నారదా! అయితే చెబుతున్నాను. ఆలకించు. ప్రకృతిమాతలో ఆరవ అంశగా అవతరించింది కనక షష్ఠీదేవి అన్నారు. ఈవిడ శిశువులకూ బాలబాలికలకూ అధిష్టాత్రి. బలవర్ధని. విష్ణుమాయా స్వరూపిణి. మాతృకలలో దేవసేనగా సుప్రసిద్ధ. స్కందుడి భార్య, ఆయుఃప్రద, బాలబాలికలకు పెంపుడుతల్లి, రక్షణకారిణి యోగమాయారూపంలో పురిటింట శిశువుల పజ్జ ఉంటుంది. ఆవిడ పూజావిధానం తెలుసుకోదగింది.
స్వాయంభువ మనువుకి ప్రియవ్రతుడు అనే కొడుకు ఉన్నాడు. యోగీంద్రుడు. చాలాకాలం వివాహం చేసుకోలేదు. తపస్సులకే అంకితమయ్యాడు. చివరికి బ్రహ్మప్రయత్నంమీద మాలినీదేవిని వివాహం చేసుకున్నాడు. ఎంతకీ సంతానం కలగలేదు. కశ్యపుడు వచ్చి పుత్రకామేష్టి జరిపించాడు.దంపతులకు ఇష్టిఫలంగా చరువును ఇచ్చాడు. అది భుజించాక మాలినీదేవి గర్భం ధరించింది. పన్నెండేళ్ళు మోసింది. బంగారంలాంటి బిడ్డను ప్రసవించింది. అందంగానే ఉన్నాడుగానీ మృతశిశువు. కళ్ళు తేలవేశాడు. దంపతులూ బంధుగణమూ రోదించారు. పుత్రశోకం భరించలేక మాలినీదేవి మూర్చిల్లింది. మృత శిశువుని తీసుకుని ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్ళాడు. బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆ ఆడవిలో దారుణంగా విలపించాడు. ప్రాణాలను పరిత్యజించడానికైనా సిద్దపడ్డాడు తప్ప మృతశిశువును ఖననం చేయ్యడానికి ఇచ్చగించలేదు. చెయ్యలేకపోయాడు. తన జ్ఞానయోగమంతా ఎటుపోయిందో. శోకాతురుడైపోయాడు.
అంతలోకీ ఒక దివ్యవిమానం కోటిసూర్యకాంతులతో కనిపించింది. అందులో తెల్లని వస్త్రాలలో పుష్పమాలికలతో తేజోమండలంలాగా వెలిగిపోతున్న దేవసేనాదేవి దర్శనమిచ్చింది. రాజు శిశువును దించి లేచి నమస్కరించాడు. స్తుతించాడు. పూజలు జరిపాడు.
మహాదేవి! నువ్వు ఎవరు? ఎవరి ఇల్లాలివి? ఎవరి అమ్మాయివి? స్త్రీరత్నంలాగా భాసిస్తున్నావు.
ప్రియవ్రతా! నేను దేవసేనను. దేవదానవ సంగ్రామాలలో దేవసేనకు జయం సమకూరుస్తాను. అందుకని నాకు ఆపేరు ఏర్పడింది. నేను బ్రహ్మదేవుడి మానసపుత్రికను. స్కందుడికిచ్చి వివాహం చేశాడు. మాతృకలలో సుప్రసిద్ధను. ఆదిపరాశక్తిలో ఆరవ అంశగా అవతరించాను. కనక షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు. అపుత్రులకు పుత్రులను ప్రసాదిస్తాను. ప్రియులకు ప్రియురాండ్రను అందిస్తాను. దరిద్రులకు ధనం కర్మిష్ఠులకు కర్మఫలం ఇస్తాను. సుఖదుఃఖాలూ భయశోకాలూ శుభాశుభాలూ సంపద్విపత్తులూ అన్నీ ఎవరికైనా కర్మఫలంగానే లభిస్తాయి. ఒకరు బహుపుత్రలయ్యేదీ ఒకరు వంశహినులయేదీ కర్మఫలమే. కొందరికి మృతశిశువులు లభించినా కొందరికి చిరంజీవులు కలిగినా కర్మవిపాకమే. గుణవంతులూ గుణహీనులూ రూపవంతులూ కురూపులూ అంగవికలులూ బహుభార్యావంతులూ భార్యావిహీనులూ ఆరోగ్యవంతులూ రోగపీడితులూ - అందరూ కర్మఫలస్వరూపులే. అంచేత కర్మ అన్నింటికన్నా గొప్పది. అన్నింటికన్నా బలియం. ఇది వేదాలు చెప్పినమాట - అంటూనే మృతశిశువును చేతుల్లోకి తీసుకుని లీలగా పునరుజ్జీవితుణ్ణి చేసింది. బాలుడి ముఖంలో చిరునవ్వులు బంగారు కాంతుల్ని వెదజల్లాయి. ప్రియవ్రతుడు ఆశ్చర్యంనుంచీ ఆనందంనుంచీ తేరుకోలేకపోతున్నాడు దేవసేన ఆ బాలకుడితోనహా విమానం అధిరోహించింది. బయలుదేరబోయింది. రాజు తేరుకుని మరొక్కసారి ఆ మహాదేవిని స్తుతించాడు. ఆవిడ ముఖం విప్పారింది.
ప్రియవ్రతా! నువ్వు ముల్లోకాలకీ రాజువు. స్వాయంభువ మనువు పుత్రుడవు. కనక సకల లోకాలలోను నా పూజలు జరిపించు. నువ్వూచెయ్యి. ఆలా అయితేనే నీకు ఈ కులవర్దనుడైన పుత్రుణ్ణి ఇస్తాను. ఇతడ సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడూ పండితుడూ అవుతాడు. ఇతడు నారాయణకళ. జాతిస్మరుడు యోగీంద్రుడూ అవుతాడు. నూరు యజ్ఞాలు చేస్తాడు. క్షత్రియులందరి నమస్కారాలూ అందుకొంటాడు. లక్షమదపుటేనుగుల బలం పొందుతాడు. పండితులకు ఆప్తుడవుతాడు. యోగులకూ జ్ఞానులకూ తపస్వులకూ సిద్దిప్రదుడై కీర్తి గడిస్తాడు. లోకంలో సర్వసంత్ప్రదుడుగా వెలుగొందుతాడు.
పూజలు జరుపుతాననీ జరిపిస్తాననీ దేవసేనాదేవికి మాటఇచ్చి ప్రియవ్రతుడు తన పుత్రుణ్ణి స్వీకరించాడు. దేవి ఆశీర్వదించి వెళ్ళిపోయింది. రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తిరిగివచ్చాడు. మాలతీదేవికీ బంధువర్గానికీ అమాత్యులకూ పరివారానికీ ప్రజానీకానికీ - జరిగిన వృత్తాంతమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. అందరూ సంతోషించారు. పండగ జరిపారు. అప్పటినుంచీ ప్రతినెలా శుక్షషష్టినాడు ఇంటింటా షష్ఠీదేవీ మహోత్సవాలు జరిపించాడు. పురిటిళ్ళల్లో ఆరవరోజున పదకొండవరోజున అన్నప్రాశనరోజునా ప్రతిశుభకార్యమప్పుడూ షష్ఠీదేవీ పూజలు జరుగుతున్నాయి. రాజు తాను స్వయంగా చేస్తున్నాడు.
కాథుమశాఖోక్తంగా ధ్యాన పూజావిధాన స్తోత్రమంత్రాలు ఏర్పడ్డాయి. ధర్ముడు నాకు ఉపదేశించాడు. నేను నీకు చెబుతున్నాను. నారదా! వింటున్నావా? సాలగ్రామంలోనో మంగళకలశంలోనో వటవృక్షం మూలనో గోడమీద బొమ్మగీసిగానీ బొమ్మ చేసిగానీ షష్ఠీదేవిని ఆవాహన చెయ్యాలి. ధ్యానించాలి.
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూమ్ ।
శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణ భూషితామ్ ॥
పవిత్రరూపాం పరమాం దేవసేనాం పరాం భజే ॥
పుష్పాలతో పూజించాలి. షోడశోపచారాలూ శ్రద్ధగా చెయ్యాలి. నైవేద్యాలు పెట్టాలి. ఓం హ్రీం షష్ఠీదేవ్యె స్వాహా అనేది మూలమంత్రం. ఈ అష్టాక్షరిని యథాశక్తిగా జరిపించాలి. లక్షసార్లు జపిస్తే అపుత్రకులు పుత్రవంతులవుతారు. ఇది బ్రహ్మదేవుడి వరం. ఇంక స్తోత్ర మేమిటంటే -
నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమోనమః ।
శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమోనమః ॥
వరదాయై పుత్రదాయై ధనదాయై నమోనమః ।
సుఖదాయై మోక్షదాయై షష్ఠ్యై దేవ్యై నమోనమః ॥
షష్ఠ్యై షష్ఠాంశరూపాయై సిద్దాయై నమోనమః ।
మాయాయై సిద్దయోగిన్యై షష్ఠీదేవ్యై నమోనమః ॥
పారాయై శారదాయై చ పరాదేవ్యై నమోనమః ।
బాలాధిష్ఠాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమోనమః ॥
కల్యాణదాయై కల్యాణ్యై ఫలదాయై చ కర్మణామ్ ।
ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమోనమః ॥
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు ।
దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమోనమః ॥
శుద్దసత్త్వ స్వరూపాయై వందితాయై నృణాం సదా ।
హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమోనమః ॥
ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి ।
మానం దేహి జయం దేహి ద్విషో జహి మహే హాశ్వరి ॥
ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవ్యై నమోనమః ॥
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే ॥
కల్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యై నమోనమః ॥
నారదా! ఈ స్తోత్రాన్ని పఠించి ప్రియవ్రతుడు షష్ఠీదేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. యశస్వి అయ్యాడు. అతని పుత్రుడు ఆయుష్మంతుడూ బలవంతుడూ యశస్వంతుడూ పరిపాలనాదక్షుడూ కాగలిగాడు.
ఈ స్తోత్రాన్ని ఒక సంవత్సరంపాటు పఠించినా విన్నా అపుత్రకులకు ఆయుష్మంతుడు కలుగుతాడు. ఏడాదిపాటు ఈపూజ చేసి ఈ కథాభాగం పురాణంగా విన్నవారికి పాపాలు తొలగిపోతాయి. గొడ్రాలికైనా బిడ్డలు కలుగుతారు. బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు వింటే నెలనాళ్ళల్లో ఆరోగ్యం చేకూరుతుంది.
No comments:
Post a Comment