Wednesday, August 26, 2026

Srikrishnudu Padaruvela Conniyala Varinchi Devalokamunaku Boyi Parijatamu Decchuta - శ్రీకృష్ణుడు పదాఱువేల కన్నియల వరించి దేవలోకమునకు బోయి పారిజాతము దెచ్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణుడు పదాఱువేల కన్నియల వరించి దేవలోకమునకు బోయి పారిజాతము దెచ్చుట

రాజవంశ శ్రేష్ఠుడూ, కంసుణ్ణి జయించినవాడూ అయిన శ్రీకృష్ణుడు, రాజులను గెలిచి నరకాసురుడు బందీలుగా పట్టితెచ్చిన పదారువేలమంది రాజకన్యలను ఆ భవనంలో చూచాడు. ఆ రాజపుత్రికలు జనులచేత గౌరవింపదగినవారు. సుగుణవతుల జీవనమార్గం అనుసరించి ధన్యత నొందినవారు.

ఆ రాజకన్యలు నిలువెల్లా కుతూహలం గలవారై రాక్షస సేనలను ఛేదించేవాణ్ణీ, మొక్కే వారికి కల్పవృక్షమయినవాణ్ణీ, శుభాలు కలిగించే రూపం గలవాణ్ణీ, నిత్యనవీనమయిన శృంగారం కలవాణ్ణీ; భావవికారాలు లేనివాణ్ణీ; సద్గుణాలకు నిలయుడయినవాణ్ణీ; యువతుల హృదయ ధనాన్ని దొంగిలించువాణ్ణీ, మనస్సులను ఆకర్షించువాణ్ణీ, రత్నాలు పొదిగిన కిరీటంతో ప్రకాశించేవాణ్ణీ శ్రీకృష్ణుణ్ణీ చూచారు.

రాజపుత్రికలు శ్రీకృష్ణుణ్ణి చూచి, అతనిసౌందర్యం, గాంభీర్యం, నైపుణ్యం మొదలయిన గుణాలవల్ల అతణ్ణి ప్రేమించారు. వారికి తహతహపాటు కలిగింది. వారు ధైర్యం కోల్పోయారు. బిడియాన్ని వదలివేశారు. మన్మథుడు వారి హృదయాల్ని కలతపెట్టాడు. దైవవశంతో వారిమనస్సులు అదుపు తప్పాయి. ఆ ఉత్తమాంగనలు మన్మథతాపానికి లోనై శ్రీకృష్ణుడే తమకు ప్రాణేశ్చరుడని నిశ్చయించుకొని

మహాపాపియైన నరకాసురుడు నిర్భంధించాడని ఎప్పుడూ అనుకొంటాము. నిజంగా వాడు పాపాత్ముడా? వాని పుణ్యమా అని శ్రీకృష్ణుణ్ణి దర్శింపగలిగాము కదమ్మా! ఈనాడు పురుషశ్రేష్ఠుడయిన ఇతణ్ణి కలసికొనేందుకై పూర్వజన్మంలో మనం ఎట్టి నోములు నోచామో? ఆ బ్రహ్మదేవుడు పుణ్యాత్ముడు గదమ్మ! కాబట్టే, శ్రీకృష్ణుణ్ణీ, మమ్మల్నీ ఇక్కడ చేర్చాడు.

మనందరిలో శ్రీకృష్ణుడు కౌగిలించి ఆదరించగా సుఖంగా జీవించే అదృష్టవతి పూర్వజన్మంలో సదాచారాలు పాటిస్తూ, అడవుల్లో నీళ్లల్లో నిలిచి, కష్టాలు పడి ఏ వ్రతా లాచరించిందో? (లేకుంటే అంతటి అదృష్టం కల్గదని భావం).

మనం చాలాకాలం నుండి బ్రతుకుతూ ఉన్నాం గదా! ఎవరిలో అయినా ఈ అందం ఉందని విన్నామా? ఇంతటి ప్రతాపమూ, గంభీరతా మరొకనియందు చూచామా? ఎవని నుండయినా, ఎప్పుడయినా ఈ ప్రేమను దక్కించుకొన్నామా?

ఆ రాజకన్యలు గుంపులుగూడి తమలో తాము "నేను గనుక వైజయంతిమాల నయితే శ్రీకృష్ణుని మెడలో వ్రేలాడుతుంటాను గదా! నేను గాని పసుపు పచ్చని పట్టుబట్టనయితే అతని ఒంటినిండా ప్రకాశిస్తూ ఉందునుగదా! నేను గనుక కౌస్తుభమణి నయితే అతని వక్షంపై తళతళమెఱస్తూ ఉంటాను గదా! నేను గనుక పాంచజన్యాన్ని అయితే అతని అధరామృతాన్ని సేవించి, పరవశిస్తూ ఉంటాను గదా!” అని తలకొక విధంగా చెప్పుకోసాగారు.

పరీక్ష్మిన్మహారాజా! రాజకన్యలందరూ క్రమంగా తమలో తాము "శ్రీకృష్ణుడు నన్నే పరిహసించాడు; యుక్తంగా చూచాడు; నా సౌందర్యాన్ని వర్ణించాడు; నన్ను గూర్చి చక్కగా తెలుసుకొన్నాడు; నన్ను మన్నించాడు; నాపై దయ చూపాడు; నాపేరు అడిగాడు; ఆచారం ప్రకారం వివాహమవుతుంది; నేనే అతని పట్టమహిషిని” అని నిశ్చయించుకొన్నవా రయ్యారు.

ఈ విధంగా రాజకన్యలు ముందు ముందు శ్రీకృష్ణునివల్ల తమకు ప్రాప్తించే గౌరవాదులను గూర్చి ఆరాటపడుతున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ పదాఱువేలమందికీ తెల్లనిబట్టలూ, నగలూ, పూలదండలూ, మైపూతలూ ఇచ్చి, పల్లకీలు సమకూర్చాడు. 

వారినీ, నరకాసురుని ధనరాశులనూ, రథాలనూ, గుర్రాలనూ, ఏనుగులనూ ద్వారకకు పంపాడు. ఆ ఏనుగులు సామాన్యమయినవి కావు. అవి తెల్లనివి. వేగం గలవి. ఐరావత గజ సంతతికి చెందినట్టివి. నాలుగు దంతాలు కలవి. తర్వాత శ్రీకృష్ణుడు అమరావతికి వెళ్లి అదితిని సందర్శించాడు.

ఆమెకు సూర్యకాంతిని మించిన కాంతి కలిగిన కుండలాలను ఇచ్చాడు. శచీదేవితో కూడిన ఇంద్రునిచేత సత్యభామాసహితుడై పూజలు పొందాడు. సత్యభామకోరిక ననుసరించి నందనోద్యానవనానికి వెళ్లి

శ్రీకృష్ణుడు చేతితో పెల్లగించి పారిజాతవృక్షాన్ని గరుత్మంతునిమీద పెట్టాడు. ఆ పారిజాత పుష్పాల సువాసనలకై, చేరి అట్టిటు తిరుగుతూ తుమ్మెదలు రొద చేస్తున్నాయి. చిగుళ్లతో, ఆకులతో, కొమ్మలతో, పండ్లతో పూమొగ్గల గుత్తులతో ఆ కల్పవృక్షం అందగిస్తూంది. అది ఇంద్రునిచేత రక్షింపబడింది. దాన్నిగూర్చి మూడులోకాల్లోని యాచకులు చెప్పుకొంటూ, పొగడుతున్నారు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు పారిజాతాన్ని అపహరించి, సత్యభామతో కూడి గరుత్మంతునిమీద వెళ్లేటప్పుడు

నరకాసురుడు నానాయాతనలు పెట్టగా శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి, కిరీటం కాళ్లకు తగిలేటట్లుగా నేలమీద చాగిలబడి మ్రొక్కటం, శ్రీకృష్ణుడు దయగలిగి నరకాసురుణ్ణి చంపి తననూ, తనవారినీ రక్షించటం, ఇవన్నీ దేవతాధిపత్యంవల్ల కలిగిన మదంచేత ఇంద్రుడు విస్మరించాడు.

అతడు అడ్డపడి "శ్రీకృష్ణా! వెళ్లకు, పారిజాతవృక్షాన్ని విడువు" మని పలుకుతూ ఎదిరించాడు. దేవతలు కూడా తరిమి శ్రీకృష్ణుణ్ణి తమ ప్రభువు మాదిరిగానే ఎదుర్కొన్నారు. అయ్యో! ఈ పనిచేయదగునా? చేయదగదా? అనే జ్ఞానం ఉండనక్కర లేదా? దేవేంద్రత్వం దేనికి? మంటబెట్టటానికా? చూస్తుంటే దేవతలపొగరు ఆశ్చర్యకరంగా ఉంది.

శ్రీకృష్ణుడు తన్నెదిరించి అడ్డపడిన దేవేంద్రుణ్ణీ, దేవతల్నీ జయించి, ద్వారకకు వెళ్లాడు. ఆశ్రితులపాలిటికి కల్పవృక్షమైన అతడు తన పూలతేనెల తీపిని మరగి ఉన్నచోటు వదలి, వెంటవస్తున్న తుమ్మెదలకు మేలుచేసే పారిజాతాన్ని సత్యభామతో కలసి తాను విహరించే ఉద్యానవనంలో నాటాడు. నరకాసురుని యింటినుండి తీసుకొని వచ్చిన రాజకన్యల కందరికీ గృహాలు కట్టించి సమస్త గృహోపకరణాలను సమకూర్చాడు.

అనేక విధాలైన వినోద సంచారాలు చేసేవాడు, సర్వనియామకుడు, అంతం లేనివాడు అయిన శ్రీకృష్ణుడు ఒకరోజున శుభముహూర్తఆనందంతో పదియారువేలభవనాలలో, పదియారువేలఆకృతులతో, పదియారువేల రీతులుగా, పదియారువేలమంది రాజపుత్రికలను వైభవంగా పెండ్లాడినాడు.

శ్రీకృష్ణుడు ఉత్తమ గృహస్థుడై రాజకన్యకలకు ఒకేవిధంగా, సమానంగా కోరిన వస్తువులను ఇచ్చేవాడు. సంతోషం కలిగించేవాడు. ఒకే తీరున వారిని చూచేవాడు. వారితో మాటలాడేవాడు. వారిని పిలిచేవాడు. వారికందరికీ అన్ని రూపాలతో ఎప్పుడూ కనబడేవాడు. అతడు అన్ని కోరికలూ సిద్ధించినవాడై వారితో క్రీడించాడు.

పెక్కుమంది భార్యలుగల మగవాడు సవతుల కయ్యం కారణంగా సుఖశాంతులతో బ్రతుకలేడు. కాని, శ్రీకృష్ణుడు ఆ పదారువేలమంది భార్యలతో నేర్పుకలిగి సమచిత్తంతో ప్రవర్తించాడు.

బ్రహ్మ ఇంద్రుడు మొదలయినవారు ఎన్నెన్నో విధాలుగా యోగాల్ని ఆశ్రయించి చూడలేని పరమాత్మకు భార్యలై రాజపుత్రికలు చూపులు, నవ్వులు, మాటలు, సురతాలు, ఆలింగనాలు, ప్రేమలు అనేవాటిచేత సేవించి వాసికిక్కారు.

పదారువేలమంది రాచకొమార్తెలు వేలకొలది పనికత్తెలచేత ఊడిగం చేయించుకొనే వారే అయినప్పటికీ, వారు స్వయంగా శ్రీకృష్ణునికి పరిచర్యలు చేసెడివారు. ఆ రాజకన్యలు భర్త ఇంటికి వచ్చినపుడు ఎదురుపోయేవారు. అతడు తెచ్చిన వస్తువులను తీసికొనేవారు. కూర్చోవడానికి మణులు పొదిగిన బంగారుపీటలు వేసేవారు. 

భక్తితో కాళ్లు కడిగి సుగంధిజలంతో స్నానం చేయించి, చందనవస్త్రాభరణాలు ఇచ్చేవారు. ఇష్టపదార్జాలతో భోజనం పెట్టిన తర్వాత తాంబూలమిచ్చి, వీవనలతో వీచేవారు. తలదువ్వి, పానుపుపై మృదువుగా పాదములొత్తుతూ"సేవించేవారు.

ఆ పదారువేలమంది రాజకన్యలు "పగలూ రేయీ నన్ను మాత్రమే ఎడబాయడు. దయతో నాతోమాత్రమే పొంది పొసగి ఉంటాడు. ప్రియపత్నులలో నన్నుమాత్రమే దొడ్డయిల్లాలిగా గౌరవిస్తాడు. ప్రాణేశ్వరుడు నా ఇంటిలోనే ఉన్నాడు" అని తమ మనస్సులలో భావించి, పాతివ్రత్యదాస్యభక్తియోగాలతో శ్రీకృష్ణుణ్ణి సేవిస్తున్నారు.

శ్రీకృష్ణుడు కూడా పదారువేలమంది రాజకన్యలయందు అత్యధిక ప్రేమకలిగి మేడలలో, ఉద్యానవనాల్లోని లతాగృహాలలో, సరస్సులలో వాళ్లతోకూడి విహరించాడు.

లోకాలను సృష్టించి, పోషించి, లయింపజేసే పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు ప్రభువై వర్ణాశ్రమధర్మాలను రక్షించడానికి ఆ రాజకన్యలతో ఆ విధంగా వ్యవహరిస్తూ యాదవులలో ప్రకాశించాడు.


శ్రీకృష్ణుడు కేళీగృహమునందు రుక్మిణీదేవితో విరసోక్తు లాడుట






No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...