Tuesday, June 30, 2026

Satkarmaphala nirupana - సత్కర్మఫల నిరూపణ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - సత్కర్మఫల నిరూపణ

ధర్మరాజా! ఏ సత్కర్మలను ఆచరిస్తే స్వర్గలోకం లభిస్తుందో తెలుసుకోవాలని ఉంది. వివరించి పుణ్యం కట్టుకో అని సావిత్రి మళ్ళీ అడిగింది. సమవర్తి సమాధానం చెప్పాడు.

సావిత్రీ! విప్రుడికి అన్నదానం చేసినవాడు మెతుకులన్ని సంవత్సరాలు శివలోకంలో నివసిస్తాడు. అదే ఇతరులకు చేస్తే అన్నదాన ప్రమాణంగా శివలోకంలో నివసిస్తాడు. అన్నదానంకంటే గొప్పదానం ఏ కాలంలోనూ మరొకటి లేదు. దీనివిషయంలో పాత్రతాపాత్రత పరీక్షగానీ కాలాకాలవిచారణగానీ లేవు ఇది అందరూ అందరికీ అన్నివేళలా చెయ్యదగిన ఉత్తమోత్తమదానం.

దేవతలకుగానీ బ్రాహ్మణులకుగానీ ఉచితాసనం దానం చేసినవాడు విష్ణులోకంలో అయుతవత్సరాలు నివసిస్తాడు. పాడి ఆవును విప్రుడికి ఇస్తే దాని రోమాలన్ని సంవత్సరాలు దాతకు విష్ణులోక నివాసం లభిస్తుంది. పుణ్యప్రదమైన రోజునచేస్తే నాలుగురెట్లు తీర్థప్రదేశంలోచేస్తే పదిరెట్లు అధికంగా పుణ్యం వస్తుంది. నారాయణక్షేత్రంలో చెయ్యగలిగితే నా ఫలం కోటిరెట్లు లభిస్తుంది. గోదానం చంద్రలోక ప్రాప్తిదాయకం. ఉభయముఖీ గోదానం విష్ణులోక ప్రాప్తికి సోపానం. శ్వేతచ్ఛత్రప్రదాతకు అయుతవత్సరాలు వరుణలోక నివాసం కలుగుతుంది. కప్పుకునేందుకు గుడ్డలేక బాధపడుతున్న విప్రుడికి వస్త్రయుగ్మం సమర్పిస్తే వాయులోకనివాసం ఫలం. నూతనవస్త్రాలు పెట్టి సాలగ్రామం దానంచేస్తే వైకుంఠంలో శాశ్వతనివానమే. శయ్యాదానం చంద్రలోక ప్రాపకం. దీపదానం వహ్నిలోకదాయకం. గజదానం చేస్తే ఇంద్రుడితో అర్ధాసనం పంచుకోవచ్చు. అశ్వదానం వారుణలోకప్రదాయి. శిబికాదానమూ ఆంతే. వ్యజనవాటికాదానాలు వాయులోక నివాసహేతువులు, ధాన్యరత్నాలు దాతృప్రతిగ్రహీత లిద్దరికీ వైకుంఠలోకావాసప్రదాలు. శ్రీహరి నామస్మరణ నిరంతరం చేసేవాడు చిరంజీవి అవుతాడు. మృత్యువు పారిపోతుంది. పున్నమివేళ శ్రీహరికి ఉయ్యాలసేవ చేసినవారు ఇహలోకంలో భోగభాగ్యాలు పుష్కలంగా అనుభవించి విష్ణుమందిరం చేరుకొంటారు. ఆక్కడ శతమన్వంతరాలు నివసిస్తారు. ఉత్తర ఫల్గుణిలో ఈ పనిచేస్తే రెట్టింవు పుణ్యం వస్తుంది. ఆతడు కల్పాంతజీవి అవుతాడు. తిలదానం శివలోకప్రదం. అటు పైని ఉత్తమజన్మ ఎత్తి సుఖవడతాడు. తామ్రపాత్రను దానంచేస్తే రెట్టింపుఫలం. సాలంకృత కన్యాదాత చంద్రలోకంలో పదునల్గురు ఇంద్రులు గడిచేదాకా అప్పరసలతో వినోదిస్తాడు. అటుపైని గంధర్వలోకానికి వెళ్ళి ఊర్వశితో క్రీడిస్తాడు. అటుపైని భూమికి అవతరించి అనుకూలవతిని భార్యగా పొంది సుఖిస్తాడు.

ఫలదానానికి శక్రలోకనివాసం ఫలం. ఆ తరువాత జన్మలో పండంటిబిడ్డ కలుగుతాడు. ఫలభారంతో వంగిన వెయ్యి చెట్లు లభిస్తాయి.

ధనధాన్య సమృద్ధితో గృహదానం చేస్తే శాశ్వతస్వర్గలోక నివాసమే. అటుపైని ధనధాన్యాలకు లోటులేని ఉత్తమజన్మ పంటతోపాటు పొలం దానంచేస్తే వైకుంఠలోక నివాసం ఫలం. తరవాత జన్మలో భూపాలుడవుతాడు. నూరు జన్మలవరకూ పరిపాలకుడవుతాడు. శ్రీమంతుడూ ధనవంతుడూ పుత్రవంతుడూ అవుతాడు. వజ్రదానం గ్రామదానాలకు లక్షమన్వంతరాలు వైకుంఠవాసం ప్రతిఫలం. పునర్జన్మల్లో లక్షగ్రామాలకు అధిపతి అవుతాడు. ఉద్యానాలతో తటాకాలతో సత్ప్రజానీకంతో విరాజిల్లే అందమైన నగరాన్ని దానంచేస్తే దశలక్షేంద్రకాలపర్యంతం కైలాసంలో నివసిస్తాడు. పునర్జన్మలో రాజేంద్రుడై అటువంటి దశలక్షనగరాలకు ఏలిక అవుతాడు. నూరు నగరాలతోకూడిన దేశాన్ని దానంచేస్తే కోటిమన్వంతరాలు వైకుంఠంలో విరాజిల్లుతాడు. పునర్జన్మలో జంబూద్వీపానికి అధినాయకుడు అవుతాడు. భూలోక దేవేంద్రుడుగా కీర్తి గడిస్తాడు. కోటి జన్మలదాకా ఈ భోగం ఉంటుంది. రాజరాజేశ్వరుడై కల్పాంతజీవి అవుతాడు. అతడు సాధికారంగా జంబూద్వీపాన్నే దానంచేస్తే ఈ పుణ్యఫలం నూరురెట్టు అధికంగా లభిస్తుంది.

పతివ్రతాశిరోమణీ! ఎంతెంత దానాలన్నా చేయనీ, జంబూద్వీపమే దానం చెయ్యనీ, ఈ దాతలందరికీ పునర్జన్మ తప్పదు. జన్మరాహిత్యరూపమైన ముక్తి కలగదు. ఒక్క దేవీ భక్తుడికి మాత్రమే అది సాధ్యం. అసంఖ్యాకంగా బ్రహ్మలు పుట్టడం గిట్టడం చూస్తూ శ్రీదేవీ సన్నిధిలో మణిద్వీపంలో ఆ భక్తుడు శాశ్వతంగా నివసిస్తాడు. పునర్జన్మ అంటూ అతడికి ఉండదు.

దేవీ మంత్రోపాసకులు శరీరాన్ని విడిచిపెట్టాక దేవీసారూప్యాన్ని పొంది జన్మ మృత్యు జరారహితులై మణిద్వీపంలో విరాజిల్లుతుంటారు. దేవీసేవ చేసుకుంటూ ఉంటారు. మిగతా లోకాలూ
లోకేశ్వరులూ దేవతలూ దేవేశ్వరులూ నశించడం పునరావిర్భవించడం కళ్ళారా చూస్తూ సాక్షిమాత్రులుగా నిలుస్తారు. అంతేకానీ వీరు నశించరు. పునరావిర్భవించరు. మణిద్వీపం శాశ్వతం. మణిద్వీపవాసులు శాశ్వతం.

కార్తికమాసంలో శ్రీహరికి తులసీదళం సమర్పించినవాడు యుగత్రయపర్యంతం హరిసన్నిధిలో నివసిస్తాడు. పునర్జన్మలో హరిభక్తుడు అవుతాడు. జితేంద్రియుడవుతాడు. అరుణోదయకాలంలో గంగాస్నానం చేస్తే ఆరువేలయుగాలపాటు హరిసన్నిధిలో ఆనందంగా గడిపి పునర్జన్మలో విష్ణుమంత్రాన్ని పాంది తిరిగి మళ్ళీ హరిసన్నిధికి చేరుకుంటాడు. మరింక అతడికి పునర్జన్మ లేదు. వైకుంఠంలో హరిదాస్యం చేస్తూ సారూప్యసిద్ధి పొందుతాడు. నిరంతరం గంగాస్నానం చేస్తే భూలోకంలో సూర్యుడిలా ప్రకాశిస్తూ అనంత అశ్వమేధఫలాలను పొందుతాడు. అతడి పాదధూళితో వసుంధర పావనమవుతుంది. జన్మ చాలించాక వైకుంఠంలో ఆచంద్రతారార్కంగా నివసిస్తాడు. పునర్ణన్మలో హరిభక్తుడై జీవన్ముక్తి పొందుతాడు. అటుపైని సూర్యుడై వెలుగొందుతాడు.

స్వాదువూ సుగంధభరితమూ అయిన జలాన్ని దానం చేసినవాడు కైలాస నివాసి అవుతాడు. పునర్జన్మలో వేదవేదాంగవేత్త అవుతాడు. వైశాఖమాసంలో సక్తుదానం చేస్తే శివసాయుజ్యమే ఫలం, కృష్ణాష్టమీవ్రతం ఆచరించినవారు శతజన్మ పాపవిముక్తులై వైకుంఠంలో ఆనందిస్తారు. పునర్జన్మలో కృష్ణభక్తులవుతారు. శివరాత్రివ్రతం పాటించినవారు కైలాసంలో శివుడి సన్నిధిలో సప్తమన్వంతరాలు వినోదిస్తారు. ఆరోజున శివుడికి బిల్వపత్రం భక్తితో సమర్పిస్తే శివసాయుజ్యం లభిస్తుంది. పునర్జన్మలో శివభక్తులవుతారు. సకలవిధ సంపదలతో తులతూగుతారు. పుత్రపౌత్రాభివృద్ది పొందుతారు. చైత్రంలో కానీ మాఘంలో కానీ శంకరుణ్ణి అర్చిస్తే కైలాసాన వేత్రపాణియై ప్రమథశేఖరుడై నర్తిస్తాడు. శ్రీరామనవమిని యథావిధిగా నిర్వహించినవారు సప్తమన్వంతరాలు విష్ణుసన్నిధిలో విరాజిల్లుతారు. పునర్ణన్మలో ధనవంతులూ సజ్ఞనులూ అవుతారు.

శరదృతువులో మహాదేవుణ్ణి మాంసనైవేద్యాలతో షోడశోపచారాలతో అర్చించినవారు సప్తమన్వంతరాలపాటు కైలాసంలో ఉంటారు. పునర్జన్మలో పుత్రపాత్ర ధనధాన్య సమృద్దులతో రాజరాజేశ్వరులవుతారు. శుక్లాష్టమినాడు మహాలక్ష్మిని భక్తిప్రపత్తులతో అర్చించి ఉత్తమోత్తమంగా షోడశోపచారాలూ చేస్తే గోలోకనివాసం లభిస్తుంది. పునర్జన్మలో రాజేశ్వరులవుతారు. కార్తిక పూర్ణిమ రోజున రాసమండలంచేసి గోపీగోపశతాన్నీ రాధాకృష్ణులనూ శిలాప్రతిమలుగా శిల్పించి భక్తితో ఆరాధించినవారికి గోలోకం కరతలామలకం. పునర్జన్మలో కృష్ణభక్తులై మళ్ళీ గోలోకం చేరుకుంటారు. కృష్ణసారూప్యం పొంది పార్షదులవుతారు. మరింకవారికి పతనం లేదు. శుక్షపక్షంలోగానీ కృష్ణపక్షంలోగానీ ఏకాదశీవ్రతం చేస్తే బ్రహ్మపర్యంతం వైకుంఠవాసం లభిస్తుంది. పునర్జన్మలో కృష్ణభక్తులై అటుపైని గోలోకం చేరుకుంటారు. మరింక తిరిగిరారు.

భాద్రపద ద్వాదశి రోజున ఇంద్రుణ్ణి పూజిస్తే అరవైవేల సంవత్సరాలు ఇంద్రలోకంలో భోగాలు అనుభవిస్తారు. ఆదివారంనాడుగానీ సంక్రాంతినాడుగానీ శుక్లపక్ష సప్తమినాడుగానీ సూర్యదేవుణ్ణి అర్చిస్తే అతడు నూర్యలోకనివాసి అవుతాడు. ఆరోగ్యవంతుడూ శ్రీయుతుడూ జ్ఞానిగా భారత భూమిలో పునర్జన్మ ఎత్తుతాడు. మాఘ శుక్షపంచమినాడు సరస్వతిని ఉపాసిస్తే షోడశోపచారాలూ భక్తితో సమర్పిస్తే మణిద్వీపనివాసి అవుతాడు. పునర్జన్మలో పండితకవి అవుతాడు.

గో భూ సువర్ణ దానఫలాలు లోగడ చెప్పానుగదా! హరినామాలను ఉచ్చరించినవాడు నామానికి ఒక యుగంగా విష్ణులోకంలో సుఖిస్తాడు. ఆదే నారాయణ క్షేత్రంలో చేస్తే కోటిరెట్లు అధికఫలం లభిస్తుంది. జీవన్ముక్తుడై పునర్జన్మలేని స్థితికి చేరుకొంటాడు. పార్థివలింగంగా నిరంతరం శివోపాసన చేసినవారు రేణువుకి సంవత్సరంగా కైలాసంలో నివసిస్తారు. పునర్జన్మలో భూమిపాలకులై కీర్తి గడిస్తారు. సాలగ్రామ శిలను అర్చించి ఆ జలాన్ని పుచ్చుకునేవారు వైకుంఠంలో శతబ్రహ్మపర్యంత కాలం ఉండి పునర్జన్మలో హరిభక్తులై తిరిగి వైకుంఠం చేరుకుంటారు. వారికింక జన్మలేదు. సకల తపస్సులూ సకలదానాలూ సకలవ్రతాలూ చేసినవారు చాలాకాలం వైకుంఠంలో భోగాలు అనుభవించి పునర్జన్మలో రాజేంద్రులై అటుపైని ముక్తులు అవుతారు. వీరికింక మరి జన్మ ఉండదు. సకల తీర్థాల్లోనూ మునిగి భూప్రదక్షిణం చేసినవారికి జన్మరాహిత్యరూపమైన ముక్తి లభిస్తుంది. పుణ్యక్షేత్రంలో అశ్వమేధం చేస్తే అశ్వరోమ పర్యంత సంవత్సరాలు ఇంద్రుడితో అర్ధాసనం అలంకరిస్తారు. రాజసూయానికి నాలుగింతల అధిక పుణ్యఫలం. ఈ యజ్ఞాలన్నింటిలోకీ దేవీయజ్ఞం శిరోరత్నం. తొలినాళ్ళలో త్రిమూర్తులూ దేవీయజ్ఞాలు చేశారు. దీనికి సాటివచ్చే యజ్ఞం ముల్లోకాలలోనూ లేదు. దక్షుడు ధర్ముడు కశ్యపుడు శేషుడు కర్థముడు మనువు ప్రియవ్రతుడు శివుడు సనత్కుమారుడు కపిలుడు ధ్రువుడు - వీరంతా దేవీయజ్ఞం చేసినవారే. ఇది సహస్రరాజసూయాలకంటే అధికంగా పుణ్యప్రదం. దీనికన్నా గొప్ప యజ్ఞం మరొకటి లేనేలేదు.

ఇది చేసినవాడు శతాయుష్కుడవుతాడు. జీవన్ముక్తుడవుతాడు. జ్ఞాని తేజస్వి అవుతాడు. విష్ణుభృత్యుడవుతాడు. దేవతలలో విష్ణుమూర్తిలా, వైష్టవులలో నారదుడిలా, శాస్త్రాలలో వేదంలా, మానవులలో బ్రాహ్మణుడిలా తీర్థాలలో గంగలా పవిత్రులలో శివుడిలా వ్రతాలలో ఏకాదశిలా పువ్వులలో తులసిలా తారలలో చంద్రుడిలా పక్షులలో గరుత్మంతుడిలా స్త్రీలలో ప్రకృతిలా రాధలా వాణిలా వసుంధరలా ఇంద్రియాలలో మనస్సులా ప్రజాపతులలో బ్రహ్మలా ప్రజలలో ప్రజాపతిలా వనాలలో బృందావనంలా దేశాలలో భారతదేశంలా ధనవంతులలో లక్ష్మిలా పండితులలో సరస్వతిలా పతివ్రతలలో దుర్గలా సౌభాగ్యవతులలో రాధికలా - యజ్ఞాలలో దేవీయజ్ఞం ఉత్తమోత్తమం. సర్వయజ్ఞ సర్వతీర్థస్నాన సర్వవ్రతాచరణ సర్వవేదపఠన భూప్రదక్షిణ సర్వదానకరణ ఫలంకన్నా దేవీయజ్ఞఫలం అత్యధికం. సాక్షాత్తు ముక్తిప్రదం. ఇది వేదశాస్త్ర పురాణాదులలో నిస్సంశయంగా నిరూపించబడిన అంశం. దేవీవర్ణన, దేవీధ్యాన దేవీస్మరణ దేవీస్తవన దేవీవందన దేవీమంత్రపఠన దేవీపాదోదకసేవన దేవీనైవేద్య భక్షణలు నిరంతరం చెయ్యాలి. అది సర్వవాంఛాప్రదం. అందుచేత ఓ సావిత్రీ! నిత్యమూ ఆ నిర్గుణ పరాప్రకృతిని ఆరాధించు. ఉపాసించు. నీ భర్తను తీసుకుని ఇంటికివెళ్ళి సుఖసంతోషాలతో జీవించు. తత్త్వజ్ఞానప్రదమైన కర్మవిపాకాన్ని బోధించాను. నీ సంశయాలు తీర్చాను. శుభమగుగాక! వెళ్ళిరా - అని ముగించాడు యమధర్మరాజు. 

నారదా! యమధర్మరాజు నోట ఇలా శక్తిసంకీర్తన విన్న సావిత్రీదేవి కన్నుల్లో ఆనందబాష్పాలు గుడుసుళ్ళు తిరిగాయి. తనువంతా పులకించింది. ధర్మరాజా! శ్రోతలకూ వక్తలకూ జన్మమృత్యుజరాహరమై సకలోద్దారకారణమైన శక్తి సంకీర్తనం వినిపించావు. సకల ప్రాణీకోటికీ ముక్తిప్రదమనీ సిద్ధిప్రదమనీ తెలియజెప్పావు. మిగతావి ఏవీ శ్రీశక్తి ఉపాసకుడిలో పదహారవ కళకైనా సాటిరావని గ్రహించాను. నువ్వు చెప్పిన ప్రకారం నేను ఆ దేవిని ఆరాధిస్తాను. దీనితోపాటు జీవుల శుభకర్మవిపాకం వివరించావు. మరి అశుభకర్మలవిపాకం మాట ఎమిటి? ఏ అసత్కర్మకు ఏ అసత్ఫలితం వస్తుందో నువ్వే తెలియజెయ్యాలి, నువ్వు వేదవిదాంవరుడవు. జ్ఞానివి. సకలప్రాణికోటిపట్లా సమవర్తివి. రాగద్వేషాలకు అతీతుడవు. అరిషడ్వర్గాన్ని జయించిన జితేంద్రియుడవు. నీ జన్మవృత్తాంతం నాకు తెలుసు.

యమాష్టకం


No comments:

Post a Comment

Yamashtakam - యమాష్టకం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - యమాష్టకం పూర్వకాలంలో సూర్యభగవానుడు పుష్కరక్షేత్రంలో తీవ్రతపస్సుతో బ్రహ్మమానసపుత్రుడైన ధర్ముణ్ణి ఆరాధించి నిన్...