Friday, April 10, 2026

Chapter 16 Vyasa instructs Shuku the Bhagavata of Sridevi - అధ్యాయము 16 వ్యాసుడు శుకునకు శ్రీదేవీ భాగవత ముపదేశించుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 16

వ్యాసుడు శుకునకు శ్రీదేవీ భాగవత ముపదేశించుట


వ్యాసుడిట్లనియె : ఈ ప్రకారముగ క్షీరసాగరశయనుడు వటపత్రశాయి పరమాశ్చర్యమందుచుండ శ్రీదేవి సుధలుచిందు చిరునవ్వు వెన్నెలలతో విష్ణుని గాంచుచు ననియెను : 

"నీకిదంతయును వింతగ నున్నదా? నీవు మహాశక్తి ప్రభావమున మున్ను నన్ను విస్మరించితివి. ప్రళయము గడచినప్పుడెల్ల నీవు మరల మరల నుద్భవించుచుందువు. ఆ పరామూలశక్తి నిర్గుణురాలు. నీవును నేనును సగుణులము. నన్ను సాత్వికశక్తిగ నెఱుంగుము. నీ నాభికమలమునందుండి ప్రజాపతియగు బ్రహ్మ యుద్భవించగలడు. అతడు రజోగుణముతో నెల్లలోకములు మరల సృజించును. అతడంతట నుగ్రతవ మొనర్చి యుత్తమ రాజసశక్తిని బడసి రజోరాగప్రభావమున ముల్లోకములను రజోరాగముతో నింపివేయును. బ్రహ్మ త్రిగుణమయములగు పంచభూతముల నుత్పత్తిచేయును. ఆ పిదప నింద్రియములను ఇంద్రియాధిష్ఠాన దేవతలను మనస్సును సృజించును. ఈ విధముగ విధి సృష్టిరచన పూర్వమువలెనే కొనసాగించును. కావుననే బ్రహ్మ సృష్టికర్త యనంబరగును. 

ఓ మహాశక్తీ! విష్ణూ! ఈ సకల విశ్వమునకు నీవే పరిపాలకుడవు. నీ కన్బొమల మధ్యనుండి కోపకారణముగ రుద్రు డావిర్భవించును. అతడు మహోగ్రతపమొనర్చి తామసశక్తిని వశము చేసికొనును. ఆ రుద్రుడే కల్పాంతమున సర్వమును పొలియజేయును. నీ సన్నిధానమున కరుగుదెంచిన నన్ను సాత్త్వికశక్తిగ నెఱుగుము. మధుసూదనా! నేను పెన్నిధివైన నీ సన్నిధి యందే యుందును. నీ హృదయకమలమందే యిల్లు కట్టుకొని నిముసమైన నినుబాయక నివసింతును."

విష్ణువిట్లనియె : 'నేను మునుపు చమత్కారముగొల్పు శబ్దార్థములుగల శ్లోకార్థము వింటిని. అది పరమమై శివవై రహస్యమై రస్యమై యలరుచున్నది. ఆ వాక్కునెవరు వక్కాణించిరో తెలిపి నా యీ సందియము తొలగింపుము. నిఱుపేద ధనముకొఱకు నిరంతరముగ చింతించుచుండునట్లు నేనా శ్లోకార్థమందలి గమ్యార్థమును మాటిమాటికి సంస్మరించుచున్నాను. 

వ్యాసుడిట్లనియె: విష్ణుని యాపలుకు లాలకించి చారుహాసినియగు నిత్యకల్యాణి పరమప్రీతితో విరిసిన లేనగవుతో హరికిట్లనియెను: 

"శౌరీ! నన్ను చతుర్భుజగ నిర్గుణగ నెఱుంగుము. నేను సగుణ నిర్గుణములుగల దాననని నీకు దెలియదా? ఆ శ్లోకార్థ మా మహాశక్తిది. నీవా మూలశక్తినే నమ్ముము. ఆ యద్భుతశక్తిచేతనే శుభకరము వేదసారమునగు పుణ్యపురాణము వెలసినదని తెలిసికొనుము. ఆ కరుణామయియగు దేవికి నీపై నెక్కడలేని వాత్సల్యము గలదని భావింతును. ఆమెయే నీ యోగక్షేమములు చూచు తల్లి. కావుననే యామె నీకా పరమరహస్యమైన వాక్యము వినిపించినది. దానిని నీ యెడదలో నిల్పుకొని యెన్నడును మరువకుము. ఆ మహావిద్యా స్వరూపిణి నీకు సర్వశాస్త్రరసాయన మెఱుకపఱచినదని యెఱుగుము. ఈ భువనత్రయమందును దానిన మించి గ్రహించవలసినది మరొండులేదు. నీవన్న నామె కెంతయో యిష్టము. కనుకనే యాయె నీకా దివ్యవాక్కు వినిచెను."

వ్యాసుడిట్లనియె : అట్టి దేవి దివ్యవాణి నాకర్ణించి భగవానుడు దానినే పరమమంత్రరాజముగ నెంచి హృదయకమలమందు దరించెను. కొంతకాలము పిదప విష్ణుని నాభికమలమునుండి బ్రహ్మ యుద్భవించెను. అతడు దానవభయభీతుడై శరణు వేడుకొనగా హరి మధుకైటభులతో బోరి వారి నంతమొందించి బ్రహ్మభయము బాపెను. పిదప కూడా హరి దివ్యరసమయమైన యాశ్లోకార్థమునే జపించుచుండెను. అది వినిన కమలజుడగు బ్రహ్మ హరిని ఓ పుండరీకాక్షా! నీవేమి జపించుచున్నావు? నీకంటె నధికుడెవడు గలడు? నీవనుస్మరించుచు ముదమందు నామంత్రమేమి? అని ప్రశ్నించెను. హరి యిట్లు పలికెను : 

"మహాభాగా! నీలో నాలో సర్వములోగల కారయిత్రిశక్తిని భగవతిగ జగదంబగ భావింపుము. ఈ మహాజలరాశియు నెల్లలోకములు నే తల్లి యాధారముగ నొప్పుచున్నవో యా తల్లినే సాకారగ ననంతశక్తిగ సనాతనగ నెఱుంగుము. ఆ మహాశక్తియే యెల్లప్రాణుల జీవనాడులు స్పందింపజేయు నిత్యనూతన చైతన్యశక్తి - చరాచర విశ్వకర్త్రి-ఆమె సుప్రసన్నురాలయ్యెనా - కోరిన కోర్కులు గురియు వరదాయిని యగును. ముముక్షులకు ముక్తిప్రదాయిని యగును. ఆ తల్లియే పరావిద్య - మోక్షహేతుభూతురాలు - సంసార బంధన కారణురాలు - సర్వవిశ్వేశ్వరి. ఈ విశ్వవిశ్వమును నీవును నేనును సత్యశివసుందరశక్తివలన సంభవించిన వారమని భావింపుము. ఇది నిజము. నిజము. ఇందు సందేహము లేశమైనను లేదు. ఆమె నాకు వచించిన శ్లోకార్థమే మహాభాగవత పరమ సారము. ఆ యర్థశ్లోకమే రాబోవు ద్వాపరయుగాదిని వ్యాసభగవానునిచే భాగవతముగ వ్రాయబడును."

వ్యాసుడిట్లనియె : "ఆ మహామంత్రమును విష్ణువునుండి బ్రహ్మ గ్రహించి తన తనయుడగు నారదునకు సమ్మతితో నుపదేశించెను. నారదునివలన నేను విని దానిని పండ్రెండు స్కంధముల శ్రీమహాభాగవతముగ విస్తరించితిని. ఆ పురాణము బ్రహ్మ సమ్మితము. అది పంచలక్షణ లక్షితము. శ్రీదేవీ మహిమాన్వితమునై యలరారును. అది తత్త్వజ్ఞాన రసామృతము - సర్వోత్తమము - ధన్యము - పుణ్యము - ధర్మశాస్త్రసమము - సాహితీరససంభరితము - వేదార్థప్రతిపాదకము. వృత్రాసుర కథాభరితము - నానాఖ్యానక సంకలితము-బ్రహ్మవిద్యా నిధానము-సంసారార్ణవతారకము. ఓ మహామతీ! ఓ పురుషవర్యా! నీవా పరమపుణ్య పురాణ మెఱుంగుము. దానిని చదువుట కెల్ల విధముల నీవే యోగ్యుడవు. అది పదునెనిమిదివేల శ్లోకములతో కూడి అజ్ఞానపుకఱకు చీకట్లకు దివ్యజ్ఞానభాస్కర శుభోదయమైనది. సుఖశాంతులు వర్ధిల్లచేయును. దన్యము. దివ్యము. శివంకరము. విను-చదువు-వారలకు చిరాయుఃపుత్త్రపౌత్ర సౌభాగ్యముల చేకూర్చును. సూతుడు రోమహర్షణసుతుడు అతడు పరమధార్మికుడు. నా ముఖ్య శిష్యుడు. అతడు నీకు తోడుగా నీపుణ్యపురాణసంహిత పఠించగలడు.

సూతుడిట్లనియె : ఈ విధముగ వ్యాసుడు తన పుత్త్రునకు దెలుప నతనితోబాటు ఈ విశాలపురాణ సంగ్రహతత్త్వ మెఱిగితిని. శుకుడును దీనిని గ్రహించి వ్యాసాశ్రమమందే యుండెను. కాని బ్రహ్మకు పుట్టని యపరనారదునివలె యతడు ఆత్మశాంతిని బడయకుండెను. ఆత డేకాంతప్రియుడయ్యెను. విషయశూన్యునివలె దోచుచుండెను. తన యునికిలోనే తానుండెను. అతనికి భోజనము రుచించకుండెను. ఉపవాసమనిన నిష్టమేలేదు. ఇట్లాత్మ చింతాపరవశుడగు తన సుతునిగని వ్యాసుడిట్లు పలికెను: 

"కుమారా! నీవింత వింతగ ఏల యేకాగ్రతతో నదేపనిగ నూరక విచారించుచున్నావు? ఋణగ్రస్తుడైన కటికదరిద్రుడు చింత్రాగ్రస్తుడగును. నీవునట్లే యేదో పరధ్యానమందున్నావు. నీ తండ్రినగు నేను బ్రతికియే యుండగ నీకీలేనిపోని లోని చింతయేల? నీవు కోరినకోర్కులన్నియు తనివార ననుభవింపుము. మదిలోన శోకముడుగుము. శాస్త్రోక్తజ్ఞాన మెఱుగుము. హృదయాంతరజ్యోతివలె విజ్ఞానమయుడవుగమ్ము. నా యీ మాటలవలన నీకైకాంతిక శాంతి చేకూరనిచో మిథిలకేగి జనకుని సన్నిధానము జేరుము. ఆ జనకుడు విదేహుడు - ధర్మమూర్తి; సత్యసంధుడు. జనకనామమున ప్రసిద్ధికెక్కెను. అతడే నీలోని మోహపు మంచుతెరలను పటాపంచలు చేయగలవాడు. నీవా రాజునుజేరి నీలోని సందేహమును బాపుకొనుము. అతనితో యథాయోగ్యమైన వర్ణాశ్రమధర్మములగూర్చి ముచ్చటించుము. అతడు రాజర్షి; జీవన్ముక్తుడు. బ్రహ్మజ్ఞానమూర్తి-శుచి-యథార్థవాది. సత్యవస్తునిష్ఠుడు. సిద్ధయోగరతుడు. బ్రహ్మతేజోబలమున మహోజ్ఞ్వలుడు. నిరంజనుడు."

ఆ మహాతేజస్వియగు వ్యాసుని వచనము లాకర్ణించి అరణిజుడగు శుకుడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను : ఓ జనకా ! నాకా జనకుడు దంభాచారిగ దోచుచున్నాడు. ఏలయన, ఆ విదేహుడు జీవన్ముక్తుడుగద! మరి సుఖశాంతులతో నెట్టు రాజ్యమేలుచున్నాడు? నాకతడు వంధ్యాపుత్రుడుగ దోచుచున్నాడు. కానిచో విదేహుడు బ్రహ్మజ్ఞాని రాజ్యమెట్లు ఏలగలడు? ఇది నాకు అద్భుతమును గల్గించుచున్నది. ఈ దురంతమైన మాయా సంసారసాగరమందు నీటియందలి పద్మమువలె నా విదేహరాజెట్లు మనుగడ సాగించుచున్నాడు? విదేహ జనకుని విషయమున నందియము నాకే లొకోకలుగుచున్నది. ఆతని ముక్తిబౌద్ధుల నాస్తికత్వమువంటిదేనా? ముక్తుడు అముక్తుడెట్లగును? కర్త అకర్తయెట్లగును? ఇంద్రియ వ్యాపారముల బెడద నెట్లు వదలించుకొనవచ్చును. తల్లి-కొడుకు-భార్య-సోదరి-వారాంగన-వీరిలో పరస్పరము భేదములు గలవు గదా? ఇన్ని భేదములుండగ నభేదమైన ముక్తియెట్లు సాధ్యము? చేదు కారము వేడిమి తీపి ఉప్పు మొదలగువానిలోని రుచిని నాలుక తెలిసికొని తృప్తిజెందును. శీతోష్ణములు సుఖదుఃఖములు ననుభవించుచున్నంతకాల మాత్మముక్తి యేరీతి గల్గును? ఇదంతయు విడ్డూరమే. నాకెందులకో యిందు అద్భుతమగు సందేహము గల్గుచున్నది. వీడు శత్రువనుకొనినచో వైరము పెరుగును. వీడు మిత్రుడనుకొనినచో ప్రేమ గలుగును. మరి యారాజు ద్వంద్వముల నడుమ నుండుచు నిష్క్రియుడై యెట్లు మనుచున్నాడు? ఆ రాజు చోరుని తాపసుని నొకే రీతిగ నెట్లు చూడగలడు? బుద్ధితో స్థితప్రజ్ఞత సమతలేనిచో ముక్తి యెట్లు గల్గును? జీవన్ముక్తుడైన నరపతిని నేనింతవఱకును చూడలేదు. ఇంటియందే యుండుచు ముక్తుడయ్యెననగ నాకిందేదో సందేహము తోచుచున్నది. ఆ జనకుని గుఱించి నీవింతగ వింతగ జెప్పుటవలన నాకతనిని చూడవేడుకగుచున్నది. నా సందేహము బాపుకొనుటకు మిథిలకేగగలను.

అధ్యాయము 17 శ్రీ శుకుడు మిథిలకు జనుట

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 19 Sri Sukuni's married life - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడ...