Sunday, September 13, 2026

Mata Tripurasundari Temple, Udaipur, Tripura - మాతా త్రిపురసుందరి ఆలయం, ఉదయ్‌పూర్‌, త్రిపుర

మాతా త్రిపురసుందరి ఆలయం, ఉదయ్‌పూర్‌, త్రిపుర

పార్వతి దేవి యొక్క ఐదవ మహావిద్య రూపమైన త్రిపుర సుందరి దేవి దేవాలయం . ఈమెను స్థానికంగా దేవి త్రిపురేశ్వరి అని పిలుస్తారు . ఈ దేవాలయం త్రిపురలోని అగర్తలా నుండి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన నగరమైన ఉదయ్‌పూర్‌లో ఉంది. 

అగర్తలా నుండి రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు.

ఇది ఈశాన్య భారతంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. అంతేకాక అస్సాంలోని కామాఖ్య దేవాలయం తర్వాత, ఈశాన్య భారతదేశంలోని దేవాలయాలలో అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించే పుణ్యక్షేత్రం.

త్రిపుర రాష్ట్రానికి ఈ దేవాలయం పేరు మీదుగానే నామకరణం జరిగింది. మాతాబారి అని ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం, తాబేలు మూపురం (కూర్మ రూపం)ను పోలిన ఒక చిన్న కొండపై నెలకొని ఉంది. 

కూర్మపృష్ఠాకృతి కలిగివున్న ఈ శక్తి ఆలయం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది, అందుకే దీనికి కూర్మ పీఠం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ అమ్మవారిని సాంప్రదాయ బ్రాహ్మణ పూజారులు సేవలు చేస్తారు.

పురాణం:
ఈ ఆలయం 51 శాక్త పీఠాలలో ఒకటి. పురాణం ప్రకారం, సతీదేవి కుడి పాదంలోని (దక్షిణ చరణం) బొటనవేలుతో సహా కొంత భాగం ఇక్కడ పడిందని చెబుతారు . ఇక్కడ శక్తిని త్రిపురసుందరీగా, ఆమెతో పాటు ఉండే భైరవుడిని త్రిపురేశ్‌గా పూజిస్తారు. 

నిర్మాణం:
క్రీ.శ. 1501లో త్రిపుర మహారాజు ధన్య మాణిక్య నిర్మించిన ఈ ప్రధాన మందిరం, బెంగాలీ ఏకరత్న శైలిలో నిర్మించబడింది. ఇది మూడు అంచెల పైకప్పు మరియు పైభాగంలో శిఖరంతో కూడిన ఒక ఘనాకార కట్టడం.

ఆలయ గర్భగుడిలో అమ్మవారి రెండు ఒకేలాంటి కానీ వేర్వేరు పరిమాణాలలో ఉన్న నల్లరాతి విగ్రహాలు ఉన్నాయి. 5 అడుగుల ఎత్తు ఉన్న ప్రధాన విగ్రహం త్రిపుర సుందరి దేవిది కాగా, ముద్దుగా ఛోటో- మా (చిన్న తల్లి) అని పిలువబడే చిన్న విగ్రహం 2 అడుగుల ఎత్తు ఉండే చండీ దేవిది. 

ఈ చిన్న విగ్రహాన్ని త్రిపుర రాజులు యుద్ధభూమికి, అలాగే వేట యాత్రలకు కూడా తీసుకువెళ్లేవారని చెబుతారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా, ఆలయంలో ఒక ప్రసిద్ధ మేళా(ఉత్సవం) జరుగుతుంది, దీనిని ఇరువై లక్షలకు పైగా భక్తులు దర్శిస్తారు.

చరిత్ర:
15వ శతాబ్దం చివరి సంవత్సరాలలో త్రిపురను పరిపాలించిన ధన్య మాణిక్య రాజుకు ఒక రాత్రి స్వప్నంలో అమ్మవారి దివ్యదర్శనం కలిగి ఆ స్వప్నంలో త్రిపుర సుందరి దేవి, రాజ్యానికి సమీపంలోని ఉదయ్‌పూర్ పట్టణానికి సమీపంలోని కొండపై తనకు పూజలు జరిపించమని ఆదేశించింది.

కానీ, ఆ కొండపై అప్పటికే విష్ణుమూర్తికి ఆలయం ఉంది. మరి విష్ణువుకు సంబంధించిన ఆలయంలో శక్తి విగ్రహం ఎలా అని నిర్ణయించలేక సందిగ్ధంలో పడ్డాడు.

మరుసటి రాత్రి, అమ్మవారు మరలా స్వప్నంలో విష్ణువు, శక్తి  పరమేశ్వరుని (బ్రహ్మం) యొక్క విభిన్న రూపారూపాలుగా దర్శనమిచ్చింది. 

ఈ విధంగా, త్రిపుర సుందరి ఆలయం క్రీ.శ. 1501వ సంవత్సరం రూపుదాల్చింది.

త్రిపుర సుందరి దేవి విగ్రహం నలుపు రంగులో ఉండే కాస్తీ రాతితో చేయబడింది. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నుండి వచ్చిన రాయి తో తయారు చేయించి ఆలయంలో ప్రతిష్టించారు.

(బెంగాలీలో దీన్ని 'కాస్తీ పతార్' అంటారు) దేవతల విగ్రహాలు లేదా శివలింగాలు చెక్కడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన నల్లటి టచ్‌స్టోన్(స్పర్శ వేది లేదా నిగనిగలాడే నల్లరాయి).
 
సాంప్రదాయకంగా కంసాలీలు (బంగారు వ్యాపారులు) బంగారం యొక్క స్వచ్ఛతను, నాణ్యతను పరీక్షించడానికి రుద్దే 'నల్లటి స్పర్శ రాయి' (Touchstone) కూడా ఇదే రకానికి చెందినది. ఈ రాయి చాలా గట్టిగా, నిగనిగలాడుతూ, ముదురు నలుపు లేదా ఎరుపు మిశ్రిత నలుపు రంగులో ఉండి శతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది.

త్రిపుర సుందరి ఆలయం త్రిపుర యొక్క విశిష్టమైన వాస్తు సంప్రదాయంలో నిర్మించబడింది. ఆలయం ఎత్తు 75 అడుగులు, ఆలయానికి నాలుగు మూలల్లో 4 భారీ స్తంభాలు ఉన్నాయి. మూలం బౌద్ధ నిర్మాణాలతో నిర్మించబడింది. దేవాలయం పైభాగంలో ఒక జెండా పట్టుకుని ఏడు కాడ/కుండలు ఏర్పాటు చేస్తారు. ఈ ఆలయ నిర్మాణం దేశంలోని బహుళ సంస్కృతి మరియు సంప్రదాయాల కలయిక. ప్రస్తుతం ఉన్న ఆలయం మహారాజా రాధాకిషోర్ మాణిక్య బహదూర్ పాలనలో నిర్మించబడింది.

పర్యాటకం:
ఉదయపూర్‌లో , అమ్మవారిని త్రిపుర సుందరిగా పూజిస్తారు. అమ్మవారి యొక్క రూపాలు త్రిపురేశ్వరి లేదా షోడశీ. ఈ ఆలయం 24 చదరపు అడుగులు వెడల్పు మరియు 75 అడుగులు ఎత్తు కలిగిన దేవాలయం.

ఈ క్షేత్రం తాబేలు మూపురం ఆకారంలో ఉండే ఒక చిన్న కొండపై ఉంది, అందుకే దీనికి కూర్మ పీఠం అనే పేరు వచ్చింది. 

ఇక్కడ సాధారణంగా సమర్పించే ప్రసాదం పేడ. ఎర్ర మందార పువ్వును కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

శాక్త పీఠంగా
దక్ష యాగం మరియు సతీదేవి ఆత్మార్పణం అనే సంఘటన భారతదేశ సంస్కృతిపై ప్రభావం చూపింది. ఇది శాక్త పీఠాల ఆవిర్భావానికి దారితీసి, తద్వారా శాక్తేయాన్ని బలపరిచింది. 

శాక్త పీఠల ఆవిర్భావం ప్రజాపతి దక్షుడు తన అహంకారంతో మరియు శివుని మీద ద్వేషంతో చేసిన యాగం తద్వారా కలతచెందిన సతీదేవి చేసికొన్న ఆత్మార్పణం వల్ల ఆవిర్భవించినవి.

శైవంలో ఇది ఒక ముఖ్యమైన సంఘటన, తదుపరి సతీదేవి పర్వతుని కుమార్తె పార్వతిగా  ఆవిర్భవించి, శివుని వియోగాన్ని తొలగించి గృహస్థాశ్రమిగా మార్చి, గణపతి మరియు సుబ్రహ్మణ్యుల ఆవిర్భావానికి దారితీసింది.

శాక్త పీఠాలు అంటే అమ్మవారికి చెందిన పుణ్యక్షేత్రాలు. శివుడు దుఃఖంతో సతీదేవి మృతదేహాన్ని మోసుకుని ఆర్యవర్తమంతటా సంచరిస్తున్నప్పుడు, ఆమె శరీర భాగాలు కిందపడటం వల్ల ఈ ప్రదేశాలలో శక్తి కొలువుదీరిందని నమ్ముతారు. సంస్కృతంలోని 51 అక్షరాలకు అనుగుణంగా 51 శాక్త పీఠాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో శక్తి మరియు కాలభైరవులకు మందిరాలు ఉంటాయి.

జంతు బలి:
ఇక్కడ ఆలయంలో జంతు బలులు ఇవ్వడం ఒక ప్రసిద్ధ ఆచారం. వాటిని అక్టోబర్ 2019లో నిషేధించారు, కానీ 57 రోజుల నిషేధం తర్వాత డిసెంబర్ 2019 నుండి తిరిగి ప్రారంభించారు.

కళ్యాణ్ సాగర్ జలాశయం:
కళ్యాణ్ సాగర్ జలాశయం ఆలయానికి తూర్పు వైపున ఉంది. 6.4 ఎకరాల విస్తీర్ణంలో, 224 గజాల పొడవు మరియు 160 గజాల వెడల్పుతో విస్తరించి ఉన్న ఈ విశాలమైన జలాశయం, సుందరంగా కనిపించే కొండలతో ఆలయ ప్రాంగణానికి గొప్ప అందాన్ని చేకూరుస్తుంది.

ఈ నీటిలో అరుదైన బోస్తామి తాబేళ్లు ఉన్నాయి, వాటిలో కొన్ని చాలా పెద్దవిగా ఉంటాయి. ఇక్కడ ఆచారాలలో భాగంగా, సందర్శకులు ఆహారం సమర్పిస్తారు. 

భక్తులు వాటికి "మురి" (మరమరాలు) మరియు బిస్కెట్లు తినిపిస్తారు. ఈ చెరువులో వివిధ రకాల చేపలు కూడా కనిపిస్తాయి, అయితే ఇక్కడ చేపలు పట్టడం నిషిద్ధం.

ఈ సహజసిద్ధమైన సరస్సును పవిత్రమైనదిగా భావిస్తారు. భక్తులు ఇక్కడ ఉన్న చేపలను, బోస్తామి తాబేళ్లను పూజిస్తారు. 

పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన పెరగడం వల్ల, కళ్యాణ్ సాగర్ జలాశయం పునరుద్ధరించబడింది ఆ సరస్సులో అరుదైన బోస్తామి తాబేళ్ల సంఖ్య వృద్ధి చెందుతోంది. 

మాతా త్రిపుర సుందరి ఆలయం ఒక కుర్మపీఠం కావడం వల్ల, మరియు ఆలయ ప్రాంగణం కూర్మ (తాబేలు) ను పోలి ఉండటం వల్ల, ఈ తాబేళ్లను పవిత్రమైనవిగా కూడా భావిస్తారు.

అంతేకాకుండా, పూర్వం ఇది ఒక విష్ణు ఆలయం మరియు కూర్మం విష్ణువు యొక్క అవతారం కాబట్టి, ఈ బోస్తామి తాబేళ్లను(బోస్తామి అనే పదం బెంగాలీలోని 'బోస్తం' నుండి వచ్చింది, దీని అర్థం 'వైష్ణవ బ్రాహ్మణులు' లేదా 'విష్ణువును పూజించే మునులు') ఆలయానికి వచ్చే భక్తులు పవిత్రమైనవిగా భావిస్తారు.

ఆలయం ప్రధాన ద్వారం పశ్చిమం వైపు ఉండగా ఉత్తరాన ఇంకో ఇరుకైన ప్రవేశ ద్వారం ఉంది. ఈ ఆలయం శంఖు ఆకారపు గోపురంతో మరియు గర్భగుడి విలక్షణమైన బెంగాలీ తరహా నిర్మాణంలో ఉంటుంది.

ఈ ఆలయం ఉదయపూర్ పట్టణానికి దక్షిణాన దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దర్శన వేళలు:
ఉదయం 4:00 AM నుండి రాత్రి 10:00 PM వరకు.
సంధ్యా హారతి: సాయంత్రం 7:00 PM.
శీతల్ భోగ్: రాత్రి 9:30 PM.
పాన్పు/విశ్రాంతి (Mayer Nidra): రాత్రి 10:00 PM.


పూజలు:
ఆలయంలో ప్రతిరోజూ రెండుసార్లు పూజలు చేస్తారు. రోజూ ఉదయం మరియు సాయంత్రం ఆరతి సమర్పిస్తారు. దశమి తిథి మినహా ప్రతిరోజూ జంతు బలి సమర్పిస్తారు.

త్రిపురసుందరి ఆలయ అభివృద్ధి కోసం, త్రిపుర ప్రభుత్వం మాతా "త్రిపుర సుందరి మందిర్ ట్రస్ట్"ని ఏర్పాటు చేసింది.

రోడ్డు మార్గం: ఈ ఆలయం NH-8 (పాత NH-44) ద్వారా అగర్తలా మరియు ఇతర ప్రాంతాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది.అగర్తలాలోని Nagerjala Bus Stand నుండి రోజంతా ఉదయ్‌పూర్‌కు ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి.అగర్తలా నుండి సొంత వాహనం లేదా టాక్సీ ద్వారా ప్రయాణిస్తే సుమారు 1.5 గంటల్లో ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం: ఆలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉదయ్‌పూర్ రైల్వే స్టేషన్ (UDPU) ఉంది. అగర్తలా రైల్వే స్టేషన్ నుండి ఉదయ్‌పూర్‌కు ప్రతిరోజూ ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. ప్రయాణ సమయం సుమారు 50 నిమిషాల నుండి 1 గంట వరకు పడుతుంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారు అగర్తలా (AGTL) వరకు రైలులో వచ్చి, అక్కడి నుండి లోకల్ రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా ఉదయ్‌పూర్ చేరుకోవచ్చు.

విమాన మార్గం: అగర్తలాలోని Maharaja Bir Bikram Airport (IXA) ఆలయానికి అత్యంత సమీపంలో ఉంది.ఇది ఆలయం నుండి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.అగర్తలా విమానాశ్రయం నుండి ఉదయ్‌పూర్‌కు చేరుకోవడానికి నేరుగా టాక్సీలు లేదా బస్సులు లభిస్తాయి.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Mata Tripurasundari Temple, Udaipur, Tripura - మాతా త్రిపురసుందరి ఆలయం, ఉదయ్‌పూర్‌, త్రిపుర

మాతా త్రిపురసుందరి ఆలయం,  ఉదయ్‌పూర్‌,  త్రిపుర పార్వతి దేవి యొక్క ఐదవ మహావిద్య రూపమైన త్రిపుర సుందరి దేవి దేవాలయం . ఈమెను స్థానికంగా దేవి త్...