Thursday, August 27, 2026

Banasuruniki Sahayabhutundagu Shivunaku Krishnunaku Yudhamaguta - బాణాసురునికి సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ధమగుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
బాణాసురునికి సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ధమగుట

భక్తులపట్ల ప్రేమకలవాడూ, కోరికల్ని తీర్చేవాడూ అయిన శివుడు బాణుణ్ణి తనకుమారులకంటే అధికంగా చూస్తాడు. కనుక, తాను బాణునిపక్షంలో యుద్ధం చేయడానికి కుమారస్వామి, ప్రమథగణాలూ వెంటరాగా శూలం ధరించినవాడై

నందీశ్వరుని కాలిగిట్టల తాకిడికి రేగిన దుమ్ము సూర్యుణ్ణి కమ్మివేసింది. తోకను కదుపగా ఏర్పడిన గాలికి మేఘాలు చెదరాయి. కొమ్ములవిసురుకు బ్రహ్మాండమనే పాత్రమూత పగిలింది. నందీశ్వరునిరంకెలకు ఆకాశం బద్దలైంది. మెడలో వేలాడే బంగారు గంటలధ్వనికి దిక్కులు కలత చెందాయి. నడచివస్తున్న వెండికొండా అన్నట్లు నందీశ్వరుణ్ణి శివుడు అధిరోహించి యుద్దానికి బయలుదేరాడు.

పరమేశ్వరుడు సమరసన్నాహసముల్లాసంతో వెళ్లి ఎదుటివారి సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. అప్పుడు ద్వంద్వయుద్ధం జరిగింది. ఆ పురాతన వీరులయుద్దాన్ని చూడడానికి బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలు, మొదలైనవారు వచ్చారు. 

శ్రీకృష్ణుడూ - శివుడూ; ప్రద్యుమ్నుడూ - కుమారస్వామీ; కూపకర్ణుడూ - కుంభాండులతో, బలరాముడూ - బలుడూ - సాంబుడూ; రథికులు - రథికులతోనూ, ఆశ్వికులు - ఆశ్వికులతోనూ, గజారోహకులు గజారోహకులతోనూ, పదాతిదళం పదాతిదళంతోనూ; యుద్ధం చేశారు. సింహధ్వనులతో, హుంకరింపులతో, వింటినారిధ్వనులతో, ఏనుగుల ఘీంకారాలతోనూ, గుర్రపుసకిలింపులతో, తప్పెటల, బాకాల భేరీశబ్దాలతో, మద్దెళ్ల, ఢక్కాలు, శంఖాల ధ్వనులతో బ్రహ్మాండం బద్దలయినట్లు అయింది.

(ఇందు జగన్నాటకసూత్ర ధారి అయిన శ్రీకృష్ణుడు ఒకపక్క భక్తపరాధీనుడగు శివుడు ఒకపక్క యుద్ధభారాన్ని వహించారు. ఇందలి శ్రీకృష్ణుడు జయశీలి. బాణుడు శాపగ్రస్తుడు. విచిత్ర మేమంటే బాణుడు శివునినుండి పొందింది. వరరూపంలో ఉన్న శాపం. ఆ వరమిచ్చింది శివుడే. 

తిరిగి బాణునిపక్షాన యుద్ధం చేస్తున్నదీ, బాణుణ్ణి రక్షించే ప్రయత్నం చేసిందీ - పరమేశ్వరుడే! ఇదొక విచిత్ర యుద్ధసన్నివేసం! అయినా హరిహరుల లక్ష్యంమాత్రం దుష్టశిక్షణం, శిష్టరక్షణమే! బాణుణ్ణి కూల్చడమే! బాణుడు తన ఆరాధ్యదైవాన్నే తనతో యుద్దానికి రమ్మనడం - వాని దురహంకారానికీ, నాశనానికీ పునాది అయింది.)

శ్రీకృష్ణుడు సింహనాదం చేసి తన యుద్ధనైపుణ్యంతో, బాణప్రయోగంతో శివుడు మొదలైన యోధుల్ని బాధించాడు. శత్రుసైనికులు భయంతో కలతచెంది పారిపోయేటట్లు చేశాడు.

కృష్ణుని విజ్బంభణం చూడలేక పరమేశ్వరుడు నిప్పులు కక్కే బాణాలు వేశాడు. కృష్ణుడు వాటిని ప్రతిబాణాలతో పొడిపొడిగా చేశాడు. ఇంకా

శివుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు అదే బ్రహ్మాస్తంతోనే దాన్ని తేలికగా తిప్పికొట్టాడు. ఆ ప్రయోగాన్ని చూచి ఇంద్రాది దేవతలు ఆశ్చర్యపడి కృష్ణుని పొగడగా

శివుడు కృష్ణునిపై వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుడు ఈ అస్త్రాన్ని పార్వతబాణంతో తుంచాడు. శివుడు ఆగ్నేయాస్త్రాన్ని వేయగా కృష్ణుడు ఐంద్రాస్త్రంతో దానిప్రభావాన్ని నిర్మూలించాడు.

శివుడు పాశుపతాస్త్రం వేశాడు. శ్రీకృష్ణుడు నారాయణాస్త్రం సంధించి, ఆ అస్త్రాన్ని మరల్చాడు. ఈ విధంగా శివుని అస్త్రాలు అన్నిటినీ కృష్ణుడు నిర్వీర్యం చేస్తుండగా

కలతచెంది నిరుత్సాహుడై ఉండే శివునిపై జయశాలి అయిన కృష్ణుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు.

శివుడు సమ్మోహనాస్త్రప్రభావంతో శరీరం స్వాధీనం తప్పగా, చేష్టలుడిగి, నిద్రవచ్చి నందీశ్వరునిమూపురంపై వాలిపోయాడు.

ఈ విధంగా శివుడు నందీశ్వరునిపై నిద్రమత్తులో పడగా, కృష్ణుడు శత్రు సైనికుల్ని బాణపరంపరతో ఖండించాడు. ఖడ్గాన్ని చేపట్టి శత్రుసైనికులలో మిగిలినవారిని బాధించాడు. ఈ రీతిగా రణరంగాన్ని శవాలగుట్టగా చేశాడు.

ప్రద్యుమ్నుడు గొప్ప సైన్యంతో కుమారస్వామిని ఎదుర్కొన్నాడు. వాడిబాణాలతో బాధింపగా కుమారస్వామి దేహం రక్తపుముద్దయై బాధపడుతుంటే, శత్రువులు సంతోషంతో కేకలు పెడ్తుంటే యుద్ధం అంటే భయపడి; తన నెమలివాహనంపై రణరంగం నుండి పారిపోయాడు.

యుద్ధభూమిలో శత్రువీరుడైన సాంబుడు కోపోద్రిక్తుడై బంగారు పిళ్లుగల వాడి బాణాలు వేయగా బాణుని కుమారుడైన బలాసురుడు అధైర్యంతో ఓడి పారిపోయాడు.

బలరాముడు వజ్రాయుధంవంటి ముసలంతో కుంభాండ కూపకర్ణుల శిరస్సుపై మోదగా, వారు ముసలం దెబ్బలకు తలలు పగిలి రక్తం కక్కుతూ చచ్చారు.

ఆ సమయంలో బాణునిసైన్యం దీనత్వం పొంది, దిక్కులేనిదై, పారిపోసాగింది. బాణాసురుడు సాత్యకి లక్ష్యంగా ప్రళయకాలాగ్నివలె విజృంభించి యుద్ధం చేసి, సైన్యాన్ని తిరిగి పురికొల్పాడు. ఉభయ సైన్యాలు తీవ్రంగా పోరాడాయి.

ఇరుపక్షాల సైన్యాలు దక్షిణ ఉత్తర సముద్రాలవలె భయంకర యుద్ధం చేశాయి. గదలు, ఖడ్గాలు, గండ్రగొడ్డళ్ళు, శూలాలు, చక్రాలు, చురకత్తులు, శక్తులు, బల్లెములు, పట్టినాలు మొదలైన ఆయుధాలతో యుద్ధం జరిగింది. కాళ్లు, వేళ్లు, తలలు, చేతులు తెగాయి. కళ్ళు పాడయ్యాయి. 

గజాలు, గుర్రాలు నేలకూలాయి. గుట్టలుగుట్టలుగా పడున్న పీనుగుల్ని తినడానికై పిశాచాలు, భూతాలు, భేతాళాలు గుంపులు గుంపులుగా వచ్చాయి. ఈ భయంకరయుద్ధంవల్ల రణరంగం భీషణంగా మారింది.

బాణాలు కలువపూలుగా; వింజామరలు నురుగులుగ్గా, గొడుగులు తెల్లతామరపూలుగా, రక్తం నీరుగా, ఎముకల గుట్ట ఇసుకరాశిగా, చేతులు పాముల గుంపుగా, తలవెండ్రుకలు నాచుగా తోచుటచే రణరంగం ఎర్రటి నదిలాగా కన్పించింది.

ఆ సమయంలో బాణాసురుడు మిక్కిలి కోపంతో శ్రీకృష్ణుని పైకి రథాన్ని పరుగెత్తించి, తాను సహస్రబాహుడ ననే గర్వంతో సమీపించి

బాణాసురుడు ఒకసారిగా అయిదువందల చేతులతో ధనువులను ధరించి, మిగిలిన చేతులతో రెండేసి బాణాలను తీసుకొని సంధించేలోపలే శ్రీకృష్ణుడు ఆ బాణాల్నీ, ధనుస్సులనూ ధ్వంసం చేశాడు. సారధిని సంహరించి, రథాన్ని ధ్వంసం చేసి

శ్రీకృష్ణుడు ప్రళయకాలమేఘగర్జనతో సమానమైన శబ్దాన్ని కల్గించే పాంచజన్యాన్ని పూరించాడు. జనులందరూ భయభ్రాంతులయ్యారు. ఆ ధ్వనికి రాక్షసస్త్రీల గర్భాలు విచ్చిన్నమయ్యాయి.

శ్రీకృష్ణుని ఎదురులేని శౌర్యపరాక్రమాలకు భయపడి, బాణుడు పెడమొగం పెట్టి ఏమీ చేయలేక న్యూనతతో ఊరకుండిపోయిన సమయంలో, ఆ సమయంలో బాణునితల్లి కోటర తన కుమారుడైన బాణుణ్ణి రక్షించాలనే తలపుతో వివస్త్రయై కృష్ణుని ఎదుట నిలబడగా, అసహ్యభావంతో అతడు పరాఙ్ముఖుడయ్యాడు. 

బాణుడు మనస్సు బాధపడుతుండగా, తలపాగ ఊడిపోగా బంగారుమణిభూషణాలు పడిపోతుండగా, యాదవులు నవ్వుతుండగా తన నగరానికి పారిపోయాడు. భూతగణాలుకూడా ఎక్కడికో వెళ్ళిపోగా

మూడుతలలు, మిక్కిలి భయంకరమైన మూడుపాదాలు కలిగి కోపంతో శివజ్వరం రాగా చూచి, కృష్ణుడు మెల్లగా నవ్వుతూ

శైవవైష్ణవజ్వరాలు రెండూ, ఉపాయం, సామర్థ్యం, బలం, పరాక్రమం కలిగి పోరాడగా శైవజ్వరం ఓడిపోయింది.

వైష్ణవజ్వరం ధాటికి ఆగలేక భయపడి పారిపోయింది.

శైవజ్వరం దిక్కుతోచక ఏడుస్తూ ప్రాణభయంతో వచ్చి, కృష్ణునిపాదాల పైబడి, నమస్కరించి నన్ను రక్షించు రక్షించు అంటూ ప్రార్థించింది.

ఈ విధంగా ప్రార్థించింది.

కృష్ణా! అవ్యయుడవు, అనఘుడివి, అనంతశక్తియుక్తుడివి, బ్రహ్మరుద్రేందాదులకు ప్రభువైనవాడివి; సర్వాత్మకుడివి; జ్ఞానమయుడివి; జగదుద్భవస్థితి సంహారకారకుడివి; ఉత్తమ జ్ఞాన శక్త్యాదులచే ఒప్పునట్టివాడివి, పరమాత్మస్వరూపుడివి, ప్రభుడివి; నీ మూలప్రకృతి మహిమతో సర్వప్రాణులను మోహపరచునట్టివాడివి; గౌరవప్రదమైన వర్చస్సు కలవాడివి; ఆదిమధ్యాంతాలులేనివాడివి; సచ్చిదానంద స్వరూపుడివీ అయిన నిన్ను సేవిస్తాను.

(షట్‌+ఊర్ములు= షడూర్ములు. 'ఊర్మి' అంటే అల. యోగసాధనకు ఆటంకాలను కల్గించే ఆరువిధాలైన అలజడులే - జీవధర్మాలే షడూర్ములు. అవి క్షుత్‌ (ఆకలి), పిపాస (దప్పిక), శోకం, మోహం, జర (ముదిమి), మరణం. 

ఇవి ప్రతిజీవికి సహజమైనవే. అయితే ఇవి సమపాళ్లలో ఉండవు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క తీరుగా ఉంటాయి. జీవసహజమైన ఈ అలజడులను, ధర్మాలనూ జయించడం యోగసాధనలో ఒక భాగం. షడూర్ములలో ఆకలి(ఆహారం), దప్పికలు - సూక్ష్మశరీర ధర్మాలు; శోకమోహాలు - కారణ శరీరధర్మాలు - జరామరణాలు = స్తూల శరీర ధర్మాలు.

ఈ ధర్మాలు లేనివాడు పరమాత్మ సుజ్ఞానమంటే - ఇతర సాధనాలతో అవసరంలేని, స్వయంప్రకాశకమైన తత్త్వజ్ఞానం. శక్తులు - ఇవి పరమాత్మకు సంబంధించిన సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సర్వాంతర్యామిత్వం - మొదలైనవి.)

కృష్ణా! లోకంలో భగవంతుడు అనేకవిధాలుగా కన్పిస్తాడు. కళ, కాష్ఠ ముహూర్తాలనబడేకాలాలూ, మంచిపనులూ, చెడుపనులూ, ప్రత్యక్షాదిజ్ఞానరూపాలైన జీవునికర్మలూ, స్వభావాలూ, సత్త్వరజోతమోగుణాలచే కూడిన ప్రకృతీ, బీజాంకురన్యాయంతో కార్యకారణరూపమై ప్రవాహమైన ఈ జగత్తు సత్యమేమో అనిపిస్తుంది.

ఇది నీ మాయేగాని వాస్తవం కాదు. ఆ మాయను నివారించగల నీవు పెక్కు అవతారాలెత్తి లోకనిర్మాణనిపుణులైన బ్రహ్మ ఇంద్రుడు మున్నగువారిని, పుణ్యపురుషుల్ని దేవతల సమూహాన్ని కాపాడుతున్నావు. క్రూరకర్ములగు దుష్టాత్ములను శిక్షిస్తున్నావు. నీ అవతారంయొక్క ప్రయోజనం భూభారాన్ని తగ్గించడమే! అందువల్ల నిన్ను శరణుకోరుతున్నాను.

ప్రవిమలాకారా! సంసారభయాన్ని దూరం చేసేవాడా! భక్తజనులను పోషించడంలో ఆనందం పొందేవాడా! పరమప్రరుషా! దేవా! శాంతమై, పూజనీయమై, తీక్ష్ణమై, ఉదారమై ప్రకాశించే నీ కాంతిచే తాపాన్ని పొందాను. కృశించాను, నన్ను రక్షించు. నీ పాదపద్మాలను సేవించే బుద్ధి కలిగేటంతవరకే మానవులు పాపాలు చెస్తారు. అనాథ రక్షకుడనే బిరుదు కలిగిన నీకు నన్ను కాపాడుట వింతయా?(కాదని భావం)

అనగా శ్రీకృష్ణుడు దయగలవాడై సాధనమైన జ్వరం(వైష్ణవజ్వరం) ఇతరమైన సాధనాలతో నివారణం కాదు. కానీ, నీవు నీ మనస్సులో నన్ను చూచి, (నా తత్త్వం తెలుసుకొని) శరణు కోరావు. కనుక నా వైష్ణవజ్వరతాపం ఇకపై నిన్ను బాధించదు. ఇక మనోవేదన చెందవద్దు.

('సర్వధర్మాలను పరిత్యజించి, నన్నే శరణుపొందు, సర్వపాపాలనుండి నిన్నునేను విముక్తుణ్ణి చేస్తాను. విచారించకు' అనిన గీతాచార్యుని వాక్యం - ప్రస్తుతం - శైవజ్వరశక్తి విషయంలో నిరూపితమైంది.)

ఆ శ్రీకృష్ణుడు ఇంకా ఈ విధంగా అన్నాడు. ఎవ్వరైనా ఈ శైవ వైష్ణవజ్వరాల కలహాన్నీ నీవు (శైవజ్వరం) విష్ణుప్రపత్తికి సిద్ధపడటాన్నీ మనస్సులో తలుస్తారో అట్టిపుణ్యాత్ములను శీతోష్టజ్వరాలు బాధింపవు అని చెప్పగా ఆ శైవజ్వరం కృష్ణునికి సాష్టాంగంగా నమస్కరించి తన కోరికను అనుసరించి వెళ్లింది. తరువాత బాణాసురుడు శోణపురంలో

బాణాసురుడు రెండవసారి యుద్ధమునకు వచ్చుట







No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...