Tuesday, August 4, 2026

Worship of Mahadevi - మహాదేవీ సమర్చన

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - మహాదేవీ సమర్చన

దేవిపూజావిధానం సమగ్రంగా మరొక్కసారి వినాలనుకుంటున్నాను చెప్పమని నారదుడు అడిగాడు. నారాయణమహర్షి ఆరంభించాడు. 

శ్రీమాతృపూజ భుక్తిముక్తిప్రదం. సమస్త ఆపదలనూ తొలగిస్తుంది. సకల భోగభాగ్యాలనూ కలిగిస్తుంది. నారదా! మౌనంగా ఆచమించి సంకల్పం చెప్పుకుని భూతశుద్ధ్యాదికమంతా నిర్వహించాలి. మాతృకాన్యాసపూర్వకంగా షడంగన్యాసం చెయ్యాలి. సామాన్యా ప్రదానాదికంతో శంఖస్థాపన చెయ్యాలి.

పూజాద్రవ్యాలను మంత్రోదకాలతో సంపప్రోక్షించాలి. గురువు అనుమతిపాంది పూజకు ఉపక్రమించాలి. పీఠపూజ చేసి దేవిని ధ్యానించాలి. ఆవాహన చేసి ఆసనాద్యుపచారాలు సమర్పించి పంచామృతరసాదులతో స్నానం చేయించాలి. 

పౌండ్రేక్షురసపూర్ణాలైన శతకుంభాలతో స్నానం చేయించినవాడికి పునర్జన్మ ఉండదు. వేదమంత్ర పారాయణంచేస్తూ చూతఫల రసంతోగానీ చెఱకు పానకంతోగానీ (ఇక్షురసం) అమ్మవారిని స్నానం చేయించినవారి ఇంటిలో సరస్వతీదేవి స్థిరంగా నివసిస్తుంది.

ద్రాక్షాఫలరస స్నానం చేయించినవారు రసబిందువులన్ని సంవత్సరాలు దేవీలోకంలో నివసిస్తారు. కర్పూర అగురు కాశ్మీర కస్తూరీ సమ్మిశ్రితమైన జలాలతో వేదమంత్రపూర్వకంగా జగదీశ్వరిని స్నానం చేయించినవారికి నూరు జన్మల పాపాలు భస్మీపటలమై పోతాయి. 

క్షీరాభిషేకం చేయిస్తే ఆ భక్తుడు కల్పాంతంవరకూ క్షీరసాగరమధ్యంలో అమ్మవారి సాన్నిధ్యాన్ని చూరగొంటాడు. పెరుగుతో తేనెతో నెయ్యితో పంచదార పానకంతో అభిషేకించినవారు ఆయా ద్రవ్యాలకూ ద్రవ్యప్రవాహాలకూ అధిపతులవుతారు.

భక్తితో సహస్ర కలశాభిషేకం చేస్తే ఇహపరలోక సుఖాలన్నీ ఆ భక్తుడివే. అటు పైని కాశ్మీర చందనం ఇచ్చి, కస్తూరి బొట్టు దిద్ది, సీమంతంలో సిందూరం సింగారించి, పాదాలకు లత్తుకను అలంకరించినవాడు ఇంద్రపదవిని ఆధిష్ఠిస్తాడు. రకరకాల పుష్పాలను ఈ పూజకు ఉపయోగించవచ్చు. పుష్పార్చన చేసినవాడు కైలాసం చేరుకుంటాడు.

బిల్వపత్రాలతో పూజచేస్తే అతడికి ఎప్పుడూ ఎక్కడా ఏ దుఃఖమూ ఉండదు. బిల్వపత్ర దళాలమీద రక్తచందనంతో మాయాబీజాక్షర త్రయాన్ని సుస్పష్టంగా సుందరంగా లిఖించాలి. ఆ బీజాక్షరాలతో కలిపి అమ్మవారి నామాన్ని చతుర్థ్యంతంగా పలికి నమః అంటూ (ఓం మహాదేవ్యై నమః. హ్రీం జగదీశ్వర్యై నమః - ఇత్యాదిగా) బిల్వపత్రాలను అమ్మవారి పాదాలచెంత ఉంచాలి. 

ఇలా బిల్వపత్రార్చన చేసినవారికి మనుత్వం లభిస్తుంది. లేతదళాలను కోసి తెచ్చి కోటి బిల్వార్చన చేసినవాడు బ్రహ్మాండాధిపతి అవుతాడు. కోటి కుందపుష్పార్చన చేస్తే ప్రాజాపత్యం దక్కుతుంది. కోటిసంఖ్యలో మల్లికా మాలతీపుష్పాలను సుంగంధ ద్రవ్యాలతో కలిపి అమ్మవారికి పూజచేస్తే బ్రహ్మత్వం, దశకోటి చేస్తే విష్ణుత్వం, శతకోటి చేస్తే సూత్రాత్మత్వం లభిస్తాయి. 

ఇప్పుడు ఆయా పదవుల్లో ఉన్నవారందరూ ఇలా అర్చించివవారే. జపా - బంధూక - దాడిమీ కుసుమాలుకూడా ఇలాగే అనంతపుణ్య ఫలాలను ఇస్తాయి. ఆయా ఋతువుల్లొ దొరికే పువ్వులతో సంవత్సరం పాడువువా అమ్మవారికి సహస్రనామార్చవ చేస్తే సర్వమహాపాతక - ఉప పాతకాలు అన్నీ నశించి ముక్తి లభిస్తుంది.

దేహాంతంలో శ్రీదేవీపదసన్నిధికి చేరుకుంటాడు. ఇది దేవతానాయకులకుకూడా దుర్లభమైన పదవి. కృష్ణాగురు కర్పూర చందన సిల్హిక ఆజ్య గుగ్గులు సమన్వితంగా ధూపంవేస్తే దేవి ప్రసన్నురాలై ముల్లోకాలనూ తెచ్చి ముంగిట నిలుపుతుంది. కర్పూరఖండాలతో నీరాజనమిస్తే సూర్యలోకనివాసం సిద్ధిస్తుంది. శతదీపార్చన సహస్రదీపార్చన కోటి దీపార్చనలు చేసినవారికీ ఇదే పుణ్యఫలం దక్కుతుంది.

అమ్మవారి ఎట్టయెదుట పర్వతాకారంలో నైవేద్యం నిలపాలి. షడ్రసోపేతమైన లేహ్యచోష్య పేయాలతో రకరకాల పిండివంటలతో రుచికరమైన ఫలాలతో బంగారు పాత్రల్లో అన్నరాశిని నివేదన చెయ్యాలి. అమ్మవారు తృప్తి చెందితే జగృత్త్రయం తృప్తి చెందుతుంది. ఎందుకంటే రజ్జువునందు సర్పత్వంలాగా జగత్త్రయమూ అమ్మవారే కనక.

నైవేద్యం పెట్టాక సుగంధభరితమైన చల్లని గంగాజలాన్ని కలశాలలో పానీయంగా సమర్పించాలి. తర్వాత కర్పూరతాంబూలం ఇవ్వాలి. ఏలకులూ లవంగాలూ వక్కపొడి ఇత్యాదులతో లేతతములపాకులు మడిచి ముఖసౌంగంధ్యవర్థకంగా అందివ్వాలి. అటు పైని మృదంగ వీణాది వాద్యాలతో మనోహరగానాలతో వేదపారాయణలతో పురాణపఠనలతో స్తోత్రపాఠాలతో జగన్మాతను అలరించాలి.

రెండేసి ఛత్రచామరాలు సమర్పించాలి. రాజోపచారాలు అన్నీ చెయ్యాలి. ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలి. లెంపలు వేసుకుంటూ క్షమాపణలు చెప్పాలి. ఒక్కసారి ఒక్క ఉపచారం చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాంటిది అన్ని ఉపచారాలూ నిత్యమూ భక్తితో చేస్తే అమ్మవారి ఆనందానికీ అనుగ్రహానికీ అవధులు ఉంటాయా!

ఆవిడ జగన్మాత కనక పుత్రులపట్ల సహజంగానే ప్రేమ దయ ఉంటాయి. భక్తితో అర్చనచేసే పుత్రుడంటే అవి ఎంత విశేషంగా ప్రవహిస్తాయో వేరే చెప్పాలా!

దేవీమహిమ - బృహద్రథుడి పూర్వజన్మ సృతి




No comments:

Post a Comment

Gayatri Ashtottara Sahasram - గాయత్రీ అష్టోత్తర సహస్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ అష్టోత్తర సహస్రం గాయత్రీ సహస్ర నామావళి నారదా! మహర్షీ! సాధు సాధు. అడగవలసింది అడిగావు. నువ్వు మహాప్ర...