Saturday, April 11, 2026

Chapter 30 Parikshit dies under the curse of Vipra - అధ్యాయము 30 పరీక్షిత్తు విప్రశాపమున మరణించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 30

పరీక్షిత్తు విప్రశాపమున మరణించుట

సూతుడిట్లనియెను: కశ్యపుడు అట్లు బయలుదేరిననాడే పురుషోత్తముడగు తక్షకుడును పరీక్షిత్తు శపింపబడెనని విని తన యింటినుండి బయలుదేరి వృద్ధబ్రాహ్మణ వేషమున పోవుకు రాజు సన్నిధి కేగుచుండిన ఆ బ్రాహ్మణునితో త్రోవలో తారసిల్లెను. తక్షకుడు ఆ మంత్రవిదుడగు విప్రుని 'నీ వెవ్వడవు? ఇంత వేగిర మెక్కడి కేగుచున్నావు? నీ పని యేమి? నీ తలంపేమి? అని యడుగగా' తక్షకుడు పరీక్షిత్తును గాటువేయునట. నే నారాజును మరల బ్రతికించుట కింత త్వరతగ్ర వెళ్ళుచున్నాను. విప్రా! నా దగ్గఱ విషహరమగు మంత్రమున్నది. ఆయువు బాగుగ నున్నచో నే నతనిని కచ్చితముగ బ్రతికించగలను' అని కశ్యపు డనెను. 'ద్విజవరా! ఆ తక్షకుడను నేనే. నేనే యా రాజును కాటువేయువాడను. నా విషపు కాటును చికిత్సించి బ్రతికించుట నీ తరముగాదు. అని తక్షకుడన 'ఆ శప్తుడైన రాజును నీవు నీ కోఱలతో కాటు వేయుము. నేను నా మంత్రశక్తితో మరల బ్రతికింతును. ఇందే మాత్రము సందేహములేదు.' అని కశ్యపుడు వచించెను. 'అనఘా! నేను కాటు వేసిన రాజును మరల బ్రతికింపగలవేని తొలుత నీ మంత్రశక్తి చూపుము ఏదీ చూతము. ఇదిగో ఇపుడే యీ మఱ్ఱిచెట్టును నా విసపు కోఱలచే గాటువేతును. దీనిని బ్రతికించుము చూతము' తన తక్షకునితో నీవా చెట్టును కాటువేసి మొత్తము బూది చేసినను సరే; నేను మరల దానికి ప్రాణము పోయగలనని కశ్యపుడు పలికెను.

వెంటనే తక్షకు డాచెట్టును తన విషజ్వాలలతో గాల్చి బూదిసేసి 'ఓ విప్రా! దీనిని బ్రతికించి నీ మంత్ర ప్రభావము చూపు' మని కశ్యపునితో నన బూదినంతటిని ప్రోగుచేసి ' ఓ నాగరాజా! విషదరా! నేనిపు డీ మఱ్ఱిచెట్టును నీకండ్లముందే నా మంత్రశక్తితో మరల బ్రతికింతును. చూతువుగాని నా శక్తి' అని మంత్రవిదుడగు కశ్యపుడు తన చేతిలోనికి జలము తీసి కొని మంత్రించి యా మంత్రజలమును భస్మరాశిపై చల్లెను. మంత్ర పూతమగు జలము తగులగనే బూడిద పచ్చనిచెట్టుగ మారెను. ఆ చెట్టు ఎప్పటియట్టులనుండుట గని తక్షకుడు విస్తుపోయెను. అపుడు తక్షకుడు కశ్యపునితో 'నీ వింత శ్రమ యేల జెందుచున్నావు? నీ మానోవాంఛితమేమి? తెలుపుము. దానిని నేను సమకూర్తును.' అనెను.

అనగా కశ్యపుడు 'ఓ పాపఱడా! నేను ధనార్థిని. రాజు శపింపబడెనని విని వచ్చితిని. నా విద్యను ప్రదర్శించి నృపసత్తముని బ్రదికించి ధనము బడయదలచితిని.' 

తక్షకుడు అనెను : ఓ విప్రేంద్రా ! ఆ రాజు నుండి నీవు కోరునంత ధనము నే నేనిత్తును. తీసికొని నీ యింటి కేగుము. దీనివలన మన యిరువుర కోరికలను దీరును. అని తక్షకుడు విప్రునితో పలికెను. పరమార్ఖ విదుడగు కశ్యపు డతని మాటలు విని యిపుడేమి చేతునా యని మాటి మాటికిట్టు లాలోచించెను: 

'నేనొకవేళ లోభమునకు దాసుడనై డబ్బు తిని నా యింటికేగినచో నాకీ లోకమున కీర్తి గలుగదు. అట్లుగాక నా వలన రాజు జీవించెనేని నాకు శాశ్వతకీర్తిచేకూరును. దీనివలన ధనప్రాప్తి - పుణ్యలాభము - రెండును గల్గును. కనుక కీర్తినే సంపాదించుట మంచిది. కీర్తిలేని ధనమేల? అది వ్యర్థము. మునుపు రఘమహారాజు యశోధనమునకై తన దనమంతయు నొక బ్రాహ్మణునకు సమర్పించెను. హరిశ్చంద్ర కర్ణులును చెడని యశము గడించిరి. విషాగ్నిచే కాలిచచ్చు రాజును గని యెట్లూరకుండను? నా మూలమున రాజు జీవించినచో జనులకందఱకును క్షేమము సమకూరును. కానిచో దేశమున నరాజకము ప్రబలి సర్వనాశమగు ననుటలో సందియములేదు. రాజు చనిపోవగ ప్రజానాశము గల్గును. ఆ పాపము నన్ను చుట్టుకొనును. ఈ ధనలోభమున నాకు తీరని యపకీర్తియు గల్గును.' అని తలంచి ధీశాలియు ధర్మాత్ముడనగు ఆ కశ్యపుడు ధ్యానములో మునింగి రాజు మరణించనున్నట్లు గ్రహించెను. తక్షకునివలన ధనముగొని తన యింటి కేగెను.

ఈ విధముగ తక్షకుడు కశ్యపు నతని యింటి మొగము పట్టించి పిదప రాజును చంపుటకై యత డేడవనాటికి హస్తిపురి కేగెను. తక్షకు డాపురముజేరి పరీక్షిత్తు పై మేడపై మణిమంత్రౌషధులచేత రక్షింపబడుచున్నాడని విని యిట్లాలోచించెను: 

"రాజును చంపకున్నచో నాకు విప్రశాపము గలుగునను భయము గలదు. నే నీ మేడలోని కేయోగమున జేర గలను? ఈ రాజు విప్రశాపహతుడు; ముని పీడాకరుడు; పాపి; శఠుడు. నే నితని నెటుల వంచింపగలను? ఈ నాటివఱకీ పాండవుల కులమున నొక ముని మెడలో చచ్చిన పామును వేసిన వాడు పుట్టనేలేదు. ఈ రాజు నింద్యమైన పని చేసెను. ఇతనికి కాలగతి తెలియనదిగాదు. ఐనను నాత్మరక్షకుల నియోగించి చివరి మేడలో దాగుకొనియున్నాడు. ఇతడు మృత్యువునే మోసగింపదలచుచు నిశ్చింతగనున్నాడు. నేనొక విప్రునిచేత ప్రేరింపబడితిని. ఇప్పుడితనిని కాటువేయు నుపాయమేది? పాప మారాజు మందమతితో చావు తప్పనిదని తెలియక కాబోలు తన చుట్టును రక్షకుల నిలుపుకొని మేడపై ప్రమోదించున్నాడు. ఒకవేళ బలీయమైన దైవమువలన చావు నిశ్చితమైనచో కోటి ప్రయత్నములు చేసినను ఫలితము సున్న. చావు తప్పింపరాదు. ఇతడు పాండవుల గొప్ప వంశములో బుట్టియు చావుగతి నెఱిగియు జీవితాశ వదలుటలేదు. పైగ నెంత నిశ్చింతగ నున్నాడు! ఈ మంచితరుణమున రాజు దానధర్మము లాచరించుకొనుట మంచిది. ధర్మమువలన వ్యాధి తొలగును. చిరాయువును గల్గును. కానిచో చావు తప్పదనుకొని స్నానదానాదిక్రియలు జరిపి స్వర్గ మేగుటకు మేను చాలించుట మఱియు మంచిది. ఇట్లు పున్నెము కూడబెట్టుకొననిచో నరకము తప్పదు. ఒక బ్రాహ్మణుని యూరకే పీడించిన పాపము' విప్రుని ఘోరశాపము అను నీ రెంటివలనను నితనికి మృత్యువు సన్నిహితమైనది. ఇప్పుడితని నోదార్చుట కొక్క విప్రుడైన లేడు. విధి విధించిన చావునకు తిరుగులేదు.

తక్షకుడు ఇట్లాలోచించి తన చెంతనున్న నాగులను తాపసమేషములు ధరింపజేసి రాజుకడ కంపెను. పిమ్మట తక్షకుడు తానును రాజుకొఱకు మంచి ఫలామూలాదులు గొనివచ్చెను. తానందలి ఒక పండులో చిన్న పురుగు రూపున దూరి యుండెను. సత్వరమే నాగులెల్లరు తాపసులై ఫలములుగొని వెడలి రాజభవనముజేరి మేడచెంత నిలుచుండ ఆ తాపసులనుగని 'మీ కార్యమే' మని భటులు వారి నడిగిరి. ''మేము రాజదర్శనార్థము తపోవనమునుండి యరుదెంచితిమి. కులదీపకుడు చారుదర్శనుడునగు పరీక్షిత్తు నాథర్వణమంత్రములతో దీవింపవచ్చినవారము. రాజుతో తమ దర్శనమునకు మును లేతెంచిరని తెలుపుడు. రాజు నభిషేకించి పిదప తీయని ఫలములిచ్చి మేమేగుదుము. భరతకులమున ద్వారపాలకులుండుట తాపసులకు రాజధర్మము లభింపకుండుట మేమింతవఱకు కనివిని యెఱుగము. పరీక్షిత్తున్న చోటికేగి యతని నాశీస్సులతో వర్ధిల్లజేసి, యతనినుండి సెలవు గైకొని వెళ్ళుదుము'' అని తాపసులు వచించిరి.

ఆ మాటలు విని వారిని విప్రులుగ నెఱింగి రక్షకులు విప్రులారా! నేడు రాజదర్శనముగాదు. రేపు ఉదయమున నెల్ల తాపసులు రాజభవనముకు రండు. విప్రశాపభయమున రాజు రక్షితుడై యున్నాడు. ఇపుడీ మేడపై కెక్కుట తగదు. మా మాట నిజము. అని రక్షకులు వారికి రాజాదేశమును వినిపించిరి. భటులారా రక్షకులారా! మా ఫలమూలములు నాశీస్సులు స్వీకరింపవలయునని రాజునకు మా మాటగ జెప్పుడని మునులు మరల రక్షకులతో ననగా భటులేగి రాజునకు తాపసుల రాకను వారి మాటలను తెల్పిరి. 'వారి ఫలమూలాదులు తెండు. వారి రాకకు కారణ మడుగుడు. ఆ తాపసులకు నా ప్రణామములని జెప్పుడు. వారిని రేపుదయమున రమ్మనుడు. నేడు నా దర్శనము గాదని చెప్పు'డని రాజ భటుల నాదేశించెను. వెంటనే భటులు వెళ్ళి మునుల ఫలమూలాదులు తీసికొని సాదారముగ కానుకగ వానిని రాజునకు సమర్పించిరి. విప్రవేషధారులగు నాగులు వెళ్ళిన పిదప ఫలములు తీసికొని రాజు తన మంత్రులతో ఓ సుహృత్తులారా! ఈ పండు మీరు భక్షింపుడు. నేనుగూడ విప్రులొసంగిన వాని నుండి యొక ఫల మారగింతును అని తన ప్రియజనులకు పండ్లొసగి తానొక పండు చీల్చి చూచెను.

దానిలో నల్లనికన్నులు తామ్రవర్ణముగల యొక చిన్నపురుగు రాజు కంటబడెను. దానినిగని మంత్రులును విస్మితులైరి. అపుడు వారితో రాజు 'ఇపుడు సూర్యు డస్తమించును. ఇక తక్షక విషమునకు నేను ధయపడనేల? నేనిపు డమోఘ విప్రశాప మంగీకరింతును. ఈ పురుగు నన్ను కరచుగాక!' అని రాజు దానిని తన కంఠమున నిలుపుకొనెను. రవి యస్తమించువేళకు రాజు తన మెడకు తగిలించుకొనిన కీటకము గ్రక్కున భయంకర కాలరూపడగు తక్షకుడుగానయి రాజు మెడచుట్టును చుట్టుకొని కాటువేసెను. మంత్రులెల్లరును విస్మితులై మిక్కిలి దురపిల్లిరి. ఆ ఘోరరూపముగల నాగరాజునుగని యెల్లరును భయపడి పరుగెత్తిరి. రక్షకులు గొల్లున నేడ్చిరి. పెల్లుగ హాహాకారములు మిన్ను ముట్టెను. పరీక్షిత్తా విధముగ పాము పడగచేత జుట్టబడి పౌరుషముసెడి కదలక మాటాడలేక పడిపోయెను. తక్షకుని విషాగ్ని జ్వాలలు చెలరేగినవి. అవి రాజును గాల్చి నిలువున ప్రాణాలు తీసినవి. తక్షకుడట్లు రాజు ప్రాణములు తీసి వినువీధి కెగిరెను. అతడు తన మాటలచే జగములచే కాల్చునేమో యని చూపఱకు తోచెను. రాజు కాలిపడిన చెట్టువలె ప్రాణాలు వదలి నేలగూలెను. జనులందఱు మృతుడయిన రాజునుగాంచి ఎట్టు విలపించిరి.

అధ్యాయము 31 ఆస్తీకమహాముని జనమేజయుని సర్పయాగము మాన్పించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 37 Shiva and Brahma worshipping Sridevi - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట బ్రహ్మ యిట్లనియె: అని యీ ప్రకారముగ దేవదేవుడగు విష్ణువు జ...