Tuesday, August 4, 2026

Madhyaahna Sandhya - Afternoon twilight - మధ్యాహ్నసంధ్య

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - మధ్యాహ్నసంధ్య

ప్రాతస్సంధ్యోపాస్తి, అది అయ్యాక దేవీపూజ - చెప్పానుగదా! ఇప్పుడింక మధ్యాహ్న సంధ్యావందనం గురించి చెబుతాను ఆలకించు. ఇది అపూర్వమూ అత్యుత్తమమూ అయిన ఫలాలను ఇస్తుంది.

మధ్యాహ్న సమయాన సంధ్యాదేవత సావిత్రి, యువతి, శ్వేతవర్ణ, త్రిలోచన, అక్షమాలాధారిణి, త్రిశూల ధారిణి, 
వరద, అభయహస్త ముద్రాంచిత, వృషారూఢ, యజుర్వేద సంహితారూప, రుద్రదేవత, గుణయుత, భువర్లోక వ్యవస్థిత, ఆదిత్యమార్గ సంచారకర్త్రి, మాయామయి. ఇటువంటి ఆదిదేవికి నమస్కరిస్తున్నాను అని ధ్యానశ్లోకం పఠించాలి. 

ప్రాతస్సంధ్యలో లాగానే ఆచమనాదికం చెయ్యాలి. అటు పైని అర్ఘ్య ప్రదానం పువ్వులతో చెయ్యాలి. పువ్వులు లేకపోతే బిల్వపత్రాన్ని నీళ్ళల్లో ముంచి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా ఆకాశంలోకి జల్లుతూ అర్ఘ్యాన్ని ప్రతిపాదించాలి. మిగతా కార్యక్రమమంతా ప్రాతస్సంధ్యలాగానే. 

కొందరిక్కడ తదిత్యాది మంత్రంతో సావిత్రిని ధ్యానించాలి అంటున్నారుగానీ అది సంప్రదాయం కాదు. అసంప్రదాయం హానికరం. కనక ఉభయ సంధ్యల్లోనూ ఓంకారసహితమైన గాయత్రీ మంత్రంతోనే నీరు జల్లాలి. ఆకృష్ణేన - ఇత్యాది మంత్రంతో పుష్పమిశ్రితమైన జలం లేదా బిల్వదుర్వాది పత్రాలతో పూర్వోక్త పద్ధతిలో జల్లి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది సంధ్యాసాఫల్యదాయకం. మందేహరాక్షస వినాశకం. 

ఆ తరవాత గాయత్రీమంత్రంతోనే యజుర్వేదపురుష హిరణ్యగర్భాదులకు తర్పణాలు విడిచి పెట్టాలి. ఉదుత్యమిత్యాది మంత్రాలతో సూర్యోపస్థానం చెయ్యాలి. అటుపైని గాయత్రీమంత్రజపం. 

దీనికీ మూడుపూటలకూ మూడు పద్ధతులున్నాయి. ప్రాతఃకాలంలో చేతులు పైకి త్రిప్పి, సాయంకాలంలో క్రిందికి త్రిప్పి మధ్యాహ్నసమయంలో గుండెల పై ఆన్చి గాయత్రిని జపించాలి.

గాయత్రీమంత్ర జప పరిగణనకుకూడా ఒక విధానం ఉంది. అనామిక మధ్య గణువుతో మొదలుపెట్టి చిటికెనవేలు గణుపులుమీదుగా చూపుడు వేలు మూలంవరకూ పదిగణుపులవుతాయి. వీటిని లెక్కించుకుంటూ గాయత్రిని జపిస్తే దశగాయత్రి అవుతుంది. దీన్ని కరమాల అంటారు.

ఇలా పదిసార్లు చేస్తే శతగాయత్రి. తర్జని మొదటి కణుపుదగ్గర (పైనుండే కణుపు) ఆపేస్తే ఎనిమిది. మొత్తం ఆష్టోత్తరశతగాయత్రి. రోజూ సహస్రగాయత్రి చేస్తే విశేషఫలితాలుంటాయి. గోహత్య పితృహత్య మాతృహత్య భ్రూణహత్య గురుపత్నీసంగమం బ్రహ్మహత్య సురాపానం ఇత్యాది మహాపాతకాలన్నీ అంతరిస్తాయి. పవిత్రుడవుతాడు. 

మానసిక వాచిక కాయిక దుష్కర్మలన్నీ తొలగిపోతాయి. గాయత్రీ మంత్రం తెలియని విప్రుడి జన్మ వ్యర్థం. నాలుగువేదాలూ చదివినా ఒక్కసారైనా గాయత్రిని జపించకపోతే ఆ చదువంతా కేవలం శ్రమమాత్రమే అవుతుంది. వేదావృత్తికన్నా గాయత్రీజపం ఉత్తమోత్తమం.

బ్రహ్మ యజ్ఞం




No comments:

Post a Comment

Gayatri Ashtottara Sahasram - గాయత్రీ అష్టోత్తర సహస్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ అష్టోత్తర సహస్రం గాయత్రీ సహస్ర నామావళి నారదా! మహర్షీ! సాధు సాధు. అడగవలసింది అడిగావు. నువ్వు మహాప్ర...