హిరణ్యాక్షుడు
హిరణ్యాక్షుడు అంటే బంగారం వంటి కన్నులు కలవాడని అర్థం.
హిందూ పురాణాలలో పేర్కొన్న ఒక రాక్షసుడు. ఇతను భూమిని ముంచివేసి, ముల్లోకాలను భయకంపితులను చేశాడు. ఇతన్ని దశావతారాలలో ఒకటైన వరాహ అవతారం సంహరించి భూమిని రక్షించి లోకాలలో శాంతిని స్థాపించాడు. ఇతని సోదరుడు హిరణ్యకశిపుడు.
పురాణ కథనం
జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. ఒకమారు సనకసనందనాది మునులు నారాయణ దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణులోకానికి దూరమయ్యెదరని శపించారు. అప్పుడు వారు శ్రీ మహా విష్ణుఫును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గానీ, విరోధులుగా 3 జన్మలుగానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను.
ఆ జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తృలుగాను జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారంచేత వధులై అనంతరం శాపవిముక్తి పొందారు.
హిరణ్యాక్షుడు దితి, కశ్యపుల పుత్రుడు. ఇతను బ్రహ్మ గురించి తీవ్ర తపస్సు చేసి దేవుడు, మనిషి, మృగాల చేత తనకు చావు రాకూడదని వరం సంపాదించాడు. ఈ వర గర్వంతో హిరణ్యాక్షుడు ఏ రక్షణ లేని భూమిని విశ్వాంతరాళ సముద్రంలోకి ఈడ్చుకుపోసాగాడు. దేవతలందరూ కలిసి భూమిని, జీవకోటిని కాపాడమని మహావిష్ణువును వేడుకున్నారు. వారి ప్రార్థనను మన్నించిన మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి తన కొమ్ముతో భూమిని ఎత్తి కాపాడాడు. అడ్డుకోబోయిన హిరణ్యాక్షుని వధించాడు.
హిరణ్యాక్షుని అన్నయైన హిరణ్యకశిపుడు కూడా తమ్ముని లాగే మరణం లేకుండా వరాలు పొందాడు. ముల్లోకాలను జయించి తన తమ్ముని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు.
No comments:
Post a Comment