Friday, April 10, 2026

Chapter 20 Activity of Vyasa - అధ్యాయము 20 వ్యాసుని కార్యాచరణము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 20

వ్యాసుని కార్యాచరణము
ఋషులిట్లనిరి: దేవసత్తముడగు శుకుడా ప్రకారముగ పరమసిద్ధిని బొందిన మీదట వ్యాసుడేమి చేసెను? అదంతయును మాకు తేటతెల్ల మొనరింపుము. 

సూతుడిట్లనియె : వేదాభ్యాస పరాయణులగు శిష్యులందఱును అసితుడు దేవలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు మున్నగు తపోధనులెల్లరు వ్యాసు ననుమతిగైకొని ఆతని వీడి వెళ్ళిరి. శుకుడు పరమ గతి చెందెను. అంత మహాత్ముడు వ్యాసుడు తనకు సత్సాంగత్యము లేమిచే తాను వేరొకచో నేగదలచెను. ఆతడపుడు గంగాతీరమున పరాశరునిచేత విడువబడి శోకించుచుండిన తన తల్లియగు నిషాదకన్యను నెమ్మదిలో దలంచెను. అట్లు వ్యాసుడు సత్యవతిని దలంచి యాపర్వతము వీడి తన జన్మస్థానమున కేగెను. అచ్చో వ్యాసుడొక ద్వీపముజేరి సత్యవతిని గూర్చి యడుగగ నామె శంతనున కీయబడినదని నిషాదులనిరి. దాశరాజు వ్యాసునకు స్వాగతము బలికి ప్రీతితో బూజించి సత్కరించి దోసిలొగ్గి యిట్లు నుడివెను: 

"ఓ మునివరా! నేడు గదా నా జన్మము సార్థకమైనది. కులము పవిత్రమైనది. అమర దుర్లభమైన నీ దర్శనభాగ్యము నేటికి నాకు ప్రాప్తించినది. నీ రాకకు కారణమేమో తెలుపుము. ఈ నా భార్య బిడ్డలు - సంపద - అంతయును నీ యధీనమే. ఆ మాటలకు సంతసిల్లి వ్యాసుడచ్చోట సరస్వతీ నదీతీరమున చక్కని యాశ్రమ మేర్పరచుకొని తపమొనర్చుచు ధీరుడై యచ్చట కాలము గడుపుచుండెను. మహావిక్రముడగు శంతనునివలన సత్యవతి కిరువురు సుతులు గలిగిరని విని వ్యాసుడానందమంది యచటనే యుండెను.

ఆ యిరువురిలో పెద్దవాడు చిత్రాంగదుడు. అతడు సర్వలక్షణలక్షితుడు-శత్రుతాపనుడు. రెండవవాడు విచిత్ర వీర్యుడు. అతడు సద్గుణోపేతుడు. తండ్రికి సుఖము చేకూర్చువాడు. వీరిరువురికంటె పూర్వమే శంతనునకు మహావీరుడు పరాక్రమవంతుడగు గాంగేయుదుద్భవించెను. ఆ శంతనునివలననే సత్యవతియందీ యిరువురు జన్మించిరి. శంతనుండు సర్వలక్షణలక్షితులగు తనయులను బడసి దేవతలకు సైతము తా నజేయుడని తలంచెను. కొంతకాలము గడచినంతనే చినిగిన వస్త్రమును విడుచునట్లు కాలపరిపాకమున శంతనుడు తన తనువును విడిచెను. భీష్ముడు శంతనునకు యథావిధిగ సకల ప్రేతకార్యములను దానధర్మముల నాచరించెను. దేవవ్రతుడని ప్రసిద్ధుడైన భీష్ముడు తాను రాజ్యము చేయక చిత్రాంగదునకు పట్టముగట్టెను. ఆ సత్యవతీ సుతుడగు పరంతపుడు శుచి మహావీర్యుడు చిత్రాంగదుడును ఒకనాడు సేనల వెంటబెట్టుకొని వధ్యరురు మృగాదులను జూచుచు నడవిలో దిరుగుచుండెను. అపుడు దివ్యవిమానముపై చిత్రాంగదుడను గంధర్వుడు వనమందు సంచరించు చిత్రాంగదునిగని యతని చెంత దిగెను. ఆ సమబలశాలురకప్పుడు ఘోర రణము సంఘటిల్లెను. వారికి కురుక్షేత్రమున మూడేండ్లపా టేకధాటిగ రణము సాగెను. అందు చిత్రాంగదరాజు చిత్రాంగద గంధర్వుని చేతిలో మడిసి వీరస్వర్గమలంకరించెను. అది వినిన భీష్ముడు వెంటనే యతనికై యుత్తర క్రియలు జరిపెను. చిత్రాంగదుని మృతికై శోకించు భీష్ముని మంత్రులూరడించిరి. పిదప విచిత్రవీర్యుడు రాజయ్యెను. తనయునికై విలపించు సత్యవతిని మంత్రులు గురువులు నోదార్చి శోకముడిపిరి. సత్యవతి యూరడిల్లెను. వ్యాసుడును తన సోదరుడు విచిత్రవీర్యుడు రాజయ్యెను గదాయని సంతసించెను. యవనముననున్న విచిత్రవీర్యునకు వివాహము సేయ భీష్ముడు సంకల్పించెను.

సర్వలక్షణశోభితలగు కాశీరాజ పుత్రికలు మువ్వురు గలరు. వారి తండ్రి వారి వివాహమునకై స్వయంవరము చాటించెను. వేలాదిమంది రాజులు రాజకుమారులు స్వయంవరమునకు పిలువబడి సత్కరింపబడిరి. అపుడు మహావీరుడు మహారథుడగు భీష్ముడరదమెక్కిచని యక్కడి రాజుల యుక్కడగించి తన తేజస్విత భుజబలము నల్గురిలో ప్రదర్శించి భూపతులకు తలవంపులు గల్గించి యారాకుమార్తెలను బలిమితో గొనివచ్చెను. ధీరుడగు భీష్ముడా వామలోచనలను సొంతతల్లిగ-అక్కగ-కూతురుగ భావించికొని వచ్చి సత్యవతికి వారి నప్పగించి వేదవిదులు దైవజ్ఞులునగు ద్విజులనురావించి వివాహ శుభలగ్నము వారినడిగి తెలిసికొని తన సోదరుడు విచిత్రవీర్యునకు పెండ్లి చేయుటకు వివాహమంగళ ప్రయత్నములు జరుపుచుండెను. అంతలో నా కన్నెలలో బెద్దది గంగా తనయున కిట్లు పలికెను: 'ఓ కురుశ్రేష్ఠా ! నేనింతకు మునుపే సాల్వరాజును మనసార వరించితిని. ఆ భూపతియు నాపై నరురక్తుడైయుండెను. నేను ముందే యితరులచేత మనసార వరింపబడినదానను. నీవు బలశాలివి. కనుక నీవు నీ మదికి తోచినట్లు చేయుము.

సూతుడిట్లనియె: ఇట్లా కన్యపలుకగ భీష్ముడామె విషయమును తన తల్లి మంత్రి పురోహితుల ముందుంచి వారితో సంప్రతించి గాంగేయుడా కన్నియతో నీ యిష్టమున్నచోటికేగుమని చెప్పెను. అంత నా మగువ సాల్వుని సరసకు జని యతనితో నిట్లు పలుకసాగెను: 

"ఓ నరపతీ! నేను నీపై ననురక్తనని ఎరిగి భీష్ముడు నన్ను విడిచిపుచ్చెను. నిన్ను చేరిన నన్ను చేపట్టుము. ఓ నృపసత్తమా! నీకు నే నత్యంతము ధర్మపత్నిని. నీవును మునుపు నన్నట్లే తలచితివి. 

సాల్వుడిట్లు పలికెను: ఓ వరారోహా! ఆనాడు భీష్ముడు నా కన్నలుముందే నిన్ను పట్టుకొని రథముపై కూర్చుండ బెట్టుకొనెను. కాన నింక నేను నిన్ను చేపట్టుట కల్ల. పరోచ్ఛిష్టయగు కన్య నే మతిమతుండు చేరపట్టును? భీష్ముడు వదలిన నిన్ను తల్లిగదలంచి నేను నీ కేలు పట్టను.

అపుడా కన్నియ సాల్వునిచేత వదలబడి కన్నీరుమున్నీరుగ నేడ్చుచు మరల భీష్ముని జేరవచ్చి యతని కిట్లు పలికెను : 

'నేను నీచేత వదలబడితిని. కనుక సాల్వుడును మరల నన్ను చేపట్టుటలేదు. నీవు గొప్ప ధర్మవిదుడవు. నన్ను నీవే స్వీకరింపుము. లేనిచో నీముందు ప్రాణములు తీసికొందును.' 

భీష్ముడిట్లనియె : 'ఓ వరవర్ణినీ ! నీ మది వేరొకనియందు దగుల్కొనియున్నది. నిన్నెట్లు గ్రహింతును? నీవు నీ పుట్టింటి కేగుము.' భీష్ముడా మాట యనగనే యామె వనములకేగి పవిత్రతీర్థములం దొంటరిగ తపమొనర్ప దొడగెను. మిగిలిన కాశిరాజసుతలు రూపవతులు - అంబ అంబాలిక యనబడు వారలు ఇరువురు విచిత్రవీర్యుని భార్యలైరి. ఆ మహాబలుడగు విచిత్రవీర్యుడు వారిని గూడి సెజ్జలందు పూసెజ్జలందు తమకమున తొమ్మిదేండ్లు క్రీడించుచు విమరించుచుండి రాజయక్ష్మరోగముతో కాలధర్మ మందెను. తన కొడుకు మరణించగ సత్యవతి దుఃఖముతో ఆతనికి మంత్రులచే నంత్యక్రియలు జరిపించినది. ఆమె యొకనాడు విలపించుచు భీష్మునితో నొంటరిగ నిట్లనియెనుః 

'ఓ మహాభాగా! నీవును శంతనుని సుతుడవే గద! కనుక రాజ్యభారము వహించుము. నీ తమ్మునిభార్యలను చేపట్టి వంశము నిలువబెట్టుము. ఆ యయాతి వంశమడుగంటకుండునట్టు లొనరింపుము.' 

భీష్ముడిట్లనియె: 'తల్లీ! మా తండ్రితో నేను మునుపొనరించిన ప్రతిన నీవు విన్నదే గదా! నేను రాజ్యము చేయను. పెండ్లి చేసికొనను.' 

సూతుడిట్లనియె: ఆ మాటలకు సత్యవతి 'ఈ వంశమిక నిలబడుటెట్లొకో? ఆలసించిన దేశములో నరాజకము ప్రబలును. అపుడు నా మది కింక శాంతియే యుండదు.' అని యామె చింతాకులితయై వగచినది. అపుడు గాంగేయు డామెతో నిట్లు పలికెనుః 

' ఓయమ్మా, చింతిల్లకుము. విచిత్రవీర్యునకు క్షేత్రజపుత్త్రుడు గల్గు నట్లొనరింపుము. ఒక కులీనుడగు నుత్తమబ్రాహ్మణుని రావించి నీ కోడండ్ర నతనితో గలుపుము. ఇందు దోషము లేదు. ఇట్లు వంశము నిలువబెట్టుకొనవచ్చునని నిగమములు వాక్రుచ్చినవి. అపుడు నీ మనుమని రాజుగజేసి నేనతని శాసనమున రాజ్యము చక్కబెట్టుదును.'

భీష్ముని మాటలు విని యామె తన కానీననందనుడు కలుషరహితుడునగు వ్యాసుని నెమ్మదిలో దలంచినది. తన తల్లి తలచినంతలోనే వ్యాసతాపసు డేతెంచి యామెకు చేయెత్తి మ్రొక్కి యామె చెంత బ్రహ్మజ్యోతులు విరజిమ్మ నిలుచుండెను. వ్యాసుడపుడు భీష్మునిచేత బూజితుడై సత్యవతిచేత మర్యాదలందుకొని పొగలేని యగ్నిజ్వాల పగిది వెలుగుచుండెను. సత్యవతి వ్యాసునితో 

'నీ మహావీర్యమువలన విచిత్రవీర్యుని భార్యలందు చక్కని కుమారుల నుత్పన్నుల చేయు' మని చెప్పెను. వ్యాసుడు తన తల్లిమాట మేరమీర కామె మాట నాప్తవాక్యముగనెంచి యట్లయగుత మని పలికి ఋతుకాలమున కెదురు చూచుచుండెను. అంత నొకనా డంబిక ఋతుస్నాతయై మునివరుని పొందిక కేగినది. కాని కన్నులు మూసికొని మునివరునితో సంగమమందెను. ఫలితముగ గ్రుడ్డివాడు జన్మించెను. పుట్టుగ్రుడ్డియగు కుమారుడు పుట్టుటవలన సత్యవతి మిగులు దుఃఖించెను. అపుడామె తన రెండవ కోడలినిగూడ వ్యాసునివలన పుత్రుని బడయుమని ప్రేరించినది. అంతనొకనాడంబాలికయును ఋతుస్నానయై వ్యాసమునిని గూడెను. ఫలితముగ నామెయదే రేయి గర్భము దాల్చెను. ఆ యంబాలికకు పుట్టిన బాలుడు పాండువర్ణమున నుండెను. అతడేలుబడికి తగడు. కనుక సత్యవతి తన కోడలి నొకయేడాది తరువాత మరల నొక పుత్త్రుని గనుమని ప్రోత్సహించినది. సత్యవతి మరల వ్యాసముని నాహ్వానించినది. సత్యవతిచేత పంపబడిన వధువు వ్యాసుని మహోజ్జ్వలతేజముముందు నిలువద్రొక్కుకొని యుండలేక తన దాసిని గదిలో కంపినది. ఆమె వ్యాసుని పొందిన పొందికకు ఫలితముగ నొక కొడుకును గనెను. అతడే విదురుడు. ఈ ప్రకారముగ వ్యాసుని యనుగ్రహమున ధృతరాష్ట్రాదులు మువ్వురు కురువంశము నిలువబెట్ట జన్మించిరి. సోదరధర్మము దెలిసిన శ్రీ వ్యాసమహర్షి వలన నీ విధముగ కురువంశము నిలువబెట్టబడినది. ఓ యనుఘులారా! మీకీ ప్రకారముగ శ్రీవ్యాసుని వంశోత్పత్తి చరిత్ర సంపూర్ణముగ నభివర్ణింపబడినది.


శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 47 Seeking refuge with the sages with Manorama Sudarshan - అధ్యాయము 47 మనోరమ సుదర్శనునితో మునుల శరణు వేడుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 47 మనోరమ సుదర్శనునితో మునుల శరణు వేడుట వ్యాసు డిట్లనియె: ఆ విధముగ నిరువురు రాజులను శస్త్రపాణులై ...