక్షుడు : ఒక రాక్షసుడు. భూమిని చాపచుట్టగా జేసి బాధిస్తూ ఉండగా విష్ణువు వరాహరూపంలో వెళ్లి వాడిని సంహరించాడు. భూదేవిని తనకోరలపై పెట్టుకొని రక్షించాడు.

తారకుడు : ఒక రాక్షసుడు. ఇతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి తనకంటె బలవంతులు లేకుండా వరం పొందాడు. ఆ వరగర్వంతో తారకుడు దేవతలను బాధించడం మొదలుపెట్టాడు. దేవతలు బ్రహ్మతో మొరపెట్టుకోగా బ్రహ్మ శివపార్వతులకు కలిగే కుమారస్వామిచేత వాడు హతుడవుతాడని చెప్పాడు. దేవతలు మన్మథుని సాయంతో పార్వతీ పరమేశ్వరులకు సంయోగం కలిగించారు. కుమారస్వామి జన్మించి తారకాసురుని సంహరించాడు.

రాజులైనా, రాక్షసులైనా మమతానుబంధాలకు చిక్కి కాలవశాన నశిస్తారు. ఎవరూ శాశ్వతం కాదు. ఇదంతా మిథ్య. అందుకే అన్నీ వదలి సర్వేశ్వరుని నామామృతాస్వాదంలో తేలికగా హరిపదాన్ని పొందవచ్చునని వ్యాసహృదయం. పోతన దీనిని సంపూర్ణంగా అనుభవించి మనకందించాడు.

రాజా! గొప్పవారిచే కీర్తింపబడిన వాడూ, దిక్కులన్నిటా సజ్జనులచే పొగడబడిన వాడూ అయిన పరమేశ్వరుని మనస్సులో నిలుపుకొని, ఆయన గుణాలను వర్ణిస్తూ ఉండు.

యుగధర్మప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...