Friday, January 2, 2026

Sampada Sukravaram Nomu Katha - సంపద శుక్రవారము నోము కథ

సంపద శుక్రవారము నోము కథ

ఒక బ్రాహ్మణునకు ఏడుగురు కుమారులు కలరు. వారందరు దరిద్రము చేత బాధపడుచుండిరి. ఒకనాడు ఉదయమున శుక్రవార మహాలక్ష్మి వచ్చి ముందుగా వారి పెద్దకోడలి యింటికి వెళ్లెను. ఆమె ప్రొద్దున్నే లేచి పిల్లలకు అన్నం పెట్టి తానుకూడా దినుచుండెను. అది సంపద శుక్రవార మహాలక్ష్మీ చూచి "ఛీ! వీరింటికేల వచ్చినాన" ని గిరుక్కున తిరిగివెళ్లి రెండవకోడలింటికి వెళ్లగా ఆమె చూడగా పేడచేసుకొనుచుండెను. "ఛీ! ఛీ! దీనింటి కేల వచ్చినాన" ని తిరిగి వెళ్ళి మహాలక్ష్మి
మూడవ కోడలి యింటికివెళ్ళగా ఆమె పాత గుడ్డలు కుట్టుచు కూర్చుండెను "ఛీ! దీనియింటికేల వచ్చితిన" నని మహాలక్ష్మీ నాలుగవ కోడలి యింటికి వెళ్లగా ఆమె పాచివాకిట గుంటలో వడ్లు పోసుకొని దంపుచుండెను. అదిచూచి మహాలక్ష్మి "ఛీ! దీనింటికేల వచ్చినాన" ని అయిదవ కోడలి యింటికివెళ్ళగా ఆమె ప్రొద్దున్నే తలదువ్వుకొనుచు కూర్చుండెను. ఆ మహాలక్ష్మి "ఛీ! దీనింటి కేలవచ్చినాని ఆరవకోడలి యింటికి వెళ్లగా ఆమె పాచివాకిటిలో నలుగురి పిల్లలకు తలంటి తాను తలంటుకొనుచుండెను. అది చూచి మహాలక్ష్మీ "ఛీ! దీనింటి కేలవచ్చినాన" ని ఏడవకోడలి ఇంటికి
వెళ్లగా ఆమె ఇల్లు అలుక్కొని, వాకిట కళ్లాపునుజల్లి, స్నానం చేసి, పసుపురాసుకొని, బొట్టు పెట్టుకొని, కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తలుపు వెనుక కూర్చుండెను. అక్కడ శుభ్రతకు మెచ్చుకుని శుక్రవారపు మహాలక్ష్మీ ఆరుగు మీద కూర్చుని. ఆ మహాలక్ష్మి ఎవరమ్మా! ఇలారండని ఏడవ కోడలిని పిలువగా "అమ్మా! నా మగడు యాయవారమునకు వెళ్లినాడు. మాకు కట్టుకొనుటకు ఒకటే బట్ట అందుచేత నాబట్ట ఆయనకిచ్చి నేను తలుపు వెనుక కూర్చున్నాన" ని చెప్పగా మహాలక్ష్మి "అయితే యేమి ఇలారావమ్మా! కట్టుకొనుటకు బట్టనేను యిచ్చెదన" ని చెప్పెను. అట్లు చెప్పి తన కట్టుబట్టలో సగము చంపి యామెకిచ్చి అమ్మా నాకు సోలడు బియ్యముపెట్టి అన్నము వండిపెట్టు మని చెప్పెను. అందుకాయిల్లాలు నొచ్చుకొని తన భర్త వచ్చువరకు నింటబియ్యముండవని చెప్పింది. అప్పుడామె ‘‘శుక్రవారపు మహాలక్ష్మీ మాయింటికి వచ్చినది ఆమెకు ఇవి కావలెనని వర్తకులతో చెప్పి తీసుకురా’’ అని చెప్పింది. ఆమె కోమటి యింటికివెళ్ళి తనయింటికి శుక్రవారపు మహాలక్ష్మీ వచ్చినదని తెలిపి, పప్పుబియ్యము మున్నగు వంటకు కావలసిన పదార్ధాలు ఇవ్వమని కోరగా, అతడు వాటినన్నిటిని యిచ్చెను. తరువాత ఆమె అదే విషయం చెప్పి తెలుకల వాని యింటిదగ్గర తెలగపిండిని నూనెను కంచరి యింటిదగ్గరి పాత్ర సామగ్రిని, సాలెవాని యింటిదగ్గర బట్టలను తీసుకుని యింటికివెళ్ళి నాలుగు పిండివంటలతో నవకాయ పచ్చళ్ళతో శుక్రవారపు మహాలక్ష్మీకి వడ్డించెను.

అప్పుడా బ్రాహ్మణుడు ఎడమూట పెడమూట వేసుకొని మోయలేకుండగా నింటికివచ్చెను. ఇంటికి రాగానే భార్య వానికి భోజనము పెట్టెను. భోజనముచేసి బ్రాహ్మణుడు అవి యన్నియు నెలాగున వచ్చినవని భార్యనడిగెను. ఆమె మనపాలిటి శుక్రవార మహాలక్ష్మీ వచ్చినది అని అందరిని అడిగిపట్టుకొని వచ్చినానని చెప్పెను. అంతలో శుక్రవారపు మహాలక్ష్మీ తానింక వెళ్ళెదనని చెప్పగా ఆమె ఆరాత్రి భోజనంచేసి వెళ్ళవలసినదని కోరెను. అందులకామె అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత వెళ్ళెదననెను. అప్పుడా బ్రాహ్మణి "అమ్మా! ఇంత చీకటిలో ఎలా వెళ్ళగలవు? రేపటి దినమున వెళ్ళవచ్చు" అనెను. అందుకామె సమ్మతించి, నిదురపోయి కొంతరాత్రికి లేచి, తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపి వెలుపలికి వెళ్ళివచ్చెదనని చెప్పెను. అందుకా బ్రాహ్మణి "చీకటిలో వీధిలోనికి వెళ్ళవద్దు ఆ మూల కూర్చొను" మనెను. మహాలక్ష్మీ అట్లే నాలుగు మూలలందును కూర్చొ ని, తెల్లవారువేళకు మాయమైపోయెను. ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొని, యిల్లు బాగు చేయుటకు చీపురును, చేటను బట్టి గది మూలలను చూచెను. నట్టింట అన్నిచోట్ల బంగారుకుప్పలుండెను. అందు కామె ఆశ్చర్యపడి మహాసంతోషముతో నా సంగతి భర్తతో చెప్పి పాలచేత కడిగి, బంగారు కాసులు పళ్లెములో పెట్టుకొని నా పాలిట శుక్రవారపు మహాలక్ష్మీ వచ్చినది కనుక యీ భాగ్యము కలిగెనని శుక్రవారపు నోము పట్టుటకు మనస్సులో సంకల్పించుకొనెను. ఆలాగునుకొని నట్టింట నాలుగు మూలలు అలికి ముగ్గుపెట్టి తలదువ్వి బొట్టు పెట్టుకొని పసుపు రాసుకొని పయిమీదనే నీళ్ళుపోసుకొని మహాలక్ష్మీని పెట్టి నోము నోచుకొని కథను చెప్పి అక్షింతలు వేసికొనెను.

ఉద్యాపనము :- ప్రతి శుక్రవారం ఉదయమే స్నానం చేసి లక్ష్మీని కొలిచి, ఒంటిపూట భోజనం చేయ వలెను. అట్లు అయిదేండ్లయిన తరువాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరంటాండ్రకు తలంటి నీళ్ళుపోసి భోజనం పెట్టి ఐదు రవికె గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వవ లెను.

Maredu Dalam Nomu Katha - మారెడు దళము కథ

మారెడు దళము కథ

ఒక రాజునకు ఒక కుమారుడు గలడు. ఆ కుమారుడు హఠాత్తుగా చనిపోగా నాతని తోడునకు పిల్ల నెవ్వరైన నిచ్చెదరా! యిన పట్టణమంతయు నడుగుచు దిరిగిరి. ఎవ్వరును పిల్ల నియ్యరైరి. ఆ పట్టణమున నొక బ్రాహ్మణున కొక కూతురుగలదు. ఆ చిన్నదానికి తల్లిపోవుటచే సపతి తల్లి తటస్థించెను. ఆమె ధనాశచేత ఆ పిల్లనిచ్చి పిల్లయెత్తు ధనంపుచ్చుకొనెను. రాజభటులా చిన్నదాన్ని తీసికొనిపోయి చచ్చిపోయిన రాజ కుమారుడు శవముతో తీసికొనిపోవుచుండగా నంతట వానవచ్చెను. ఆ వర్షములో కాటికి తీసికొని వెళ్ళలేక సమీపముననున్న యొక పాడుబడిన కాళీ దేవాలయములో దింపి తమ దారిని వారు పోయిరి. అంత సూర్యుడస్తమించి యెల్లెడల చీకటి గ్రమ్మెను. అంతట నా చిన్నది కట్టువిప్పికొని దేవాలయమునకు ప్రదక్షిణ చేయుచు, శివశివ! చిటికిన వ్రేలైన పట్టనీయవైతివి హరహర! అక్షింతలు గింజలైనా వేయ నీయవైతివి. మహాదేవ! మంగళసూత్రమైనా కటనీయవైతివి అనియనుచు మూడు సార్లు ప్రదక్షిణము చేసెను. పార్వతీదేవి ప్రత్యక్షమై నీవెవ్వరవని యడిగెను. "నేను బ్రాహ్మణకూతురను, నన్నీ చనిపోయినవానితో కట్టిపడవేయగా నా యదృష్టముచేత నీ యాలయమునకు వచ్చినాను, ఇప్పుడు నాయవస్థనుగురించి చెప్పుకొనుచు ప్రదక్షణము చేయుచున్నా"నని యా బ్రాహ్మణయువతిచెప్పె. అప్పుడు పార్వతీదేవి "నీవు క్రిందటి జన్మంబున మారేడుదళము నోముపట్టి యుల్లంఘనము చేయుటచేత నీకీ గతివచ్చినద" ని చెప్పి అక్షింతలు నీళ్ళు యిచ్చి "మూడు ప్రదక్షిణములు చేసి యవి యాపిల్లవానిమీద జల్లుమని" ని చెప్పెను. ఆ చిన్నది ఆ ప్రకారము జేయగా రాజకుమారుడు నిద్రపోయి లేచినవానివలె లేచి కూర్చుండెను. తరువాత అన్ని సంగతులు బ్రాహ్మణకుమార్తె వలన విని కాలక్షేపమునకై యామెను పుస్తకము చదవమని తానర్ధము చెప్పసాగెను. అంతలో తెల్లవారుటచే వారిని దహనము చెయుటకు రాజబంధువులువచ్చి బ్రతికియున్న రాజకుమారుని చూచి ఆశ్చర్యముతో పట్టణమునకు తీసుకొని వెళ్ళిరి. "ఇదేమి చిత్రమ" ని ఆశ్చర్యముతో నడుగగా- "పార్వతీదేవి యొక్క వరప్రభావమ" ని యాచిన్నది వారితో చెప్పెను. అప్పుడారాజు ఆ చిన్న దానిని తన కుమారునికి ఇచ్చి మహా వైభవముగా వివాహము చేసెను. అప్పుడా బ్రాహ్మణచిన్నది మారేడుదళము నోముపట్టి వెండిదళము, బంగారు దళము చేయించి, చెట్టుదళమొకటి తెచ్చి ఆ మూడు దళములు మూడుదోసిళ్ల బియ్యము శివునకు పూజచేసి, చిరకాలము సౌభాగ్య సంపదలతో సుఖమనుభవించుచుండెను. 

ఉద్యాపన: వెండి దళము, బంగారుదళము, మారేడుదళము కలిపి మూడుదోసిళ్ళ బియ్యముతో శివునకు పూజచేసి బీదలకు సంతర్పణ చేయవలెను.

Vavili Varamu Katha - వావిలి లక్ష్మీవారము కథ

వావిలి లక్ష్మీవారము కథ

ఒక బ్రాహ్మణునకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలును కలరు. అతడు కుమార్తెలను పెండ్లి పేరంటములు గావించి యత్తవారింటికి పంపివేసెను. కడసారపు కూతురు మిక్కిలి దరిద్రము కలవారి కొడలౌటచేత తన్ను అన్నలు ఒక్కసారియైన పుట్టినింటికి తీసుకొని వెళ్లకపోవుటచేతను మిక్కిలి దుఃఖించుచుండెను. 

ఇట్లుండగా నామె పుట్టింట కడసారి తమ్మునకు పెండ్లి తలపెట్టిరి. ఆ వివాహమునకు యీ కడసారపు చిన్నదానినితప్ప తక్కినవారిని తీసికొనివచ్చినాడు. పెండ్లిచేసికొనిరి. ఆ పెండ్లిలో తమ్ముడు పిలువకపోయినను, యా చిన్నదాని కొడుకులు తాతగారింటికి వచ్చి- "తాతా! పందిరివేయమా? చాపలు పరచమా?" అని యడుగగా నతడు తిట్టుచు మీరేమి చేయవద్దు పొమ్మని కసరి కొట్టెను. ఆ బ్రాహ్మణుని పెద్దకోడలు మాత్రము కడసారపు ఆడుబిడ్డ రాకుండుటకు విచారించుచు, ఆమె దరిద్రదేవతను తిట్టుచు, వంటబ్రాహ్మణులు బియ్యము కడుగుచుండగా నేను చాలకాలం క్రిందట వావిలిగౌరీదేవి నోముపట్టినాను, ఉద్యాపన మట్లేయన్నది, అని చెప్పి కడిగిన 
బియ్యములోనుండి అడ్జెడు తవ్వెడు
(2-1/2) తీసి యొకచేటలోపోసి కడగని బియ్యము యొక అడ్డెడు తవ్వెడు(2-1/2) గూడబోసి పైనొక పాతచేట మూతబెట్టి వావిలికొమ్మనుబెట్టి యందు రవికెలగుడ్డ దక్షిణ తాంబూలము నుంచి యాచిన్న యాడబిడ్డ యిల్లు తమ యింటి ప్రకనే యుండుటచేత, వాటిని గోడమీదనుండి ఆమెకు అందించెను. అవి పుచ్చుకొని యామె యింటిలో పెట్టుసరికి సిరిసంపదవచ్చెను. అటు తర్వాత ఆ చిన్నదానిని పుట్టింట అన్నగారి కుమార్తెకు వివాహముకాగా ఆమెను-"పెండ్లికి రావలసినని వచ్చిపిలిచిరి. ఆమె 'మేము బెండ్లినాడుదయముననే వచ్చెదమని చెప్పెను. ఆ యుదయమున సవారీమీద ఆమెను తమ యింటికి తీసికొనివచ్చి పీటమీద కూర్చుండబెట్టి పంచభక్ష్య పరమాన్నములును ఆమెకు వడ్డించిరి. అప్పుడామె తన యెడలి వస్తువులను. తీసి పీటమీదనుంచి "పుస్తెలారా! ఆరగింపుడు, పుస్తెలారా! ఆరగింపుడు", అని చెప్పి
పల్లకీ యెక్కి తన యింటికి వెళ్లిపోయెను. అప్పుడూరివారందరు "ఏమమ్మా! తిరిగి యింటికి వెళ్లుచున్నావని యడుగగా నా పుట్టింటివారు నన్నుచూచి పిలిచినారా లేదు. నా పాలటి మహాలక్ష్మీనిచూచి పిలిచినారు అని చెప్పెను వారందరు- "నీకింత భాగ్య మేలాగున వచ్చినద" ని యడుగగా-నేనేమి నోమును పట్టలేదు. నా పెద్ద వదిన గారు వావిలిగౌరి నోముపట్టి మొన్ననే యుద్యాపనము చేసిగొని యా వాయనము నాకిచ్చినది. నాకావాయన మందుకున్న ఫలమేగాని మరేమియులేదు" అని ఆమె చెప్పెను.

ఉద్యాపనము: కధచెప్పి యేడాది అక్షంతలు వేసికొని యేడాది అయిన తరువాత కొత్తచేటలో కడిగిన బియ్యము అడ్జెడు తవ్వెడు
(2-1/2), కడగని బియ్యము అడ్జెడు తవ్వెడు (2-1/2) పోసి వావిలికొమ్మపెట్టి పాతచేట మూతవేసి రవికెలగుడ్డ దక్షిణతాంబూలముతో గోడమీద నుంచి ముత్తయిదువకు వాయనము అందియ్యవలెను. 

Godisay Nomu Katha - గొడిసె నోము కథ

గొడిసె నోము కథ

గొడిసెనొము బట్టిన గొంతీ పట్టణములో వెదకిచూచిన విధవలేదు.

ఉద్యాపనము: యేడాది కధచెప్పి అక్షింతలు వేసికొని ఏడాది చింతపండు తినకుండ నియమము జరిపి సంవత్సరము పూర్తియైన పిమ్మట పదముగ్గురు ముత్తయిదువులకు పదమూడు రవికెలగుడ్డలు దక్షిణ తాంబూలము, పదమూడు మానికెల బియ్యము పులిహోరచేసి పదమూడు మూకుళ్లలోపెట్టి వాయనములియ్యవలయును. 


Ganeshuni Nomu Katha - గణేశుని నోము కథ

గణేశుని నోము కథ

ఒక బ్రాహ్మణుని భార్య గణేశుని నోముపట్టి ఉల్లంఘనచేసెను. గణేశుడామెకు నోముపట్టుట చెత సిరిసంపదలిచ్చి, ఉల్లంఘనముచేయుట వల్ల మితిలేని శోకము పెట్టెను. అందుచేత ప్రతిరోజూ కొడుకులకు కూతుండ్రకు వండిపెట్టిన తరువాత ఆమె యొకచోట కూర్చుండి ఎడ్చుచుండెను. ఊరివారందరు కూతలువేయగా వినక అడవిలోకిపోయి అక్కడ ఏడుపు మొదలుపెట్టెను. అట్లు ఏడ్చుచుండగా నొకనాడు పార్వతీపరమేశ్వర్లు భూమిపాలించుటకై వచ్చుచు ఆమెను జూచి "ఏమమ్మా! ఈలాగున నేడ్చుచున్నావ" ని యడిగిరి. అందుకామె- "మీరేమి ఆర్చేవారా! తీర్చేవారా! మీ దారిని మీరు వెళ్ళండ" ని చెప్పగా అలాకాదు, ఆ
ర్చేవారము మేమే, తీర్చేవారము మేమే, 
చెప్పవలసినదని మరల నడిగిరి. మీ దయవలన నాకు అన్ని సిరిసంపదలున్నవి, ఏమి కారణముచేతనో ఈలాగు యేడవవలెనని బుద్దిపుట్టుచుండునని ఆమె చెప్పెను.

అప్పుడు పార్వతీ పరమేశ్వరులిట్లనిరి- "ఓ కాంతా! నీవు పారెడు పామును పట్టుకొని పోయి పట్టిమంచము మీద వేయుము. అది నీకొడుకును కరచును. అప్పుడు అయ్యో! నా కొడుకులు పాము కరచినదని యెడ్వమనిరి. ఆమె ఆలాగే యని పామును పట్టుకొని వెళ్ళి పెద్దకొడుకు మంచముమిద పడవేసెను. పెద్దకొడుకు ఇంటికివచ్చి మంచము వైపునకు చూడగా అందు బంగారు గోవతాడు కనబడెను. అతడు తల్లిని పిలిచి అదేమని అడుగగా అయ్యో దానివల్ల యేడ్చుటకు వీలుకలిగినది కాదని యా రాత్రి మరల యే
డ్చుచు కూర్చుండెను. ఆ సమయమున తిరిగిపార్వతీ పరమేశ్వరులు
ప్రత్యక్షమై యింకను యెందుకు యేడ్చుచున్నావని యడిగిరి. మీరు చెప్పినట్లు చేసినాను ఆ పాము నాకొడుకును కరువలేదు. అందుచేత మళ్లీయేడ్చుచున్నానని యామెచెప్పగా, పార్వతీ పరమేశ్వరులు తేలును పట్టుకు వెళ్లి నీకూతురు మెట్టు పెట్టుకునే కుంకుమభరిణిలో వేయుము. అది కుట్టుచు అప్పుడు యే
డ్చుదవుగానని చెప్పిరి. అప్పుడామె తేలును పట్టుకొని వెళ్ళి కుంకుభరిణెలో వేయగా మరునాటి యుదయమున నా బరిణెను తీసి బొట్టు పెట్టుకొనుటకు అందులో చేయిబెట్టగా అందులో నాచేర్చుక్క బొట్టు కనబడెను. ఆమెతల్లిని బిలిచి "ఇందులో నా చేర్చుక్క బొట్టుపడివేసినా వేముని" యడిగెను. "అయ్యో! యిది కుట్టినది కాదని యా రాత్రి యడవికిబోయి మరల నెడ్చుచున్న యామెకు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై యేమి యింకను యేడ్చెదమనియడిగిరి. "అయ్యో! తేలు నాకూతురును కుట్టలేదు. అందుచేత వచ్చి యేడ్చుచున్నాననని" చెప్పెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు  "అమ్మా నివు పెంచిన పిల్లియున్నది దానిని చంపి వడిలో నుంచుకొని యేడ్చు అనగా, తదుపరి రోజు ఇంటివ్చుం వెళ్లి పిల్లిని చంపి వడిలో నుంచుకొని యేడ్చుచుండగా నూరివారందరు వచ్చి-యిదేమమ్మా! అని యడిగిరి. "అయ్యో! నా పెంపుడు పిల్లి చచ్చిపోయినదని మరింత యేడవగా ఆమె కంటినీళ్ళుపడి బంగారు పిల్లి అయి వడిలోనుండి క్రిందికి దుమికి పోయెను. 

అప్పుడు పార్వతి పరమేశ్వరులు వచ్చి "ఓ కాంతా! నీవు గణేశుని నోముపట్టి ఉల్లంఘనము చేయుటచేత విచారించు చున్నావు. కాబట్టి ఈ నోముపట్టి యేడాది అక్షింతలు వేసికొని ఉద్యాపనచేసిన యెడల నీయేడ్పు పోవునని చెప్పిరి.

ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ ప్రకారము నోచుకొని దుఃఖమువిడిచి భూలోకమున చిరకాలము సిరిసంపదలతో సుఖపడెను.

ఉద్యాపనము :- సోలెడు గిద్దడు నూనెక్రొత్త మూకుటిలోపోసి వత్తివేసి దిపము పెట్టి స్వయంపాకము, ఒక దక్షిణ తో శివుని ఆలయమున పూజచెసికొని  నందిదగ్గర ఆ దీపము  పెట్టవలయును. ఒక 
సత్బ్రహ్మణునికి దానము ఇచ్చి నమస్కరించి ఆశీర్వాదము పొందవలెను. 

Uppu Gowri/Gouri Katha - ఉప్పు గౌరీ కథ

ఉప్పు గౌరీ కథ

దాకనిండా ఉప్పుపోసిన తనువు చాలించేవరకు ఐదవతనము ఉండును . ఈ మాటలు అనుకొని ఏడాది పొడుగునా అక్షతలు వేసుకొనవలెను. సంవత్సరము నిండిన తరువాత ఉద్యాపన చేసుకొనవలెను.

నూరు పసుపు తోడ నోచిన కాంతకు నూఱు వేలేండ్లు అయిదవతనము. కొట్టు పసుపు నోచిన కాంతకు కోటివేలయేండ్లు అయిదవతనము.

ఉద్యాపన: క్రొత్త దాకలో(కుండలో) తొమ్మిది సోలల ఉప్పు పోసి రవికలగుడ్డ వాసినకట్టి, దక్షిణ తాంబూలములతో ముత్తైదువుకు ఇవ్వవలెను. 

Kandha Gouri Katha - కంద గౌరీ కథ

కంద గౌరీ కథ
ఒక బ్రాహ్మణునకొక కుమార్తెగలదు. ఆ చిన్నది అస్తమానూ ఏడ్చుచుండెడిది. ఎన్ని నోములు నోపించినను ఏడ్చుట మానలేదు. తండ్రి కూతురుని అడవిలోకి తీసుకొనివెళ్లి విచారించుచు కూర్చొనియుండగా పార్వతీ పరమేశ్వరులు భూమి పాలించడమునకు వచ్చి "ఏమి బ్రాహ్మణుడా! ఇక్కడ కూర్చుండి విచారించుచున్నావ" ని యడిగిరి. "మీకెందుకు? ఆ
ర్చెడివారా! తీర్చెడివారా! వెళ్ళండి" అని యా బ్రాహ్మణుడు చెప్పగా "ఆర్చెడివారము, మేమే, తీర్చెడివారము మేమే చెప్పవలసినదా" ని తరిగి యా బ్రాహ్మణుని పార్వతీ పరమేశ్వరులడిగిరి. అప్పుడు బ్రాహ్మణుడు "ఈ
పిల్ల ఊరకే యేడ్చుచుండును. అందుచేత భరింపజాలనివాడనై యిక్కడికి తీసుకొని వచ్చి ఏమియుతోచక విచారించుచున్నాన" ని చెప్పగా పార్వతీ పరమేశ్వరులు - ఈ చిన్నది క్రిందటి జన్మమున కందగాౌరీ నోముపట్టి ఉల్లంఘన చేసినది. అందుచేతనే యేడ్పు సంభవించినది. ఇప్పుడైనా ఏడాది కధ చెప్పి అక్షింతలు వేసికొని వీసెయేబులం కందదుంప, వెండిదుంప, బంగాళదుంప చేయించి ముత్తయిదువునకు రవికెలగుడ్డ, దక్షిణతాంబూలము, నల్లపూసలు, లక్కజోడు పెట్టి వాయనమిచ్చిన యెడల నీయే
డ్పు కుదురునని చెప్పి వారంతర్థానము నొందిరి.

అప్పుడు బ్రాహ్మణుడు కూతురును తీసుకొని యింటికివెళ్ళి పార్వతీ పరమేశ్వరులు చెప్పిన ప్రకారము యధావిధిగ కందగాౌరీ నోముపట్టి౦చి ఉద్యాపనము చేయించెను. నాటినుండి యా బ్రాహ్మణుని కుమార్తె యేడ్చుట మాని సకల సంపదలతో భూలోకమున సమస్త సౌఖ్యముల
ననుభవించెను.

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....