సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగించినా, జీవులకు ఆత్మజ్ఞానం, పరమసత్యం తెలియక అజ్ఞానంలోనే జీవించేవారు.
ఆ సమయంలో సనక, సనందన, సనాతన, సనత్కుమారుల వంటి మహా ఋషులు "ఈ సృష్టి రహస్యం ఏమిటి? పరబ్రహ్మను ఎలా తెలుసుకోవాలి?" అనే సందేహాలతో దేవలోకాలన్నీ తిరిగిన వారి ప్రశ్నలకు సమాధానం లభించలేదు.
చివరకు వారు పరమశివుడి శరణు ఆశ్రయించారు. అప్పుడు పరమశివుడు ఒక మహా వటవృక్షం (మర్రిచెట్టు) క్రింద దక్షిణ దిశను చూసి యవ్వన గురువు రూపంలో ఆసీనుడయ్యాడు. ఆ రూపమే శ్రీ దక్షిణామూర్తి.
విశేషమేమిటంటే, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ, ఆయన దివ్య సన్నిధి, చిన్ముద్ర, మౌన ఉపదేశం ద్వారా ఆ మహర్షుల హృదయాల్లో జ్ఞానదీపం వెలిగింది. వారు ఆత్మజ్ఞానాన్ని పొందారు.
వారి సందేహాలన్నీ క్షణాల్లో తొలగిపోయాయి. అందుకే ఆయనను "మౌనవ్యాఖ్యా ప్రబోధకుడు", అని దక్షిణామూర్తి మహిమను వేదాలు, ఆగమాలు కీర్తిస్తాయి. అంటే, మౌనంతోనే పరబ్రహ్మ తత్వాన్ని బోధించిన జగద్గురువు అనే అర్థం. "ఆది గురువు", "జగద్గురువు" అని స్తుతిస్తారు.
అప్పటి నుంచి జ్ఞానానికి, విద్యకు, గురుత్వానికి ఆదిదేవుడిగా దక్షిణామూర్తిని ఆరాధిస్తున్నారు. విద్యార్థులు, గురువులు, వేద పండితులు, ఆధ్యాత్మిక సాధకులు దక్షిణామూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే జ్ఞానం, వివేకం, ఏకాగ్రత, గురుకృప లభిస్తాయని విశ్వసిస్తారు.
No comments:
Post a Comment