Friday, April 10, 2026

Chapter 18 Janaka instructs Shukun in the path of karma - అధ్యాయము 18 జనకుడు శుకునకు కర్మమార్గ ముపదేశించుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 18

జనకుడు శుకునకు కర్మమార్గ ముపదేశించుట

సూతుడిట్లనియెను : జనకుడు తన గురుపుత్రుడగు శ్రీ శుకుని రాకవిని శుచియై మంత్రిపురోహితులనుగూడి యతని సన్నిధికేగి అతనికి తగిన యాసనమొసంగి పూజించి పాడియావునొసంగి క్షేమసమాచారము లడిగెను. శుకుడును రాజపూలందుకొని తన కుశలము తెలిపి రాజు క్షేమముగూర్చి యడిగెను. కుశలప్రశ్నల పిదప తన యాసనమున స్మాత్మశాంతితో సుఖముగ గూరుచున్న శుకునికాంచి, మనిసత్తమా! నిష్కాముడగు నీవు మా యింటికేమి కోరి వచ్చితివో సెలవిమ్ము అని రాజు ప్రశ్నించెను. 

శ్రీ శుకుడిట్లనియెను : మహీశా! ఆశ్రమములలో గృహస్థాశ్రమ ముత్తమోత్తమమైనది. కనుక భార్యను పరిగ్రహింపుమని మా తండ్రి యనెను. ఇది బంధము గల్గించదని నా తండ్రి యెంతయో చెప్పెను. కాని యతడే సంసార బద్ధుడగుటవలన నేను నా తండ్రి మాట పెడచెవిని బెట్టితిని. ఈ విషయమున నా మనస్సు సందిగ్ధముగ నుండెను. "నీవు విచారింపకుము. మిథిలకు రాజగు జనకుడు విదేహుడు; జీవన్ముక్తుడు; యాజి; లోకవిదితుడు; నిష్కంటకముగ రాజ్యమేలువాడు. ఐనను మాయాపాశబద్ధుడుగాడు. శాంతిగ నేలుబడి సాగించుచున్నాడు. ఆ జనకుని సందర్శించినచో నీ మానసమందలి ప్రమోహము విడివడును. భార్యను జేపట్టుము. నా మాట నమ్ముము. కాదేని రాజునడిగి తెలిసికొనుము. ఆ రాజు నీలోని సందియమును సరిగ దీర్చగలడు. అతని మాటలు విని తిరిగి నన్ను జేరుము." అని పలికెను. నా తండ్రి యాజ్ఞచే నీ పురమునకు వచ్చితిని. నేను మోక్షార్థిని. కర్తవ్య ముపదేశింపుము. ముక్తికి కారణము తపమా? వ్రతమా? యాగమా? స్వాధ్యాయమా? తీర్థసంసేవనమా? ఇందు తగినదేవో తెలుపుము.

జనకుడిట్లనియె: విప్రవర్యా! వినుము. మోక్షకామి ముమ్మెదట నుపనీతుడై వేదాభ్యాసమునకు గురుకులమందు వసింపవలయును. అచట సాంగవేదములను వేదాంతములను చదివి గురుదక్షిణ లొసంగి సమావర్తన సంస్కారమంది కామియై భార్యనుగూడి ప్రజాతంతువును కొనసాగించవలయును. అపుడిత డితర వృత్తులొనర్పరాదు. అగ్ని కార్యములు జరుపవలయును. మితహిత సత్యభాషిగావలయును. నిరాశుడు సదాశుచి సత్యసంతోషి కావలయును. ఆరోగ్యవంతులైన పుత్త్రపౌత్రులతో నభివర్ధిల్లవలయును. కళకళలాడుచుండవలయును. ఆ పిదప తన సర్వస్వమును భార్యను పుత్త్రులకప్పగించి లోని శత్రువుల నరికట్టి తపమునకు వానప్రస్థము స్వీకరించవలయును. పిమ్మట నగ్నుల నాత్మారోహణము చేసికొని పరమవైరాగ్యజ్యోతితో నుద్దీపించుచు శాంతితో సంయమియై తురీయాశ్రమము స్వీకరించవలయును. విరక్తునకు మాత్రమే సంన్యాసాశ్రమమున కధికారము గలదు. ఇది నిజమైన వేదవాక్కు. దీనికిక తిరుగులేదని నా యభిప్రాయము. నరునకు జన్మ మొదలుకొని నలువదియెనిమిది సంస్కారములు గలవని పెద్దలందరు. అందు గృహస్థాశ్రమము నలువదవదని తెలిసినవారందరు. ముముక్షువునకు శమము మున్నగు నెనిమిది సంస్కారములు చెప్పబడినవి. ఒక యాశ్రమమునుండి క్రమముగ రెండవ యాశ్రమము జేరవలయునని శిష్టులందురు.

శుకుడిట్లనియె: జ్ఞానవిజ్ఞానకారణమైన నిర్మలవైరాగ్యతేజము హృదయపూర్వకముగ నిండివెల్గుచుండగ నరుడాశ్రమము లన్నియును క్రమముగ నడుపవలయునా? కాకొకేసారి వనములందుండవచ్చునా? 

జనకుడిట్లనియెను : "ఇంద్రియ వాసనలు మిక్కిలిగ బలవత్తరములైనవి. అవి దురంతములు. ఒక్క చందాన లొంగవు. అపక్వహృదయుని హృదయమున వికారములు రేకెత్తించుచుండును. ఒకవేళ సంన్యాసాశ్రమమున తుష్టికరభోజనము కమ్మనిసెజ్జ పుత్రోత్సాహము గావలయుననెడు కామము గల్గినచో నదెట్లు తీరును? పూర్వవాసనల జాలము లతి బలవత్తరములైనవి. అవి శాంతిగనుండనీయవు. ఆ వాసనలడగుటకు సక్రమముగ నభ్యాసము సాధన చేయవలయును. పైని నిద్రించువాడు క్రింద పడవచ్చునుగాని క్రిందివాడు పతితుడుగాడు! సంన్యాసియై పతితుడైనవానికి మఱి సద్గతులు లేవు. చీమ వేరునుండి కొమ్మల దనుక మెలమెల్లగ ప్రాకి సుఖముగ ఫలమనుభవించగలదు. పక్షి తన పోవుదారి కడ్డుండదని యెగిరియెగిరి తుదకు శ్రమజెందును. కాని, చీమ నడుమ విశ్రమించుచు సుఖముగ ముందునకు సాగును. మనస్సు బలవత్తరమైనది. విషయలంపటులగు మూర్ఖులకు అది వశము గాదు. వారు కామము నణపజాలరు. కావున ఆశ్రమముల క్రమముననే సంస్కృతిని గెలువవలయును. గృహస్థాశ్రమము నందున్నవాడు సైతమాత్మవంతుడు శాంతుడు సుమతి ధీరుడు హర్షశోకరహితుడు సర్వసముడునై యుండవచ్చును. అతడు దిగులొందక విహితకార్యము లాచరించుచు సర్వారంభములు వదలి కల్గినదానికి సంతసించుచు నిత్యతృప్తుడై యుండవచ్చును. అట్లున్నవాడు నిశ్చయముగ ముక్తుడుగాగలడు. నేను రాజ్యమేలుచున్నను జీవన్ముక్తుడనై యే చింతయు చీకును లేకుందును. నన్నేదియు నంటజాలదు. నేను నానా భోగము లనుభవించుచునే పలు కార్యము లొనర్చుచునేయుందును. నీవు నటులే దేనియందును భ్రాంతి పెట్టుకొనకుండుము. దృశ్యవస్తువులన్నియును మాయచే బంధింపబడును. కాన యదృశ్య వస్తువెన్నడును బంధింపబడదు. పంచభూతములును వాని గుణములును దృశ్యములే.

ఆత్మను జేరలేక మనోవాక్కులు వెనుదిరిగివచ్చును. ఆ యాత్మ ననుమానప్రమాణమున గ్రహించవలయును కాని, యది ప్రత్యక్షముగ గనబడదు. నిర్వికారము నిరంజనము బ్రహ్మమునగు ఆత్మ యెట్లు బాధింపబడగలదు? ఈ మనస్సే సుఖదుఃఖముల కన్నిటికి పాదు. ఇది నిర్మలముగనున్న నంతయు చల్లబడదు. ఎల్ల పుణ్యతీర్థములు దిరుగుచు వానిలో మునుగుచున్నను మానసము పవిత్రము గానంతవఱకన్నియు వ్యర్థములే. మనుజుని బందమోక్షములకు చిత్తమే మూలము. అంతేకాని, దేహము జీవాత్మ ఇంద్రియాలివేవియును గావు. ఆత్మ నిత్యము; శుద్ధము; బుద్ధము; ముక్తము. ఇది దేనిచేతను బంధింపడదు. చిత్తమునందలి బంధమోక్షములడగినచో సకలమును శాంతించును. వీడు మిత్రుడు వీడు శత్రుడు వీ డుదాసీనుడు అను భేదములన్నియు మనోగతములే. ఏకాత్మత్వమునందు భేదమన్నదే లేదు. ద్వైతమందే భేదములన్నియు దోచును. అద్వైతమున నంతయు నొకటే. ఈ జీవరూపుడనగు నేను బ్రహ్మమే. ఇందులకు తిరుగన్నది లేనేలేదు. ఈ మాయసంసారమందు తగుల్కొనుటవలననే క్షుద్రబుద్ధులు పుట్టుచుండును. మహాభాగా! ఇదంతయు నవిద్యయే సుమా! విద్యాజ్యోతిలో మాయలు వ్రీలిపోవును. విచక్షణమతులు విద్యావిద్యల భేదమును చక్కగ గుర్తించవలయును. వేడిమిలేనిచో నీడవలని సౌఖ్యమెట్లు దెలియును? అవిద్యయేలేనిచో విద్యాసౌఖ్యమెట్లు బోధపడును? గుణములు గుణములందు భూతములు భూతములందు ఇంద్రియము లింద్రియములందు ప్రవర్తిల్లుచుండగ నికనాత్మకు దోషమెక్కడిది? ఎల్ల వేదములందును దర్మ సంస్థాననార్థమై లోక కల్యాణమునకు నియమములు గలవు. అవియే లేనిచో బౌద్ధమతమునవలె ధర్మచ్యుతి గలిగి తీరని నష్టము వాటిల్లును. దానిచే వర్ణాచారములు చెడిపోవును. కావున వేదోక్తమార్గ మనుసరించుట శుభప్రదము. 

శుకుడిట్లనియె: ఓ మనుజేశ్వరా! మీరింతగ ప్రబోధించినను నాసందియమేలొకో తీరుటలేదు.
వేదధర్మములందు హింసయుండును. అది యధర్మము. అట్టి వేదధర్మమెట్లు ముక్తినీయగలదు? సోమపానము పశువధ మాంసభక్షణము ప్రత్యక్షముగ ననాచారములు. సౌత్రామణియజ్ఞమున సురాపానము జూదము నానావ్రతములు ఇవన్నియును చెప్పబడినవి. తొల్లి శశబిందువను రాజు గలడు. అతడు ధర్మిష్ఠుడు; వదాన్యుడు; సత్యవాది; యాజియని వింటిని. అతడు ధర్మసేతు సంరక్షకుడు పెడత్రోవలు బట్టువారిని గట్టిగ శాసించువాడు. భూరిదక్షిణ లొసంగి పెక్కు యాగము లొనరించినవాడు. అతని యాగపశువుల తోళ్లు వింధ్యాచలమట్లు గుట్టగ పెరిగినవి. వానిపై మొయిళ్ళు గురియుటచే నచటినుండి చర్మణ్వతీనది ప్రవహించినది. ఆ రాజు స్వర్గసీమకేగెను. అతని కీర్తి భూమిపై నిలిచినది. కాని యిటువంటి వేదధర్మములు నా మతి కెక్కవు. స్త్రీలతోడి కలయికవలన నరునకు క్షణిక సుఖము గల్గును. ఆ కొలది సుఖమునకే వాడు వెంపరలాడుచుండునతడు జీవన్ముక్తుడగు టెట్లు? 

జనకుడిట్లనియె: "యాగమందు జరుగు హింస హింసయనబడదు. కామ రాగములతో జేసినచో నదే హింసయగును. నిప్పులో పచ్చి తడి కట్టెలు వేసినచో నిలువరాని పొగ వెలువడును. ఎండుకట్టెలు వేసినచో నవి గనగన మండును. వేదోక్తమగు హింస నహింసగ నెఱుంగుము. రాగులకదే హింసయగును. కాని విరాగులకు గాదు. అహంకార మమకారములు విడనాడి చేసిన పనిని వేదవిదులగు మనీషులు ఆకృతమందురు. రాగముతో కర్తృత్వ బుద్ధి గృహస్థులు చేయు హింస హింసయే అగును. రాగ గర్వములు కర్మసంగము వదలి విజితాత్ములును ముముక్షులునగువారు చేసిన కర్మము హింసయగును. అకర్మయగును."

అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

పంచాంగం

Chapter 17 The Shuku Went to Mithila - అధ్యాయము 17 శ్రీ శుకుడు మిథిలకు జనుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 17

శ్రీ శుకుడు మిథిలకు జనుట


సూతుడిట్లనియె : ఈ ప్రకారముగ మహామనస్వియగు శుకుడు పలికి చేతులు జోడించి తన తండ్రి పదకమలములకు నమస్కరించి మిథిలా ప్రయాణమునకు తరలి తండ్రి కిట్లనియెను : 

"ఓ మహాభాగా! తండ్రీ! నీ మాట నొప్పుకొంటివి. జనకుడేలు విదేహపురిని జూడనేగుటకు నా కనుమతిమ్ము. ఆ రాజు దండములేకయే రాజ్యమెట్లు చేయును? దండనీతిలేనిచో లోకము ధర్మమున వర్తించదు. ధర్మసంస్థాపనకు దండనీతియే మూలమని మన్వాదులు వాక్రుచ్చిరి. అయ్యో! ఆ రాజు దండములేకయే రాజ్యమెట్లు చేయునాయని నా సందేహము. జనకుని ప్రవర్తన నా తల్లి వంధ్యయనినట్లు నాకు భాసించుచున్నది. దాని నిజ మెఱుంగుటకు మీ యనుమతితో అట కేగుచున్నాను. 

సూతు డిట్లనియెను : ఆ శుకు డహంకారమడగిన యాత్మనిష్ఠుడు నిర్లిప్తుడు జ్యోతిఃసాగరమున దేలియాడువాడు. అట్టి శుకుని తన కౌగిట జేర్చుకొని వాసుడిట్లు పలికెను: 

"శుకా! నీకు కల్యాణమగుత. చిరంజీవివిగమ్ము. తిరిగి వత్తునని మాట యిచ్చి క్షేమముగ పోయి రమ్ము. నీ వచ్చటినుండి మరల ఇచ్చటికే రమ్ము. ఇంకొక చోటికి నీవెన్నడును పోరాదు. నీ ముఖకమలమును గాంచకున్నచో నాకు శాంతిగ మనుగడ సాగదు. నిన్నొక్కక్షణమేని చూడకున్నచో నా మనస్సు వ్యథజెందును. నాకు నీవు ప్రాణములోని ప్రాణము. జనకుని సందర్శించి నీ శంక బాపుకొని తిరిగి వచ్చి యిచ్చటనే వేదాధ్యయన పరుండవై సుఖముండును. 

సూతుడిట్లనియె : వ్యాసుని పలుకులు విని శుకుడు తన తండ్రికి ప్రదక్షిణ నమస్కారము లొనరించి వింటినుండి వెడలిన యమ్మువలె త్వరితముగ బయలుదేరెను. అతడు మార్గమధ్యమున పాడిపంటలు వెల్లివిరిసిన దేశములను దేశవాసులను ఫలపుష్పముల నలరు వనములను తపించు తాసనులను దీక్షితులగు యాజకులను యోగాభ్యాసపరులగు పరమయోగులను వననివాసులగు వానప్రస్థలును శైవ వైష్ణవ సౌర శాక్త పాశుపత మతస్థులను వేరువేర దర్శించుచు పయనము సాగించుచుండెను. ఆ మహాత్ముడు రెండేండ్లకు మేరుగిరిని నొక్క యేడాదిలో హిమగిరిని దాటి మిథిలవైపు సాగెను. అతడా నగరి ప్రవేశించి సకలకళా సమృద్ధులను సదాచార సంపన్నులను సందర్శించెను.

రాజద్వారము జేరగనే రాజభటు లతనిని నిలువబెట్టి "నీవెవరవు? ఎటనుండి వచ్చితివి? నీకిందేమి పని?" యని ప్రశ్నలు గురిపించిరి. ఐనను శుకుడు వారికి మారు పలుకలేదు. ఆ మునిబాలుడు వచ్చుపోవువారికి బాటవదలి తానొక ప్రక్కగ మిన్నువిఱిగిమీదపడినను కదలకమెదలక స్థాణువువలె నుండెను. నడుమనడుమ వింతనవ్వులు నవ్వుచుండెను. 

ద్వారపాలు డిట్లనియె : బ్రాహ్మణోత్తమా! నీవు మూగవా? ఇచ్చటి కేపనికై వచ్చితివి? ఎవ్వరేని ఏపనియులేకూరకే రారని నాకు తెలియును. రాజునానతిలేనిదే యెవ్వరును నగరము ప్రవేశింపరాదు. క్రొత్తగవచ్చినవాని కులశీలములెఱుగక లోనికి వెళ్ళనీయరు. నీవు వేదవిదుడవు. వైరాగ్యతేజమున వెలుగొందు బ్రాహ్మణుండవు. నీ కులమును వచ్చిన పనిని దెలిపి యథేచ్ఛగ నరుగుము. 

శుకుడిట్లనియె: "నా వచ్చినపని నీ మాటలవలననే తీరినది. విదేహనగరమున ప్రవేశము దుర్లభమని తెలియుచున్నది. నా మతిమాంద్యము వలన రాజును జూడవలయుననెడి ఆసక్తితో నేనింతదూరము శ్రమపడి యేతెంచితిని. నేను నా తండ్రి మాటచే మోసపోతిని. ఇపుడెవరిని దూషింతురు? నేజేసికొన్న కర్మము కొలది ఇట్లు పర్యటించుచున్నాను. ధనాశయే పురుషుని ముప్పుత్రిప్పలు పెట్టును. నాకా యాస లేకున్నను విభ్రాంతిచే మోసపోయి యింతదూరము వచ్చితిని. నరుడు మోహపాశమునందు జిక్కుకొనకున్నచో నతనికి నిత్యసుఖము చేకూరును. నేనే కోర్కులులేనివాడనే. ఐనను మోహజలధిలో మునుగుచున్నాను. ఎక్కడి మేరుగిరి! ఎక్కడి మిథిలాపురి!! ఇంత దూరమిట్లు కాలినడకతో వచ్చుటేమి? నా రాకకు ఫలితమేమి? నన్నావిధిలీల వంచించినదని తోచుచున్నది. మేలైనను కీడైనను ప్రారబ్ధ మనుభవించక తీరదు. ఆ ప్రారబ్ధమునకు ప్రయత్నముతోడై యెల్లపనులను చేయించును. ఇంత శ్రమపడివచ్చితినేకాని ఇట నొకవేదముగాని యొకతీర్థముగాని లేదు. ఇంతకును విదేహరాజు పురమున ప్రవేశము దుర్లభము" అని శుకుడు పలికి మౌనమూనెను. ప్రతీహారి శుకుని జ్ఞాన సంపన్నునిగ బ్రాహ్మణశ్రేష్ణునిగ దెఇసికొనెను. ద్వారపాలుడా మునితో సామవచనములనిట్లు పలికెను: 

"ద్విజసత్తమా! నీకు పనియున్న చోటికిక స్వేచ్ఛగ నరుగుము. నిన్ను నేనడ్డగించిన నా యపరాధము క్షమింపుము. ముక్తపురుషులకు క్షమయే బలము.

శుకుడినట్లనియె : 'ప్రతీహారీ ! ఇందు నీ దోషమావంతయును లేదు. నీవు పరతంత్రుడవు. సేవకుడు తన ప్రభు నానతి నిర్వహించి తీరవలయును. నన్ను నీవు వారించుటవలన రాజును సైతము నిందించుటకు వీలులేదు. వీడు దొంగ వీడు శత్రువని చక్కగ నెఱుంగుట పండితుల లక్షణముగదా! ఇంతకు నిచ్చట నాదే పొరబాటు. పొరుగింటకేగుట లఘుత్వమునకు కారణము.' 

ప్రతీహారి యిట్లు పలికెను : ద్విజవరా! అందఱి మేలుగోరువానికి సుఖమేది? దుఃఖమేది? ఏది కార్యము? ఎవడు కర్త? ఎవడు శత్రువు? నాకిది తేటపఱచుము. 

శుకుడిట్లు వచించెను: లోకములన్నిటియందు రెండు మార్గములు గలవు. మనుజులు రెండు తెగలు. ఒకడు రాగి, వేరొకడు విరాగి. విరాగులును ముత్తెఱంగులవారు. తీవ్రవిరాగి-మధ్యమవిరాగి-మందవిరాగి అని. ఇక రాగులు రెండు విధములు. మూర్ఖుడు చతురుడునని. చాతుర్యము రెండు తరగతులు: శాస్త్ర చాతురి-బుద్ధిచాతురియు. బుద్ధియు యుక్తము-అయుక్తము నని రెండువిధములు. 

ప్రతీహారి యిట్లనియె : బ్రాహ్మణవర్యా! నీవు చెప్పినదంతయు నాకు తికమకగనున్నది. నరిగ వివరించి నిజమేదో తెలుపుము. 

శుకుడిట్లు వచించెను: ఈ సారములేని సంసారమం దనురాగముగలవాడు రాగి. అట్టివాని కెన్నెన్నియో సుఖదుఃఖములు గల్గుచుండును. నరుడు తనకు ధనము పెండ్లము కొడుకులు ఘనవిజయము అభిమానము గలిగినచో సుఖముగాంచును. అవి తనకు వేరైనవాడు దుఃఖపడును. ఎవరికి దేనివలన సుఖముగలుగునో వారా సుఖోపాయము నాచరించవలయును. దానికి విఘ్నముగల్గించువారిని శత్రులుగ నెన్నవలయును. రాగవంతునకు మిత్రుడు సుఖము గలిగించును. ధీరుడై లోచూపుగలవాడెన్నడును మోహభ్రాంతిలో మునుగడు. మూర్ఖుడే యెల్లకాలము మోహమందును. విషయవిరక్తుడు జ్ఞాని స్వాత్మనక్తుడునగు. అధ్యాత్మజ్ఞాని స్వాత్మసక్తుడునగు అధ్యాత్మజ్ఞాని నిత్యుడై తత్త్వ జ్ఞానార్థచింతనమును చేయుచు నమృతత్వముగోరి యేకాంతసేవలో ప్రత్యగాత్మను సందర్శించవలయును. అదే యతనికి బ్రహ్మానందము చేకూర్చును. ఈ మాయా సంసారమందలి మాటలన్నియును వికారములు. దుఃఖప్రదములు. మేలుగోరు యథార్థవాదికి లోకమే విరుద్ధమగును. కామము క్రోధము మాంద్యము మున్నగునని నరు ననేకరీతుల వెన్నాడు వైరులు. ఈ లోకములన్నిటిలో తన యాత్మసుఖమునకు తానే బంధువు. ఆత్మానందమునకు సాటియగు సుఖము మరేదియును లేదు.

సూతుడిట్లనియె: శుకుని ప్రబోధము విని ప్రతీహారి యతనిని మహాజ్ఞానిగ నెఱిగి చక్కని రాజమార్గమున నతనిని లోనికి ప్రవేశపెట్టెను. అంత శుకుడా నగరమందు పెక్కు విధముల ద్రవ్యరాసులను పోసి యమ్ముకొనువారు రాగద్వేషకామలోభమోహాకులులు కీచులాడుకొనువారునను మూడువిదముల మనుజులను గాంచుచు ముందునకు సాగి రాజమందిరములోనికి ప్రవేశించెను. అతడు ప్రభవలె నడచు రెండవ సూర్యుడో యన పరమవైరాగ్యమున భాసిల్లుచుండెను. లోనగూడ ప్రతీహారులు శుకునడ్డగించగా నతడు ద్వారమందే స్థాణువువలె కదలక మెదలకుండి ఆత్మమోక్షముగూర్చి విచారించు చుండెను. నీడను వేడిమిని సమముగ చూచు నా మహాతపుడు స్థాణువు పగిదినుండి వృత్తులకు మూలమును వెదకుచు నిశ్చల సమాధిలో మునింగెను.

ఒక్క ముహూర్తమాత్రముననే జనకుని మంత్రివచ్చి చేతులు జోడించి శుకుని రాజమందిరములోని రెండవ ద్వారమున ప్రవేశింపజేసెను. మంత్రి శుకునకందు విరిసిన మనోహరములైన తరువులు వనములు జూపి యతిథిమర్యాదలు జరిపెను. రాజసేవా పరాయణులు గేయ గానకళాశ్రీలు కామశాస్త్ర విశారదలునగు వారస్త్రీలను శుకునకు చేయవలసిన సేవలన్నియుచేయ నియోగించి మంత్రి తానందుండి బయటకు వచ్చెను. శుకుడందే యుండెను. ఆ కాంతలు శుకునకు వీడని భక్తితో సేవలుచేసి ఆయాకాలములకు దగిన వివిధములగు వంటకములతో శుకుని తనిపిరి. ఆ శుకుని గాంచి వారు కామమోహితులైరి. ఆ యంతిపురము మించుబోడులా విరాగికి తమ యుద్యానవనమందలి రమ్య విషయములను కలయజూపిరి. ఆ శుకుడు యువకుడు మనోహరుడు; మృదుభాషి; అపరమన్మథుడు; అతనిని గాంచగనే యాలలనల మనస్సులు కామవశమైనవి. కాని ఆ మరునిముసమందే వారతనిని విజితేంద్రియునిగ నెఱింగి పరమభక్తితో పూజలు చేసిరి. పరిశుద్ధాత్ముడగు శుకుడును వారిని తల్లులుగ భావించెను. ఆ శుకుడు ఆత్మారాముడు విజితాత్ముడు; వంతగాని సంతసముగాని చెందకుండెను. ఆ యువతులలోని మదసరాగములు గనియు విరాగభావముతో నాత్మసంస్థితి జెందెను. అపుడా కాంతలతనికి మేలైన వస్త్రములతో చక్కగ నలంకరించిన పానుపమర్చిరి. దానిచెంత మధురరసపదార్థములునిచిరి. శుకుడు పాదములు కడుగుకొని దర్భలుచేతబట్టి శ్రద్ధతో పశ్చిమసంధ్య నుపాసించి నిర్మలనిశ్చలచిత్తమున స్వాత్మసమాధియందు మునింగెను. అతడొక జాము ధ్యానమునుండి నిద్రించెను. రెండు జాములు నిదురించిన పిమ్మట మేల్కొనెను. అతడు మరల నపరరాత్రమున నాత్మధ్యానమగ్నుడయ్యెను. కొంతసేపటికి లేచి స్నానమొనర్చెను. ప్రాతఃక్రియలు నిర్వర్తించెను. స్థితప్రజ్ఞుడై వైరాగ్యజ్యోతితో బ్రహ్మతేజమున వెలుగుచుండెను.

అధ్యాయము 18 జనకుడు శుకునకు కర్మమార్గ ముపదేశించుట

పంచాంగం

Chapter 16 Vyasa instructs Shuku the Bhagavata of Sridevi - అధ్యాయము 16 వ్యాసుడు శుకునకు శ్రీదేవీ భాగవత ముపదేశించుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 16

వ్యాసుడు శుకునకు శ్రీదేవీ భాగవత ముపదేశించుట


వ్యాసుడిట్లనియె : ఈ ప్రకారముగ క్షీరసాగరశయనుడు వటపత్రశాయి పరమాశ్చర్యమందుచుండ శ్రీదేవి సుధలుచిందు చిరునవ్వు వెన్నెలలతో విష్ణుని గాంచుచు ననియెను : 

"నీకిదంతయును వింతగ నున్నదా? నీవు మహాశక్తి ప్రభావమున మున్ను నన్ను విస్మరించితివి. ప్రళయము గడచినప్పుడెల్ల నీవు మరల మరల నుద్భవించుచుందువు. ఆ పరామూలశక్తి నిర్గుణురాలు. నీవును నేనును సగుణులము. నన్ను సాత్వికశక్తిగ నెఱుంగుము. నీ నాభికమలమునందుండి ప్రజాపతియగు బ్రహ్మ యుద్భవించగలడు. అతడు రజోగుణముతో నెల్లలోకములు మరల సృజించును. అతడంతట నుగ్రతవ మొనర్చి యుత్తమ రాజసశక్తిని బడసి రజోరాగప్రభావమున ముల్లోకములను రజోరాగముతో నింపివేయును. బ్రహ్మ త్రిగుణమయములగు పంచభూతముల నుత్పత్తిచేయును. ఆ పిదప నింద్రియములను ఇంద్రియాధిష్ఠాన దేవతలను మనస్సును సృజించును. ఈ విధముగ విధి సృష్టిరచన పూర్వమువలెనే కొనసాగించును. కావుననే బ్రహ్మ సృష్టికర్త యనంబరగును. 

ఓ మహాశక్తీ! విష్ణూ! ఈ సకల విశ్వమునకు నీవే పరిపాలకుడవు. నీ కన్బొమల మధ్యనుండి కోపకారణముగ రుద్రు డావిర్భవించును. అతడు మహోగ్రతపమొనర్చి తామసశక్తిని వశము చేసికొనును. ఆ రుద్రుడే కల్పాంతమున సర్వమును పొలియజేయును. నీ సన్నిధానమున కరుగుదెంచిన నన్ను సాత్త్వికశక్తిగ నెఱుగుము. మధుసూదనా! నేను పెన్నిధివైన నీ సన్నిధి యందే యుందును. నీ హృదయకమలమందే యిల్లు కట్టుకొని నిముసమైన నినుబాయక నివసింతును."

విష్ణువిట్లనియె : 'నేను మునుపు చమత్కారముగొల్పు శబ్దార్థములుగల శ్లోకార్థము వింటిని. అది పరమమై శివవై రహస్యమై రస్యమై యలరుచున్నది. ఆ వాక్కునెవరు వక్కాణించిరో తెలిపి నా యీ సందియము తొలగింపుము. నిఱుపేద ధనముకొఱకు నిరంతరముగ చింతించుచుండునట్లు నేనా శ్లోకార్థమందలి గమ్యార్థమును మాటిమాటికి సంస్మరించుచున్నాను. 

వ్యాసుడిట్లనియె: విష్ణుని యాపలుకు లాలకించి చారుహాసినియగు నిత్యకల్యాణి పరమప్రీతితో విరిసిన లేనగవుతో హరికిట్లనియెను: 

"శౌరీ! నన్ను చతుర్భుజగ నిర్గుణగ నెఱుంగుము. నేను సగుణ నిర్గుణములుగల దాననని నీకు దెలియదా? ఆ శ్లోకార్థ మా మహాశక్తిది. నీవా మూలశక్తినే నమ్ముము. ఆ యద్భుతశక్తిచేతనే శుభకరము వేదసారమునగు పుణ్యపురాణము వెలసినదని తెలిసికొనుము. ఆ కరుణామయియగు దేవికి నీపై నెక్కడలేని వాత్సల్యము గలదని భావింతును. ఆమెయే నీ యోగక్షేమములు చూచు తల్లి. కావుననే యామె నీకా పరమరహస్యమైన వాక్యము వినిపించినది. దానిని నీ యెడదలో నిల్పుకొని యెన్నడును మరువకుము. ఆ మహావిద్యా స్వరూపిణి నీకు సర్వశాస్త్రరసాయన మెఱుకపఱచినదని యెఱుగుము. ఈ భువనత్రయమందును దానిన మించి గ్రహించవలసినది మరొండులేదు. నీవన్న నామె కెంతయో యిష్టము. కనుకనే యాయె నీకా దివ్యవాక్కు వినిచెను."

వ్యాసుడిట్లనియె : అట్టి దేవి దివ్యవాణి నాకర్ణించి భగవానుడు దానినే పరమమంత్రరాజముగ నెంచి హృదయకమలమందు దరించెను. కొంతకాలము పిదప విష్ణుని నాభికమలమునుండి బ్రహ్మ యుద్భవించెను. అతడు దానవభయభీతుడై శరణు వేడుకొనగా హరి మధుకైటభులతో బోరి వారి నంతమొందించి బ్రహ్మభయము బాపెను. పిదప కూడా హరి దివ్యరసమయమైన యాశ్లోకార్థమునే జపించుచుండెను. అది వినిన కమలజుడగు బ్రహ్మ హరిని ఓ పుండరీకాక్షా! నీవేమి జపించుచున్నావు? నీకంటె నధికుడెవడు గలడు? నీవనుస్మరించుచు ముదమందు నామంత్రమేమి? అని ప్రశ్నించెను. హరి యిట్లు పలికెను : 

"మహాభాగా! నీలో నాలో సర్వములోగల కారయిత్రిశక్తిని భగవతిగ జగదంబగ భావింపుము. ఈ మహాజలరాశియు నెల్లలోకములు నే తల్లి యాధారముగ నొప్పుచున్నవో యా తల్లినే సాకారగ ననంతశక్తిగ సనాతనగ నెఱుంగుము. ఆ మహాశక్తియే యెల్లప్రాణుల జీవనాడులు స్పందింపజేయు నిత్యనూతన చైతన్యశక్తి - చరాచర విశ్వకర్త్రి-ఆమె సుప్రసన్నురాలయ్యెనా - కోరిన కోర్కులు గురియు వరదాయిని యగును. ముముక్షులకు ముక్తిప్రదాయిని యగును. ఆ తల్లియే పరావిద్య - మోక్షహేతుభూతురాలు - సంసార బంధన కారణురాలు - సర్వవిశ్వేశ్వరి. ఈ విశ్వవిశ్వమును నీవును నేనును సత్యశివసుందరశక్తివలన సంభవించిన వారమని భావింపుము. ఇది నిజము. నిజము. ఇందు సందేహము లేశమైనను లేదు. ఆమె నాకు వచించిన శ్లోకార్థమే మహాభాగవత పరమ సారము. ఆ యర్థశ్లోకమే రాబోవు ద్వాపరయుగాదిని వ్యాసభగవానునిచే భాగవతముగ వ్రాయబడును."

వ్యాసుడిట్లనియె : "ఆ మహామంత్రమును విష్ణువునుండి బ్రహ్మ గ్రహించి తన తనయుడగు నారదునకు సమ్మతితో నుపదేశించెను. నారదునివలన నేను విని దానిని పండ్రెండు స్కంధముల శ్రీమహాభాగవతముగ విస్తరించితిని. ఆ పురాణము బ్రహ్మ సమ్మితము. అది పంచలక్షణ లక్షితము. శ్రీదేవీ మహిమాన్వితమునై యలరారును. అది తత్త్వజ్ఞాన రసామృతము - సర్వోత్తమము - ధన్యము - పుణ్యము - ధర్మశాస్త్రసమము - సాహితీరససంభరితము - వేదార్థప్రతిపాదకము. వృత్రాసుర కథాభరితము - నానాఖ్యానక సంకలితము-బ్రహ్మవిద్యా నిధానము-సంసారార్ణవతారకము. ఓ మహామతీ! ఓ పురుషవర్యా! నీవా పరమపుణ్య పురాణ మెఱుంగుము. దానిని చదువుట కెల్ల విధముల నీవే యోగ్యుడవు. అది పదునెనిమిదివేల శ్లోకములతో కూడి అజ్ఞానపుకఱకు చీకట్లకు దివ్యజ్ఞానభాస్కర శుభోదయమైనది. సుఖశాంతులు వర్ధిల్లచేయును. దన్యము. దివ్యము. శివంకరము. విను-చదువు-వారలకు చిరాయుఃపుత్త్రపౌత్ర సౌభాగ్యముల చేకూర్చును. సూతుడు రోమహర్షణసుతుడు అతడు పరమధార్మికుడు. నా ముఖ్య శిష్యుడు. అతడు నీకు తోడుగా నీపుణ్యపురాణసంహిత పఠించగలడు.

సూతుడిట్లనియె : ఈ విధముగ వ్యాసుడు తన పుత్త్రునకు దెలుప నతనితోబాటు ఈ విశాలపురాణ సంగ్రహతత్త్వ మెఱిగితిని. శుకుడును దీనిని గ్రహించి వ్యాసాశ్రమమందే యుండెను. కాని బ్రహ్మకు పుట్టని యపరనారదునివలె యతడు ఆత్మశాంతిని బడయకుండెను. ఆత డేకాంతప్రియుడయ్యెను. విషయశూన్యునివలె దోచుచుండెను. తన యునికిలోనే తానుండెను. అతనికి భోజనము రుచించకుండెను. ఉపవాసమనిన నిష్టమేలేదు. ఇట్లాత్మ చింతాపరవశుడగు తన సుతునిగని వ్యాసుడిట్లు పలికెను: 

"కుమారా! నీవింత వింతగ ఏల యేకాగ్రతతో నదేపనిగ నూరక విచారించుచున్నావు? ఋణగ్రస్తుడైన కటికదరిద్రుడు చింత్రాగ్రస్తుడగును. నీవునట్లే యేదో పరధ్యానమందున్నావు. నీ తండ్రినగు నేను బ్రతికియే యుండగ నీకీలేనిపోని లోని చింతయేల? నీవు కోరినకోర్కులన్నియు తనివార ననుభవింపుము. మదిలోన శోకముడుగుము. శాస్త్రోక్తజ్ఞాన మెఱుగుము. హృదయాంతరజ్యోతివలె విజ్ఞానమయుడవుగమ్ము. నా యీ మాటలవలన నీకైకాంతిక శాంతి చేకూరనిచో మిథిలకేగి జనకుని సన్నిధానము జేరుము. ఆ జనకుడు విదేహుడు - ధర్మమూర్తి; సత్యసంధుడు. జనకనామమున ప్రసిద్ధికెక్కెను. అతడే నీలోని మోహపు మంచుతెరలను పటాపంచలు చేయగలవాడు. నీవా రాజునుజేరి నీలోని సందేహమును బాపుకొనుము. అతనితో యథాయోగ్యమైన వర్ణాశ్రమధర్మములగూర్చి ముచ్చటించుము. అతడు రాజర్షి; జీవన్ముక్తుడు. బ్రహ్మజ్ఞానమూర్తి-శుచి-యథార్థవాది. సత్యవస్తునిష్ఠుడు. సిద్ధయోగరతుడు. బ్రహ్మతేజోబలమున మహోజ్ఞ్వలుడు. నిరంజనుడు."

ఆ మహాతేజస్వియగు వ్యాసుని వచనము లాకర్ణించి అరణిజుడగు శుకుడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను : ఓ జనకా ! నాకా జనకుడు దంభాచారిగ దోచుచున్నాడు. ఏలయన, ఆ విదేహుడు జీవన్ముక్తుడుగద! మరి సుఖశాంతులతో నెట్టు రాజ్యమేలుచున్నాడు? నాకతడు వంధ్యాపుత్రుడుగ దోచుచున్నాడు. కానిచో విదేహుడు బ్రహ్మజ్ఞాని రాజ్యమెట్లు ఏలగలడు? ఇది నాకు అద్భుతమును గల్గించుచున్నది. ఈ దురంతమైన మాయా సంసారసాగరమందు నీటియందలి పద్మమువలె నా విదేహరాజెట్లు మనుగడ సాగించుచున్నాడు? విదేహ జనకుని విషయమున నందియము నాకే లొకోకలుగుచున్నది. ఆతని ముక్తిబౌద్ధుల నాస్తికత్వమువంటిదేనా? ముక్తుడు అముక్తుడెట్లగును? కర్త అకర్తయెట్లగును? ఇంద్రియ వ్యాపారముల బెడద నెట్లు వదలించుకొనవచ్చును. తల్లి-కొడుకు-భార్య-సోదరి-వారాంగన-వీరిలో పరస్పరము భేదములు గలవు గదా? ఇన్ని భేదములుండగ నభేదమైన ముక్తియెట్లు సాధ్యము? చేదు కారము వేడిమి తీపి ఉప్పు మొదలగువానిలోని రుచిని నాలుక తెలిసికొని తృప్తిజెందును. శీతోష్ణములు సుఖదుఃఖములు ననుభవించుచున్నంతకాల మాత్మముక్తి యేరీతి గల్గును? ఇదంతయు విడ్డూరమే. నాకెందులకో యిందు అద్భుతమగు సందేహము గల్గుచున్నది. వీడు శత్రువనుకొనినచో వైరము పెరుగును. వీడు మిత్రుడనుకొనినచో ప్రేమ గలుగును. మరి యారాజు ద్వంద్వముల నడుమ నుండుచు నిష్క్రియుడై యెట్లు మనుచున్నాడు? ఆ రాజు చోరుని తాపసుని నొకే రీతిగ నెట్లు చూడగలడు? బుద్ధితో స్థితప్రజ్ఞత సమతలేనిచో ముక్తి యెట్లు గల్గును? జీవన్ముక్తుడైన నరపతిని నేనింతవఱకును చూడలేదు. ఇంటియందే యుండుచు ముక్తుడయ్యెననగ నాకిందేదో సందేహము తోచుచున్నది. ఆ జనకుని గుఱించి నీవింతగ వింతగ జెప్పుటవలన నాకతనిని చూడవేడుకగుచున్నది. నా సందేహము బాపుకొనుటకు మిథిలకేగగలను.

అధ్యాయము 17 శ్రీ శుకుడు మిథిలకు జనుట

పంచాంగం

Chapter 15 The influence of Sri Shakuni's dispassion - అధ్యాయము 15 శ్రీశుకుని వైరాగ్య ప్రభావము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 15

శ్రీశుకుని వైరాగ్య ప్రభావము

శ్రీ
శుకుడి డిట్లు పలికెను: తండ్రీ! ఎల్లభంగుల దుఃఖమూలమైన గృహస్థాశ్రమమును నేను స్వీకరింపజాలను. వలత్రాళ్లవలె నిది దేహుల కురివంటిది. ధనాశాపీడితు లాత్మసుఖమునకు నోచుకొనరు. లేనివాడు పేరాసగలవాడు తన కుటుంబము వారిచేతనే బాధింపబడును. ఏ కోర్కెలునులేని బిచ్చగాడు పొందు సహజ సుఖము నింద్రుడు సైతమందజాలడు. త్రైలోక్యభోగ్యములు బొందినప్పటికి ప్రాణులు సుఖింపజాలరు. దేవేంద్రుడంతటివాడే తపించు తాపసులనుగాంచి దుఃఖితుడై యీసున వారికి బహుభంగుల భంగములు గల్గించుచుండును బ్రహ్మయు నిత్యానందరహితుడే. శ్రీహరియును తన మనోహారిణి యగు శ్రీ మహాలక్ష్మిని చేపట్టినప్పటికిని రక్కసుల యక్కడగించుచు మాటిమాటికి ఖేదపడుచుండను. ఆ శ్రీమంతుడగు విష్ణువెన్నియో యిక్కట్టులకు గురియై కఠిన తపమాచరించెను. శ్రీపతియే యిట్లుండ నిక సామాన్యుల గతి యెట్లుండును? రుద్రుడు సతతము తపము చేయుచు రాక్షసులను చెండాడుచునుండును. అతడును పాపమెన్నియో వెతలకు గురి యగు చుండును. కలవానికి భయమున కంటినిండుగ కూర్కురాదు. ఇక లేనివాడులేనవాడే గద! వాడు సుఖమునకు మొదలే నోచుకొనలేదు. నీ కౌరసపుత్త్రుడనగు నన్నే నీవీ ఘోరనరకతుల్య సంసారమందే మునుగుమని యేల నియోగింతువు? ఎల్ల ప్రాణులకు మాటిమాటికి జన్మదుఃఖము జరాదుఃఖము మరణదుఃఖము మలమూత్రమయమగు గర్భవాసమున దుఃఖము గల్గుచుండును.

మహాలోభిత్వమును దురాశయు దుఃఖము చేటు. యాచన మరణదుఃఖముకంటెను చేటును బాధాకరమునైనది. విప్రులు ప్రతి గ్రహమువలననే తమ జీవితములు వెళ్లబుత్తురు. వారు బుద్ధిబలముగల జీవులుగారు. పరాశ పరమదుఃఖము. అది దిన మొక గండమువంటిది. ఎల్ల వేదశాస్త్రార్థములను చక్కగ తుదిముట్ట చదివిన పండితప్రకాండులే ధనమదాంధుల పజ్జచేరి వారిని పెక్కు రీతుల పై కెత్తుచు పొట్టపోసికొందురు. ఈ జానెడు చిఱుతపొట్టకింత చింత యెందులకు? దీనిని ఫలాదులతో ఆకులములతో నేదేనుపాయముతో నింపి తనపవచ్చును. 

తండ్రీ ! భార్యవలన కొడుకులును వారివలన మనుమండ్రును పుట్టుదురు. కుటుంబపు భారము పెద్దదగును. వారి పోషణభారము దుఃఖభారమగును. ఇక నాత్మసౌఖ్య మెక్కడిది? ఓ తండ్రీ! కావుననే భేదాలు మాయామోహాలు పుణ్యపాపాలు లేని పరిపూర్ణము సత్యవస్తునిష్ఠము నగు బ్రహ్మకాండను యోగ శాస్త్రమును గుఱించి నాకు దెలుపుము. విభేదాలు పుట్టించునట్టి కర్మ బాహుళ్యమందు నా మదియెన్నడును చొరకున్నది. కర్మలు ప్రారబ్ధము సంచితము వర్తమానమునని మువ్విధములు గద! అది సమూలముగ క్షయించు తెఱంగెఱింగింపుము. జవరాలు జలగమాదిరి నరజాతి వీర్యమంతయును పీల్చిపిప్పి చేయును. ఆ వలపులాడి వన్నె చిన్నెలకు మత్తచిత్తుడైన నరుడీ విషయము నెఱుగనేలేడు. స్త్రీలు భోగములతో ధన వీర్యములను కుటిలవచనములతో మనస్సును మరింతురు. అట్టి స్త్రీ నెవడుకోరును? మూర్ఖుడే భార్యను చేపట్టును. సౌఖ్యము బోగొట్టుకొనును. ఫలితముగ మిగులునది దుఃఖమేకాని సుఖముగాదు. ఇట్లు మూర్ఖుడు విధిలీలకు మోసపోవును.

సూతుడిట్లనియె : అని శుకుడు విరాగియై పలుకు ఈ పలుకులు విని వ్యాసుడు చింతాగ్రస్తుడై యిపుడేమి చేతునని తలపోయసాగెను. వ్యాసుని కన్గొలకులు దుఃఖముచే చెమర్చెను. నెమ్మేను గడగడలాడెను. మనస్సు గ్లానమయ్యెను. ఇట్లతి దీనముగ శోకాతురుడై వెతలబొగులు వ్యాసునకు వింతగదుర విప్పాదిన నేత్రములతో శుకుడిట్లు పలుక దొడగెను: 

"ఆహా! ఈ మాయ యెంత బలవత్తరమైనది! ఇది వేదాంతకారుడు వేదసమ్మతుడు వేదవిదుడునైన పండితోత్తమునిగూడ మోహింపజేయుచున్నదే! ఆ మాయ సత్యవతీసుతుడు విద్వాంసుడునైన వ్యాసునకుగూడ మోహము గల్గించుచున్నది. కనుక మాయ దుస్త్యజ. ఆ మాయ రూపెట్టిదో యెతవారికిని దెలియరాదు. వేదవిభాగకర్త విపులపురాణవక్త భారత గ్రంథ నిర్మాతయగు వ్యాసుని సైతము మోహభ్రాంతి యావరించెనే! కావున నే యద్భుతశక్తి యీ ముజ్జగములను పెనుభ్రమలో ముంచెత్తునో యే యత్కృష్టశక్తి బ్రహ్మవిష్ణుహరులను సైతము మోహపెట్టునో నేనా పరాశక్తినిపుడు శరణు వేడుచున్నాను. ఆ శక్తిచే అంతటివారే మోహితులుగా నితరు లెంతటివారలు? ఆ మహాద్భుతమాయాశక్తి బ్రహ్మవిష్ణుమహేశ్వరులనే మోహింపజేసినది. ఆ మహాశక్తికి వారే తలలు వంచిరి. ఇక నాశక్తి భ్రమలో పడనివాడే లేడు. ఆహా! ఆ సర్వశక్తి వీర్యపటిమ యెంతన వలయును! ఆ శక్తి తేజోబలమెంతని చెప్పగలము!! ఆ శక్తులు మహాద్భుతశక్తులు. ఇంత యేల? సర్వజ్ఞుడగు శంకరుడే శక్తియుక్తుడు గానిచో నేమియు చేయజాలడు గద! వ్యాసుడు విష్ణ్వంశసంజాతుడని పౌరాణికులు నుడువుదురు. మరి యంతటివాడే భగ్ననౌకలోని వ్యాపారివలె మోహసాగరమందు మునిగిపోయెనే! ఈ సమయమందే వ్యాసుడే ప్రాకృతమనుజుని పగిది వివశుడై కన్నీరొలుక బోయుచున్నాడు. 

పండితులు సైతము మాయాబలమునుండి విముక్తులు కాజాలరు. నేనెవరను? ఇతడెవరు? ఈ వీడనిభ్రమ యెక్కడిది? ఈ తండ్రికొడుకుల వాసనల సంబంధ మీ పాంచ భౌతిక దేహమునకు మాత్రమే యుండును. ఈ మాయశక్తి యెంతయో బలవత్తరమైనది. ఇది మాయికులను సైతము తన మాయలో ముంచివేయును. వ్యాసుడంతటి వాడే నేడు మాయామోహునకు వశుడై పలవరించుచున్నాడు.

సూతు డిట్లనియెను : అంతట శుకుడు సకల దేవతలకే మాతృ దేవతయు బ్రహ్మాదుల కీశ్వరియు సకల కారణ కారణయునగు దేవిని నెమ్మదిలో భావించి నమస్కరించెను. పిదప నరణి సంజాతుడగు శుకుడు మోహసాగరమున మునింగిన తన తండ్రి వ్యాసునకు సహేతుకములుగ బ్రహ్మవాక్కులు ఇటులు పలికెను : 

"ఓ మహామనీషీ ! ఎల్లరకు నీవే తెలియజెప్పువాడివే! నీవే యిప్పుడొక సామాన్యుని పగిది విషాదమునంద నేల! ఇపుడు మాత్రమే నేను నీ కుమారుడను. వెనుకటి జన్మలో నీవెవరవో నేనెవరనో యెఱుగము. సర్వాత్మదృష్టితో చూడగా దండ్రికొడుకుల సంబంధము భ్రమ మాత్రమే యగును. ఆత్మధైర్యము బొందుము. సావధానుడవు గమ్ము. డెందమందు దౌర్బల్యమందకుము. ఇదంతయును మోహజాలమని గుర్తెఱుంగుము. వైక్లబ్యమందకుము. తినుటవలన నాకలి చల్లారును. త్రాగుటవలన దప్పిక తీరును. కాని పుత్త్రదర్శనమున నాకలి దప్పికలు తీరవు. నెత్తావి వలన ఘ్రాణతర్పణము గల్గును. మంచి వినికిడిచే చెవికింపగును. స్త్రీ వలన కామసుఖము లభించును. నేను నీ కొమరుడనే. ఐన నా వలన నీకేమి సుఖము గలదు? 

పూర్వ మజీగర్తుడు తన కొమరుని హరిశ్చంద్రునకు యాగపశువుగ వెలకమ్మెను. ద్రవ్య మెల్లసుఖములకు సాధనము. ఈ ధనమువలన సుఖములు గల్గును. నీకు స్వార్థబుద్ధిగలదేని డబ్బు సంపాదించుము. నేను నీ కొమరుడనే. ఐన నా వలన నీకేమి సుఖము గలదు! నీవు దైవజ్ఞుడవు. కావున నన్ను స్థిత ప్రజ్ఞుని చేయుము. నన్నీ గర్భవాసనరకమునుండి విముక్తుని జేయుము. ఇది కర్మభూమి. ఇట మనుజ జన్మ కడుంగడు దుర్లభము. అందు నుత్తమకులమున బ్రహ్మతత్త్వ మెఱింగిన బ్రాహ్మణుడై జన్మించుట యెంతెంతో దుర్లభము. నేను వేరు - బ్రహ్మము వేరు అను భేదభావమున బద్ధుడనైతిని. నన్నీ భేదబుద్ధి వీడుట లేదు. ఇట్టి సంసారవాసన ముసలితనమందును వదలక అంటిపెట్టుకొనియే యుండును.

సూతు డిట్లనియె : ఈవిధముగ సర్వకర్మ సంన్యాసమునే చిత్తమందిచ్చగించు శాంతుడగు శుకుని వ్యాసుడిట్లు ప్రబోధించెను: 

"మహాభాగ! నీవు నా వ్రాసిన శ్రీ మహాభాగవతము చదువుము. ఆ పురాణము బ్రహ్మసమ్మితము. అనతి విస్తృతము. అది పండ్రెండు స్కంధములతో పంచలక్షణములతో సకల పురాణముల కలంకార ప్రాయమై అలరారుచున్నది. అది నా మదికెంతయో ప్రియమైనది. ఆ భాగవతమొక్కసారి విన్న మాత్రమున సదసద్వివేకము ప్రత్యక్ష జ్ఞానము విజ్ఞానము గల్గును. కావున నీవు దానిని శ్రద్ధగ చదువుము. 

పూర్వము పాలసంద్రముపై పటప్రతముమీద పరుండియున్న బాలరూపుడగు శ్రీవిష్ణువు తనలో నేనే సచ్చిదానందరూపముచేత నీ బాలరూపమందితిని. నేనే నిత్యవస్తువువలన నీ రీతిగ జన్మించితిని. ఈ సర్వవిశ్వము నేనెట్లు దెలిసికొనగలను? అని తలంచెను. అంతలోనే దయామయియగు భగవతి సకలార్థసాధకమైన వాక్యమును శ్లోకార్థమున నిట్లు పలికెను : 

'ఈ కనంబడు జగమంతయు నేనే; పూర్ణఘనానందమున నిండియున్నాను. నాకన్న మిన్నయగు సనాతన వస్తువు మరేదియును లేదు.' విష్ణువు నెమ్మదిలో ఈ ధ్వని యెవరిదో ! ఈ పలికినది నరుడా? నారియా? పేడియా? నేనెట్లు గుర్తించగలనని విచారించెను. ఆ శ్లోకార్థరూపమగు భాగవతమునే అతడు తన యెడదలో మననము చేయదొడగెను. ఆ బాలుడా వటపత్రమందే పరుండి మాటిమాటికి నా దేవి పలికిన వాక్యార్థము విషయమును తన హృదిలో నాలోచించు చుండెను.

అంతట నా భగవతీ దేవి విష్ణునకు ప్రత్యక్షమయ్యెను. ఆ దేవి శంఖము చక్రము గద పద్మము వరాయుధములు దాల్చి తేజరిల్లు సత్యస్వరూపిణి. చతుర్భుజ. దివ్యాంబరధారణి-దివ్యభూషణ భూషిత-తన దివ్యవిభూతులను బోలిన నెచ్చెలులతో గూడి అచ్చెరువుగ నుండెను. ఆ దేవి తన ప్రసన్న వదనమున చిరునగవుసిరులు చిందులాడగ శ్రీమహలక్ష్మీరూపముతో తేజోనిధియగు విష్ణుని సన్నిధిని ప్రత్యక్షమైనది. 

సూతు డిట్లనియె : ఆ మున్నీటియందు నిరాధారయై కలుములీను కమలను మనోరమను శ్రీవిష్ణువు తన హృదయకమలము నిండుగ దర్శించి విప్పారిన నయనకమలములతో నొప్పారెను. అపుడు రతి భూతి బుద్ధి మతి కీర్తి స్మృతి ధృతి శ్రద్ధ మేధ స్వధ స్వాహా క్షుధ నిద్ర దయ గతి పుష్టి తుష్టి జృంభ తంద్ర క్షమ లజ్జ మున్నగు దివ్యశక్తులా శ్రీమహారాజ్ఞికి నల్గడలం జేరి ప్రేమ నివాళు లర్పించుచుండిరి. వారిలో ప్రతి యొక్కరును దివ్యవరాయుధములు నానా దివ్యభూషలు మందారమాలికలు జాతిముత్యాలహారాలు దాల్చి దివ్యశోభలు వెలార్చుచుండిరి. మహాసాగర మధ్యమం దా దివ్యాంగనలను కలయ వీక్షించిన జనార్దనుని డెందమాశ్చర్యపులకితమయ్యెను. ఆ విశ్వభూతాత్మకూడా మహామాయకచ్చెరువంది యిట్లు తలంపసాగెను: 

"ఈ యందచందాలు విరజిమ్ము కాంతలెక్కడి వారలొకో! ఈ మఱ్ఱియాకు సెజ్జపై నున్న నేనెక్కడి వాడనో! ఇది అంతుపంతులేని మహాజలరాశియే. ఇందీ మహావటవృక్షమునకు కారణమేది? నేనెవరి మూలమున నిటుల ముద్దులుగారు బాలుడనై యుంటిని? ఈ దేవి నాకు జననియా! లేక దురంతమైన మాయయా!! ఏ కారణమున పుణ్యవిశేషమున నా కీమె దర్శనభాగ్యము చేకురినదో! నేనిపుడేమి పలుకవలయును? ఎట కేగవలయును? బాలభావముననే యప్రమత్తుడనై మౌనభాషతో నుండవలయునా?"

అధ్యాయము 16 వ్యాసుడు శుకునకు శ్రీదేవీ భాగవత ముపదేశించుట

పంచాంగం

Chapter 14 The birth story of Shri Shuka Maharshi - అధ్యాయము 14 శ్రీ శుకమహర్షి జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 14

శ్రీ శుకమహర్షి జన్మవృత్తాంతము

సూతుడిట్లనియెను : ఈ ప్రకారముగ నావేద వ్యాసుడా దేవకన్యకను ఘృతాచినిగాంచి ఇపుడేమి చేతును? ఈ దేవకన్యక నాకు దగినది గాదు అని తన మదిలో విచారించు చుండెను. అట్టి వ్యాసునిగని యితడు నన్ను శపించునేమోయని యామె భయభీతయై వెంటనే శుకీ రూపముదాల్చి యచ్చోటుపాసి వెడలినది. పచ్చని చిలుక పక్షియందము ఱప్పవాల్చక వ్యాసుడు వింతగ గాంచుచుండెను. దాని సోయగము చూడగానే ముని మనము విస్మితమయ్యెను. ఆ ముని వర్యుడు మనసును ధీరతతో నిలువ జూచెను. కాని భవితవ్యతా బలమున మహాతేజస్వియగు వ్యాసుడు సైతము తన మనస్సును నిగ్రహించుకొనలేక ఘృతాచీ వశుడయ్యెను. ఆ సంయమి అగ్నికై యరణిని మధించుచుండ ఆ యరణి యందతని వీర్యము పడినది. అతడు తన శుక్ర పాతము సైతమెఱుంగక అరణి మథనము చేయుచునే యుండెను. అంత మునిరూపమునే సంతరించుకొని యొక చక్కని శుకరూప మరణినుండి యుద్భవించినది. జన్నమునందు నేతివేలిమిచేత నగ్నికాంతిమంతుడై ప్రజ్వరిల్లునట్లే శుకబాలుడరణి నుండి వింత కాంతులీనుచు ఆవిర్భవించెను. అపుడు వ్యాసుడు తన సుతు నవలోకించి యిదేమి వింతయని మదిలో విస్తుపోయి ఇదంతయు నా పరమేశ్వరుని ప్రసాదఫలమే యని తలచెను. ఆ శుకుడరణి గర్భసంభూతుడు. మహాతేజస్వి - నిజతేజమున రెండవ యగ్నివలె ప్రజ్వలించుచున్నాడు. వ్యాసుడు గార్హపత్యాగ్ని బ్రహ్మ తేజమున తేజరిల్లు తన పుత్రుని కన్నులపండువుగ తిలకించెను. వ్యాసుడంత గిరినుండి దిగి పావనగంగలో తనయుని స్నానమాడించెను. దేవతలపుడు పూలజల్లు గురిసిరి. అచ్చరలు నర్తించిరి. దివి దేవదుందుభులు మ్రోసెను. ముని యా బాలునకు జాతకర్మాది విదులు నిర్వర్తించెను. గంధర్వపతులు ప్రమదమున బాడిరి. అరణిజుండగు శుకుని జన్మవృత్తాంతము విని నారద తుంబురులు విశ్వావసులు విద్యాధరాదులు ప్రహర్షమున శుకుని దర్శించ నేతెంచిరి. ఆ యరణిజుండగు శుకుని సందర్శించి విద్యాధరాదిదేవత లతనిని సంస్తుతించిరి. అంతలో నంతరిక్షమునందుండి శ్రీ శుకునికొఱకు దివ్యకృష్ణాజినము దండకమండలువులు నేలపై బడినవి.

అతడు పుట్టిననాటి నుండి విజ్ఞాననిధియై బుద్ధిమంతుడై జ్యోతిష్మంతుడై ప్రవర్ధిల్లుచుండెను. అంత విద్యా విధానవిదుడగు వ్యాసుడతని కుపనయన సంస్కార మొనరించెను. వ్యాసునకువలెనే శ్రీ శుకునకు సైతము పుట్టిన వెంటనే యెల్లవేదములను సార్థములుగ సరహస్యములుగ నవగతములైనవి. శుకీ రూపమునందున్న ఘృతాచియందలి కామాతిరేకమున తనకు సుతుడు గల్గుటచేత వ్యాసుడు తన తనయునకు శుకుడని నామకరణము చేసెను. శుకుడు దేవగురుడగు గురుని తన గురువుగ నంగీకరించి బ్రహ్మచర్యవ్రతమును విధిగ బాటించెను. గురుకులమందు వేదములన్నిటిని సరహస్యములుగ ససంగ్రహములుగ నధ్యయనము చేసెను. సకల ధర్మశాస్త్రము లెఱింగెను. పిమ్మట గురునకు దక్షిణ సమర్పించి సమావర్తనముచేసి తన తండ్రియగు వ్యాసుని సన్నిధి కరుగుదెంచెను. అట్లు తిరిగి వచ్చిన శుకునిగాంచి వ్యాసుడు పరమానంద మంది లేచి యతని నక్కునజేర్చి శిరంబు మూర్కొనెను. తన తనయుని కుశలప్రశ్న లడిగి యతని చదువునుగూర్చి ప్రశ్నించి తన యాశ్రమమందుండ నియమించెను. పిమ్మట వ్యాసుడు తన కుమారునకు వివాహము సేయదలంచి ఒక చక్కని మునికన్నియను వధువుగ నిశ్చయించి శుకునితో నిట్లు పలికెను : 

"మహామతీ! నీవు గట్టిగ వేదములు చదివితివి. దర్మశాస్త్రము లెఱింగితివి. ఇపుడింక చక్కగ గార్హస్థ్యము నెఱపుము. దేవపితృయాగము లొనర్చుము. నన్ను ఋణముక్తుని జేయుము. అపుత్త్రకులకు స్వర్గాది సద్గతులు లేవు. నీవు గృహాశ్రమము నడపి నా కోర్కె దీర్చుము. నాకు సుఖము గల్గించుము. నే నాచరించిన యుగ్రతపః ఫలితముగ నీవు నా కయోనిజుడవై జనియించితివి. నీ తండ్రినగు నా మాట పాలించుము.

సూతుడిట్లయె : ఈ విధముగ ననురాగియగు వ్యాసుడు పలుకగా విరాగియగు శుకుడు తన తండ్రికిట్లు మారుపలికెను: 

"మీరేమి పల్కుచున్నారు? నన్ను మీ శిష్యునిగ గ్రహించి తత్త్వముపదేశింపుడు. మీ యాన జవదాటను." 

"ఓ పుత్ర! నీ కొఱకు నేను నూరువర్షములు ఘోరమైన తప మొనర్పగా శివుని ప్రసాదమున నతికష్టముమీద నీవు గల్గితివి. నేనే రాజు నైన నభ్యర్థించి నీకు విత్తము సమకూర్తును. నీవిక పరువమునకు తగిన సుఖములనుభవించుము" అని వ్యాసుడనెను. 

శుకుడిట్లనియె : తండ్రీ! నిత్యసత్యమైన యానంద మీనరలోకమున నెక్కడనున్నది? ప్రాజ్ఞులు దుఃఖముతో ముడివడినసుఖము సుఖముగ దలంపరు. నేను భార్యను బడసినచో నామెకు వశుడనై యాత్మ స్వాతంత్య్రమును గోల్పోవవలసి వచ్చును. నారి చెప్పుచే తల నడుచు నరునకు సుఖమెక్కడిది? నరుడు లోహకాష్ఠములచే బిగింపబడిన యంత్ర బంధములనుండి యొక వేళ విముక్తుడైన గావచ్చును. కాని భార్యామాయబంధములనుండి విముక్తుడేనాటికిని గాలేడు. ఈ శరీరము మలమూత్రములకొంప! ఈ కొంప కంపుతో కులుకు కలికితో నరుడు బద్ధుడగును గద! అట్టి హేయమైన దానియందు విబుధులకు ప్రీతియెట్టు గల్గును ? అయోనిజుండనగు నాకింక యోని విషయమై రక్తియెట్లు గల్గును? ఇక ముందును నేను యోనిజుడ నగుటకెన్నడును గోరుకొనను. సత్యజ్ఞానానంతమై పరమైన యాత్మానందమే నా స్వరూపము. ఇక మలమాత్రముల మురికిలో నెట్లు సుఖింతును? నేనాత్మారాముడను. మరల కృపణుడను కాగోరను. నీవు ప్రపంచించిన వేదములెల్ల నేను చదివితిని. అవన్నియును కర్మ మార్గము బోధించునవే; హింసామయములే.

బృహస్పతి నాకు గురువుగ లభించెను. పాపము! అతడును మాయా సంసారమందే మున్కలు వేయుచున్నాడు. అజ్ఞానాంధహృదయు డీ దుస్తర సంసారము నెట్లు తరింపనోపును? రోగగ్రస్తుడగు వైద్యుడితర రోగుల కుపయోగపడనట్లు ముముక్షుడనగు నాకును బాహ్యగురు డుపయోగపడడు. ఇదంతయు లోకుల విడ్డూరమే సుమా! ఆ గురువునకొక్క నమస్కారముచేసి నీ సన్నిధి కరుగు దెంచితిని. నేను సంసార ఘోర విషసర్పాల దంష్ట్రలకు వెఱతును. నన్ను స్వాత్మ ప్రబోధామృతమున పరిరక్షింపుము. ఆకాశవీథిలో నహోరాత్రములు సూర్యుడు చక్రమట్లు పరిభ్రమించునట్లే ఈ ఘోరమైన కోర్కులనెడు మొసళ్లు తిరుగాడు సంసార సాగరమందు జీవుడు విశ్రాంతి లేక పరిభ్రమించును. పెండపురుగు మలమందే సుఖమందునట్లు మందమతులీ సంసారమాయలందు తగుల్కొనుటయందే సుఖమున్నదనుకొందురు. వేదశాస్త్రములు చక్కనెఱిగి మన్ననలందిన హిరణ్యగర్భునివంటివాడే. శక్తిహీనునిజేయు విషయ విషమందే సంరక్తుడగునే! అట్టివాని కంటె మూర్ఖుడింకొక్కడుండునా? అయ్యయో! వాని నడతలు పందినడతలు. వాని ధర్మము కుక్కధర్మము. చిత్ర చిత్రము సృష్టి చిత్రము. మానవ జన్మము మరి దుర్లభంబు. వేదశాస్త్రములబ్బుట మరింత దుర్లభము. అట్టివాడే యట్టి విషయ సంసార సంబద్ధుడైనచో నింక ముక్తినందు దీరాత్ముడెవ్వడు? తన్ను నమ్ముకొనిన భార్యను బిడ్డలను మమతతో బోషించువాడే తెలివైనవాడని లోకులందురు. ఈ లోకాన నింతకుమించిన వింతయేముండును? ఏ మానవుడీ దుర్భరమైన సంసార మందుజిక్కి స్త్రీల త్రిగుణకృత మాయాబంధములచేత భగ్న హృదయుడుగాడో వాడే విద్వాంసుడు; వాడే మేధావి; వాడే శాస్త్రపారంగతుడు. హృదయగ్రంధులు దృఢపరచు చదువులు వృథలు. ఇక్కడనే సమత్వమున భవబంధముక్తి గల్గించు చదువే చదువు. పురుషుని గ్రహించునది గృహమనబడును. బంధములకు పుట్టిల్లగు గృహమందేమి సుఖముండును? నేను దీనికి బిట్టు వెఱతురు. మందమతులు బోధరహితులు విదివంచితులునైన నరులీ దుర్లభ మానవజన్మమెత్తియును మరల మరల బంధనములచే కట్టువడుదురు.

వ్యాసు డిట్లనియెను : గృహము బంధించు కారాగారముగాదు. ఇందు బంధన కారణమును లేదు. కామవాసనల నుండి ముక్తుడైన విమలహృదయుడు గృహస్థుడైనను బంధరహితుడైనవాడే. న్యాయార్జితధనముగలవాడు వేదవిహితము లొనర్చువాడు సత్యవాది శుచి శ్రాద్ధకారియైనవాడు గృహస్థుడైనను ముక్తుడైనవాడే. బ్రహ్మచారి యతి వ్రతి వానప్రస్థుడు అను వారలు మధ్యాహ్నము దాటగనే గృహస్థుని జేరుదురు. గృహస్థాశ్రమవాసులు ధర్మపరులు - శ్రద్ధతో నన్నదానమొనర్చువారు - సత్యవచనులు - పరోపకారపరాయణులు నగుదురు. గృహస్థాశ్రమ ధర్మమునకు మిన్నయగు ధర్మమింతవఱకును కన-విన-బడ లేదు. వసిష్ఠాది జ్ఞానులు ఆచార్యులు దీనిని చక్కగ నాచరించిరి. వేదోక్తమార్గమున నడచుకొనువాని కసాధ్యమైనదేదియును లేదు. స్వర్గము - మోక్షము - ఉత్తమజన్మము - ఏది కోరిన నతని కది లభించితీరును. ఒక యాశ్రమమునుండి వేరొండాశ్రమమున కేగవలయునని ధర్మవిదులు పేర్కొందురు. కనుక నీవగ్నిని వేల్చి తెలివితో వేదోక్తకర్మలు నడుపుము. కుమారా! మానవుడైనవా డీ విధముగ విధ్యను సారముగ దేవపితృ మనుజులను దనిపి సత్పుత్త్రులనుబడసి వారినొక యింటివారిని జేయవలయును. పిదప నిల్లువదలి యడవికేగి నియమముతో వానప్రస్థాశ్రమము స్వీకరించి, తరువాత సంన్యాసి గావలయును. ఈ యింద్రియములు మదించిఉండి మనస్సునుగూడి దురంతములై యుండును. ఇవి భార్యతోడులేని వానిలో మరింతగ బాధ గల్గించును. కనుక వీనిని జయించుటకై దారను పరిగ్రహింపుము. వార్ధకమున తపమొనరింపుము. ఇది శాస్త్రోక్తవచనము. విశ్వామిత్రుడును మున్ను మూడువేలేండ్లు నిరాహారియై జితేంద్రియుడై దుశ్చరతప మాచరించెను. అంతటి తపోధనుడే వనమందు మేనకను గాంచినంతనే విమోహితుడయ్యెను. అతని వీర్యమున శకుంతల జననమందినది. నా తండ్రియగు పరాశరుడును దాశకన్యయగు కాళిని గాంచినంతనే మన్మథాగ్నివశుడై నావయందే యాకన్నియను ననుభవించెను. బ్రహ్మయును తన కొమరిత సొబగును గాంచినంతనే మదనావేశ మూర్ఛితుడై పరుగులెత్తుచుండగ రుద్రుడతనిని వారించెను. కావున నీవును నా హితము నాలించి కులీనయగు నొక పడుచుకన్నెను పెండ్లియాడి వేదమార్గానుసారముగ నడచుకొమ్ము.

అధ్యాయము 15 శ్రీశుకుని వైరాగ్య ప్రభావము

పంచాంగం

Chapter 13 History of the Urvashi Pururavas - అధ్యాయము 13 ఊర్వశీ పురూరవుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 13

ఊర్వశీ పురూరవుల చరిత్ర

ఆ విదముగ సుద్యుమ్నుడు దివికేగెను. ఇటు భువిపై సుగుణవంతుడు ప్రజారంజకుడు సుందరుడునగు పురూరవుడు రాజ్యమేలుచుండెను. ఆ రాజు ప్రతిష్ఠాన పురమందు సర్వసమ్మానితుడై రాజ్యమేలు చుండెను. అతడు ధర్మజ్ఞుడు. ప్రజా పాలన దక్షుడు. అతని మంత్రశక్తి ఇతరుల కెఱుక పడక రహస్యముగ నుండెను. అతని యుత్సాహ ప్రభుశక్తులును శ్రేష్ఠములైనవి. సామదానాదులారాజు వశమందుండెను. అతడు చక్కగ వర్ణాశ్రమ ధర్మములు పాటించుచు ఏలుబడి సాగించు చుండెను. ఆ నరపతి యొక్క నిరూప సుగుణ సందలను విక్రమౌదార్యములను గుఱించి ఊర్వశి విని రాజునందు అనురక్త యయ్యెను. బ్రహ్మశాపమున మనుజ రూపమున భువికి దిగివచ్చి ఆ నరపతి సుగుణాలగని యని యెఱింగిన యూర్వశి అతనితో ఇట్లు పలికెను : 

"ఈ మేకల జంట నీయొద్దనుంతును. నీవు దీనిని కాపాడుము. నేను నిన్నుచేరి వర్తింతును. నాకాహారము నేయి మాత్రమే, ఇంకేదియు నారగించను. మైథున సమయమున గాక మరెప్పుడు నిన్ను దిసమొలతో నుండగ చూడను. ఇది నా నియమము. నా యీ నియమమును భంగమొనర్చినప్పుడు నేను నిన్ను వదలి వెళ్ళుదును." రాజా కామిని పలుకుల నొప్పుకొనెను. ఆ యూర్వశియు తన శాపము దీఱునందాక నతనిని గూడి విహరించు చుండెను. రాజును తొంటి ధర్మకర్మముకు స్వస్తి చెప్పి ఊర్వశీ మద మోహితుడై పెక్కులేండ్లూర్వశితో నుండెను. ఆ పుడమిఱడట్లు తీరని మోహాతిరేకమున నొక్క నిముసమేని వదలిపెట్టక యావరారోహ మీద మరులు గొని యుండెను.

ఇట్లు పెక్కులేండ్లు గడచెను. ఎంతకునూర్వశి స్వర్గసీమను జేరుటలేదు. అంత దేవరాజింద్రుడు గంధర్వులతో నిట్లు పలికెను : 

"ఓ గంధర్వులారా! మీరు రాజునింట గల మేకల జంటను అపహరించుటద్వారా ఊర్వశిని తీసికొనిరండు. ఊర్వశి లేని యింద్ర సభ ఏమియు శోభించుట లేదు. కావున నెటులేని ఊర్వశినిటకు కొనిరండు. ఇంద్రుని వాక్యములు విని విశ్వావసువు మున్నగు గంధర్వులు కటిక చీకటిలో రాజున్నచోటి కరిగిరి. ఊర్వశి పురూరవునితో కూడి యుండగా గంధర్వులు మేకలనుగొని నింకికెగసిరి. ఆ మేకలు మేమే యని యరచినవి. వాని యర వూర్వశికి తన కొమరుల యేడ్పువలె వినబడెను. అపుడామె కోపమున రాజుతో రాజా! నీతో మున్ను నేను ప్రతిన జేసితిని. ఆ ప్రతిన నేడు భగ్నమైనది. నీయందు నాకు నమ్మకము దొలగినది. ఈ మేకలు నాకు పుత్ర సమములు. వానిని దొంగ లపహరించిరి. ఐనను నీవు స్త్రీవలె నిద్రించుచున్నావు. నీవు శూరమానివి. కునాథుడవు. నీచేత నేను వంచింపబడితిని. నాకు ప్రాణ నమములగు మేకలు పోయినవి అని వాపోవుచు పలుకుచు వెడలి పోవుచుండెను. రాజోపలేని మోహావేశమున దిగంబరముగ నామెను వెనుదగిలెను. అదే సమయమని గంధర్వులా రాజమందిరమున తళుక్కను మెఱుపు మెఱసిరి. అపుడూర్వశి దినమొలతో నరుగుదెంచు రాజును జూచినది. గంధర్వులా మేకలను త్రోవలోనే వదలి వెళ్ళిరి. దిగంబరుడగు ఆ చక్రవర్తి యా మేకలను గొని తన యింటి మొగము పట్టెను. తన పతి నగ్నుడుగ నుండగగాంచి యావరవర్ణిని రాజును వీడ్కొనినది. తన్ను విడనాడి వెళ్ళిన యూర్వశీ మోహమున పరవశుడై రాజు బిట్టు వలవరించెను. రాజు నూర్వశి మీది ప్రకామమోహమున విహ్వలుడై దిగులొందుచు రోదించుచు దేశ దేశములు గుమ్మరు చుండెను.

ఇట్లా భూపతి భూమియందెల్లెడల పరిభ్రమించుచు తుదకు కురుక్షేత్రమునందు మరల నూర్వశిని గాంచెను. అతడు సుప్రసన్నుడై మెత్తని మాటలతో నామెకిట్లనియెను : 

'కఠినురాలా ! కాంతా ! నిలునిలుము. నేను పాపమెఱుగని వాడనే! నీ ప్రియకాంతుడనే! ఏనీకు వశ్యుడనే! నిన్నే నమ్ముకొని యున్నాడనే! నన్ను నీవు విడనాడి యెట్లు వెళ్ళితివి? నీవే నన్ను వదలి వెళ్ళినచో నా మేనిచ్చోటనే పడిపోగలదు. కాకులు, తోడేళ్ళు నన్ను కడుపార నారగించును,' 

ఈ రీతిగ రాజ కామార్తుడై కృపణుడై వివశుడై శ్రాంతుడై దిక్కులేని పక్కిచందమున బావురుమని యేడ్చెను. అపుడూర్వశి రాజుతో నిట్లనెను : 

"ఓ నృపశార్దూలా! నీవు మూఢుడవైతివి. నీ జ్ఞానమేమైనది? స్త్రీలతోడి చెలిమి తోడేళ్ళతోడి చెలిమియే. అది తగదు. రాజెప్పుడును దొంగలను స్త్రీలను నమ్మియుండరాదు. కనుక నీవిక నింటికేగి దిగులుమాని సుఖముండుము," అని యిట్లెంతగ నూర్వశి యూరడించినను రాజు మోహాతిరేకమును వదలకుండెను. ఆ స్వైరిణి యొక్క వలపు తమిన రాజు కట్టుబడెను. కాన నతిశోకార్తుడయ్యెను. ఈ విధముగ మీకూర్వశీ పురూరవుల చరిత్ర సంక్షేపముగ చెప్పితిని. ఇది వేములందు విస్తరించి యభివర్ణింపబడినది.

అధ్యాయము 14 శ్రీ శుకమహర్షి జన్మవృత్తాంతము

పంచాంగం

Chapter 12 Sudyumna Sthuthi - అధ్యాయము 12 సుద్యుమ్నస్తుతి

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 12

సుద్యుమ్నస్తుతి

సూతుడిట్లనియెను : పిమ్మట బుధునకిలయందు పురూరవుడు జన్మించెను. ఆ పురూరవుడు దర్మాత్ముడు. పెక్కు యజ్ఞము లొనరించినవాడు. దానశీలుడు. అట్టి పురూరవుని జన్మవృత్తాంతము వివరింతును, వినుడు. పూర్వము సుద్యుమ్నుడను భూపతి యుండెను. అతడు సత్యవాది, జితేంద్రియుడు, ఒకనాడతడు సింధు దేశోద్భవమగు నశ్వమెక్కి మంత్రులతో గూడి కవచధారియై యందమైన కుండలములు దాల్చి అజగవమను ధనువును బాణములను చేపట్టి వేటకై యడవి కేగెను. ఆ రాజు పెక్కు రురుమృగములు, కుందేళ్ళు, పందులు, గవయములు, ఖడ్గమృగములు, శరభములు, మహిషములు, సృమరములు, వనకుక్కుటములు మున్నగు పవిత్ర వన్యములను యజ్జియములగు పశువులను పక్షులను జెండాడుచు కుమార వనమందు ప్రవేశించెను. ఆ వనమందు మేరుగిరికి దిగువలో మందార తరువులు, పొగడ చెట్లు, అశోక లతలు, సాల, తమాల, చంపక, పనసవృక్షములు మామిడి, కడిమి, ఇప్ప, గురివింద వృక్షములు మాధవీలతా మండపములతో శోభిల్లుచుండెను. దానిమ్మ, కొబ్బరి, అరటి చెట్ల సముదాయమును అడవిమొల్ల మాలతి కుంద పూదీవియలును కనుల పండువుగ నుండెను. ఆ వనము హంస కారండవ పక్షులతో వ్యాప్తమై వేదధ్వనులతోను గండుతుమ్మెదల ఝంకారముతోను చెవుల పండువు సేయుచుండెను. అట్టి సుందర వనమందు సుద్యుమ్నుడు స్వేచ్ఛగ విహరించుచు రంగురంగుల పువ్వులను గనుచు మత్తకోకిల మధురగానములు వినుచు సంతసిల్లుచుండెను. ఆ రాజట్లు తన సేవకులతో వనమును దర్శించుచు పోవుచునే ప్రమోదము నిండార వనమందు జేరగనే ప్రమదగ మారెను. ఆతని మగగుఱ్ఱ మాడుగుఱ్ఱమయ్యెను. ఆ వింతగని రాజు చింతాక్రాంతుడయ్యెను. ఈ వింతకు కారణమేమో యని మాటిమాటికి వంతంజెందుచు తన నారీ రూపమునకు తలవంచుకొనుచు ఈ యాడుదనంబుతో నేనింకేమిజేతును? ఇంటి కెట్టులేదగుదును? రాజ్యమేలుట యెట్లో? వంచించిన దెవ్వరో?' యని రాజు లోలోననే తెలుపరాని బాధ పడుచుండెను.

ఋషులిట్లనిరి : ఓ సూతా! ఆ దేవసన్నిభుడగు సుద్యుమ్నుడు పడతిగనెట్లు మారెను? ఇదంతయును వింతగ నున్నది. రాజా సుందరవనమందు గ్రుమ్మరుటచే నట్లు జరుగుటకు కారణమేమి? ఆ తరువాత నతడేమి చేసెనో తెల్లమొనర్పుము. 

సూతుడిట్లనియెను : పూర్వము సనకాదియోగి పుంగవులు తమలోని దివ్యకాంతిపుంజములు దెసలను వెలిగించు చుండగ శివసందర్శనమున కరిగిరి. అత్తఱి శివుడు పార్వతితో క్రీడించుచుండెను. గిరిజయు వివస్త్రయై శివుని తొడపై క్రీడాసక్తురాలై యుండెను. దిగంబరయై యుండెను. ఆ మానవతి ఋషులను గాంచి తలవంచుకొని వెనువెంటనే శివునంక మందుండి దిగి వస్త్రము ధరించి భరించరాని సిగ్గుతో మేనెల్ల కంపింప నిలుచుండెను. ఆ పార్వతీ పరమేశ్వరులట్లొక్కటై శృంగార క్రీడలో మునింగి ఉండుటగని ఋషులచ్చోటు వదలి గ్రక్కున నరనారాయణాశ్రమ మేగిరి. ఆ పార్వతి లజ్జించుట గాంచి శంకరభగవానుడామెతో నీవేల లజ్జాతురవగుదువు? నీ మదిలోని కుందు బాపుదును. ఈ వనమెవడేని ప్రవేశించినచో నతడు స్త్రీరూపమందును. ఈ వనమీవిధముగ వపింపబడెనని విన్నవాడెవడైనను దోషభూయిష్ఠమైన యీ వనమును ప్రవేశింపరాదు అని పలికెను. ఆ సుద్యుమ్నున కీ శివశాపము తెలియకపోవుటచే తన మంత్రులం గూడి యందు ప్రవేశించి స్త్రీ భావము నందెను. అతడు చేయునది లేక తలవంచుకొని తన భవనమునకేగక వనమందే యటునిటు గ్రుమ్మరుచుండెను. ఆ నారిగ మారిన మహాత్ముడు 'ఇల' యను పేర బరగెను. అంతలో చంద్రుని కుమారుడగు బుధుడు విహరించుచు నచ్చటి కేతెంచి ఆ యిలాకామినిని పెక్కురు చెలికత్తియల నడుమ మనోహరిణిగనున్న దానిని జూచి కామించెను. ఆ యిలయును చంద్రుని కుమారునే తన కాంతునిగ తంచెను. వారిరువుర సంయోగ ఫలితముగ బుధునకా యిలయందు పురూరవుడను కుమారుడు జనించెను.

అటులు ఇల వనమందే తనయుని గని చింతాకులయై తనకులాచార్యుడు మునిసత్తముడగు వసిష్ఠుని నెమ్మదిలో స్మరించినది. ఆ సుద్యుమ్నుని దీనదశ జూడగనే జాలి కలిగి వసిష్ఠుడు లోకశంకరుండగు శంకరుని ప్రార్థించెను. పరమ శివుడు ప్రసాదభావము నొందుట గని రాజునకు మరల పురుషత్వము గలుగవలయునని ముని శివుని వేడుకొనెను. మహేశ్వరుడు తన పలికిన వాక్యము సత్యము జేయుటకై యితడొక నెల పురుషుడుగను నొకనెల స్త్రీగను నుండునని పలికెను. ఇట్లు రాజు వసిష్టుని దయవలన వరము బడసి తన గృహమేగి ధర్మానుసారము రాజ్యమేలుచుండెను. ఆ రాజు స్త్రీగ మారినపుడంతఃపుర మందే యుండును. పురుషుడైనపుడు రాజ కార్యములు చక్కబెట్టుచుండును. దీనికి ప్రజలుద్విగ్నులై సంతోషము జెందకుండిరి. కొంతకాలమునకు తన కుమారుడగు పురూరవుడు యువకుడు కాగా నతనికి ప్రతిష్ఠానపురము రాజధానిగ రాజ్యమొసంగి రాజు వనమున కరిగెను. పలు వృక్షములతో నుల్లము పల్లవింపజేయు రమ్యవనమందా రాజు నారదమునివలన పావనమైన నవాక్షరమంత్రము నుపదేశమంది ఆ శ్రీదేవీ మంత్రమునే భక్తిశ్రద్ధలతో నిరంతరముగ జపించుచుండెను. అంత సర్వగుణోపేతయు తరింపజేయునదియు మంగళరూపిణియు సింహారూఢయు దివ్యరూపిణియు మనోహారిణియు మద్యపానముచే మత్తయు మదముచే నాకులములైన లోచనములు గలదియునగు దేవి యతని యెడ ప్రసన్న యయి సాక్షాత్కరించెను. రాజా దివ్యమంగళమూర్తిని తన యెదుట సందర్శించగనే యతని హృదయము నుండి ప్రేమ భక్తి పెల్లుబికి యా జగదంబికను భక్తితో నీ విధముగ సంస్తుతింప దొడంగెను.

"భగవతీ! దివ్యమయి విశ్వ ప్రసిద్ధమై అఖిల జగములకు మేలునకనుకూలించు నీ రూపసందర్శన భాగ్యము నాకు నేటికి లభించినది. సకల దేవగుణములు స్మరించు నీ దివ్యచరణములే నాకు శరణములు. నీ పదకమలములు కామ ప్రదములు ముక్తి ప్రదములు. నీ దివ్యస్వరూపము సురలను మునులను మోహింపజేయును. సామాన్య మానవుడెట్లెరుగ గలడు? నీ మహిమ తెలియరానిది. ఈ దీనునిపై దయ దలచితివి. ఎల్లకలుములు ప్రసాదించితివి. ఇదంతయు నా కచ్చెరువు గొల్పుచున్నది. హరి, హరుడు, బ్రహ్మ, అగ్ని, కుబేరుడు, రవి, వరుణుడు, పవనుడు, సోముడ, వసువులను వారియందెవ్వరును నీ దివ్యసుగుణ ప్రభావమెఱుగజాలరు. ఇంక గుణహీనుడగు నరుడెట్లు తెలిసికొనగలడు? మహాద్యుతియగు విష్ణువు సైతము నిన్ను సత్త్వగుణ ప్రధాన శక్తియు సకలార్థ ప్రదాయినియు కడలిపట్టియునగు లచ్చిగనే యెఱుంగును. బ్రహ్మ నిన్ను రాజస శక్తిగను రుద్రుడు తామసశక్తి యగు నుమగను దలంతురు. కాని వారును నీ నిర్గుణశక్తి స్వరూపమెఱుగ నేరరు. మందమతియై యల్ప ప్రభావముగలనే నెక్కడ? నాపై ప్రవహించు నీ మధుర దయాపూరమెక్కడ? ఓ భవానీ! నీ మహోజ్జ్వల చరిత్రను నీ దయామృత సాగరమని భావింతుము. నిన్నెవరు గొలుతురో యా సేవకులపై నీవు దయ గురిపింతువు. పద్మాలయవైన యో పద్మా! నీవు హరిని వరించితివి. ఆ పురుషోత్తముడు మహాలక్ష్మివగు నీ చేత తన పదము లొత్తించుకొనుటకు దగనని దలచి తన పవిత్ర కరములతో నీ పావన పదపద్మములనొత్తును. పురాణ పురుషుడగు హరియును విశోకుడై ప్రమదమున నీ పాదాహతిని గోరుకొనును. అట్టి సకల దేవ సన్నుతుడే మదనార్తుడై నీ పదములకు మ్రొక్కినను నీవు రోషమున నతనిని పాదాతాడన మొనర్తువు. నీలాల మేఘమాలలో మెఱుంగు తీగె శోభిల్లును. నీవా విష్ణుని యెడందసెజ్జపై కలకాలము కాంతులీనుదవు. నీకా జగత్పతియును వాహనముగ నయ్యెను గదా! ఒకవేళ నీవు కోపమున నా మధుసూదనుని విడనాడినచో నపుడా సర్వనుతుడగు హరియును శక్తిహీనుడే యగును. శాంతి శ్రీని గోల్పోయి గుణహీనుడైన వానిని తమవారే విడనాడుట ప్రత్యక్ష విదితమే. ఓ యనంత శక్తీ! బ్రహ్మాది దేవతలును రేబవళ్లు నీ భవ్య పాదపద్మములు భజింతురు. వారే నీ మణి ద్వీపము జేరి యువతులుగ మారుదురు. నీ దయాదృష్టి చేత మరల వారు పురుషులుగ మారుదురని తలంతును. ఇట్టి నీ మహాశక్తి నేమని వర్ణింపగలను? నీవు కేవలము స్త్రీ పురుషాది చిహ్నములు గలదానవే కావు. సగుణపు నిర్గుణవు నిరంజనపు కనుక నిన్నే భక్తి ప్రపత్తులతో సంస్మరించుచు మ్రొక్కులు చెల్లింతురు. నాకు నీయందు నిశ్చల భక్తి యున్న చాలు. నాకు మరే కోర్కెయు లేదు. 

సూతుడిట్లనియె : ఈ ప్రకారముగ నా రాజు సంస్తుతించగనే శ్రీదేవి సుప్రసన్నయై యతనికి బ్రహ్మ నిర్మాణము ప్రసాదించినది. ఇట్లు సుద్యుమ్నుడు దేవీ ప్రసాదమున మునులకును దుర్లభమైన ధ్రువ పరమపదమును జెందెను.

అధ్యాయము 13 ఊర్వశీ పురూరవుల చరిత్ర

పంచాంగం

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...