Saturday, April 11, 2026

Chpater 29 Rurumuni's rescue of his beloved - అధ్యాయము 29 రురుముని తన ప్రియురాలిని బ్రతికించుకొనుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 29

రురుముని తన ప్రియురాలిని బ్రతికించుకొనుట

పరీక్షిత్తిట్లనియె : రురుముని కామార్తుడై తన యాశ్రమములో నుండెను. అపుడతని తండ్రి 'రురూ! ఏమో దిగులుతో నుంటివే'మని యడిగెను. రురువు 'అయ్యా! స్థూలకేశు నాశ్రమమందు ప్రమద్వరయను తగిన కన్య గలదు. నాకామెను భార్యగ జేయవలయు' నని తండ్రితో బలికెను. ప్రమతి వెంటనే స్థూలకేశు నాశ్రమముజేరి యామునిని తనవానిగ సుముఖునిగ జేసికొని యతని కన్యను తన కుమారునకు నిమ్మని యడిగెను. ఒక మంచి మూర్తమున నా కన్యను మీ చేతిలో బెట్టుదునని స్థూలకేతుడు ప్రమతికి మాట యిచ్చెను. వనమునందు పెండ్లికై శుభసంభారములు సమకూర్చెను. ఆ తపోవనమున నట్లు వారిరువురును పెండ్లి జరుపుటకు సముద్యుతులైరి. అదే సమయమున ఆ చారులోచనయగు కన్య తన యింటి మొగసాలలో నిదురించుచుండగ నామె కాలి నొకపాము కాటు వేసెను. దాన నా చారులోచన విగతప్రాణయయ్యెను. ప్రమద్వర మరణించుట గాంచగనే యచట పెద్దగ యేడుపు పెడబొబ్బలు సాగినవి. మునులందఱు చుట్టును గుమిగూడి శోకించుచుండిరి. తన కూతునుగాంచి యామె తండ్రి ప్రాణాలు పోయినప్పటికిని మొగాన కాంతిరేఖ సన్నగిల్లక నేలపై పడియున్న యామెపైబడి వలవల యేడువసాగెను. ఆ యేడ్పు విని రురువు నచటి కేగెను.

సజీవవలెనే పడియున్న ఆ కామినియగు ప్రమద్వరను ఏడ్చుచున్న స్థూలకేశుని నచట మూగిన ఇతర ఋషిసత్తములనుగాంచి ఆ తావునుండి రురువు బయటకువచ్చి విరహాకులుడై ఇట్లు బోరున నేడ్చెను : 

'అక్కట ! దైవముచే నీపాము వింతగ పంపబడినదే! ఇది నా సుఖవిఘాతమునకు దుఃఖమునకును హేతువయ్యె గదా! నా ప్రాణవల్లభ మరణించెను. ఇకనేమి చేయుదు? ఎక్కడకని పోదును? ఈ నా ప్రియారాలు లేక జీవింపగోరికలేదు. ఈ వరారోహను నేను కౌగిలించుకొనలేదు. ముద్దు పెట్టుకొననే లేదు. మందభాగ్యుడను నేనామె పాణిని గ్రహించలేదు. ఈమెను గూడి యగ్నిలో లాజహోమము వేల్చనైతిని. ఈ మానవజన్మము వ్యర్థమైనది. ఇత్తరి నా యసువులు పోయిన బాగుగ నుండును. దుఃఖితుడు పాపియగు వాడెంత కోరుకొన్నను వానికి చావురాదు. ఇంక నాకీ నేలపై దివ్యసుఖవాంఛ లెట్లు తీరును? కనుక నేనిపుడు భీకరమై లోతైన మడుగులోపడికాని నిప్పులో దుమికికాని ప్రాణముల త్యజింతును. ఇంత విషము మ్రింగియో మెడ కురిపోసికొనియో చనిపోదును' అని యిట్లు రురువు వాపోవుచునదీతటమున గూర్చుండి తన మదిలో నిట్లాలోచించసాగెను: 

'ఘోరమైన యాత్మవధ చేసికొని చచ్చిన ఫలితమేమి? నా చావునకు నా తల్లిదండ్రులే దుఃఖింతురు. ప్రాణములు వదలిన నన్నుగాంచి దైవము మాత్రము హర్షము వెలిపుచ్చును. నా చావునకు తక్కిన వారందరు సంతసింతురు. నేను చచ్చి మాత్రమా పరలోకమున నా ప్రియకు చేయగల్గిన యుపకారమేమి? ఇట నీమె విరహవేదనమున నే నాత్మ వధము చేసికొన్నచో పరలోకమున నామె నాకు ప్రియురాలగునని నమ్మకమేమి? ఇందువలన నేను చనిపోయిన దోషము గల్గునుగాని చావకున్న నే దోషమును గల్గదు.' అని చక్కగ విచారించి రురువపుడు స్నాన మాచరించి యాచమించి శుచియై దోసిలినిండ నీరు తీసికొన 'నా వలన నేదేని సుకృతముగాని దేవతార్చనగాని జరిగియున్న యెడల - నేను నా గురువులను భక్తితో బూజించితినేని - నేను జపతపోహోమములు జరిపినవాడనేని - వేదములు చక్కగ నధ్యయనము చేసితినేని - గాయత్య్రనుష్ఠానము నన్ను సంస్కరించియుండెనేని - సూర్యుడు నాచేత నారాధింపబడెనేని నా ప్రియురాలిపుడే మరల జీవించుగావుత ! ఒకవేళ నా కాంత బ్రతుకదేని నేనుగూడ నామెతోబాటు ప్రాణములు వదలుదును.'

అని పలికి దేవతల నారాధించి యా జలము నతడు భూమిపై జల్లెను. ఇట్లు రురువు తన భార్యకై మిక్కిలిగ శోకించుచుండ నొక దేవదూత రురువుకడ కరుగుదెంచి యతనితో నిట్లనెను: 

'బ్రాహ్మణా! అతి సాహసము వలదు. చనిపోయిన నీ ప్రియురాలు తిరిగి యెట్లు బ్రతుకగలదు? ఈ ప్రమద్వర గంధర్వాప్సరసల కూతురు. అవివాహితగ మరణించినది. కాన వేరొక సుందరాంగిని కామింపుము. ఈమెకై దుర్బుద్ధివై రోదింతువేల? ఈమెపై నీకింత ప్రీతి యెందులకు? 

రురువిట్లనియె: 'ఓ దేవదూతా! నే నితర స్త్రీని వరింపజాలను. ఈమె బ్రతుకనిచో నే నిప్పుడే యిక్కడనే ప్రాణములు వీడుదును.' రురువు పట్టుదలకు దేవదూత ప్రమోదమందెను. 

ఆ దేవదూత మనోహరమైన సత్యవాక్కులతో నిట్లనెను: బ్రాహ్మణోత్తమా! పూర్వము దేవతలచే విధింపబడిన యొక యుపాయము గలదు. దానిని జెప్పుదును. వినుము: నీ యర్ధాయువునిచ్చి నీ ప్రమద్వరను బ్రతికించుకొనుము. 'నేను నిస్సందేహముగ నా సగమాయువు నా ప్రియురాలి కొఱకిత్తును. నా ప్రియ యీక్షణమే బ్రతికి లేచుగాత' మని రురువనెను. 

అంతలో విశ్వావసువు తన పుత్త్రి మరణవార్తవిని స్వర్గమునుండి దిగి వచ్చెను. అపుడా విశ్వావసువును దేవదూతయు ధర్మదేవతకడకరిగి యిట్లనిరి: 'ధర్మదేవా! ఈ ప్రమద్వర విశ్వావసుని కూతురు. రురుని ప్రియురాలు. పాముకాటుచే మరణించినది. ఈమె కొరకు రురువు చావునకును సిద్ధపడి తన యాయువులోని సగము భాగ మీయదలచెను. కనుక రురుని వ్రతాచరణ ప్రభావమున ప్రమద్వర మరల జీవించుగా వుత్ర!' 

ధర్ముడిట్లనియె: దేవదూతా! ఆ విశ్వావసుని కూతురు బ్రతుకవలయునన్నచో రురువుయొక్క సగమాయువుగొని యామెను బ్రతికించుము. ధర్మదేవుని మాటలువిని దేవదూత ప్రమద్వరను పునర్జీవితురాలనుజేసి సత్వరమే యామెను రురున కప్పగించెను. తరువాత నొక శుభదినమున మంచి ముహూర్తమున రురువు విధానము ననుసరించి యామెను పెండ్లాడెను.

ఆ విధముగ మరణించి యామె మరల జీవించెను. కావున సర్వవిధముల మఱిమంత్రౌషధులచే ప్రాణ రక్షణము తప్పక చేసికొనుటవంటి శాస్త్రసమ్మతమైన యుపాయము చేసికొనదగి యున్నది. అని పరీక్షిత్తు తన మంత్రులను తనకు రక్షకులనుగా నియోగించి ఏడంతస్తుల ఉత్తమమగు మేడను నిర్మింపజేసి తన సచివులతో కూడా నా మేడ వెంటనే ఆరోహించెను. అందు మణిమంత్రధరులగు శూరులను రక్షకులుగ నియమించెను. నీ సేవకుడనగు నా తప్పిదమును మన్నించుమని తన పక్షమున నేగి మరల మరల నతనిని వేడి ప్రసన్నుని జేసికొనుటకై రాజు గౌరముఖుడను మునిని తన్ను శపించిన మునియాశ్రమమునకు పంపెను. సిద్ధమంత్రజ్ఞులగు బ్రాహ్మణుల నాత్మరక్షణ కేర్పాటు చేసికొనెను. సురక్షితమైన ఆ మేడ నెవ్వడు నెక్కకుండునట్లొక మంత్రి కుమారుడచటనుండి మేడ చుట్టును కొన్ని యేనుగులను నిలువబెట్టెను. ఆ మేడలోనికి గాలిగూడ చొచ్చుట కవకాశము లేకుండెను. ఎవరును లోన ప్రవేశించకుండ నివారింపబడుచుండిరి. రాజు లోననుండియే స్నానసంధ్యాదికృత్యములు నిర్వర్తించుచు భక్ష్యభోజ్యాదు లారగించుచు రాచకార్యములు చక్కపెట్టుచుండెను. అట్లు పరీక్షిత్తు మంత్రులతో మంతనములాడుచు దినములు లెక్కపెట్టుకొనుచుండెను. 

అంతలో మంత్రవిదులలో ఉత్తముడగు కశ్యపుడు అను బ్రాహ్మణుడు మహాత్ముడగు రాజునకు శాపము గలుగుటవిని అతనికి చావు తప్పించి డబ్బు గడించుకొనగోరి రాజున్న చోటి కేగుదునని తలంచి శపింపబడిన రాజున్న చోటికి వెళ్ళుటకు తన యింటినుండి బయలుదేరెను. ఆ కశ్యపుడు గొప్ప మంత్రవిదుడు విద్వాంసుడు మునిసత్తముడు ధనార్థి.

అధ్యాయము 30 పరీక్షిత్తు విప్రశాపమున మరణించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 37 Shiva and Brahma worshipping Sridevi - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట బ్రహ్మ యిట్లనియె: అని యీ ప్రకారముగ దేవదేవుడగు విష్ణువు జ...