తిరుప్పావై - పదహారవ పాశురము
తిరుప్పావై వ్రతం 30 పాశురములతో 30 రోజులు చేసుకునేది కదా! ఇప్పటికి మనం సగ భాగాన్ని పూర్తి చేసుకున్నాం. మిగతా సగ భాగాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. నిన్నటికి 15 రోజులు పూర్తయింది. 6.వ. పాశురం మొదలు 15 పాశురం వరకు పదిమంది గోపికలను అంటే పది మంది ఆళ్వారులను గుర్తుచేస్తూ అందర్నీ మేల్కొలిపి మొత్తం అందరూ కలిసి ఈరోజు 16వ రోజు ఆ శ్రీకృష్ణపరమాత్మని కలవడానికి బయలుదేరారు. ఇది అంటే 16 వ.పాశురం అతి ముఖ్యమైన పాశురం అంటారు. ఈ పాశురాన్ని రెండుసార్లు చదువుతారు.
కోయిల్ కాప్పానే కొడిత్తోన్ఱుం తోరణ వాశల్ కాప్పానే! మణిక్కదవం
తాళ్ తిరవాయ్ ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్నేరందాన్
తూయోమాయ్ వందోమ్, తుయిల్ ఎళ పాడువాన్;
వాయాల్ మున్న మున్నం మాత్తాదే అమ్మా! నీ
నేశ నిలైక్కదవమ్ నీక్కు ఏలోరెంబావాయ్ || 16 ||
ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చదువుదాం
10 పాశురములలో ముందు లేచిన వారు, నిద్రించుచున్న వారిని లేపగా అందరూ కలిసి నంద గోప భవనమునకు వెళ్ళారు.
నాయకుడైన నందగోపుని యొక్క భవన రక్షకా!
మాకు ప్రభువైన నందగోపుడు అంటే నంద వ్రజానికి, రేపల్లెకి నాయకుడైన నందగోపుడు, మా శ్రీకృష్ణుడికి కూడా నాయకుడు అయన . చూడండి! కృష్ణుడి ఇంటిని రక్షించేవాడా అనలేదు కృష్ణుడి తండ్రి నందగోపుని ఇంటిని రక్షించేవాడా! అన్నారు. కృష్ణుడికి తన తండ్రి నందుడు అంటే అంత ప్రేమ అభిమానం, గౌరవం. అది తెలుసుకున్న గోపికలు కృష్ణున్ని, నందున్ని సంతోష పరచడానికి ఆ విధంగా పలుకుతున్నారు. నందగోపుని భవనానికి అనుమతి లేకుండా వెళ్ళలేం కదా! ఆ ద్వారపాలకుని అనుమతి అడుగుతున్నారు గోపికలు.
జండాతో ఉన్న తోరణానికి ద్వారపాలకుడా!
నందగోపుని యొక్క అద్భుతమైన భవనాన్ని, గొప్పదైన ఇంటిని రక్షించేవాడా! తలుపు తీయవయ్యా! మా గోపాలకృష్ణుడి దర్శనం చేసుకోవాలి. ఆ ఇల్లు ఏలాంటిదట! ధ్వజముల చేత, మకర తోరణముల చేత ప్రకాశిస్తున్న గోపుర ద్వారము. గోపికలు అర్ధరాత్రి కూడా కృష్ణుడు కోసం వస్తుంటారట. గోపికలు రాత్రి పూట తన ఇంటిని గుర్తుపట్టడానికి తన తండ్రిని ఒప్పించి తన భవనానికి జండా పెట్టించాడట. ధ్వజస్తంభాన్ని చూసి అక్కడి దేవాలయం ఉందని ఎలా గుర్తు పడతామో, అలాగే ఆ జెండాని చూసి కృష్ణుడు భవనాన్ని గుర్తుపడతారు. అలాంటి భవనాన్ని కాపలా కాస్తున్న ఓ ద్వారపాలకుడా ! అని ద్వార పాలకుడిని కూడా కీర్తిస్తున్నారట గోపికలు.
మణులతో చేసిన తలుపు గడియను తీయుము.
శ్రీకృష్ణుడికి ఎటువంటి ఆపదా కలక్కుండా కాపలా కాస్తున్నారు కొందరు.
ద్వారపాలకుడు : ఏంటి పూర్తిగా తెలవారుతుండగానే వచ్చితలుపు తియ్యి అంటున్నారు. మీకు సమయం, సందర్భం అక్కర లేదా! ఇలా అయితే మా కృష్ణ పరమాత్మకు రక్షణ ఎక్కడ.
గోపిక : మేము స్త్రీలమయ్యా! ఆడవాళ్ళము. అబలలము. మేమంటే భయమెందుకు. మావల్ల ఏం ప్రమాదం ఉంటుంది.
ద్వారపాలకుడు :ఏం! శూర్పణఖ కూడా ఆడదే కదా! ఎన్ని బాధలు పడ్డాడు రాముడు.అంతెందుకు శ్రీకృష్ణుడి చిన్నతనంలో పూతన రాలేదా! శ్రీకృష్ణుడినీ చంపడానికి. మరి మేము ఎవర్ని నమ్మాలి. మా జాగ్రత్తలో మేం ఉండాలి కదా!
గోపిక : ఆమె రాక్షస స్త్రీ మేం గోపికలం కదా! నీకు తెలియదా! అప్పుడప్పుడు వచ్చి వెళ్లి పోతుంటాం.
ద్వారపాలకుడు : పూతన కూడా గోపిక లాగానే వేషం వేసి వచ్చింది కదా!
గోపిక : పూతన మాయావి. మాకు మాయలు తెలియవు కదా! అయినా ఇంతమందిమి వచ్చినా ఇంకా భయం ఏంటి?
ద్వారపాలకుడు. ఖర దూషణులు కూడా ఎంతో మంది వచ్చేరు రాముడ్ని చంపడానికి కానీ రాముడు వారందర్నిని చంపేసాడు. అది వేరే విషయం. సరే మీరు ఇంతకీ వచ్చిన పని ఏమిటో చెప్పండి.
ఆయర్ శిరుమియరోముక్కు
గోపబాలికలమైన మాకు
అరై పరై మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేరందాన్
నీలమణి వలె ప్రకాశిస్తున్నవాడూ, నీలమేఘశ్యాముడు ఆశ్చర్యకరమైన చేష్టలు చేస్తున్నవాడు అయిన శ్రీకృష్ణుడు మాకు శబ్దము చేయు వాయిద్యములు ఇస్తానని నిన్ననే మాట ఇచ్చాడు.
తూయోమాయ్ వందోమ్,
మాకు ఇంకొక ప్రయోజనం ఏమీ లేక శుచిగా, పరిశుభ్రంగా వచ్చాము. (ఇక్కడ పరిశుభ్రం అంటే బాహ్య శుభ్రం కాదు అంతః శుచి. మనసులో భగవన్నామాన్ని జపించడం.) మా ఆలోచనల్లో కూడా ఎటువంటి కుట్ర లేదు. నీవు భయపడనక్కర్లేదు.
వాయాల్ మున్న మున్నం మాత్తాదే అమ్మా!
నిద్ర పోతున్న కృష్ణుణ్ణి ఆయన నామాలతో కీర్తన చేస్తూ లేపడానికి వచ్చాము. నీ నోటితో ఇంకేమీ ఆటంకములు చెప్పక తలుపు తీయి. ఇంకేమీ అడ్డుచెప్పకుండా తలుపు తియ్యవయ్యా!
నీ నేశ నిలైక్కదవమ్ నీక్కు
స్వామీ! దృఢముగా, గట్టిగా ఉన్న తలుపులు తీయవయ్యా!
అని ఆ ద్వారపాలకుని గోపికలందరూ బ్రతిమలాడు కుంటున్నారు. అప్పుడు ద్వారపాలకుడు తలుపు తెరచి వారిని లోపలకు పంపించాడు. లోపలికి వెళ్ళిన గోపికలు స్వామిని మేల్కొలపడానికి ప్రార్థిస్తున్నారు.
ఏలోర్ ఎంబావాయ్!
No comments:
Post a Comment