Friday, April 10, 2026

Chapter 23 The story of Ganga and Shantanu - అధ్యాయము 23 గంగాశంతను వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 23

గంగాశంతను వృత్తాంతం

ఋషులిట్లనిరి : సూతమునీశా! సత్యవతి యొక్కయు మహాతేజశ్శాలియగు వ్యాసుని యొక్కయు జన్మములను గూర్చి చక్కగ వక్కాణించితివి. కాని మీరెంత చెప్పినను మా చిత్తములనుండి యొక సందియమెంతకును తొలగుటలేదు. వ్యాసుని తల్లి సత్యవతియని నుడివితివి. ఆమె మరల ధర్మవిదుడగు శంతను మహారాజు నెట్లు బొందినది? ఆ శంతను మహారాజు పురువంశ నరపతి; ధర్మిష్ఠుడు; అట్టివాడే మంచి కులము వృత్తిలేని యొక బోయవాని కూతురు నెట్లు వరించెను? ఆ శంతనుని మొదటి భార్య యెవరు? మేధావి యగు భీష్ముడు వసువంశమున నెట్లు జన్మించెను? మాకివన్నియును స్పష్టముగ నిపుడు తెలుపుము. భీష్ముడు సత్యవతీ సుతుడనియు మహావీరుడనియు చిత్రాంగదుని రాజుగ జేసినవాడనియును మున్ను నీవు దెల్పితివి. చిత్రాంగదుడు మరణింపగ నతని తమ్ముడు సత్యవతీ సుతుడగు విచిత్రవీర్యుడు రాజయ్యెను. కాని ధర్మిష్ఠుడు జ్యేష్ఠుడు బలిష్ఠుడునగు భీష్ముడుండగ విచిత్ర వీర్యుడెట్లు రాజుగ జేయబడెను? సత్యవతి తన సుతులు చనిపోగా బిట్టు పలవరించి తన కోడండ్రను గోళక పుత్త్రులను గనునట్టు లెట్టుల ప్రేరేపించెను? ఆ సత్యవతి భీష్మునకు రాజ్యమేల యొసగలేదు? ఆ మహాధీరుడేల పెండ్లి చేసుకొనలేదు? పెద్దవాడు మహాతేజస్వియగు వ్యాసుడు తన తమ్ముల భార్యలయందు సంతానమెట్లు గనెను? ఆ ధర్మమూర్తి యిట్టి యధర్మమున కెట్లు పూనుకొనెను? మహా పురాణకర్తయు ధర్మాత్ముడు నగు వ్యాసుడు పర భార్యలందు - నందులో తమ్ముల భార్యల నే విధముగ ననుభవించెను? ఆ మహాత్ము డిట్టి నింద్యమగు పనినెట్లు తలపెట్టెను? వేదసమ్మతునకిది శిష్టాచార మగునా? నీవు వ్యాసుని శిష్యుడవు. నీవే మా యీ శంక దీర్పజాలుదువు. మేమీ పుణ్యధర్మక్షేత్రమున సర్వముత్సాహముతో వినగోరుచున్నారము.

సూతుడిట్లనియెను: మును పిక్ష్వాకు వంశమున మహాభిషుడను చక్రవర్తి జన్మించెను. అతడు సత్యవంతుడు ధర్మశీలి. అతడు వేయి యశ్వమేధములు నూఱు వాజపేయములు వెలయంగ నొనరించి యింద్రుని ప్రసన్నునిజేసి స్వర్గసీమ నలంకరించెను. ఒకనా డా మహాభిషుడు బ్రహ్మసభ కేగెను. ఆత్తఱి నచట ప్రజాపతిని సేవించుకొనుటకు దేవతలెల్లరు విచ్చేసిరి. అచ్చటికి గంగాదేవియును బ్రహ్మ కొలువునకు వచ్చినది. అప్పుడొక పెనుగాలివాటున నామెమీది వస్త్రము తటాలున మీదికి లేచినది. దేవతలెల్ల రామె దిక్కు చూడక తలలు వంచుకొనిరి. కాని మహాభిషుడు మాత్ర మామెలోని రాగవిలసనముల నదేపనిగ కన్నెత్తి తేరిపార చూచుచుండెను. గంగయు నతడు తనయం దనురాగవంతుడయ్యెనని కనిపెట్టెను. వారు రాగ మత్తులగుట బ్రహ్మ గ్రహించి రోషావేశమున కోపించి రాజునిట్లు శపించెను: 

"నీవు మనుష్యలోకమున రాజుగ పుట్టుదువు గాక! నీవు మరల నీ పుణ్యబలమున నెల్లవిధముల నాకలోక మేతెంతువు." అని, 'ఈ రాజునం దనురాగవతివగుట వలన నేలపై పుట్టు'మని గంగను కూడ నతడు శపించెను.

అంత వారిరువురు నెడదలు కలగుండు పడగ బ్రహ్మను వీడ్కొని బయలుదేరిరి. అత డీ భువిపైని ధర్మతత్పురులగు రాజులున్నచో టరయుచుండెను. అంతలో నతనికి పురువంశజుండగు ప్రతీపుడు దోచెను. అత డతనికి తనయుడుగా దలచెను. 

అష్ఠవసువులదే సమయమున మక్కువ మీర తమ తమ భార్యలంగూడినవారై వారు వసిష్టాశ్రమమందు తమ భార్యలంజేరి విహార వినోదశ్రీల నోలలాడుచుండిరి. పృథువు మున్నగు వసువులలో నుత్తమ వసువొకడుగలడు. అతని పేరు 'ద్యో'. అతని భార్య నందినీ ధేనువును గాంచి తన పతితో నీ యుత్తమ ధేనువెవ్వరిదని యడిగెను. అతడామెతో నిట్లనియెను. 

"ఓ సుందరీ! వినుము, ఇది వసిష్ఠుని గోరత్నము. దీని పాలు పురుషుడుగాని స్త్రీగాని త్రాగినచో వారు పదివేలేండ్లు తరుగని చెఱగని నిండు జవ్వనమున నురకలు వేతురు." అనునతనితో నామె యిట్లు పలికెను. "ఈ నరలోకమందు నాకొక చెలిమి కత్తియ గలదు. ఆమె ఉశీనర రాజర్షిపుత్రి. మిక్కిలి శోభనగాత్రి. ఆమె కొఱకు పాలుగల్గిన నందిధేనువును దూడను గొనిరమ్ము. ఈ నందిని పవిత్రమైనది. కోర్కెలు దీర్చునది. నా చెలికత్తె యీ గోవుపాలు త్రాగును. ఆమె జరారోగములు లేక చిరము మనగలదు." ఆను నామె మాటలు విని 'ద్యో' పృథువు మున్నగు వసువులను వెంటబెట్టుకొని మునిని గణింపక నందిని నపహరించెను.

అంతలో మహాతాపసుడగు వసిష్ఠ మహాముని సత్వరమే ఫలాదులుగొని నిజాశ్రమ మేతెంచెను. అతనికి తన యాశ్రమమందు సవత్సయగు ధేనువు గనిపించలేదు. ఆ ముని దానికై వనములు గుహలు కలయ వెదకెను. కాని యది యెంతకు గనిపించలేదు. అందులకా ముని యెదలో కోపాగ్ని ప్రజ్వరిల్లెను. ఆ మహాముని ధ్యానయోగమున మునింగి తన గోవును వసువు లపహరించిరని యెఱింగెను. వారు నన్ను సరకు సేయక నా గోవును నాలేనితఱి నపహరించిరి. కాన వసువులందఱు మానవులుగ జన్మింతురుగాక. ఇందు ఏమియు సందియము లేదని వసిష్ఠుడు వసువులను శపించెను. వసిష్ఠ మహామునిచేత శప్తులమైతిమని వసువు లెఱిగి దుఃఖించి ముని సన్నిధి కేగిరి. వారు మునిని సంతసింపజేయుచు నతనికి శరణాగతులైరి. అట్లు మొగాన నెత్తుటిబొట్టులేక దీనాతిదీనముగ తన ముందు పడియున్న వసువులనుగని ముని ఇట్లు పలికెను: 

"మీరు ఒక్కొక్క సంవత్సరము వ్యవధానముతో నొకరి తరువాత నొకరుగ వెంటనే జన్మించి మరణింపగలరు. కాని నా సవత్స ధేనువును దొంగిలించిన వసువు నరలోకమున చాలకాలము వసించును. ఇట్లు వసువులు శపింపబడి వెళ్ళుచుండగ త్రోవలో వారికి నదీమతల్లి గంగాదేవి కనిపించెను. గంగయును శపింపబడి విలపించుచుండెను. వసువులామెకు ప్రణమిల్లి యిట్లనిరి : 

"ఓ దేవీ! మేమమృతాశనులముగదా! మానవగర్భమెందెట్లు జన్మింపనోదుము? నరుల కడుపున పుట్టుటకు మాకు విచారమున నున్నది. కావున నో గంగామాతా! నీవు స్త్రీ రూపము దాల్చి మాకు జన్మములు ప్రసాదించుము. శంతనుడను రాజు గలడు. నీవతనికి భార్యవుగమ్ము. మమ్ము పుట్టినవానిని పుట్టినట్టుల గంగ పొట్టన పెట్టుము. అట్లొనరించిన మాకు శాపముక్తి గల్గును. ఇది నిజము. ఆమె యట్ల యగుతమని మాట యీయగ వారు తమ లోకముల కేగిరి.

గంగయు మాటిమాటికి చింతించుచుడెను. ఆ మహాభిషుడు ప్రతీపునికి కుమారుడుగ జన్మించెను. అతడే శంతనుడనబడిన రాజర్షి - ధర్మాత్ముడు - సత్యసంగరుడు. 

పూర్వము ప్రతీపుడు సూర్యుని వరేణ్యమగు జ్యోతిని గూర్చి స్తోత్రము చేసెను. అప్పుడు గంగాజలమునుండి వరవర్ణిని శుభాననయగు స్త్రీ బయటి కేతెంచినవచ్చి ప్రతీపుని సాలతరువు వంటి కుడితొడపై గూరుచుండెను. 

రాజు నా యనుమతిలేకయే నా కుడితొడమీద గూరుచుంటివేమని తన యంకముపై నున్న యువిదతో ననియెను. ఓ కురుశ్రేష్ఠ! నా హృదయమున నీ పై ననురాగము కలదు. నీవమిత వీర్యుడవు. నీవు నన్ననుభవింపవేడెద. అందులకే నిన్ను జేరితిని. 

అపుడు రాజు రూప¸యవనసంపన్నయగు నా మదవతి కిట్లనియెను: నేను పరస్త్రీలను కన్నెత్తియైనను జూడనివాడను. నీవు నా కుడితొడను సమాశ్రయించి గూరుచుంటిని. అది కొడుకులకు కోడండ్రకు మాత్రమే తగినదని యెఱుంగుము. కావున నో కళ్యాణీ! నాకు పుత్త్రుడు గల్గిన మీదట నా కోడలవుగమ్ము. నీ పుణ్యముననైన నాకు పుత్త్రుడుదయించుననుటలో ననుమానము లేదు అన అటులే కానిమ్మని దివ్యదృష్టిగల యాకామిని యరిగెను. రాజుగూడ యా లలననే తలచుచు తన భవనమున కేగెను.

అంత కొంతకాలమున కారాజునకు పుత్త్రుడుగల్గి యుక్తవయస్కుడయ్యెను. అతడు వేట కడవికేగదలచెను. అపుడు రాజు తన కొమరున కానాటి స్త్రీ వృత్తాంతమంతయు దెలిపెను. అంతయు దెలిపి మరల నిట్లనియెను: 

"ఒకవేళ నా చారుహాసిని వరారోహయగు బాల నిన్ను దరిజేర రావచ్చును. అపుడు నీవు ఆ మనోరమయగు యువతిని భార్యగ స్వీకరింపుము, అంతేకాని యామెను నీవెవ్వతెవని మాత్ర మడుగకుము. ఇది నా యానతి. నీవామెనే ధర్మపత్నిగ జేకొని సుఖము బొందుము" అని తన పుత్త్రున కాదేశించి ప్రతీపుడు ప్రీతిజెందెను. పిమ్మట ప్రతీపుడు తన రాజ్యభారమెల్ల తన సుతునకప్పగించి తాను వనముల కరిగి శ్రీ పరాభట్టారికను నెదలో సమారాధించెను. ఆ రాజు తన తపోబలమున తనువును చాలించి స్వర్గసీమ నలంకరించెను. అతంట మహాతేజస్వియగు శంతనుడు సార్వభౌముడయ్యెను. ఆ శంతను మహారాజు వీడని ధర్మముతో దండనీతితో ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించెను.

అధ్యాయము 24 గాంగేయుని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 37 Shiva and Brahma worshipping Sridevi - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట బ్రహ్మ యిట్లనియె: అని యీ ప్రకారముగ దేవదేవుడగు విష్ణువు జ...