Monday, September 7, 2026

Pareekshittu Takshakuniche Dustundai Mruthi Nonda Natani Puttrudu Sarpayagamu Seyuta - పరీక్షిత్తు తక్షకునిచే దష్టుండై మృతి నొంద నతని పుత్త్రుడు సర్పయాగము సేయుట

శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము - 
పరీక్షిత్తు తక్షకునిచే దష్టుండై మృతి నొంద నతని పుత్త్రుడు సర్పయాగము సేయుట

మహారాజా! ముసలితనానికి, మరణానికి కారణమైన శరీరంలో ఉండే జీవుడు కుండలో ఉన్న ఆకాశం కుండ నాశనమైనపుడు పంచభూతాలలో ఒకటైన మహాకాశంలో చేరేవిధంగా, శరీరం నశించిన తరువాత ఈశ్వరునిలో కలసిపోతాడు. 

నూనె అయిపోయేదాకా వత్తి తేజస్సుతో ఉండే విధంగా శరీరం ధరించి వచ్చిన జన్మ సత్త్వరజస్తమోగుణాల చేత ప్రవృత్తిని కలిగి ఉంటుంది. ఆత్మ ఆకాశంవలె నిశ్చలంగా, అనంతంగా, గోచరత్వానికి అగోచరత్వానికి అతీతంగా ఉంటుంది. 

ఈ రీతిగా ఆత్మను ఆత్మస్థితుడిగా చేసి విష్ణువుయొక్క ఆకారాన్ని భావిస్తూ ఉండడం విశేషం. నిన్ను కరవడానికి తక్షకుడు శక్తిమంతుడు కాడు. విష్ణువును ధ్యానించు. ధనం, ఇల్లు, భార్య, బిడ్డ, పొలం, పశువులు అనే వాటినన్నిటినీ విడిచి అంతా నారాయణునకు అర్పించి, దుఃఖాన్ని వదలి నిరంతరం విష్ణువును ధ్యానిస్తూ ఉండు; అని చెప్పగా పరీక్షిత్తు దర్భాసనం మీద కూర్చొని జనార్దనుడైన శ్రీహరిని ధ్యానించడం ప్రారంభించాడు. శుకమహర్షి స్వచ్చంద సంచారియై వెళ్లిపోయాడు.

కోపం పొందిన విప్రుని(శృంగి) వల్ల ప్రేరేపింపబడినవాడై తక్షకుడు బ్రాహ్మణ వేషం ధరించి పరీక్షిత్తును చంపడం కోసం వస్తూ మార్గమధ్యంలో కాశ్యపుడనే బ్రాహ్మణుని కలుసుకొన్నాడు. ఆ కాశ్యపుడు పాముల విషాన్ని హరించడంలో సమర్థుడు. అందువల్ల అతనికి లెక్కలేనంత ధనం సమర్పించి సంతృప్తిపరచి పరీక్షిత్తు దగ్గరకు వెళ్లకుండా చేశాడు. 

తరువాత తక్షకుడు పరీక్షిత్తు దగ్గర ఉన్నవాళ్లచేతికి ఒక పండును ఇచ్చి పోయాడు. వాళ్లు ఆ పండును రాజుకు ఇవ్వగా రాజు ఆ పండును చవిచూచినంతలో దాని నుండి తక్షకుడు ఒక పురుగుగా బయటకు వచ్చి మహాభయంకరమైన సర్పంగా మారి రాజును కాటు వేశాడు. ఆ విషాగ్నికి రాజు కాలి బూడిద అయిపోయాడు.

ఆ సమయంలో ఆశ్చర్యకరమైన రాజు మరణంచూచి నేలమీద, ఆకాశంలోనూ ఉండే సర్వజీవులూ హాహాకారాలు చేశాయి. ఈ విషయం పరీక్షిత్తుకొడుకైన జనమేజయుడు విని కోపావేశంతో సర్పాలన్నీ నాశనమయ్యే యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో వేలకొద్దీ పాములు నాశనమయ్యాయి. తక్షకుడు రాకుండా ఇంద్రుని మందిరంలో ఉండడం తెలుసుకొని ఋత్విజుడు 'సహేంద్ర తక్షకాయానుబ్రూహి' అని పలికాడు. వెంటనే తక్షకునితో పాటు ఇంద్రుడు కూడా విమానంతో సహా తన స్దానం నుండి పడిపోతుండగా, ఆ సమయానికి ఆంగీరసుడు వచ్చి పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుని పెక్కువిధాలుగా స్తుతించి

చావు పుట్టుకలు భూమిలోని ప్రాణికోటికి నిరంతరం కలుగుతాయి. ఇది సహజ విషయం. దొంగలవల్ల, అగ్నివల్ల, పాములవల్ల, ఆకలిదప్పుల వల్ల మరణం పొందే జీవుడు కష్టాలను, వెనక జన్మలో చేసిన కర్మల వలన కలిగిన బాధలను ఎప్పుడూ పొందుతూ దుఃఖిస్తాడు.

('పంచత నొందడం' అంటే మరణించడమని అర్ధం. పృథివి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే పంచభూతాత్మకమైన శరీరం మరణించినపుడు మరల ఆ పంచభూతాల్లోనే కలసిపోతుంది. కనుక పంచత అంటే మరణం.)

అందుచేత లెక్కలేనన్ని పాములు చనిపోయాయి. శాంతచిత్తుడవై కోపం విడిచిపెట్టు అని చెప్పగా గురూపదేశం ప్రకారం జనమేజయుడు సర్పయాగం విరమించాడు. అప్పుడు దేవతలు పూలవాన కురిపించారు. జనమేజయమహారాజు మంత్రులతో కలసి నగరానికి వెళ్లాడు. బాధింపబడడం, బాధించడం అనే లక్షణాలు గల విష్ణమాయచే ప్రేరేపింపబడిన గుణాలవల్ల, ఆ గుణాలు చేసే పనులవల్ల ఆత్మ అజ్ఞానంలో పడిపోతుంది. కాబట్టి అటువంటి మాయావికారాలను విడిచి, వాటిని మనసా ఆశ్రయించకుండా, ఇతరులను నిందించక పగను పరిత్యజించి, భగవంతుని పాదపద్మాలయందు భక్తి కలవాడై సంచరిస్తూ ఉండేవాడు విష్ణుపదాన్ని చేరుకుంటాడు, అని చెప్పి సూతమహర్షి ఆనందంతో శౌనకునితో మరల ఇలా అన్నాడు.

వేదవ్యాసుడు వేదములను, పురాణములను లోకమందు ప్రవర్తింప జేయుట
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...