Friday, April 10, 2026

Chapter 17 The Shuku Went to Mithila - అధ్యాయము 17 శ్రీ శుకుడు మిథిలకు జనుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 17

శ్రీ శుకుడు మిథిలకు జనుట


సూతుడిట్లనియె : ఈ ప్రకారముగ మహామనస్వియగు శుకుడు పలికి చేతులు జోడించి తన తండ్రి పదకమలములకు నమస్కరించి మిథిలా ప్రయాణమునకు తరలి తండ్రి కిట్లనియెను : 

"ఓ మహాభాగా! తండ్రీ! నీ మాట నొప్పుకొంటివి. జనకుడేలు విదేహపురిని జూడనేగుటకు నా కనుమతిమ్ము. ఆ రాజు దండములేకయే రాజ్యమెట్లు చేయును? దండనీతిలేనిచో లోకము ధర్మమున వర్తించదు. ధర్మసంస్థాపనకు దండనీతియే మూలమని మన్వాదులు వాక్రుచ్చిరి. అయ్యో! ఆ రాజు దండములేకయే రాజ్యమెట్లు చేయునాయని నా సందేహము. జనకుని ప్రవర్తన నా తల్లి వంధ్యయనినట్లు నాకు భాసించుచున్నది. దాని నిజ మెఱుంగుటకు మీ యనుమతితో అట కేగుచున్నాను. 

సూతు డిట్లనియెను : ఆ శుకు డహంకారమడగిన యాత్మనిష్ఠుడు నిర్లిప్తుడు జ్యోతిఃసాగరమున దేలియాడువాడు. అట్టి శుకుని తన కౌగిట జేర్చుకొని వాసుడిట్లు పలికెను: 

"శుకా! నీకు కల్యాణమగుత. చిరంజీవివిగమ్ము. తిరిగి వత్తునని మాట యిచ్చి క్షేమముగ పోయి రమ్ము. నీ వచ్చటినుండి మరల ఇచ్చటికే రమ్ము. ఇంకొక చోటికి నీవెన్నడును పోరాదు. నీ ముఖకమలమును గాంచకున్నచో నాకు శాంతిగ మనుగడ సాగదు. నిన్నొక్కక్షణమేని చూడకున్నచో నా మనస్సు వ్యథజెందును. నాకు నీవు ప్రాణములోని ప్రాణము. జనకుని సందర్శించి నీ శంక బాపుకొని తిరిగి వచ్చి యిచ్చటనే వేదాధ్యయన పరుండవై సుఖముండును. 

సూతుడిట్లనియె : వ్యాసుని పలుకులు విని శుకుడు తన తండ్రికి ప్రదక్షిణ నమస్కారము లొనరించి వింటినుండి వెడలిన యమ్మువలె త్వరితముగ బయలుదేరెను. అతడు మార్గమధ్యమున పాడిపంటలు వెల్లివిరిసిన దేశములను దేశవాసులను ఫలపుష్పముల నలరు వనములను తపించు తాసనులను దీక్షితులగు యాజకులను యోగాభ్యాసపరులగు పరమయోగులను వననివాసులగు వానప్రస్థలును శైవ వైష్ణవ సౌర శాక్త పాశుపత మతస్థులను వేరువేర దర్శించుచు పయనము సాగించుచుండెను. ఆ మహాత్ముడు రెండేండ్లకు మేరుగిరిని నొక్క యేడాదిలో హిమగిరిని దాటి మిథిలవైపు సాగెను. అతడా నగరి ప్రవేశించి సకలకళా సమృద్ధులను సదాచార సంపన్నులను సందర్శించెను.

రాజద్వారము జేరగనే రాజభటు లతనిని నిలువబెట్టి "నీవెవరవు? ఎటనుండి వచ్చితివి? నీకిందేమి పని?" యని ప్రశ్నలు గురిపించిరి. ఐనను శుకుడు వారికి మారు పలుకలేదు. ఆ మునిబాలుడు వచ్చుపోవువారికి బాటవదలి తానొక ప్రక్కగ మిన్నువిఱిగిమీదపడినను కదలకమెదలక స్థాణువువలె నుండెను. నడుమనడుమ వింతనవ్వులు నవ్వుచుండెను. 

ద్వారపాలు డిట్లనియె : బ్రాహ్మణోత్తమా! నీవు మూగవా? ఇచ్చటి కేపనికై వచ్చితివి? ఎవ్వరేని ఏపనియులేకూరకే రారని నాకు తెలియును. రాజునానతిలేనిదే యెవ్వరును నగరము ప్రవేశింపరాదు. క్రొత్తగవచ్చినవాని కులశీలములెఱుగక లోనికి వెళ్ళనీయరు. నీవు వేదవిదుడవు. వైరాగ్యతేజమున వెలుగొందు బ్రాహ్మణుండవు. నీ కులమును వచ్చిన పనిని దెలిపి యథేచ్ఛగ నరుగుము. 

శుకుడిట్లనియె: "నా వచ్చినపని నీ మాటలవలననే తీరినది. విదేహనగరమున ప్రవేశము దుర్లభమని తెలియుచున్నది. నా మతిమాంద్యము వలన రాజును జూడవలయుననెడి ఆసక్తితో నేనింతదూరము శ్రమపడి యేతెంచితిని. నేను నా తండ్రి మాటచే మోసపోతిని. ఇపుడెవరిని దూషింతురు? నేజేసికొన్న కర్మము కొలది ఇట్లు పర్యటించుచున్నాను. ధనాశయే పురుషుని ముప్పుత్రిప్పలు పెట్టును. నాకా యాస లేకున్నను విభ్రాంతిచే మోసపోయి యింతదూరము వచ్చితిని. నరుడు మోహపాశమునందు జిక్కుకొనకున్నచో నతనికి నిత్యసుఖము చేకూరును. నేనే కోర్కులులేనివాడనే. ఐనను మోహజలధిలో మునుగుచున్నాను. ఎక్కడి మేరుగిరి! ఎక్కడి మిథిలాపురి!! ఇంత దూరమిట్లు కాలినడకతో వచ్చుటేమి? నా రాకకు ఫలితమేమి? నన్నావిధిలీల వంచించినదని తోచుచున్నది. మేలైనను కీడైనను ప్రారబ్ధ మనుభవించక తీరదు. ఆ ప్రారబ్ధమునకు ప్రయత్నముతోడై యెల్లపనులను చేయించును. ఇంత శ్రమపడివచ్చితినేకాని ఇట నొకవేదముగాని యొకతీర్థముగాని లేదు. ఇంతకును విదేహరాజు పురమున ప్రవేశము దుర్లభము" అని శుకుడు పలికి మౌనమూనెను. ప్రతీహారి శుకుని జ్ఞాన సంపన్నునిగ బ్రాహ్మణశ్రేష్ణునిగ దెఇసికొనెను. ద్వారపాలుడా మునితో సామవచనములనిట్లు పలికెను: 

"ద్విజసత్తమా! నీకు పనియున్న చోటికిక స్వేచ్ఛగ నరుగుము. నిన్ను నేనడ్డగించిన నా యపరాధము క్షమింపుము. ముక్తపురుషులకు క్షమయే బలము.

శుకుడినట్లనియె : 'ప్రతీహారీ ! ఇందు నీ దోషమావంతయును లేదు. నీవు పరతంత్రుడవు. సేవకుడు తన ప్రభు నానతి నిర్వహించి తీరవలయును. నన్ను నీవు వారించుటవలన రాజును సైతము నిందించుటకు వీలులేదు. వీడు దొంగ వీడు శత్రువని చక్కగ నెఱుంగుట పండితుల లక్షణముగదా! ఇంతకు నిచ్చట నాదే పొరబాటు. పొరుగింటకేగుట లఘుత్వమునకు కారణము.' 

ప్రతీహారి యిట్లు పలికెను : ద్విజవరా! అందఱి మేలుగోరువానికి సుఖమేది? దుఃఖమేది? ఏది కార్యము? ఎవడు కర్త? ఎవడు శత్రువు? నాకిది తేటపఱచుము. 

శుకుడిట్లు వచించెను: లోకములన్నిటియందు రెండు మార్గములు గలవు. మనుజులు రెండు తెగలు. ఒకడు రాగి, వేరొకడు విరాగి. విరాగులును ముత్తెఱంగులవారు. తీవ్రవిరాగి-మధ్యమవిరాగి-మందవిరాగి అని. ఇక రాగులు రెండు విధములు. మూర్ఖుడు చతురుడునని. చాతుర్యము రెండు తరగతులు: శాస్త్ర చాతురి-బుద్ధిచాతురియు. బుద్ధియు యుక్తము-అయుక్తము నని రెండువిధములు. 

ప్రతీహారి యిట్లనియె : బ్రాహ్మణవర్యా! నీవు చెప్పినదంతయు నాకు తికమకగనున్నది. నరిగ వివరించి నిజమేదో తెలుపుము. 

శుకుడిట్లు వచించెను: ఈ సారములేని సంసారమం దనురాగముగలవాడు రాగి. అట్టివాని కెన్నెన్నియో సుఖదుఃఖములు గల్గుచుండును. నరుడు తనకు ధనము పెండ్లము కొడుకులు ఘనవిజయము అభిమానము గలిగినచో సుఖముగాంచును. అవి తనకు వేరైనవాడు దుఃఖపడును. ఎవరికి దేనివలన సుఖముగలుగునో వారా సుఖోపాయము నాచరించవలయును. దానికి విఘ్నముగల్గించువారిని శత్రులుగ నెన్నవలయును. రాగవంతునకు మిత్రుడు సుఖము గలిగించును. ధీరుడై లోచూపుగలవాడెన్నడును మోహభ్రాంతిలో మునుగడు. మూర్ఖుడే యెల్లకాలము మోహమందును. విషయవిరక్తుడు జ్ఞాని స్వాత్మనక్తుడునగు. అధ్యాత్మజ్ఞాని స్వాత్మసక్తుడునగు అధ్యాత్మజ్ఞాని నిత్యుడై తత్త్వ జ్ఞానార్థచింతనమును చేయుచు నమృతత్వముగోరి యేకాంతసేవలో ప్రత్యగాత్మను సందర్శించవలయును. అదే యతనికి బ్రహ్మానందము చేకూర్చును. ఈ మాయా సంసారమందలి మాటలన్నియును వికారములు. దుఃఖప్రదములు. మేలుగోరు యథార్థవాదికి లోకమే విరుద్ధమగును. కామము క్రోధము మాంద్యము మున్నగునని నరు ననేకరీతుల వెన్నాడు వైరులు. ఈ లోకములన్నిటిలో తన యాత్మసుఖమునకు తానే బంధువు. ఆత్మానందమునకు సాటియగు సుఖము మరేదియును లేదు.

సూతుడిట్లనియె: శుకుని ప్రబోధము విని ప్రతీహారి యతనిని మహాజ్ఞానిగ నెఱిగి చక్కని రాజమార్గమున నతనిని లోనికి ప్రవేశపెట్టెను. అంత శుకుడా నగరమందు పెక్కు విధముల ద్రవ్యరాసులను పోసి యమ్ముకొనువారు రాగద్వేషకామలోభమోహాకులులు కీచులాడుకొనువారునను మూడువిదముల మనుజులను గాంచుచు ముందునకు సాగి రాజమందిరములోనికి ప్రవేశించెను. అతడు ప్రభవలె నడచు రెండవ సూర్యుడో యన పరమవైరాగ్యమున భాసిల్లుచుండెను. లోనగూడ ప్రతీహారులు శుకునడ్డగించగా నతడు ద్వారమందే స్థాణువువలె కదలక మెదలకుండి ఆత్మమోక్షముగూర్చి విచారించు చుండెను. నీడను వేడిమిని సమముగ చూచు నా మహాతపుడు స్థాణువు పగిదినుండి వృత్తులకు మూలమును వెదకుచు నిశ్చల సమాధిలో మునింగెను.

ఒక్క ముహూర్తమాత్రముననే జనకుని మంత్రివచ్చి చేతులు జోడించి శుకుని రాజమందిరములోని రెండవ ద్వారమున ప్రవేశింపజేసెను. మంత్రి శుకునకందు విరిసిన మనోహరములైన తరువులు వనములు జూపి యతిథిమర్యాదలు జరిపెను. రాజసేవా పరాయణులు గేయ గానకళాశ్రీలు కామశాస్త్ర విశారదలునగు వారస్త్రీలను శుకునకు చేయవలసిన సేవలన్నియుచేయ నియోగించి మంత్రి తానందుండి బయటకు వచ్చెను. శుకుడందే యుండెను. ఆ కాంతలు శుకునకు వీడని భక్తితో సేవలుచేసి ఆయాకాలములకు దగిన వివిధములగు వంటకములతో శుకుని తనిపిరి. ఆ శుకుని గాంచి వారు కామమోహితులైరి. ఆ యంతిపురము మించుబోడులా విరాగికి తమ యుద్యానవనమందలి రమ్య విషయములను కలయజూపిరి. ఆ శుకుడు యువకుడు మనోహరుడు; మృదుభాషి; అపరమన్మథుడు; అతనిని గాంచగనే యాలలనల మనస్సులు కామవశమైనవి. కాని ఆ మరునిముసమందే వారతనిని విజితేంద్రియునిగ నెఱింగి పరమభక్తితో పూజలు చేసిరి. పరిశుద్ధాత్ముడగు శుకుడును వారిని తల్లులుగ భావించెను. ఆ శుకుడు ఆత్మారాముడు విజితాత్ముడు; వంతగాని సంతసముగాని చెందకుండెను. ఆ యువతులలోని మదసరాగములు గనియు విరాగభావముతో నాత్మసంస్థితి జెందెను. అపుడా కాంతలతనికి మేలైన వస్త్రములతో చక్కగ నలంకరించిన పానుపమర్చిరి. దానిచెంత మధురరసపదార్థములునిచిరి. శుకుడు పాదములు కడుగుకొని దర్భలుచేతబట్టి శ్రద్ధతో పశ్చిమసంధ్య నుపాసించి నిర్మలనిశ్చలచిత్తమున స్వాత్మసమాధియందు మునింగెను. అతడొక జాము ధ్యానమునుండి నిద్రించెను. రెండు జాములు నిదురించిన పిమ్మట మేల్కొనెను. అతడు మరల నపరరాత్రమున నాత్మధ్యానమగ్నుడయ్యెను. కొంతసేపటికి లేచి స్నానమొనర్చెను. ప్రాతఃక్రియలు నిర్వర్తించెను. స్థితప్రజ్ఞుడై వైరాగ్యజ్యోతితో బ్రహ్మతేజమున వెలుగుచుండెను.

అధ్యాయము 18 జనకుడు శుకునకు కర్మమార్గ ముపదేశించుట

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 19 Sri Sukuni's married life - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడ...