Sunday, April 12, 2026

Chapter 38 Sridevi explaining the order of creation with the trimurthi - అధ్యాయము 38 శ్రీదేవి త్రిమూర్తులతో సృష్టి క్రమమును తెల్పుట

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 38

శ్రీదేవి త్రిమూర్తులతో 
సృష్టి క్రమమును తెల్పుట

బ్రహ్మ యిట్లనియె: నే నీ ప్రకారమున సవినయముగ ప్రశ్నింపగ మహామాయాదేవి భగవతి మధురభాషలతో నాతో నిట్లు పలికెను: 

ఓ బ్రహ్మా! వాస్తవమున సద్వస్తు వొక్కటియే కలదు. అదే బ్రహ్మము. రెండవది లేదు. ఆ బ్రహ్మమే నేను. నేనే బ్రహ్మము. మతి విభ్రాంతివలన శక్తిమంతులకు భేదమున్నట్లు గన్నట్టును. అది సరికాదు. కాని మా యిరువురి భేదమతి సూక్ష్మతమమై తెలియరాకుండును. దాని నెఱింగిన స్థితప్రజ్ఞుడే దుస్తర సంసరణమును తేలికగ దాటగలుగును. ఇందు సందియము లేదు. బ్రహ్మ మేకము. అద్వితీయము. నిత్య భావమును పొందును. ఒకే దీపకాంతి యుపాధి భేదములతో ననేక విధములుగ నొప్పును. ఒకే ముఖము పలు విధముల యద్దాలలో పలురీతుల ప్రతిబింబించును. అదే తీరున మేము విశ్వరూపములు దాల్తుము. ప్రపంచమంతయు ప్రళయ సమయమున మాయలో లయమగును. అది సృష్ఠికాలమున మరల భిన్నభిన్నముగ పొడగట్టును. ఈ భేదము దృశ్యమునను నిరు తెఱగులుగ నుండును. నాకు ప్రళయకాలమున స్త్రీ పున్నపుంసక భేదము లుండవు. మరల సృష్టి సమయమందీ వై విధ్యము గోచరించును. ఈ భేదమంతయును బుద్ధిచే గల్పింపబడినదే. ఈ వ్యక్తమగుచున్న ధృతి స్మృతి శ్రద్ధ బుద్ధి మేధ దయ కీర్తి శ్రీ క్షమ లజ్జ క్షుధ తృష్ణ క్షమ కాంతి శాంతి పిపాస నిద్ర తంద్రజం అజర విద్య అవిద్య స్పృహ వాంఛ శక్తి అశక్తి మజ్జ చర్మము వర్షము వాక్కు సత్యము అసత్యము పర పశ్యంతి మధ్యమ వైఖరి మున్నగునవియు వివిధ నాడులును నేనే. ఈ జగములందణువణువున నేనే వెలసియున్న దేవతను. నేను లేని వస్తువే లేదు. ఇది నిజమని చక్కగ నెఱుంగుము. అన్ని రూపములు నా శక్తి స్వరూపములే. నా యీ శక్తికి భిన్నముగ నేదే నున్నదేమో చెప్పుము. నా శక్తిచేతనత్వమే యీ సృష్టియందంతటను వ్యాపించియున్నది.

ఎల్లదేవతలందు నే నొక్కతెను పెక్కు నామ రూపముల నలరుచుందును. నేను శక్తి రూపముదాల్చి నా విక్రమము జూపుదును. బ్రాహ్మి వైష్ణవి రౌద్రి గౌరి శివ నారసింహి వాసవి వారుణి కౌబేరి మొదలుగాగల రూపములన్నియు నావే. సకల కార్యములుత్పన్నముగాగ నేను వానిలో ప్రవేశింతును. ఆ కారణమున నీ కార్యములన్నింటిని నేనే చేయింతును. నీటియందలి చల్లదనము అగ్నియందలి వేడిమి సూర్యుని యందలి ప్రకాశము చందురు నందలి చల్లని వెన్నెల నేనయి యొప్పుచున్నాను. నా శక్తి తోడులేనిచో బ్రహ్మ యణువంతగూడ కదలజాలడు. ఇక ప్రాణులమాట చెప్పనేల? ఇదంతయు నిజమని నీతో పలుకుచున్నాను. 

ఆ శివునియందు శక్తిలేనిచో నతడు దనుజులను దునుమాడ జాలడు. ఈ భూమిపై శక్తిరహితుని లోకులు చవట యందురు. అట్టి చవటను వీడు విష్ణుహీనుడనికాని రుద్రహీనుడనికాని లోకులు పలుకరు. మరేమన వీడు శక్తిహీనడని తెగ తెగడుదురు. పతితుడు స్ఖలితుడు భీతుడు శాంతుడు శత్రువశుడు నగువానిని జనము శక్తిహీనుడనునుగాని రుద్రహీనుడనరు. ఇంతకు నీ సృష్టికంతటికిని మూలకారణము శక్తియని యెఱుంగుము. నీవును శక్తియుక్తుడవైననాడే సృష్టికార్యము చేయజాలుదువు. అదేవిధముగ హరి శివుడు ఇంద్రుడు రవి చంద్రుడు అగ్ని వరుణుడు వాయువు యముడు శక్తిసంపన్నులై యెప్పుచున్నారు.

ఈ భూమిలో గొప్ప ధారణశక్తి గలదు. కాననే ధరణి సర్వమును మోయుచున్నది. కానిచో భూమి యొకచిన్న రేణువునుగూడ మోయజాలదు. అట్లే మహాశేషుడు కూర్మము దిగ్గజములు మున్నగువాని యందలి భరించు శక్తి నాదే. ఆ శక్తి వలననే వారు సర్వము భరించి సర్వకార్యములు సాధింప సమర్థులగుచున్నారు. నేను నీరుగ్రోలినచో నెంతటి పెనుమంటలైన చల్లారిపోవును. నేనే తలచుకొన్నచో గాలినెక్కడికక్కడ స్తంభింప జేయగలను. కావున దైవతత్త్వమువలన సత్తులుగ భావించి యెన్నడును సందేహింపరాదు. 

ఏ వస్తువునకైన ప్రాగభావము ప్రధ్వంసాభావము గలుగవచ్చును. ఎట్లన మట్టిముద్దయందు కుండ ఘటరూపముగనబడదు. ఇపుడిచట భూమిలేదు. ఈ భూమి యెచట గలదని విచారింపగ నది పరమాణురూపమున నెచటనో కలదని తెలిసికొనవలయును. ఈ జగము శాశ్వతము క్షణికము శూన్యము నిత్యము అహంకారయుతమునను సప్త భేదములతో నుండును. పరమేష్ఠీ! ఇపుడు నీవీ మహత్తత్త్వము స్వీకరింపుము. దీనినుండి యహంకారముత్పన్నమగును. దానివలన వెనుకటివలె సర్వభూతసృష్టి కొనసాగింపుము. ఇపుడు మీరు మీమీ లోకములు నిర్మించుకొని యందు సుఖనివాసము చేయుడు. మీమీ కార్యములను యథాయోగ్యమున దైవ ప్రేరితముగ కొనసాగింపుడు. నీవీ మహాసరస్వతీ శక్తిని పరిగ్రహింపుము. ఈమె సురూప- రజోగుణాత్మిక - చారుమృదుహాసిని. శుభవస్త్రాన్విత దివ్యసంస్కృతభూషణ వరాసనాసీన. ఈమె నీ సహధర్మచారిణియై నీ విలాసములందు నీకు చేదోడు వాదోడుగ నుండగలదు. ఈమె నావాగ్విభూతి. ఈమె నెన్నడు నవమానింపకుము. సరసధ్వనిగ విశ్వమాన్యగ విశ్వపూజ్యగ విశ్వప్రియగ భావింపుము. నీవీమెనుగూడి సత్యలోకమేగుము. సర్వవిధముల ప్రజల నందుండి సృజింపుము. జీవులందరును తమతమ కర్మానుసారముగ కారణరూపముననుందురు. తమతమ వెనుకటి కర్మలతో లింగకోశమునందున్న జీవులను తగినకాలమునందు మునుపటివలెనే మరల సృజింపుము.

అన్ని జీవులను వాని స్వభావము-కాలము-కర్మమునకు దగినట్లుగా పూర్వమువలె మరల సృష్టించుము. ఈరీతి నీరేడులోకములను విరచించుము. శ్రీమహావిష్ణువు సత్వగుణ ప్రధానుడు. అందువలన నతడు నీకంటె శ్రేష్ఠుడు. నీకెల్ల వేళల మాననీయుడు పూజనీయుడునగును. నీవు దుస్తరకార్యము లొనరించినప్పుడెల్ల హరి ధర్మసంరక్షణ కవతరించును. అ జనార్దనుడు నరతిద్యగ్యోనులందు జన్మించి దానవులను వినాశమొనరించుచు సాధువులకు పరితోష మొనరించుచుండును. 

మహాబలశాలి యగు శివుడు నీకు తోడుగనుండును. అపుడు నీవీసకల ప్రపంచములను సృజియించి స్వేచ్చగా విహరింపుము. బ్రాహ్మణక్షత్రియ వైశ్యులు విధివిధానముగ సమభావముతో భూరిదాన దక్షిణలతో మీ యాగములొనరింతురు. దేవతలు యాగములందమృత మధురమైన నా నామ జపమొనరించుచు సంతుష్టలైయుందురు. సోముడగు పరమశివుడు తమోగుణ ప్రధానుడు. అతడెల్ల యాగములందు పూజ్యుడు మాన్యుడునగుచు మహారుద్రాభిషేకములందు కొనుచుండును. దేవతలకు దైత్యులవలన నుపద్రవములు సంభవించునపుడెల్ల నా దివ్యశక్తులెల్లెడల నుత్పన్నములై సురలకు భయము బాపి యసురుల పీచమడంచును. వారాహి నారసింహి వైష్ణవి గౌరి సదాశివ మున్నగువారు నా శక్తి స్వరూపిణులు, లోకాతీత కార్యము, లొనరింపజాలుదురు. ప్రణవాత్మకమైన నా గుహ్య నవాక్షరమంత్రమును సబీజముగ ధ్యానయుతముగ నిరంతరము జపించుచు నీ పనులన్నియు చక్కబెట్టుకొనుచుండుము. ఈ మంత్రరాజము సర్వమనోరథములు నెరవేర్పగలదు. దీనిని చక్కగ నేమఱుపాటులేక హృదయంబున నిలుపుకొనుము."

అని యిట్లు జగనాత్మ బ్రహ్మతో బలికి పిదప లేతనగవున సుధలు చిందగ హరితో నిట్లు పలికెను: 

"ఓ విష్ణూ! నీ వీ మనోహరయగు రమాదేవిని గైకొని చనుము. ఈ యమ నీ వక్షఃస్థలమును నివాసముగ జేసికొని వసించును. ఈమె సిరిసంపదలకు పెన్నిధి. నీ విలాసార్థ మీ కల్యాణిని నీ కొసంగితిని. ఈమె లోకాలకు దీపాంకుర. ఈమెను నీ వేనాడును దూలనాడకుము. మన్నించి గారవింపుము. నేను మీ కిట్లు యోగము విధించితిని. దీనికి తిరుగులేదు. దేవతల మనుగడకు యజ్ఞములు విధించితిని. మీలో మీరలు పోట్లాటలు మాని క్షమతాసమతలతో వర్తింపుడు. నీవు సదాశివుడు బ్రహ్మయును నా స్వాంశవలన జన్మించితిరి. మీర లెల్లవారలచేత మాననీయులై నిత్యపూజ లందుకొందురు. ఇందు ఆవంతయు సందియము లేదు. మీ మువ్వురి యెడలను భేదము పాలించు మూఢమతులు నరకముల పాలగుదురు. ఇది ముమ్మాటికి నిజము. శివుడే స్వయముగ విష్ణువు. విష్ణువే స్వయముగ శివుడు. వీరికి భేదము గలదను వారు నిశ్చితముగ నరకయాతన లందగలరు. బ్రహ్మను సైత మిటులే యభేదభావమున గాంచవలయును. హరీ! ఇంక గుణభేదములయందలి యంతరము చెప్పుదును వినుము. ఆ పరమాత్మను తన యెదలో జింతించుటకు సత్త్వగుణము కావలయును. నీకు రజస్తమస్సులు ప్రధానమైనవి గావు. పలు వికారములు భేదములు గలిగినప్పుడు రజోగుణముతో ఈ లక్ష్మితోగూడి వర్తింపుము. వాగ్బీజము మాయాబీజము కామబీజమునను త్రిబీజములుగల మంత్రము సకలార్థప్రదాయకము. దీనిని నీకు ప్రసాదించితిని. ఈ దివ్యప్రణవ మంత్రమును గ్రహించి పాటించి నియమించి జపించుము. యథాసుఖముగ సంచరింపుము. నీ కిక మృత్యుభయముగాని కాలభీతికాని కలుగనేరదు.

నే నీ మాయాశక్తితో విహరించు నంతకాలము జగము లుండును. తుద కీ చరాచరవిశ్వము నాయందు లయ మందును. ఆనాడు మీరును నాయందే లయమందుదురు. అంతదనుక కామదము ముక్తిప్రదమునైన నా యీ రహస్యమంత్రమును నిత్యము జపించుచుండుము. శుభములు బడయగోరువాడీ మంత్రమునకు పణవము జేర్చి జపింపవలయును. నీ వింక వైకుంఠము నిర్మించుకొని యందు సుఖనివాస మొనరించుచుండుము. సనాతన భగవతినగు నన్నును చింతించుచు స్వైరవిహారము సల్పుము." అని త్రిగుణ ప్రకృతి యగు పరాభట్టారికా దేవి వాసుదేవునితో బలికె నని బ్రహ్మ పలికెను. 

పిదప ఆ నిర్గుణ స్వరూప శంకర భగవానునితో నమృతము గురియుచు నిట్లు పలికెను: 

ఓ మహాదేవ! హర! నీ వీ సర్వశక్తిమయి శ్రీమహాకాళియగు గౌరిని జేపట్టుము. నీవు కైలాసము నిర్మించుకొని యందుస్వేచ్ఛగ సంచరింపుము. నీకు తమోగుణము ప్రధానము-సత్వరజస్సులప్రధానములుగ నుండును. నీ రజస్తమోగుణములచేత రాక్షసవంశ నాశమగును. ఆ పరమాత్ముని నిత్యము సంస్మరించుటకు జాగరూకతతో తమ మొనరించుము. నీవు శాంతభావమున సత్త్వగుణుడవై శర్వరూపము నాశ్రయించి యుందువు. ఇట్లు మీరు మువ్వురును త్రిగుణులై సృష్టి స్థితి సంహారము లొనరింపుడు. జగముల కన్నిటికి త్రిగుణములే మూలస్తంభములు. ఈ ప్రపంచమున ప్రతి వస్తువు త్రిగుణమయమై యొప్పెసగును. ఈ సారహీనమైన ప్రపంచమందు నిర్గుణతత్వమును నేను జూచితి నన్నవాడుగాని చూచువాడుగాని చూడగలవాడుగాని లేడు. నిర్గుణ మా పరమాత్మయే. అతడు దృక్కేకాని దృశ్యతత్త్వము కాడు. శంకరా! నేను సృష్టి కాలమున సగుణను-లయమున నిర్గుణనై వెలుగొందుదును. నే నెప్పుడును కారణరూపమున నుందునుగాని కార్యరూపమున నుండను. నేను కారణరూపమున నిర్గుణను. పరమ పురుషు నానందసంగమంబునందు సగుణనై యుందును. మహత్తత్త్వము - అహంకారము - శబ్దాదిగుణములు - కార్యకారణ రూపములు ననువానితో జేరి నేను రేబవళ్ళు వ్యవహరింతును. నేను సదుద్భూతమైన యహంకార స్వరూపను. కాన సర్వకారణురాలను - శివరూపను.

అహంకారము నాకు కార్యము. అది త్రిగుణములను గూడియుండును. అహంకృతినుండి మహత్తత్వము గల్గును. అది బుద్ధి సమష్టి యనబరగును. అహంకారము కారణము. మహత్తత్వము కార్యము. ఆ యహంకృతినుండి పంచతన్మాత్రలు గల్గును. వాని నుండి పంచమహాభూతముల యుత్పత్తి జరుగును. పంచజ్ఞానేంద్రియములు-పంచకర్మేంద్రియంబులు-పంచమహాభూతములు-ఇవన్ని గలిసి పదారగును. ఇది కార్యములును కారణములు నగు షోడశాత్మక స్వరూపము. పరమాత్ముడు పురుషోత్తముడు-ఆద్యుడు-కార్యకారణ రహితుడు. ఈ విధముగ సృష్టి మొదట నా వలన నీ వికారములన్నియు క్రమముగ గలుగుచుండును.

ఇట్లు మీకు సంక్షేపముగ సృష్టి క్రమమును వెల్లడించితిని. ఇంక మీదట మీరలు మీ మీ విమానములమీద మీ మీ స్థానములకేగి యాత్మకార్యములు నిర్వహింపుడు. మి మ్మాపద లనెడి పెంజీకట్లు ముసరినప్పుడెల్ల నన్ను మదిలో సంస్మరింపుడు. నేను మీ బాధలు కూకటివేళ్లతో బెకలించి మీకు శుభోదయము గల్గింతును. దేవతలారా! నన్ను పరాత్మనుగ సనాతననుగ నిత్యము సంస్మరింపుడు. సర్వశక్తులమగు మాలో నెవరిని తలంచినప్పటికిని నిక్కువముగ మీకు కార్యసిద్ధి చేకూరును. మీరు మా మీదనే విశ్వాసము ప్రేమ ఉంచుడు. బాహ్యవస్తులను నమ్ముకొని మోసపోకుడు. అవి నురుగుల వంటివి.

బ్రహ్మ యిట్లనియె: ఈ ప్రకారముగ నా మహాశక్తి మాతో బలికి మా యాత్మలు సంస్కరించి శ్రీమహాలక్ష్మిని శ్రీవిష్ణునకు శ్రీమహాకాళిని శివునకు శ్రీమహాసరస్వతిని నాకు నప్పగించి యా జగదంబ మమ్ము వీడ్కొనెను. ఆ చోటు వదలిన వెంటనే మేము పురుషరూపములతో వెలుగొందితిమి. అపుడిదంతయును శ్రీదేవియొక్క యతిమానుషమతి లౌకిక మత్యద్భుతమైన ప్రభావమని మేము గ్రహించితిమి. మేము మరల నాదివ్యవిమాన మధిరోహించితిమి. అపుడు మాకాదేవికాని ద్వీపముగాని సుధాసింధువుగాని కనబడలేదు. ఆ విమానమున మేము మాత్రమే మిగిలితిమి. అట్లు మేమా విమానమునెక్కి మురారి చేతిలో దుర్దాంతులైన మధుకైటభులు హతులైన సాగరమందలి మహాపద్మము చెంతకేగితిమి.

అధ్యాయము 39 పంచభూత స్వరూప వివరణ

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Pruthvi Stotram -Stavanam - పృథ్వీ స్తోత్రం - స్తవనం

పృథ్వీ స్తోత్రం శ్వేతపంకజవర్ణాభాం శరచ్చంద్రనిభాననామ్‌ । చందనోక్షితసర్వాంగీం రత్నభూషణభూషితామ్‌ ॥ రత్నాధారాం రత్నగర్భాం రత్నాకరసమన్వితామ్‌ । వ...