Tuesday, August 4, 2026

Mantra Purashcharana - మంత్ర పురశ్చరణ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - మంత్ర పురశ్చరణ

నారదా! గాయత్రీ పురశ్చరణమని మరొక కార్యక్రమం ఉంది. అత్యంత పుణ్యప్రదం అభీష్టదాయకం. పర్వతాగ్రం నదీతీరం బిల్వమూలం జలాశయం గోశాల దేవాలయం అశ్వత్థవృక్షం ఉద్యానవనం తులసితోట పుణ్యక్షేత్రం గురుసన్నిధి - ఇలా ఎక్కడైనాగానీ మనస్సు ఏకాగ్రంగా ఉండేచోట కూర్చుని ఈ పురశ్చరణ చేస్తే మంత్రఫలసిద్ధి కలుగుతుంది. 

ఏ మంత్రాన్నైనా పురశ్చరణ చేసుకోవచ్చు. వ్యాహృతి త్రయసహితంగా గాయత్రిని అయుత సంఖ్యలో జపించాలి. దీంట్లో తాంత్రిక వైదికమార్గాలు రెండూ ఉన్నాయి. రెండూ అనుష్ఠించవలసినవే. నారదా! గాయత్రీదేవి అంటే వేదమాత. ఆదిపరాశక్తి. సంధ్యావందన రూపంగా ద్విజులన్న వారందరూ శైవులూ వైష్టవులూ అనే తేడాలు లేకుండా ఉపాసిస్తున్నారు. కనక అందరూ శాక్తేయుల క్రిందే లెక్క.

ఆత్మశోధన లేని మంత్రశోధన నిష్ఫలం కనక ముందుగా ఆత్మశోధనకోసం మంత్రాన్ని మూడు లక్షలు జపించాలి. కనీసం ఒక లక్షసార్లయినా జపించాలి. ఇది వేదం చెప్పిన పద్ధతిలో జరగాలి. ఆత్మశుద్ధి చేసుకోనిదే ఏ జపహోమాలు చేసినా వ్యర్థం. కనక ముందుగా దాన్ని సాధించాలి. 

తపస్సుతో శరీరాన్ని తపింపజెయ్యాలి. దేవతలనూ పితృదేవతలనూ తనియించాలి. తపస్సే స్వర్గసాధకం, మహత్వసంపాదకం, క్షత్రియుడు బాహుశక్తితో వైశ్య శూద్రులు ధనంతో బ్రాహ్మణుడు జపహోమాదులతో ఆపదలనుంచి గట్టెక్కుతారు.

అందుచేత బ్రాహ్మణుడు తపస్సే చెయ్యాలి. చాంద్రాయణాది నియమ నిష్ఠలతో వ్రతాలతో శరీరాన్ని శోషింపజెయ్యాలి. అంతశ్శుద్దిని సాధించాలి. అదే తపస్సు అంటే. 

నారదా! ఇక అన్నశుద్ధి గురించి చెబుతాను. విను. ఆయాచితాన్నం, ఉంఛాన్నం, శుక్లాన్నం, భిక్షాన్నమని నాలుగువిధాలు. శుద్ధమైన భిక్షాన్నం తెచ్చి నాలుగు భాగాలు చెయ్యాలి. ఒకభాగం బ్రాహ్మణులకూ ఒకభాగం గోవులకూ ఒకభాగం ఆతిధులకూ మిగిలిన భాగాన్ని ఆలుమగలు భుజించాలి. 

కోడిగ్రుడ్డంత ముద్దలు ఎనిమిది గృహస్థ వానప్రస్థులకు గ్రాసప్రమాణం. బ్రహ్మచారులు యథేష్టంగా భుజించవచ్చు. గోమూత్ర సమ్మార్జనం అందరికీ తప్పదు. తొమ్మిదిసార్లు ఆరుసార్లు మూడుసార్లుగా ఈ సంప్రోక్షణలు చేనుకోవాలి. చెయ్యి శుభ్రంగా కడుక్కుని తదిత్యాది ఋక్కుతో గాయత్రిని ఉచ్చరిన్తూ ఇవి చేసుకోవాలి. చౌర్యాది దుష్కర్మలు ఆచరించేవారి ఇళ్ళనుంచి భిక్ష తెచ్చుకోకూడదు. అది ఆథమాన్నం. నరకహేతుపు. సరే - .

గాయత్రీ ఛందస్సులో అక్షరానికి లక్షచొప్పున ఇరవైనాల్గు లక్షలు మంత్రాన్ని పురశ్చరణ చెయ్యాలి, ఇరవైమూడు లక్షలైతే సరిపోతుందని విశ్వామిత్ర మతం. ప్రాణం లేని దేహంలాంటిది పురశ్చరణ లేని మంత్రం. ఎందుకూ పనికిరాదు.

కొన్ని రాశులూ కొన్ని నక్షత్రాలూ కొన్ని మాసాలూ కొన్ని తిథులూ కొన్ని వారాలూ పురశ్చరణకు పనికిరావు. వర్జనీయాలు. వాటిని తెలుసుకుని చంద్రతారానుకూలంగా శుక్లపక్షంలో మంచిరోజున మంచి ముహూర్తాన ప్రారంభించి పురశ్చరణ చేస్తే విశేషంగా మంత్రసిద్ధి కలుగుతుంది. ముగిశాక స్వస్తివాచన నాందీశ్రాద్దాలు యథావిధిగా చెయ్యాలి. విప్రులకు సంతర్పణ చెయ్యాలి. బట్టలు పెట్టాలి. 

అటుపైని గురువుల అనుమతితో ప్రత్యఙ్ముఖుడై శివస్థానంలో తపస్సు ఆరంభించాలి. తపస్సుకి ప్రసిద్ధిపొందిన పవిత్ర శివస్థానాలు కొన్ని ఉన్నాయి. కాశి, కేదారం, మహాకాళం, నాసికం, త్య్రంబక మహాక్షేత్రం - ఇవి భూలోకంలో పంచదీపాలు. కూర్మాసనం సర్వత్ర దీపమే. 

ప్రారంభించిన రోజునుంచి ముగించే రోజుదాకా ప్రతిరోజూ హెచ్చు తగ్గులు లేకుండా మంత్రజపం చెయ్యాలి. మునీశ్వరులైతే నిరంతరాయంగా చెయ్యాలిగానీ తక్కినవారు ఉదయంనుంచి మధ్యాహ్నం వరకూ చేసి తక్కిన సమయాన్ని ధ్యాన మంత్రార్థచింతనలతో గడపవచ్చు. 

అక్షరలక్షలుగా చేసే ఈ మంత్రపురశ్చరణలో దశాంశాన్ని హోమం చెయ్యాలి. పాలూ నెయ్యీ అన్నమూ తిలలూ పత్రపుష్పాలూ యవలూ హోమద్రవ్యాలు. దశాంశహోమం చేస్తేనేగానీ మంత్రసిద్ధి కలగదు.

చతుర్విధ పురుషార్థాలూ సిద్ధించాలంటే నిత్య నైమిత్తిక కామ్యకర్మలు మూడింటా గాయత్రిని నిష్ఠగా జపించవలసిందే. గాయత్రితో సమానమైన మంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదుగాక లేదు. మధ్యాహ్న సమయాన మితంగా భుజిస్తూ మౌనం పాటిస్తూ త్రిస్నానతత్పరుడై జలమధ్యంలో నిలిచి మూడు లక్షలు జపించాలి. 

కామ్యకర్మగా చేసేట్టయితే కార్యం సిద్ధించేవరకూ మంత్రజపం సాగించాలి. సామాన్య కామ్యకర్మల విషయంలో యథావకాశంగా జపించవచ్చు. ప్రాతస్సంధ్యలో ప్రతిరోజూ సహస్రగాయత్రీజపం చెయ్యడం ఉత్తమోత్తమం. ఆయురారోగ్య ఐశ్వర్యభోగభాగ్యాలు పుష్కలంగా లభిస్తాయి. 

ఆరునెలలుగానీ మూడునెలలుగానీ చేస్తే సంవత్పరాంతానికి ఫలితం కనపడితీరుతుంది. నేతితో లక్షపద్మాలు హోమం చేస్తే మోక్షం కరతలామలకమే. మంత్రసిద్ధి కలగకపోయాక ఏ జపాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఫలితం శూన్యం. దధిక్షీరాలతో పాతికలక్షలు హోమం చేస్తే దానిఫలం అమోఘమనీ వర్ణనాతీతమనీ అష్టాంగయోగసిద్ధికి సరిసమానమనీ మహర్షుల అభిప్రాయం. 

శక్తుడో అశక్తుడో నియతాహారులై ఆరునెలలు జపిస్తే చాలు గురుభక్తిపరులకు మంత్రసిద్ధి కలుగుతుంది. ఒకరోజు పంచగవ్యంతో, ఒకరోజు గాలి భుజించి, ఒకరోజు బ్రాహ్మణాన్నంతో గడిపేవాడు గాయత్రీజపానికి అర్హుడు. గంగాది పవిత్రనదీజలాలలో మునిగి శతమూ ఆ పవిత్రోదకాలను ఆచమించి శతమూ జపిస్తే సర్వపాప విముక్తి కలుగుతుంది. 

చాంద్రాయణ వ్రతఫలం దక్కుతుంది. బ్రాహ్మణులూ క్షత్రియులూ సొంత ఇంటిలోనే తపస్సు చేసుకోవచ్చు. గృహస్థులకూ బ్రహ్మచారులకూ వానప్రస్థులకూ ఇది వర్తిస్తుంది. మోక్షకాంక్షులు శ్రౌతస్మార్తక్రియలన్నీ నిర్వహిస్తారు. వీటిని అన్నింటినీ విద్వాంసుల దగ్గర సమగ్రంగా శిక్షణపాంది నిర్వహించాలి. (వినీ చదివీ చేసెయ్యకూడదు). భిక్షాన్నాన్నిమాత్రం ఎనిమిది ముద్దలు స్వయంగా భుజించవచ్చు.

వైశ్వదేవం




No comments:

Post a Comment

Gayatri Ashtottara Sahasram - గాయత్రీ అష్టోత్తర సహస్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ అష్టోత్తర సహస్రం గాయత్రీ సహస్ర నామావళి నారదా! మహర్షీ! సాధు సాధు. అడగవలసింది అడిగావు. నువ్వు మహాప్ర...