Saturday, April 11, 2026

Chpater 29 Rurumuni's rescue of his beloved - అధ్యాయము 29 రురుముని తన ప్రియురాలిని బ్రతికించుకొనుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 29

రురుముని తన ప్రియురాలిని బ్రతికించుకొనుట

పరీక్షిత్తిట్లనియె : రురుముని కామార్తుడై తన యాశ్రమములో నుండెను. అపుడతని తండ్రి 'రురూ! ఏమో దిగులుతో నుంటివే'మని యడిగెను. రురువు 'అయ్యా! స్థూలకేశు నాశ్రమమందు ప్రమద్వరయను తగిన కన్య గలదు. నాకామెను భార్యగ జేయవలయు' నని తండ్రితో బలికెను. ప్రమతి వెంటనే స్థూలకేశు నాశ్రమముజేరి యామునిని తనవానిగ సుముఖునిగ జేసికొని యతని కన్యను తన కుమారునకు నిమ్మని యడిగెను. ఒక మంచి మూర్తమున నా కన్యను మీ చేతిలో బెట్టుదునని స్థూలకేతుడు ప్రమతికి మాట యిచ్చెను. వనమునందు పెండ్లికై శుభసంభారములు సమకూర్చెను. ఆ తపోవనమున నట్లు వారిరువురును పెండ్లి జరుపుటకు సముద్యుతులైరి. అదే సమయమున ఆ చారులోచనయగు కన్య తన యింటి మొగసాలలో నిదురించుచుండగ నామె కాలి నొకపాము కాటు వేసెను. దాన నా చారులోచన విగతప్రాణయయ్యెను. ప్రమద్వర మరణించుట గాంచగనే యచట పెద్దగ యేడుపు పెడబొబ్బలు సాగినవి. మునులందఱు చుట్టును గుమిగూడి శోకించుచుండిరి. తన కూతునుగాంచి యామె తండ్రి ప్రాణాలు పోయినప్పటికిని మొగాన కాంతిరేఖ సన్నగిల్లక నేలపై పడియున్న యామెపైబడి వలవల యేడువసాగెను. ఆ యేడ్పు విని రురువు నచటి కేగెను.

సజీవవలెనే పడియున్న ఆ కామినియగు ప్రమద్వరను ఏడ్చుచున్న స్థూలకేశుని నచట మూగిన ఇతర ఋషిసత్తములనుగాంచి ఆ తావునుండి రురువు బయటకువచ్చి విరహాకులుడై ఇట్లు బోరున నేడ్చెను : 

'అక్కట ! దైవముచే నీపాము వింతగ పంపబడినదే! ఇది నా సుఖవిఘాతమునకు దుఃఖమునకును హేతువయ్యె గదా! నా ప్రాణవల్లభ మరణించెను. ఇకనేమి చేయుదు? ఎక్కడకని పోదును? ఈ నా ప్రియారాలు లేక జీవింపగోరికలేదు. ఈ వరారోహను నేను కౌగిలించుకొనలేదు. ముద్దు పెట్టుకొననే లేదు. మందభాగ్యుడను నేనామె పాణిని గ్రహించలేదు. ఈమెను గూడి యగ్నిలో లాజహోమము వేల్చనైతిని. ఈ మానవజన్మము వ్యర్థమైనది. ఇత్తరి నా యసువులు పోయిన బాగుగ నుండును. దుఃఖితుడు పాపియగు వాడెంత కోరుకొన్నను వానికి చావురాదు. ఇంక నాకీ నేలపై దివ్యసుఖవాంఛ లెట్లు తీరును? కనుక నేనిపుడు భీకరమై లోతైన మడుగులోపడికాని నిప్పులో దుమికికాని ప్రాణముల త్యజింతును. ఇంత విషము మ్రింగియో మెడ కురిపోసికొనియో చనిపోదును' అని యిట్లు రురువు వాపోవుచునదీతటమున గూర్చుండి తన మదిలో నిట్లాలోచించసాగెను: 

'ఘోరమైన యాత్మవధ చేసికొని చచ్చిన ఫలితమేమి? నా చావునకు నా తల్లిదండ్రులే దుఃఖింతురు. ప్రాణములు వదలిన నన్నుగాంచి దైవము మాత్రము హర్షము వెలిపుచ్చును. నా చావునకు తక్కిన వారందరు సంతసింతురు. నేను చచ్చి మాత్రమా పరలోకమున నా ప్రియకు చేయగల్గిన యుపకారమేమి? ఇట నీమె విరహవేదనమున నే నాత్మ వధము చేసికొన్నచో పరలోకమున నామె నాకు ప్రియురాలగునని నమ్మకమేమి? ఇందువలన నేను చనిపోయిన దోషము గల్గునుగాని చావకున్న నే దోషమును గల్గదు.' అని చక్కగ విచారించి రురువపుడు స్నాన మాచరించి యాచమించి శుచియై దోసిలినిండ నీరు తీసికొన 'నా వలన నేదేని సుకృతముగాని దేవతార్చనగాని జరిగియున్న యెడల - నేను నా గురువులను భక్తితో బూజించితినేని - నేను జపతపోహోమములు జరిపినవాడనేని - వేదములు చక్కగ నధ్యయనము చేసితినేని - గాయత్య్రనుష్ఠానము నన్ను సంస్కరించియుండెనేని - సూర్యుడు నాచేత నారాధింపబడెనేని నా ప్రియురాలిపుడే మరల జీవించుగావుత ! ఒకవేళ నా కాంత బ్రతుకదేని నేనుగూడ నామెతోబాటు ప్రాణములు వదలుదును.'

అని పలికి దేవతల నారాధించి యా జలము నతడు భూమిపై జల్లెను. ఇట్లు రురువు తన భార్యకై మిక్కిలిగ శోకించుచుండ నొక దేవదూత రురువుకడ కరుగుదెంచి యతనితో నిట్లనెను: 

'బ్రాహ్మణా! అతి సాహసము వలదు. చనిపోయిన నీ ప్రియురాలు తిరిగి యెట్లు బ్రతుకగలదు? ఈ ప్రమద్వర గంధర్వాప్సరసల కూతురు. అవివాహితగ మరణించినది. కాన వేరొక సుందరాంగిని కామింపుము. ఈమెకై దుర్బుద్ధివై రోదింతువేల? ఈమెపై నీకింత ప్రీతి యెందులకు? 

రురువిట్లనియె: 'ఓ దేవదూతా! నే నితర స్త్రీని వరింపజాలను. ఈమె బ్రతుకనిచో నే నిప్పుడే యిక్కడనే ప్రాణములు వీడుదును.' రురువు పట్టుదలకు దేవదూత ప్రమోదమందెను. 

ఆ దేవదూత మనోహరమైన సత్యవాక్కులతో నిట్లనెను: బ్రాహ్మణోత్తమా! పూర్వము దేవతలచే విధింపబడిన యొక యుపాయము గలదు. దానిని జెప్పుదును. వినుము: నీ యర్ధాయువునిచ్చి నీ ప్రమద్వరను బ్రతికించుకొనుము. 'నేను నిస్సందేహముగ నా సగమాయువు నా ప్రియురాలి కొఱకిత్తును. నా ప్రియ యీక్షణమే బ్రతికి లేచుగాత' మని రురువనెను. 

అంతలో విశ్వావసువు తన పుత్త్రి మరణవార్తవిని స్వర్గమునుండి దిగి వచ్చెను. అపుడా విశ్వావసువును దేవదూతయు ధర్మదేవతకడకరిగి యిట్లనిరి: 'ధర్మదేవా! ఈ ప్రమద్వర విశ్వావసుని కూతురు. రురుని ప్రియురాలు. పాముకాటుచే మరణించినది. ఈమె కొరకు రురువు చావునకును సిద్ధపడి తన యాయువులోని సగము భాగ మీయదలచెను. కనుక రురుని వ్రతాచరణ ప్రభావమున ప్రమద్వర మరల జీవించుగా వుత్ర!' 

ధర్ముడిట్లనియె: దేవదూతా! ఆ విశ్వావసుని కూతురు బ్రతుకవలయునన్నచో రురువుయొక్క సగమాయువుగొని యామెను బ్రతికించుము. ధర్మదేవుని మాటలువిని దేవదూత ప్రమద్వరను పునర్జీవితురాలనుజేసి సత్వరమే యామెను రురున కప్పగించెను. తరువాత నొక శుభదినమున మంచి ముహూర్తమున రురువు విధానము ననుసరించి యామెను పెండ్లాడెను.

ఆ విధముగ మరణించి యామె మరల జీవించెను. కావున సర్వవిధముల మఱిమంత్రౌషధులచే ప్రాణ రక్షణము తప్పక చేసికొనుటవంటి శాస్త్రసమ్మతమైన యుపాయము చేసికొనదగి యున్నది. అని పరీక్షిత్తు తన మంత్రులను తనకు రక్షకులనుగా నియోగించి ఏడంతస్తుల ఉత్తమమగు మేడను నిర్మింపజేసి తన సచివులతో కూడా నా మేడ వెంటనే ఆరోహించెను. అందు మణిమంత్రధరులగు శూరులను రక్షకులుగ నియమించెను. నీ సేవకుడనగు నా తప్పిదమును మన్నించుమని తన పక్షమున నేగి మరల మరల నతనిని వేడి ప్రసన్నుని జేసికొనుటకై రాజు గౌరముఖుడను మునిని తన్ను శపించిన మునియాశ్రమమునకు పంపెను. సిద్ధమంత్రజ్ఞులగు బ్రాహ్మణుల నాత్మరక్షణ కేర్పాటు చేసికొనెను. సురక్షితమైన ఆ మేడ నెవ్వడు నెక్కకుండునట్లొక మంత్రి కుమారుడచటనుండి మేడ చుట్టును కొన్ని యేనుగులను నిలువబెట్టెను. ఆ మేడలోనికి గాలిగూడ చొచ్చుట కవకాశము లేకుండెను. ఎవరును లోన ప్రవేశించకుండ నివారింపబడుచుండిరి. రాజు లోననుండియే స్నానసంధ్యాదికృత్యములు నిర్వర్తించుచు భక్ష్యభోజ్యాదు లారగించుచు రాచకార్యములు చక్కపెట్టుచుండెను. అట్లు పరీక్షిత్తు మంత్రులతో మంతనములాడుచు దినములు లెక్కపెట్టుకొనుచుండెను. 

అంతలో మంత్రవిదులలో ఉత్తముడగు కశ్యపుడు అను బ్రాహ్మణుడు మహాత్ముడగు రాజునకు శాపము గలుగుటవిని అతనికి చావు తప్పించి డబ్బు గడించుకొనగోరి రాజున్న చోటి కేగుదునని తలంచి శపింపబడిన రాజున్న చోటికి వెళ్ళుటకు తన యింటినుండి బయలుదేరెను. ఆ కశ్యపుడు గొప్ప మంత్రవిదుడు విద్వాంసుడు మునిసత్తముడు ధనార్థి.

అధ్యాయము 30 పరీక్షిత్తు విప్రశాపమున మరణించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 29 Parikshit is cursed - అధ్యాయము 28 పరీక్షిత్తు శాపగ్రస్తు డగుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 28

పరీక్షిత్తు శాపగ్రస్తు డగుట

సూతు డిట్లనెను : ఆనాటికి మూడవనాడు ధృతరాష్ట్రుడు గాంధారీకుంతీసహితుడై వనమందు దావాగ్నిలోబడి దగ్ధుడయ్యెను. సంజయు డంతకుముందే దర్మజుని ధృతరాష్ట్రుని వదలి తీర్థయాత్రకు వెడలెను. ఇదంతయును నారదుని వలన నెఱిగి ధర్మనందనుడు బిట్టు పలవించెను. కౌరవుల నాశము తరువాత ముప్పదియాఱండ్లకు యాదవు లెల్లరును ప్రభాసతీర్థమున నశించిరి. వారు మదిరాపానమత్తులై రామకృష్ణులు చూచుచుండగనే తమలో తాము కయ్యాలు పెట్టుకొని సమసిరి. బలరాముడు మేను చాలించెను. కమలాక్షుడగు శ్రీకృష్ణుడును శాపానుసారముగ వ్యాధుని బాణమున నిహతుడయ్యెను. అట్లు కృష్ణుడు తన యవతారము చాలించెనని విని వసుదేవుడు తన హృదయమందు శ్రీ భువనేశ్వరీదేవిని నిలిపి ప్రాణములు వదలెను. అంతట అర్జును డతి దుఃఖితుడై ప్రభాసతీర్థమునకేగి వారి వారికి దగినట్లుగ సంస్కారము లొనరించెను. అర్జునుడు హరి మృతశరీరముగాంచి చితిపేర్చి యందతనితో నతని యష్టమహిషులనుజేర్చి దహనసంస్కారము లొనర్చెను. రేవతితోడి బలరాముని దేహ మగ్నిలో దహింపజేసెను. పిమ్మట నతడు ద్వారకకుజని యచటి జనులను దోడుకొని పురమును వెడలించి నడచెను. వెంటనే సముద్ర ముప్పొంగి వాసుదేవుని పురమును నీటముంచెను. అంతట కిరీటి ప్రజలను వెంటనిడుకొని నిర్గమించెను. తేజస్వియగు నర్జును డనిరుద్దుని కొడుకు నింద్రప్రస్థపురికి రాజుగ జేసెను. పిమ్మట నర్జునుడు తన పడిన పాటులన్ని యును వ్యాసునకు చెప్పి రోదించెను.

వ్యాసుడు అర్జునితో మహామతీ ! శ్రీహరి మరల నవతరించునపుడు నీవు నతని వెంటవత్తు వనెను. అటు తరువాత చోరులును అభీరులును కృష్ణుని తక్కిన భార్యలమీద స్త్రీలమీదపడి దోచిరి. స్త్రీల యొంటిమీది సొమ్ములన్నియు నొలుచుకొని పోయిరి. అర్జునుడుగూడ తేజోహీనుడయ్యెను. వజ్రనామకు డింద్రప్రస్థమున యాదవులకు రాజుగ జేయబడెను. రాబోవు యుగమున నీవు మరల పూర్ణతేజస్కుడవు గాగలవని వ్యాసుడు చెప్పగ నర్జునుడువిని ముదమంది కరిపురమున కేగెను. అచట జరిగిన వృత్తాంతమంతయు నర్జునుడు ధర్మరాజాదులకు దెలిపెను. ధర్మజుడు శ్రీహరి దేహత్యాగము యాదవ వంశక్షయము అంతయువినెను. అంతట ధర్మరాజు హిమాచలమునకేగ సంకల్పించెను. అతడు ముప్పదియా
న నెఱిగి ధర్మనందనుడు బిట్టు పలవించెను. కౌరవుల నాశము తరువాత ముప్పదియాఱండ్ల ప్రాయముగల పరీక్షిత్తునకు బట్టము గట్టెను. ఆ ప్రకారముగ ధర్మనందనుడు కరిపురమును ముప్పదియాన నెఱిగి ధర్మనందనుడు బిట్టు పలవించెను. కౌరవుల నాశము తరువాత ముప్పదియాఱండ్లు చక్కగ పరిపాలించి పిదప తన తమ్ములతో ద్రౌపదితో బయలుదేరెను.

ఆ విధముగ నారుగురును హిమగిరికేగి యందే ప్రాణములు వదలిరి. ఇట పరీక్షిత్తు పరమ ధార్మికుడు - రాజర్షి - రాజేంద్రుడు- చక్కగ నరువదేండ్లు పరిపాలించెను. ఒకనాడత డడవికి వేటకేగెను. ఆ రాజు దెబ్బతిన్న మృగాదులను పట్టుకొనుటలో మట్టమధ్యాహ్నమయ్యెను. ఆ పట్టపగటి వేడిమి కత డాకలిదప్పికలచే నలమటించెను. అతడా వడదెబ్బకు తాళలేక చేరువలో ధ్యానమగ్నుడైయున్న యొక మునివరునిగాంచి జలమిమ్మని యడిగెను. ఆ ముని నిర్మలనిశ్చలసమాధిలో నుంటచే మాటాడలేదు. పరీక్షిత్తు దప్పికచే కలిమాయచే కుపితుడై తన వింటికొనచే నచట చచ్చిపడియున్న పామును పైకెత్తెను. అతడు కలి ప్రభావమున దాని నా ముని మెడలో వేసెను. పామును తన మెడలో వైచినను ముని మాటాడకుండెను. ముని నిర్వికల్పుడై యుండెను. పిదప రాజు తన గృహమున కేగెను. ఆ ముని కుమారుడు గవిజాతుడు మహా తపస్వి. మహాతేజస్వి, మహాశక్తుడు. ఆ బాలుడు వన ప్రాంతమున తోడి మిత్రులతోడ నాడుకొనుచుండెను. అంతలో నతని మిత్రులెవరో యతనితో 'నీ తండ్రి మెడలో ఎవరో చచ్చిన పాము వేసి'రనిరి. ఆ మాటలు వినగనే యతుడు క్రుద్ధుడైవేగిరమే దోసిట జలముగొని నాతండ్రి మెడలో చచ్చినపాము వేసిన రాజు-పాపి యేడునాళ్లలో తక్షకునిచే కాటువేయబడి చచ్చునుగాత' మని శపించెను. అపుడు కొందఱు ముని కుమారకులు రాజభవనమందున్న పరీక్షిత్తుకడ కేగిరి. వారు రాజుతో నతనికి ముని బాలుడిచ్చిన శాపమును దెలిపిరి. అట్లు రాజు తనకు ముని బాలు డిచ్చిన శాపము తెలసికొనెను.

అంత పరీక్షిత్తు శాపము తప్పదని యెఱింగి వెంటనే వృద్ధామాత్యులను రావించి వారి కిట్లనియెను: ''నా ద్వేషకారణముగ నొక ముని బాలునిచేత శపింపబడితిని. కాన నో మంత్రులారా! ఇపుడు నే జేయదగిన యుపాయమేదేని నున్నచో నాలోచింపుడు. ఎట్టివానికేని చావు తప్పింపరాదని వేదవిదులందురు గదా! ఐనను తెలిసినవారు శాస్త్రోక్తపద్ధతులాచరింతురు. ఉపాయజ్ఞులగు - బుద్ధిమంతులు కొంద ఱిట్లు వచింతురు. ఎల్ల కార్యములు విజ్ఞుల యుపాయములవలన తప్ప మరిదేనివలనను నెఱవేరవు. మణి మంత్రౌషధముల ప్రభావము దుస్తరము. వాటి సిద్ధులవలన కార్యములు సిద్ధించును. తొల్లి యొక ముని తన భార్య పాముకాటునకు చనిపోగా నత డామెను మరల బ్రతికించుకొనెను. ఆ ముని తన భార్యకు తన యాయువులోని సగపాలిచ్చి యామెను మరల బ్రతికించుకొనెను. పండితులగు వారు భవితవ్యమును విశ్వసింతురు. మంత్రులారా! ఇందులకు ప్రత్యక్ష దృష్టాంతము ఇది: 

"ఈ భువిపైగాని దివిపైగాని యే పురుషుడైనను దైవముపై భారము వైచి నిరుద్యోగమున నూరక కూరుచుండునా? విరక్తుడగు యతికి సైతము బిచ్చమెత్తుకొనక పొట్టగడువదు గదా ! అతడు గృహస్థులు పిలిచినను పిలువకున్నను నింటింటికి వెళ్ళుచుండును. కాని యూరక గోళ్ళుగిల్లుకొనుచు కూరుచుండునా? కూరుచున్నచో నతని నోటిముందునకు పట్టెడు మెదుకులు తెచ్చి పెట్టువాడెవడు? తినకున్నచో నన్నము పొట్టలోనికి పోవుటెట్లు? కావున కార్యము నెఱవేరినను ప్రయత్నము మాత్రము చేసి తీరవలయును. ఒకవేళ కార్యము సాధ్యముగానిచో మాత్రమే మదిలో దైవమునే దిక్కుగ నమ్ముకొన వలయును.'' 

రాజు మాటలువిని మంత్రులనిరి: 'తన ప్రియురాలికై తన ఆయురర్ధ మిచ్చి బ్రతికించికొన్న యా ముని యెవరో యాతనిభార్య యెట్లు మరణించెనో విశదముగ దెలుపుడు.

రాజిట్లనియెను: ''భృగుమహర్షి భార్య పులోమ. ఆమె చాల సౌందర్యరాశి. ఆమెకు చ్యవనుడను ప్రసిద్ధికెక్కిన ముని సంభవించెను. ఆ చ్యవనునకు శర్యాతికూతురు సుకన్యయను నామె భార్య యయ్యెను. ఆ సుకన్య సుందరాంగి. వారికి ప్రమతియను ప్రఖ్యాత సుతుడు గలిగెను. ఆ ప్రమతి భార్య ప్రతాపి యనబరగెను. ఆమెకు రురువను సుతుడు జనియించెను. ఆనాళ్లలో స్థూలకేశుడను తపస్వి యుండెను. ఆ తాపసుడు ధర్మాత్ముడు. సత్యసమ్మతుడు. త్రిలోకసుందరి మేనక విశ్వావసువువలన గర్భము దాల్చెను. ఆమె యొకనాడు నదీతీరమున విహరించుచుండగా నిది జరిగెను. ఆ మేనక స్థూలకేశు నాశ్రమమున నొక యందాలపాపను గనెను. ఆ బాలనదీతటమున నొప్పులకుప్పయై యొప్పారుచుండెను. ఆ ముని యాదిక్కు లేని బాలను చేరదీసి ప్రమద్వరయను పేరిడి ముద్దుగ పెంచుకొనుచుండెను. కొంతకాలమున కా కన్నియ సర్వలక్షణశోభితయై పడుచుదనమున నెసగుచుండెను. ఒకనాడా పడుచుకన్నెను రురుమహర్షికన్నారగాంచెను. ఆతని హృదయమున పూవుముల్కుల కైపైక్కెను.

అధ్యాయము 29 రురుముని తన ప్రియురాలిని బ్రతికించుకొనుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 27 By the grace of Sridevi, the Pandavas found their dead heroes - అధ్యాయము 27 శ్రీదేవి దయవలన పాండవాదులు మృతవీరులను గాంచుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 27

శ్రీదేవి దయవలన పాండవాదులు మృతవీరులను గాంచుట

సూతుడిట్లనియెను : ఆ పంచపాండవులకు ద్రౌపది భార్యయై పతివ్రతయైనది. ఆ సాధ్వీమతల్లికి తన పతులకంటె సుందరతరులగు నైదుగురు కొమరులు గల్గిరి. అర్జునుడు శ్రీకృష్ణు ననుమతమున నతని సోదరియగు సుభద్రను హరించుకొనివచ్చి భార్యగ బడసెను. మహాభారతయుద్ధమందు సుభద్రకు జనియించిన అభిమన్యుడును ద్రౌపదేయులును వీరస్వర్గమలంకరించిరి. ఆ సమయమున నభిమన్యుని భార్య యుత్తర నిండుచూలాలుగ నుండెను. ఆమె గర్భ మశ్వత్తాముని బాణాగ్నికి క్రాగిక్రాగి మృతశిశువును గనెను. అపుడు శిష్టరక్షకుడు శ్రీవాసుదేవుడు తన లోకాద్భుత ప్రతాపము జూపించి యశ్వత్థామ బాణాగ్నికి దగ్ధుడైన తన మేనల్లుని కొడుకునకు మరల ప్రాణము పోసెను. వంశము పరిక్షీణమగుచుండగ బుట్టినవాడగుటవలన నా బాలుడు పరిక్షిత నామమున నిలపై వన్నెకు వాసికెక్కెను. ధృతరాష్ట్రుడు తన నూరుగురు కొడుకులు సంగరమందు చచ్చుటవలన దుఃఖితుడై పాండవుల యేలుబడిలో నుండెను. భీముని హృదయవిదారకమైన పరుషములకు పీడితుడయ్యును కోరలూడపెఱికిన పామువలె పడియుండెను. గాంధారియు శోకాతురయై యచ్చటనే యుండెను. ధర్మరాజు వారిరువురకు పరిచర్యలు సలుపుచుండెను. ధర్మాత్ముడగు విదురుడును యుధిష్ఠి రానుమతిచే వారిచెంతనే యుండి మంచి మాటలతో వారిని ప్రబోధించుచుండెను. ధర్మపుత్త్రుడును వారికి నిరంతర సేవలు సేయుచు వారి పుత్త్రశోకము మఱపించుచుండెను.

భీముడు మాత్రము పట్టరాని యుక్కురోషమున లోకులు వినునట్టుగ వారిని వాగ్బాణములతో పీడితులుగజేయుచుండెను. ఈ పుట్టు గ్రుడ్డివాని కొడుకులందఱు రణరంగమున నొక్కుమ్మడిగ నాచేతిలోబడి మన్నుగఱచిరి. ఆ క్రూర దుశ్శాసనుని ఱొమ్ముచీల్చి వానిగుండె నెత్తురు కుత్తుకబంటిక గ్రోలితిని. ఈ కుచ్చితాలమారి గ్రుడ్డివాడిపుడు మేమిడు ధర్మపిండమును తలవంచుకొని తినుచున్నాడు. ఇతడు కాకమువంటివాడు. వట్టి పనికిమాలినకుక్క. వ్యర్ధముగ జీవించుచున్నాడు. భీము డీ రీతిగ ప్రతిదినము పరుష వాక్యములు ధృతరాష్ట్రుని ముందాడుచుండెను. ధర్మాత్ముడగు ధర్మరాజు మాత్రమతడు మోఱకుడని తలచి యతని నూరడించుచుండును. ఇట్లు ధృతరాష్ట్రు డచట పదునెన్మిదేండ్లు తీరని పుత్రశోకమున నెట్టులో గడపి తుదకు వనములకేగుటకు ధర్మరాజు నడిగెను. నేను విధివిధానముగ నా కొడుకులకు తిలతర్పణము లొనరింతు నని ధృతరాష్ట్రుడు యుధిష్టిరునిగోరెను. భీముడు రణమృతుల కందఱి కంత్యక్రియలు జరిపెనుగాని ప్రాతపగలు మనస్సులో పెట్టుకొని నా కొడుకులకు మాత్రము కర్మలు జరుపలేదు. కనుక నీవు నాకు సరిపడు ధనమొసంగినచో నా కొడుకుల కర్మలొనరించి పిమ్మట స్వర్గ ఫలప్రదమగు తపమొనరింప వనముల కేగుదును. అపుడు విదురుడు ధృతరాష్ట్రునకు ధనవిమ్మని ధర్మరాజుతో చాటుగ చెప్పెను. అందులకు ధర్మజు డతనికి ధనమీయ దలంచెను. అంత ధర్మరాజు తన వారిని రావించి ఓ మహాశయులరా ! ధృతరాష్ట్రున కతని కుమారుల తిలతర్పణమునకు డబ్బిత్తు, ననెను. మహాతేజస్కుడగు తన పెద్దన్న మాటలు విని మహాబాహుడగు భీము డుగ్రుడై యిట్లనియెను:

''ఓ మహానుభావా! దుర్యోధన పక్షపాతికి ధనమిచ్చుటయా? అతడా సొమ్ముతో సుఖము లొందును. ఇంతకన్న మూర్ఖత్వము మరేమున్నది? నీ యీ దుర్మంత్రణము వలననే మేము మొదటి నుండి కష్టాలపాలయితిమి. ఆ దుర్మార్గుని వలననే కదా ద్రోపది నిండు సభ కీడ్పించబడినది? ఓ సువ్రతా! మేమా విరాట నగరమున నుండుటకు హేతువు నీ ప్రసాదమే కదా! అమిత విక్రములమగు మాకొక మత్స్యరాజు నింట నూడిగము చేయవలసి వచ్చెగదా! ఇంతకు నీవు జూదమాడనిచో మాకీ యష్టకష్టాలు వచ్చెడివే కావు. ఆ జరాసంధునే పరిమార్చగల్గిన నేనొక విరాటుని వంట యింట గంటె త్రిప్పవలసి వచ్చెను. అర్జును డింద్రుని కుమారుడు. అంతటివాడే యాడుపిల్లలకు నర్తనము నేర్పువాడై బృహన్నల గావలసి వచ్చెను గదా! అతడొక సామాన్య స్త్రీ రూపము దాల్చెను. విధి యెంతగ మారె నకట ! గాండీవగుణరవమున శోభిల్లు గాండీవి చేతగాజులు గలగల లాడుటయా! ఆత్మాభిమానము గల మహాపురుషున కభిమానము చంపుకొనుటకన్న దుఃఖమేముండును? కనులకు కాటుక తల వెనుక జడకొప్పుదాల్చి కులుకు పార్థుని గాంచినప్పుడెల్ల నా గుండె నీరై కరిగిపోయెడిది. దీనికంతటికి మూలకారణమైన యీ ముసలి గ్రుడ్డివాని తల నా కఱకు కత్తివాటుతో కఱకఱ దెగనఱికినగాని నామదికూరటగల్గదు. అయ్యో! ఆ దుష్టదుర్యోధనుడు విదురాదులతో సంప్రతింపకయే మమ్మానాడు మంటలు మండు లక్కయింట గాల్పచూచెనే! అయ్యో పాపము, మమ్ము గాల్పదలచిన యా దుష్టుడే చివరకు కాలి బూడిద యయ్యెను గదా! ఓ నరపతీ! ఆనాడు నీ యనుమతి లేకయే కీచకాదుల నంతమొందించితిని. కాని ధృతరాష్ట్రుని సుతులు వారి భార్యలందరు నా చేత చంపబడక పోయిరి గదా! రాజేంద్రా! ఒకనాడు నీ శత్రులగు దుర్యోధనాదులు గంధర్వుల చేతిలో జిక్కిరి. అపుడు నీ దయాభిక్షవలన వారు విడిపింపబడిరి. అది నీ మూర్ఖత్వము గాక మరేమి? అట్టి కిరాతకుడైన దుర్యోధనుని మేలునకు నీవిపుడు ధనమీయదలచితివే! నీవెంత ప్రేరించినను నేను మాత్రమే దీని కొప్పుకొనను.''

భీము డీ రీతిగ పలికి వెళ్ళెను. పిదప ధర్మజుడు తక్కిన మువ్వురితో సంప్రతించి ధృతరాష్ట్రునకు బహు ధన మొసంగెను. అపు డంబికాసుతుడగు ధృతరాష్ట్రుడు తన కొడుకుల కూర్ధ్వలోక క్రియలు జరిపెను. విప్రులకు భూరిగ దాన దక్షిణ లొసగెను. ఆ విధముగ ధృతరాష్ట్రుడు గాంధారీ సహితుడై తన కొడుకులకు పరలోకక్రియలు జరిపెను. పిమ్మట నతడు విదురునితో కుంతీగాంధారులతో వనముల కేగెను. మహామతి విజ్ఞుడునగు సంజయుడుగూడ వారివెంట బయలుదేరెను. పాండవులు కుంతి నెంతయో వారించిరి. కాని యామె వినక వనముల కేగెను. ఆ సమయమున భీముడు నితర కౌరవులు విలపించుచు గంగాతీరమువదలి గజపురి కేగిరి. వారట్లడవులకేగి గంగాతీరమందలి శుభమైన శతయూపాశ్రమము జేరి యచ్చట పర్ణకుటీర మేర్పరచుకొని యందు సమాహితచిత్తమున తపము నెఱపిరి.

వారు పోయి యారేండ్లు గడచెను. ఒకనాడు ధర్మజుడు వారి యెడబాటు సైపలేక తన తమ్ములతో నిట్లు పలికెను: 

ధర్మజుయిట్లనియె: నేను కలలో దుర్బలయై వనమందుండియున్న కుంతిని గాంచితిని. కనుక మన తల్లిని పితరులను దర్శింపవలయునని నా మనస్సు దలంచుచున్నది. మహాత్ములగు విదుర సంజయులను జూడవలయుననియు నా మది గోరుచున్నది. కనుక మీకిష్టమైనచో మనమందఱము కలసి పోదము. ఇది యుక్తమని తలచుచున్నాను.' అటు పిమ్మట పాండవులు ద్రౌపది సుభద్ర యుత్తర నాగరకజనులును - వారిని దర్శించు కోరికతో శతయూపాశ్రమము చేరిరి. అచ్చో వారు వారిని సందర్శించిరి. వారిలో విదురుడు గనబడలేదు. అందులకే దర్మజు డతనినిగూర్చి ధృతరాష్ట్రు నడిగెను. ధృతరాష్ట్రుడు ధర్మజునకిట్లు పలికెను: 

ధృతరాష్ట్రుడు యిట్లనియె: ఆ విదురుడు నిస్పృహుడు నిష్పరిగ్రహుడు విరక్తుడు. కాన నెటనో యేకాంతమున సనాతనతత్త్వమును దనలో ధ్యానించుచున్నాడు. మరునాడు యుధిష్ఠిరు డాగంగాతటమున సంశితవ్రతుడు తీవ్రతపమున కృశాంగుడునగు విదురుని దర్శించెను. 

ధర్మజుడయిట్లనియె:నేను దర్మజుడను నీకు ప్రణమిల్లుచున్నాను అని పలికెను. విదురు డది వినియు స్థాణువువలె విననట్టులుండెను. అంతలో నొక్క క్షణమాత్రలో విదురుని నుండి యొక మహాద్భుత దివ్యతేజము బయలువెడలి ధర్మాంశజుడగు ధర్మజునిలో లీనమయ్యెను.

అట్లు విదురుడు ప్రాణములు వదలగ ధర్మజుడు వగచి యతని దేహమునకు దహనసంస్కారములు చేయబూనుకొనెను. అంతలో నొక యశరీరవాణి యిట్లు పలికెను: 

"ఓ ధర్మరాజా! వినుము. ఇతడు వైరాగ్య శ్రీలలితుడు. బంధముక్తుడు. కాన దహనార్హుడు గాడు. మీరింక యథేచ్ఛముగ నేగుడు. అపుడు పాండవ సోదరులందరును పావనగంగలో మునిగి దృతరాష్ట్రునకు జరిగిన దంతయును నివేదించిరి. పాండవులు మరల తమ యాశ్రమములు చేరి పౌరులతో నుండిరి. అంతలో వారి చెంతకు శ్రీ వ్యాసభగవానుడును నారదమహర్షియు నేతెంచిరి. అత్తఱి కొంద ఱితర మునులుగూడ ధర్మజునికడ కరుగుదెంచిరి. అపుడు శుభదర్శనుడగు వ్యాసునితో కుంతి యిట్లు విన్నవించెను. 

"తపోధనా! ద్వైపాయనా! నా కొడుకు కర్ణుడు తాను పుట్టినప్పుడే నానుండి దూరమయ్యెను. నా మది యిపు డతనిని గాంచ పరితపించుచున్నది. కనుక నాకతనిని జూపుము. ఓ విభూ! మహానుభావా! ఇందులకు నీవే సమర్థుడవు. కనుక నా వాంఛితము నెఱవేర్పుము." 

గాంధారి యిట్లనియెను: దుర్యోధనుడు రణమున కేగిన పిమ్మట నేనతనిని చూచి యెరుగను. కనుక నోమునివర్యా ! అతనిని నతని సోదరులను నాకిపుడు జూపుము. 

సుభద్ర యిట్లు పలికెను: ఓ మహాతపోధనా! అభిమన్యుడు నాకు ప్రాణములకంటె ప్రియమైనవాడు. నే నతనిని జూడగోరుచున్నాను. కనుక నా కతనిని జూపుము. 

సూతుడిట్లనియెను: ఆ విధముగ వ్యాసుడు వారు పల్కిన పల్కు లాలకించెను. ఆ మునీశ్వరుడు సంధ్యాసమయమున గంగనుజేరి ప్రాణాయామ మాచరించెను. అపు డతడా దేవదేవి దీనబంధువగు శ్రీసనాతనీ దేవిని హృదయకమలమందు నిలిపి ధ్యానించెను. పిదప వ్యాసుడు యుధిష్ఠరాదుల రావించెను. వారా పుణ్యగంగాజలముల పరిశుద్ధులైరి. ఆ విశ్వజననిని సంతుష్టురాలిని చేసి వ్యాసుడిట్లు సన్నుతించెను:

''శ్రీదివ్యమూల ప్రకృతీ! పురుషారామా! సగుణనిర్గుణాకృతీ! దేవదేవీ! బ్రహ్మ రూపిణీ! సుందరమణిద్వీపనివాసినీ! బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇంద్రాగ్ని యమవరుణ కుబేరులకు పూర్వమే వెలుగొందు శ్రీమాతృదేవీ! ఓ ఆద్యయగు పరాశక్తీ! నీకు సుమాంజలు లర్పింతును తల్లీ! ఓ పరిపూర్ణా! కళామయీ! భవానీ! ఈ పంచమహాభూతములు వాని గుణములు మనోబుద్ధ్యహంకారములు కరణములు సూర్యచంద్రులులేని మహాకాలమున తెలియరాని పెంజీకట్ల కావల నేకైక మహాజ్యోతిర్మూర్తివై విలసిల్లు దేవీ! నీకు సుమాంజలు లర్పింతును. విరాట్‌ స్వరూపమగు జీవలోకమును హిరణ్యగర్భమయమగు చిత్తమందునిలిపి యాసమష్టిలింగశరీరమగు హిరణ్యగర్భతత్త్వమును సామ్యావస్థలో నుంచి కల్పము చివరిదాక నిశ్చలచైతన్యజ్యోతియై వెలుగొందు శ్రీదేవి నెంత వివేకియు నెఱుగజాలడు. నీ వే యా మృతవీరుల జూపింపుము.'' ఈ వ్యాసస్తోత్రముతో నన్నుతయై శ్రీ భువనేశ్వరీ దేవి స్వర్గమునుండి మృతవీరుల రావించి యక్కడివారికి జూపెను. అట్లు మరల గనంబడిన తమ తమ వారిని కుంతి గాంధారి సుభద్ర ఉత్తర పాండవులు చూచి చూచి ముగ్ధులై శ్రద్ధాంజలు లర్పించిరి. పిదప వ్యాసుని యమితతేజము చేత వచ్చినవారలు మరల తమ తమ చోటులకు పంపబడిరి. ఇట్లు పాండవులు శ్రీదేవి దయవలన నింద్రజాలమువంటి దృశ్యము గాంచిరి. తరువాత నెల్లరు తమ తమ వాసములకు చేరుకొనిరి. పాండవ లట్లు శ్రీవ్యాసుని కథామృతపు చిలువలు రుచి జూచుచు హస్తిపుర మరిగిరి.

అధ్యాయము 28 పరీక్షిత్తు శాపగ్రస్తు డగుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 26 The Birth Story of Pandavas - అధ్యాయము 26 పాండవుల జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 26

పాండవుల జన్మవృత్తాంతము

సూతుడిట్లనెను : ఆ ప్రకారముగా శంతనుడు సత్యవతిని పెండ్లి యాడెను. వారి కిరువురు కొమరులు గలిగి కాలవశులై మరణించిరి. ఆ వ్యాసమునితోడ కూడకకేగిన యంబిక మునిమూర్తుని చూడనోపక కన్నులు మూసికొనెను. ఫలితముగ ధృతరాష్ట్రుడు పుట్టుచీకుగ బుట్టెను. మరొకరాచకన్నె మునినిగాంచగానే యామె మొగము వెలవెలబోయెను. అందుచే వ్యాసుని కోపమున నామెకు పాండువర్ణము గలవా డుద్భంచెను. మూడవసారి కామకళావిదురాలగు దాసి వ్యాసుని సంతృప్తిని జేసెను. ఆ కారణమున ధర్మంశమున నామెకు సత్యవాది శుచియగు విదురుడు జన్మించెను. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడగుటవలన మంత్రు లతని కధికార మీయక చిన్నవాడైననను పాండుని రాజుగ నియోగుంచిరి. ఇట్లు బలశాలియగు పాండురాజు భీష్మ ననుమతిచే రాజయ్యెను. మేధావియగు విదురు డతనికి మంత్రిగ నియమింపడెను. ధృతరాష్ట్రునకు నిర్వురు భార్యలు గలరు. మొదటి యామె సుబలుని పుత్రియగు గాంధరి. రెండవ భార్య యింటిపనులు చక్కబెట్టుచుండు వైశ్య. అటులే పాండురాజునకు శూరసేనుని కూతురగు కుంతి, మద్రదేశపు రాజు కూతురు మాద్రియను భార్యలు గలరు. గాంధరి నూర్గురు కొడుకులను గనెను. వైశ్య యుయుత్సుడను నొక ప్రియ సుతుని గనెను. కుంతి తన తండ్రి యింట నుండగ కన్నెప్రాయమునందె సూర్యునివలన కర్ణుని గనెను. తరువాత నామె పాండురాజునకు భార్య యయ్యెను.

ఋషులిట్లనిరి: సూతమునీ, మొదట కుంతికి కొడుకు పుట్టెనంటివి. తరువాత పాండురా జామెను పరిగ్రహించెనంటివి. నీవంతయు వింతగ బలుకుచున్నావు. సూర్యునివలన కన్యకకు కర్ణుడెట్లు గలిగెను? ఆమెకు మరల పాండురాజుతో నెట్లువివాహమైనది? 

సూతుడిట్లనెను: శూర సేనుని కుంతి. ఆమెకు చిన్నప్పుడే కుంతిభోజుడను రాజు శూరసేనుని ప్రార్థించి తన కూతురుగ స్వీకరించెను. అట్లు కుంతిభోజు డామెను పుత్త్రిగ స్వీకరించి యామె నగ్నికార్యములందు సేవకు నియోగించెను. అంతనొకనాడు దుర్వాసోమహర్షి యామె పుట్టినింటికి చాతుర్మాస్యదీక్ష జరుపదలచి యేతెంచెను. అపుడు కుంతి యా మునీశ్వరునకు పరిచర్యలు చేయుచుండి నతనిని సంతుష్టునిగ జేసెను. అందుకు ముని యలరి యామె కొక దివ్య మంత్ర ముపదేశించెను. ఆమంత్రప్రభావమున దేవతలే వచ్చి వాంఛితార్థములు లీడెర్చగలరు. ముని వెళ్ళిన పిదప కుంతి మంత్రప్రభావ మెఱుగదలచి యే దేవత నాహ్వానింపవలయునాయని యాలోచించెను. అంతలో అపుడే ఉదయించిన దివాకరుడగు సూర్యుని చూచి యామె మంత్ర ముచ్చరించి రవి నాహ్వానించెను. అపు డాదిత్యుడాకాశమండలమందుండి దివ్యసుందరమైన మానావాకారమున నామె మందిరమం దామె సమీపమున నవతరించెను. అట్లు సూర్యునిగని కుంతి కడు విస్మయమందెను. భయమున కంపించెను. మరుక్షణమే పుష్పవతి యయ్యెను. ఆ చారులోచన కేల్మొగిచి నిలచి రవి కిట్లనియెను: 

కుంతి నిట్లనియెను:  మీ దర్శనభాగ్యమున నేనిపుడు సంతసిల్లితిని.ఇంక మీరు మీ నిజమండలమున కేగుడు. 

సూర్యుడిట్లనియె: కుంతీ| మంత్రబలమున నన్ను నీవు పిలిచితివి. పిలుపుపై వచ్చి నీముందు నిలచిన నన్ను నీవేల పొందకున్నావు? నల్లని కడ కన్నులు గల కుంతీ| నేను కామార్తుడను. నీయం దనురాగభావము కలవాడను.మంత్రాధీనుడనై వచ్చితిని. నీతో విహారించుటకై కొనిపొమ్ము. 

కుంతి నిట్లనియెను: ధర్మజ్ఞా| సర్వసాక్షీ| సువత్రా| నీకు నమస్కారము. నేను కన్నియను. కులకన్యనగు నన్నునీవిట్లు పరుషాలు పలపకరాదు. 

సూర్యుడిట్లనియెను: నేనిపుడు రిత్తగ వెళ్ళినచో దేవతలందరు నన్ను నిందసేతురు. పరిహసింతురు. నాకు వారిలో దలవంపులగును. ఇది నిజము. నన్ను నీవిపుడు కలియకున్నచో నిపుడే నిన్ను, నీకు మంత్రమొసంగినవిప్రుని శపింతును. వరాననా| జనులు ఇది గుర్తింపకుండునట్లును నీ కన్యాత్వము చెడకుండునట్లు చేయుదును. నావంటి కొడుకును నీకు కలుగును. అని పలికి రవి తనయందు భావముకలదై లజ్జతో కూడియున్న ఆ కుంతి ననుభవించి ఆమెకు వాంఛితమగు వరమునిచ్చి వెడలెను.

సుశ్రోణియగు కుంతి గర్భము ధరించి రహస్య మందిరమందే యుండెను. ఈ జరిగిన కార్యమామె దాదికి తప్పనామెతల్లికిగాని లోకులకుగాని మరెవ్వరకిని తెలియదు. తన రహస్యమందిరమున అతి మనోహరుడును అతిరమ్యములగు కవచకుండలములతో కూడినవాడునగు కుమారుడామెకు గలిగెను. రెండవ సూర్యుని, అపర కుమారస్వామివలె నా శిశువుండెను. ఆ బాలుని దాది యెత్తుకొని సిగ్గులో మునిగిన కుంతితో నిట్లనియెను: 

"నీవేల యిపుడు చింతించుచున్నావు? నేనున్నానుకదా|" కుంతి తన కుమారునొక పెట్టెలో
నుంచుచు నాతనితో నిట్లనెను: 

"ఓసుతా! ఆర్తనగు నేను నా ప్రాణసముడవగు నిన్ను విడనాడుచున్నాను. ఏమి చేయగలను? ఆ సుగుణనిర్గుణ స్వరూప సర్వేశ్వరి భగవతి నిన్ను కాపాడుగాక! కోరికలదీర్చు ఆ విశ్వమాత నిను పాలించుగావుత! నేను దుష్టురాలగు స్వైరణివలె లోకలోచనుని తనయుడవగు నిన్నొంటిగ వదలుచున్నాను. ప్రాణసముడవగు కుమారా! నీ లలిత ముఖకమలము మరల నెపుడు గాంతునో కదా! వెనుకటి జన్మములందు నేను త్రిలోకమాత నారాధింపలేదేమోకదా! ఓ నందనా! అదృష్టహీనురాలను నేను నిన్ను వనములందు వదలుచున్నాను. నా పాపబుద్ధికి నేనే పరిపరి విధాల పరితపించుచున్నాను ఈ రీతిగ కుంతి పలికి జనదర్శనభయమున తన పట్టిని పెట్టెలో భద్రముగ నుంచి దాదిచేతులో పెట్టెను. ఆ పిదప భయపడుచు స్నానముచేసి కుంతి తన తండ్రి యింట నుండెను. ఆ పెట్టె నదిలో కొట్టుకొని పోయిపోయి యధిరథుడనువానికిదొరకెను. ఆ యధిరథుడొక సూతుడు. అతని భార్య రాధ. ఆమె బాలుని గ్రహించి పెంచెను. ఆ వీరుడు బలశాలి యగు బాలుడే సూతునింట కర్ణుడను పేర విఖ్యాతి గాంచెను.

కొన్నాళ్లకు కుంతీ స్వయంవరము జరిగెను. అందామె పాండురాజును వరించెను. మద్రరాజసుతయగు మాద్రియు నతనికి రెండవ భార్యయయ్యెను. ఒకనాడు పాండురా జు వేటకేగి మృగరూపమున క్రీడించుచున్న మునిని మృగమను భ్రాంతిచే బాణము ఏసి చంపెను. ఆ ముని కోపించి స్త్రీ సంగమము సల్పునపుడు నీవు నిట్లే మరణింతు వని పాండురాజును శపించెను. పాండురాజటుల శపింపబడి శోకమునగుందుచు రాజ్యము వీడి వనవాసము చేయుచుండేను. కుంతీ మాద్రులు తమ సతీధర్మము నెఱపుటకు రాజునకు పరిచర్యలు చేయ నతని వెంట వెడలిరి. పాండురాజు పావన గంగా తీరమందలి మున్యాశ్రమములందుండి ధర్మశాస్త్రములు వినుచు కఠిన తప మాచరించెను. అత డొకసారి యచట జరుగుచున్న ధర్మ విషయకచర్చల ప్రసంగమున ముని భాషణము లిట్లు వినెను. అపుత్త్రకులకు స్వర్గలోక గమనమునకు గతులుండవు.కనుక నే విధముననైన పుత్త్రుని బడయవలయును. అంశజుడు పుత్త్రికాపుత్త్రుడు క్షేత్రజుడు గోలకుడు కుండుడు సహోఢుడు కానీనుడు క్రీతుడు వనప్రాప్తుడు అశక్తులవలన డబ్బునకమ్ముడు పోయినవాడు అను వీరెల్లరును తనయులే యగుదురు. వీరిలో వరుసగ నొకనికన్న మరొకడు తక్కువవాడు. ఇది నిజము. అను ముని మాటలు విని పాండురాజు కుంతితో నిట్లనియెను. నీవు వేగమే యొక మహామునిని గలియుటకు తపోవని కరుగుము. ఆ ముని దయ వలన పుత్త్రుని గనుము. నా యాజ్ఞవలన నీకు దోషమంటదు. మునుపు సౌదాసుడను రాజు వసిష్ఠమహర్షి వలన పుత్త్రుని బడసెనని వింటిని.

అంత కుంతి యిట్లనియెను: 'ఓ కామదా! పూర్వము దుర్వాసో మహర్షి నాకు సిద్ధిప్రదమగు నొక మంత్రముపదేశించెను. అది నాయొద్ద గలదు. ఆ మంత్ర ప్రభావమున నేనే
దేవతనాహ్వానింతునో యా దేవత నా సన్నిధికి రాగలడు'' అపుడు కుంతి తన పతి యనుమతి బడసి ధర్మదేవతను స్మరించినది. ఆమె యతని కలయిక వలన యుధిష్ఠిరుని తొలి పుత్త్రుడగు బడసినది. పిదప నామె వాయుదేవుని దయవలన భీముని ఇంద్రుని యనుగ్రహమున కిరీటిని ప్రతియేట నొక్కొక్కని వంతున వరపుత్త్రులుగ బడిసినది. 

అపుడు మాద్రి పాండురాజుతో నిట్లనియెను: 
"ప్రభూ ! నాకును బుత్త్రులను ప్రసాదించుము. నేనేమి చేయుదును ? నా దుఃఖము బాయు నట్లొనరింపుము. పాండురాజా విషయము కుంతితో జెప్పెను. కుంతి దయతో మాద్రికి మంత్రోపదేశము జేసెను. మాద్రికొక్కడే పుత్త్రుడు చాలునని పాండురాచు కట్టడి చేసెను. మాద్రి యశ్వనీదేవతలను మదిలో స్మరించి నకులసహాదేవుల నిర్వురను గనెను. ఈ ప్రకారముగ దేవతలు పాండురాజు క్షేత్రమునందు పంచపాండవులై యుద్భవించిరి. ఓ మునులారా! వారా యడవిలో నొకరి కింకొకరొక యేడు అంతరముగ నుద్భవించిరి.

అంత నొకనాడు పాండురాజు చావుమూడగ కామార్తుడై ఆశ్రమమందు మాద్రిని సమీపించి బలాత్కారముగ నామె చేయి పట్టెను. ఆమె వద్దువద్దనియ యెంతగ మొఱ పెట్టి వారించినను పాండురాజు వినక తన ప్రియను తమిదీర కౌగిలించుకొనెను. వెంటనే యతడు మన్నుగఱచెను. చెట్టు పడినప్పుడు దాని నాశ్రయించియున్న తీవియగూడ పడునట్లు మాద్రి క్రిందబడి వలవల యేడవసాగెను. అపుడు కుంతియు రోదించుచు వచ్చెను. ఆ కోలాహలమును విని మునులును బాలకులును గుమిగూడిరి. అట్లు పాండురాజు దివంగతుడుగాగా మునులును పాండుపుత్త్రులును గలిసి గంగాతీరమున నతనికి దహన సంస్కారము లొనరించిరి. అపుడు మాద్రి తన సుతులను కుంతి కప్పగించినది. పిదప నామె సత్యచింతనతో సతీధర్మము పాటించుచు పాండురాజుతో సహగమించినది. ఆయాచోటుల వసించు మునులు పాండవులచేత దానములు తర్పణములు నాచరింపించిరి. పిదప వారు పాండవులను గొంతిని కరిపురికి గొనిపోయిరి. వారి శుభాగమన మెఱిగి గాంగేయుడు విదురుడు ధృతరాష్ట్రుడు ప్రజానీకము వారి కెదురేగెను. జనమునకు పాండురాజునకు గల శాపము తెలియును. కాన వారు కుంతినీ వరాననా! వీరలెవ్వరి పుత్త్రు'లని యడిగిరి. అపుడు కుంతి దుఃఖాన్వితయై వీరలు కురుకులమున ప్రభవించిన సురకుమారకులు అని నుడివి యామె వారు నమ్ముటకు తిరిగి దేవతలనే యాహ్వానించెను. అంత దేవత లేతెంచి గగనసీమపై వెలుగుమూర్తులై వీరు మా కన్నవారలే' యని వక్కాణించి పలికిరి. దేవవాక్కులకు భీష్ముడు విలువ నిచ్చెను. ఇట్లు భీష్ముడు దేవకుమారకుల గౌరవము నిలువబెట్టెను. అంత నచ్చటివారందఱును బాలకులను కుంతిని వెంట నిడుకొని హస్తినాపురములోని కరిగిరి. భీష్మాదులందరును సంప్రీతి మెఱయ తమ విభవముల కనుగుణముగ వారిని పోషించిరి. ఈ విధముగ కుంతీకుమారులు భీష్ముని చేత పరిరక్షింపబడిరి.

అధ్యాయము 27 శ్రీదేవి దయవలన పాండవాదులు మృతవీరులను గాంచుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 25 Shantanu's marriage with Satyavati - అధ్యాయము 25 శంతనుడు సత్యవతిని వరించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 25

శంతనుడు సత్యవతిని వరించుట

ఋషు లిట్లడిగిరి : సూతమహామునీ! శాపకారణమున వసువు గాంగేయుడుగా నుద్భవించెనంటివి. శ్రీ వ్యాసుని తల్లియు గంధవతియని ప్రసిద్ధయునగు సత్యవతి శంతనుకు భార్య యెట్లయ్యెనో - ధర్మవరిష్ఠుడగు శంతను డా దాశపుత్త్రినెట్లు వరించెనో విపులీకరించి తెలిపి మా సందియము బాపుము.

సూతు డిట్లనియెను : రాజర్షియగు శంతనుడు గాంగేయుడగు తన కుమారునితో నా పరమశివుడు కైలాసమున తన కుమారునితోవలెనే సుఖముండెను. మృగయారతుడై వనముల కేగి మహిషరురు మృగములను జెండాడుచు వినోదించుచుండెను. ఆ రాజొకనాడు ఖడ్గసూకరములపై వాడి బాణములు ఏయుచు కాళిందీ నదీతీరమందలి వనముల కేగెను. అంతలో నతడచట నలౌకికమైన దివ్య పరిమళ మాఘ్రాణించి యా నెత్తావికెరటములు వీచు దిక్కు మొగమై దాని కారణ మారయుచుండెను. ఇది మందార పరిమళముగాని కస్తూరి సౌరభముగాని చంపక మాలతీ కేతక సుమముల నెత్తావిగాని కాదు. ఈ కమ్మతెమ్మెర యచ్చటినుండి వచ్చిననేమి! ఇది నా నాసికను తృప్తిపఱచుచున్నది? అని తలంచుచు ఆ సుగంధమునకు ముగ్ధుడై రాజావన సీమయంతయును కలయ దిరిగెను. అంతలో రాజొక యేకాంత ప్రదేశము మలిన వస్త్రములు ధరించియు మేని సొబగులు సింగారించుకొనిన ఒక రమణీయ కాంతను చూచెను. నల్లని కడకంటి చూపులుకల ఆమెను చూచి ఆ రాజు ఆశ్చర్యపడి ఈ తానాఘ్రాణించిన సుగంధ మామె దేహమునుడి బయలు వెడలినదే యని నిశ్చయించెను. మిగుల సుందరమును ఆద్భుతమును అగు ఆ రూపమును సర్వప్రాణులకు రంజకమగు ఆ సుగంధమును శుభమగు ఆ లేజవ్వనమును చూచి రాజు మిగుల నాశ్చర్యపడి ఇట్లు భావించెను: ఈమె ఎవరై యుండును. ఎక్కడినుండి ఇప్పుడు వచ్చి యుండును? దేవాంగనయో? మానవస్త్రీయో! గంధర్వ కన్యయో! నాగకన్యయో! ఈ గంధవతియగు కామిని ఎవరనునది ఎట్లు గుర్తింపగలను? అని రాజు తన లోలోన తలపోయుచు తానై స్వయముగ నిదమిత్థమని నిర్ణయింప లేకుండెను. ఈమె నాటి గంగయేమో! అనుకొనుచు నతడు కామవశుడై యా నదీతీరమున నున్న యా కాంతచెంత కేగి యామె నిట్లు ప్రశ్నింపసాగెను:

"ఓ ప్రియరూపా! నీవు ఎవ్వరి పుత్త్రివి? ఏల ఈ విజన ప్రదేశమునందు ఒంటిగా నున్నావు? చారునేత్రా! నీవు వివాహితవా? అవివాహితవా? నా మనస్సును రంజింపజేయు సుందరివగు వంపులు తీరిన కనుగొనలు కల నిన్నుచూచి కామవశుడనయితిని. నీవు ఎవరవు? ఏమి చేయుదానవు? అను విషయములను నీవు నాకు వివరముగా తెలుపుము "అని ఆ సుందరితో రాజు పలుకగనే ఆ పద్మాక్షి రాజుతో చిరునగవున నిట్లు పలికెను : 

"ఓ నరాధినాథా! నేను దాశపుత్త్రిని. తండ్రియాజ్ఞలో మెలగు కన్నియనని తెలియుము. ఓ నృపేంద్రా! ధర్మనిమిత్తముగ నేనీ నీటిలో ఈ నావ నడుపుదును. నా తండ్రి యిపుడే యింటికేగెను. అర్థపతీ! నీతో నిది పూర్ణముగా సత్యము పల్కుచున్నాను.

అని కామిని పలుకగనే కామాతురుడగు ఆ శంతను రాజు ఆమెతో నిట్లనెను : కురుప్రవీరుడనగు నన్ను నీ పతిగ జేసికొనుము. నీ యీ జవ్వనము వ్యర్థమయిపోరాదు గదా? నాకు ప్రకృతము మరియొక భార్యలేదు. మృగాక్షీ! నీవు నా ధర్మపత్నివి కమ్ము. నేను నీకు దాసుడనై సర్వదా నీకు వశవర్తినై యుండగలను. ఓ ప్రియా! నీయం దనురక్తుడనగు నన్ను మన్మథుడు సంతాపింపజేయుచున్నాడు. నా భార్య నన్ను వీడిపోయినది. పిమ్మట ఇంతవరకు వేరొకర్తుకను వివాహమాడలేదు. నేనిపుడు విధురుడను. రమ్యములగు సర్వావయవములు గల నిన్ను చూచిన నా మనస్సు వివశమయినది.

దాశకన్యయగు ఆ గంధవతి అతి రమ్యమును అమృతమువలె మాధుర్యము కలదియునగు రాజు పలుకు విని తానును సాత్త్వికభావయుక్తురాలై శంతనునకు ధైర్యము కలిగించుచు ఇట్లు పలికెను: రాజా! నీవు నా విషయమున పలికినదంతయు యథార్థమే యని భావించుచున్నాను. కాని నేను స్వతంత్రురాలను కానని గ్రహించి మీరు శీఘ్రమే మా తండ్రి నన్ను నీకు ఇచ్చునట్లు అడుగగోరెదను. దాశకుమారికనగు నేను స్వేచ్ఛ కలదానగాను. నా తండ్రి యానతి జవదాటను. నా తండ్రి నన్ను నీకు దానము చేసినచో మీరు నన్ను చేపట్టవచ్చును. నేను నీ వశవర్తినగుదును. రాజా! నిన్ను మాత్రమే ఏమి, నవ¸యవనమందున్న నన్నును మన్మథుడట్లే వేధించుచున్నాడు. ఎట్టి స్థితియందును కులాచార పరంపరా వ్యవస్థచే సాగవలసిన నిలుకడలను కాపాడుట న్యాయ్యముగదా!

ఆ వనిత వాక్కులు విని కామాయత్తచిత్తుడగు శంతనుడు దాశరాజు నింటికి ఆ కన్యను తన కిమ్మని కోరుట కేగెను దాశరాజు తన చెంతకువచ్చు భూపతిని చూచి విస్మయమందెను. అతడు రాజునకు నమస్కరించి దోయిలి పట్టి ఇట్లు పలికెను:

దాశరాజిట్లనెను: భూపాలకా! నేను మీ దాసుడను. మీ శుభాగమనమున ధన్యజీవుడనైతిని. ఏ యర్థము గోరి వచ్చితిరో నన్నాజ్ఞాపింపుడు. 

రాజిట్లనియెను: అనఘా! నీ వామోదించి ఇచ్చినచో నీ కూతును నా ధర్మపత్నిగ పరిగ్రహింతును. నా మాట నిజము.' 

దాశరాజిట్లనియె: రాజేంద్రా! నా కన్యారత్నమును మీరు ప్రార్థించుట మంచిదే. ఆమె ఒక యోగ్యుడైన యయ్యచేతిలో పెట్టదగినదే కదా! అపాత్రునకెన్నడు నీయను. రాజా! నాకూతునకు బుట్టుకొడుకే నీ తరువాత నీ గద్దెనెక్కవలయును. కాని నీ యితర కుమారులెక్కరాదు.' 

సూతుడిట్లనియె: దాశరాజు పల్కులువిని రాజు చింతాతురుడయ్యెను. గాంగేయునిదలచి దాశరాజునకు రాజేమియు మారు పలుకక మిన్నకుండెను. అంత రాజు కామార్తుడై తన యింటి కేగెను. చెప్పరాని దిగులుతో నతడు మజ్జనభోజనములు నిద్ర విడనాడెను. అట్లు చింతాతురుడైయున్న తన తండ్రినిగాంచి యతని దరిజేరి గాంగేయుడు అతని అసంతోష కారణ మడిగెను.

నీకెవడైన నలవిగాని వాడున్నచో చెప్పుము. ఆ శత్రువును పట్టితెచ్చి నీ పాదాలమీద పడవైతును. నీ చింతయేమో తెల్పుము. తన తండ్రి దుఃఖమెఱిగి దానిని బాపని కొడుకొక కొడుకేనా? వాడు పుట్టియేమి ఫలము? అట్టివాడు వెనుకటి జన్మల ఋణము దీర్చుకొనుటకు పుట్టిన వాడగును. ఇందు సందేహము లేదు. అలనాడు తన తండ్రి మాట నెరవేర్చుటకే కదా జన మనోనయనాభిరాముడగు శ్రీరాముడు రాజ్యమువదలి జానకీలక్ష్మణులుతోడురాగా వనములకేగి చిత్రకూటగిరులపై వసించెను. ఆనాడు హరిశ్చంద్ర మహారాజు కొడుకు రోహితుడను నతడు తన తండ్రి మాట మేరమీరకయే గదా యొక బాపని కమ్ముడుపోయి యతని యింట దాస్యమునకుండెను. మున్నొకనా డజీగర్తుని కొడుకు శునశ్శేపు డనువాడు తన తండ్రి చేత నమ్మబడి యూప స్తంభమునకు గట్టబడెను. అపు డతనిని విశ్వామిత్రుడు వచ్చి విడిపించెను గదా! మునుపొకనాడు పరశురాముడు తన పితృనానతిచేత తన తల్లి తల ఖండించి పేరు వడసెను. అత డపుడు తన గురు నాజ్ఞ తలదాల్చుటే తన గురు కర్తవ్యముగనెంచి చేయరాని పనియైనను చేసెను గదా! ఈ నా మేను మీది. నేను సమర్థుడనై యున్నాను. మీరు చెప్పినది తు-చ-తప్పక పాటింతును. నేనుండగ శోకింపనేల? ఎంత యసాధ్యకార్యమైనను సాధించి తీరుదును. నీ మదిలోని దిగులేమో తెలుపుము. ఈ క్షణమే విల్లు చేబూని నీ కోర్కి దీర్తును. నీ వాంఛితము నెఱవేఱినచో నా బ్రతుకు చరితార్థమగును. తన తండ్రి కామితము దీర్పజాలియుండియు నే కొడుకు దానిని దీర్పకుండునో వాడు వట్టి పనికిమాలినవాడు. తన తండ్రి చింత బాపి యతని నుద్ధరింపని కొడుకు పుట్టి యేమి ప్రయోజనము?'

సూతు డిట్లనియెను: తన తనయుని సాంత్వవచనము లాలకించి శంతను మహారాజు నెమ్మదిగ మోమున దోచు సిగ్గుచు లోన నడచుకొని యతని కిట్లు పలికెను: 

శంతనుడిట్లనియెను: నీవు మహాశూరుడవు-బలశాలివి-అభిమానివి. రణరంగధీరుడవు. ఇట్టి నీవొక్కడవే నాకు సుతుడవు గదాయని నాలోన తీరని చింత వేధించుచున్నది. కుమారా! నాకు నీవొక్కడవే సంతగుట చేత నొకవేళ నీవు యుద్ధమున మరణించినచో నాకిక ఆశ్రయముండదు. ఇంకేమి చేయగలను? ఇదొక్కటే నాకున్న చింత. నీముందు చెప్పుకొనదగిన చింత నాకు వేరేదియును లేదు. దీనికొఱకే నేనింతగ బాధపడుచున్నాను. తన తండ్రి మాట లాలకించి గాంగేయు డమాత్యవృద్ధులతో నిట్లనియెను: 

గాంగేయు డిట్లనియె: ఏదో సిగ్గువలన భూపతి నాతో సరిగ విడమఱచి పల్కుటలేదు. కనుక మీరతని చిత్తవర్తనమెఱిగి నాకంతయు నున్నదున్నట్లు దెల్పుడు. ఏ కలతయులేక వెంటనే యన్నిపనులు చక్కపెట్టి తండ్రి మదికి శాంతి చేకూర్చగలను. వారా మాటలువిని రాజు చెంతకేగి యతని చింతాకారణము దెలిసికొనిరి. వారా విషయముగూర్చి గాంగేయునకంతయు జెప్పిరి. విశేషజ్ఞుడగు గాంగేయుడు దానిగూర్చి యాలోచించెను. అపుడు వేగిరమే గంగాసుతుడు మంత్రులను వెంటనిడుకొని దాశరాజు నింటికేగి సవినయముగా నెమ్మిగదుర నతని కిట్లనియెను : 

గాంగేయు డిట్లనియెను: పరంతపా! నా తండ్రికి నీ కూతు నిమ్మని నిన్ను ప్రార్థించుచున్నాను. ఆమె నాకు తల్లి యగుగాక! ఆమెకు దాసుడనై యుందును. 

దాశరాజిట్లనియెను: రాజా! నీవే నా కూతును భార్యగ గ్రహింపుము. ఏలయన, నీవుండగ నీమెకు పుట్టినవాడు రాజు గాజాలడు గదా? 

గాంగేయు డిట్లనియెను: ఈ దాశపుత్త్రి నా తల్లి. ఈమెకు గల్గు కుమారుడే యెల్లభంగుల రాజు గాగలడు. నేను రాజ్యము నేలను. ఇందు సుంతయు సందేహము లేదు. 

దాశరాజిట్లనియెః నీ వాక్యము సత్యమని నేనెఱుంగుదును. కాని నీకు గలుగు కుమారుడు బలవంతుడై బలిమితో నిశ్చయముగ రాజ్య మపహరించవచ్చును గదా? 

గాంగేయుడిట్లనియెను: అట్లయిన నేను పెండ్లియే చేసికొనను. నేనిదే భీష్మమగు ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా యీ మాట నిజము అను భీష్మ ప్రతిజ్ఞ విని దాశరాజు శోభనాంగియగు సత్యవతిని శంతనునకు ప్రదానమొనరించెను. అతడు సత్యవతిని విధివిధానమున వివాహము చేసికొనెను. ఈమెకే మున్ను వ్యాసుడు జన్మించెననుట శంతను డెఱుగడు.

అధ్యాయము 26 పాండవుల జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Friday, April 10, 2026

Chapter 24 The Birth Story Of Bheeshma - అధ్యాయము 24 గాంగేయుని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 24

గాంగేయుని జన్మవృత్తాంతము

సూతు డిట్లనియెను : ఆ ప్రకారముగ ప్రతీపరాజు దివికేగిన పిమ్మట సత్యవిక్రముడగు శంతనుడు మృగవ్యాఘ్రముల బరిమార్చుచు మృగయాశీలుడయ్యెను. ఒకనాడారాజడవిలో దిరుగుచు మృగశాబకలోచన - మనోహరాభరణ యగు జవ్వనిని గాంచెను. రాజా రెండవ లక్ష్మియోయన రూప¸యవనముల నలరారు జవరాలిని గాంచి యానాడు తన తండ్రి పేర్కొనిన పడతి యామెయే కాబోలునని తలంచెను. ఆ పద్మాక్షిలోని ముఖకాంతులెంత చూచినను రాజునకు తనివిదీరుటలేదు. రాజు మది యాకామిని యెడదలో జిక్కుకొనెను. అతనిహృది సమ్మదము కలిగించు కామనలతో వ్యాప్తమయ్యెను. ఆ గంగానదియు నానాటి మహాభిషుడీ రాజేయని తెలిసికొని యతని విషయమున ప్రేమానురాగతరంగితయై చిఱునగవుతో రాజు నెదుట నిలిచెను. రాజా యసితాపాంగిని చూచి మిగుల ప్రీతినొందిన చిత్తముతో లాలించి కమ్మని పలుకులతో నామె కిట్లు మధురవాక్యములు పలికెను : 

"నీవు దేవతవో! గంధర్వ యక్షనాగకన్యలలో నెవ్వతెవో! కాక - మానిసివో! నీవెవ్వరవైన నౌదుగాక! నాకు నీపై ననురాగము కల్గినది. నాకు ధర్మపత్నివి గమ్ము."

సూతు డిట్లనియెను : ఈమెయే యానాటి గంగయని రాజెఱుగడుగాని నాటి మహాభిషుడితడేయని గంగకు దెలియును. రాజు మాటలు విని వెనుకటి ప్రేమ సమాయోగము దలంచి చిరునగవుతో గంగాదేవి రాజున కిట్లనెను : 

"నరపతీ! నీవు ప్రతీపుని కుమారుడవని నేనెఱుంగుదును. నీవంటి నరపతిని తన పతిగ నే యందగత్తె గోరుకొనదు? రాజా! నా వాగ్బంధముననే నిన్ను పతిగ నొనర్చుకొనగలను. కాని నిన్ను వరించుటకు నాదొక ప్రతిన గలదు. వినుము. శుభాశుభములలో నేనేది చేసినను నీవు గాదనగూడదు. నాకప్రియముగ బలుకగూడదు. నా యీ ప్రతినను తిరస్కరించిననాడు నేను నిన్ను విడనాడి స్వేచ్ఛగ నెటకే నేగుదును." అని గంగాదేవి వసువుల రాబోవు జన్మలను మహాభిషుని ప్రేమప్రార్థనను తన యెడదలో దలచె. 

రాజామె మాట కామోదము వెలిపుచ్చెను. ఆమెయు రాజునటులే పతిగ భావించెను. ఇట్లు గంగాదేవి మనుష్య యువతి రూపమున ఆ శంతనునకు పత్ని అయ్యెను. ఆ వరవర్ణిని రాజువెంట రాజభవనము కేగెను. ఆ రాజుకూడ ఉద్యానవనములందామెతో కూడి విహరింపసాగెను. ఆ సుందరియు అతని భావమెరిగి అతని నానంద పెట్టుచుండగా ఎన్ని ఏండ్లు గడచినదియు ఎరుగక ఆ రాజేంద్రుడా హరిణాక్షినిగూడి యింద్రాణితోడి యింద్రుని పగిది కాలము గడుపుచుండెను. సర్వగుణసంపన్నయగు నామెతో కామతత్త్వ మెరిగిన ఆ రాజు లక్ష్మిని గూడిన నారాయణుని విధముగ దివ్య మందిరాలలో నానందమందెను.

ఆ విధముగ గొంతకాలము గడచినంతలో రాజువలన ఆ చారులోచనయగు గంగ గర్భము దాల్చి వసువును పుత్త్రునిగ బడసినది. ఆమె యతనిని పుట్టినతోడనే గంగలో పడవేసినది. అట్లే రెండవ కొడుకును జేసినది. అట్లు మూడవ, నాలుగవ, యైదవ, యాఱవ కొడుకులును గంగపాలైరి. తుద కేడవ కొడుకుగూడ మరణించెను. రాజుపుడిటుబోరున పలవరించెను. నేనిపు డేమి చేతును? ఇట నా వంశము స్థిరముగ నుండుటెట్లు? ఈ పాపాత్మురాలు చేజేతుల తన యేడుగురు కొడుకులను నీట గలిపినది. ఒకవేళ నన్నీమె వదలి వెళ్ళిన వెళ్ళుగాక. నాకు ప్రియమైన యీ యెనిమిదవ పుత్త్రునినైన చావునుండి వారించగలను. నేనిప్పుడడ్డుపెట్టనిచో నీమె యెనిమిదవ వానిని గూడ మరల నీటముంచును. నాకిక ముందు సంతు కలుగునో లేదోయను సందేహము గల్గుచున్నది. ఒకవేళ పుట్టినప్పటికి నీ దుష్టురా లతనిగూడ మననిచ్చునోలేదో? ఇట్టి సంశయములో నేనేమి చేయవలయునో నాకే తోచుటలేదు. కనుక వంశరక్షణ దొరకొనుట నా ప్రస్తుత కర్తవ్యవ్య'మని రాజనుకొనునంతలో నెనిమిదవ వసువష్టమ పుత్త్రుడుగ జన్మించెను. తొలుత నెవ్వడు తన భార్య మాట కాదనలేక నందినీ ధేను నపహరించెనో యతడే నే డష్టమపుత్త్రుడుగ నుద్భవించెను. అదిగని రాజు తన భార్య పాదాలు పట్టుకొని యిట్టుల పలవించెను : 

"నేను నీ దాసుడను. ఈ యొక్క కొడుకునైన వదలిపెట్టుము. ఈతని రక్షణ భారము నేను జూచుకొందును. నిన్నిదే ప్రార్థించుచున్నాను. నా కడుపు తఱుగుకొని పోవునట్లు పండ్లవంటి యేడుగురు ముద్దుబిడ్డలను నీ పొట్టను పెట్టుకొంటివి. ఈ యెనిమిదవవాని నొక్కనినైన బ్రతకనిమ్ము. నీ పాదాలు సాక్షిగ వేడుకొనుచున్నాను. నీవేదేని కోరుకొమ్ము. ఎంత దుర్లభమైనదైనను నా వంశ మికనైన నిలువబెట్టుము. అపుత్త్రకులకు స్వర్గగతులు లేవని వేదవిదులు వక్కాణించి పల్కుదురు. కాన నిపు డెనిమిదవ కొడుకును బ్రతుకనిమ్మని వేడుకొనుచున్నాను.

ఇది విన్నప్పటికిని గంగ బాలునిగొనిపోవ నుంకించుచుండెను. రాజపుడు గుండె చెఱువుగాగ పట్టరాని కోపమున నామెకిట్లు పలికెను. "ఓసీ! పాపిష్ఠురాలా! నీకు నరకమన్న జంకులేదు. నీవే పాపాత్ముని కడుపు చెట్టపుట్టితివో గదా! నేనిపుడేమి చేతును? నీవు వంశఘాతుకురాలవు. ఇంక నీవుండిన నుండుము, పోయిన నీ యిచ్చవచ్చు తావునకు పొమ్ము. కాని నా పుత్త్రుడు మాత్రమిక్కడనే యుండగలడు. నీతో నాకికనేమి పని?" అని గుండె ద్రవించునట్లు రాజు పలికెను. 

శిశువును గొంపోవుచు గంగ కోపమున నతకిట్లు పలికెను. పుత్రులన్న నా మనసు గూడ పడిచచ్చునదియే సుమా! నాకును గొంచెము మెత్తని గుండె కలదు. ఈ బాలునిగొని వనములందితనిని బోషింతును. నీ మాట నిలుపుకొనలేదు. నీ చేసిన శపథము భగ్నమైనది. కాన నిన్నిదే వదలి తరలుచున్నదానను. నన్ను గంగానదిగ నెఱుంగుము. దేవకార్యర్థ మరుగుదెంచితిని. 

పూర్వము వసువులు వసిష్ఠ మహామునిచే మనుజయోని బుట్టుడని శపింపబడిరి. వారు నన్నుగాంచి చింతాపరులై నీవు మాకు తల్లివి గమ్మని వేడుకొనిరి. నేను వారికటులే వరమిచ్చితిని. అందుచే నీకిల్లాలనైతిని. నా సంభవము దేవకార్యార్థ సిద్ధికని తెలిసికొనుము. ఆ యేడుగురు వసువులు ముని శాపమున మనకు పుత్త్రులై చనిపోయిరి. శాపవిముక్తి బడసిరి. ఈ బాలుడు మాత్రము కొంతకాలమిచటనే వసింపగలడు. గంగాదత్తుడగు నీ సుతుని గనుము. ఆ వసువు నీ సుతుడుగ జన్మించెనని తెలిసికొనుము. పుత్రోత్సాహ మనుభవింపుము. మహానుభావా! ఇతడు గాంగేయ నామమును విఖ్యాతి గడించ గలడు. మహాబలశాలి కాగలడు. నీవు తొల్లి నన్ను వరించిన చోటి కితనిని గొనిపోవుదును. ఇతడు యువకుడైన పిమ్మట నితనిని నీకప్పగింపగలను. తల్లిలేని బిడ్డ డెప్పుడైన సుఖముగ జీవింపజాలడు గదా!' అని గంగ యిత్తెఱుంగున బలికి యా బాలునిగొని యంతర్థానమందెను. 

శంతనుడు దుఃఖార్తుడై తన భవనమున కేగి వసించుచుండెను.

ఆ రాజు తన భార్యాపుత్రుల వియోగభరమున లోలోన కుములుచు రాజ్యపాలన సాగించుచుండెను. అట్లు కొంతకాలము గడచిన పిమ్మట శంతను రాజొకనాడు వేటకేగి మహిష సూకరములను మృగగణములను నురుమాడుచు గంగాతీరమేగెను. అట గంగ చిన్నచిన్న పాయలుగ పారుచుండెను. అదిగని రాజు విస్మయమందెను. అతడా నదీతీరమందు నారి సారించుచు బాణములు వదలుచున్న యొక సుకుమార కుమారుని గాంచెను. కాంచి రాజబ్బురపడి తన్ను తానే మఱచిపోయెను. ఆ బాలుడు తన-నాటి పుత్త్రుడగునో కాడో యెఱుగలేకుండెను. ఆ బాలుని బాణ ప్రయోగమందలి హస్తలాఘవము సాటిలేని విలువిద్య మానవాతీతశక్తి మదనుని బోలు రూపము ఇన్నియును గన్నారగని రాజు విస్తుపోయెను. రాజతనితో నీవెవరి పుత్త్రుడ'వని యడిగెను. అమ్ములు వదలుచు నాడుకొను బాలుడేమియును పలుకకయే వెంటనే యదృశ్యుడయ్యెను. ఆ బాలుని వాలకము చూచి యతడచ్ఛముగ నా పుత్త్రునివలెనే యున్నాడు. ఇపుడేమి సేతును? ఎటకేగుదును! అని చింతాతురుడయ్యెను?

అంత శంతనుడు గంగను స్తుతించి ప్రసన్నురాలిని జేసికొనెను. ఆ చారు స్వరూపిణి తొంటిరూపమున నతినికి దర్శన మొసంగెను. తన యంగకాంతు లెసగంగ వెలుంగుచున్న గంగను గని రాజామె కిట్లు పలికెను: 

'ఓ గంగా! ఈతడెవడు? నా బాలుడెక్కడ? నా బాలుని నాకు వేగమే చూపింపుము. 

గంగ యిట్లనియెను: 'ఓ రాజేంద్రా! ఇదిగో! ఇటడష్టమ వసువగు నీ పుత్త్రుడు. ఇత డింతకాలము నాచేత పోషింపబడెను. ఇపు డితనిని నీ చేతిలో పెట్టుచున్నాను. ఇతడే గాంగేయుడు, మహా తపస్వి. ఇతడే నీ కులమునకు వన్నెలు దెచ్చువాడగును. ఇతడెల్ల వేదములను ధనుర్వేదమును చక్కగ చదివెను. ఇతడింత కాలము వసిష్ఠునాశ్రమమున సకల విద్యాబుద్ధులు నేర్చెను. సర్వార్థములందు కుశలుడు. శుచి యయ్యెను. పరశురాము డెఱింగిన విద్యలెల్ల నితడెఱింగెను. ఇంక నీవితనిని గ్రహించి సుఖముగ నేగుము.' అని పలికి రాజునకు పుత్త్రు నొసంగి యంతర్హితయైనది. 

ఆ శంతనుడును ప్రమోదభరితుడై సుఖముగ నుండెను. ఆ శంతనుడు తన కొడుకు నాలింగనము చేసికొని శిరంబు మూచూచి యరదంబుపై నిడికొని తన పురమునకు బయలు దేరెను.

రాజు కరిపురికరిగి ఘనముగ పుత్రోత్సవ మొనరించెను. దైవజ్ఞులను రావించి శుభముహూర్తమడిగి రాజు ప్రకృతి జనుల నెల్లర బిలిపించి గాంగేయుని యువరాజు జేసెను. సకల సద్గుణోపేతుడగు పుత్త్రుని యువరాజు జేసి రాజు నిశ్చింతముగ నుండెను. గంగను గూడ మఱచిపోయెను. 

సూతుడిట్లనియెను : ఈ ప్రకారముగ వసువుల శాపకారణముగ గంగా సంభవము గాంగేయుని జన్మవృత్తాంతము పావన గంగావరతణము వసువుల సంభవము జరిగినవి. అన్నియును మీకు విశదపరచితిని. ఈ పుణ్యకథలు వినిన పుణ్యాత్ముడు నిస్సంశయముగ కలుషజాలము నుండి విముక్తి గాంచును. ఇంతవరకు మీకు వినిపించిన దానిని నేను మున్ను వ్యాసుని వలన వింటిని. ఇది బ్రహ్మ సమ్మితమగు శ్రీదేవీ పురాణమందలిది. ఆ పరమ పవిత్ర దేవీభాగవతము మహిమోజ్జ్వలములైన నానాఖ్యానక కథలతో పుణ్యమై పంచలక్షణ లక్షితమై వ్యాసుని ముఖకమలము నుండి వెడలి సుగుణామృత రసభరితమై యలరారుచున్నది. ఈ పుణ్యతహాసము పరమశ్రద్ధతో వినువారి దురితములు దూరమొనర్చును. కళ్యాణ సుఖము లొడగూర్చును అని యీ దేవీపురాణము లోకములందు ప్రఖ్యాతి జెందినది.

అధ్యాయము 25 శంతనుడు సత్యవతిని వరించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 23 The story of Ganga and Shantanu - అధ్యాయము 23 గంగాశంతను వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 23

గంగాశంతను వృత్తాంతం

ఋషులిట్లనిరి : సూతమునీశా! సత్యవతి యొక్కయు మహాతేజశ్శాలియగు వ్యాసుని యొక్కయు జన్మములను గూర్చి చక్కగ వక్కాణించితివి. కాని మీరెంత చెప్పినను మా చిత్తములనుండి యొక సందియమెంతకును తొలగుటలేదు. వ్యాసుని తల్లి సత్యవతియని నుడివితివి. ఆమె మరల ధర్మవిదుడగు శంతను మహారాజు నెట్లు బొందినది? ఆ శంతను మహారాజు పురువంశ నరపతి; ధర్మిష్ఠుడు; అట్టివాడే మంచి కులము వృత్తిలేని యొక బోయవాని కూతురు నెట్లు వరించెను? ఆ శంతనుని మొదటి భార్య యెవరు? మేధావి యగు భీష్ముడు వసువంశమున నెట్లు జన్మించెను? మాకివన్నియును స్పష్టముగ నిపుడు తెలుపుము. భీష్ముడు సత్యవతీ సుతుడనియు మహావీరుడనియు చిత్రాంగదుని రాజుగ జేసినవాడనియును మున్ను నీవు దెల్పితివి. చిత్రాంగదుడు మరణింపగ నతని తమ్ముడు సత్యవతీ సుతుడగు విచిత్రవీర్యుడు రాజయ్యెను. కాని ధర్మిష్ఠుడు జ్యేష్ఠుడు బలిష్ఠుడునగు భీష్ముడుండగ విచిత్ర వీర్యుడెట్లు రాజుగ జేయబడెను? సత్యవతి తన సుతులు చనిపోగా బిట్టు పలవరించి తన కోడండ్రను గోళక పుత్త్రులను గనునట్టు లెట్టుల ప్రేరేపించెను? ఆ సత్యవతి భీష్మునకు రాజ్యమేల యొసగలేదు? ఆ మహాధీరుడేల పెండ్లి చేసుకొనలేదు? పెద్దవాడు మహాతేజస్వియగు వ్యాసుడు తన తమ్ముల భార్యలయందు సంతానమెట్లు గనెను? ఆ ధర్మమూర్తి యిట్టి యధర్మమున కెట్లు పూనుకొనెను? మహా పురాణకర్తయు ధర్మాత్ముడు నగు వ్యాసుడు పర భార్యలందు - నందులో తమ్ముల భార్యల నే విధముగ ననుభవించెను? ఆ మహాత్ము డిట్టి నింద్యమగు పనినెట్లు తలపెట్టెను? వేదసమ్మతునకిది శిష్టాచార మగునా? నీవు వ్యాసుని శిష్యుడవు. నీవే మా యీ శంక దీర్పజాలుదువు. మేమీ పుణ్యధర్మక్షేత్రమున సర్వముత్సాహముతో వినగోరుచున్నారము.

సూతుడిట్లనియెను: మును పిక్ష్వాకు వంశమున మహాభిషుడను చక్రవర్తి జన్మించెను. అతడు సత్యవంతుడు ధర్మశీలి. అతడు వేయి యశ్వమేధములు నూఱు వాజపేయములు వెలయంగ నొనరించి యింద్రుని ప్రసన్నునిజేసి స్వర్గసీమ నలంకరించెను. ఒకనా డా మహాభిషుడు బ్రహ్మసభ కేగెను. ఆత్తఱి నచట ప్రజాపతిని సేవించుకొనుటకు దేవతలెల్లరు విచ్చేసిరి. అచ్చటికి గంగాదేవియును బ్రహ్మ కొలువునకు వచ్చినది. అప్పుడొక పెనుగాలివాటున నామెమీది వస్త్రము తటాలున మీదికి లేచినది. దేవతలెల్ల రామె దిక్కు చూడక తలలు వంచుకొనిరి. కాని మహాభిషుడు మాత్ర మామెలోని రాగవిలసనముల నదేపనిగ కన్నెత్తి తేరిపార చూచుచుండెను. గంగయు నతడు తనయం దనురాగవంతుడయ్యెనని కనిపెట్టెను. వారు రాగ మత్తులగుట బ్రహ్మ గ్రహించి రోషావేశమున కోపించి రాజునిట్లు శపించెను: 

"నీవు మనుష్యలోకమున రాజుగ పుట్టుదువు గాక! నీవు మరల నీ పుణ్యబలమున నెల్లవిధముల నాకలోక మేతెంతువు." అని, 'ఈ రాజునం దనురాగవతివగుట వలన నేలపై పుట్టు'మని గంగను కూడ నతడు శపించెను.

అంత వారిరువురు నెడదలు కలగుండు పడగ బ్రహ్మను వీడ్కొని బయలుదేరిరి. అత డీ భువిపైని ధర్మతత్పురులగు రాజులున్నచో టరయుచుండెను. అంతలో నతనికి పురువంశజుండగు ప్రతీపుడు దోచెను. అత డతనికి తనయుడుగా దలచెను. 

అష్ఠవసువులదే సమయమున మక్కువ మీర తమ తమ భార్యలంగూడినవారై వారు వసిష్టాశ్రమమందు తమ భార్యలంజేరి విహార వినోదశ్రీల నోలలాడుచుండిరి. పృథువు మున్నగు వసువులలో నుత్తమ వసువొకడుగలడు. అతని పేరు 'ద్యో'. అతని భార్య నందినీ ధేనువును గాంచి తన పతితో నీ యుత్తమ ధేనువెవ్వరిదని యడిగెను. అతడామెతో నిట్లనియెను. 

"ఓ సుందరీ! వినుము, ఇది వసిష్ఠుని గోరత్నము. దీని పాలు పురుషుడుగాని స్త్రీగాని త్రాగినచో వారు పదివేలేండ్లు తరుగని చెఱగని నిండు జవ్వనమున నురకలు వేతురు." అనునతనితో నామె యిట్లు పలికెను. "ఈ నరలోకమందు నాకొక చెలిమి కత్తియ గలదు. ఆమె ఉశీనర రాజర్షిపుత్రి. మిక్కిలి శోభనగాత్రి. ఆమె కొఱకు పాలుగల్గిన నందిధేనువును దూడను గొనిరమ్ము. ఈ నందిని పవిత్రమైనది. కోర్కెలు దీర్చునది. నా చెలికత్తె యీ గోవుపాలు త్రాగును. ఆమె జరారోగములు లేక చిరము మనగలదు." ఆను నామె మాటలు విని 'ద్యో' పృథువు మున్నగు వసువులను వెంటబెట్టుకొని మునిని గణింపక నందిని నపహరించెను.

అంతలో మహాతాపసుడగు వసిష్ఠ మహాముని సత్వరమే ఫలాదులుగొని నిజాశ్రమ మేతెంచెను. అతనికి తన యాశ్రమమందు సవత్సయగు ధేనువు గనిపించలేదు. ఆ ముని దానికై వనములు గుహలు కలయ వెదకెను. కాని యది యెంతకు గనిపించలేదు. అందులకా ముని యెదలో కోపాగ్ని ప్రజ్వరిల్లెను. ఆ మహాముని ధ్యానయోగమున మునింగి తన గోవును వసువు లపహరించిరని యెఱింగెను. వారు నన్ను సరకు సేయక నా గోవును నాలేనితఱి నపహరించిరి. కాన వసువులందఱు మానవులుగ జన్మింతురుగాక. ఇందు ఏమియు సందియము లేదని వసిష్ఠుడు వసువులను శపించెను. వసిష్ఠ మహామునిచేత శప్తులమైతిమని వసువు లెఱిగి దుఃఖించి ముని సన్నిధి కేగిరి. వారు మునిని సంతసింపజేయుచు నతనికి శరణాగతులైరి. అట్లు మొగాన నెత్తుటిబొట్టులేక దీనాతిదీనముగ తన ముందు పడియున్న వసువులనుగని ముని ఇట్లు పలికెను: 

"మీరు ఒక్కొక్క సంవత్సరము వ్యవధానముతో నొకరి తరువాత నొకరుగ వెంటనే జన్మించి మరణింపగలరు. కాని నా సవత్స ధేనువును దొంగిలించిన వసువు నరలోకమున చాలకాలము వసించును. ఇట్లు వసువులు శపింపబడి వెళ్ళుచుండగ త్రోవలో వారికి నదీమతల్లి గంగాదేవి కనిపించెను. గంగయును శపింపబడి విలపించుచుండెను. వసువులామెకు ప్రణమిల్లి యిట్లనిరి : 

"ఓ దేవీ! మేమమృతాశనులముగదా! మానవగర్భమెందెట్లు జన్మింపనోదుము? నరుల కడుపున పుట్టుటకు మాకు విచారమున నున్నది. కావున నో గంగామాతా! నీవు స్త్రీ రూపము దాల్చి మాకు జన్మములు ప్రసాదించుము. శంతనుడను రాజు గలడు. నీవతనికి భార్యవుగమ్ము. మమ్ము పుట్టినవానిని పుట్టినట్టుల గంగ పొట్టన పెట్టుము. అట్లొనరించిన మాకు శాపముక్తి గల్గును. ఇది నిజము. ఆమె యట్ల యగుతమని మాట యీయగ వారు తమ లోకముల కేగిరి.

గంగయు మాటిమాటికి చింతించుచుడెను. ఆ మహాభిషుడు ప్రతీపునికి కుమారుడుగ జన్మించెను. అతడే శంతనుడనబడిన రాజర్షి - ధర్మాత్ముడు - సత్యసంగరుడు. 

పూర్వము ప్రతీపుడు సూర్యుని వరేణ్యమగు జ్యోతిని గూర్చి స్తోత్రము చేసెను. అప్పుడు గంగాజలమునుండి వరవర్ణిని శుభాననయగు స్త్రీ బయటి కేతెంచినవచ్చి ప్రతీపుని సాలతరువు వంటి కుడితొడపై గూరుచుండెను. 

రాజు నా యనుమతిలేకయే నా కుడితొడమీద గూరుచుంటివేమని తన యంకముపై నున్న యువిదతో ననియెను. ఓ కురుశ్రేష్ఠ! నా హృదయమున నీ పై ననురాగము కలదు. నీవమిత వీర్యుడవు. నీవు నన్ననుభవింపవేడెద. అందులకే నిన్ను జేరితిని. 

అపుడు రాజు రూప¸యవనసంపన్నయగు నా మదవతి కిట్లనియెను: నేను పరస్త్రీలను కన్నెత్తియైనను జూడనివాడను. నీవు నా కుడితొడను సమాశ్రయించి గూరుచుంటిని. అది కొడుకులకు కోడండ్రకు మాత్రమే తగినదని యెఱుంగుము. కావున నో కళ్యాణీ! నాకు పుత్త్రుడు గల్గిన మీదట నా కోడలవుగమ్ము. నీ పుణ్యముననైన నాకు పుత్త్రుడుదయించుననుటలో ననుమానము లేదు అన అటులే కానిమ్మని దివ్యదృష్టిగల యాకామిని యరిగెను. రాజుగూడ యా లలననే తలచుచు తన భవనమున కేగెను.

అంత కొంతకాలమున కారాజునకు పుత్త్రుడుగల్గి యుక్తవయస్కుడయ్యెను. అతడు వేట కడవికేగదలచెను. అపుడు రాజు తన కొమరున కానాటి స్త్రీ వృత్తాంతమంతయు దెలిపెను. అంతయు దెలిపి మరల నిట్లనియెను: 

"ఒకవేళ నా చారుహాసిని వరారోహయగు బాల నిన్ను దరిజేర రావచ్చును. అపుడు నీవు ఆ మనోరమయగు యువతిని భార్యగ స్వీకరింపుము, అంతేకాని యామెను నీవెవ్వతెవని మాత్ర మడుగకుము. ఇది నా యానతి. నీవామెనే ధర్మపత్నిగ జేకొని సుఖము బొందుము" అని తన పుత్త్రున కాదేశించి ప్రతీపుడు ప్రీతిజెందెను. పిమ్మట ప్రతీపుడు తన రాజ్యభారమెల్ల తన సుతునకప్పగించి తాను వనముల కరిగి శ్రీ పరాభట్టారికను నెదలో సమారాధించెను. ఆ రాజు తన తపోబలమున తనువును చాలించి స్వర్గసీమ నలంకరించెను. అతంట మహాతేజస్వియగు శంతనుడు సార్వభౌముడయ్యెను. ఆ శంతను మహారాజు వీడని ధర్మముతో దండనీతితో ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించెను.

అధ్యాయము 24 గాంగేయుని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Avadhuta - Yadusamvadamu - అవధూత - యదుసంవాదము

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -  అవధూత - యదుసంవాదము పద్మనాభుడైన శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద గల కూరిమితో ఇలా చెప్పాడు. ఒకరోజు యదురాజు దగ్గరకు ఎక్...