Friday, April 10, 2026

Chapter 15 The influence of Sri Shakuni's dispassion - అధ్యాయము 15 శ్రీశుకుని వైరాగ్య ప్రభావము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 15

శ్రీశుకుని వైరాగ్య ప్రభావము

శ్రీ
శుకుడి డిట్లు పలికెను: తండ్రీ! ఎల్లభంగుల దుఃఖమూలమైన గృహస్థాశ్రమమును నేను స్వీకరింపజాలను. వలత్రాళ్లవలె నిది దేహుల కురివంటిది. ధనాశాపీడితు లాత్మసుఖమునకు నోచుకొనరు. లేనివాడు పేరాసగలవాడు తన కుటుంబము వారిచేతనే బాధింపబడును. ఏ కోర్కెలునులేని బిచ్చగాడు పొందు సహజ సుఖము నింద్రుడు సైతమందజాలడు. త్రైలోక్యభోగ్యములు బొందినప్పటికి ప్రాణులు సుఖింపజాలరు. దేవేంద్రుడంతటివాడే తపించు తాపసులనుగాంచి దుఃఖితుడై యీసున వారికి బహుభంగుల భంగములు గల్గించుచుండును బ్రహ్మయు నిత్యానందరహితుడే. శ్రీహరియును తన మనోహారిణి యగు శ్రీ మహాలక్ష్మిని చేపట్టినప్పటికిని రక్కసుల యక్కడగించుచు మాటిమాటికి ఖేదపడుచుండను. ఆ శ్రీమంతుడగు విష్ణువెన్నియో యిక్కట్టులకు గురియై కఠిన తపమాచరించెను. శ్రీపతియే యిట్లుండ నిక సామాన్యుల గతి యెట్లుండును? రుద్రుడు సతతము తపము చేయుచు రాక్షసులను చెండాడుచునుండును. అతడును పాపమెన్నియో వెతలకు గురి యగు చుండును. కలవానికి భయమున కంటినిండుగ కూర్కురాదు. ఇక లేనివాడులేనవాడే గద! వాడు సుఖమునకు మొదలే నోచుకొనలేదు. నీ కౌరసపుత్త్రుడనగు నన్నే నీవీ ఘోరనరకతుల్య సంసారమందే మునుగుమని యేల నియోగింతువు? ఎల్ల ప్రాణులకు మాటిమాటికి జన్మదుఃఖము జరాదుఃఖము మరణదుఃఖము మలమూత్రమయమగు గర్భవాసమున దుఃఖము గల్గుచుండును.

మహాలోభిత్వమును దురాశయు దుఃఖము చేటు. యాచన మరణదుఃఖముకంటెను చేటును బాధాకరమునైనది. విప్రులు ప్రతి గ్రహమువలననే తమ జీవితములు వెళ్లబుత్తురు. వారు బుద్ధిబలముగల జీవులుగారు. పరాశ పరమదుఃఖము. అది దిన మొక గండమువంటిది. ఎల్ల వేదశాస్త్రార్థములను చక్కగ తుదిముట్ట చదివిన పండితప్రకాండులే ధనమదాంధుల పజ్జచేరి వారిని పెక్కు రీతుల పై కెత్తుచు పొట్టపోసికొందురు. ఈ జానెడు చిఱుతపొట్టకింత చింత యెందులకు? దీనిని ఫలాదులతో ఆకులములతో నేదేనుపాయముతో నింపి తనపవచ్చును. 

తండ్రీ ! భార్యవలన కొడుకులును వారివలన మనుమండ్రును పుట్టుదురు. కుటుంబపు భారము పెద్దదగును. వారి పోషణభారము దుఃఖభారమగును. ఇక నాత్మసౌఖ్య మెక్కడిది? ఓ తండ్రీ! కావుననే భేదాలు మాయామోహాలు పుణ్యపాపాలు లేని పరిపూర్ణము సత్యవస్తునిష్ఠము నగు బ్రహ్మకాండను యోగ శాస్త్రమును గుఱించి నాకు దెలుపుము. విభేదాలు పుట్టించునట్టి కర్మ బాహుళ్యమందు నా మదియెన్నడును చొరకున్నది. కర్మలు ప్రారబ్ధము సంచితము వర్తమానమునని మువ్విధములు గద! అది సమూలముగ క్షయించు తెఱంగెఱింగింపుము. జవరాలు జలగమాదిరి నరజాతి వీర్యమంతయును పీల్చిపిప్పి చేయును. ఆ వలపులాడి వన్నె చిన్నెలకు మత్తచిత్తుడైన నరుడీ విషయము నెఱుగనేలేడు. స్త్రీలు భోగములతో ధన వీర్యములను కుటిలవచనములతో మనస్సును మరింతురు. అట్టి స్త్రీ నెవడుకోరును? మూర్ఖుడే భార్యను చేపట్టును. సౌఖ్యము బోగొట్టుకొనును. ఫలితముగ మిగులునది దుఃఖమేకాని సుఖముగాదు. ఇట్లు మూర్ఖుడు విధిలీలకు మోసపోవును.

సూతుడిట్లనియె : అని శుకుడు విరాగియై పలుకు ఈ పలుకులు విని వ్యాసుడు చింతాగ్రస్తుడై యిపుడేమి చేతునని తలపోయసాగెను. వ్యాసుని కన్గొలకులు దుఃఖముచే చెమర్చెను. నెమ్మేను గడగడలాడెను. మనస్సు గ్లానమయ్యెను. ఇట్లతి దీనముగ శోకాతురుడై వెతలబొగులు వ్యాసునకు వింతగదుర విప్పాదిన నేత్రములతో శుకుడిట్లు పలుక దొడగెను: 

"ఆహా! ఈ మాయ యెంత బలవత్తరమైనది! ఇది వేదాంతకారుడు వేదసమ్మతుడు వేదవిదుడునైన పండితోత్తమునిగూడ మోహింపజేయుచున్నదే! ఆ మాయ సత్యవతీసుతుడు విద్వాంసుడునైన వ్యాసునకుగూడ మోహము గల్గించుచున్నది. కనుక మాయ దుస్త్యజ. ఆ మాయ రూపెట్టిదో యెతవారికిని దెలియరాదు. వేదవిభాగకర్త విపులపురాణవక్త భారత గ్రంథ నిర్మాతయగు వ్యాసుని సైతము మోహభ్రాంతి యావరించెనే! కావున నే యద్భుతశక్తి యీ ముజ్జగములను పెనుభ్రమలో ముంచెత్తునో యే యత్కృష్టశక్తి బ్రహ్మవిష్ణుహరులను సైతము మోహపెట్టునో నేనా పరాశక్తినిపుడు శరణు వేడుచున్నాను. ఆ శక్తిచే అంతటివారే మోహితులుగా నితరు లెంతటివారలు? ఆ మహాద్భుతమాయాశక్తి బ్రహ్మవిష్ణుమహేశ్వరులనే మోహింపజేసినది. ఆ మహాశక్తికి వారే తలలు వంచిరి. ఇక నాశక్తి భ్రమలో పడనివాడే లేడు. ఆహా! ఆ సర్వశక్తి వీర్యపటిమ యెంతన వలయును! ఆ శక్తి తేజోబలమెంతని చెప్పగలము!! ఆ శక్తులు మహాద్భుతశక్తులు. ఇంత యేల? సర్వజ్ఞుడగు శంకరుడే శక్తియుక్తుడు గానిచో నేమియు చేయజాలడు గద! వ్యాసుడు విష్ణ్వంశసంజాతుడని పౌరాణికులు నుడువుదురు. మరి యంతటివాడే భగ్ననౌకలోని వ్యాపారివలె మోహసాగరమందు మునిగిపోయెనే! ఈ సమయమందే వ్యాసుడే ప్రాకృతమనుజుని పగిది వివశుడై కన్నీరొలుక బోయుచున్నాడు. 

పండితులు సైతము మాయాబలమునుండి విముక్తులు కాజాలరు. నేనెవరను? ఇతడెవరు? ఈ వీడనిభ్రమ యెక్కడిది? ఈ తండ్రికొడుకుల వాసనల సంబంధ మీ పాంచ భౌతిక దేహమునకు మాత్రమే యుండును. ఈ మాయశక్తి యెంతయో బలవత్తరమైనది. ఇది మాయికులను సైతము తన మాయలో ముంచివేయును. వ్యాసుడంతటి వాడే నేడు మాయామోహునకు వశుడై పలవరించుచున్నాడు.

సూతు డిట్లనియెను : అంతట శుకుడు సకల దేవతలకే మాతృ దేవతయు బ్రహ్మాదుల కీశ్వరియు సకల కారణ కారణయునగు దేవిని నెమ్మదిలో భావించి నమస్కరించెను. పిదప నరణి సంజాతుడగు శుకుడు మోహసాగరమున మునింగిన తన తండ్రి వ్యాసునకు సహేతుకములుగ బ్రహ్మవాక్కులు ఇటులు పలికెను : 

"ఓ మహామనీషీ ! ఎల్లరకు నీవే తెలియజెప్పువాడివే! నీవే యిప్పుడొక సామాన్యుని పగిది విషాదమునంద నేల! ఇపుడు మాత్రమే నేను నీ కుమారుడను. వెనుకటి జన్మలో నీవెవరవో నేనెవరనో యెఱుగము. సర్వాత్మదృష్టితో చూడగా దండ్రికొడుకుల సంబంధము భ్రమ మాత్రమే యగును. ఆత్మధైర్యము బొందుము. సావధానుడవు గమ్ము. డెందమందు దౌర్బల్యమందకుము. ఇదంతయును మోహజాలమని గుర్తెఱుంగుము. వైక్లబ్యమందకుము. తినుటవలన నాకలి చల్లారును. త్రాగుటవలన దప్పిక తీరును. కాని పుత్త్రదర్శనమున నాకలి దప్పికలు తీరవు. నెత్తావి వలన ఘ్రాణతర్పణము గల్గును. మంచి వినికిడిచే చెవికింపగును. స్త్రీ వలన కామసుఖము లభించును. నేను నీ కొమరుడనే. ఐన నా వలన నీకేమి సుఖము గలదు? 

పూర్వ మజీగర్తుడు తన కొమరుని హరిశ్చంద్రునకు యాగపశువుగ వెలకమ్మెను. ద్రవ్య మెల్లసుఖములకు సాధనము. ఈ ధనమువలన సుఖములు గల్గును. నీకు స్వార్థబుద్ధిగలదేని డబ్బు సంపాదించుము. నేను నీ కొమరుడనే. ఐన నా వలన నీకేమి సుఖము గలదు! నీవు దైవజ్ఞుడవు. కావున నన్ను స్థిత ప్రజ్ఞుని చేయుము. నన్నీ గర్భవాసనరకమునుండి విముక్తుని జేయుము. ఇది కర్మభూమి. ఇట మనుజ జన్మ కడుంగడు దుర్లభము. అందు నుత్తమకులమున బ్రహ్మతత్త్వ మెఱింగిన బ్రాహ్మణుడై జన్మించుట యెంతెంతో దుర్లభము. నేను వేరు - బ్రహ్మము వేరు అను భేదభావమున బద్ధుడనైతిని. నన్నీ భేదబుద్ధి వీడుట లేదు. ఇట్టి సంసారవాసన ముసలితనమందును వదలక అంటిపెట్టుకొనియే యుండును.

సూతు డిట్లనియె : ఈవిధముగ సర్వకర్మ సంన్యాసమునే చిత్తమందిచ్చగించు శాంతుడగు శుకుని వ్యాసుడిట్లు ప్రబోధించెను: 

"మహాభాగ! నీవు నా వ్రాసిన శ్రీ మహాభాగవతము చదువుము. ఆ పురాణము బ్రహ్మసమ్మితము. అనతి విస్తృతము. అది పండ్రెండు స్కంధములతో పంచలక్షణములతో సకల పురాణముల కలంకార ప్రాయమై అలరారుచున్నది. అది నా మదికెంతయో ప్రియమైనది. ఆ భాగవతమొక్కసారి విన్న మాత్రమున సదసద్వివేకము ప్రత్యక్ష జ్ఞానము విజ్ఞానము గల్గును. కావున నీవు దానిని శ్రద్ధగ చదువుము. 

పూర్వము పాలసంద్రముపై పటప్రతముమీద పరుండియున్న బాలరూపుడగు శ్రీవిష్ణువు తనలో నేనే సచ్చిదానందరూపముచేత నీ బాలరూపమందితిని. నేనే నిత్యవస్తువువలన నీ రీతిగ జన్మించితిని. ఈ సర్వవిశ్వము నేనెట్లు దెలిసికొనగలను? అని తలంచెను. అంతలోనే దయామయియగు భగవతి సకలార్థసాధకమైన వాక్యమును శ్లోకార్థమున నిట్లు పలికెను : 

'ఈ కనంబడు జగమంతయు నేనే; పూర్ణఘనానందమున నిండియున్నాను. నాకన్న మిన్నయగు సనాతన వస్తువు మరేదియును లేదు.' విష్ణువు నెమ్మదిలో ఈ ధ్వని యెవరిదో ! ఈ పలికినది నరుడా? నారియా? పేడియా? నేనెట్లు గుర్తించగలనని విచారించెను. ఆ శ్లోకార్థరూపమగు భాగవతమునే అతడు తన యెడదలో మననము చేయదొడగెను. ఆ బాలుడా వటపత్రమందే పరుండి మాటిమాటికి నా దేవి పలికిన వాక్యార్థము విషయమును తన హృదిలో నాలోచించు చుండెను.

అంతట నా భగవతీ దేవి విష్ణునకు ప్రత్యక్షమయ్యెను. ఆ దేవి శంఖము చక్రము గద పద్మము వరాయుధములు దాల్చి తేజరిల్లు సత్యస్వరూపిణి. చతుర్భుజ. దివ్యాంబరధారణి-దివ్యభూషణ భూషిత-తన దివ్యవిభూతులను బోలిన నెచ్చెలులతో గూడి అచ్చెరువుగ నుండెను. ఆ దేవి తన ప్రసన్న వదనమున చిరునగవుసిరులు చిందులాడగ శ్రీమహలక్ష్మీరూపముతో తేజోనిధియగు విష్ణుని సన్నిధిని ప్రత్యక్షమైనది. 

సూతు డిట్లనియె : ఆ మున్నీటియందు నిరాధారయై కలుములీను కమలను మనోరమను శ్రీవిష్ణువు తన హృదయకమలము నిండుగ దర్శించి విప్పారిన నయనకమలములతో నొప్పారెను. అపుడు రతి భూతి బుద్ధి మతి కీర్తి స్మృతి ధృతి శ్రద్ధ మేధ స్వధ స్వాహా క్షుధ నిద్ర దయ గతి పుష్టి తుష్టి జృంభ తంద్ర క్షమ లజ్జ మున్నగు దివ్యశక్తులా శ్రీమహారాజ్ఞికి నల్గడలం జేరి ప్రేమ నివాళు లర్పించుచుండిరి. వారిలో ప్రతి యొక్కరును దివ్యవరాయుధములు నానా దివ్యభూషలు మందారమాలికలు జాతిముత్యాలహారాలు దాల్చి దివ్యశోభలు వెలార్చుచుండిరి. మహాసాగర మధ్యమం దా దివ్యాంగనలను కలయ వీక్షించిన జనార్దనుని డెందమాశ్చర్యపులకితమయ్యెను. ఆ విశ్వభూతాత్మకూడా మహామాయకచ్చెరువంది యిట్లు తలంపసాగెను: 

"ఈ యందచందాలు విరజిమ్ము కాంతలెక్కడి వారలొకో! ఈ మఱ్ఱియాకు సెజ్జపై నున్న నేనెక్కడి వాడనో! ఇది అంతుపంతులేని మహాజలరాశియే. ఇందీ మహావటవృక్షమునకు కారణమేది? నేనెవరి మూలమున నిటుల ముద్దులుగారు బాలుడనై యుంటిని? ఈ దేవి నాకు జననియా! లేక దురంతమైన మాయయా!! ఏ కారణమున పుణ్యవిశేషమున నా కీమె దర్శనభాగ్యము చేకురినదో! నేనిపుడేమి పలుకవలయును? ఎట కేగవలయును? బాలభావముననే యప్రమత్తుడనై మౌనభాషతో నుండవలయునా?"

అధ్యాయము 16 వ్యాసుడు శుకునకు శ్రీదేవీ భాగవత ముపదేశించుట

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 19 Sri Sukuni's married life - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడ...