Friday, April 10, 2026

Chapter 22 The Birth Story of Sri Vyasa Maharshi - అధ్యాయము 22 శ్రీ వ్యాసమహర్షి జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 22

శ్రీ వ్యాసమహర్షి జన్మవృత్తాంతము

పూర్వ మొకప్పుడు మహాతేజుడగు పరాశర మహాముని సర్వతీర్థ యాత్రలు సంసేవించుచు యమునా తీరమున కేతెంచెను. అచటనొక నిషాదుడు భోజనము చేయుచుండెను. ముని తయనిని గని నన్ను నీ పడవలో నదియావలి గట్టునకు జేర్చుమనెను. నదీతీరమందు భుజించు నిషాదు డా ముని మాటలు విని తన కూతురగు మత్స్యగంధతో ఈ ముని తపోవీర్యుడు కడుంగడు ధర్మశీలి. ఇత డీ నది దాటగోరుచున్నాడు. వేగమే నీవితనినీ తెప్పపై నెక్కించుకొని యవ్వలి దరికి జేర్చుము అని పలికెను. వాసవి (ఉపరిచర వసు రాజపుత్రి) యగు మత్స్యగంధ తన తండ్రి మాట ననుసరించి ముని ప్రవరుని తన పడవలోని కెక్కించుకొని ముందునకు సాగుచుండెను. దైవయోగమున పరాశరముని ఆ చారులోచనను చూచి కామార్తుడై యామెను చేపట్టదలచి తన దక్షిణ హస్తముతో నా కోమలి కైదమ్మి పట్టుకొనెను. అప్పుడా ముదిత వలపుల నవ్వొలయ సిగ్గుల నిగ్గులు పెదవులపై చిందులాడు ఓ మునిప్రవరా! నన్ను చేపట్టుట నీకు నీ కొలమునకు నీ తపమునకు నీ శాస్త్రమునకు దగునే! నీవు పవిత్ర వశిష్ఠ వంశజుడవే! కులశీల సంపన్నుడవే! ధర్మజ్ఞుడవే! అట్టి నీవే కామావిష్టుడవగుట తగునా? ఈ లోకమందు మనుజ జన్మము కడు దుర్లభము. అందును బ్రాహ్మణుడై పుట్టుట మిక్కిలి దుర్లభమని తలంతును. ఓ బ్రాహ్మణా! కులము శీలము శాస్త్రము బట్టి చూడగ నీవు ఉత్తముడవు; ధర్మవిదుడవు. అట్టి నీవెక్కడ? ఈ చేపల కంపుదానను నేనెక్కడ? నన్ను తొలిసారిగ జూచినంతలోన నీకీయనార్య భావమెట్లు గలిగెను? ఈ నా మేనిలోనే శుభమును చవిచూడదలచి నన్నే మనసార చేపట్టదలచితివి? ఆహా! అంతేకాదు. నీవిపుడు కామాతురుడవై నా సమీపమునకే వచ్చుచున్నావు. నీ స్వధర్మము మఱచినావు. ఈ పవిత్రుడగు బ్రాహ్మణుడేమి! ఈతని యీ మందబుద్ధియేమి! ఈ నీటి నడుమనే ఇతడు నన్ను పట్టుచున్నాడు. కామాతురుడగు ఈతని మనస్సును వారించు వారెవ్వరును నిచట లేరు'' అని పలుకుచు ఆమె, అయ్యా! ఇంకను కొంచె మింద్రియములను కట్టివేయుము. నిన్నాదరికి జేర్చనిమ్ము అని మహా మునితో తీయగ పలికెను.

సూతుడిట్లనియెను: మదికింపైన ఆమె పలుకు లాలకించి మునిపుంగవు డా పట్టిన పట్టు కొంచెము సడలించెను. నది నెట్టులో దాటెను. వెంటనే ముని వరుడు మన్మథ భావనల కోపలేక మత్స్యగంధను మరల తన బాహు మూలములలో జిక్కించుకొనెను. ఆమె వణకుచు ముని కిట్టుల పలికెను. ఓ మునినాథా! నానుండి వెడలు దుర్గంధము నీకు రోత పుట్టించుట లేదా? జంటపడుచుల కూడిక సమమైన వయో రూపవంతులలో సరిగ జరిగిననే సంతృప్తికరముగ నుండును అని యా లేమ పల్కుటయే తడవుగా ముని యనుగ్రహమున నామె యోజనగంధగ ముద్దరాలుగ నందగత్తియగ మారి మరులూరించు ననురాగవతిగ మారెను. ఆమెను వెంటనే కస్తూరి పరిమళాలు విరజిమ్మెడి మేని క్రొత్తదనమున నిగ్గులు దేర్చి ముని తన దక్షిణ హస్తముతో నామె కడిచేయి పట్టుకొనెను. అపుడామె మునికిట్లు పలికెను. ముని వల్లభా! మన ఈ స్థితిని లోకము చూచును. తీరమందున్న నా తండ్రియు గాంచును. పశు ధర్మము దారుణమైనది. నాకది ప్రీతి గొల్పదు. కనుక మసక చీకటి పడుదనుక మదిని కొంచెము చిక్కబట్టుకొనుము. ఈ కలయిక నరులకు రేలగాని పగలు గూడదు గదా? దివా మైథున మతి దోషమని పెద్దలు దలంతురు. దీని వలన లోకము మనలను వ్రేలెత్తి చూపును' అను యుక్తియుక్తములైన యామె హిత వచనము లుదారుడగు మహాముని చెవులార వినెను.

అంత సమర్థుడగు మునీంద్రుడు తన పుణ్య ప్రభావమున వేగిరమే మంచుగల్పించెను. ఆ తటమంతయు పొగ మంచు నిండెను. ఆ మంచుపొగ పెంజీకటులో యన దట్టమయ్యెను. పిమ్మట నామె మృదువుగ నిట్లనియెను: 

"ఓ మునివర్యా! నేను కన్నియను. నీ యిచ్చ మెచ్చునట్లు నన్ననుభవించి నీవు వెళ్ళుదువు. నీవు అమోఘవీర్యవంతుడవు. నేను గర్భవతినైనచో నాకింకేది దిక్కు? నా తండ్రి కేమని చెప్పుకొందును? నా గతి యేమి గావలయును?"

పరాశరుడిట్లనియెను: ఓ కాంతా! నీవు నా మనసులోని కోర్కి తనివార తీర్చినను నీవు కన్నియగనే యుందువు. కనుక నేదేని కోరుకొనుము. వరమిత్తును. 

సత్యవతి యిట్లనియెను: లోకముగాని నా తల్లిదండ్రులుగాని యెఱుగని విధముగ నీ కార్యము చక్కబెట్టుము. కన్నెఱికము చెడకుండునట్లుగ ననుగ్రహించుము. నీవద్భుత వీర్యుడవు. నీవంటి పుత్రుడు నాకు గలుగు నట్లనుగ్రహించుము. నామేనెల్లవేళల సుగంధము విరజిమ్ముచుండవలయును. నేను నిత్య¸యవనమున నుండవలయును. 

పరాశరుడిట్లనియెను: ఓ సుందరీ! నీకు పరమపవిత్రుడు విష్ణ్వంశ సంభూతుడునగు సుపుత్రుడు జన్మించనున్నాడు. అతడు ముజ్జగములందును ప్రసిద్ధిగాంచును. ఏదో తెలియని దైవకారణమున నీయందు నా మనసు సంలగ్నమైనది. ఇంతకు మున్ను నేనెన్నడును మోహమున మునిగి యెఱుగను. అచ్చరల మెఱుగుమెచ్చులు గాంచియును వారిని నే నేనాడు కన్నెత్తియైనను జూడలేదు. ఇపుడు దైవయోగమున నిన్ను గన్నంతనే కామవశుడనైతిని. దీని కేదో తెలియని కారణమున్నదని నమ్ముము. దైవము మాత్రము దాటరానిది. అతి దుర్గంధవతివగు నిన్నుగని నేనేల వలచితి నందువేమో; వినుము. ఈ శుభముహూర్తమందే మహాపురాణకర్తయగు పుత్త్రుడు నీకు జన్మించగలడు, ఆ మహాత్ముడు వేదములు విభజించును. ముల్లోకములందు వన్నె వాసి గాంచును.' 

సూతుడిట్లనియె: ఈ విధముగ తనకు వశమైన యామెను యనుభవించి యమునాజలములందు అతి శీఘ్రముగ విడిచిపోయెను. ఆ సత్యవతి యదే మూర్తమున గర్భవతి యయ్యెను.

యమునా తీరమున రెండవ మన్మథునివలె వెలుగొందుచున్న సద్యోజాతుడగు పుత్రుని గనెను. ఆ పుట్టిన మహా తేజస్వి తన తల్లితో నిట్లు పలికెను. 

"నా మనస్సు తపము చేయుటకే నిశ్చితమై యున్నది. తల్లీ! నీ యిష్టమున్నచోటికి నీ వేగుము. నేను తపమాచరింప నరుగుదును. నావలన నీకేదేని పని యున్నచో నన్ను స్మరించుము. శీఘ్రమేవచ్చి నిన్ను సందర్శింతును. నీవు దిగులు మాని సుఖముండుము." అని వ్యాసుడు తపమున కేగెను. 

ఆమెయు తన తండ్రికడ కరిగెను. ఆమె తన పుత్త్రునొక దీవిపై నుంచినందున నతినికి ద్వైపాయనుడను పేరు వచ్చెను. అతడు విష్ణ్వంశ సంజాతుడగుట వలన పుట్టిననాటినుండి దినదిన ప్రవర్ధమానుడయ్యెను. అతడు ప్రతి తీర్థమందు గ్రుంకుచు తపమొనరించుచుండెను. ఈ విధముగ పరాశరమహర్షి వలన సత్యవతికి ద్వైపాయను డుద్భవిల్లెను. అతడు కలియుగము రాగానే వేద విభజన మొనరించి వేదవ్యాసుడని వాసికెక్కెను. శ్రీ మహాభారతేతిహాసమును పురాణ సంహితలును ప్రవచించెను. అతడా వేద విభాగములను తన ముఖ్యశిష్యులగు సుమంతుడు జైమిని పైలుడు వైశంపాయనుడు అసితుడు దేవలుడు శుకుడు మున్నగువారలచే అధ్యయనము చేయించెను. 

సూతుడిట్లనియెను : ఈ విధముగ మీకన్నియు సకారణముగ దెలిపితిని.
ఇది సత్యవతీ తనయుడగు శ్రీవ్యాసుని జన్మవృత్తాంతము. ఇటులు మహాత్ముల చరిత్రల కారణములు సుగుణములు గ్రహింపదగినవి. దైవకారణము వలన చేప కడుపునుండి సత్యవతి జన్మించినది. తొలుతనే సత్యవతికి పరాశరమునితో సంయోగము సంభవించెను. ఆ పిదపనే యామెను శంతనుడు పరిగ్రహించెను. కనుకనే పరాశరుని మది యామెయందు మొట్టమొదటనే లగ్నమైనది. ఆ ధర్మాత్ముడగు పరాశరు డార్యులకు దగని పని యేల యొనర్చును? కనుక నీయాఖ్యానక మాశ్చర్యకరము సకారణమునైనది. పుణ్యప్రదమైన యీ శుభాఖ్యానకము విన్న మతిమంతుడు పాపరహితుడగును. అతడు దుర్గతి జెందక నిత్యసౌఖ్యములందును.

అధ్యాయము 23 గంగాశంతను వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 37 Shiva and Brahma worshipping Sridevi - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట బ్రహ్మ యిట్లనియె: అని యీ ప్రకారముగ దేవదేవుడగు విష్ణువు జ...