Sunday, April 12, 2026

Chapter 39 Description of the Panchabhuta form - అధ్యాయము 39 పంచభూత స్వరూప వివరణ

శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 39

పంచభూత స్వరూప వివరణ

నారదా! ఇట్టి విచిత్ర చరిత్రగల శ్రీదేవిని హరిహరులును నేనును వేరువేరుగ సందర్శించితిమి అని బ్రహ్మ పలుకగా విని దేవర్షియగు నారదుడు పరమప్రీతుడై తన తండ్రియగు ప్రజాపతిని మరల నిట్లు ప్రశ్నించెను: 

నారదుడు యిట్లనియె: ఆద్యుడు-అచ్యుతుడు-అవ్యయుడు- నిర్గుణుడునగు పరమపురుషుని దర్శించి యనుభవించిన నీ స్వానుభవము నాకు తేటతెల్లముగ బలుకుము. నీవు త్రిగుణ మూలశక్తి రూపము గాంచితినంటివి. ఆ స్వరూప మెటువంటిది? మఱి నిర్గుణశక్తి స్వరూపమును పురుష స్వరూపమును కన్నులకు గట్టినట్లు వివరించుము. నే నేప్రణవస్వరూపుని గాంచుటకు శ్వేతద్వీపమున మాటిమాటికి తపమొనర్తునో దేనికై ప్రణవము జపింతునో మహాత్ములు కోపరహితులు తాపసులు నెవరినిగాంతురో ఆ పరమాత్ముడు నాకు గోచరుగడుటలేదు. ఆ విశ్వాత్ముని జెందుటకు మాటిమాటికి నాత్మ విచారమున తపమొనరింతును. నీవు సగుణరూపయగు మహాశక్తిని సందర్శించితివి. నిర్గుణశక్తి నిర్గుణస్వరూప పరమాత్ముడు నెట్టివారలో నాకు తెలియబలుకుము. ఇట్లు నారదుడడుగగా బ్రహ్మ నవ్వుచు నతనితో యథార్థ విషయము నీవిధముగ బలుకదొడంగెను: 

బ్రహ్మ యిట్లనియె:నారదా! నిర్గుణ స్వరూపమెప్పుడు నెవ్వరికిని గోచరముగాదు. ఏలయన, నాదృశ్యమంతయు మిథ్యయే. నశ్వరమే. నిర్గుణబ్రహ్మమే సత్యము. రూపరహితమెట్లు గోచరమగును? ఆ నిర్గుణశక్తి దుర్గమమైనది. ఆ నిర్గుణపురుషుడు దుర్గముడు. వారు మనోవాక్కులకు గోచరింపరు. పరమమును లహంకార మడచుకొని భావనచే జ్ఞాన జ్యోతితో నిర్గుణతత్త్వము గందురు. ప్రకృతి పురుషు లనాది నిధనులని యెఱుంగుము. వారి నాత్మ విశ్వాసముచేతనే గుర్తింపవలయును. కాని, విశ్వాసము గుదురనివా డెఱుగజాలడు. సర్వభూతములందలి చైతన్యశక్తిని పరమాత్మశక్తిగ భావింపుము. ఆ సత్యతేజము సర్వవ్యాపకము. నిత్యము. అది పెక్కు రూపులు దాల్చును. ఆత్మచైతన్యము-శక్తి- రెండు భిన్నములు. సర్వవ్యాపకములు. వీని యునికిలేక జగమందలి యే పదార్థమును లేదు. ఈ రెండును ప్రతి దేహమునందును కలిసిమెలిసి యుండును. ఆ రెండు నొకేరూపము గలవి; నిర్గుణములు-నిర్మలములు-సచ్చిదానంద స్వరూపములు.

ఆ శక్తియే పరమాత్మ. పరమాత్మయే శక్తి. వీరి భేదము నెవ్వరు నెఱుగలజాలరు. సాంగవేదములను నిఖిల శాస్త్రములను చదివినప్పటికిని ఆత్మానాత్మవివేకము లేనివాడు ఈ సూక్ష్మభేద మెఱుగజాలడు. ఈ చరాచరజగము లన్నియు సహంకార మమకారమయములు. కాని, వీని ప్రభావమున నరుడు నూఱువేల కల్పములకైన నహంకృతిని బాయలేడు. సగుణమును నిర్గుణమును కన్నులతో జూడజాలదు. కనుక ముమ్మొదట నెమ్మదిగ సగుణరూపముగూర్చి చింతింపవలయును. ఈ నాలుకయు కన్నులును పిత్తముచే నావరింపబడియుండును. నాలుక కారము మున్నగు రసములను తెలిసికొనును. కన్ను రూపములను గాంచును. కాని, నాలుక రూపము నెన్నటికిని తెలిసికొనజాలదు. గుణావృతమగు చిత్తము నిర్గుణమును తెలిసికొనజాలదు. అహంకారములో బుట్టిన మనస్సునుండి యహంకార మెట్లు తొలగగలదు? గుణ వికారములు దొలగిపోనంతవఱకు బ్రహ్మదర్శన మసంభవము. అహంకారము తొలగిన వెంటనే చిత్తవికారము లణగును. అపు డాత్మతేజము నేను నేనని తానుగ వెల్గుచుండును. కనుక నహంకారలయ మావశ్యకము అను బ్రహ్మవాక్కులు విని నారదుడు మరల బ్రహ్మ నిట్లు ప్రశ్నించెను: 

నారదుడు యిట్లనియె: ఓ దేవేశా! త్రిగుణముల-త్రివిధాహంకారముల-నిజస్వరూపమును నాకు తేటతెల్ల మొనరింపుము. సాత్త్వికము రాజసము తామసమునను వాని భేదములను రూపములను గుఱించి నాకు మరింత వివరించి తెలుపుము. ఏ సత్యదర్శనజ్ఞానమున నేను సంసార వ్యామోహములనుండి విముక్తుడనగుదునో నాకు దానిని దెలుపుము. గుణముల లక్షణములను వాని విభాగములను గూర్చి సవిస్తరముగ నాకు ప్రబోధింపుము అన-

బ్రహ్మయిట్లనియె: అనఘా! ఈ త్రివిధగుణములకు త్రివిధశక్తు లుండును. అవి జ్ఞానశక్తి క్రియాశక్తి అర్థశక్తి నా బరగును. జ్ఞానశక్తి సత్వగుణమునకు క్రియాశక్తి రజోగుణమునకు అర్థశక్తి తమోగుణమునకును సంబంధించి యుండును. ఈ త్రిగుణముల కార్యములను విపులీకరింతును. వినుము. తమోగుణమగు ద్యవ్యశక్తివలన తన్మాత్రలు గల్గును. శబ్దము-స్పర్శము-రూపము- గంధము ననబడునవి తన్మాత్ర లగును. ఆకాశముయొక్క ధర్మము శబ్దము. వాయు గుణము స్పర్శము. అగ్నిగుణము రూపము. జల గుణము రసము. భూమి గుణము గంధము. ఇవి సూక్ష్మతన్మాత్రలనబడును. ఈ భూతపంచకమును తన్మాత్రలును మొత్తము పదియు ద్రవ్యశక్తితో గలిసియుండును. ఇట్టి తామసాహంకారవృత్తి వలన బ్రహ్మాండసృష్టి జరుగును. ఇక రజోగుణముగల క్రియాశక్తివలన నుత్పన్నమైన వానిని దెలుపుదు నాలింపుము: చర్మము-కన్ను-చెవి-నాలుక-ముక్కు-ఈయైదను జ్ఞానేంద్రియము లనబడును. నోరు-చేయు-కాలు-పాయువు-ఉపస్థయనునవి కర్మేంద్రియములు. ప్రాణము-అపానము-వ్యానము-ఉదానము- సమానము ననునవి పంచవాయువులు. ఈ పదునైదును గలసిరజోగుణమువలన నుత్పన్నమగు నని చెప్పబడును. వీని సాధనము లన్నియును క్రియాశక్తికి సంబంధించి యుండును. వీని కన్నిటికిని చిద్వృత్తి యుపాదానకారణ మగును. వాయువు సూర్యుడు దిశలు వరుణుడు అశ్వినులు అను దేవతలు సత్త్వగుణ సంభూతులు జ్ఞానశక్తియుక్తులు. వీరు పంజ్ఞానేంద్రియములకు వరుసగ నధిష్ఠానదేవతలు. చంద్రుడు - బ్రహ్మ - క్షేత్రజ్ఞుడు - రుద్రుడు - ననువారు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనువాని కధిష్ఠాతృదేవతలు. ఇవన్నియు మనస్సుతో గలిసి పదునైదగును. వీరందఱును సత్వగుణప్రధాను లగుటవలన నిది సాత్త్వికసృష్టి యనంబరగును. ఆ పరమాత్మకు స్థూలము సూక్ష్మము నను భేదుములతో రెండు రూపములు గలవు. మొదటిది నిరాకారము. జ్ఞానరూపము. వివర్తముల కన్నిటికిని కారణము. రెండవది సాకారము సగుణము.

పరాధ్యాన సమయమునందు దేవియొక్క దయామూర్తి నుపాసించవలయును. అది దేవి స్థూలరూపము. ఆ పరమాత్మునిలోని స్వరూపమును సూక్షముగ నెఱుంగవలయును. ఆ సూక్ష్మ శరీరమునే సూత్రాత్మకమనియు విబుధులు నుడువుదురు. ఆ పరమాత్మయగు బ్రహ్మయొక్క రెండవరూపము స్థూలశరీరము. దానిని గూర్చి తెల్పుదును: దేనిని వినుట వలన బంధవిముక్తి గలుగునో దానిని వక్కాణింతును. భూత సూక్ష్మములగు తన్మాత్రలను మొదటనే వివరించితిని. వీని పంచీకరణమువలన పంచభూతములు సముద్భూతము లయ్యెను. ఆ పంచీకరణ రహస్య మెఱింగింతును. మొదట రస తన్మాత్రను తీసికొనవలయును. దానిని రెండుగ విభజించవలయును. అందొక భాగము వేరగును గద! ఇటులనే తక్కిన నాలుగు భూతములను రెండు రెండుగ వేరువేరుగ విభజింపవలయును. ప్రతి రెండవ భూతాంశమున తక్కిన నాల్గింటి భాగములను గలుపవలయును. అనగ నొక సగము నీటి భాగమునకు తక్కిన ప్రతి సగము భూతాంశముయొక్క నాల్గవ భాగము గలుపవలయును. అపుడొక్క జలభూత మేర్పడును. ఇట్లు భూత పంచీకరణము జరుగును. పిదప ప్రతి భూతాంశమందును చైత్యశక్తి ప్రతిబింబించును. అపు డందుండి మనోమయమైన యహంవృత్తి ప్రకటితమగును. ఆ వృత్తి విశేష మభిమానముతో ప్రద్యోతిత మగును. అపుడా శక్తి యాదినారాయణుడగు వైశ్వానర భగవానుడుగ బిలువబడును.

ఈ విధమగు పంచీకరణముచే ఆకాశాది భూతపంచకము సుస్పష్టముగ ప్రద్యోతితమగును. ఏకైక గుణవృద్ధిచే నొక్కొక్క భూతస్వభావము స్థూలతరమగు చుండును. ఎట్లన నాకాశమునకొకే శబ్దగుణము, వాయువునకు శబ్దస్పర్శములను రెండు గుణములు, అగ్నికి శబ్దస్పర్శ రూపములనబడు మూడు- జలమునకు శబ్దస్పర్శ రూపరసములను నాలుగు- భూమికి శబ్దస్పర్శ రూపరసగంధములను నైదుగుణములుగలవు. వీని పరస్పర సమ్మేళమున బ్రహ్మాండము సముత్పన్నమైనది కనుక సకల జీవులు బ్రహ్మాండాంశ సంభూతులు. ఈ జీవజాతు లెనుబదినాల్గు లక్షలని పేర్కొనబడుచున్నవి.

అధ్యాయము 40 త్రిగుణ స్వరూప వివరణము

No comments:

Post a Comment

Chapter 51 Sudarshana Came to Swayamvara - అధ్యాయము 51 సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 51 సుదర్శనుడు స్వయంవరమున కేగుదెంచుట వ్యాసముని యిట్లనియె : ఆ విధముగ సుబాహువు పలుకగ రాణి పవిత్రమగు...