శ్రీ శుకుని వైవాహికజీవనము
శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడు నిష్కము డెట్లగును? అను సందేహమింకను నన్ను కలత పెట్టుచున్నది. శాస్త్రజ్ఞానము నిత్యానిత్యవివేకము గలిగియున్నప్పటికిని చిత్తము మోహభ్రాంతిని వదలజాలదు. ఇక నరుడు విముక్తుడగుటెట్లు? అట్టడుగున పేరుకొన్న తమమును శాస్త్రజ్ఞానము తొలగింపజాలదు. దీపమను మాట పల్కినంతనే యెక్కడైన పెంజీకట్లు పాయునా? రాజా! విబుధులెన్నడును సర్వభూతములకు ద్రోహము తలపెట్టరు. వాని పొట్టపై కొట్టరు. అట్టి చక్కని చల్లని నెచ్చెలిమి గృహస్థున కెట్లు గల్గును? మిమ్మింకను రాజ్యసుఖాసక్తి పదవ్యామోహము ధనదాహము విజయకాంక్ష వదలలేదు గద? మీకిక జీవన్ముక్తి యెట్లు చేకూరును? నీకు చోరులందు చోరత్వబుద్ధి తాపసులందు సాధుతాబుద్ధి గలదు గదా? ఇట్టి స్వపరబేదములు గూడు కట్టుకొని యున్నంతవఱకు విదేహుడ వెట్లగుదువు? తీపి పులుపు ఉప్పు కారము వేడిమి మున్నగు రుచులందలి మంచిచెడ్డలు నీవు గ్రహింపగవు గదా! వీనియందలి మంచి పదార్థమునకు నీ మది యుప్పొంగును. చెడ్డకు క్రుంగును. ఆయా కాలములందు నీకును మెలకువ-కల-నిద్దుర మున్నగు నవస్థలు గల్గుచుండును గదా! ఇంక నీకు తురీయావస్థ గల్గుటెట్లు? అన్ని రథగజతురగపదాతి బలములు నా వశమున గలవు. వానికి నే నధిపతిని అని నీవు తలంతువా? తలంపనా? నీవు రుచించు పదార్థములనే తిందువు; సంతసింతువు; వ్యాకుల పడుదువు. అట్టి నీకు పాము పూలమాల- ఈ రెంటిలో సమబుద్ధి యెట్లుండును. కేవలము మన్ను-శిల-బంగారము-వీనియందు సమబుద్ధి గలవాడే ముక్తుడు; సర్వసముడు; సర్వభూతహితుడు; భూతదయాళువు; సర్వాత్మభూతుడు; సర్వభూతహితకరుడు. నా చిత్తమిల్లు పెండ్లములందు తగుల్కొనుటలేదు. నేను స్థితప్రజ్ఞుడనై యేకాంతములో పరబ్రహ్మమున జరింపవలయునన్నదే నా దృఢనిశ్చయము. నిస్సంగుడను నిర్మముడను నిష్పరిగ్రహుడను నిర్ద్వంద్వుడనై మృగముమాడ్కి నాకులలములు ఫలమూలములే తినుచు దిరుగవలయుననియే నా చిర వాంఛితము.
ఓ పార్థివా! నేను గుణములకందనివాడను. నా హృది వైరాగ్యకాంతులతో నిర్మలముగ నున్నది. నాకిక ధనరాసులతో నిండ్లతో మమతలతో బంధించు పెండ్లముతో నేమి ప్రయోజనము? పెక్కు రాగసంకులములగు వివిధాకారముల నెదలో భావించుచునే నీవు ముక్తుడనైతినని తలంతువు. కాని యదంతమును వట్టి డంబాచారమేయని నాకు దోచుచున్నది. నీ కొకప్పుడు ధనచింత మరొక్కప్పుడు శత్రుచింత వేరొకప్పుడు సైన్యచింత గల్గుచుండును గద| ఇంక నీవు నిశ్చింతుడవై యెప్పుడుందువు? మితాహారులు-జితక్రోధులు-నియతవ్రతులునగు వైఖానసమునులు గూడ ఈ సంసారము మిథ్యయని తలంచియు నిందేదో యనుభవించవలసినది గలదని యిందే తగుల్కొందురు. నీ వంశజుల కెల్లరకు విదేహనామము గలదు. ఆ పేరు కుటిలమైనది. అది మీకు తగినది కాదు. మూఢునకు విద్యాధరుడని చీకునకు దివాకరుడని కటికదరిద్రునకు శ్రీనివాసుడని పేరులు పెట్టబడును. కాని యవన్నియు వారికి సార్థకములుగావు గదా! నీ పూర్వజులకు విదేహులను పేరున్నట్లు నేను మున్ను వింటిని. ఆ పేరు నామమాత్రమేగాని కర్మవలన గల్గినది మాత్రముగాదు. తొల్లి మీ కులమున నిమియను రాజుండెను. ఆతడు యాగము చేయదలచి తన కులగురువును బ్రహ్మర్షియునగు వసిష్ఠుని అందులకై ఆహ్వానించగా వసిస్ఠుడు 'నేను ఇంతకు పూర్వుమే యింద్రునిచే నొక యాగమున కాహ్వానింపబడితివి. అతని పని పూర్ణముగావించి తిరిగి నీ యాగమునకు వత్తును. అందులకు వలయు సాధనసామగ్రులు మెలమెల్లగ సమకూర్చుకొనుచుండును' అని పలికెను. వసిష్ఠుడు మహేంద్రుని యాగమునకు వెడలెను. ఇచట నిమియు వేరొక మునిని గురువుగనుంచి జన్నమునకు బూనుకొనెను. అది విని కోపించి వసిష్ఠుడు ఓరీ గురుద్రోహీ! నీ దేహము పతితమగుగాకని నిమిని శపించెను. నీ మేను పడిపోవుగాక! అని నిమిగూడ మునిని శపించెను. ఇట్లిర్వురు నొండొరుల శపించుకొని పతితులైరని నేను మునుపు వింటిని. ఆ రాజు విదేహుడే యైనచో గురువట్టులేల శపించుచు? ఇంతకిదంతయును నా మదికి వింతగ దోచుచున్నది.
జనకుడిట్లనియె: ఓ శుకమునీ! నీవు పల్కినదంతయును యథార్థమే. ఇందసత్యములేదు. ఐనను నా గురువు చెప్పినది వినుము. నీవు నీ తండ్రితోడి సంబంధము విడనాడి యెక్కడికో కాఱడవులకేగదలతువు. కాని యక్కడను నీకు మృగసంబంధముండును. ఇందు సందేహము లేదు. ఆ పంచమహాభూతములెల్లడల వ్యాపించియుండునే| నీకచటగూడ నాహారచింత తప్పదు. దండాజినముల చింతయుడును. అట్లే నాకిచట రాజ్యచింతయు నుండును. దూరదేశముల నుండి వచ్చుటచే నీ చిత్తము వికలమై యున్నది. నేనిచట నే వికల్పములకును సంశయములకును దూరమందుందును. నేను సుఖముగా భుజింతును. హాయిగా నిదురింతును. బద్ధుడనుగాను, స్వతంత్రుడనను తెలివి వెలుగుచేత సంతతము సుఖముందును. నేను బద్ధుడనను శంకచే నీవింత దురపిల్లుచున్నావు. కాన నికనైన నిట్టి యనుమానము మాని స్థిరమతివై సుఖముండుము నేను దేహమను-బద్ధుడను. అనుకొన్నంతకాలము నీకు ముక్తి హుళక్కి. నేనీ ధనరాసులు భవనాలు రాజ్యము నావికావను తలంపున సుఖముందును.
సూతుడిట్లనియె: ఆ జనకుని హితవచనము లాలకించి శుకుడు సంప్రీతమనంబుతో రాజు ననుమతి బడసి తిరిగి తన తండ్రియాశ్రమ మేగెను. తిరిగి వచ్చిన నందనునిగాంచి వ్యాసుడమితానందమందెను. గుండెకు హత్తుకొని శిరము మూర్కొని సేమమడిగెను. ఆ పవిత్రాశ్రమమందు శుకుడు తన తండ్రితోడ వేదాధ్యయనముచేసి సర్వశాస్త్ర పారంగతుడయ్యెను. రాజ్యమేలుచున్నను నిరహంకృతితో నిర్మమత్వముతో సమదృష్టితో వెలుగొందు జనకునిగాంచి శుకుడు తన తండ్రి యింటనే యుండెను. అతడు యోగమార్గగామి. ఐనను పితరుల కన్నియను పీవరియను నామెను భార్యగ నంగీకరించెను. ఆమెయందు నల్వురు పుత్త్రులను బడసెను. వారు కృష్ణుడు గౌరప్రభుడు భూరి దేవశ్రుతుడన బరగిరి. మహావీర్యుడగు శుకుడు మరల కీర్తియను కూతును బడసి ఆమెను విభ్రాజసుతుడగు అణుహునకిచ్చి పెండ్లి చేసెను. అణుహుని తనయుడు శ్రీమంతుడగు బ్రహ్మదత్తుడు. అతడు మహాప్రతాపి. శుకకన్యకు గలిగిన అతడు బ్రహ్మజ్ఞానముగల రాజయ్యెను. అతడు కొన్నాళ్లకు నారదోపదేశమున యోగమార్గమవలంబించి తన కుమారునకు రాజ్య మప్పగించి బదిరికాశ్రమముజేరి అచట మాయా బీజోపదేశమంది పరిపూర్ణ బ్రహ్మజ్ఞానియయ్యెను.
శుకుడును నారదుని యనుగ్రహమున తన తండ్రి సంగతి వదలి ముక్తిప్రదమగు కైలాస శిఖరము చేరెను. ఆ చోట నతడు సర్వసంగపరిత్యాగియై నిర్వికల్ప సమాధిలో మునింగి సిద్ధాత్మస్వరూపుడై యాగిరిశిఖరమునుండి యూర్ధ్వమున కెగిరెను. వెంటనే గిరిశిఖరము రెండు వ్రయ్యలయ్యెను. అత డాకాశవీధిలో రెండవ భాస్కరుని బోలి దివ్యతేజమున ప్రకాశించెను. శుకుడు నింగికెగయగనే యిట పెక్కులుత్పాతములు సంభవించెను. అంతరిక్షమందలి వాయువును సురర్షులు ప్రశంసించునటులే శ్రీశుకుని మునులు సన్నుతించిరి. ఆ విధముగ సర్వభూతాత్మకుడు గగనసీమలో రెండవ భాస్కరునివలె బ్రహ్మజ్యోతులతో తేజరిల్లుచుండెను. ఇట వ్యాసుడు పుత్త్రవియోగము భరించలేక పుత్రా పుత్రాయని దెసలు మార్మ్రోగ బిట్టాక్రోశించెను. ఆ శుకుడు తపమాచరించిన గిరిశిఖరములందు అతిదీనుడై శోకించు వ్యాసునిగని సర్వభూతమయుడు సర్వసాక్షియగు పరమాత్మ వ్యాసునకు ప్రతిధ్వనితో మారు పలికెను. ఆ గిరిశిఖరములపై నేటికిని ఆ ప్రతిధ్వని స్పష్టముగ వినబడుచుండును. పుత్త్రవిరహమున పరిప్లుతుడై పుత్ర! పుత్త్ర! యని శోకమున మునిగిన వ్యాసుని చెంతకు పరమశివు డేతించి యతని నిట్లు ప్రబోధించెను:
శుకుడును నారదుని యనుగ్రహమున తన తండ్రి సంగతి వదలి ముక్తిప్రదమగు కైలాస శిఖరము చేరెను. ఆ చోట నతడు సర్వసంగపరిత్యాగియై నిర్వికల్ప సమాధిలో మునింగి సిద్ధాత్మస్వరూపుడై యాగిరిశిఖరమునుండి యూర్ధ్వమున కెగిరెను. వెంటనే గిరిశిఖరము రెండు వ్రయ్యలయ్యెను. అత డాకాశవీధిలో రెండవ భాస్కరుని బోలి దివ్యతేజమున ప్రకాశించెను. శుకుడు నింగికెగయగనే యిట పెక్కులుత్పాతములు సంభవించెను. అంతరిక్షమందలి వాయువును సురర్షులు ప్రశంసించునటులే శ్రీశుకుని మునులు సన్నుతించిరి. ఆ విధముగ సర్వభూతాత్మకుడు గగనసీమలో రెండవ భాస్కరునివలె బ్రహ్మజ్యోతులతో తేజరిల్లుచుండెను. ఇట వ్యాసుడు పుత్త్రవియోగము భరించలేక పుత్రా పుత్రాయని దెసలు మార్మ్రోగ బిట్టాక్రోశించెను. ఆ శుకుడు తపమాచరించిన గిరిశిఖరములందు అతిదీనుడై శోకించు వ్యాసునిగని సర్వభూతమయుడు సర్వసాక్షియగు పరమాత్మ వ్యాసునకు ప్రతిధ్వనితో మారు పలికెను. ఆ గిరిశిఖరములపై నేటికిని ఆ ప్రతిధ్వని స్పష్టముగ వినబడుచుండును. పుత్త్రవిరహమున పరిప్లుతుడై పుత్ర! పుత్త్ర! యని శోకమున మునిగిన వ్యాసుని చెంతకు పరమశివు డేతించి యతని నిట్లు ప్రబోధించెను:
"ఓ వ్యాసమునీ! శోకింపకుము. నీ నందనుడు యోగవిత్తముడు. అతడకృతాత్ములకు దుర్లభమైన పరమగతిని జేరెను. బ్రహ్మజ్ఞానివగు నీవతనికై బెంగపెట్టుకొనకుము. నీ పుత్త్రునివలన నీకు చిరయశము గల్గినది.
వ్యాసుడిట్లనియె: మహాదేవా! నేనేమి చేతును? ఎంతకు నా శోకమాగుట లేదు. నా కన్ను లింకను పుత్త్రదర్శనమునకే పరితపించుచు ఎదరు తెన్నులు చూచున్నవి.
శివుడిట్లనియె: అటులైన నీప్రక్కనే నీకతని చక్కటి నీడ నిత్తెము పొడగట్టుచుండును. ఆ నీడను చూచుకొని శోకము విడుపుము.
సూతుడిట్లనియె: అంత వ్యాసుడు తన తనయుని కాంతిమంతమైన నీడ గాంచెను. వామదేవుడా విధముగ వరమిచ్చి యచ్చోట నంతర్ధానమందెను. పిమ్మట వ్యాసుడు నిజాశ్రమమున కేగెను. ఐనను వ్యాసుడు తీరని పుత్త్రవియోగభారమున దుఃఖితుడై తపించెను.
అధ్యాయము 20 వ్యాసుని కార్యాచరణము
పంచాంగం
అధ్యాయము 20 వ్యాసుని కార్యాచరణము
No comments:
Post a Comment